ప్రచారంపై ఫోకస్‌ పెంచిన ప్రధాన పార్టీలు.. | Sakshi
Sakshi News home page

ప్రచారంపై ఫోకస్‌ పెంచిన ప్రధాన పార్టీలు..

Published Sat, May 4 2024 10:10 AM

-

ఎంపీ సోయం టికెట్‌ అంశాన్ని తెరపైకి తెచ్చిన సీఎం

ఆదివాసీ ఓట్లను ఆకర్షించేందుకేననే అభిప్రాయం

విభేదాలకు చెక్‌ పెట్టేలా బీజేపీ కార్యాచరణ

మైనార్టీ ఓట్లపై బీఆర్‌ఎస్‌ దృష్టి

సాక్షి,ఆదిలాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల సంగ్రామంలో ఆయాపార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నా యి. సీఎం రేవంత్‌రెడ్డి ఈ సెగ్మెంట్‌ పరిధిలో ఆది లాబాద్‌, ఆసిఫాబాద్‌లలో జరిగిన సభల్లో వ్యూహా త్మకంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గొడం నగేశ్‌, ఆత్రం సక్కును విమర్శించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

ఎంపీ సోయం బాపూరావు ప్రస్తావన కూ డా ఇందులో భాగమేనని చర్చించుకుంటున్నారు. మరోపక్క బీజేపీలో ఇటీవల ఎమ్మెల్యేలకు ఆయా పార్లమెంట్‌ ఇన్‌చార్జి బాధ్యతలు తొలగించిన తర్వాత వారంతా తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో దూకుడు పెంచారు. ఒక విధంగా ఈ నిర్ణయం విభేదాలకు చెక్‌తో పాటు ప్రచారంలో స్పీడ్‌ పెంచేందుకు ఉపయోగపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్‌ మైనార్టీ ఓట్లపై దృష్టి సారించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

సీఎం ప్రసంగంలో ఎంపీ సోయం ప్రస్తావన..
సీఎం రేవంత్‌రెడ్డి ఆసిఫాబాద్‌ బహిరంగ సభలో ఎంపీ సోయం బాపూరావు ప్రస్తావన తీసుకురావడం వ్యూహాత్మకమేనన్న చర్చ సాగుతుంది. సిట్టింగ్‌ ఎంపీ సోయంకు టికెట్‌ ఇవ్వకుండా బీజేపీ ఆయనను అవమానించిందన్నారు. అంతేకాకుండా పార్లమెంట్‌ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రుల చుట్టూ సోయం తిరిగినా వారు పట్టించుకోలేదని చెప్పారు. ప్రధానంగా సోయంకు ఆదివాసీ ఓటర్లలో పట్టు ఉంది.

ఈ నేపథ్యంలో సీఎం వ్యూహాత్మకంగానే సోయం ప్రస్తావన తీసుకువచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థి నగేశ్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సక్కు ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధికి పాటుపడింది లేదని చెప్పడం ద్వారా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదిలా ఉంటే ఇటీవల మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నార్నూర్‌ మండలం కొత్తపల్లి–హెచ్‌లో బంజారా దీక్షభూమి వేదిక వద్ద ప్రసంగిస్తూ తాము లంబాడాలకు వ్యతిరేకం కాదని చెప్పడం ద్వారా ఆ ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు.

అంతే కాకుండా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి పార్టీ పరంగా కో ఇన్‌చార్జీలను నియమించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌తో పాటు ఏఐసీసీ సభ్యుడు నరేశ్‌ జాదవ్‌ నియామకం ఇందులో భాగమేనని తెలుస్తోంది. తద్వారా ఆ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నమే ఈ చర్య అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది.

బీజేపీలో విభేదాలు సమసినట్టేనా..
బీజేపీలో ఎంపీ అభ్యర్థిగా నగేశ్‌ను ప్రకటించిన త ర్వాత పార్టీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదన్న విమర్శలు జోరుగా సాగాయి. ఎమ్మెల్యేలకు పార్లమెంట్‌ ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చిన తర్వాత వారి నియోజకవర్గాల్లో ఇతర నేతల జోక్యం పెరిగిందన్న భావం వ్యక్తమైందన్న ప్రచారం జరిగింది. పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో నష్ట నివారణ చర్యలకు దిగింది.

ఇందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బా ధ్యతల నుంచి తొలగించారు. ఈ పరిణామం తర్వా త ఆయా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రచార స్పీడ్‌ పెంచారు. ఒకవిధంగా ఇది పార్టీకి మంచి జరిగిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా నగేశ్‌ ఇటీవల ఖానాపూర్‌ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌తో కలిసి విస్తృతంగా తిరిగారు. ఇది లంబాడా ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మక చర్య అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

ఎంఐఎం నేతను కలిసిన బీఆర్‌ఎస్‌ నాయకులు..
బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు సంబంధించి ఈ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లోని నియోజకవర్గాల్లో ఆయా నేతలు, కార్యకర్తలు విస్తృతంగా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇటీవల మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి భైంసాలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జాబిర్‌ అహ్మద్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా మైనార్టీ ఓటర్లను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆదివాసీ, లంబాడా ఓటర్లతో పాటు గిరిజనేతర ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement