పింఛన్లపై లోకేశ్‌ మాట్లాడొద్దన్నాడు | Sakshi
Sakshi News home page

పింఛన్లపై లోకేశ్‌ మాట్లాడొద్దన్నాడు

Published Sat, May 4 2024 8:12 AM

Guntur TDP MP Candidate Team Pemmasani Chandrasekhar follower Phone Call leak

సాక్షి, అమరావతి :ఇంటి వద్ద పింఛన్ల పంపిణీని అడ్డుకుని వృద్ధులను 45 డిగ్రీల ఎండలో నడిరోడ్డున పడేసిన టీడీపీ ఇప్పుడు దానిపై ఏంచేయాలో తెలీక లబోదిబోమంటోంది. టీడీపీ అభ్యర్థులు, నేతలను పింఛనుదారులు ఎక్కడికక్కడ నిలదీస్తుండడం, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ దొంగ రాజకీయం బయటపడిపోవడంతో ఏం మాట్లాడొద్దని చంద్రబాబు తనయుడు లోకేశ్‌బాబు పార్టీ కేడర్‌కు సూచించారు. దీనిపై ఏదో ఒకటి చేయాలని పార్టీ అభ్యర్థులు టీడీపీ కార్యాలయంలో పనిచేసే వారికి ఫోన్లుచేసి బతిమలాడుతున్నారు. 

కానీ, వారు తామేం చేయలేమని, తప్పు టీడీపీదేనని, దీనిపై ఏం మాట్లాడకుండా ఉండాలని చెబుతూ చేతులెత్తేశారు. దీంతో ఎల్లో మీడియా, సోషల్‌ మీడియా వృద్ధుల ఏడుపులపై దొంగ ప్రచారానికి దిగింది. చంద్రబాబును, టీడీపీని అడ్డగోలుగా వృద్ధులు తిడుతుంటే దాన్ని వక్రీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు చిత్రీకరించి తాము దిగజారుడులో మాస్టర్స్‌మని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో.. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రధాన అనుచరుడు ఒకరు టీడీపీ కార్యాలయ ముఖ్య ఉద్యోగితో మాట్లాడు­తున్న సంభాషణ వింటే (ఆడియో లీకైంది) పింఛన్లపై టీడీపీ ఏడుపు ఏమిటో అర్థమవుతుంది.

ఇదీ సంభాషణ..

పెమ్మసాని అనుచరుడు : హలో.. ఏమ్మా రఘు ఎక్కడున్నావ్‌?
టీడీపీ కార్యాలయ ఉద్యోగి : అన్నా ఇక్కడే అన్నా.. ఆఫీసులో

అనుచరుడు : ఏమ్మా ఎట్లా ఉన్నావు?
ఉద్యోగి : బానే ఉన్నా.. మీరెట్లా ఉన్నారన్నా..

అనుచరుడు : బావున్నా.. ఏంలేదు పెన్షన్‌ ఇష్యూ బాగా వైరల్‌ అయిపోతోందంట. బ్యాడ్‌ నేమ్‌ వస్తోంది. మార్నింగ్‌ కూడా మన పెమ్మసాని గారు క్యాంపెయిన్‌కి వెళ్లినప్పుడు ఎక్కడపడితే అక్కడ ముసలోళ్లు గోలచేస్తూ సార్‌ దగ్గరికి వచ్చి నిలదీస్తున్నారు. ఆయన ఫుల్‌ హార్‌ష మీద ఉన్నాడు. ఏంటసలు.. వీళ్లు ఏం చేస్తున్నారో కనుక్కోమన్నాడు. అందుకే కాల్‌చేశా..
ఉద్యోగి : అన్నా నాకర్థమైంది. నాకూ ఉదయం నుంచి ఇదే విషయం మీద 40–50 కాల్స్‌ వచ్చాయి. 

అనుచరుడు : ఎందుకని మీరేం చేయలేకపోతున్నారు? అసలు ఏంటిది?
ఉద్యోగి : చెప్పి చెప్పి విసిగిపోయామన్నా..

అనుచరుడు : ఏంది విసిగిపోయేది.. వాళ్లేమో మన మీద అంత అగ్రెసివ్‌గా ఉంటున్నారు. నిమ్మగడ్డ రమేష్‌ మనోడే అంటున్నారు. దాని మీద మనం ఏమీ కౌంటర్‌ ఇవ్వలేకపోతున్నాం ఎందుకని?
ఉద్యోగి : కౌంటర్‌ కాదన్నా.. అసలు విషయం ఏంటంటే.. యాక్చువల్‌గా మిస్టేక్‌ మనదే ఉంది. పబ్లిక్‌ ఏమనుకుంటున్నారంటే.. నిమ్మగడ్డ రమేష్‌తో పెద్దాయనే (చంద్రబాబు) ఇదంతా చేయించారు. పిటిషన్‌ వేయించి ఎన్నికల కమిషన్‌తో ఇట్లా చేయించారని బాగా స్ప్రెడ్‌ అయిపోయింది. 

అనుచరుడు : దానిపై కౌంటర్‌ ఇవ్వలేమా?
ఉద్యోగి : దీని గురించి లోకేశ్‌ అన్నకు చెప్పాం. మీరెవ్వరూ దీనిపై ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్‌ అవ్వొద్దు అని చెప్పారు. 60–70 నియోజకవర్గాల నుంచి దీనిపై కాల్స్‌ వచ్చాయి. 

అనుచరుడు : కాదమ్మా రఘు.. ఇప్పటికే మన పరిస్థితి వరస్ట్‌గా ఉంది. పెమ్మసాని గారు ఇంత ఖర్చుపెట్టి కష్టపడుతున్నారు.. ఆయనే అన్నాడు.. దీనిపై ఇంతమంది ఇలా అడుగుతున్నారు.. మనవాళ్లు ఏం చేస్తున్నారో కనుక్కోమన్నారు.
ఉద్యోగి : కాదన్నా.. ఇది ఒక పెమ్మసాని గారి విషయం కాదు. స్టేట్‌ మొత్తం ఇది ఉంది. లోకేశ్‌ గారు దీనిపై మాట్లాడవద్దన్నారు. ఒకవేళ దీనిపై రెస్పాండ్‌ అయితే మళ్లీ మన మీదకే మిస్‌ఫైర్‌ అవుతుంది, ఏ యాక్షన్‌ వద్దు అని చెప్పారు. 

అనుచరుడు : డ్యామేజి కంట్రోల్‌ ఎట్లా మరి? ఏం చేస్తారో ప్లాన్‌ ఏమీ చెప్పలేదా?
ఉద్యోగి : లోకేశ్‌ అన్న చెప్పింది ఏమిటంటే అవసరమైతే పార్టీ వాళ్లతో ప్రెస్‌మీట్లు పెట్టిద్దాం. ఇప్పుడు మాత్రం ఇన్వాల్వ్‌ అవ్వొద్దని చెప్పారు. అందుకే మన వాళ్ల నుంచి దీనిపై ఒక్క పోస్టు కూడా రాలేదు. 

అనుచరుడు : ఏదో ఒకటి చేయండయ్యా.. ఇప్పటికే మనవాళ్లు చాలా డీమోరలైజ్‌ అయిపోయారు. లక్ష మంది అట్లా ఉంటే పోనీలే అనుకోవచ్చు. 72–73 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అందులో మనకి ఇంకో 10 రోజులే ఉంది. మనకి ఏదైనా తేడాపడితే..
ఉద్యోగి : చూసుకుంటారన్నా మనవాళ్లు.. 

అనుచరుడు : కొంచెం యాక్టివ్‌గా ఉండండి..
ఉద్యోగి : కేడర్‌ డీమోరలైజ్‌ అవకుండా చూడాలన్నా.. అది మీరే చేయాలి.

అనుచరుడు : నీకూ తెలుసు. పెమ్మసాని గారు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారని.. మాకు మీరు కొంచెం సపోర్ట్‌ చేయండి.
ఉద్యోగి : ముసలోళ్లతో ఏముంది గానీ.. రెండు, మూడ్రోజులైతే అయిపోతుంది.. 

పెమ్మసాని అనుచరుడు : 2, 3 రోజులు కాదు. ఇంకా పది రోజులే టైముంది. ఏం చేయాలో? 
ఉద్యోగి : లోకేశ్‌ అన్న ప్రెస్‌మీట్లు పెట్టిద్దామన్నారు. మాట్లాడిస్తారు.  

Advertisement
Advertisement