● ఐదు సార్లు బీజేపీ విజేత
● ఒక్కసారి కాంగ్రెస్ హస్తగతం
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని జిల్లాల్లో జూన్ 3న జరగబోయే ఈశాన్య పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కళ్యాణ కర్ణాటక పరిధిలో బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలు వస్తాయి. ఈ ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ అమర్నాథ్ పాటిల్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ పాటిల్, స్వతంత్ర అభ్యర్థిగా నారా ప్రతాప్రెడ్డి బరిలో ఉన్నారు. 1988 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో ఐదు సార్లు బీజేపీని విజయం వరించింది. 1988, 1994, 2000, 2006లో బీజేపీ నుంచి ఎంఆర్ తంగా, 2012లో బీజేపీ నుంచి అమర్నాథ్ పాటిల్ గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి అమర్నాథ్ పాటిల్, కాంగ్రెస్ నుంచి చంద్రశేఖర్ పాటిల్ పోటీ పడగా మొదటిసారి కమలం నుంచి విజయాన్ని హస్తగతం చేసుకున్నారు.
కొత్త పద్ధతులతో
కీటకాల బెడదకు చెక్
రాయచూరు రూరల్: వ్యవసాయంలో కీటకాల నియంత్రణకు నూతన పద్ధతులు పాటించాలని తెలంగాణలోని పాలమూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ శివకుమార్ సింగ్ పిలుపునిచ్చారు. ఆయన రాయచూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన జీవశాస్త్రం, వృక్షశాస్త్రం అంశాలపై మాట్లాడారు. న్యానో సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులతో వ్యవసాయ రంగంలో నూతన వంగడాలకు అవకాశం ఉంటుందన్నారు. పంటలపై విషపూరితమైన రసాయనిక మందుల వినియోగం వల్ల పరిసరాలపై చెడు ప్రభావం కలిగిస్తుందన్నారు. న్యానో సాంకేతిక రంగంలో వచ్చిన అంశాలను వినియోగించుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్, భౌతిక, రసాయనిక, జైవిక, విజ్ఞాన శాస్త్రాల్లో కూడా న్యానో సాంకేతిక రంగంపై ఆధారపడ్డాయన్నారు. కార్యక్రమంలో డీన్ పార్వతి, భాస్కర్, గణేష్ నాయక్, బసవరాజ్, మహేంద్రరెడ్డి, గీత, స్వాతిలున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువు
శ్రీనివాసపురం: రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినందునే విద్యార్థులు, మహిళలు ఒకరి తరువాత ఒకరు హత్యకు గురవుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేఎన్ వేణుగోపాల్ ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని తన స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. విద్యార్థిని నేహా హత్య ఘటన మరువక ముందే మరో యువతి అంజలి అంబిగేర దారుణ హత్యకు గురైందన్నారు. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు కరువయ్యాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. అంజలి అంబిగేరను దారుణంగా హత్య చేసిన వ్యక్తిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్యకు కారణాలు తెలుసుకుని మృతురాలి కుటుంబానికి పరిహారం అందించి న్యాయం చేయాలన్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.