-
Short Story: ఉదయాన్నే ఒక గంట శబ్ధం వినపండింది.. అదేంటో కనుక్కోండి..!
ఒకనాటి ఉదయాన్నే అడవిలోంచి ఒక గంట శబ్దం మృగరాజైన సింహం చెవుల్లో సోకి ఎంతగానో ఆకట్టుకుంది. దాని ఉనికి తెలుసుకోవాలన్న కుతూహలంతో వెంటనే అన్ని జంతువులనూ సమావేశపరచింది. ‘ఈరోజు ఉదయాన్నే ఒక గంట శబ్దం నా చెవిన పడి నన్ను ముగ్ధుడిని చేసింది. తక్షణమే దాని గురించి కనుక్కుని చెప్పండి’ అని తన గుహలోకి పోయింది. అది విన్న జంతువులన్నీ తమలో తాము గుసగుసలాడుకున్నాయి.‘ఔను! నేనూ ఈరోజు ఆ గంట శబ్దం విన్నాను భలేగా ఉంది.. గణగణలాడుతూ..’ అన్నది కుందేలు. ‘ఆ చప్పుడుకి తెల్లవారుతూనే నాకు తెలివొచ్చేసింది. ఏదో కొమ్మ మీంచి కొమ్మకు గెంతుతుంటే అదోవిధమైన ధ్వని నా మనసును హత్తుకుంది’ తోడేలు చెప్పింది. ‘మీకెందుకలాగ అనిపించిందో నాకైతే బోధపడటం లేదు. పదేపదే ఆ గంట మారుమోగుతుంటే చెడ్డ చిరాకేసింది. అది ఎవరు చేస్తున్నదీ తెలిస్తే చంపకుండా వదలను’ అని కోపం ప్రదర్శించింది ఎలుగుబంటి.‘మృగరాజు చెప్పిన పనిని మనం చేయడం ధర్మం. సరేనా!’ అన్నది ఒంటె. మళ్ళీ గంట శబ్దం అదేపనిగా వినబడసాగింది. చీకటిపడే సమయానికి కూడా దాని ఉనికి కనుక్కోలేక తమ గూటికి చేరాయన్నీ. మర్నాడు ఉదయం ఒక కోతి గెంతుకుంటూ వచ్చి ‘ఒక పిల్లి తన గంట మెడలో కట్టుకుంది. అది కదిలినప్పుడల్లా మారుమోగి అడవి అంతా వ్యాపిస్తోంది. ఇదే విషయం మనం సింహానికి చెప్పేద్దామా?’ అని సాటి జంతువులతో అన్నది. ‘చెబితే మనల్ని ఆ గంట తెమ్మని అడగవచ్చు. దానికి సిద్ధపడితేనే మనం చెప్పాలి. లేకపోతే అంతా ఆలోచించాక చెవిన వేద్దాం’ అన్నది ఏనుగు.అదే సమయంలో గుహలోంచి సింహం గర్జిస్తూ బయటకొచ్చి ‘మీరంతా గంట సంగతి ఏం చేశారో చెప్పారు కాదు. ఈ ఉదయం కూడా అది నాకు వినబడి మరింత ఆకట్టుకుంది. చెప్పండి..’ అని హుంకరించింది. ‘మరి.. మరి.. అది.. ఒక పిల్లి మెడలో ఉండటం ఈ కోతి కళ్ళబడింది’ అని చెప్పేసింది కుందేలు.‘ఆ! ఒక పిల్లి మెడలో గంటా? అది దాని మెడలోకి ఎలావచ్చింది? ఎవరు కట్టారు? ఒక పిల్లి అంత ధైర్యంగా గంట కట్టుకుని అడవంతా తిరగటమేమిటి? ఈ రోజు ఎలాగైనా ఆ గంటను తెచ్చి నా మెడకు కట్టండి. లేకుంటే ఏంచేస్తానో నాకే తెలీదు’ అని గర్జించింది సింహం. వెంటనే జంతువులన్నీ అడవిలో గాలించడం మొదలెట్టాయి. అదే సమయంలో ఒక లేడి చెంగుచెంగున గెంతుకుంటూ వచ్చి ‘పిల్లి మెడలో గంట కట్టింది ఎలుకలని తెలిసింది. అవి ఎందుకలా కట్టాయో వాటికి కబురుపెట్టి అడగండి..’ అని చెప్పింది.ఎలుకలకు కబురు వెళ్ళింది. ఎలుకల నాయకుడు జంతువుల ముందు హాజరై ‘మా ఎలుకలకు ప్రాణహాని కలిగిస్తున్న ఒక పిల్లి నుండి రక్షించుకోడానికి మెడలో గంటకడితే ఆ చప్పుడుకి దాని ఉనికి తెలుస్తుందని అప్పుడు మేమంతా జారుకోవచ్చని ఉపాయం ఆలోచించాం’ అన్నది. ‘మరి మీరు చేసిన పనికి మేమంతా ఇప్పుడు ఇరుక్కున్నాం. ఆ శబ్దం మృగరాజుకు తెగ నచ్చేసింది. అందువలన మీరు ఆ గంటను దాని మెడలోంచి తీసి మాకివ్వాలి. మేము దాన్ని సింహం మెడలో కట్టాలి. ఆ పని మీరు త్వరగా చేయాలి’ అని ఎలుగుబంటి హుకుం జారీ చేసింది. ‘అయ్యో రామ! మా రక్షణ నిమిత్తం చచ్చేంత భయంతో ధైర్యం చేసి కట్టాం. మళ్ళీ దాన్ని తీసి తేవాలంటే గండకత్తెరే! మా కంటే మీరంతా శక్తిమంతులు. ధీశాలులు. దయచేసి మీలో ఎవరో ఒకరు పిల్లి మెడలో గంటను తొలగించండి. మళ్ళీ మాకు పిల్లి నుండి ప్రాణగండం తప్పదు. అయినా భరిస్తాం’ నిస్సహాయంగా చెప్పింది ఎలుకల నాయకుడు. ‘ఐతే సరే! వెళ్ళు. దానిపని ఎలా పట్టాలో మాకు తెలుసు. మృగరాజు కోరిక తీర్చడం మాకు ముఖ్యం’ అని ఎలుకను పంపేసింది ఏనుగు.కుందేలు ఎగిరి గంతేస్తూ ‘పిల్లి మెడలో గంట శబ్దం మన మృగరాజుకి నచ్చడం మన అదృష్టం. సింహానికి ఎప్పుడు ఆకలి వేసినా ఎవరని కూడా చూడకుండా వేటకు సిద్ధపడుతుంది. అలాంటప్పుడు మెడలో గంట ఉంటే ఆ చప్పుడు మనందరికీ వినిపించి తప్పించుకోడానికి అవకాశం వస్తుంది. అందువలన ఆ పిల్లి మెడలో గంటను తీసుకొచ్చి సింహానికి కట్టేయాలి’ అని అందరి వైపు చూసింది.‘పిల్లి మెడలో గంట తస్కరించడం ఏ మాత్రం? మీరు ఊ అంటే చాలు.. సాయంత్రంకల్లా తెచ్చేస్తా’ అన్నది కోతి హుషారుగా. జంతువులు ‘ఊ’ కొట్టాక కోతి అడవిలోకి పోయి గంట చప్పుడైన దిశగా పయనించింది. కోతి రాకను గమనించిన పిల్లి చెట్లన్నిటి పైనా తిరిగి తప్పించుకో చూసింది. అప్పుడు కోతి ‘మిత్రమా! నీరాక తెలుసుకొని నీ నుండి తప్పించుకోడానికి ఎలుకలు పన్నిన కుట్రలో భాగమే నీ మెడలో ఈ గంట. దాన్ని తీసిస్తే నీకే మంచిది. నువ్వు సడి చప్పుడు లేకుండా వెళ్ళి ఎలుకల పనిపట్టి నీ ఆకలి తీర్చుకోవచ్చును’ అన్న మాటలకి సంతోషపడి ఒప్పుకుంది. దాని మెడలోని గంటను విప్పి పట్టుకెళ్లి జంతువులందరి ముందు ఎలుగుబంటి చేతిలో పెట్టింది కోతి. ‘ఇక చూడండి.. మన మృగరాజు తన గోతిలో తానే పడే సమయం వచ్చింది’ అని తోడేలు అంటున్నంతలోనే.. గుహ లోపలున్న సింహం దగ్గరకి వెళ్ళి గంట దొరికిందని చెప్పింది కుందేలు.‘ఆహా! ఎంత అదృష్టం! నేను కోరుకున్న గంటను ఇక నామెడలో అలంకరించండి. ఆ శబ్దంతో అడవంతా మారుమోగి పోవాలి’ అన్నది బయటకొచ్చిన సింహం. ఎలుగుబంటి తన దగ్గర ఉన్న గంటను ఏనుగుకు ఇవ్వగా అది మృగరాజు మెడలో వేసింది. గంటను పదేపదే చూసుకుని మెడను తిప్పుతూ గంట శబ్దానికి తెగ ముచ్చట పడిపోతూ అడవిలోకి పరుగు తీసింది మృగరాజు. దాని వైఖరికి జంతువులన్నీ ‘గంట చప్పుడుకి మురిసిపోతోంది కాని అది తనకే గండమన్న సంగతి తెలుసుకోలేకపోయింది పాపం!’ అంటూ నవ్వుకున్నాయి. ‘సింహం కోరిక తమ పాలిట వరం’ అనుకుంటూ తమ దారిన తాము వెళ్లిపోయాయి. – కె.కె.రఘునందనఇవి చదవండి: ప్రకృతి కూడా అతడి కోపానికి భయపడేది.. ఒకరోజు.. -
చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’?
పాత ముతక చీర కట్టిన పండు ముసలమ్మలా ఉందా పాక. అటూ ఇటూ నల్లరంగేసిన రెండరుగులు, మధ్యలో గడప. ఓ అరుగు మీద కూర్చున్న ఆడవాళ్ళు ఆల్చిప్పతో కలెక్టరుకాయలు తొక్కతీసి, మాగాయ, తొక్కుపచ్చడికి సిద్ధం చేస్తున్నారు. రెండో అరుగు మీద చంటి ఒక్కడే పేకాడుకుంటున్నాడు.‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’ అడిగిందొకావిడ ఓ పండుముక్క నోట్లో వేసుకుంటూ. ఓ సారి అటువైపు చూసి మళ్ళీ ఆటలో పడిపోయాడు చంటి. ‘పాచి పళ్ళు, తలంతా ఈళ్ళు, పుల్లల్లాంటి కాళ్ళు, ఎక్కడో బంగారు పూల పూజ చేస్తోంది వీడి గురించి’ సాగదీస్తూ వెక్కిరించింది మరొకావిడ. అంతలో ఎదురింటి ముందు సామాన్లతో వేన్ ఆగింది. తండ్రి వేను దిగి చేతులు అందించాడు. అతని చేతుల్ని పక్కకి నెట్టి, చెంగుమని దూకింది చిన్న. ‘జాగ్రత్తే చిన్నా’ అంటోంది వెనక రిక్షాలో వచ్చిన తల్లి. ఆ చప్పుడుకి చేతిలో పేక మూసి పాకలోంచి పైకి చూశాడు చంటి. కృష్ణుడి రంగు, ముందుకేసుకున్న రెండు జడలు, కోడి కత్తిలాంటి చిన్న ముక్కు, ముఖ్యంగా ఆ కళ్ళు, ఒక్క క్షణం ఓ చోట నిలవకుండా చుట్టూ పరిశీలిస్తూ గుండ్రంగా తిప్పుతూ, చంటి మీద ఓ రెండు సెకన్లు ఎక్కువసేపు నిలిపి, కళ్ళతోనే ఓ నవ్వు చిలికి, మిగిలినవాళ్ళు సామాన్లు సర్దుతూ ఉండగానే వీధి మొత్తం ఓ రౌండ్ కొట్టి వచ్చింది చిన్న.‘ఏవండీ,’ అంటూ వాకిట్లోకి వచ్చింది సరస్వతి. ‘రండి, కూర్చోండి’ అంటూ పేడలో ఎండుగడ్డి కలిపి బెందడి గోడకి పిడకలు వేస్తున్న పనాపి, చెయ్యి కడుక్కుని, పక్కనే ఉన్న చెక్క స్టూల్ లాగింది లక్ష్మి కూర్చోమని. ‘నమస్తే. నిన్ననే మీ ఎదురింట్లో దిగాము. పాలు వాడకం పెట్టుకుందామని’ అంది సరస్వతి కూర్చుని ఆ పాకంతా పరికిస్తూ. ‘అలాగే, వీధంతా మా చుట్టాలే. నేనే పోస్తాను పాలు. మీరు నలుగురులా ఉంది. సేరు పాలు సరిపోతాయేమో. పూటకి తవ్విడు చొప్పున పొయ్యమంటారా లేక సేరూ ఒకేపూట కావాలా?’‘ఉదయాన్నే సేరు పోసేయ్యండి. రేటు ఎక్కువైనా పరవాలేదు, పొదుగు దగ్గర పాలు కావాలి, మేము రావాలా?’ అడిగింది సరస్వతి ముక్కుకి చీర చెంగు అడ్డుపెట్టుకుంటూ. ‘ఈ వీధిలో అందరూ మా చుట్టాలే. అందుకని కాదు కానీ, మీరు అడిగినా నీళ్ళు కలపం. మా పాలతో బొట్టు పెట్టుకోవచ్చు. ఓ వారం చూస్తే మీకే తెలుస్తుంది. పాలు మా చంటి తెస్తాడు. గిన్నె వెంటనే ఇచ్చెయ్యాలి. ఉండండి కొంచెం కాఫీ పెడతాను’ అంది లక్ష్మి ఆప్యాయంగా. ‘వద్దండీ, అలవాటు లేదు’ అంది సరస్వతి వాకిట్లో ఉన్న జాంచెట్టుని చూస్తూ. ‘అన్నయ్యగారు ఏం చేస్తారు. పిల్లలు చదువుతున్నారా?’ అడిగింది లక్ష్మి అప్పుడే లోపలికొచ్చిన చంటిని జాంకాయలు కొయ్యమని సైగ చేస్తూ. ‘ఆయన ట్రెజరీలో చేస్తారు. అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. పిల్ల ఎయిత్’ అని, ‘అన్నయ్యగారు ఊళ్ళో లేరా?’ అడిగింది సరస్వతి చుట్టూ పరికిస్తూ.‘లేరు, వీడి ఆరో ఏటే పోయారు. అప్పటినించి నాలుగు గేదెల్ని సాకుతూ పాలవ్యాపారం చేసుకుంటూ వాణ్ణి పెంచుతున్నా. మా అమ్మ వాళ్ళదీ ఇదే వీధి చివరిల్లు’ అంది లక్ష్మి చంటి కోసిచ్చిన కాయల్లో ఓ నాలుగు దోరకాయల్ని సరస్వతి చేతిలో పెడుతూ. అవి మొహమాటంగా అందుకుని, ‘సరే వస్తానండి, పాలు రేపటినించి పొయ్యండి’ అని వెళ్ళిపోయింది సరస్వతి.గొళ్ళెంతో తలుపు మీద మెత్తగా కొట్టాడు చంటి. చటుక్కున తలుపు తీసి అతని వేళ్ళు తగిలేలా పాల గిన్నె అందుకుంటూ నవ్వి కన్ను గీటింది చిన్న. కంగారుగా అటూ ఇటూ చూసి, గిన్నె ఖాళీ చేసి ఇచ్చేవరకూ ఆగకుండా ఇంటికి పరిగెత్తాడు చంటి. ‘గిన్నేదిరా’ అడిగింది లక్ష్మి. ‘తర్వాత ఇస్తామన్నారమ్మా’ అనేసి అరుగు మీద కూర్చుని పేక ముక్కలు పేర్చుకోవటం మొదలు పెట్టాడు. కాసేపట్లో ఖాళీ గిన్నెతో వచ్చింది చిన్న. అటూ ఇటూ చూసి ఓ చీటీ చంటి మీదకి విసిరి లోపలికి వెళ్ళింది. ‘పాలు’ అన్నాడు చంటి బెరుగ్గా. ‘తెలుసు’ అందామె కొంటెగా. ‘అమ్మ గిన్నె తెమ్మంది’. ‘తినెయ్యంలే నీ గిన్నె. లోపలికి రావొచ్చుగా!’ చంటి భయంగా అటూ ఇటూ చూసి, ‘మీ అన్నయ్య లేడా?’ అడిగాడు. ‘ఉంటే నిన్నేమీ కట్టెయ్యడులే!’ ‘ఆంటీ?’ అడిగాడు సిగ్గుపడుతూ.‘అమ్మ పెరట్లో ఉంది’ అంది అదే సొట్ట బుగ్గల నవ్వుతో. వెళ్లి రేక్కుర్చీలో ముందుకు కూర్చున్నాడు భయంగా. ‘మొహమంతా మొటిమలు, చింపిరి జుట్టు, వాడు నీకెలా నచ్చాడే’ అంటోంది మా ఫ్రెండ్ ఇందిర’ అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ.‘నేనేం నీ వెంట పడలేదు. నచ్చకపోతే మానెయ్’అన్నాడు ఉక్రోషంగా. ‘సరదాగా తను అన్నది చెప్పాను తప్ప నేననలేదు కదా, నాకు నీ కళ్ళంటే ఇష్టమని చెప్పాను’ అంది అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. ‘కళ్ళు నచ్చటమేంటి?’ అడిగాడు చంటి ఉత్సాహంగా. ‘నువ్వు చిన్నపిల్లాడివి నీకు తెలీదులే. అది సరే, టె¯Œ ్త ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. కాసేపు ఆ పేకముక్కలు పక్కన పెట్టి చదువుకోవచ్చుగా. కావాలంటే నేనూ వస్తా కంబైండ్ స్టడీస్కి’ అంది.‘అక్కర్లేదు. నువ్వు మాత్రం ఏం చదువుతున్నావు? ఎంతసేపూ వీధంతా తిరుగుతావు అందరిళ్ళకీ!’ ‘బాబి వాళ్ళ ఇంటికి వెళ్ళాననే కదా నీ కోపం. ఫిజిక్స్లో ఏదో డౌట్ ఉంటే అన్నయ్య తీసుకెళ్ళాడు.’‘నాకెందుకు కోపం. వాడు మంచోడు కాదు, సిగరెట్లు కాలుస్తాడు. అవునూ, ఫిజిక్స్ అంటే జీవశాస్త్రమేనా?’ అడిగాడు అనుమానంగా. ‘ఆహా మరి పేకాడే వాళ్ళు మంచోళ్ళా?’ అని, ‘మా అన్నయ్యకి చెప్పి ఈసారి డౌట్లు నిన్నే అడుగుతాలే తెలుగు మీడియం అబ్బాయి’ అంది అల్లరిగా నవ్వుతూ. ‘చిత్రలహరికి వాణ్ణి లోపల కుర్చీ వేసి కూర్చోబెడతారు. నేనేమో బయట కిటికీ ఊసలు పట్టుకుని వేళ్ళాడుతూ చూడాలి’ అన్నాడు చంటి ఉక్రోషంగా. ‘బావుంది అతను మా అన్నయ్య ఫ్రెండ్. నిన్ను రమ్మంటే రావు దానికి నేనేం చేయను’ అంది జాలిగా. ‘బాబి వాళ్ళింట్లో ఉసిరి చెట్టున్నట్టుంది, కాయలు కోసావా’ అడిగాడు మాట మారుస్తూ ఊరేసిన ఉసిరికాయలు ఇస్తుందేమో అని ఆశగా. ‘నాకు ఉసిరికాయలు నచ్చవు. జాంకాయలంటేనే ఇష్టం’ అంది కొంటెగా. అందులో శ్లేష అతనికి అర్థంకాలేదని తెలిసి కాస్త కోపంగా ‘రేప్పొద్దున్న పెళ్ళయ్యాక పేక ముక్కలు ముట్టుకున్నావో చేతులు విరక్కొడతా?’అంది.‘ష్! మీ అమ్మగారు వింటారు..’‘మన సంగతి మా అమ్మకి ఎప్పుడో చెప్పేశా. ఇంకో విషయం తెలుసా, మొన్న మీ అమ్మగారే అడిగారు నన్ను ‘మా చంటిని చేసుకోవే, ఈ పాడి నువ్వైతేనే బాగా చూసుకుంటావు’ అన్నారు తెలుసా?’ ఆ మాటకి చంటి తెగ సిగ్గుపడిపోయాడు. అతని సిగ్గు చూసి ముద్దేసి అతని రెండు బుగ్గలూ గట్టిగా పట్టుకుని లాగింది చిన్న. ‘అమ్మా..’ అన్నాడు కందిపోయిన బుగ్గల్ని రాసుకుంటూ.‘చిన్నా ఎవరే?’ పెరట్లోంచి సరస్వతి కేకేసింది. ‘పిల్లి.. తరుముతున్నాను’ అంది చిన్నా చంటిని వెళ్ళిపొమ్మని సైగ చేస్తూ.‘అమ్మా బాబిని నేను చేసుకోను. నీకు ఎప్పుడో చెప్పాను చంటిని తప్ప ఎవర్నీ చేసుకోనని, దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు’ అంది చిన్న విసురుగా. అప్పటికి రెండు గంటల్నించి నడుస్తోంది యుద్ధం. అమ్మ, నాన్న, అన్నయ్య ఒక వైపు చిన్న ఒక్కర్తీ ఒకవైపు. ‘ఏంటే నువ్వొప్పుకునేది? అసలు నీకు ఎనిమిదో తరగతినించీ ఈ ప్రేమలేంటి. అప్పుడే ఓ నాలుగు తగిలిస్తే ఇంతవరకూ వచ్చేది కాదు. వాడింకా బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పైగా ఆ పేకాట పిచ్చొకటి. ఎప్పుడు సెటిల్ అవుతాడో, ఏ ఉద్యోగం వస్తుందో తెలీదు. బాబికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మనం తొందరపడాలి’ కోపంగా అన్నాడు ఆమె అన్నయ్య. ఆమె తండ్రి ఎవరు మాట్లాడితే వాళ్ళకేసి చూడ్డం తప్ప ఇంకేం చెయ్యట్లేదు. ‘గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే సరిపోతుందా? నాకు నచ్చక్కర్లేదా? నీ చెల్లిని ప్రేమించాడు కాబట్టి నీకు నచ్చటం లేదు తప్ప, చంటి తెలివైన వాడురా! పదమూడు ముక్కలూ పేర్చకుండా ఆడతాడు, కళ్ళతో ఓసారి చూసి కౌంట్ చెప్పేస్తాడు. వాడికీ మంచి ఉద్యోగమే వస్తుంది. మీరు ఒప్పుకుంటే సరే లేదంటే....’ అంతే విసురుగా సమాధానం చెప్పింది చిన్న.అన్నయ్య కొంచెం తగ్గి, ‘ఏముందే వాళ్ళింట్లో? పేడ కంపు కొట్టే ఆ పాక, నాలుగు గేదెలు, వర్షమొస్తే కారకుండా ఇల్లంతా పేర్చిన సత్తు గిన్నెలు, ఓ రోజు గేదె తంతే నాలుగు రోజులు కూరలేకుండా గడుపుకోవాలి. నా మాట విను’ అన్నాడు. సరస్వతి కల్పించుకుని, ‘దానికి నేను నచ్చచెబుతా లేరా?’ అంటూ చిన్నని గదిలోకి తీసుకెళ్ళింది. ‘చిన్నమ్మా, నీకు తెలుసుకదా నాన్నగారికి ఏం తెలీదు. మనింట్లో నిర్ణయాలన్నీ మగపిల్లాడు, అన్నయ్యే చూసుకుంటాడు. వాడు కూడా ఏం చేసినా నీ మేలు కోరే చేస్తాడు. ఊడ్చిన చేను కంటే ఉడికిన అన్నం నయం కదా. వాడి మాట విను’ అంది సరస్వతి చిన్నని ఓదారుస్తూ. ‘అమ్మా, అయిదేళ్ళ నించి చూస్తున్నావు, నీకు తెలీదా చంటి మంచోడని? ఆ విషయం గ్యారంటీ కార్డు లాంటి వాడి కళ్ళు చూసి చెప్పొచ్చు ఎవరైనా. వాడితో ఉంటే అభయాంజనేయుడు తోడున్నట్టే. ఇక ఉద్యోగం అంటావా, ఉసిరి చెట్టు తొందరగా కాపు కొస్తుంది, జాంచెట్టు కాస్త ఆలస్యమౌతుంది’ అని చిన్నమ్మ ఇంకా చెప్పేలోపు మధ్యలో అడ్డుపడి ‘చంటి మంచోడంటే బాబి చెడ్డోడని కాదు కదమ్మా’ అంది సరస్వతి.‘నిజమేనమ్మా, కానీ ఇక్కడ సమస్య స్వేఛ్చ గురించి. నేనో పిల్లని చూసి అన్నయ్యని చేసుకోమంటే చేసుకుంటాడా. మంచో, చెడ్డో నా జీవితానికి సంబంధించిన నిర్ణయంలో నన్ను కూడా భాగం చెయ్యండి అంటున్నా అంతే’ అని, ‘అమ్మా.. నాకింకా పద్దెనిమిదే కదా. ఒక్క రెండేళ్ళు చూడండి. ఈలోగా నా డిగ్రీ కూడా పూర్తవుతుంది. అప్పటికీ చంటి సెటిల్ కాకపోతే మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం మీరు ఎంత చెప్పినా ఏం చేసినా నేను ఈ పెళ్ళి చేసుకోను’ అంది చిన్న ఏడుస్తూ.అదే సమయంలో.. ఎదురింటి పాకలో లక్ష్మి, చంటి దిగులుగా కూర్చున్నారు. నాలుగింటికిలేచి, పాలుపితికి, వీధంతా పొయ్యటం, పేడకళ్ళెత్తడం, పిడకలు చెయ్యటం, మిల్లుకెళ్ళి చిట్టు, తౌడు, సంతకెళ్లి పచ్చగడ్డి, కొనుక్కురావటం, రాత్రిళ్ళు గేదె తప్పిపోతే హరికెన్ లాంతరు, చేపాటి కర్ర.. పట్టుకుని ఇంటి వెనకున్న తమలపాకు తోటంతా వెతికి పట్టుకోవటం, ఇలా అన్ని పనులూ పంచుకునే ఆ తల్లీ, కొడుకులు ఆ క్షణం దుఃఖాన్ని కూడా పంచుకుంటున్నారు.‘ఊరుకోరా.. ఏం చేస్తాం! నువ్వు మంచోడివని నీకూ, నాకూ తెలిస్తే చాలదు. లోకానికి తెలియాలి. ఆ పేక ముక్కలు వదలరా అంటే విన్నావు కావు. మీ నాన్న కూడా ఇలాగే పేకాట పిచ్చితో ఇంటికే వచ్చేవాడు కాడు. ఓ రోజు మీ తాత తిట్టాడని ఉరేసుకున్నాడు. నువ్వు కూడా ఎక్కడ అలాంటి పని చేస్తావో అని భరిస్తున్నాను. అయినా నిన్నని ఏం లాభం. వీధి వీధంతా ఏ అరుగుమీద చూసినా, ఐదేళ్ళ పిల్లాడి నించి ఎనభై ఏళ్ల ముసలాళ్ళ వరకూ, ఆడ మగ తేడా లేకుండా ఇదేం అలవాటో. ఇక్కడినించి పోదాం అంటే సొంతిల్లు, పాడి వదులుకుని ఎక్కడకని పోతాం. ఇప్పుడు చూడు. పాపం వెర్రిది. నువ్వంటే పిచ్చి దానికి. ఇరవై ఏళ్లకి ఉద్యోగం లేదని ఎందుకూ పనికిరావని నిర్ణయించేశారు. చిన్నమ్మ ఎంతో చురుకైనది, నువ్వా నెమ్మది. దాన్ని నీకు కట్టబెడితే నీ బతుకు బావుంటుందని ఆశపడ్డాను’ అంది చంటి తల్లి భారంగా.‘అమ్మా, జీవితంలో మళ్ళీ పేక ముట్టుకోనమ్మా. నువ్వు ఎలాగైనా వాళ్ళకి చెప్పమ్మా. ఒక్క రెండేళ్ళు టైము ఇమ్మనమ్మా. టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నా, మంచి ఉద్యోగం సంపాదిస్తాను. నాకు చిన్న కావాలమ్మా’ అతనికి దుఖం ఆగటం లేదు. ‘ఊరుకోరా. రేపు వాళ్ళమ్మగారితో ఓసారి మాట్లాడి చూస్తా. నువ్వు బెంగెట్టుకోకు’ అంది లక్ష్మి చంటిని దగ్గరకి తీసుకుని తల నిమురుతూ! ‘ఆ చెప్పు చిన్నమ్మా’ అతని మాట ముద్దగా వస్తోంది ఫోన్లో. క్లబ్బులా ఉంది పక్కనే అంతా గోలగోలగా ఉంది.‘చిన్నాడికి వొంట్లో బాగోలేదు. ఇంటికెప్పుడొస్తావు’ విసుగ్గా అడిగింది చిన్న. ‘వచ్చేస్తా బంగారం. ఈ ఒక్క రౌండ్ అయిపోగానే వచ్చేస్తా అంటూ ఫోన్ ఆఫ్ చెయ్యకుండానే పక్కన పెట్టేశాడతను.ఉసూరుమంటూ ఫోన్ పెట్టేసి పిల్లాడికి పాలు, బ్రెడ్డు పెట్టి టాబ్లెట్ వేసి పడుకోమని చెప్పి పక్కనే ఉన్న రైతు బజారుకి బయల్దేరింది చిన్న. ‘నువ్వు చిన్నవి కదూ’ అంది కూరలు ఏరుతూ ఉంటే పక్కనున్నామె.‘అవును. నువ్వు .. ఇందిర కదూ, నువ్వుండేది హైదరాబాద్ కదా!’ అడిగింది చిన్న. ‘అవునే. మా అక్కయ్య గృహప్రవేశం ఉంటే వచ్చాను. పూల దండల కోసం ఇలా వచ్చా. బావున్నావా చిన్నా’ అడిగింది ఇందిర చిన్నమ్మ చేతిని అందుకుంటూ. ‘హా, బావున్నాం. మా ఇల్లు ఇక్కడే శివాజీ పాలెం. రా ఇంటికి వెళదాం’ అంటూ కూరలు కొనుక్కోవటం అయిపోయాక ఇద్దరూ చిన్నమ్మ ఇంటికి వెళ్ళారు.ఇందిర కేసి చూసింది చిన్న. చిన్నప్పుడు కళ్ళపుసులతో, పుల్లలా ఉండేది. ఇప్పుడు దబ్బపండులా, ఎండమొహం ఎరుగనట్టు నిగ నిగ లాడుతూ, ఒతై ్తన జడ, మితంగా బంగారం, చక్కటి డ్రెస్సు, హుందాగా ఉంది. ‘నువ్వేమిటే ఇలా అయిపోయావు చిన్నప్పుడు చిలకలా ఉండేదానివి’ అడిగింది ఇందిర. నవ్వి ఊరుకుంది చిన్న.‘మీ ఆయనా పిల్లలు బావున్నారా?’ అడిగింది మాట మారుస్తూ. ‘హా’ అంటూ నంబర్ తీసుకుని ఫ్యామిలీ ఫొటో వాట్సాప్లో షేర్ చేసింది ఇందిర. ఆ ఫొటో కేసి చూస్తూ, ‘నిన్ను బాగా చూసుకుంటాడా?’ అడిగింది చిన్న.‘రాత్రి పొడవాటి కురులని పొగిడి, పొద్దున్నే పచ్చట్లో అదే వెంట్రుక కనబడితే విసుక్కునే రకం కాదే. అమ్మలా అభిమానంగా, బిడ్డలా గారంగా చూసుకుంటాడు. ఏ లోటూ రానివ్వడు. ఇంటి పనిలో సాయం చేస్తాడు, సాయంత్రం ఆరుకల్లా ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇంతవరకూ మేము ఓ మాట అనుకున్నది లేదు. మనకి అంతకన్నా ఇంకేం కావాలే, ఓ సారి మా ఇంటికి రా నీకే తెలుస్తుంది’ అంది ఇందిర మురిసిపోతూ. మనస్పూర్తిగా సంతోషించడానికి ప్రయత్నించింది చిన్న. కాసేపు మాట్లాడాక, జాకెట్ ముక్క, ఓ యాపిల్ చేతిలో పెట్టింది చిన్న. తెలిసిన ఆటో మాట్లాడి ఎక్కించి, ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సరస్వతి ఫోను ‘చిన్నమ్మా కార్తీకమాసం కదా, యమ ద్వితీయ నాడు భగినీ హస్త భోజనం చేస్తే అన్నయ్యకి ఆయుష్షు వృద్ధి, నీ కాపురం బావుంటుందట ఈ శనివారం అన్నయ్యని ఇంటికి పిలు’ అంది.అంతే అప్పటివరకూ అణచిపెట్టిన దుఖం ఎగజిమ్మింది. ‘అమ్మా, వాడు నాకేం చేశాడని? నేను చంటిని అందగాడనో, వయసు వ్యామోహం వల్లో ప్రేమించలేదు. ఫలానా వాడితో నా జీవితం భద్రంగా ఉంటుందని ప్రతీ అమ్మాయికీ ఓ నమ్మకం ఉంటుంది. నాకు వాడి కళ్ళు చూస్తే అదే అనిపించి వాణ్ణి ఇష్టపడ్డాను. మీరు పడనివ్వలేదు. ఏదో చిన్నప్పుడు సరిగ్గా చదవలేదని వాడు ప్రయోజకుడు కాడని నిర్ణయించేశారు. ఆడపిల్లకి జీవితంలో అతి పెద్ద బెట్టింగ్ పెళ్ళి.మా ఆయనెప్పుడూ ఏం చెబుతాడో తెలుసా, కౌంటు ఇచ్చినా పర్లేదు కానీ ఎవడి పేక వాడే ఆడాలట. నా బాధల్లా అదే. ధర్మరాజు జూదమాడితే ద్రౌపది అడవుల పాలైనట్టు అన్నయ్య నిర్ణయానికి నేను బలైపోయాను. ఉంటాను, మళ్ళీ మీరు ఏరి కోరి మరీ చేసిన బాబి తాగి, ఇంటికొచ్చేటప్పటికి నేను ఫోన్ మాట్లాడుతూ కనబడితే గొడవ చేస్తాడు’ అందామనుకుని, గ్రీష్మాన్ని గుండెల్లోనే దాచి, పెదవులపై వసంతం పూయిస్తూ, ‘సర్లే, ఆరోజు అన్నయ్యకి కుదిరితే రమ్మను’ అంటూ ఫోన్ పెట్టేసి ఎందుకో ఇందిర షేర్ చేసిన ఫొటోలో ఆమె భర్తని తదేకంగా చూసింది.అభయాంజనేయుడిలా భద్రత నిస్తూ గ్యారంటీ కార్డు లాంటి కళ్ళు, అవి కనబడకుండా చిన్నమ్మ కళ్ళ నిండా నీళ్ళు. — ఉమా మహేష్ ఆచాళ్ళ -
Cover Story: 'స్వేదవేదం'! చెమటచుక్కకు దక్కుతున్నదెంత?
ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఆ దేశంలోని కర్షకులు, కార్మికుల పాత్ర కీలకం. కార్మికశక్తిని సద్వినియోగం చేసుకుంటున్న దేశాలు, కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న దేశాలు అభివృద్ధిపథంలో దూసుకుపోతుంటే, కార్మిక సంక్షేమాన్ని మాటలకు మాత్రమే పరిమితం చేసిన దేశాలు దిగజారుతున్నాయి. కార్మిక సంక్షేమాన్ని చిత్తశుద్ధితో పట్టించుకోని దేశాలు ఆర్థిక, సామాజిక అసమానతలతో కొట్టుమిట్టాడుతూ తరచు అలజడులకు, అశాంతికి ఆలవాలంగా ఉంటున్నాయి. ప్రపంచంలో చాలా కొద్ది దేశాలు మాత్రమే కార్మిక సంక్షేమాన్ని చిత్తశుద్ధితో పట్టించుకుంటున్నాయి. కార్మికులకు మెరుగైన పరిస్థితులు కల్పిస్తున్నాయి. చట్టబద్ధంగా మెరుగైన వేతనాలు అందేలా చూస్తున్నాయి. భారత్ సహా చాలా దేశాలు కార్మిక సంక్షేమాన్ని తగిన స్థాయిలో పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆయా దేశాల్లో కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కే పరిస్థితులు కనిపించడం లేదు.అంతర్జాతీయ కార్మిక ఉద్యమానికి గుర్తుగా ఏటా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకొంటున్నా, కార్మికుల స్థితిగతులు ఆశించిన స్థాయిలో మెరుగుపడిన దాఖలాలు లేకపోవడం విచారకరం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా దేశ దేశాల్లోని కార్మికుల స్థితి గతులు, కార్మిక సంక్షేమంలో వివిధ దేశాలు సాధించిన సాఫల్య వైఫల్యాలపై ఒక పరిశీలన. కార్మికుల హక్కులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పిస్తున్న దేశాలలో, కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లిస్తున్న దేశాలలో అతిపెద్ద ఆర్థిక శక్తులుగా వెలుగుతున్న అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, భారత్ వంటి దేశాలు లేకపోవడం విడ్డూరం.కార్మికుల హక్కులకు భరోసా కల్పించడంలోను, కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించడంలోనూ యూరోపియన్ దేశాలు ముందంజలో నిలుస్తున్నాయి. వీటితో పోల్చుకుంటే, అతిపెద్ద ఆర్థిక శక్తులుగా ప్రపంచ విపణిలో జబ్బలు చరుచుకుంటున్న దేశాల్లో కార్మికుల పరిస్థితులు అంత గొప్పగా లేవు. చాలా దేశాల్లో కార్మికుల పని పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం గగనంగా ఉంటోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఏటా విడుదల చేసే కార్మిక హక్కుల సూచిని (లేబర్ రైట్స్ ఇండెక్స్) పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఐఎల్ఓ గత ఏడాది విడుదల చేసిన లేబర్ రైట్స్ ఇండెక్స్–2022 జాబితా ప్రకారం...వారంలో పనిగంటలు, వార్షిక కనీస వేతనాలు మాత్రమే కాకుండా, కార్మికుల సగటు వార్షిక వేతనాలు, సమానమైన విలువ కలిగిన పనికి సమానమైన వేతనాల చెల్లింపు, మహిళా కార్మికులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ఏడాదిలో కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు, ప్రభుత్వ సెలవు దినాలు, కార్మికుల హక్కుల ఉల్లంఘన సంఘటనల సంఖ్య, కార్మికులు పనిచేసే చోట పని పరిస్థితులు, పని ప్రదేశంలో ప్రమాద నివారణ ఏర్పాట్లు, కార్మికుల ఆరోగ్య భద్రత, కార్మికులకు వైద్య సౌకర్యాలు, కార్మికులకు సంఘటితమయ్యే అవకాశాలు, సామాజిక భద్రత వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐఎల్ఓ ఏటా లేబర్ రైట్స్ ఇండెక్స్ను రూపొందిస్తుంది.ఈ జాబితాలోని మొదటి పది దేశాల్లో ఆర్థిక శక్తులుగా వెలుగుతున్న దేశాలేవీ లేవు. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలలోనైతే కార్మికుల పరిస్థితి ఇంకా దుర్భరంగానే ఉంటోంది. సాంకేతికత అభివృద్ధి చెంది రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి అందుబాటులోకి వచ్చినా, మురుగు కాలువలు శుభ్రం చేయడం వంటి పనులు ఇంకా మనుషులే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.‘కోవిడ్’ దెబ్బకు పెరిగిన నిరుద్యోగం..‘కోవిడ్’ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్మికులపై విపరీతంగా ప్రభావం చూపింది. దీని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘కోవిడ్’ కారణంగా నిరుద్యోగం బాగా పెరిగింది. ఉపాధి కోసం తగిన అవకాశాలు లేక కార్మికులు అసంఘటిత రంగంలోకి చేరుతున్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత, కనీస వేతనాలు వంటివి దక్కే పరిస్థితులు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఉపాధి పొందుతున్న కార్మికుల్లో 58 శాతం– అంటే, దాదాపు 200 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. వీరికి పనిచేసే చోట ఎలాంటి ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత లేవు.సంఘటిత రంగంలో అవకాశాలు దక్కకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే కార్మికులు అసంఘటిత రంగం వైపు మళ్లుతున్నారని, విపరీతమైన శ్రమదోపిడీకి గురవుతున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) గత ఏడాది విడుదల చేసిన నివేదికలో తెలిపింది. పలు ఆఫ్రికా దేశాలు, భారత్ సహా దక్షిణాసియా దేశాలలో అసంఘటిత కార్మికులు 75 శాతానికి పైగానే ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. భారత్లోని మొత్తం కార్మికుల్లో అసంఘటిత రంగంలో పనిచేసేవారు 83 శాతంగా ఉన్నారు. ‘కోవిడ్’కు ముందు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ యువత 22.2 శాతం ఉంటే, ‘కోవిడ్’ తర్వాత 23.5 శాతానికి పెరిగారు.వీరెవరూ చదువు కొనసాగించడమో, నైపుణ్యం పెంచుకోవడానికి శిక్షణ పొందడమో చేయడం లేదు. చిన్నా చితకా పనులు కూడా చేయడం లేదు. ఇలా పూర్తిగా ఖాళీగా ఉన్న యువత సంఖ్య ‘కోవిడ్’ తర్వాత 28.90 కోట్లకు చేరుకుంది. పనిచేసే వయసులో ఉన్న యువత ఇలా ఖాళీగా ఉండటం వల్ల ప్రపంచ ఆర్థికరంగానికి తీరని నష్టం వాటిల్లుతోంది. ‘కోవిడ్’కు ముందు మన దేశంలో 7.22 శాతం ఉన్న నిరుద్యోగం, లాక్డౌన్ ప్రకటించిన నెల్లాళ్లకే 23.52 శాతానికి చేరుకుంది. ‘కోవిడ్’ పరిస్థితులు చక్కబడటంతో లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులు తిరిగి యథావిధిగా పనులు ప్రారంభించడంతో గత ఏడాది చివరి నాటికి దేశంలో నిరుద్యోగం 8.7 శాతంగా నమోదైంది.కనీస వేతనాలకూ కరవు..ఏ పని దొరికితే ఆ పని చేసుకుని బతికే సాధారణ కార్మికులకు కనీస వేతనాలు దక్కే పరిస్థితులు కూడా మన దేశంలో లేవు. అట్టడుగు స్థాయి సాధారణ కార్మికులకు రోజుకు చెల్లించాల్సిన కనీస వేతనాన్ని ప్రభుత్వం 2022లో రూ.178గా నిర్ణయించింది. కనీసావసరాల ధరలు పెరిగినా, 2023లోను, 2024లోను కూడా ఈ మొత్తంలో మార్పు చేయలేదు. కనీస వేతనాల మొత్తాన్ని రోజుకు రూ.375కు పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నా, ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. స్వయంఉపాధి కార్మికులు, సంఘటిత కార్మికుల పరిస్థితులు సాధారణ కార్మికుల కంటే బాగున్నా, వారి వేతనాల్లో కూడా గడచిన రెండేళ్లల్లో పెద్దగా పెరుగుదల లేదు.‘కోవిడ్’ ముందు రోజులతో పోల్చుకుంటే, ఈ కార్మికుల ఆదాయం స్వల్పంగా తగ్గడం శోచనీయం. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’–2023 నివేదిక ప్రకారం స్వయంఉపాధి కార్మికులకు 2018–19 నాటికి నెలసరి ఆదాయం రూ.12,988గా ఉంటే, 2021–22 నాటికి ఆదాయం రూ.12,089కి పడిపోయింది. సంఘటిత కార్మికులకు 2018–19 నాటికి నెలసరి ఆదాయం రూ19,690గా ఉంటే, 2021–22 నాటికి 19,456కు పడిపోయింది. సాధారణ కార్మికుల్లో దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని కూడా ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’–2023 నివేదిక పేర్కొంది.ఇదిలా ఉంటే, సంఘటిత రంగంలో పనిచేసే వారికి సామాజిక భద్రత తగ్గినట్లు ‘పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’–2023 నివేదిక వెల్లడించింది. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, పెన్షన్, ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి ప్రయోజనాలు వంటి వాటికి అర్హతలేని సంఘటిత కార్మికులు 2017–18లో 49.6 శాతం ఉంటే, వీరి సంఖ్య 2022–23 నాటికి 53.8 శాతానికి పెరిగింది. స్వయంఉపాధి పొందుతున్న మహిళల ఆదాయం కూడా తగ్గింది. స్వయం ఉపాధి మహిళల ఆదాయం 2017–18లో నెలకు 5,995గా ఉంటే, 2022–23లో 5,337గా ఉంది. అయితే, 2017–18లో స్వయం ఉపాధి పొందే గ్రామీణ మహిళలు 55.9 శాతం ఉంటే, 2022–23 నాటికి వీరి సంఖ్య 70.1 శాతానికి పెరిగింది.ఇదేకాలంలో స్వయం ఉపాధి పొందే పట్టణ మహిళల సంఖ్య 45 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది. వీరిలో ఎక్కువమంది కుటుంబమంతా కలసి చేసే స్వయంఉపాధి వృత్తి వ్యాపారాల్లో ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా సహాయకులుగా పనిచేస్తున్నవారేనని ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’–2023 నివేదిక తేల్చింది. కార్మికుల ఉత్పాదకత 1982–2017 మధ్యకాలంలో ఆరురెట్లు పెరిగితే, వారికి వచ్చే వాస్తవ ఆదాయం ఒకటిన్నర రెట్లు మాత్రమే పెరిగిందని, అంటే, కార్మికులు తమ శ్రమకు తగిన న్యాయమైన వాటాను పొందలేకపోతున్నారని ఈ నివేదిక తెలిపింది.పేదరికం నిర్మూలనకు ప్రతిపాదనలు..కార్మికుల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి కనీస వేతన (మినిమం వేజెస్) విధానం స్థానంలో జీవన వేతన (లివింగ్ వేజెస్) విధానాన్ని వచ్చే ఏడాదిలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పును అమలులోకి తేవడానికి తగిన సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా ప్రభుత్వం అంతర్జాతీయ కార్మిక సంస్థను (ఐఎల్ఓ) కోరింది. ప్రస్తుతం ఉన్న కనీస వేతన విధానం ప్రకారం కార్మికులకు కేంద్ర ప్రభుత్వం రోజుకు రూ.178గా కనీస వేతనాన్ని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలు తమ తమ పరిధిలో కనీస వేతనాలను నిర్ణయించుకున్నాయి.ఉదాహరణకు బిహార్లో కనీస వేతనం రోజుకు రూ.160గా ఉంటే, ఢిల్లీలో రోజుకు రూ.423గా ఉంది. దేశంలోని దాదాపు 50 కోట్లకు పైగా ఉన్న కార్మికుల్లో 90 శాతం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారే కావడంతో, వారి పేదరికాన్ని తొలగించడానికి ప్రభుత్వం జీవన వేతన విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కనీస వేతనం అంటే, చట్టం నిర్దేశించిన అతి తక్కువ మొత్తం వేతనం. అలా కాకుండా, దేశ కాల పరిస్థితులను బట్టి సాధారణ పనిగంటల్లో పనిచేసే కార్మికులు, వారి కుటుంబాలు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించడానికి తగినట్లుగా చెల్లించే వేతనాన్ని ఐఎల్ఓ జీవన వేతనంగా నిర్వచించింది.జీవన వేతనం కార్మికులు, వారి కుటుంబాల ఆహారం, దుస్తులు, నివాసం, ఆరోగ్యం సహా ఇతర అవసరాలకు తగినట్లుగా లెక్కించడం జరుగుతుంది. జీవన వేతన విధానం అమలులోకి వచ్చినట్లయితే, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. జీవన వేతన విధానాన్ని జాతీయస్థాయిలో అమలులోకి తెస్తే, కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని, వాటిని అధిగమించుకుంటూ ఈ విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనీస వేతన విధానం స్థానంలో జీవన వేతన విధానాన్ని అమలులోకి తీసుకొస్తే, ఇది చిన్న మధ్య తరహా వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు భారం కాగలదని, ఫలితంగా వాటి ఆదాయం తగ్గడమే కాకుండా, కొన్ని సంస్థలు నష్టాల్లో పడే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అలాగే, వివిధ రాష్ట్రాలు, నగరాల్లో జీవన వ్యయంలో వ్యత్యాసాలు ఉన్నాయని, కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చేటప్పుడు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ప్రభుత్వం 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కట్టుబడిన నేపథ్యంలో 2025లోనే కనీస వేతన వి«ధానం స్థానంలో జీవన వేతన విధానాన్ని అమలులోకి తేవాలనుకుంటోంది. ప్రస్తుతం దేశ ఆర్థిక వృద్ధి రేటు 8.4 శాతం ఉండటంతో కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించడం పెద్ద సమస్య కాబోదని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తలపెట్టిన ఈ కొత్త విధానం కార్మికుల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచగలదని ఆశించవచ్చు.విద్యావంతుల్లోనే ఎక్కువ నిరుద్యోగం..ఉపాధికి సంబంధించి చాలా దేశాల్లో లేని విచిత్రమైన పరిస్థితి మన దేశంలో ఉంది. చదువులేని వారు, నామమాత్రపు చదువులు ఉన్నవారితో పోల్చుకుంటే, మన దేశంలో ఉన్నత విద్యావంతుల్లోనే నిరుద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు. నిరక్షరాస్యులు మొదలుకొని ప్రాథమిక స్థాయితోనే చదువులు ఆపేసిన వారిలో నిరుద్యోగం 1.13 శాతం వరకు ఉంటే, గ్రాడ్యుయేషన్, ఆపై స్థాయి చదువుకున్న వారిలో నిరుద్యోగం 14.70 శాతం వరకు ఉన్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), లక్నో, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ సహకారంతో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.విద్యావంతులకు తగిన ఉపాధి అవకాశాలను కల్పించడంలో మన దేశం విఫలమవుతోంది. నిరుద్యోగ సమస్య తీవ్రతను తగ్గించడానికి మన దేశం కార్మికుల కొరత ఎదుర్కొంటున్న తైవాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో కార్మిక ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. నైపుణ్యాలు లేని కార్మికులను, అరకొర నైపుణ్యాలు ఉన్న కార్మికులను ఆ దేశాలకు తరలించడానికి కుదుర్చుకున్న ఈ ఒప్పందాలపై కొన్ని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా పాలస్తీనాతో యుద్ధం సాగిస్తున్న ఇజ్రాయెల్కు మన దేశం నుంచి కార్మికులను తరలించడమంటే, వారి జీవితాలను కోరి మరీ ప్రమాదంలోకి నెడుతున్నట్లేనని, ఉపాధి కల్పనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రప్రభుత్వం కార్మికుల ప్రాణాలనే పణంగా పెడుతోందని కొందరు విశ్లేషకులు విమర్శిస్తున్నారు.గత ఏడాది మే నెలలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మన దేశం 42 వేల మంది భవన నిర్మాణ కార్మికులను, నర్సింగ్ నిపుణులను ఇజ్రాయెల్కు పంపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తైవాన్తో కూడా మన ప్రభుత్వం ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే తైవాన్ కార్మిక మంత్రి భారత్ నుంచి వచ్చేవారిలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కార్మికులకు ప్రాధాన్యమివ్వాలంటూ చేసిన వివక్షాపూరితమైన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై మీడియా దుమ్మెత్తిపోయడంతో తైవాన్ కార్మిక మంత్రి వెనక్కు తగ్గి, భారత్ నుంచి వచ్చే ఏ కార్మికులనైనా ఒకే రీతిలో చూస్తామని చెప్పారు. -
ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా.. ఒకనాడు..
శ్రీరామ పట్టాభిషేకం తర్వాత కొన్నాళ్లకు ఆంజనేయుడు రాముని వద్ద సెలవు తీసుకుని, తపస్సు చేసుకోవడానికి గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని, నిరంతరం తపస్సు కొనసాగించేవాడు. సముద్రాన్ని లంఘించి, లంకకు వెళ్లి అక్కడ సీతమ్మవారిని చూడటమే కాకుండా, రావణుడి ఆజ్ఞపై రాక్షసులు తోకకు నిప్పంటిస్తే లంకను తగులబెట్టి మరీ తిరిగి వచ్చిన వైనం సహా రామ రావణ యుద్ధంలో హనుమంతుని సాహసాలను జనాలు కథలు కథలుగా చెప్పుకొనేవారు. అయోధ్యవాసులకే కాదు, రామరాజ్యం అంతటా జనాలకు శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు కూడా ఆరాధ్యుడయ్యాడు. గంధమాదన పర్వతం మీద నిర్మించుకున్న ఆంజనేయుడి ఆశ్రమం తాపసులకు ఆశ్రయంగా ఉండేది. ఆశ్రమంలో ప్రతిరోజూ వేదపఠనం సాగేది. తాత్త్విక చర్చలు సాగుతుండేవి. ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా, ఒకనాడు ఆంజనేయుడికి శ్రీరాముడిని దర్శించుకోవాలని కోరిక పుట్టింది. వెంటనే తన ఒంటె వాహనం మీద అయోధ్య నగరానికి బయలుదేరాడు. జానకీ సమేతుడైన శ్రీరాముడిని దర్శించుకుని, పరిపరి విధాలుగా స్తుతిస్తూ ప్రణమిల్లాడు. శ్రీరాముడు ఆంజనేయుడిని ఆలింగనం చేసుకుని, ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ‘ఇక్కడి నుంచి గంధమాదనానికి వెళ్లిపోయాక చాన్నాళ్లకు వచ్చావు. నీ రాక నాకే కాదు, సీతకు కూడా ఆనందదాయకమే! నువ్వు ఉంటున్న చోటు సౌకర్యంగానే ఉందా? ఆశ్రమవాసంలో అంతా కుశలమే కదా?’ అంటూ కుశలప్రశ్నలు వేశాడు. ‘రామా! నీ దయ నిరంతరం నా మీద ఉండగా నాకు చింత ఏమిటి? క్షేమంగానే ఉన్నాను స్వామీ!’ అని బదులిచ్చాడు ఆంజనేయుడు. ‘హనుమా! సీతాన్వేషణ మొదలుకొని రావణుడితో యుద్ధం వరకు నాకు ఎన్నో రకాలుగా తోడుగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు నాకు మరొక పని చేసిపెట్టాలి’ అన్నాడు రాముడు. ‘ఆజ్ఞాపించు ప్రభూ! నీ ఆజ్ఞను నెరవేర్చడమే నా కర్తవ్యం’ చేతులు జోడించి అన్నాడు హనుమంతుడు. ‘నా అంగుళీయకాన్ని అడిగితే దానిని బ్రహ్మదేవుడికి ఇచ్చాను. లంకలో ఉన్నప్పుడు సీత ఆ ఉంగరాన్ని చూసుకుంటూ తన దుఃఖాన్ని తీర్చుకునేది. ఇప్పుడు ఆ ఉంగరం కావాలి. నువ్వు వెంటనే సత్యలోకానికి వెళ్లి, ఆ ఉంగరాన్ని తెచ్చి ఇవ్వు’ అన్నాడు రాముడు. శ్రీరాముడి మాట పూర్తికావడమే తడవుగా ఆంజనేయుడు రివ్వున ఆకాశానికి ఎగిరాడు. వాయువేగ మనోవేగాలతో నేరుగా సత్యలోకానికి చేరుకున్నాడు. సత్యలోకంలో బ్రహ్మదేవుడి కొలువు నిండుగా ఉంది. అష్టదిక్పాలకులు, సనక సనందాది మహామునులు అక్కడ ఉన్నారు. ఆంజనేయుని చూడగానే వారందరూ లేచి నమస్కరించి, అతడిని ఉచితాసనంపై కూర్చుండబెట్టారు. సభలోకి బ్రహ్మదేవుడు అడుగుపెట్టాడు. సభాసదులందరూ ఆయనకు నమస్కరించారు. ఆంజనేయుడు కూడా లేచి నిలుచుని బ్రహ్మదేవుడికి నమస్కరించాడు. ‘దేవా! మా శ్రీరామచంద్రుడు తన రత్నఖచిత కనక అంగుళీయకాన్ని నీకు ఇచ్చాడట. ఆ ముద్రికను తీసుకు రమ్మని నన్ను ఇక్కడకు పంపాడు. ఆ ముద్రికను వెంటనే ఇచ్చేస్తే, నేను దానిని తీసుకువెళ్లి నా ప్రభువుకు అందిస్తాను’ అన్నాడు. ‘ఇది సత్యలోకం. ఇక్కడ ఒకసారి ఇచ్చినది ఏదైనా తిరిగి ఇవ్వడానికి వీలుపడదు’ అని పలికాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి మాటలకు ఆంజనేయుడికి కోపం వచ్చింది. ‘బ్రహ్మదేవా! బొత్తిగా కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నావు. నాకు ఇక్కడ ఆలస్యం చేయడానికి వీలుపడదు. నువ్వు ఇవ్వకుంటే, ఈ సత్యలోకాన్నే పెళ్లగించుకుని పోయి నా ప్రభువు పాదాల ముందు ఉంచుతాను’ అంటూ తన దేహాన్ని విపరీతంగా పెంచి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సత్యలోకంలో ఉన్నవారంతా ఆంజనేయుని భీకర విశ్వరూపాన్ని చూసి హాహాకారాలు చేశారు. ఇంతలో సనక మహర్షి కల్పించుకుని, ‘బ్రహ్మదేవా! రామదూత ఆంజనేయుడి బలవిజృంభణను చూశావు కదా! పరిస్థితి అదుపు తప్పక ముందే ఆ ముద్రికను అతడికి ఇచ్చి పంపడమే మంచిది’ అని పలికాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పక్కనే తామరలతో నిండి ఉన్న కొలనను చూపించి, ‘ఆ ముద్రిక అందులోనే ఉంది. తీసుకువెళ్లు’ అన్నాడు. హనుమంతుడు కొలనులోకి చూస్తే, నీటి అడుగున అసంఖ్యాకంగా రామ ముద్రికలు కనిపించాయి. అన్నిటినీ తీసుకువెళ్లడానికి రామాజ్ఞ లేదు. ఏం చేయాలో తోచక ఆంజనేయుడు రిక్తహస్తాలతోనే అయోధ్యకు చేరుకుని, రాముడికి జరిగిన సంగతంతా చెప్పాడు. ‘హనుమా! ఆ సరస్సున ఉన్నవి నా అంగుళీయకానికి బింబ ప్రతిబింబాలే! వాటి మహిమతోనే బ్రహ్మదేవుడు సత్యలోకాన్ని సకలలోక సమ్మతంగా పరిపాలిస్తున్నాడు. వాటిలో ఒకటి తీసుకురా’ అని చెప్పాడు. హనుమంతుడు వెంటనే మళ్లీ సత్యలోకానికి వెళ్లి సరస్సులో ఉన్న ముద్రికల్లో ఒకదానికి తీసుకువచ్చి, రాముడికి అందజేశాడు. రాముడు సంతోషించి, ‘హనుమా! భవిష్యత్తులో నువ్వే సత్యలోకాధిపత్యం పొంది భవిష్యద్బ్రహ్మవై వర్ధిల్లగలవు’ అని ఆశీర్వదించాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: బౌద్ధవాణి: నిద్రకు దూరం చేసే పనులు.. -
సెలబ్రిటీ శారీ డ్రేపర్: ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా..!
సెలబ్రిటీలకు స్టయిల్ని అద్ది.. వాళ్లను ఫ్యాషన్ స్టార్స్గా తీర్చిదిద్దే స్టయిలిస్ట్లు ఉంటారు. ముఖ్యంగా చీర కట్టు అనేది ఎప్పటికీ స్పెషల్. దీన్ని ప్రోషెషన్గా ఎంచుకుని సినీ సెలబ్రిటీలకు కట్టే స్థాయికి వెళ్లింది స్టార్ స్టయిలిస్ట్ డాలీ జైన్. ఆమె ఎలా శారీ డ్రేపర్గా మారిందో తెలుసుకుందామా..! ‘ఆరు గజాల ప్రతి చీరా నాకు 360 రకాల కట్టుతీరుల్ని, కుచ్చిళ్లను పరిచయం చేస్తున్నట్టనిపిస్తుంది’ అంటుందీ చీరకట్టు స్పెషలిస్ట్. దీపికా పదుకోణ్, ఆలియా భట్, ప్రియంకా చోప్రా, కరిష్మా కపూర్, సోనమ్ కపూర్, నీతా అంబానీ, ఈషా అంబానీ, శ్లోకా అంబానీ, రవీనా టండన్ వంటి సెలబ్రిటీలందరూ ఏ చిన్న ఫంక్షన్కి అటెండ్ కావాలన్నా డాలీ జైన్కి కబురు పెడతారు. ఆమె చేత చీర కట్టించుకుంటారు. అంతలా చీరకట్టును ఓ ప్రొఫెషన్ స్థాయికి తీసుకెళ్లిన డాలీ.. పెళ్లయిన కొత్తలో చీరంటే యమ చిరాకు పడేదట. బెంగళూరులో పుట్టిపెరిగిన ఆమె పెళ్లయ్యే వరకు జీన్స్.. టీ షర్ట్స్, కుర్తీలే ధరించేది. కానీ అత్తారింట్లో క్యాజువల్ వేర్ నుంచి అకేషనల్ వేర్ దాకా అన్నిటికీ చీరే మస్ట్ అని ఆమె సాసుమా ఆర్డర్ పాస్ చేశారు. తప్పక చీరకట్టుతో కుస్తీపట్టడం మొదలుపెట్టింది డాలీ. రోజూ ముప్పావు గంట పట్టేదట చీర కట్టుకునేసరికి. ఇప్పుడు రికార్డ్ రేంజ్లో 18.5 సెకన్లలో కట్టేస్తుంది.. కట్టిస్తుంది. ప్రొఫెషన్గా ఎలా మారింది? కారణం సినీతార శ్రీదేవే అనే ఆన్సర్ ఇస్తుంది డాలీ. చీరే కట్టుకోవాలి అని రూల్ పెట్టిన అత్తగారు.. కోడలు పడుతున్న అవస్థ చూసి జాలిపడి ‘కుర్తీలు వేసుకో’ అంటూ నియమాన్ని సడలించింది. అయితే అప్పటికే డాలీకి చీర మీద మోజు మొదలైంది. సో.. చీరనే కంటిన్యూ చేసింది. ఇంట్లో.. ఇరుగుపొరుగు.. బంధువుల్లో ఏ శుభకార్యం జరిగినా చీరకట్టడంలో అతివలకు సాయపడటమూ స్టార్ట్ చేసింది. అలాంటి ఒక సందర్భంలో ఆమె మేనమామ ఒక పార్టీ ఇచ్చాడు. అతను సినీతార శ్రీదేవి ఉండే అపార్ట్మెంట్లోనే ఉండేవాడట. అందుకని శ్రీదేవినీ ఆహ్వానించాడు. డాలీ కూడా వెళ్లింది. పార్టీలో శ్రీదేవి చీర మీద జ్యూస్ ఒలికిందట. ఆమె ఇబ్బందిపడుతుంటే డాలీ చొరవ తీసుకుని గబగబా మేనమామ భార్య చీరొకటి తెచ్చి.. శ్రీదేవికి ఇచ్చిందట. అంతేకాదు ఆమె చీరకట్టుకుంటూంటే.. కుచ్చిళ్లు పెట్టడంలో.. పల్లూ సెట్ చేయడంలో సహాయపడిందట కూడా. డాలీ చీరకట్టే నేర్పరితనానికి శ్రీదేవి అబ్బురపడుతూ ‘ఇన్నేళ్లుగా చీర కట్టుకుంటున్నాను.. ఇంతబాగా కుదిరిందిలేదెప్పుడూ! దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకోవచ్చుగా?’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిందట. ఆలస్యం లేకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇదిగో ఇలా ఫేమస్ అయింది డాలీ. వందల్లోంచి లక్షల్లోకి... దాదాపు 20 ఏళ్లుగా శారీ డ్రేపర్ ప్రొఫెషన్లో కొనసాగుతూన్న డాలీ జైన్.. తొలి పారితోషికం రూ. 250. ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు చార్జ్ చేస్తుంది. ఆమె దగ్గర 20 మంది సభ్యులతో కూడిన టీమ్ ఉంటుంది. చీరనే కాదు.. హాఫ్ శారీ, దుపట్టా.. ఇలా అన్నిటినీ సెట్ చేస్తుంది. ఈ స్టయిలింగ్లో ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీలేం లేవు ఆమెకు. కేవలం చీర కట్టు మీద తనకున్న మమకారం.. సృజనతోనే ఈ స్థాయికి ఎదిగింది. తనలాంటి గృహిణులు ఎందరికో స్ఫూర్తిని పంచుతోంది. బాలీవుడ్లోకి ఎంట్రీ? డాలీ జైన్ టాలెంట్ ఫ్యాషన్ డిజైన్ సందీప్ ఖోస్లా దృష్టిలో పడింది. నీతా అంబానీ 50 వ పుట్టిన రోజు ఫంక్షన్లో ఆమెకు చీర కట్టేందుకు డాలీని రికమెండ్ చేశాడు అతను. ఆ వేడుకలో మరెందరో సెలబ్రిటీల దృష్టిలోపడి బాలీవుడ్ ప్రవేశాన్ని సాధించింది. ఆమె ఫస్ట్ బాలీవుడ్ సెలబ్రిటీ వేడుక.. సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ వెడ్డింగ్. అక్కణ్ణించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఎందరికో డాలీ ఫేవరేట్ శారీ డ్రేపర్ అయిపోయింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ అరుదైన పురస్కారం
మండుటెండను లెక్కచేయని అభిమానం...!
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
Actor Nani HD Stills: వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement