-
దూసుకొచ్చిన కారు
● స్కూటర్ను ఢీ, మహిళ మృతి మైసూరు: అదుపుతప్పిన కారు ఒక ప్రాణాల్ని బలిగొంది. స్కూటర్ను కారు ఢీ కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మరణించింది. మైసూరులోని హెబ్బాళు లేఔట్ నివాసి రాధ (34) మృతురాలు. శుక్రవారం ఉదయం భర్తతో కలిసి స్కూటర్లో వెళుతుండగా వేగంగా వచ్చిన కారు డివైడర్ను ఢీ కొట్టి ఆ తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టుకుంటూ వారి స్కూటర్ను గుద్దింది. తరువాత పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన రాధా అక్కడికక్కడే మరణించింది. కారులో నాలుగైదు మంది ఉన్నారు. వారందరికి స్వల్ప గాయాలయ్యాయి. వివి పురం ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు. కారు అతి వేగమే కారణమని, డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు తెలిపారు. -
జూన్ 1 నుంచి కొత్త చట్టాల అమలు
బనశంకరి: ఐపీసీ, సీఆర్పీసీతో పాటే దేశంలోని చట్టాలు మారుతున్నాయి, జూన్ 1 నుంచి అమలయ్యే నూతన చట్టాల అమలుకు నగరంలోని పోలీస్ అధికారులు, సిబ్బంది సమాయత్తం కావాలని నగర పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ తెలిపారు. శుక్రవారం నగరంలో ఆయన పోలీసుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి అమల్లో ఉన్న ఐపీసీ, సీఆర్పీసీ, సాక్ష్య యాక్ట్లకు బదులుగా కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయచట్టం, బారతీయ నాగరిక సురక్షా చట్టం, బారతీయ సాక్ష్య చట్టం రూపొందించింది, జూన్ 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. కొత్త, పాత చట్టాలు, సెక్షన్ల మధ్య తేడాలను తెలుసుకోవాలి. దేశంలో ఒకసారి చట్టం అమల్లోకి వస్తే పాటించడం మన కర్తవ్యం అని కమిషనర్ అన్నారు. నూతన చట్టాలపై అవగాహన రాబోయే కొత్త చట్టాలపై నగరంలో కొందరు పోలీసు అధికారులు, సిబ్బందికి శిక్షణనిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఏసీపీలు తమ కింది సిబ్బందిని దీనిపై జాగృతం చేయాలన్నారు. న్యాయ అధికారులు, స్థానిక లా కాలేజీల సహాయం తీసుకుని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 1 నుంచి ప్రజలు పోలీస్ స్టేషన్లో వారి సమస్యలపై ఫిర్యాదు చేస్తే నూతన చట్టాల ప్రకారం కేసుల్ని నమోదు చేస్తామన్నారు. ఏ చట్టం, సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి అనే సమగ్ర సమాచారాన్ని 1వ తేదీ లోగా పోలీస్ అధికారులు, సిబ్బంది తెలుసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పని చేయాలని తెలిపారు. పోలీసులు అవగాహన పెంచుకోవాలి నగర పోలీస్ కమిషనర్ ఆదేశం -
హృద్యమైన వర్ణకేళి
● అలరిస్తున్న పెయింటింగ్స్ షో బనశంకరి: నగరంలో ఉరుకుల పరుగుల జీవనంలో అలసిన మనసులకు హృద్యమైన చిత్రలేఖనాలు మదికి ఉత్సాహాన్నిస్తాయి. సిలికాన్ సిటీలో ఎక్స్పోజిన్ ఆఫ్ కలర్స్ పేరుతో ఏర్పాటుచేసిన చిత్రలేఖనాల ప్రదర్శన కనువిందు చేస్తోంది. శుక్రవారం జయనగర నాలుగో టీ.బ్లాక్లోని బెంగళూరు ఆర్ట్ గ్యాలరీలో వసంత ఆర్ట్స్ చిత్రకారుడు కే.మాల్యాద్రి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటైంది. తెలంగాణ, ముంబై, పాండిచ్చేరి, కర్ణాటకకు చెందిన 20 మంది వర్ధమాన చిత్రకారులు గీసిన నవ్యమైన పెయింటింగ్స్ను ఇక్కడ వీక్షించవచ్చు. ప్రకృతి, దేవతలు, పల్లె జీవితం, ఊహా కల్పనలు ఇతివృత్తంగా చేసుకుని కళాకారులు మనసులోని భావాలకు కుంచె ద్వారా చిత్రాలకు జీవం పోశారు. యాక్రిలిక్, క్యాన్వాస్, జల తైల వర్ణాలతో చిత్రలేఖనాలను రూపొందించారు. ఈ ప్రదర్శన 21వ తేదీ వరకు జరుగుతుందని మాల్యాద్రి తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రదర్శనను తిలకించవచ్చు. ఈ సందర్భంగా పలువురు కళాప్రియులు చిత్రలేఖనాలను వీక్షించారు. చిత్రాలను తిలకిస్తున్న సందర్శకులు, చిత్రకారులు ప్రదర్శన ప్రారంభోత్సవం -
ఓటర్లకు కొరియర్లో కానుకలు
● ఎమ్మెల్సీ అభ్యర్థి బాగోతం దొడ్డబళ్లాపురం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం వెలుగుచూసింది. బెంగళూరు పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి రామోజిగౌడ కొరియర్ ద్వారా కానుకలను పంపిస్తున్న సంగతి దేవనహళ్లిలో వెలుగు చూసింది. దీనిపై సమాచారం అందడంతో ఎన్నికల అధికారులు దేవనహళ్లి పట్టణంలోని కొత్త బస్టాండు వద్ద ఉన్న డీటీడీసీ కొరియర్ గోదాంపై దాడి చేసి ఓటర్ల చిరునామాలతో ఉన్న పార్శిళ్లను సీజ్ చేశారు. వందకు పైగా కొరియర్ బాక్సులను గుర్తించారు. డిన్నర్ సెట్లు, టీపాట్లు, కుక్కర్లు వంటివి ఇందులో ఉన్నాయి. అభ్యర్థి పై పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. -
షేర్లు.. లాభాలు.. మొదటికే మోసాలు
మైసూరు: రాచనగరి మైసూరులో ఆన్లైన్ మోసగాళ్ల ప్రలోభాలకు లొంగి లక్షలాది రూపాయలు మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తాజాగా మూడు వేర్వేరు కేసుల్లో ముగ్గురు రూ. 23 లక్షలను పోగొట్టుకున్నారు. రాజేంద్ర నగర నివాసి ఎస్.విశ్వాస్ను అపరిచిత వాట్సాప్ గ్రూప్లో కొందరు చేర్చారు. షేర్ మార్కెట్ గురించి వివరించి దశలవారీగా రూ. 3.70 లక్షలను వసూలు చేశారు. తరువాత మోసగాళ్ల నుంచి స్పందన లేదు. దీంతో విశ్వాస్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. అలాగే సిద్ధలింగపురకు చెందిన అభిషేక్ కూడా షేర్ మార్కెట్, అధిక లాభాలు అనే మాటలకు ఆశ పడి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పిన ఖాతాకు రూ. 3.32 లక్షలను పంపించాడు. బాధితులు సైబర్ పోలీసు స్టేషన్ను ఆశ్రయించారు. ఫోటోషూట్ కోసం వెతికితే.. సువర్ణ లక్ష్మి అనే మహిళ మొబైల్లో బేబీ ఫోటోషూట్ ప్రకటనను చూసి అక్కడ ఉన్న లింక్ మీద క్లిక్ చేసింది. తరువాత గుర్తు తెలియని వ్యక్తులు తమ వాట్సాప్ గ్రూప్లో ఆమెను చేర్చారు. షేర్ మార్కెట్ గురించి అవగాహన కల్పించారు. వారి మాటలు నమ్మి అధిక లాభాలు వస్తాయనే ఆశతో సువర్ణ లక్ష్మి దశలవారీగా రూ. 16.78 లక్షలను మోసగాళ్లకు బదిలీ చేసిన తరువాత మోసగాళ్లు పత్తా లేరు. మైసూరులో పలువురికి సైబర్ మోసగాళ్ల బురిడీ -
పథకాలపై సీఎం సమీక్ష
శివాజీనగర: కరువుతో ఇబ్బందుల్లో ఉన్న రైతులకు కరువు పరిహార పంపిణీ, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు రసాయనిక ఎరువుల, విత్తనాల కొరత కాకుండా జాగ్రత్తలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమాచారం అందించారు. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సీఎం, నేరుగా అధికారులతో సమావేశాలు జరపడానికి వీలు లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రంలో ముఖ్యమైన అంశాల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజనీశ్ గోయల్తో పాటు వివిధ శాఖల అధికారులు సీఎంకు వివరాలను అందజేశారు. ఈ ఖరీఫ్ సీజిన్లో రైతులకు రసాయనిక ఎరువుల విత్తనాల కొరత లేకుండా చూడాలని సీఎం తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 28కి ఒక ఏడాది పూర్తి చేసుకొంటుంది. ఈ ఏడాదిలో సర్కారు సాధనల గురించి సీఎం సమీక్షించారు. పథకాల అమలు గురించి చర్చించారు. రాష్ట్రంలో 33.50 లక్షల మంది రైతులకు పంట నష్ట పరిహారం అందినట్లు అధికారులు తెలిపారు. తలా రూ.2,400 చొప్పున రూ.476 కోట్లను అందించినట్లు చెప్పారు. -
ముగ్గురు బాలల జలసమాధి
దొడ్డబళ్లాపురం: ఈత సరదా ముగ్గురు బాలల ప్రాణం తీసిన సంఘటన రామనగర తాలూకా అచ్చలు గ్రామంలో చోటుచేసుకుంది. రామనగర సుల్తాన్ నగరకు చెందిన షాబాజ్ (14), సుల్తాన్ (13), రిహాన్ ఖాన్ (16) మృతులు. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ ముగించుకుని ముగ్గురు దగ్గరిలోని కొండల్లో నీటి గుంతలో ఈత కొట్టడానికి వెళ్లారు. మధ్యలో పూడికలో చిక్కుకుని నీటమునిగి మరణించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది మడుగులో గాలించి మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. బంధువుల రోదనలతో ఘటనాస్థలి మార్మోగింది. ఏఈ.. నకిలీ పోలీస్ అవతారం యశవంతపుర: పోలీస్ని అంటూ కొందరు మోసగాళ్లు వంచనలకు పాల్పడడం చూశాం. కానీ బెస్కాం అధికారి కూడా బరితెగించాడు. పోలీసునంటూ రైతులు, ఇతరులను మోసం చేసిన ఉదంతం బెంగళూరులో జరిగింది. వివరాలు.. మల్లేశ్వరం బెస్కాం అఫీసులో అసిసెంట్ ఇంజనీర్గా పని చేస్తున్న గంగాధరను పీణ్య పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేశారు. కెఐడిబి నుంచి రైతులకు డబ్బులు ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేశాడు. అలాగే తన కారుకు పోలీస్ జాగృతదళం అని బోర్డు పెట్టుకుని తిరిగేవాడు. హైవేలో ఆ బోర్డు చూపి టోల్ కట్టకుండా వెళ్లిపోయేవాడు. పోలీసు అని ఐడి కార్డును చూపించి పలువురిని బెదిరించాడని బయట పడింది. అతన్ని విచారణ చేపట్టారు. కూతురిపై తండ్రి అకృత్యం యశవంతపుర: కంటిపాపలా కాపాడుకోవాల్సిన కూతురిపై తండ్రి కన్నేశాడు. ఆమైపె అఘాయిత్యానికి పాల్పడిన అమానవీయ ఘటన హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా ఉదేవార గ్రామంలో జరిగింది. కూలీ కార్మికుడు మంజునాథ్ (34)కు 10 ఏళ్ల కూతురు, 12 ఏళ్ల కొడుకు ఉన్నారు. పాప ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదివేది. తండ్రి ఇటీవల బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక తన అన్నకు విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కిరాతకున్ని అరెస్ట్ చేశారు. రాజధానిలో వర్షం బనశంకరి: సిలికాన్ సిటీలో శుక్రవారం పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. వేసవి తాపం నుంచి ఊరట లభించింది. రామకృష్ణ ఆశ్రమం, జేసీ రోడ్డు, నేషనల్ కాలేజీ ప్రాంతంలో భారీ వాన పడింది. లాల్బాగ్ రోడ్డు మధ్యలో నీరు నిలవడంతో వాహనాలకు ఆటంకం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము 5 గంటల నుంచి సాధారణ వర్షం కురిసింది. మూడురోజుల పాటు బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బెంగళూరులో 19వ తేదీ తరువాత మూడురోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చు. వానల కోసం పూజలు మండ్య: రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కానీ కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ వానలు లేవు. తీవ్రమైన ఎండ, కరువు వాతావరణం నెలకొంది. మండ్య జిల్లాలో వర్షాలు లేకపోవడంతో నాగమంగల పట్టణంలో వరుణ దేవుని విగ్రహంతో ఊరేగింపు చేశారు. సకాలంలో వర్షాలు లేక పొలం పనులు నిలిచిపోయాయని, రైతులకు ఉపాధి లేదని ప్రజలు వాపోయారు. తాగునీటికి కూడా ఇబ్బందులు ఏర్పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో గంగా మాత, వరుణ దేవునికి పూజలు చేసి అందరూ సుభిక్షంగా ఉండేలా కరుణించాలని ప్రార్థించారు. ప్రజ్వల్ను రప్పిస్తాం: హోంమంత్రి శివాజీనగర: మహిళలపై లైంగిక దాడులు, నగ్న వీడియోల ఆరోపణ ఎదుర్కొంటున్న హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి జీ.పరమేశ్వర్ చెప్పారు. ఈ కేసుల్లో సిట్ సమర్థంగా పని చేస్తోందన్నారు. ఏప్రిల్ 27న జర్మనీకి వెళ్లిన ప్రజ్వల్ ఇంతవరకూ దేశానికి రాలేదు. రేవణ్ణను తీసుకొచ్చే పనిలో ఉన్నామని హోంమంత్రి చెప్పడం చర్చనీయాంశమైంది. కాగా, మాజీ మంత్రి హెచ్డీ.రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్ను శుక్రవారం నగరంలోని 42వ ఏసీఎంఎం కోర్టు విచారించి 20 తేదీకి వాయిదా వేసింది. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం
● ఐదు సార్లు బీజేపీ విజేత ● ఒక్కసారి కాంగ్రెస్ హస్తగతం రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని జిల్లాల్లో జూన్ 3న జరగబోయే ఈశాన్య పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కళ్యాణ కర్ణాటక పరిధిలో బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలు వస్తాయి. ఈ ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ అమర్నాథ్ పాటిల్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ పాటిల్, స్వతంత్ర అభ్యర్థిగా నారా ప్రతాప్రెడ్డి బరిలో ఉన్నారు. 1988 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో ఐదు సార్లు బీజేపీని విజయం వరించింది. 1988, 1994, 2000, 2006లో బీజేపీ నుంచి ఎంఆర్ తంగా, 2012లో బీజేపీ నుంచి అమర్నాథ్ పాటిల్ గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి అమర్నాథ్ పాటిల్, కాంగ్రెస్ నుంచి చంద్రశేఖర్ పాటిల్ పోటీ పడగా మొదటిసారి కమలం నుంచి విజయాన్ని హస్తగతం చేసుకున్నారు. కొత్త పద్ధతులతో కీటకాల బెడదకు చెక్ రాయచూరు రూరల్: వ్యవసాయంలో కీటకాల నియంత్రణకు నూతన పద్ధతులు పాటించాలని తెలంగాణలోని పాలమూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ శివకుమార్ సింగ్ పిలుపునిచ్చారు. ఆయన రాయచూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన జీవశాస్త్రం, వృక్షశాస్త్రం అంశాలపై మాట్లాడారు. న్యానో సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులతో వ్యవసాయ రంగంలో నూతన వంగడాలకు అవకాశం ఉంటుందన్నారు. పంటలపై విషపూరితమైన రసాయనిక మందుల వినియోగం వల్ల పరిసరాలపై చెడు ప్రభావం కలిగిస్తుందన్నారు. న్యానో సాంకేతిక రంగంలో వచ్చిన అంశాలను వినియోగించుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్, భౌతిక, రసాయనిక, జైవిక, విజ్ఞాన శాస్త్రాల్లో కూడా న్యానో సాంకేతిక రంగంపై ఆధారపడ్డాయన్నారు. కార్యక్రమంలో డీన్ పార్వతి, భాస్కర్, గణేష్ నాయక్, బసవరాజ్, మహేంద్రరెడ్డి, గీత, స్వాతిలున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువు శ్రీనివాసపురం: రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినందునే విద్యార్థులు, మహిళలు ఒకరి తరువాత ఒకరు హత్యకు గురవుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేఎన్ వేణుగోపాల్ ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని తన స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. విద్యార్థిని నేహా హత్య ఘటన మరువక ముందే మరో యువతి అంజలి అంబిగేర దారుణ హత్యకు గురైందన్నారు. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు కరువయ్యాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. అంజలి అంబిగేరను దారుణంగా హత్య చేసిన వ్యక్తిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్యకు కారణాలు తెలుసుకుని మృతురాలి కుటుంబానికి పరిహారం అందించి న్యాయం చేయాలన్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. -
చవగ్గా సిమెంటు, కడ్డీలు పేరుతో మోసం
మైసూరు: తక్కువ ధరకు ఇనుప కడ్డీలు, సిమెంట్ ఇప్పిస్తానని చెప్పి అధ్యాపకునికి రూ. 80 వేలు మోసం చేశాడో వ్యక్తి. మైసూరులోని కర్ణాటక సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సహాయక అధ్యాపకునిగా డాక్టర్ కేసీ నందీశ్ పని చేస్తున్నాడు. చెన్నరాయపట్టణ నివాసి నందా అనే వ్యక్తి ఫోన్ చేసి, తాను ఆర్మీలో పని చేస్తున్నట్లు, నిర్మాణ పని కోసం తీసుకొచ్చిన ఇనుప కడ్డీలు, సిమెంట్ మిగిలిపోయిందని చెప్పాడు. మీకు తక్కువ ధరకు వాటిని ఇస్తానని అన్నాడు. నంద మాటలు నమ్మిన నందీశ్ ఫోన్పే ద్వారా అతనికి రూ. 80 వేలు పంపించాడు. సిమెంట్ బస్తాలు, ఇనుప కడ్డీలు వస్తాయని ఎదురుచూడగా ఏమీ రాలేదు. నందాకి కాల్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. దీంతో బాధితుడు అతని ఇంటికి వెళ్లి విచారించగా గతంలోనూ ఇదేవిధంగా పలువురిని మోసం చేసినట్లు తెలిసింది. జయలక్ష్మిపురం పోలీసు స్టేషన్లో నందీశ్ ఫిర్యాదు చేశాడు.లోకాయుక్త వలలో ఎఫ్డీఏమైసూరు: ఆహారం సరఫరా చేసిన బిల్లు చెల్లించేందుకు రూ. 30 వేలు లంచం తీసుకుంటూ జిల్లాలోని పిరియాపట్టణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఎఫ్డీఏ విజయ్కుమార్ లోకాయుక్తకు దొరికారు. పిరియాపట్టణ తాలూకా రావందూరు గ్రామానికి చెందిన నటేశ్ ఆ శాఖకు ఆహారం సరఫరా చేశారు. ఆ బిల్లులను చెల్లించాలని కోరగా, రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు. దీనితో విసుగు చెందిన నటేశ్.. లోకాయుక్తాకు ఫిర్యాదు చేశాడు. లోకాయుక్తా పోలీసులు కేసు నమోదు చేసుకుని విజయ్ కుమార్ లంచం తీసుకుంటుండగా అరెస్టు చేశారు. కట్టెలతో బాది బాలుని హత్య బనశంకరి: బహిర్భూమికి వెళ్లిన బాలుని దుండగులు కట్టెలతో కొట్టి హత్య చేశారు. ఈ ఘటన సర్జాపుర పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన కూలీ దంపతులు, కొడుకు ప్రాణేశ్ (15)తో కలిసి మూడు నెలల క్రితం ఉపాధి కోసం బెంగళూరు శివార్లలోని ఆనేకల్ తాలూకా నరిగా గ్రామానికి చేరుకున్నారు. 15వ తేదీన బాలుడు బహిర్భూమికి వెళ్లాడు, ఈ సమయంలో ఎవరో దుండగులు కట్టెలతో అతని తల, ఇతర భాగాలపై దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. సాయంత్రం పనుల నుంచి వచ్చిన బాలున్ని వెతుకుతూ వెళ్లిన తల్లిదండ్రులు చిన్నారి మృతదేహాన్ని చూసి విలపించారు. సర్జాపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
హొసపేటె: అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన తాలూకాలోని మండలగిరి గ్రామంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కరువు విలయ తాండవం చేస్తుండగా రైతుల రుణాలపై వడ్డీ రోజురోజుకూ పెరుగుతోంది. మండలగిరి గ్రామానికి చెందిన ప్రవీణ్ రామన్న కురి(24) అనే యువ రైతు అర్థరాత్రి దుర్గమ్మ గుడి సమీపంలోని తన వ్యవసాయ భూమిలోని వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు మంజునాథ్ కురి విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ పనుల నిమిత్తం చేసిన అప్పు విషయమై ఇంట్లో తీవ్ర చర్చ జరిగిందన్నారు. సాయంత్రం కనిపించకుండా పోయిన అన్నయ్య ఈరోజు తెల్లవారు జామున శవమై కనిపించడం తమ దురదృష్టమన్నారు. మృతుడు ప్రవీణ్ కురి ఈనెల 10న వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడని తెలిపారు. ఘటనపై కుకనూరు పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ప్రజల ఆహ్లాదానికి ఎగ్జిబిషన్ ప్రారంభం
బళ్లారిఅర్బన్: వేసవి సెలవుల్లో ప్రజల ఆహ్లాదానికి ఏటా మాదిరిగా ఈసారి కూడా ప్రభుత్వ ఐటీఐ కాలేజీ మైదానంలో రెయిబో ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ను ప్రారంభించినట్లు ఎగ్జిబిషన్ వ్యవస్థాపకుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం ఎగ్జిబిషన్ ఆవరణలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎగ్జిబిషన్లో విశేషంగా పక్షులు, మూగజీవాలు, వన్యప్రాణులు అందరినీ ఆకట్టుకుంటాయన్నారు. వివిధ రాష్ట్రాల గృహోపకరణ వస్తువులు, చేనేత వస్త్రాల స్టాల్స్ను ఏర్పాటు చేశామన్నారు. చిన్నపిల్లల వినోదం కోసం తాజ్మహల్ నమూనా, ప్రత్యేకంగా వాటర్ బోట్, మినీ రైల్, జెయింట్ వీల్ గేమ్స్, ఆట పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వెస్ట్రన్ స్టైల్ అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. రోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు రెండు నెలల పాటు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. ఎగ్జిబిషన్ మేనేజ్మెంట్ చందు, ఆర్.మనోహర్, శ్రీరామచంద్రమూర్తి, జాకీర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పు ఇచ్చి.. తిప్పలు పెడతారు
బనశంకరి: రాష్ట్రంలో ప్రతి గల్లీలో పుట్టుకొచ్చిన మైక్రో ఫైనాన్స్ సంస్థలు మహిళల ఉసురు తీస్తున్నాయి. సులభంగా రుణం ఇచ్చేసి, ఆపై కంతు చెల్లింపు ఆలస్యమైతే వడ్డీ, చక్రవడ్డీ వేసి దోచుకుంటున్నాయి. ఇంటి ముందుకు వచ్చి పరువు తీసే రుణబకాసురుల దౌర్జన్యాలతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆ సంస్థలకు అడ్డుకట్ట వేయాలని అటు ప్రజాసంఘాలు, ఇటు బ్యాంకులు కోరుతున్నాయి. బ్యాంకుల్లో కష్టమని.. రోజువారి చిన్న చిన్న వ్యాపారాలు, పనులు చేసుకునేవారు మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి రూ. 5 వేల నుంచి లక్ష వరకూ రుణాలు చేస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది చిన్నపాటి ఆర్థిక సంస్థలు రుణ వ్యవహారాలను చేస్తున్నాయి. ప్రముఖ బ్యాంకుల్లో మామూలు ప్రజలు రుణాలు తీసుకోవడం అంత సులభం కాదనే భావన ఉంది. అంతేగాక బ్యాంకుల్లో అప్పులకు కావలసిన డాక్యుమెంట్లు ప్రక్రియ కఠినతరం. కానీ మైక్రో ఫైనాన్స్లలో అడిగిన వెంటనే అప్పు అందుతుంది. ఇదే కారణంతో చాలామంది బడుగులు, వ్యాపార మహిళలు మైక్రో ఫైనాన్స్ల వైపు చూస్తుంటారు. వీటిని సకాలంలో తీరిస్తే మంచిదే. ఆలస్యమైతే మాత్రం చిక్కులు తప్పవు. అనేక సందర్బాల్లో ఒక రుణం రుణం తీర్చడానికి మరో అప్పు చేయవలసి వస్తుంది. ఫైనాన్స్ సిబ్బందికి కూడా ప్రతి నెలా ఇంత మందికి అప్పులు ఇవ్వాలి, ఇంత వసూలు చేయాలి అని టార్గెట్లు ఉంటాయి. దాంతో వారు ఉదారంగా అప్పులు ఇస్తారు, వసూలు చేయడానికి ఎంత ఆగడమైనా సాగిస్తారు. అక్కడే సమస్య తలెత్తుతుంది. కట్టకపోతే దౌర్జన్యమే వీటిలో చాలాసంస్థల సిబ్బంది రుణాల వసూళ్ల సమయంలో మానవత్వం మరిచిపోయి దౌర్జన్యాలకు దిగుతుంటారు. గత 3–4 ఏళ్లు నుంచి వాటి ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర బ్యాంకర్ల సమితి, కర్ణాటక మైక్రో ఫైనాన్స్ సంస్థలకు కట్టుదిట్టమైన వసూలు చటం ఉండాలని ప్రతిపాదించింది. కొన్ని సంస్థల ఒత్తిళ్లను తట్టుకోలేక సీ్త్రలు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. రుణ వసూళ్లలో న్యాయం, నైతికత పాటించాలని ఈ సంస్థలకు రిజర్వు బ్యాంకు సైతం సూచించింది. బ్యాంకర్ల సమితి సభ్యులు మాట్లాడుతూ సంస్థల వేధింపుల వల్ల గ్రామాల్లో పరువు పోయిందని అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం స్పందించాలి కరువు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు కలెక్టర్లు మైక్రో ఫైనాన్స్ కంపెనీలతో, ఆర్థిక రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించాలని బ్యాంకర్ల సమితి సూచించింది. రుణాలు వసూలు సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం, వేదింపులు, ఒత్తిడి చేయరాదని సూచించారు. ఏవైనా ఘోరాలు సంభవిస్తే రుణాలు అందించే మైక్రో ఫైనాన్స్ సంస్థలనే నేరుగా బాధ్యులను చేయాలని తెలిపారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు సులభ రుణం, అధిక వడ్డీల వ్యూహం తాళలేక మహిళలు, రైతుల ఆత్మహత్యలు నియంత్రణ చర్యలపై తీవ్ర చర్చ వేధింపుల ఉదంతాలు తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా ఆరళగుప్పకు చెందిన భాగ్యమ్మ మైక్రో ఫైనాన్స్ వేధింపులను తాళలేక రెండువారాల కిందట ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే గ్రామంలో 9 మంది మహిళలు వారి ఒత్తిడి భరించలేక ఊరు వదిలిపెట్టారు. కొరటగెరె తాలూకాలో బోరుబావి కోసం అప్పు తీసుకున్న రైతు బెదిరింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సిబ్బంది వేధింపులతో చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా దేవీరమ్మ (58) ఆరునెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఇంత జరిగినా ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు ఆగవు. మృతుల కుటుంబ సభ్యులైనా రుణం తీర్చాలని ఒత్తిడి చేస్తారు. సులభ రుణం కదా అని తీసుకుంటే వడ్డీల భారం తడిసి మోపెడవుతుంది. ఆకాశాన్నంటే వడ్డీ రేట్ల బాదుడు మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో వాహనాలు, చేతి రుణాలతో కలిపి 10 రకాల రుణ సౌలభ్యం ఉంది చేతిరుణాలుగా తీసుకునే అప్పులపై 9.5 నుంచి 25 శాతం వరకు వడ్డీ వేస్తారు అవసరాన్ని బట్టి రూ.18 వేల నుంచి రూ. లక్ష వరకు రుణసౌలభ్యం ఉంటుంది 36 నెలల వరకు రుణ అవధి ఉంటుంది, వడ్డీ రేటు ఏడాదికి 23 శాతం బైక్, స్కూటర్ కొనడానికి రూ.2 లక్షలు వరకు రుణం. వడ్డీ రేటు 26 శాతం ఉంటుంది. కంతులు, వడ్డీ చెల్లించకుంటే ఇంటికి వచ్చి దుర్భాషలాడడం, జరిమానాలు విధించడం, విలువైన వస్తువులను కుదువ పెట్టుకోవడం వంటివి చేస్తారు. -
వైభవంగా వాసవీ మాత రథోత్సవం
రాయచూరు రూరల్: నగరంలో వాసవీ మాత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గురువారం సాయంత్రం వందలాది మంది భక్తుల సమక్షంలో అమ్మవారికి అభిషేకం చేశారు. సరస్వతి దేవిని ప్రత్యేకంగా అలంకరించారు. నగరేశ్వరాలయంలో వాసవి మాతకు విశేష పూజలు జరిపి అమ్మవారి విగ్రహానికి పుష్ప వృష్టి, ప్రత్యేక అలంకార, పల్లకీ సేవలతో ఊరేగించారు. దేవికి పూలు పండ్లు, ధవస, ధాన్యాలతో తులాభారం నెరవేర్చారు. కార్యక్రమంలో పురుషోత్తం, పలుగుల నాగరాజ్, వీరేష్, వీరణ్ణ శెట్టి, వెంకటేష్, ఇల్లూరు గోపాలయ్య కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. -
సమర్థ నాయకుడినే ఎన్నుకోవాలి
సాక్షి,బళ్లారి: గెలిచిన తర్వాత సమస్యలను గాలికి వదిలే నాయకుడికి ఎట్టి పరిస్థితుల్లోను ఓట్లు వేయకూడదని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ఈశాన్య పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి బరిలో ఉన్న అమర్నాథ్ పాటిల్ తరపున చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కంప్లి నియోజకర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈశాన్య పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలుపొందిన అనంతరం పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడంపై చొరవ తీసుకోవాలన్నారు. మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని, ఓటు ద్వారా పట్టభద్రులు వారికి తగిన బుద్ది చెప్పాలన్నారు. ఇటీవల కర్ణాటకలో ముగిసిన లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోందన్నారు. కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసిందన్నారు. దేశంలో మోదీ పాలనను మళ్లీ జనం కోరుకుంటున్నారన్నారు. విద్యావంతులు కూడా బాగా ఆలోచించి మంచి ఎమ్మెల్సీని ఎన్నుకోవాలన్నారు. నిత్యం అందుబాటులో ఉండే, పిలిస్తే పలికే నేతగా గుర్తింపు పొందిన అమర్నాథ్ పాటిల్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు గుత్తిగనూరు విరుపాక్షిగౌడ, బీజేపీ నాయకులు వీరేష్, కుమారస్వామి, సిద్దప్ప, బ్రహ్మయ్య, మురళీమనోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రౌడీ కార్యకలాపాలను అణచివేయండి
బనశంకరి: బెంగళూరు నగరంలో రౌడీ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని నగర పోలీస్కమిషనర్ బీ.దయానంద్ నగర డీసీపీలకు సూచించారు. శుక్రవారం ఆడుగోడిలోని సీఏఆర్ సౌత్ కవాతు మైదానంలో ఏర్పాటుచేసిన మాసిక కవాతులో పోలీసు బలగాలనుంచి కమిషనర్ బీ.దయానంద్ గౌరవవందనం స్వీకరించి మాట్లాడారు. జాబితాలో ఉన్న చాలామంది రౌడీషీటర్లు ప్రజలు, అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. దీనిపై ప్రతినిత్యం తనకు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. దీన్నిబట్టి మనం రౌడీ కార్యకలాపాలకు అడ్డుకట్టవేయడంలో విఫలంచెందామని అనిపిస్తోందన్నారు. ముఖ్యంగా రియల్ఎస్టేట్ మాఫియాలో రౌడీలు పాల్గొని అమాయకులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇలాంటి రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు సిబ్బంది గస్తీ పెంచాలని చీతా, హొయ్సళ వాహనాలు ట్రాఫిక్ పోలీసులు, నైట్బీట్ సిబ్బంది జాగ్రత్తగా పనిచేయాలని ఆదేశించారు. ప్రజలు పోలీస్స్టేషన్కు వస్తే తక్షణం స్పందించాలన్నారు. ఏసీపీ, డీసీపీ, సీఐలు ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. డీసీపీ, ఏసీపీలు అత్యుత్తమంగా పనిచేయడం వల్లనే లోకసభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. సహకరించిన నోడల్ అధికారులకు అభినందనలు తెలిపారు. -
గాలివానతో విద్యుత్కు అంతరాయం
హొసపేటె: కొట్టూరు పట్టణంలో మళ్లీ వరుణుడు విజృంభించి ఈదురుగాలులు వీయడంతో పాటు వర్షం రావడంతో పబ్లిక్ లైబ్రరీ ఎదురుగా ఉన్న కరెంటు స్తంభం విరిగి పడింది. అదే విధంగా తాగునీటి ప్లాంట్ సమీపంలో పెద్ద వృక్షం నేలకూలింది. ఎలాంటి ప్రమాదం జరుగలేదు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా వర్షం నీరు చేరడంతో వైద్యం కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలులకు కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, తీగలు తెగి నేలకూలడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అయితే ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. గాలి, వానల కారణంగా నేలకొరిగిన చెట్లను తొలగించి రోడ్డులో వాహన రాకపోకలను పునరుద్ధరించారు. నేలకూలిన స్తంభాలను సరిచేసి విద్యుత్ సరఫరా కల్పించాలని నగర ప్రజలు కోరారు. -
బైకిస్టు ప్రాణం తీసిన అడవిపంది
● అటవీశాఖకు వ్యతిరేకంగా ధర్నా మండ్య: అడవి పంది దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన నాగమంగల తాలూకా చిక్కయగటి గ్రామంలో జరిగింది. మండ్య తాలూకాలోని చిందగిరిదొడ్డి గ్రామానికి చెందిన పుట్టస్వామి కుమారుడు శివ (48) శుక్రవారం మండ్య–నాగమంగల మార్గంలో బైక్లో మండ్యకు వెళ్తుండగా హఠాత్తుగా పంది దాడి చేసింది. కింద పడిన శివ ఎడమ తొడ, మర్మాంగంపై గాయపరిచింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నాగమంగల గ్రామీణ పోలీసులు మృతదేహాన్ని మిమ్స్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టమ్ నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఆందోళన మార్చురీ వద్ద మృతుడి కుటుంబ సభ్యులు అటవీ శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న శివ మృతితో కుటుంబం వీధి పాలు అయిందని, మృతుడి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు. శివ కుమారుడు శ్రీనివాస్కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, మృతుడి భార్య అనారోగ్యంతో బాధపడుతుండడంతో పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రవికుమార్ అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అటవీ శాఖ ద్వారా రూ. 15 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
యశవంతపుర: గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి పేలుడు సంభవించి ఇల్లు దగ్ధమైంది. ఈఘటన ఉత్తర కన్నడ జిల్లా కార్వార తాలూకా నందనగద్దాలో జరిగింది. నిలేశ్ తాళేకర్ అనే వ్యక్తి శుక్రవారం ఉదయం తన ఇంటిలో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కావటంతో సిలిండర్ పేలింది. ఇల్లు మొత్తం మంటలు వ్యాపించి దుస్తులు, ఫర్నీచర్, వంట సామగ్రి, వాషింగ్ మిషన్ కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చిమంటలు ఆర్పివేశారు. రూ.8 లక్షల మేర నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: హాస్టల్ గదిలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యసిటీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అరసీకెరె తాలూకా కరడిహళ్లి గ్రామానికి చెందిన హర్షిత(21) హీలలగి వద్ద ఉన్న బీఈసీటీ ప్రైవేటు కాలేజీలో బీఈ చదువుతోంది. కాలేజీ ఆవరణలోనే ఉన్న హాస్టల్లో ఉంటోంది. హాస్టల్ గదిలో ఈమెతో పాటు ఉంటున్న విద్యార్థినులు స్వంత ఊర్లకు వెళ్లారు. ఒంటరిగా ఉన్న ఆమె గురువారం రాత్రి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూర్యసిటీ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. గర్భిణులకు రక్త పరీక్షలుకృష్ణరాజపుర: ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవం సందర్భంగా బెంగళూరు నగర జిల్లా కృష్ణరాజపుర ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం 60 మంది గర్భిణులకు రక్తపరీక్షలు నిర్వహించారు. బెంగళూరు తూర్పు తాలూకా ఆరోగ్య అధికారులు డాక్టర్ కోమల, డాక్టర్ అశోక్రెడ్డి, సీ్త్రరోగ నిపుణులు డాక్టర్ లీలా సంపత్, ఈఎన్టీ నిపుణులు డాక్టర్ సత్యనారాయణ, ఎన్సీడీ విభాగం నిపుణుడు డాక్టర్ సుకేశ్ అధిక రక్తపీడనంపై అవగాహన కల్పించారు. ప్రయాణికురాలి మృతి విజయపుర: కేఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ తాను కూర్చున్న సీటులోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన విజయపురలో జరిగింది. చిక్కబళ్లాపురకు చెందిన సయ్యద్భాను కోలారు నుంచి కేఎస్ ఆర్టీసీ బస్సులో విజయపుర చేరుకుంది. బస్టాండ్ వద్ద ప్రయాణికులు కిందకు దిగుతున్న సమయంలో సయ్యద్భాను కదలిక లేకుండా ఉండాన్ని గమనించారు. డ్రైవర్ వాహనాన్ని అక్కడే నిలిపేశాడు. పట్టణ పోలీసులు చేరుకుని పరిశీలించగా ఆమె మృతి చెందినట్లు తేలింది. మృతురాలి వద్ద లభించిన ఆధారాలతో ఆమెను సయ్యద్భానుగాగుర్తించి బంధువులకు సమాచారం అందించారు. జింక అటవీశాఖకు అప్పగింత చింతామణి: పట్టణ శివార్లలోని కన్నంపల్లి పక్కన ఉన్న కొండ ప్రాంతాల నుంచి శుక్రవారం ఒక జింక పట్టణంలోకి వచ్చింది. డబుల్ రోడ్డులో వెళ్తుండగా కుక్కులు దాడికి యత్నించాయి. ఆ ప్రాంతవాసులు గమనించి కుక్కలను తరిమి జింకను రక్షించారు. అనంతరం అటవీశాఖ అధికారి చందన్కు అప్పగించారు. కుక్కల దాడితో బెదిరిన జింక స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో చికిత్స అనంతరం అడవిలో వదిలేశారు. అడ్డగించి బైక్ దోపిడీ మైసూరు: ౖబెకిస్టును బెదిరించి బైక్ను లాక్కెళ్లిన ఘటన మైసూరు తాలూకా వాజమంగల గ్రామంలో జరిగింది. చిక్కహళ్లి వద్ద ఉన్న జీఎల్ గార్డెన్ లేఔట్లో వాచ్మెన్గా వి.శ్యామసుందర్ గురువారం రాత్రి బైక్లో వెళుతున్నాడు. ఇద్దరు వ్యక్తులు అతనిని అడ్డగించి దాడికి యత్నించారు. వీరి దాడికి భయపడి శ్యామసుందర్ బైక్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. దుండగులు ఆ బైక్ను తీసుకుని పారిపోయారు. వరుణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. వానరాలకు దశదిన కర్మలు మండ్య: చనిపోయిన మూడు వానరాలకు అంత్యక్రియలు చేయడమే కాకుండా 11వ రోజు పుణ్యతిథి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈఘటన పట్టణంలోని హారోహళ్లి గ్రామంలో జరిగింది. సిపాయి కరియప్ప పొలంలో ఈనెల 7న మూడు వానరాలు అకస్మాత్తుగా మరణించాయి. గ్రామస్తులంతా కలసి వానరాలకు అంత్యక్రియలు నిర్వహించారు.11వ రోజు సందర్భంగా శుక్రవారం పువ్వులు, తులసీ హారాలతో వానరాల చిత్రపటానికి అలంకరించి అవి ఇష్టపడే ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. దీపాలు, అగరబత్తీలు వెలింగించి సాంబ్రాణి ధూపాన్ని వేశారు. అనంతరం అన్నదానం చేశారు. -
ఆశ్రయం కోసం వస్తే హత్య చేశారు
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సంపంగి రామనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పాత బిల్డింగ్లో అపరిచిత మృతదేహం లభించిన కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసారు. రంజిత్ ప్రదాన్, రమేశ్ నిందితులు. ఒడిశా నుంచి వలస వచ్చిన వీరు బెంగళూరులో మిషన్ రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న బిల్డింగ్ పనిచేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. మే 9వ తేదీన సత్య అనే అపరిచిత వ్యక్తి అదే బిల్డింగ్లో పడుకోవడానికి రాగా, నిందితులు గొడవపడి గట్టిగా తొయ్యడంతో సత్య వెళ్లి విద్యుత్ వైరుమీద పడి విద్యుత్ షాక్తో మృతిచెందాడు. దీంతో భయపడ్డ ఇద్దరూ మృతదేహాన్ని పక్కనే ఉన్న మరో పాత బిల్డింగ్లో పడేసి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. మృతుడు సత్యపై పోక్సో కేసు ఉంది. కొన్ని రోజుల క్రితమే బెయిలుపై బయటకు వచ్చాడు. వంటనూనె అమ్మేసి లారీ బోల్తా పడిందని వంచన యశవంతపుర: లారీ యజమానిని మోసం చేసిన డ్రైవర్ను బీదర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వంటనూనె లోడ్తో బయల్దేరిన లారీ డ్రైవర్ పరమేశ్వర్ మార్గం మధ్యలో ఆయిల్ను దుకాణాల్లో విక్రయించాడు. అనంతరం యజమానికి ఫోన్ చేశాడు. లారీ బోల్తా పడి ఆయిల్ నేలపాలైందని చెప్పాడు. ఓనర్కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీదర్ జిల్లా మంఠాళ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి విచారణ చేయగా డ్రైవర్ మోసం వెలుగు చూసింది. అనంతరం ఆయిల్ విక్రయించిన దుకాణాలకు వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. సొంతంగా బస్షెల్టర్ నిర్మించుకున్న గ్రామస్తులుబనశంకరి: బస్షెల్టర్ నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. విసిగిపోయిన మహిళలు స్వంతంగా బస్షెల్టర్ నిర్మించుకున్నారు. ఈఘటన ఉత్తరకన్నడ జిల్లా అంకోలా హరవాడ గ్రామంలో జరిగింది.హరవాడక్రాస్లో బస్షెల్టర్ లేకపోవడంతో బస్సు కోసం ఎండలో వేచి ఉండాల్సి వస్తోంది. వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. బస్షెల్టర్ ఏర్పాటు చేయాలని పదేళ్లుగా విన్నవించినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో గ్రామమహిళలందరూ కలిసికట్టుగా ఏర్పడి కొబ్బరిఆకులతో తాత్కాలికంగా బస్షెల్టర్ నిర్మించుకున్నారు. -
సైన్స్కు నిలయం... డాక్టర్ హెచ్ఎన్ విజ్ఞాన కేంద్రం
గౌరిబిదనూరు: తాలూకాలోని కోటాలదిన్నె సమీపంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కర్ణాటక విజ్ఞాన తంత్రజ్ఞాన సోసైటీ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ హెచ్ నరసింహయ్య పేరుతో ఏర్పాటు చేసిన సైన్స్ సెంటర్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. విద్యార్థుల మెదడుకు పదును పెడుతోంది. భౌతికశాస్త్రంపై మక్కువ ఉన్నవారికి ఈ కేంద్రం ఎంతగానే ఉపయోగపడుతోంది. బాహ్యాకాశంలోని వింతలు, నక్షత్రాలు, సూర్య చంద్రుల గతులను తెలుకునేందుకు ఇక్కడ సదుపాయాలుఉన్నాయి. ఇక్కడ ప్లానిటోరియం (నక్షత్ర శాల) సైతం ఉంది. మనం అంతరిక్షంలో పయనించే అనుభూతి కలిగించే ప్రదర్శనలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ సైన్స్ సెంటర్ను అభివృద్ధి పరచాలనేది ప్రభుత్వ ఆశయం. ప్రస్తుతానికి సుమారు 9 ఎకరాల విస్తీర్ణంలో భౌతశాస్రానికి సంబంధించిన విషయాలను తెలిపే నమూనాలు ఉంచారు. నీటి నిర్వహణను తెలిపే పరికరాలను, బ్యాలెన్స్, అయస్కాంత శక్తి, భూభ్రమణం, న్యూటన్ సిద్ధాంతాలను తెలిపే పరికరాలను ఈ సెంటర్లో ఉంచారు. ఇది కేవలం వస్తు ప్రదర్శన కాకుండా విద్యార్థుల అధ్యయనానికి ఉపయోగపడేలా రూపొందిస్తున్నారు. ఇక్కడ ఉద్యానవనం, జంతర్ మంతర్ను తెలిపే గణిత గార్డెన్, శబ్దతరంగాలను తెలిపే సౌండ్ గార్డెన్, గ్రంథాలయం, ఆడిటోరియం, మానవుని పుట్టుక వికాసానికి సంభంధించిన గ్యాలరీలు ఉన్నాయి. వినోద విజ్ఞానికి సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేశారు. పూర్వికుల చరిత్రను తెలిపే శిలాశాసనాలను ఇక్కడ సంరక్షిస్తున్నారు. సామాన్య ప్రజల్లో మూఢనమ్మకాలను పోగొట్టి, శాసీ్త్రయభావాన్ని పెంచి తంత్రజ్ఞానం పట్ల ఆసక్తిని, కుతూహలాన్ని కలిగించడానికి ఈ సైన్స్ పార్క్ ఏర్పాటు చేశారని ఇక్కడి కేర్ టేకర్ ప్రభు తెలిపారు. హెచ్ నరసింహయ్య ఉప ప్రాదేశిక విజ్ఞాన కేంద్రం విద్యార్థులకు చాలా ప్రయోజన కారిగా ఉందని జాతీయ స్థాయిలో పేరు గాంచిన విజ్ఞాని కేపీజే రెడ్డి పేర్కొన్నారు. అప్పటి శాసనసభ్యుడు శివవంకరరెడ్డి, నాగరాజప్ప, వెంకటేశ్ మెదలైనవారి చోరవతో ఈ విజ్ఞాన కేంద్రం ఏర్పడిందన్నారు. ఖగోళ వింతలు విశేషాలు తెలిపే నక్షతశాల శబ్ద తరంగాలను తెలిపే సౌండ్ గార్డెన్ ఆధునిక గ్రంథాలయం పూర్వికుల చరిత్రను తెలిపే శిలాశాసనాలు -
బ్యాంకులు ఆమోదించకపోతే రుణమాఫీ చేయండి ●
● విపక్షనేత ఆర్.అశోక్ శివాజీనగర: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు, చెవులు, హృదయం లేదని విపక్షనేత ఆర్.అశోక్ మండిపడ్డారు. కేంద్రం విడుదల చేసిన కరువు పరిహార మొత్తాన్ని బ్యాంకర్లు రైతు రుణాలకు జమ చేస్తున్నా సీఎం సిద్దరామయ్య పట్టించుకోలేదన్నారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కార్ కర్ణాటక రైతుల కోసం రూ.3,454 కోట్లు కరువు నిధులు విడుదల చేసిందన్నారు. అయితే రాష్ట్ర వాటా మొత్తాన్ని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. పరిహారం సొమ్మును పాత బకాయిలకు బ్యాంకులు జమా చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పింఛన్, నరేగా సొమ్మును కూడా రైతులకు అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య తక్షణమే స్పందించి పరిహారం మొత్తాన్ని రైతు రుణాలకు జమ చేయకుండా చూడాలన్నారు. బ్యాంకులు ఆమోదించకపోతే రైతుల రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. డివైడర్ను ఢీకొన్న బైక్.. యువకుడి మృతి దొడ్డబళ్లాపురం: అతివేగం యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన జ్ఞానభారతి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలూకాకు చెందిన వరుణ్ (25) ఏషియన్ పెయింట్ దుకాణంలో మేనేజర్గా పనిచేస్తూ మూడలపాళ్య కల్యాణనగర్లో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తూ నాగరబావి సమీపంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. జ్ఞానభారతి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారు బోల్తా, డ్రైవర్ మృతి యశవంతపుర: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి నీటి కాలువలో బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ప్రమాదం బీదర్ సమీపంలోని నౌబాదు వద్ద జరిగింది. ప్రమాదంలో వీరేశ్ నాగశెట్టి (25) డ్రైవర్, యజమానిని ఇంటి వద్ద వదిలి కారులో తన ఊరు అయిన నౌబాద్కు వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న కాలువలో బోల్తా పడింది. డ్రైవర్ గాయాలతో అక్కడికక్కడే చనిపోగా కారు పూర్తిగా నుజ్జునుజ్జుయింది. బీదర్ గ్రామాంతర పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఉమాశ్రీకి పీహెచ్డీ
రాయచూరు రూరల్: నగరానికి చెందిన ఉమాశ్రీ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్డీ) పట్టాను అందుకున్నారు. గురువారం విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(వీఎస్కేయూ)లో అసిస్టెంట్ ప్రెఫెసర్ డాక్టర్ సాహెబ్ అలీ నిరగుడి చేతుల మీదుగా అందించారు. ఉమాశ్రీ ఎంచుకున్న మల్టీమీడియా ఇంటరాక్షనల్ ప్యాకేజీ ఆన్ ఇంటలిజెన్స్ ప్రాబ్లం సాల్వింగ్, ఎబిలిటీ అకాడమి పెర్ఫార్మెన్స్ ఇన్ మ్యాథమేటిక్స్ అమాంగ్ సెకండరీ స్కూల్ స్టూడెంట్ అనే అంశంపై ప్రతిపాదించిన వ్యాసానికి ఈ పట్టాను స్వీకరించారు. త్రైత సిద్ధాంత గ్రంథాల పంపిణీ రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో త్రైత సిద్ధాంత శిఖామణి గ్రంథాలు, భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. శుక్రవారం సైదాపూర్, మైలాపూర్, కాళ బెళగుంది, బలిచక్ర, హలగేరలో ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల ఆధ్వర్యంలో రాసిన పుస్తకాలను ఇంటింటికీ అందజేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక భక్తులు వీరేష్, శ్రీదేవి, మనోహర్, భరత్, సురేష్, గణేష్, రామాంజి, రవి, నాగేంద్ర, పురుషోత్తం, వరుణ్, వెంకట రాముడు, సుధాకర్ పాల్గొన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారం ఇవ్వరూ రాయచూరు రూరల్: ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించిన ఉద్యోగి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన సంఘం కార్యదర్శి మహంతేష్ మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో జాగీర్జాడలదిన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు బీఎల్ఓగా విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించినందున ఆయన కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. రాజ కాలువలో పూడికతీతకు శ్రీకారం రాయచూరు రూరల్: రాజ కాలువలో పేరుకున్న పూడికతో వర్షాకాలంలో నగరంలోని 30, 31వ వార్డుల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతాయి. వానలు వచ్చే లోపు ప్రధాన రాజ కాలువలో పూడిపోయిన చెత్తా చెదారాన్ని నగరసభ అధికారులు, సిబ్బంది తొలగించడానికి నడుం బిగించారు. గురువారం నగరసభ కమిషనర్ గురులింగప్ప, జిల్లాధికారి చంద్రశేఖర్ నాయక్ ఆదేశాల మేరకు వర్షపు నీరు సజావుగా వెళ్లడానికి అధికారులు జేసీబీలతో పూడికను తీయడానికి పూనుకున్నారు. సియాతలాబ్, కాలాతలాబ్, మ్యాదరవాడి, మున్నూరు వాడి, నీరుబావికుంట ప్రాంతాల్లో ప్రజలు వానాకాలం అంటే బెంబేలెత్తి పోతుంటారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు ప్రవేశించకుండా రక్షణ గోడలు నిర్మిస్తామని ప్రజాప్రతినిధుల హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఉపాధి హామీ పనుల పరిశీలన బళ్లారి అర్బన్: కురుగోడు తాలూకాలోని వివిధ గ్రామ పంచాయతీల్లో మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం అమలు తీరుతెన్నులను జెడ్పీ సీఈఓ రాహుల్ శరణప్ప సంకనూరు ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. కురుగోడు తాలూకాలోని దమ్మూరు, వీటీ క్యాంప్ల వద్ద కాలువల్లో పూడికతీత, సింధిగేరి అటవీ శాఖ ట్రెంచ్, హెచ్ వీరాపుర, సోమలాపుర గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆ టీపీ ఈఓ కేవీ.నిర్మల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వైట్ ట్యాపింగ్ రోడ్లు తవ్వొద్దు
బనశంకరి: కోట్లాదిరూపాయల ఖర్చుతో నిర్మించిన వైట్ ట్యాపింగ్ రోడ్లను తవ్వేవారికి బీబీఎంపీ షాక్ ఇచ్చింది. ప్రతికిలోమీటరుకు రూ.15 నుంచి 18 కోట్లు వ్యయంచేసి నిర్మించిన వైట్ ట్యాపింగ్ రోడ్లను ఓ సంస్థ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా తవ్వుతున్న వైనంపై బీజేపీ నేత ఎన్ఆర్.రమేశ్ బీబీఎంపీ కమిషనర్ తుషార్గిరినాథ్ లేఖ రాశారు. దీంతో ఆ రోడ్లలో తవ్వకాలు చేపట్టవద్దని కమిషనర్ ఆదేశించారు. తవ్వకాలకు ఇచ్చిన అనుమతి ఆదేశాలను రోడ్లు, మూలభూత సౌకర్యాల శాఖ ఇంజనీర్ వెనక్కి తీసుకున్నారు. నాశనం చేసిన రోడ్లను తక్షణం పూర్తిగా తారురోడ్డు వేయాలని ప్రైవేటు సంస్థ కాంట్రాక్టరుకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించండి చింతామణి: ఆగ్నేయ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న శ్రీనివాస్ శుక్రవారం పట్టణంలోని కాలేజీలను సందర్శించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులను కలసి తనకు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, నాయకులు సయయద్ ఎజాజ్, కృష్ణమూర్తి, సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, బాబు పాల్గొన్నారు. బాధితులను పరామర్శించిన డీఐజీ యశవంతపుర: రైలులో జరిగిన దాడిలో గాయపడి బెళగావి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీటీ, కోచ్ హెల్పింగ్ సిబ్బందిని డీఐజీ శరణప్ప శుక్రవారం పరామర్శించారు. బెళగావి జిల్లా ఖానాపుర లోండా వద్ద రైలు వెళ్తుండగా టికెట్ విషయంపై కొందరు వ్యక్తులు టీటీపై దాడి చేశారు. టీటీకి సాయంగా వచ్చిన కోచ్ హెల్పింగ్ స్టాఫ్పై దాడి చేశారు. ఘటనలో దేవర్షి వర్మ అనే వ్యక్తి మృతి చెందాడు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను డీఐజీ పరామర్శించారు. దేవర్షి కుటుంబానికి రైల్వేశాఖ ద్వారా పరిహారం ఇప్పిస్తామన్నారు. నిందితులను పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం రైల్వే ఎస్పీ సౌమ్యలతాతో చర్చించారు. ఇకపై గ్రేస్ మార్కులు కలపరు శివాజీనగర: వచ్చే విద్యా సంవత్సరం నుంచి గ్రేస్ మార్కులు కలిపే విధానాన్ని రద్దు చేయాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. ఏటా ఎస్ఎస్ఎల్సీ విద్యార్థులకు 20 గ్రేస్మార్క్స్ ఇస్తున్నారు. ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ఉపసంహరించుకుంది. విధానసౌధలో సీఎం, డీసీఎం నేతృత్వంలో జరిగిన విద్యాశాఖ సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. -
తెరుచుకున్న మద్యం షాపులు
కెలమంగలం: డెంకణీకోట తాలూకా కెలమంగలంలో ఒకే చోట మూడు ప్రభుత్వ టాస్మార్క్ మద్యం దుకాణాలు ఉండగా, మందుబాబుల గోలను జనం భరించలేకున్నారు. ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్య ఎదురుకావడంతో పాటు తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. గత 9వ తేదీ సైక్లిస్టును ఓ తాగుబోతు సుమోతో ఢీకొనడంతో అతడు చనిపోయాడు. దీంతో ఆవేఽశానికి గురైన బాధిత బంధువులు, స్థానిక ప్రజలు టాస్మార్క్ ముందు బైఠాయించారు. ప్రమాదాలకు కారణమైన మద్యం షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో గత వారం రోజులుగా టాస్మార్క్ అంగళ్లను మూసివేశారు. ఈ విషయంపై సంబంధిత శాఖాధికార్లు తళి ఎమ్మెల్యే టి. రామచంద్రన్, స్థానిక ప్రజా పతినిధులు, ప్రజల వద్ద చర్చలు జరిపారు. షాపులు లేక మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారని, 45 రోజుల్లో ఇతర ప్రాంతాలకు మార్చివేస్తామని హామీ ఇచ్చారు. దీంతో షాపులను మళ్లీ తెరిచారు. -
తుపాకీ గుళ్లకు యువకుడి బలి
దొడ్డబళ్లాపురం: తుపాకీ గుళ్లు దూసుకొచ్చి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన చిక్కమగళూరు తాలూకా ఉళువాగిలు గ్రామంలో చోటుచేసుకుంది. కెరెమక్కి గ్రామానికి చెందిన సంజు(33) ఉళువాగులు గ్రామంలో రోడ్డుపక్కన విగతజీవిగా పడి ఉండగా మల్లందూరు పోలీసులు వచ్చి పరిశీలించారు. గుండెలపై బుల్లెట్ గాయం ఉండగా సమీపంలోనే తుపాకీ కూడా లభించింది. దగ్గరలో అటవీ ప్రాంతం ఉండడం వల్ల వేటకు వచ్చిన సమయంలో ప్రమాదవశాత్తు బుల్లెట్ తగిలి ఉండవచ్చని, లేదా ఎవరైనా హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
చందు సూసైడ్ వెనక సంచలన నిజాలు
Watch Live: తెలంగాణ EAMCET ఫలితాలు విడుదల..
మనిషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా!
కేసు పెట్టుకోండి.. పోలీసులపై మల్లారెడ్డి ఫైర్
టీడీపీ ఎగనామం: సర్వేల పేరుతో పనిచేయించుకొని డబ్బులు ఎగ్గొట్టిన టీడీపీ
47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
పార్లమెంట్ ఎన్నికలు..BRS పరిస్థితి ఏంటి ?..KSR విశ్లేషణ
వచ్చే ఏడాది మెగా వేలంలోకి.. కోచ్ ప్రశ్నకు రోహిత్ శర్మ ఆన్సర్ ఇదే
తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
తప్పక చదవండి
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- చివరి బెర్త్ ఎవరిదో?
- బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
Advertisement