-
తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న(శుక్రవారం) 71,510 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 43,199 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా లెక్క తేలింది.నేడు ఆగష్టు కోటా టికెట్లుతిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల.సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ సేవా టికెట్లు మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.టికెట్లు పొందిన వారు మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.మే 17 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను విడుదల.మే 21న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల.మే 23న అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ టికడట్లు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల.మే 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలమే 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచన. -
మిస్ టీన్ గ్లోబల్ ఇండియా విజేత సంజన
చంద్రగిరి (తిరుపతి జిల్లా): జైపూర్లో స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్కి చెందిన ది పేజెంట్ స్టార్ మిస్ టీన్ ఇండియా నిర్వహించిన ఈవెంట్ మిస్ టీన్ గ్లోబల్ ఇండియా–2024 టైటిల్ను చంద్రగిరికి చెందిన ఆలత్తూరు పావని, సుబ్రమణ్యం కుమార్తె సంజన వరద(18) గెలుచుకున్నారు. ఈ నెల 7–12 వరకు మలేసియాలోని కౌలాలంపూర్లో జరిగిన మిస్ టీన్ గ్లోబల్–2024 పోటీలో భారత్కు సంజన వరద ప్రాతినిథ్యం వహించింది.ఈ పోటీల్లో ఆమె 1వ రన్నరప్గా నిలిచింది. సంజన బెంగళూరులో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతూ గతంలో జాతీయస్థాయిలో అవార్డును గెలుచుకుంది. ఈ ప్రతిష్టాత్మక విజయంతోపాటు, సంజన వరద సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ అవార్డు, పాపులర్ అవార్డును కూడా అందుకుంది. ఇంకా ఆమె తన పిత్తా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం చేయడంలో చేసిన కృషికి అత్యుత్తమమైన దాతృత్వ అవార్డుతో గ్లోబల్ సంస్థ సత్కరించింది. అంతర్జాతీయ స్థాయిలో మిస్ ఇండియా కీరీటాన్ని సాధించడమే తన ధ్యేయమని, దానికోసమే కష్టపడతానని స్టార్ మిస్ టీన్ ఇండియా గ్రహీత సంజన వరద అన్నారు. -
ఐకేఎస్తో వేదిక్ వర్సిటీ ఒప్పందం
తిరుపతి సిటీ: కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన భారతీయ జ్ఞానపరంపర విభాగం (ఐకేఎస్)తో తిరుపతి ఎస్వీ వేదిక్ వర్సిటీ ‘వైదిక వాజ్ఞ్మయ వ్యాసాల ప్రచురణ, తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్’పై శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా వేదిక్ వర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ వైదిక వాజ్ఞ్మయ వ్యాసాలను అధిక సంఖ్యలో ప్రచురించేందుకు వీలుగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రాచీన తాళపత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ చేసి ప్రచురించేందుకు మరో ఒప్పందం కుదిరిందని వివరించారు. అనంతరం జ్ఞానపరంపర విభాగ జాతీయ సమన్వయకర్త ప్రొఫెసర్ జి.సూర్యనారాయణమూర్తితో ఎంఓయూ మార్చుకున్నారు. రిజిస్ట్రార్ రాధాగోవింద త్రిపాఠి, ఆచార్య గోలి సుబ్రమణ్యశర్మ, ప్రొఫెసర్లు రాధేశ్యామ్, పవన్కుమార్, ఫైనాన్స్ ఆఫీసర్ అంజిరెడ్డి పాల్గొన్నారు. -
● తాతయ్యగుంట గంగమ్మకు తోటివేషాలతో మొక్కులు ● అమ్మవారికి సేవకు పోటెత్తిన భక్తులు
అమ్మా.. గంగమ్మ తల్లీ.. చల్లంగా చూడు అంటూ భక్తులు ప్రార్థించారు. జాతరలో భాగంగా మూడోరోజు శుక్రవారం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దర్శనానికి పోటెత్తారు. తోటి వేషాలు ధరించి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయ ఆవరణలో పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని సేవించుకుని తన్మయత్వం చెందారు. ఈ క్రమంలో నాలుగోరోజు శనివారం కై కాల, రజక కులస్తులు అనువంశిక వేషాలతో పురవీధుల్లో సంచరిస్తూ పూజలందుకోనున్నారు. అనంతరం గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. – తిరుపతి కల్చరల్ -
నమ్మొద్దు.. మోసపోవద్దు!
● ముందస్తు అడ్మిషన్లతో జాగ్రత్త ● ఆకట్టుకునే ప్రచారాలు నమ్మి మోసపోకండి ● పాఠశాలల గురించి తెలుసుకున్నాకే పిల్లలను చేర్పించాలి ● రిజిస్ట్రేషన్, రికగ్నైజేషన్పై ఆరా తీయండి ● క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారా... పరిశీలించండి ● ఆ తర్వాతే పిల్లలను చేర్పించండి క్వాలిఫైడ్ టీచర్లేనా? జిల్లాలో పలు ప్రైవేటు విద్యాసంస్థలలో క్వాలిఫైడ్ అధ్యాపకులు లేకుండా నడుస్తున్నాయి. 10వ తరగతి, ఇంటర్ చదివే విద్యార్థులకు సైతం డిగ్రీ, ఇంటర్ చదివిన వారే అధ్యాపకులుగా బోధిస్తున్నారు. దీంతో విద్యార్థులకు ప్రాక్టికల్గా సబ్జెక్ట్ మీద పట్టు దొరకడం లేదు. కేవలం బట్టి ప్రక్రియతో విద్యార్థులను రాత్రి, పగలు హింసించి పరీక్షలు రాయిస్తున్నారు. దీంతో పరీక్షలలో మంచి మార్కులు సాధించిన పోటీపరీక్షలలో చతికలపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలకు బీఈడీ, జూనియర్ కళాశాలకు పీజీ, స్లెట్, నెట్ స్థాయి అధ్యాపకులు ఉండాలి. కొన్ని విద్యాసంస్థలు నిబంధనలు పూర్తిగా పాటించడం లేదు. తల్లిదండ్రులు పిల్లలకు అడ్మిషన్లు తీసుకునే సమయంలో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాతే అడ్మిషన్లు పొందాలి. లేకుంటే విద్యార్థుల జీవితం అయోమయంలో పడ్డట్టే. తిరుపతి సిటీ: జిల్లా కేంద్రంతో పాటు వివిధ పట్టణాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు అడ్మిషన్ల హడావుడి మొదలైంది. విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే గత రెండు నెలల నుంచి జిల్లాలోని సీబీఎస్ఈ, సాధారణ పాఠశాలల్లో అడ్మిషన్ల కోలాహలం నడుస్తోంది. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్క్లాస్ ప్రవేశాలకు ప్రైవేటు యాజమాన్యాలు గాలం వేసేందుకు ఆకట్టుకునే ప్రచారాలను ముమ్మరం చేశాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటా ప్రచారం ముమ్మరం చేశాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాలలో టాలెంట్, కాన్సెఫ్ట్, ఇంటర్నేషనల్, టెక్నో, ఒలంపియాడ్, ఐఐటీ, నీట్ వంటి ట్యాగ్లైన్లతో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. వీటిలో కొన్ని విద్యాసంస్థలకు మాత్రమే ప్రభుత్వ అనుమతులు ఉండగా, మరికొన్నిటికి పూర్తిగా అనుమతులే లేవు. ఇంకొన్ని పాఠశాలలు, కళాశాలలు బ్రాంచీల పేరుతో నడుపుతున్నారు. ఆ ప్రచారాలను నమ్మొద్దు విద్యాసంస్థల నిర్వాహకులు ఆడ్మిషన్లు పెంచుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకునేలా సరికొత్త ప్రచారాలతో గాల వేయడానికి ప్రయత్నిస్తుంటారు. తమ విద్యాసంస్థలో ఇటీవల విడుదల చేసిన ఫలితాలలో టాప్ ర్యాంకులు వచ్చాయని ఊదరగొడుతుంటారు. అడ్మిషన్ల సమయంలో టెస్ట్లు పెడుతూ వచ్చిన మార్కుల ఆధారంగా డొనేషన్లలో డిస్కౌంట్ అంటూ వ్యాపార ప్రకటనలు చేస్తుంటారు. పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, అధునాత భవనాలు, టాయ్లెట్లు, ప్లేగ్రౌండ్, డిజిటల్ క్లాస్రూమ్స్, ప్రాథమిక స్థాయ నుంచే టోఫెల్, ఐఐటీ, నీట్, టెక్నో, ఐఏఎస్ శిక్షణ ఇస్తామంటూ తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయాలలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. స్వయంగా విద్యాసంస్థను పరిశీలించాలి. క్రీడామైదానాలు లేని, అపార్ట్మెంట్ భవనాలలో, ఇరుకు సందులలో ఉండే విద్యాసంస్థలలో పిల్లలను చేర్చకుండా ఉంటే మంచిది. విద్యార్థులు శారీరకంగా, మానసింగా ఉల్లాసంగా ఉండాలంటే క్రీడలు ఎంతగానో తొడ్పడతాయి. ఇరుకు గదులు, సందులలో ఉండే పాఠశాలల్లో ప్రమాదాలు జరిగితే భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. అగ్నిమాపక శాఖ అనుమతి కూడా ప్రతి విద్యాసంస్థ కలిగి ఉండాలి.ప్రతి విద్యాసంస్థ ప్రభుత్వ నుంచి కచ్చితంగా రికగ్నైజేషన్ పొంది ఉండాలి. ఇది నిబంధన. అయితే చాలా విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే రిజిస్టర్డ్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ విద్యాశాఖ నుంచి రికగ్నైజేషన్ తీసుకోవడం తప్పనిసరి. రికగ్నైజేషన్ పొందిన విద్యాసంస్థలలోనే తల్లిదండ్రులు పిల్లలను చేర్పించాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యాసంస్థల తరఫున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే పరిగణిస్తుంది. మరికొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు బ్రాంచీల పేరుతో పాఠశాలలను, కళాశాలలను నడుపుతూ ఎక్కడో ఉన్న మెయిన్ బ్రాంచ్ ద్వారా పరీక్షలు రాయిస్తుంటాయి. ఇలాంటి విషయాయలలో తల్లిదండ్రులు కచ్చితంగా విద్యాసంస్థ అనుమతి పత్రాలను అడిగి తెలుసుకోవాలి. రిజిస్ట్రేషన్తో పాటు రికగ్నైజేషన్ పొందిన పత్రాలను అన్ని విద్యాసంస్థలు నోటీసు బోర్డులో ఉంచాలనే నిబంధన ఉంది.వీటిపై ఆరా తీయ్యండి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు జిల్లాలో ప్రతి ప్రైవేటు విద్యాసంస్థ ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. విద్యార్థులకు పాఠశాలల్లో క్రీడా మైదానంతో పాటు అన్ని వసతులు పక్కాగా ఉండాలి. లేకుంటే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తాం. అదేవిధంగా విద్యాసంస్థ పక్కాగా రిజిస్ట్రేషన్తో పాటు ప్రభుత్వ రికగ్నైజేషన్ తప్పక పొంది ఉండాలి. రిజిస్ట్రషన్ మాత్రమే కలిగి ఉంటే సరిపోదు. తల్లిదండ్రులు ప్రైవేటు సంస్థల ఆకట్టుకునే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. –డాక్టర్ వీ.శేఖర్, జిల్లా విద్యాశాఖాధికారి, తిరుపతి జిల్లా -
స్ట్రాంగ్ భద్రత
● పకడ్బందీగా బందోబస్తు ● నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిఘా ● కౌంటింగ్ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ కొనసాగింపుతిరుపతి సిటీ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్కు మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ తెలిపారు. శుక్రవారం పద్మావతి మహిళా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. ఆయన మాట్డాఉతూ భద్రతలో భాగంగా మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, రెండో అంచెలో ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్, మూడో అంచెలో స్థానిక పోలీసులు 24గంటల పాటు విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద అమర్చిన సీసీ కెమెరాల పర్యవేక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు ఆదితీ సింగ్, నిషాంత్రెడ్డి, నరసింహులు, అదనపు ఎస్పీ కులశేఖర్, డీఆర్ఓ పెంచలయ్య పాల్గొన్నారు. కౌంటిగ్ కేంద్రానికి కట్టుదిట్టంగా.. తిరుపతి అర్బన్ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు కట్టదిట్టమైన భద్రత కల్పించాలని, హింసాత్మక చర్యలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనా ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి రాష్ట్ర సీఎస్ జవహార్రెడ్డితో కలసి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. తిరుపతి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవాని సూచించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ కొనసాగించాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత, ప్రధాన ద్వారం వద్ద చెకింగ్ అమలు చేయాలని చెప్పారు. దీనిపై కలెక్టర్ ప్రవీణ్కుమార్ స్పందిస్తూ కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత కల్పించినట్లు చెప్పారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ వద్ద అదనపు పోలీస్ బలగాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాన్ఫరెన్స్లో ఏఎస్పీ శ్రీనివాస రావు, డీఆర్ఓ పెంచల కిషోర్ పాల్గొన్నారు. -
మొదటి ఘాట్లో ప్రమాదాలు
తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శుక్రవారం పలు ప్రమాదాలు జరిగాయి. వివరాలు.. తమిళనాడుకు చెందిన భక్తులు మినీవ్యాన్లో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో కిందకు దిగుతుండగా మాల్వాడిగుండం సమీపంలో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వ్యాన్లోని కొందరు భక్తులకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వ్యాన్ను పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఈ ప్రమాద సమయంలో అటుగా వస్తున్న టీటీడీ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. అలాగే ఘాట్ 19వ మలుపు వద్ద తమిళనాడుకు చెందిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలోనే టీటీడీ వాటర్ ట్యాంకు కూడా డివైడర్ను ఢీకొంది. -
వరసిద్ధుని సేవలో కలెక్టర్
కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామివారిని కలెక్టర్ ప్రవీణ్కుమార్ కుటుంబ సమేతంగా శుక్రవారం సేవించుకున్నారు. ఆలయం వద్ద అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆలయ మర్యాద చేశారు. స్వామి చిత్రపటం, ప్రసాదం అందించి కలెక్టర్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు కోదండపాణి, బాబు పాల్గొన్నారు. పెంచలకోనకు ప్రత్యేక బస్సులు రాపూరు: మండలంలోనిపెంచలకోన బ్రహ్మోత్సవాలకు 120 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రాపూరు ఆర్టీసీ డిపో మేనేజర్ అనిల్కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తిరుపతి, నెల్లూరు, గూడూరు, రాపూరు, వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి, వాకాడు, కావలి, వెంకటగిరి, గూడూరు, వైఎస్సార్ జిల్లా కడప, మైదుకూరు, రాజంపేట, బద్వేల్ నుంచి ప్రత్యేక బస్సులను శనివారం నుంచి నడపనున్నట్లు వివరించారు. 22న నృసింహ జయంతి, 23న శ్రీవారి కల్యాణం నేపథ్యంలో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశముందని, ఆ మేరకు బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అన్ని బస్సుల్లో మామూలు చార్జీలనే వసూలు చేయనున్నట్లు తెలిపారు. 27 నుంచి కల్యాణ వేంకటేశ్వరుని వసంతోత్సవాలు తిరుపతి(అలిపిరి): శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలను ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారీ సమేతంగా వసంతోత్సవంలో పాల్గొననున్న ట్లు వెల్లడించారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు, సీతాలక్ష్మణ హనుమ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించనున్నట్లు వివరించారు. సేవలో పాల్గొనేందుకు దంపతులు రూ.516 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈక్రమంలోనే ఆర్జితసేవలను రద్దుచేసినట్లు వెల్లడించారు. -
ఫలితాలను శాసించే పోలింగ్!
90శాతానికి పైగా ఓట్లు పోలైన కేంద్రాలు (అసెంబ్లీ) తిరుపతి అర్బన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన పూర్తి అయినప్పటికి విజయావకాశాలపై జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ చర్చ సాగుతోంది. జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు 78.63 శాతం, తిరుపతి పార్లమెంట్కు 79.10 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వ తేదీన తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టనున్నారు. ఈ క్రమంలో అంతా ఏ ఊరుల్లో....ఏ బూత్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి. ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అనే అంశాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 90శాతానికి పైగా 319 బూత్లలో పోలింగ్ నమోదైంది. వెయ్యికి పైగా ఓట్లు 94 బూత్లలో పడ్డాయి. అత్యధికంగా తొట్టంబేడు మండలం పెన్నలపాడులో 96.73శాతం, ఏర్పేడు మండలం వికృతమాలలో 96.12శాతం, శ్రీనివాసపురంలో 95.04శాతం, రేణిగుంట మండలం అల్లికేశంలో 95.65శాతం, శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో 94.98శాతం ఓట్లు పోల్ అయ్యాయి. ఈ పోలింగ్ కేంద్రాలే అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపనున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. అలాగే మెజారిటీల్లోనూ కీలకంగా మారనున్నట్లు వివరిస్తున్నారు. ఈ క్రమమంలోనే తిరుపతి పార్లమెంట్ స్థానానికి సంబంధించి 322 పోలింగ్ బూత్లలో అధికశాతం ఓటింగ్ నమోదుకావడం గమనార్హం. ● సత్యవేడు నియోజకవర్గం కంచనపుత్తూరులో 1,011 ఓట్లు, చిల్లమత్తూరు– 1,053, వెరికింబట్టు ఎస్సీకాలనీ– 1022, నాగలాపురం–1,010, కన్నవరం–1,041, కళత్తూరు ఎస్సీకాలనీ–1,060 ఓట్లు నమోదయ్యాయి. ● శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీవీపురం బూత్లో 1,047ఓట్లు, అన్నాసంపల్లె–1,214, కరకంబాడి–1,076, తారకరామానగర్–1,106, ఆర్.మల్లవరం–1లో1,072, ఆర్,మల్లవరం–2లో 1,010, తూకివాకం–1,110, ఎర్రమరెడ్డిపాళెం–1,086, శ్రీకాళహస్తి పట్టణంలోని 20 బూత్ల్లో అధికశాతం ఓటింగ్ నమోదైంది. ● వెంకటగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లెలో 1,011, పెరమకొండ–1,012 ఓట్లు, జిలకపాడు–1,066 , మార్లపూడి–1,042, అనంతమడుగు– 1,055 తదితర 12 బూత్ల్లో అధికశాతం ఓట్లు పోలయ్యాయి. ● సూళ్లూరుపేట నియోజకవర్గంలోఃని పుణ్యేపల్లెలో 1,000 ఓట్లు, బిరదవాడ– 1,000, పుద్దేరు–1,068, కల్లూరు–1,025 మరో 10 బూత్ల్లో వెయ్యి ఓట్లు దాటాయి. ● గూడూరు నియోజకవర్గంలోని రామలింగాపురంలో 1,024 ఓట్లు, పోట్టుపాళెం–1,035, మేకనూరు–1,068, తిక్కవరం–1,061, తదితర 14 బూత్ల్లో వెయ్యికి పైగా ఓట్లు నమోదయ్యాయి. ● చంద్రగిరి నియోజకవర్గంలోని భాకరాపేట బూత్లో 1,032 ఓట్లు, గుండ్లగుట్టపల్లె–1,195 ఓట్లు, వల్లివేడు–1,038, కుక్కలపాళెం ఎస్సీకాలనీ– 1,141 , ఓట్లవారిపాళెం ఎస్సీకాలనీ–1,030 ఓట్లు, ఇరంగారిపల్లె–1,223, గానుగపెంట–1,128 తదితర 19 పోలింగ్ బూత్లలో వెయ్యికిపైగా ఓట్లు నమోదయ్యాయి. జిల్లాలో 319 బూత్లలో అధికశాతం ఓటింగ్ అభ్యర్థుల భవితవ్యం తేల్చడంలో ఇవే కీలకం గెలుపోటములను నిర్దేశించేవి ఈ కేంద్రాలే..సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక కౌంటింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలింది.. ఈ సమయంలో అభ్యర్థుల జయాపజయాలపై ముమ్మరంగా చర్చ సాగుతోంది.. ఓటింగ్ శాతం అధికంగా నమోదైన బూత్లపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.. ఫలితాలను శాసించనున్న ఆయా కేంద్రాలు ఎవరికి అనుకూలంగా ఓట్లు పడ్డాయో అనే విషయం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. జిల్లాలో 90శాతానికి పైగా పోలింగ్ జరిగిన 319 సెంటర్లే అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశముంది. నియోజకవర్గం పోలింగ్ బూత్లు శ్రీకాళహస్తి 81 సత్యవేడు 67 వెంకటగిరి 28 చంద్రగిరి 46 గూడూరు 39 సూళ్లూరుపేట 58 తిరుపతి లేవు మొత్తం 319 జిల్లాలో వెయ్యి ఓట్లకు పైగా పోలైన కేంద్రాలు నియోజకవర్గం పోలింగ్ బూత్లు శ్రీకాళహస్తి 20 సత్యవేడు 06 వెంకటగిరి 12 చంద్రగిరి 19 గూడూరు 14 సూళ్లూరుపేట 10 తిరుపతి లేవు మొత్తం 81 -
బోయకొండ గంగమ్మా..పాహిమాం
చౌడేపల్లె: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీబోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం రాహుకాల అభిషేక పూజలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. గంగమ్మ తల్లీ శరణు అంటూ పూజల్లో పాల్గొన్నారు. వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి, ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుంచి 12 గంటల మధ్యలో రాహుకాల సమయంలో అమ్మవారికి అభిషేక పూజలు చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహిళలు ఉపవాస దీక్షలతో పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అన్నప్రసాదాల పంపిణీ ఆలయం వద్ద భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్, ఈఓ పర్యవేక్షణలో సుమారు 2 వేల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం బోయకొండ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొన్న చోట జరుగుతున్న మరమ్మతు పనులను ఈఓ, చైర్మన్ పరిశీలించి తగు సూచనలు చేశారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
చంద్రగిరి : మండలంలోని కోనంగివారిపల్లె సమీపంలో ఓ పాడుబడిన ఫ్యాక్టరీ వెనుక గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు శుక్రవారం స్థానికులు గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. గుర్తుతెలియన వ్యక్తికి సుమారు 45 నుంచి 50 ఏళ్లు ఉంటాయని, మృతి చెంది మూడు రోజులై ఉంటుందని వెల్లడించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించినట్లు వివరించారు. -
పక్కాగా ‘విద్యాహక్కు’
తిరుపతి ఎడ్యుకేషన్ : ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం సెక్షన్ 12(1) (సి) ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25శాతం మంది విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్లు ఇవ్వాలి. దీనికి అనుగుణంగా ప్రభుత్వం 2024–25వ విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జిల్లాలోని 34మండలాలకు గాను 31మండలాల నుంచి 1,407మంది పేద విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో నిబంధనలకు లోబడి ఉన్న 1,024మంది దరఖాస్తులను పరిగణలోకి తీసుకుని అందులో 827మందిని ఎంపిక చేస్తూ విద్యాశాఖ మొదటి విడత జాబితాను విడుదల చేసింది. జిల్లాలో ఎంపిక ఇలా.. విద్యాహక్కు చట్టం ప్రకారం సీఎస్ఈ వెబ్ పోర్టల్లో జిల్లాలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్లు అమలుచేస్తున్న జిల్లాలోని 402 ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నాయి. అనంతరం ఆయా పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకటో తరగతిలో ప్రవేశాలకు 25శాతం సీట్లను కేటాయించాలి. అందులో భాగంగానే విడుదల చేసిన తొలి విడత జాబితాలో 827మంది విద్యార్థులు సీట్లు పొందనున్నారు. 20లోపు అడ్మిషన్లు పొందాలి విద్యాశాఖ విడుదల చేసిన జాబితా మేరకు జిల్లాలోని ఎంపిక చేసిన 827మంది విద్యార్థుల్లో ఇప్పటికే 600మందికి పైగా అడ్మిషన్లు పొందారు. మిగిలిన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు ఎంపికై న పాఠశాలలకు వెళ్లి సంబంధిత ధ్రువీకరణపత్రాలను సమర్పించి అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది. పేద పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ విద్య జిల్లాలో 827 మంది విద్యార్థులు ఎంపిక ఈ నెల 20లోపు అడ్మిషన్లు తొలి జాబితా విడుదల చేసిన విద్యాశాఖ బడి ఈడు పిల్లలందరూ పాఠశాలలో ఉండాలని విద్యా హక్కు చట్టం చెబుతోంది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు చేపట్టింది. పేద పిల్లలకు సైతం కార్పొరేట్ విద్యనందించేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది జిల్లా నుంచి 827మందిని తొలి జాబితాలో ఎంపిక చేసింది. సద్వినియోగం చేసుకోండి ఉచిత విద్యాహక్కు చట్టం మేరకు పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటికే తొలివిడత జాబితాలో 827మంది లబ్ధి పొందగా, వారిలో 600కుపైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మిగిలిన వారు ఈ నెల 20వ తేదీలోపు ఎంపికై న ఆయా పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్లు పొందాలి. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని పేద విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి. – శేఖర్, డీఈఓ, తిరుపతి -
విమానంలో విహారయాత్రకు విద్యాకుసుమాలు
సత్యవేడు: మాధనసాళెం జెడ్పీఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధిస్తే విమానంలో విహాయ యాత్రకు పంపుతానని సురుటుపల్లె ఆలయ కమిటీ సభ్యుడు ఉమాపతి ప్రకటించిన విషయం విధితమే. అందులో భాగంగా విద్యార్థులు పురుషోత్తం(552), వి. విష్ణు( 515),మహా(509), తనూజ(505)తోపాటు ప్రధానోపాధ్యాయుడు మునిమోహన్ను శుక్రవారం చైన్నె నుంచి హైదరాబాద్కు విమానంలో పంపించారు. టికెట్లతోపాటు విద్యార్థుల రెండు రోజుల విహార యాత్రకు అయ్యే మొత్తం ఖర్చును ఉమాపతే భరిస్తున్నారు. ఈ మేరకు ఉమాపతిని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. ఆముదాలకోనలో ఒంటరి ఏనుగు! ● అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక చంద్రగిరి : మండలంలోని ఆముదాల కోన వద్ద అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు సంచరిస్తున్నట్లు పనపాకం రేంజ్ డీఆర్ఓ చిన్నబాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం అటవీప్రాంతంలో ఆయన పర్యటించి ఏనుగు కాలి గుర్తులను పసిగట్టారు. గతంలో తవణంపల్లె, పాకాల వద్ద ఇద్దరిని హతమార్చింది ఈ ఏనుగే అని గుర్తించామని డీఆర్ఓ వెల్లడించారు. ఈ మేరకు ఆముదాల కోన ఎస్టీ కాలనీ, కల్రోడ్డుపల్లె, మిట్టూరు, కాశిపెంట్ల, కొత్త ఇండ్లు ప్రజలకు తీసుకోవాల్సిన అవగాహన కల్పించారు. -
సప్తగిరి.. భక్తఝురి
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోవడంతో భక్తుల క్యూ శిలాతోరణం వరకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 76,369 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 41,927 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.63 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలో శుక్రవారం భా రీగా వర్షం కురవడంతో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మాడవీధులు జలమయమయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నాటుబాంబు పేలి పెంపుడు కుక్కకు గాయాలు చౌడేపల్లె: దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లె సమీపంలో శుక్రవారం నాటుబాంబు పేలి పెంపుడు కుక్కకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రైతు చెంగారెడ్డి పెంపుడుకుక్కను పెంచు కుంటున్నాడు. శుక్రవారం ఇంటికి సమీపంలో ఉన్న ఒక రైతు మామిడితోటలోకి కుక్క వెళ్లింది. కొద్దిసేపటికి పెద్ద పేలుడు శబ్దం వచ్చింది. చెంగారెడ్డి అక్కడికి వెళ్లి చూడగా నాటు బాంబు పేలి కుక్క తీవ్రంగా గాయపడి ఉంది. దవడ భాగం చీలిపోయి ఉంది. వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు పాతిపెట్టిన నాటుబాంబును కొరకడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. -
తిరుమలకు భారీగా పెరిగిన రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న(గురువారం) 76,369 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 41,927 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా లెక్క తేలింది.నేటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలునేటి నుండి మూడు రోజులపాటు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలునారాయణ గిరి ఉద్యాన వనంలో పరిణయోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు.మొదటి రోజు మలయప్ప స్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై దర్శనంమే 17 నుండి 19వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు.1992వ సంవత్సరం పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహిస్తున్న టీటీడీ. -
19 నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు
రాపూరు: మండలంలోని పెంచలకోనలో వెలసిన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. 19న ఉత్సవ మూర్తులు గోనుపల్లి నుంచి పెంచలకోనకు వేంచేయనున్నారు. ఆ తర్వాత రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. 20న ధ్వజారోహణం, రాత్రి శేష వాహనం, 21న ఉదయం హంస వాహనం, రాత్రి బంగారు హనుమంత వాహనం, 22న ఉదయం సింహ వాహనం, రాత్రి బంగారు గరుడ వాహన సేవ, 23న కల్యాణం, రాత్రి గజవాహనసేవ, 24న ఉదయం చక్రస్నానం, సాయంత్రం తెపోత్సవం, రాత్రి అశ్వ వాహనసేవ, 25న స్వామి,అమ్మవార్లు గొనుపల్లికి వేంచేపు, క్షేత్రోత్సం నిర్వహించనున్నారు. -
జిల్లాకు వర్ష సూచనలు
తిరుపతి అర్బన్: జిల్లాలో వర్షసూచనలు కనిపిస్తున్నాయని ఆ విభాగం అధికారులు తెలిపారు. బుధవారం పెళ్లకూరు మండలంలో 13 మి.మీ, పుత్తూరులో 7.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 20.4 మి.మీ వర్షం కురిసిందని వెల్లడించారు. అదేవిధంగా గురువారం పిచ్చాటూరులో 4.8 మి.మీ, తడలో 0.8 మి.మీ, సూళ్లూరుపేటలో 0.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. రానున్న పది రోజుల్లో వర్షపాతం మరింత పెరిగే అవకాశాలున్నట్లు వెల్లడించారు. నేటి నుంచి శ్రీపద్మావతి పరిణయోత్సవాలు తిరుమల: తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శుక్రవారం నుంచి శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభం కానున్నాయి. మే 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. పద్మావతి పరిణయోత్సవ మండపం అలంకరణలకు పెట్టింది పేరు. గతంలో పసుపు–కుంకుమ మండపం, గాజుల మండపం, రంగురాళ్ల మండపం, అష్టలక్ష్మీ మండపం, దశవతార మండపం వంటి నమూనాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా టీటీడీ ఉద్యానవన విభాగం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది మొట్టమొదటి సారిగా కేరళ సంప్రదాయ ‘తెప్ప కోలం’ అలంకరణతో పాటు ఫలపుష్పాలు, విద్యుద్దీపాలతో భక్తులను ఆకట్టుకునేలా అలంకరించారు. ఇందులో రోజా, లిల్లీ, చామంతి వంటి రెండు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50 వేల కట్ ఫ్లవర్స్ (15 రకాలు), వివిధ రకాల ఫలాలు, ఏనుగులు, గుర్రాలు, చిన్నకృష్ణుడు వంటి సెట్టింగులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మండపం పైభాగంలో ఏర్పాటుచేసిన వెన్న ఉట్లు, వెండి గంటలు, పూల గుత్తులు ఆకట్టుకుంటున్నాయి. టీటీడీ గార్డెన్ విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు పర్యవేక్షణలో బెంగళూరుకు చెందిన 150 మంది నిపుణులైన సిబ్బంది, టీటీడీ గార్డెన్ విభాగానికి చెందిన మరో 50 మంది సిబ్బంది వారం రోజులుగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాల మండపాన్ని రూపొందిస్తున్నారు. ఈ మండప అలంకరణకు పూణేకు చెందిన వేంకటేశ్వర చారిటబుల్ ట్రస్టు వారు టీటీడీకి విరాళం అందించారు. జిల్లాలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరుపతి అర్బన్: జిల్లాలోని ఫెసిలిటేషన్ సెంటర్ల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరుపతికి తరలించారు. అలాగే గురువారం ఇతర జిల్లాలకు చెందిన ఓట్లను ఆయా నియోజకవర్గాల ఆర్వోలకు (రిటర్నింగ్ అధికారులకు) పంపించారు. పోస్టల్ బ్యాలెట్లను ప్రత్యేక బాక్సులలో భద్రపరిచారు. ఈ కసరత్తు మొత్తం ప్రత్యేక నిఘా నీడలో జరిగింది. అనంతరం ఆ బాక్సులకు సీల్ వేసి శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ సెంటర్కు తరలించారు. ఈ కసరత్తును జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు. దేశంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు తిరుపతి కల్చరల్: మోదీది హోసేల్ అవినీతి అని, దేశంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయ ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. గురువారం తిరుపతి సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ హోల్సేల్ అవినీతికి పాల్పడడంతో పాటు బ్లాక్ మనీ వైట్ మనీగా చేసుకోవడానికి అవకాశం కల్పించారని విమర్శించారు. -
బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలోకార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేయబడతాయిసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి జూన్ 25వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు ● బ్రైడల్ మేకప్స్●● ఒబెసిటీ అండ్ న్యూట్రిషియన్ డైట్ ● హెయిర్ మసాజ్ ● కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్ ● ఫేషియల్స్ ● యాంటి యేజింగ్, థర్మో హెర్బ్ ఫేషియల్స్ ● త్రె డ్డింగ్ ● వ్యాక్స్ ● పెడిక్యూర్ ● మెనిక్యూర్ ● బ్లీచింగ్ ● స్కిన్ కేర్ ● హెయిర్ కేర్ ● వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్ ● డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ ● హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ ● హెయిర్ కట్స్ ● హెయిర్ స్టైల్ ● హెన్నా ప్రిపరేషన్ ● డై అప్లికేషన్వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు24–05–2024 నుంచి 22–06–2024 వరకు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకురిజిస్ట్రేషన్స్ మరియు శిక్షణా స్థలం : Ananga Beauty Studio @ institute, Biragipatteda, Arch Road, Above Canara Bank, Tirupatiసంప్రదించాల్సిన నంబర్లు : 95534 54335, 96666 97219 -
దరఖాస్తుల ఆహ్వానం
గూడూరు రూరల్: గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాళవ్యానగర్లో ఉన్న ఏటీడబ్ల్యూఆర్ (బాలికల) గురుకులంలో 2024–25 విద్యాసంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి విద్యార్థినుల తల్లిదండ్రుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పే.వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తరగతిలో 40, 4వ తరగతిలో 35, 5వ తరగతిలో 30, 6వ తరగతిలో 7, 7వ తరగతిలో 3 సీట్లు వంతున ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. 3వ తరగతిలో గల 40 సీట్లలో ఎస్టీకి 31, ఎస్సీ 5, బీసీ 2, ఓసీ 1, ఏఈక్యూ 1 చొప్పున భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. మిగిలిన తరగతుల్లో మిగిలిన ఖాళీలను కేవలం ఎస్టీ విద్యార్థినులచే మాత్రమే భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నామని వెల్లడించారు. దరఖాస్తు ఫారాలు గురుకుల పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని, పూర్తి చేసిన దరఖాస్తులను స్వయంగా ప్రధానాచార్యుల కార్యాలయంలో ఈనెల 20వ తేదీలోగా సమర్పించాలని కోరారు. ఖాళీలకు మించి దరఖాస్తులు వస్తే వాటిని ఐటీడీఏ పీడీ(యానాదులు) నెల్లూరులోని కార్యాలయంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి సీట్లను కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. వివరాలకు 8333925187, 8885372878, 9441596331 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ముక్కోటి దేవతలకు ఆహ్వానం
తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఆగమోక్తంగా ఆరంభమయ్యాయి. ఉదయం మిథున లగ్నంలో చేపట్టిన ధ్వజారోహణంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. అనంతరం శ్రీవారి ఆస్థానాన్ని ఘనంగా చేపట్టారు. దీనికి ముందు శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేనారాధన, వాస్తు హోమం, గరుడ లింగ హోమం, గరుడ ప్రతిష్ట, రక్షా బంధనం చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం ఉద్దేశం. తర్వాత ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి ఉత్సవర్లకు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ వేడుకగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు గురువారం రాత్రి స్వామివారు పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. వాహన సేవలో కళా బృందాల ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఎప్ఏ అండ్ సీఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు, ఎస్ఈ–2 జగదీశ్వర్రెడ్డి, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహన్ రంగాచార్యులు, ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, కంకణభట్టార్ ఏ.నారాయణ దీక్షితులు, సూపరింటెండెంట్ మోహనరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు శ్రీకారం ఘనంగా గోవిందరాజ స్వామి ధ్వజారోహణం -
కనిపించని ఏనుగు జాడ
పాకాల : మండలంలో హల్ చేస్తున్న ఒంటరి ఏనుగు జాడ కనిపించలేదు. దీంతో పలు గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వణికిపోతున్నారు. ఇటీవల మండలంలోని చెన్నుగారిపల్లి పంచాయతీలోకి ఏనుగు ప్రవేశించింది. తర్వాత అది కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి అటవీశాఖ అధికారులు వెతుకుతూనే ఉన్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అటవీశాఖ పనబాక రేంజ్ డీఎఫ్వో చినబాబు గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. డ్రోన్ సహాయంతో మండలంలోని శ్రీరామపురం గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏనుగు జాడను కనిపెట్టేందుకు సుమారు 30 మంది సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. డీఎఫ్ఓ సతీష్ ఆదేశాల మేరకు, ఎఫ్ఆర్ఓ మాధవి సూచనలతో ఈ గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఏనుగు తవణంపల్లిలోని ఏనుగుల గుంపు నుంచి తప్పిపోయి వచ్చినట్లు తెలుస్తోందన్నారు. శ్రీరామాపురం అటవీ ప్రాంతంలో రెండు చోట్ల ఏనుగు పేడను గుర్తించామని, ప్రస్తుతం దట్టమైన అడవిలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఏనుగు ప్రశాంతంగా వేరే మార్గంలో వెళ్లి పోయి ఉండవచ్చని తెలిపారు. సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే నీటి జాడను గుర్తించే సామర్థ్యం దానికి ఉందన్నారు. శ్రీరామాపురం చుట్టు పక్కల గ్రామాల్లో మైకుల ద్వారా ప్రచారం చేశామని, గుట్టలకు పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచినట్టు పేర్కొన్నారు. మరికొంత మంది ఏనుగును చూశామని తప్పుడు సమాచారం ఇస్తున్నారని, దీని వల్ల అటవీశాఖ సిబ్బంది సమయం వృథా అవుతోందని వాపోయారు. -
తిరుపతి గ్రామదేవతకు వేడుకగా భూమన కుటుంబం సారె
● హోరెత్తిన జాతర సంబరం ● ఆకట్టుకున్న జానపద కళా నృత్యరూపకం ● డప్పుదరువుల మధ్య శోభాయాత్ర ● అడుగడుగునా భక్తులు పసుపు నీళ్ల పులకింత డప్పు దరువులు, నవదుర్గలు, కాంతార కాంతులు, తీన్మార్ డ్యాన్స్లు, కొమ్ముకొయ్య నృత్యాలు, దింసా, పగటి వేషాలు, పులివేషాలు, గరగళ్లు, బోనాలు, కీలుగుర్రాల ఆటలు, తప్పిటగుళ్ల మోతలు, కోయ నృత్యాలు, కోలాట భజనలు అబ్బో.. తిరుపతిలో జాతర సంబరం హోరెత్తింది. గురువారం టీటీడీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుటుంబ సమేతంగా తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మకు సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అడుగడుగునా హారతులు పట్టి, పసుపునీళ్లు పోసి భక్తులు తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. శోభాయాత్రకు పోటెత్తిన జనంతిరుపతి కల్చరల్: ‘గంగమ్మ తల్లి.. వెంకన్న చెల్లి.. జాతరో జాతర.. వేషాలు వేయరా.. మొక్కులు తీర్చరా.. అమ్మ కరుణను పొందరా..’ అంటూ అత్యంత ప్రతిష్టాత్మకంగా కరుణన్న సంకల్ప ప్రచారాలతో తిరునగరిలో గురువారం జాతర సంబరాలు జోరందుకున్నాయి. తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారికి సారె సమర్పించారు. ఇందులో భాగంగా పద్మావతీపురంలోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన సంప్రదాయ సారె పూజలో ఎంపీ డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి దంపతులు, డెప్యూటీ మేయర్, ఎమ్మెల్యే అభ్యర్థి భూమ న అభినయ్రెడ్డి దంపతులు, శ్వేత డైరెక్టర్ భూమన్ దంపతులు, భూమన కుటుంబీకులు సారెను నెత్తిన పెట్టుకొని భక్తి శ్రద్ధలతో కాలినడకన శోభాయాత్రగా ముందుకు కదిలారు. వివిధ దేవతామూర్తులు, అమ్మవారి విశ్వరూప కళాప్రదర్శనలు, లయబద్ధంగా నృత్యాల హోరుతో తిరుపతి పురవీ ధులు పులకించాయి. అన్ని వర్గాల ప్రజలు గంధంబొట్లు పెట్టుకొని, వేపాకు చేతబూని గంగమ్మ సారె శోభాయాత్రలో పాల్గొన్నారు. పద్మావతీపురం నుంచి శ్రీనివాస కల్యాణ మండపాలు, లక్ష్మీపురం సర్కిల్, ఎస్టీవీ నగర్, డీఆర్ మహల్, రైల్వేస్టేషన్, గ్రూప్ థియేటర్స్, పెద్దకాపు వీధి మీదుగా శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగింది. అడుగడుగునా భక్తులు పసుపునీళ్లతో స్వాగతం పలికి హారతులు సమర్పించారు. ప్రత్యేకంగా ముస్లింలు గంగమ్మసారె పట్ల చూపిన భక్తి భావం తమసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. డీఆర్ మహల్ వద్ద స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు ఎస్కే.బాబు, కార్పొరేటర్ కోటూరి ఆంజనేయులు, ముస్లిం మహిళలు అమ్మవారి సారెకు ఘన స్వాగతం పలికారు. సారె శోభాయాత్ర గంగమ్మ ఆలయం వద్దకు చేరుకోగానే భూమన కుటుంబానికి ఈవో కె.మమత, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సారెను అమ్మవారికి సమర్పించి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. -
ఘనంగా చిన్నకొట్టాయి ఉత్సవం
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం చిన్నకొట్టాయి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పొగడ చెట్టు వద్దకు తీసుకొచ్చారు. మొదట స్వామి, అమ్మవార్లకు పలు రకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేషంగా అలంకరిచారు. చతుర్వేద పారాయణం, మంత్రపుష్పం, నైవేద్యం, దీపారాధన, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోనే స్వామి, అమ్మవార్లను ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈఓ ఎస్వీ నాగేశ్వరరావు, పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, సభ్యులు పాల్గొన్నారు. -
ముగ్గురూ ఆడపిల్లలైనా..
‘నీలకంఠా.. నిన్ను సేవించుకోవడానికి వస్తే నట్టేట ముంచేశావు కదయ్యా.. నీకు దీపం పెడదామని వస్తే మా ఇంటి దీపాలు ఆర్పేశావు కదయ్యా.. నీకిది న్యాయమా..’ అంటూ ఆ తల్లి గుండెలు పగిలేలా రోదించిన తీరు చూపరులకు కన్నీళ్లు తెప్పించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న ముగ్గురు కుమార్తెలు జలకంఠేశ్వర స్వామికి దీపారాధన కోసం వెళ్లి చెరువులో పడి మృతిచెందడం ఘటన స్థానికంగా కలకలం రేపింది. బిడ్డలను కాపాడేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నం వృథా అయింది. బిడ్డలు కళ్లముందే మునిగిపోవడంతో ఆ తల్లి కడుపుకోతతో తల్లడిల్లిపోయింది. ఈ ఘటన ఎస్బీఆర్పురంలో తీవ్ర విషాదం నింపింది. పుత్తూరు: జలకంఠేశ్వరస్వామికి పూజలు చేసి, చెరువులో దీపాలు పెట్టేందుకు వెళ్లిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద సంఘటన వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే, ఎస్బీఆర్పురం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పి.బాబు, విజయ దంపతులకు రూపిక(10), చరిత(13), యుషిక(17) ముగ్గురు కుమార్తెలు. ఆ దంపతులిద్దరూ శివభక్తులు. ఈ క్రమంలో నీలకంఠుడ్ని సేవించడానికి తిరుణామళ్లై వెళ్లాడు. విజయ తన ముగ్గురు కుమార్తెలతో గురువారం మధ్యాహ్నం గూళూరు చెరువు కట్టపైన ఉన్న శివుని గుడికి వచ్చి పూజలు చేసింది. పూజల అనంతరం ముగ్గురు కుమార్తెల చేతికి దీపాలు వెలిగించి ఇచ్చి చెరువులో వదలమని చెప్పింది. చెరువు మెట్లపై పాచి పట్టివుండడంతో కాలు జారి ఒకరి వెనక మరొకరు చెరువులోకి పడిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన విజయ కేకలు వేస్తూ పిల్లలను రక్షించేందుకు చెరువులోకి దిగేసింది. అయితే అప్పటికే ముగ్గురు పిల్లలు మునిగిపోయారు. చుట్టుపక్కల ఉన్న వారు వచ్చి విజయను మాత్రం రక్షించగలిగారు. మునిగిపోయిన పిల్లలను వెలికి తీసి పుత్తూరు ఆస్పత్రికి ఆటోలో తరలించారు. వైద్యులు పరీక్షించి ముగ్గురూ అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ మేరకు వడమాలపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆగని కన్నీటి సుడులునీకు దీపాలు తెస్తే.. మా ఇంటి దీపాలు ఆర్పేశావు మేమేమి పాపం చేశాం? ఇంత శిక్ష ఎందుకేశావు శివా అంటూ ఆ తల్లి రోదనలతో పుత్తూరు ఆస్పత్రి మార్మోగి పోయింది. నిన్నే నమ్మితే నీట ముంచావు కదయ్యా.. నీ కోసం దీపాలు తెస్తే.. మా ఇంటి దీపాలనే ఆర్పేశావు కదయ్యా... నన్ను తీసుకొనిపోయి, నా బిడ్డల్ని వదిలేసి ఉంటే ఏమయ్యా.. అంటూ ఆ తల్లి విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. ఆర్ఎంపీ డాక్టర్గా గ్రామస్తులకు వైద్య సేవలందిస్తూ, వైఎస్సార్ సీపీ నాయకుడిగా ప్రజా సేవ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న బాబుకు ముగ్గురూ కుమార్తెలే. అయినా వారికి ఏ మాత్రం తక్కువ చేయకుండా ఎంతో సంతోషంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ముగ్గురినీ పెద్ద చదువులు చదివించి, పెళ్లిళ్లు చేసి పంపాలని ఆశించారు. ఈ క్రమంలో చిన్న కుమార్తె రూపిక 5వ తరగతి, రెండవ కుమార్తె చరిత 9వ తరగతి చదువుతుండగా, పెద్ద కుమార్తె యుషిక ఈ సారి ఇంటర్మీడియెట్లో 900కు పైగా మార్కులు సాధించింది. బీటెక్ చదివించాలని కాలేజి అన్వేషణలో ఉండగా ఈ దుర్ఘటన ఆ కుటుంబాన్ని చిదిమేసింది. శివ భక్తులైన ఆ దంపతులు, శివుని సేవలోనే సర్వం కోల్పోయారు. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూ ఏటీజీహెచ్ వద్దకు చేరింది. సోమవారం అర్ధరాత్రి వరకు 81,930 మంది స్వామివారిని దర్శించుకోగా 41,224 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.90 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. నారాయణగిరి వద్ద క్యూలో వేచి ఉన్న భక్తులు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్పీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
లండన్ కు చేరుకున్న సీఎం జగన్
వవన్ కల్యాణ్ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్
వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?
తప్పక చదవండి
- ‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement