-
కాంగ్రెస్ మార్క్ మార్పు ఇదేనా!: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘రాష్ట్రంలో ఓ వైపు కరెంట్ కోతలు, మరోవైపు కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు..మోటార్లు, ఆస్పత్రుల్లో గంటల తరబడి కరెంటు కోతలు, ఎండుతున్న చెరువులు.. ఇదేనా కాంగ్రెస్ మార్కు మార్పు? ఒక్కసారి ఆలోచించి వారికి ఇప్పటికైనా తగిన బుద్ధి చెప్పాలి..’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘6 నెలల క్రితం అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కేసీఆర్తో సహా అందరం ప్రతి నియోజకవర్గంలో పర్యటించాం. మోసపోతే గోసపడుతామని చెప్పాం. కానీ కాంగ్రెస్ వాగ్దానాలు నమ్మి ఆ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపితే నమ్మి ఓటేసి ఇప్పుడు బాధపడుతున్నారు. డిసెంబర్ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు. కేసీఆర్ లక్ష మాఫీ చేసిన వారికీ రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి.. మొదటి రోజే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం శిక్ష వేస్తారో వేయాలి..’అని అన్నారు. ‘సీఎం రేవంత్రెడ్డి ఓ మెజీషియన్.. పచ్చి అబద్ధాలకోరు. తెలంగాణ ప్రజలను ఇంకా నమ్మించాలని చూస్తున్నాడు..’అని ధ్వజమెత్తారు. వరంగల్–నల్లగొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నర్సంపేట, వరంగల్, హనుమకొండలలో నిర్వహించిన సమావేశాల్లో కేటీఆర్ ప్రసంగించారు. రెండోసారి కూడా మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు ‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈస్ట్మన్ కలర్ సినిమా చూపించారు. కానీ రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎలా ఉన్నాయో చెప్పడానికి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం నాటి ఘటనే ఉదాహరణ. ఎంజీఎం లాంటి పెద్ద ఆస్పత్రిలో 5 గంటలు కరెంట్ పోవడం దారుణం కాదా? ఆరు నెలల క్రితం వ్యవసాయం ఎలా ఉండే? ఇప్పుడు ఎలా ఉంది? రుణమాఫీ జరిగిందా? కౌలు రైతులకు, రైతు కూలీలకు సాయం అందిందా? వంద రోజుల్లోనే చేసేస్తామన్న హామీలు ఏమయ్యాయి? రూ.2500 వచ్చినయా? ఏడాదిలో రూ.2 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏదీ చేయలేదు. నాట్లు వేసే నాడు వేయాల్సిన రైతుబంధు..ఓట్లు వేసే నాడు రేవంత్రెడ్డికి గుర్తొస్తుంది. ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశానని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. తెలంగాణలో అన్ని హామీలు ఆమలు చేస్తున్నట్లు రాహుల్గాం«దీ, ప్రియాంక గాం«దీలు కూడా ఇతర రాష్ట్రాల్లో అబద్ధాలు చెబుతున్నారు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. పదేళ్ల ప్రగతి చెప్పుకోవడంలో విఫలమయ్యాం ‘గత పదేళ్లలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి. అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి. కానీ మనం చేసిన మంచి పనులను చెప్పుకోవటంలో విఫలమయ్యాం. యూట్యూబ్లలో మనపై తప్పుడు ప్రచారాలు చేశారు. దీని కారణంగానే 1.8 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో మనం ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు. కానీ రెండోసారి కూడా మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు అవుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించి కాంగ్రెస్కు తగ్గిన బుద్ధి చెప్పాలి..’అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయా సమావేశాల్లో రాకేశ్రెడ్డితో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎమ్మెల్సీలు డా.బండా ప్రకా‹Ù, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనచారి, ఎమ్మెల్యేలు డా.సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మానవత్వాన్ని చాటిన కేటీఆర్ గీసుకొండ: రోడ్డు పక్కన పడిపోయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, మాజీ మంత్రి కేటీఆర్ మానవత్వాన్ని చాటారు. బుధవారం హైదరాబాద్ నుంచి నర్సంపేట వెళుతుండగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని ధర్మారం రైల్వే గేటు సమీపంలో అంజయ్య అనే వ్యక్తి మోపెడ్పై వెళుతూ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనపడి అపస్మారకస్థితిలో ఉన్నాడు. విషయం గమనించిన కేటీఆర్ కారు ఆపి అతన్ని పరిశీలించారు. వెంటనే గన్మెన్ల సాయంతో తన కాన్వాయ్లోని ఓ వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నర్సంపేటకు వెళ్లారు. ఆరు నెలల్లోనే ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు – పదేళ్ల తరువాత మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు – కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు – ‘ఎక్స్’లో కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు ఆవిష్కృతం అయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలు, విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టళ్లు ఇప్పుడు చూస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. ‘కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లతో పాటు మళ్లీ ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నాం. సాగునీరు లేక ఎండిన పంట పొలాలు, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నాం. బోసిపోయిన చెరువులు, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు, రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేదు. పదేళ్ల తరువాత మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. జోగిపేటలో విత్తనాల కోసం రైతులు పాసుబుక్కులతో క్యూలు కడుతున్నారు. అయినా కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..’అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎంజీఎం ఘటనపై సీఎం ఆగ్రహం
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డితో ఫోన్లో మాట్లాడి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎంఓ ఆగ్రహం వ్యక్తం చేసి ఈఘటనపై వివరణ ఇవ్వాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించింది. ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ విదేశీ పర్యటనలో ఉండడంతో ఇన్చార్జ్ సూపరిండెంట్ డాక్టర్ రాంకుమార్రెడ్డి వివరణ ఇచ్చారు. సూపర్స్పెషాలిటీ బ్లాక్కు నిలిచిన విద్యుత్ సీఎంఓ ఆదేశాలతో కలెక్టర్ ప్రావీణ్య బుధవారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. పూర్తిస్థాయిలో జనరేటర్లు పనిచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీఎంలో విద్యుత్ అంతరాయం ఏర్పడిన సమయంలో సూపర్స్పెషాలిటీ బ్లాక్కు పూర్తిస్థాయిలో సరఫరా నిలిచినట్లు ఎలక్ట్రిక్ సిబ్బంది కలెక్టర్కు వివరించారు. ఈ బ్లాక్కు విద్యుత్ అందించే జనరేటర్ బ్యాటరీని వెంటనే మరమ్మతులు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నివేదిక అందించాలి: మంత్రి రాజనర్సింహ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాలో జరిగిన అంతరాయంపై మంత్రి రాజనర్సింహ సమీక్ష నిర్వహించినట్లు ఎంజీఎం పరిపాలనాధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో మంత్రితోపాటు హెల్త్ సెక్రటరీ, డీఎంఈ ఈఘటనపై సమీక్షించినట్లు ఇన్చార్జ్ సూపరిండెంట్ డాక్టర్ రాంకుమార్రెడ్డి పేర్కొన్నారు. వారం రోజుల్లోగా అధికారులు ఘటనపై నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు. ఎమ్మెల్యే నాయినితో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీఎంఓ ఆదేశాలతో ఎంజీఎంను సందర్శించిన కలెక్టర్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్తో మాట్లాడిన హెల్త్ సెక్రటరీ సూపరింటెండెంట్కు షోకాజ్ నోటీస్ ఎంజీఎం ఆస్పత్రిలోని సూపర్స్పెషాలిటీ బ్లాక్కు విద్యుత్ సరఫరా చేసే జనరేటర్ పనిచేయకపోవడంపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ ప్రావీణ్య సూపరింటెండెంట్కు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. కలెక్టర్ వెంట ఇన్చార్జ్ సూపరింటెండెంట్ రాంకుమార్రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్రావు, డీఈ మల్లికార్జున్, ఏఈ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. -
మానవ మనుగడకు ఆధారం జీవవైవిధ్యం
హన్మకొండ చౌరస్తా: ‘జీవ వైవిధ్యమే మానవ మనుగడకు ఆధారం. ఈ వైవిధ్యాన్ని కాపాడుకోవడం సామాజిక బాధ్యత’ అని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం హనుమకొండ పబ్లిక్గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో ‘జీవైవిధ్యం–పరిరక్షణ’ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ జీవవైవిధ్య మండలి, పర్యావరణ పరిరక్షణ ఐక్య వేధిక, ఓరుగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ, జన విజ్ఞాన వేదిక, వన సేవా సొసైటీ, హరిత స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే హాజరై మాట్లాడారు. అద్భుతమైన జీవవైవిధ్యాన్ని పరిరక్షించి రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకోసం మొక్కలను నాటి పరిరక్షించాలని సూచించారు. నిర్వాహకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మొక్కల ప్రదర్శన, విక్రయం, ప్రకృతి మిత్ర, సేంద్రియ సాగు, పండ్లు, సిరి ధాన్యాలు ఉత్పత్తుల ప్రదర్శన విక్రయమేళా స్టాళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా మెజిషీయన్ జయాకర్ స్నేక్ అవగాహన షో ఆకట్టుకుంది. పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షుడు పురుషోత్తం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జలసాధన సమితి వ్యవస్థాపకుడు సత్యనారాయణ, విజిలెన్స్ డీఎఫ్ఓ నాగభూషణం, పుల్లూరు సుధాకర్, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ సుభాష్, సైబర్ క్రైం ఏసీపీ విజయ్కుమార్, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ అనిసుర్ రషీద్, రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి, జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభించారు.. వదిలేశారు!
నిరుపయోగంగా మారిన రూ.2కోట్లతో నిర్మించిన మోడల్ మార్కెట్ భవనం నర్సంపేట: నర్సంపేటలోని జిల్లాస్థాయి కూరగాయల మార్కెట్, వారాంతపు సంతకు ప్రాధాన్యత ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కొనసాగడంతో మార్కెట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నర్సంపేట పట్టణంలోని అంగడి ఆవరణలో రూ.2 కోట్లతో నిర్మించిన సమీకృత మోడల్ కూరగాయల మార్కెట్ భవనాన్ని 2001 మే 28న అప్పటి పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా ప్రారంభించారు. కానీ, అప్పటి నుంచి భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడం లేదు. ఈ భవనం ఉన్న అంగడి ఆవరణలోనే కూరగాయల క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. వానాకాలంలో బురదలోనే అమ్మకాలు చేస్తుండడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదేకాకుండా సమీపంలోనే చిరు వ్యాపారుల కోసం రూ.7.5 లక్షలతో నిర్మించిన రేకుల షెడ్డును కూడా నేటికి కేటాయించకపోవడంతో నిరుపయోగంగా మారింది. దీంతో ఆదివారం వారాంతపు సంత నర్సంపేట పట్టణ ప్రధాన రహదారిపై నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. రోడ్లపైనే వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో నర్సంపేట మీదుగా వరంగల్, మహబూబాబాద్, భద్రాచలం వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షంలో తడుస్తూ ఎండలో ఇబ్బందులుపడుతూ వ్యాపారులతోపాటు వినియోగదారులు మార్కెట్ అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, ఇతర మండల కేంద్రాల్లో కూడా కూరగాయల మార్కెట్ల నిర్వహణపై పట్టింపులేవనే ఆరోపణలు వస్తున్నాయి. త్వరలోనే వినియోగంలోకి.. నర్సంపేట పట్టణంలోని అంగడి ఆవరణలో నిర్మించిన మోడల్ కూరగాయల మార్కెట్ను త్వరలోనే వినియోగంలోకి తెస్తాం. ఇప్పటికే రోడ్లపైన కూరగాయలు, ఇతర అమ్మకాలు చేపట్టే వారిని గుర్తించాం. కొంతమేర మరమ్మతు పనులు ఉన్నందన వినియోగంలోకి తేలేకపోయాం. – బిర్రు శ్రీనివాస్, నర్సంపేట మున్సిపల్ కమిషనర్ నర్సంపేటలో నిరుపయోగంగా మోడల్ మార్కెట్ రూ.2 కోట్ల నిధులతో నిర్మించిన గత ప్రభుత్వం చిరువ్యాపారులకు కేటాయించని షెడ్డు అంగడి ఆవరణలోనే కూరగాయల క్రయవిక్రయాలువృథాగా టాయిలెట్స్.. పట్టణంలోని అంగడి ఆవరణలో మోడల్ కూరగాయల మార్కెట్ భవనం పక్కన నిర్మించిన టాయిలెట్లు నిరుపయోగంగా మారాయి. అంగడి ఆవరణలో కూరగాయలు విక్రయించే వ్యాపారులు, కొనుగోళ్లకు వచ్చే వినియోగదారుల కోసం రూ.15 లక్షలు వెచ్చించి మున్సిపల్ అధికారులు సీ్త్ర, పురుషుల కోసం వేర్వేరుగా టాయిలెట్లు నిర్మించారు. నిర్మాణం పూర్తయినా నేటికి ప్రారంభించకపోవడంతో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. -
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
కాళోజీ సెంటర్ : లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ రాధికాగుప్తాతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ ఎస్సీ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ఏనుమామూల వ్యవసాయ మార్కెట్యార్డులో జరుగుతుందని తెలిపారు. ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూంల వద్దనే కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేశామని, ఈవీఎంలను కౌంటింగ్ రూంలకు తరలించి కౌంటింగ్ ప్రారంభిస్తామని వివరించారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ప్రతీ రౌండ్ లెక్కింపు వివరాలను డిస్ప్లే బోర్డులో అప్డేట్ చేస్తామన్నారు. ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తిచేయడానికి రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో ఎన్నికల కౌంటింగ్ అధికారుల పాల్గొన్నారు. ఏర్పాట్ల పరిశీలన వరంగల్ : ఏనుమాముల మార్కెట్ యార్డులో నిర్వహించనున్న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ పి.ప్రావీణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీపీఆర్ఓ అయూబ్అలీ, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంకుమార్రెడ్డి, పర్యవేక్షకులు విశ్వనారాయణ, చంద్రశేఖర్, ఆర్అండ్బీ ఏఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఏర్పాట్లుకాళోజీ సెంటర్ : జిల్లాలో ఈనెల 27న జరగనున్న వరంగల్– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ హైదరాబాద్ నుంచి ఉప ఎన్నిక నిర్వహణ ఏర్పాట్లపై ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు జిల్లా పరిధిలో 59 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి వసతులు కల్పించినట్లు తెలిపారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభం ఓట్ల లెక్కింపునకు సహకరించాలి రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రావీణ్య -
అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు కావాలి
నర్సంపేటలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్నర్సంపేట/ఖిలా వరంగల్/హన్మకొండ: దశాబ్ది కాలంగా పేదలకు పెద్ద దిక్కుగా నిల్చిన ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9గంటల వరకు కరెంట్ లేదు.. ఐదు గంటలు కరెంట్ లేకుంటే రోగుల పరిస్థితి ఏంటీ.. ఈ ఘటనే కరెంటు కోతలకు ఉదాహరణ.. విద్యావంతులారా మీరే ఆలోచించాలి’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చని రేవంత్రెడ్డి పచ్చి మోసగాడు.. ఇంకా ఎన్నిరోజులు మోసపోదాం.. విద్యావంతులు మేల్కొనాలి.. పట్టభద్రుల సమస్యలు, ప్రజా సమస్యలపై అడిగెటోడు, కడిగెటోడు, నిలదీసేవాడు కావాలి కానీ బాకా ఊదేటోడు కాదు.. అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు కావాలి. రాకేశ్రెడ్డి లాంటి విద్యావంతుడినే ఎన్నుకోవాలి’ అని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నర్సంపేటలోని పద్మశాలి గార్డెన్లో, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఉర్సుగుట్ట నాని గార్డెన్లో, పశ్చిమ నియోజకవర్గంలోని హంటర్ రోడ్డు సీఎస్ఆర్ గార్డెన్స్లో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్భాస్కర్ అధ్యక్షతన జరిగిన వరంగల్–ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోవడంలో విఫలమయ్యామని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండొద్దన్నారు. రైతుబిడ్డ, గోల్డ్మెడలిస్టు విద్యావంతుడైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపిద్దామా.. మహిళల మెడలో పుస్తెలతాడు లాక్కొని.. బూతు మాటలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిద్దామా.. అనేది మీరే ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయని, రూ.2లక్షల రుణమాఫీ కాలేదని, రైతు బంధు రైతుల ఖాతాల్లోకి రాలేదని ఆరోపించారు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారా.. బీఆర్ఎస్ ఎంపిక చేసిన ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసి అధికారంలోకి రాగానే 35వేల ఉద్యోగాలు ఇచ్చామనటం సిగ్గుచేటన్నారు. వరంగల్లో 24 అంతస్తుల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పనులు ఎందుకు నిలిపారో మీరే అడగాలని, కొత్త పరిశ్రమలు తీసుకువచ్చే స్థాయి, ఉన్న కంపెనీలను కాపాడుకునే సత్తా కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. జిల్లాలో ఒక్కో పరిశ్రమ తరలిపోతున్నదని, ఐటీ కంపెనీ టెక్ మహీంద్ర మరికొద్ది రోజుల్లో పోనుందని చెప్పారు. ఆయా సమావేశాల్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, డాక్టర్ సంజయ్, సంజయ్కుమార్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్, చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మ ణరావు, జెడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, సునీ తారావు, నాయకులు వాసుదేవరెడ్డి, రవీందర్సింగ్, రామకృష్ణారావు, వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు సిద్ధం రాజు, మరుపల్లి రవి, సోమిశెట్టి ప్రవీణ్, వేల్పుగొండ సువర్ణ, దిడ్డి కుమారస్వామి, పల్లం పద్మ, నాయకులు బస్వరాజు శ్రీమాన్, రమేష్బాబు, జనార్దన్గౌడ్, రజనీ కాంత్, పట్టభద్రులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడంటే ఏం లాభంవిద్యావంతుల్లారా.. ఆలోచించండి కరెంట్ కోతలకు ఎంజీఎం ఘటనే ఉదాహరణ జిల్లాలోని కంపెనీలు ఒక్కొక్కటి తరలిపోతున్నాయి.. మల్లన్న గెలిస్తే చట్టసభలు బూతు మాటలకు వేదిక విద్యావంతుడైన ఓరుగల్లు బిడ్డ రాకేశ్రెడ్డిని గెలిపించాలి పట్టభద్రుల సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించడానికి లేవగానే కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో కేటీఆర్ కల్పించుకుని ఎన్నికల్లో ఓడగొట్టి ఇప్పుడు సీఎం సీఎం అంటే ఏమి లాభం. వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్లోనూ ఓడగొట్టారంటూ చలోక్తి విసిరారు.టీ20 మ్యాచ్లను ఆపేసి ఎన్నికలపై దృష్టిపెట్టండి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిజమైన టీ 20 మ్యాచ్ ఈ నెల 27న ఉందన్నారు. టీ 20 మ్యాచ్లు, సీరియల్ చూడడం మానేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలన్నారు. అప్పటి ఎమ్మెల్యేను పిలిస్తే సస్పెండ్ చేసిన బీజేపీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి మాట్లాడుతూ తాను బీజేపీలో ఉండగా ఎదుటి పక్షాలను ప్రత్యర్థులుగా మాత్రమే చూశానని, శత్రువులుగా చూడలేదన్నారు. శివరాత్రి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేగా దాస్యం వినయ్భాస్కర్ను పిలిస్తే పార్టీ తనను సస్పెండ్ చేసిందన్నారు. మండలి ఎన్నికల్లో ఓరుగల్లు బిడ్డనైన తనను ఆశీర్వదించాలని కోరారు. -
రాష్ట్ర వైద్య మండలి తనిఖీలు
ఎంజీఎం: వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో మంగళవారం రాష్ట్ర వైద్య మండలి సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, అశోక్రెడ్డి, ఎం.సుదీప్, అన్వర్మియా, నరేశ్కుమార్ నకిలీ వైద్యుల క్లినిక్లపై తనిఖీ చేపట్టారు. వరంగల్ ఫోర్ట్ రోడ్డలో రమేశ్, కొత్తవాడలో కుమార్, కడిపికొండలో వేణు, శ్రీనివాస్, అశోక్కుమార్, కాజీపేట వాటర్ ట్యాంక్ వద్ద కుమారస్వామి ఆర్ఎంపీ, పీఎంపీ పేరుతో అర్హతకు మించి వైద్యం చేస్తూ.. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు తెలిపారు. భీమారంలో కృష్ణప్రసాద్ అనే నకిలీ వైద్యుడు సిరి క్లినిక్ పేరుతో డాక్టర్గా అవతారమెత్తి విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్, హైడోస్ యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. అదేవిధంగా కాజీపేట, కడిపికొండలో తనిఖీలు చేశారు. రాష్ట్రీయ బాల పురస్కార్కు దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట అర్బన్: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ జాతీయ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బుధవారం హనుమకొండ జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఇన్చార్జ్ అధికారి మధురిమ ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లలోపు బాలబాలికలు ఆవిష్కరణ, సృజనాత్మకత, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, స్పోర్ట్స్, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ప్రతిభ కనబర్చే బాలబాలికలు రాష్ట్రీయ బాలపురస్కార్కు జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్లో awards.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
వరంగల్లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
వరంగల్: బాంబులతో వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల కూల్చివేత జరుగుతుండగా.. బాంబుల మోతతో నగరం దద్దరిల్లింది. పెద్ద శబ్దాలకు చుట్టుపక్క ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిన్న తప్పిదం జరిగినా భారీ నష్టం వాటిళ్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఉండటం గమనార్హం.ఇక.. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల తొలగింపు పనులు చకచకా సాగుతున్నాయి. రూ.70 కోట్లతో అధునాతన బహుళ అంతస్తుల బస్స్టేషన్ నిర్మాణంలో భాగంగా సిటీ బస్స్టేషన్ను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత బాంబుల (జిలెటిన్ స్టిక్స్)తో భవనాలను కూల్చి వేశారు. పురాతన భవనాలు దృఢంగా ఉండటంతో ఎక్స్కవేటర్లతో కూల్చడం సాధ్యం కాకపోవడంతో, కూల్చివేతలకు పేలుడు పదార్థాలు ఉపయోగించారు. -
పనులు వేగవంతం చేయాలి..
చెరువును సుందరీకరిస్తామని పాలకులు చెప్పడంతో చాలా సంతోషపడ్డాం. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే నిలిపివేశాడు. చెరువు చుట్టు రోడ్డువేస్తే ఉదయం వేళ వాకర్స్కు ఎంతో ఉపయోగకంగా ఉంటుదనుకుంటే చెత్తాచెదారంతో నింపుతున్నారు. భరించరాని దుర్గంధం రావడంతో చెరువు కట్టపై వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా చెత్తాచెదారం వేయకుండా చెరువును సుందరీకరించాల్సిన అవసరం ఉంది. –సూర రాజేందర్, ప్రైవేట్ లెక్చరర్, పరకాల పనులు పూర్తయితే ఆహ్లాదకరం.. దామెర చెరువు ట్యాంక్బండ్ నిర్మాణ పనులు పూర్తయితే పట్టణంలో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. చెరువు కట్ట, రోడ్డు వెంట చెత్తాచెదారం వేయవద్దని అధికారులు, కమిషనర్ను కలిసి కోరాం. చెరువు కట్ట వద్ద అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. –బి.పూర్ణాచారి, కౌన్సిలర్, పరకాల -
పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలు
దామెర: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మందుబాబుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాలలో మద్యం సేవించడంతోపాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సోమవారం రాత్రికూడా కొంత మంది వ్యక్తులు మద్యం తాగి బాటిళ్లను పడేశారు. అంతేకాకుండా డిస్పోజల్ గ్లాసులు, ఖాళీ కార ప్యాకెట్లు వదిలివెళ్లారు. మంగళవారం పాఠశాలకు వచ్చిన కొంతమంది గ్రామస్తులు చూడటంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. అదేవిధంగా కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. పాఠశాల చుట్టూ ప్రహరీ ఉన్నప్పటికీ గేట్ లేకపోవడంతో ఇష్టానుసారంగా మందుబాబులు లోపలికి ప్రవేశిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా గేటు ఏర్పాటుచేసి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రేమ వివాహం చేసుకుందని..
శాయంపేట : ఫిర్యాదు చేసిన గంట సమయంలోపే కిడ్నాప్ కేసును శాయంపేట పోలీసులు ఛేదించారు. ఎస్సై ప్రమోద్కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని ప్రగతిసింగారం గ్రామానికి చెందిన ముకుంట్ల తరుణ్ రెండు నెలల క్రితం హనుమకొండ పట్టణంలోని పెగడపల్లికి చెందిన ఆకుల బిందును ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో ఇరువర్గాల వారు పోలీస్ స్టేషన్ను సంప్రదించారు. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బిందు తల్లి ఆకుల కవిత, అమ్మమ్మ అన్యం విజయ, మరో ముగ్గురు ఆటోలో ప్రగతిసింగారం గ్రామానికి వచ్చారు. తరుణ్ లేని సమయంలో బిందును బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని వెళ్లారు. విషయం తెలుసుకున్న అరుణ్ తన భార్యను కిడ్నాప్ చేశారని శాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై ప్రమోద్కుమార్ కేసు నమోదు చేసి ఫిర్యాదు ఇచ్చిన గంటలోపే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని నిందితులను పట్టుకొని బిందును భర్త తరుణ్కు అప్పగించారు. నిందితులను త్వరితగతిన పట్టుకున్న ఎస్సై ప్రమోద్కుమార్, కానిస్టేబుల్ సాధన్, నాగరాజును పరకాల ఏసీపీ కిశోర్కుమార్, శాయంపేట సీఐ రంజిత్రావు అభినందించారు. ప్రగతిసింగారంలో కూతురిని కిడ్నాప్ చేసిన తల్లి ఫిర్యాదు చేసిన గంటలోపే ఛేదించిన పోలీసులు టెక్నాలజీ సాయంతో నిందితుల అరెస్ట్ అభినందించిన పరకాల ఏసీపీ కిశోర్కుమార్ -
జాడలేని సుందరీకరణ
పరకాల: రూ.ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా సరే సుందరీకరణతో చెరువును అద్దంలా మారుస్తాం.. పరకాల ప్రజలు సాయంత్ర వేళ కుటుంబ సభ్యులతో సేదతీరేందుకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పి స్తామని పాలకులు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు. పట్టణం నడిబొడ్డున ఉన్న దామెర చెరువు ట్యాంక్బండ్ మాత్రం చెత్తాచెదారంతో కంపుకొడుతోంది. దామెర చెరువు ట్యాంక్బండ్ నిర్మాణం కోసం రూ.5.18 కోట్ల నిధులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే రూ.3 కోట్ల నిధులతో చెరువు కట్ట, చుట్టూ రోడ్డు, కొత్తగా మత్తడి నిర్మాణం చేపట్టారు. మిగిలిన రూ.2.18 కోట్లతో చెరువు ట్యాంక్బండ్ నిర్మాణ పనులు చేపట్టి సుందరీకరణ చేయాల్సి ఉంది. కానీ, బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ మూడు నెలల క్రితం పనులు నిలిపివేశాడు. దీంతో చెరువు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. రాత్రి వేళ చెరువు కట్ట వద్ద కొంతమంది యువకులు మద్యం సేవిస్తున్నారు. సందర్శకులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తాగిన మద్యం సీసాలు చెరువులో పడేయటంతోపాటు మత్తడి వద్ద పగులగొడుతున్నారు. గతంలో చెరువు కట్టపై ఓ ఉపాధ్యాయుడిపై దాడి చేసి ఆయన మెడలోని చైన్, సెల్ఫోన్ ఎత్తుకెళ్లారు. సమాచారం అందగానే పరకాల పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకొని అరెస్టు చేయడంతో బాధిత ఉపాధ్యాయుడు ఊపిరి పీల్చుకున్నాడు. బోటింగ్పై ఆసక్తి చూపని ప్రజలు రెండేళ్ల క్రితం ఎంతో హడావుడిగా ప్రారంభించిన బోటింగ్పై పట్టణ ప్రజలు పెద్ద ఆసక్తి చూపలేకపోయారు. బోటింగ్ చేయాలంటే చెరువు చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం లేకపోవడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో పర్యాటక శాఖ అధికారులు బోటింగ్ను దామెర చెరువు ట్యాంక్బండ్ నుంచి తొలగించారు. చెరువు రోడ్డుపై చెత్తాచెదారం.. దామెర చెరువు సుందరీకరణ మాట అటుంచితే పట్టణ పరిధిలోని కొందరు చికెన్, మటన్్ వ్యాపారులు వ్యర్థాలను చెరువులో వేస్తూ నీటిని మరింత కలుషితం చేస్తున్నారు. చెత్తను చెరువు రోడ్డులో డంపింగ్ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. చెరువును సుందరీకరించాల్సిన పురపాలక సంఘం అధికారులు, పాలకవర్గం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం వెల్లువెత్తుతున్నాయి. చెరువు రోడ్డులో చెత్తవేయకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
కోణార్క్ ఎక్స్ప్రెస్లో 14 కిలోల గంజాయి పట్టివేత
కాశిబుగ్గ: భువనేశ్వర్ నుంచి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్కు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో తరలిస్తున్న 14.254 కిలోల గంజాయిని సోమవారం రాత్రి పట్టుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఎస్సై ఐలయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా గంజామ్ బరంపూర్కు చెందిన టికిన దాస్(37), బికి బెహరా(26)లు బరంపూర్ నుంచి దాదర్కు గంజాయిని కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో రవాణా చేస్తుండగా ఆర్పీఎఫ్, జీఆర్పీ, సీపీడీఎస్ సిబ్బంది సంయుక్తంగా మహబూబాబాద్, వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్యలో తనిఖీలు చేపట్టారు. జనరల్ బోగీలో అనుమానాస్పదంగా సీట్ల కింద హ్యాండ్ బాగులతో ఇద్దరు కనిపించారు. వారిని వరంగల్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫాం 2లో దించి బ్యాగులను తనిఖీలు చేయగా ఎండు గంజాయి లభించింది. వాటిని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపించామని ఎస్సై తెలిపారు. గంజాయి విలువ రూ.3,56,350 ఉంటుందని ఎస్సై తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
వర్ధన్నపేట: ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ గోపి అన్నారు. మండలంలోని ఇల్లంద వ్యవసాయ మా ర్కెట్ కమిటీ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం గోపి పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు గురించి రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు సేకరించారు. జూన్ మొదటి వారంలోగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందశాతం కొనుగోళ్లు పూర్తికావాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం నిర్ధేశించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. 14,158.8 క్వింటాళ్ల ధాన్యం సేకరించి రైస్ మిల్లులకు తరలించిన ట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ కౌసల్యాదేవి, వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాళ్, జిల్లా పౌరసరఫరాల అధికారి శివ ప్రసాద్రెడ్డి, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకుడు, ఉమ్మడి వరంగల్ స్పెషల్ ఆఫీసర్ గోపి -
మహిళలు అదనపు ఆదాయాన్ని పొందాలి
చెన్నారావుపేట: మహిళలు కుట్టుమిషన్ ద్వారా అదనపు ఆదాయాన్ని పొందాలని డీఆర్డీఓ కౌసల్యాదేవి అన్నారు. ఈ మేరకు మండలంలోని జల్లీ, అమీనాబాద్ గ్రామాల్లో గ్రామ సంఘాల ఆధ్వర్యంలో మహిళలు ఏర్పాటు చేసుకున్న సీ్త్ర శక్తి కుట్టు కేంద్రాలను అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవితో కలిసి ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కౌసల్యాదేవి మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థుల యూనిఫాంలు కుట్టడం ద్వారా పనిలో మెలకువలతోపాటు ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశముందని అన్నారు. ఈసందర్భంగా మహిళల పనితీరును మెచ్చుకున్నారు. అడిషనల్ డీఆర్డీఓ రేణుక దేవి మాట్లాడుతూ.. కొలతల ప్రకారం.. నాణ్యతలోపాలు లేకుండా కుడితే మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. కుట్టు పరికరాల కోసం రుణాలు కూడా అందిస్తామని తెలిపారు. కూలీలకు పనులు కల్పించాలి ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో కూలీలకు పనికల్పించాలని డీఆర్డీఓ కౌసల్యాదేవి తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలో మంగళవారం ఉపాధి హామీ పథకంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతీ గ్రామంలో 200మంది కూలీలకు పనులు కల్పించాలన్నారు. మండలంలో 150 ఫాంపాండ్లు, 10 ఫిష్ బ్రీడింగ్ పాండ్స్, 150ఎకరాల్లో హార్టికల్చర్ ప్లాంటేషన్లు చేయించాలని తెలిపారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో వర్షపు నీటిని భూమిలో ఇంకేందుకు రూఫ్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, కమ్యూనిటీ సోక్ ఫిట్స్ నిర్మించాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ శంకర్, ఏపీఎం ఈశ్వర్, సీసీలు మంజుల, వీఓ ఏలు ఆస్మా, పర్వీన్, రమ, కోమల పాల్గొన్నారు. సకాలంలో యూనిఫామ్స్ అందించాలి నెక్కొండ: పాఠశాలల పునఃప్రారంభంలోపు విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలు అందేలా చూడాలని డీఆర్డీఓ కౌసల్యాదేవి అన్నారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని దీక్షకుంట కుట్టు మిషన్ కేంద్రాన్ని ఆమె సందర్శించి, మాట్లాడారు. స్కూల్ యూనిఫామ్స్ కుట్టే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. క్లాత్ కటింగ్పై నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. కుట్టడం పూర్తయిన యూనిఫాములను ఆమె పరిశీలించారు. ఎలాంటి జాప్యం లేకుండా కుట్టు మిషన్ కేంద్రాల్లో పనులు సాగేలా అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. అనంతరం యూనిఫాంను కౌసల్యాదేవి కుట్టి చూపారు. సమావేశంలో ఏడీఆర్డీఓ రేణుకాదేవి, డీపీఎం దయాకర్, ఏపీఎం శ్రీనివాస్, భానుప్రసాద్, రవీందర్, మాణిక్యం, శారద, వెంకటయ్య, వీఓఏ పోశాల ఏకాంబ్రం, లత, మధులత, విమల, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. డీఆర్డీఓ కౌసల్యాదేవి -
సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులు సరికాదు
వర్ధన్నపేట: సోషల్మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్డడం బాధాకరమని వర్ధన్నపేట సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ నరసింహస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 19న వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఫోన్ మాట్లాడుతూ.. గర్భిణికి ఆపరేషన్ చేసిందన్న విషయం పూర్తిగా అవాస్తవమని అన్నారు. బాధితురాలు ప్రభుత్వ ఆస్పత్రిలో మొదటి కాన్పు సుఖప్రసవం కాగా రెండో కాన్పు నిమిత్తం ఆస్పత్రిని ఆశ్రయించగా నార్మల్ డెలివరీ చేశామని తెలిపారు. శిశువుకు ఆక్సీజన్ లెవెల్ తక్కువగా ఉండడంతో మెరుగైన చికిత్సకోసం అంబు లెన్స్లో వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఎంజీఎంలో ఒకరోజు చికిత్సఅనంతరం మరుసటి రోజు చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. ఈ విషయమై వైద్యశాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించామని తెలిపారు. కొంతమంది వ్యక్తులు సోషల్మీడియా వేదికగా నిజానిజాలు తెలియకుండా ఆస్పత్రి సిబ్బందిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంపై మంగళవారం అసిస్టెంట్ డీఎంహెచ్ఓ గోపాలరావు ఆస్పత్రిని సందర్శించి మెరుగైన వైద్యంకోసం డాక్టర్లు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేవచేయాలని ఆదేశించినట్లు తెలిపారు. -
సీఈఐఆర్తో ఫోన్ రికవరీ సులభం
వరంగల్ క్రైం : సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) వెబ్సైట్లో వివరాలు నమో దు చేస్తే పోయిన సెల్ఫోన్ను తిరిగి పొందే అవకా శం ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్నవారి సెల్ఫోన్లను సీఈఐఆర్ వెబ్సైట్ ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు 142సెల్ఫోన్లను మంగళవారం యజమానులకు అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సీఈఐఆర్ వెబ్సైట్ ఎంతో ఉపయోగకరంగా ఉంద ని, మొబైల్ పోగొట్టుకువారు అదే నంబర్తో కొత్త సిమ్ తీసుకొని, మీ సేవలో మొబైల్ లాస్ట్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం www. ceir.gov.inలో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లా స్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ను క్లిక్ చేయాలి. పోయిన సెల్ఫోన్ ఐఎంఈ నంబర్, కంపెనీ పేరు, మోడల్, కొనుగోలు చేసిన రశీదు, మీ సేవ దరఖాస్తు రశీదు నంబర్ను అప్లోడ్ చేయాలని చెప్పారు. మొబైల్ ఏ రోజు, ఎక్కడ పోయింది, రాష్ట్రం, జిల్లా, పోలీస్ స్టే షన్ వివరాలు, వినియోగదారుడి పేరు, చిరునా మా, గుర్తింపుకార్డు, ఈ–మెయిల్ ఐడీ నమోదు చే యాలన్నారు. ఇదంతా పూర్తయిన తర్వాత తమ పరిధిలోని పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా -
అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
నల్లబెల్లి: మండలంలోని గొవిందాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు ఇంటికి ని ప్పు అంటుకుని బొట్ల సమ్మక్క పూరిల్లు దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బొట్ల సమ్మక్క కుటుంంబ సభ్యులు రాత్రి ఇంట్లో నిద్రపోయారు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కుటుంబ సభ్యులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండాపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమా రు రూ.2లక్షల వరకు నష్టపోయినట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఎండు గంజాయి స్వాధీనంసంగెం: మండలంలోని ఎల్గూర్రంగంపేటలో ఎండు గంజాయిని పట్టుకున్నట్లు వర్ధన్నపేట ఎకై ్సజ్ సీఐ స్వరూప తెలిపారు. నర్సానగర్ గ్రామపంచాయతీ శివారు జాటోత్ తండాకు చెందిన లావుడ్యా వెంకన్న తన ద్విచక్ర వాహనంపై ఎండు గంజాయిని తరలిస్తున్నాడనే పక్కా సమాచారం మేరకు మంగళవారం తనిఖీలు చేపట్టామన్నారు. వెంకన్న వద్ద పది చిన్న ప్యాకెట్లతో ఉన్న సుమారు వంద గ్రాముల ఎండు గంజాయిని, బైక్ను స్వాదీనం చేసుకుని వెంకన్నపై కేసు నమోదు చేసినట్లు సీఐ స్వరూప వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి మురళీధర్, సరిత, సిబ్బంది పాల్గొన్నారు. విత్తన ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి వర్ధన్నపేట: విత్తన ఎంపిక, కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ సూచించారు. మండలంలోని వర్ధన్నపేట, ఇల్లంద, కట్య్రాల, ఉప్పరపల్లి, చెన్నారం, నల్లబెల్లి గ్రామాల్లో విత్తనాల దుకాణాలను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన ప్రాంతానికి అనువైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని విత్తన డీలర్లకు సూచించారు. విత్తన రకాన్ని ఎంచుకునేందుకు అనుసరించే పద్దతులను రైతులకు వివరించారు. కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకుని రైతులు తమ భూములను సారవంతం చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులకు రాయితీపై జీలుగలను అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ ప్రాంత ఏఈఓలను సంప్రదించి పచ్చిరొట్ట విత్తనాలను రాయితీపై పొందాలని తెలిపారు. ‘తీన్మార్ మల్లన్నను గెలిపించాలి’నర్సంపేట: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుక, నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచి నిజమైన జర్నలిస్టుగా ప్రజలకు వివరించిన తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషకరమన్నారు. ఇందులో భాగంగా ఈనెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఉపఎన్నికలో నర్సంపేట నియోజకవర్గంలోని పట్టభద్రులు అధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, పార్టీ మండల అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కేయూ ఇన్చార్జ్ వీసీగా వాకాటి కరుణ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీగా ఐఏఎస్ అధికారి వాకాటి కరుణను నియమించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. కొత్త వీసీ నియామకానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇన్చార్జ్ వీసీగా కరుణను నియమించారు. ప్రస్తుతం ఆమె మహిళా శిశు దివ్యాంగుల, సినియర్ సిటిజన్ శాఖ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు జాయింట్ కలెక్టర్గా మూడున్నరేళ్లు పనిచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015–2016లో వరంగల్ అర్బన్ కలెక్టర్గా పనిచేశారు. కేయూ భూముల అన్యాక్రాంతంపై అప్పట్లోనే దృష్టి కలెక్టర్గా వాకాటి కరుణ ఉన్న సమయంలో కాకతీయ యూనివర్సిటీలో భూముల అన్యాక్రాంతంపై దృష్టి సారించారు. పలుచోట్ల వర్సిటీ భూములకు సంబంధించిన హద్దుల వద్ద బోర్డులు పెట్టించారు. ఇప్పుడు ఇన్చార్జ్ వీసీగా రానుండడంతో భూముల ఆక్రమణలకు సంబంధించిన వ్యవహారంపై మళ్లీ దృష్టి సారిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. కొంతకాలం క్రితమే ల్యాండ్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి అందులో ఏముందో బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేడు బాధ్యతల స్వీకరణ? కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీగా వాకాటి కరుణ బుధవారం బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. వీసీ తాటికొండ రమేష్ పదవీకాలం ముగిసింది. ఆమెకు చార్జ్ అప్పగించాల్సింటుంది. ఇందుకు ఆయన హైదరాబాద్కు వెళ్తారా లేక చార్జ్ ఇచ్చినట్లుగా లెటర్పై సంతకం చేసి ఇస్తారా అనేది వేచి చూడాలి. ఒకవేళ చార్జ్ ఇచ్చే విధంగా లెటర్పై సంతకం రమేష్ చేసిస్తే రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి తీసుకెళ్లి ఆమెకు అందించనున్నారు. ఈ మేరకు మల్లారెడ్డి మంగళవారం రాత్రి వీసీ రమేష్తో మాట్లాడేందుకు వెళ్లినట్లు తెలిసింది. నేడు బాధ్యతల స్వీకరణ -
పనులు త్వరగా పూర్తి చేయండి
అదనపు కలెక్టర్ రాధికాగుప్తా శాయంపేట : అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాధికాగుప్తా అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, కొత్తగట్టు సింగారంలోని ప్రాథమికోన్నత పాఠశాల, మాందారిపేటలోని ప్రాథమిక పాఠశాల, తహరాపూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పనులను సోమవారం రాధికాగుప్తా సందర్శించి పరిశీలించారు. విద్యుత్ వైరింగ్, నల్లాల ఏర్పాటు, ఫ్లోరింగ్ టైల్స్ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. గడువులోగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఫణిచంద్ర, డీఈ రవీందర్, ఏఈ రాజు, ఇన్చార్జ్ ఎంఈఓ రమాదేవి, ఆయా పాఠశాలల ప్రధానోపాద్యాయులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
No Headline
నర్సంపేట: ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈసందర్భంగా సోమవారం ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ.. వర్షాలకు ధాన్యం తడిసిందని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుందని రైతులకు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని నాణ్యత లోపం పేరుతో రైతులను రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని, తడిసిన ధాన్యానికి కోతలు పెట్టొద్దని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తరలించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తడిసిన ధాన్యంపై రైతులను ప్రతిపక్ష పార్టీల నాయకులు ఉసిగొల్పడాన్ని ఖండించారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించరాదని, తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొని రైతులకు అండగా నిలుస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఆందోళన చెందొద్దు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
ఎంటీపీ చట్టంపై అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్ఓ సాంబశివరావు ఎంజీఎం : లింగ నిర్ధారణ, బాలికలపై వివక్ష, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టాలపై ప్రభుత్వ విభాగాలు, ఆయా స్వచ్ఛంద సంస్థ బాధ్యులు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు తెలిపారు. సోమవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో గర్భస్థ పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టంపై జిల్లాస్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ గర్భిణులు పరీక్షల నిమిత్తం, లింగ నిర్ధారణ, అబార్షన్ కోసం అర్హత లేని వైద్యుల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. జిల్లాలో గుర్తింపు, అర్హత లేని వ్యక్తులు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టం ఉల్లంఘించే వారి వివరాలు 104, 1098, డయల్ 100కి తెలియజేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎండీ యాకూబ్ పాషా, వైద్యులు ఉషారాణి, నిరంజని దేవి, మానస, తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి
మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, సుంకె రవిశంకర్ వేలేరు/ధర్మసాగర్ : వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. సోమవారం వేలేరు, ధర్మసాగర్లలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సన్నాహక సమావేశాలకు వారు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఓ బ్లాక్ మెయిలర్ అని, అతన్ని నమ్మే స్థితిలో పట్టభద్రులు లేరన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తీన్మార్ మల్లన్న కంటే పెద్ద నయవంచకుడు, మోసగాడని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఉన్నత విద్యావంతుడని, ఇప్పుడు తెలంగాణకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకని తెలిపారు. ధర్మసాగర్ మండలంలో 3 బూత్లు ఉన్నాయని,1,704 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఒక బూత్కు 10 మంది ఇన్చార్జ్ల చొప్పున మూడు బూత్లకు 30 మందిని నియమించాలని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని, తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పి పట్టభద్రుల వద్ద ఓటు అడగాలని డిమాండ్ చేశారు. ఆయా సమావేశాల్లో జెడ్పీటీసీ చాడ సరిత, వైస్ ఎంపీపీ సంపత్, ఎంపీటీసీ సంధ్య, కోఆష్షన్ సభ్యుడు జానీ, పార్టీ మండల అధ్యక్షుడు మరిజె నర్సింగరావు, మునిగెల రాజు, నాయకులు బొడ్డు ప్రభుదాస్, కర్ర సోమిరెడ్డి, లాల్ మహ్మద్, గుర్రపు ప్రవీణ్, కాయిత మాధవరెడ్డి, గోవింద సురేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
దీప్తి.. ఓరుగల్లుకు ఘన కీర్తి
పర్వతగిరి: పారా అథ్లెటిక్స్లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండల వాసి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈనెల 17వ తేదీ నుంచి జపాన్లో జరిగిన కోబ్–24 వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన జీవంజి దీప్తి భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించింది. ఇందులో భాగంగా ఉమెన్స్ టీ–20 కేటగిరీ 400 మీటర్ల పరుగులో కేవలం 55.07 సెకండ్స్లో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించింది. 2024 పారిస్లో జరిగే పారా ఒలింపిక్స్కి అర్హత సాధించింది. 20 ఏళ్ల వయస్సులోనే అతి పెద్ద మైలు రాయిని అందుకుని ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన ఘనతను ఆమె సొంతం చేసుకుంది. కాగా.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన దీప్తిని పారా స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ గడిపెల్లి ప్రశాంత్, కోచ్ నాగపురి రమేశ్, ప్రెసిడెంట్ సింగారపు బాబు, అసోసియేషన్ బాధ్యులు అభినందించారు. దీప్తి గతేడాది పారిస్లో జరిగిన చాంపియన్ షిప్లో అమెరికాకు చెందిన బ్రెన్నాక్లార్క్ నెలకొల్పిన 55.12 సెకన్ల ప్రపంచ రికార్డును అధిగమించింది. దీంతో పారిస్–24 పారా ఒలింపిక్స్కి కూడా దీప్తి క్వాలిఫై అయ్యింది. ఉత్తమ ప్రతిభ కనబర్చి తెలంగాణకు గుర్తింపును తీసుకొచ్చింది. ఆమెను కుటుంబ సభ్యలు, స్నేహితులు క్రీడాభిమానులు అభినందించారు. పారా అథ్లెటిక్స్లో వరల్డ్ రికార్డ్ అభినందనల వెల్లువ -
ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య
చెన్నారావుపేట: ఆర్థిక ఇబ్బందులతో మండలంలోని ముగ్ధుంపురానికి చెందిన కున్సోతు సుజాత(28) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన కున్సోతు సూర్య తో ఆమెకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. సూర్య లారీ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల వీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. ఇంటి నిర్మాణానికి కొంత అప్పు చేశారు. ఈనేపథ్యంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపం చెందిన సుజాత ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం ఆమెను నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ సుజాత మృతి చెందింది. మృతురాలి తండ్రి బానోతు కీమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు చెన్నారావుపేట ఎస్ఐ గూడ అరుణ్కుమార్ సోమవారం తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement