-
నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
కల్వకుర్తి టౌన్: సైబర్ నేరగాళ్ల బారినపడి డబ్బులు పోగొట్టుకున్న బాధితులు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ గిరికుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో సైబర్ క్రైమ్ బాధితులు, పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆన్లైన్లో అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు సైబర్ క్రైమ్ పోలీసులు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. పోలీసులు లేదా డయల్ 1930 నంబర్కు ఫిర్యాదు చేసిన బాధితుల డబ్బులు సైబర్ నేరగాళ్లకు చేరకుండా ఫ్రీజ్ చేశామని చెప్పారు. వాటిని కోర్టు ద్వారా బాధితులకు తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జూన్ 8వ తేదీన నిర్వహించే మెగా లోక్అదాలత్లో బాధితుల డబ్బులను కోర్టు ద్వారా అందిస్తామని సూచించారు. డివిజన్లోని ఆయా పోలీస్స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా బాధితులకు ఎస్ఐలు, కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు సహాయం అందిస్తారని తెలిపారు. సమావేశంలో సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐలు వీరబాబు, రాజశేఖర్, మాధవరెడ్డి, రవి, మహేందర్ తదితరులు ఉన్నారు. -
అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
తాడూరు/తెలకపల్లి/బిజినేపల్లి: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంగళవారం కేంద్ర ఏఎస్ఓల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. తాడూరు మండలం అల్లాపూర్ గ్రామంలో అధికారులు ఆదిత్య స్వరూప్, ప్రమీజ్కుమార్ వర్మ, అజిత్కుమార్, దీపక్ ఉజ్వల్ పర్యటించారు. గ్రామంలో పరిసరాల పరిశుభ్రత, వైకుంఠధామం నిర్వహణ, డంపింగ్యార్డు ఉపయోగం, పల్లెప్రకృతి వనాల నిర్వహణ వివరాలను ఎంపీడీఓ జ్యోతి పరోసియా, పంచాయతీ కార్యదర్శి వినోద్కుమార్తో తెలుసుకున్నారు. రైతువేదికల వినియోగం, అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. ● తెలకపల్లిలోని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, విద్యాలయాలను కేంద్ర ఏఎస్ఓల బృందం పరిశీలించింది. ఈసందర్భంగా అధికారులతో సమావేశ మై పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. నిధు లు, ఆదాయం, వ్యయాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించారు. ఈనెల 24వ తేదీ వరకు ఆయా శాఖల సమాచారాన్ని కేంద్ర బృందం సేకరిస్తుందని ఎంపీడీఓ కృష్ణయ్య తెలిపారు. ● బిజినేపల్లిలోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను కేంద్ర ఏఎస్ఓల బృందం దీక్షాంత్, రవీందర్, కావ్యాన్సు సోని, దర్పన్, సత్యేంద్ర పరిశీలించి, పనితీరును తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, మహిళా సమాఖ్యల పనితీరుపై ఆరా తీశారు. వారి వెంట ఎంపీడీఓ కథలప్ప ఉన్నారు. -
గిరిజన గురుకులంలో స్పాట్ అడ్మిషన్స్
మన్ననూర్: అమ్రాబాద్ మండలం మన్ననూర్ గిరిజన బాలుర గురుకుల జూనియర్ కళాశాలలో ఖాళీ సీట్ల భర్తీకిగాను స్పాట్స్ అడ్మిషన్స్ తీసుకుంటున్నట్లు ప్రిన్సిపాల్ నిమ్మల పద్మావతి మంగళవారం ప్రకటనలో తెలిపారు. 2023–24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఈసీలో 29, హెచ్ఈసీలో 34 సీట్లు ఖాళీగా ఉన్నాయని.. విద్యార్థులు సాధించిన జీపీఏ ప్రాతిపదికన సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి గ్రూప్లో ఇతరులకు 5 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈనెల 23వ తేదీన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమలహిల్స్ గిరిజన గురుకుల ఆర్సీఓ కార్యాలయంలో స్పాట్ అడ్మిషన్స్కు సంబంధించి కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు రెండు జిరాక్స్ సెట్లు, 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. దరఖాస్తు చేసుకోండి నాగర్కర్నూల్ క్రైం: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో 2024–25 విద్యా సంవత్సరం 3, 5, 8 తరగతుల్లో ప్రవేశానికిగాను జిల్లాకు చెందిన గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. 3వ తరగతిలో 10 సీట్లు, 5లో 6 సీట్లు, 8లో 4 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారి వార్షిక ఆదాయం రూ. లక్ష 50వేల లోపు, పట్టణ ప్రాంతానికి చెందిన వారి వార్షిక ఆదాయం రూ. 2లక్షల లోపు ఉండాలని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు జూన్ 6వ తేదీలోగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు నాగర్కర్నూల్ క్రైం: మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ రామేశ్వర్ అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్ ఆవరణలో సీఎన్ఆర్ మెమోరియల్ పాఠశాల విద్యార్థులకు షీ టీంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పర్చుకొని ముందుకుసాగాలని సూచించారు. మహిళలు, బాలికలతో దురుసుగా ప్రవర్తించినా.. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పోలీసు వ్యవస్థ పనితీరుపై విద్యార్దులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ గోవర్ధన్, షీ టీం ఏఎస్ఐ విజయలక్ష్మి, వెంకటయ్య ఉన్నారు. -
భక్తిభావంతో మెలగాలి
కల్వకుర్తిరూరల్: ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని మార్చాలలో మంగళవారం నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డిని ఉత్సవాల నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్కుమార్రెడ్డి, మాజీ సర్పంచులు ఆనంద్కుమార్, రాములు, జంగయ్యగౌడ్ పాల్గొన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్కర్నూల్: ఈనెల 24నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ సీతారామారావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు రెండు సెషన్లలో ఉంటాయని తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్.. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటలకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రశ్నపత్రాలను ఆయా రూట్ల వారీగా పోలీసు బందోబస్తు మధ్య తీసుకెళ్లాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు తగిన పోలీసు బందోబస్తు ఉండేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. వేసవి దృష్ట్యా ప్రతి పరీక్ష కేంద్రంలో తప్పనిసరిగా మంచినీటి వసతి కల్పించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం, తగినంత గాలి, వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలన్నారు. విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. మొదటి సంవత్సరం 4,037 మంది, ద్వితీయ సంవత్సరం 2,511 మందితో కలిపి మొత్తం 6,548, మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు 21 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంట్ అధికారిని నియమించినట్లు తెలిపారు. సమావేశంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ తదితరులు ఉన్నారు. -
మారని తీరు..
జనరల్ ఆస్పత్రిలో అందని స్పెషలిస్ట్ వైద్యసేవలు ●డాక్టరు రాలేదని అంటున్నరు.. నాకు మూడు రోజుల నుంచి పన్ను నొప్పి ఎక్కువ అయ్యిందని దవాఖానకు వస్తే, ఇక్కడ డాక్టరు రాలేదని చెబుతున్నారు. రెండు గంటల నుంచి ఇక్కడే ఎదురుచూస్తున్నాను. 12 గంటలు కావస్తున్నా ఇప్పటి వరకు డాక్టరు రాలేదు. మరో రోజున రావాలని చెబుతున్నారు. దూరం నుంచి వచ్చిన. డాక్టరు లేక మందులు లేకుండానే ఇంటికి పోతున్నాను. – మల్లమ్మ, గోవిందాయిపల్లి, తాడూరు మండలం నిరంతరం పర్యవేక్షణ.. జనరల్ ఆస్పత్రిలో ఇప్పటికే బయోమెట్రిక్ విధానాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నాం. వైద్యుల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. డాక్టర్లు ఎవరైనా ఓపీ సమయాల్లో అందుబాటులో లేకపోతే చర్యలు తీసుకుంటాం. రోగులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో సేవలు అందేలా చూస్తున్నాం. – డా.రఘు, సూపరింటెండెంట్, జిల్లా జనరల్ ఆస్పత్రి సాక్షి, నాగర్కర్నూల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి జనరల్ ఆస్పత్రిగా అప్గ్రేడ్ అయినప్పటికీ.. వసతులు మాత్రం మెరుగుపడటం లేదు. ఆస్పత్రిలోని కొందరు వైద్యుల తీరు విమర్శలకు దారితీస్తోంది. కొన్ని స్పెషలిస్టు విభాగాల్లో డాక్టర్లు ఓపీ సమయాల్లోనూ రోగులకు అందుబాటులో ఉండటం లేదు. ఉదయం 11 గంటల తర్వాత ఆలస్యంగా విధులకు హాజరవుతూ.. మధ్యాహ్నం 12:30 గంటలకే తిరుగుప్రయాణం అవుతుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు స్పెషలిస్టు విభాగాల డాక్టర్లు అసలు అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంది. జనర ల్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా బయోమెట్రిక్ విధానాన్ని అమలుపరుస్తున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఎక్స్రే ఫిల్మ్లకూ కొరతే.. జనరల్ ఆస్పత్రిలో రక్త పరీక్షలు, ఎక్స్రే, సిటీ స్కాన్ సేవలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. రక్త పరీక్షల కోసం వచ్చే రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వాటి రిపోర్టులు మరుసటి రోజున తీసుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. ఎక్స్రే విభాగంలో రోగులకు ఫిల్మ్లను ఇవ్వడం లేదు. ఎక్స్రే ఫిల్మ్లు అందుబాటులో లేవని.. నేరుగా సంబంధిత డాక్టరు వాట్సప్ నంబర్కే పంపుతామని చెబుతుండటం గమనార్హం. జనరల్ ఆస్పత్రి ప్రాంగణంతో పాటు వార్డులు, టాయిలెట్లతో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని రోగులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆస్పత్రిలో పారిశుద్ధ్యం, వైద్యులు, సిబ్బంది పనితీరుపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు. ఓపీ సేవల్లోనూ డాక్టర్లు లేక రోగుల అవస్థలు డెంటల్, ఈఎన్టీ సేవలకు ప్రైవేటు ఆస్పత్రులే దిక్కు అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ నామమాత్రంగా బయోమెట్రిక్.. జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల్లో చాలా మంది ప్రైవేటులోనూ వైద్యసేవలు అందిస్తున్నారు. వీరిలో కొంతమంది ప్రైవేటు క్లినిక్లు, ఆస్పత్రులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదయం వేళల్లో ఓపీ సేవలకు ఆలస్యంగా వస్తూ.. మధ్యాహ్నం త్వరగా వెళ్లిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జనరల్ ఆస్పత్రిలో బయోమెట్రిక్ అమలు చేస్తున్నప్పటికీ.. గైర్హాజరవుతున్న వారిపై చర్యలు లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం
నాగర్కర్నూల్: ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని.. జిల్లాలోని రైతులు అత్యాధునిక సాగు పద్దతులు పాటించి, అధిక లాభాలు పొందాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మామిడి సాగులో యాజమాన్య పద్ధతులు, ఎగుమతులు, లాభాలపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొల్లాపూర్ మామిడికి దేశ దేశాల్లో మంచి గుర్తింపు ఉందని.. అందుకు అనుగుణంగా రైతులు మరింత నాణ్యమైన మామిడి ఉత్పత్తులు చేయాలని సూచించారు. జిల్లాలో 14,419 మంది రైతులు 33,523 ఎకరాలలో మామిడి తోటలను సాగుచేస్తున్నారని చెప్పారు. రైతులు పంటల సాగుతో పాటు మార్కెట్ మెళకువలను పాటించడం అతి ముఖ్యమని తెలిపారు. స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతుల నుంచి సేకరించిన మామిడి కాయలను వివిధ దేశాలకు ఎగుమతులు చేస్తూ, లాభదాయకమైన మార్కెట్లను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నాగర్కర్నూల్ ప్రాంతం అన్ని పంటల సాగుకు అనుకూలమని.. రైతులు ఉద్యాన సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో ఉద్యాన పంటలపై అధికారులు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం సదస్సును విజయవంతంగా నిర్వహించిన అధికారులను కలెక్టర్ శాలువాతో సత్కరించి, మెమోంటోలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యాన శాఖ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎ.ప్రేంసింగ్, నాబార్డు ఏజీఎం ఆర్పీ నాయుడు, జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి బి.చక్రపాణి, వివిధ జిల్లాల అధికారులు సురేష్, కమల, మహేష్, నాబార్డు డీడీఎం మనోహర్రెడ్డి, డీఆర్డీఓ చిన్న ఓబులేష్, ఎల్డీఎం కౌశల్ కిషోర్ పాండే, కేవీకే పాలెం ఉద్యాన శాస్త్రవేత్త ఆదిశంకర్, ఉద్యానశాఖ కొల్లాపూర్ అధికారి ఎం.లక్ష్మణ్, కల్వకుర్తి అధికారి ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. మామిడి రైతులు అత్యాధునిక పద్దతులు పాటించాలి కలెక్టర్ ఉదయ్కుమార్ కలెక్టర్ను కలిసిన నాబార్డు డీడీఎం కలెక్టర్ ఉదయ్కుమార్ను మంగళవారం నాబార్డు డీడీఎం మనోహర్రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం మనోహర్రెడ్డి మాట్లాడుతూ నాబార్డు తరఫున గ్రాామీ ణాభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధికి అధిక మొత్తంలో రుణాలు అందేలా చూడాలని కలెక్టర్ను కోరారు. -
తెరచుకోని స్పెషలిస్టు ఓపీ గదులు..
జనరల్ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ, సాధారణ మెడికల్ ఓపీ విభాగాల్లో సేవలు సక్రమంగా అందుతున్నా.. వివిధ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించిన ఓపీ సేవలు అందించేందుకు కొందరు డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. సాధారణ ఓపీ, ప్రసూతి సేవలకు సంబంధించి వైద్యుల కొరత నెలకొనడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఆస్పత్రిలో డెంటల్, ఈఎన్టీ, మెంటల్ హెల్త్ తదితర విభాగాల్లో వైద్యులు సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ● జనరల్ ఆస్పత్రిలో ఓపీ సేవలకు ఆధార్ను తప్పనిసరి చేశారు. దీంతో సర్వర్ సమస్యల కారణంగా ఓపీ వద్ద రిజిస్ట్రేషన్ ఆలస్యం అవుతుండటంతో రోగులు గంటకు పైగా క్యూలో నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లాలోని దూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు ఓపీ స్లిప్ తీసుకున్న తర్వాత డాక్టర్లు అందుబాటులో లేకుండా పోతుండటంతో నిరాశకు గురవుతున్నారు. సంబంధిత విభాగంలో వైద్యుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈక్రమంలో రోగులను ఎమర్జెన్సీ విభాగంలో సంప్రదించాలని ఆస్పత్రి సిబ్బంది సూచిస్తున్నారు. తీరా ఎమర్జెన్సీ విభాగంలోకి వెళ్లాక, వారిని మళ్లీ సంబంధిత విభాగంలోనే డాక్టర్లను కలవాలని సూచిస్తున్నారు. సంబంధిత డాక్టరు అందుబాటులో లేడంటే, మరుసటి రోజు రావాలని ఉచిత సలహ ఇస్తున్నారు. -
గ్రామాల వనరులపై కేంద్ర బృందం అధ్యయనం
నాగర్కర్నూల్: కేంద్ర సెక్రెటరియేట్ పరిధిలోని వివిధ శాఖల అసిస్టెంట్ సెక్షన్ అధికారులు జిల్లాలోని 5 గ్రామాల్లో స్థితిగతులు, వనరులపై అధ్యయనం చేస్తారని అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వ శిక్షణ అధికారుల బృందం పర్యటనపై కేంద్ర బృందం, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో పనిచేసే అసిస్టెంట్ సెక్షన్ అధికారులు జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో ఎంపిక చేసిన ఐదు గ్రామాలను సందర్శించి.. గ్రామీణ ఆర్థిక, సామాజిక స్థితిగతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలను పరిశీలించి మండల, గ్రామస్థాయి అధికారులతో సమావేశమై పలు అంశాలపై అధ్యయనం చేస్తారన్నారు. రాష్ట్రంలోని గ్రామాల్లో స్వచ్ఛ భారత్ ద్వారా చేపట్టిన అభివృద్ధి, వివిధ అంశాల వారీగా చేపట్టిన పనులను అదనపు కలెక్టర్ బృందాల సభ్యులకు వివరించారు. కేంద్ర పరిశోధన బృందం హన్మంతు నాయకత్వంలో 5 మంది సభ్యులతో కూడిన 5 బృందాల ద్వారా 26 మంది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అసిస్టెంట్ సెక్షన్ అధికారులు శిక్షణ నిమిత్తం జిల్లాలోని ఆయా గ్రామాలను సందర్శిస్తారని చెప్పారు. చందుపట్ల, గన్యాగుల, అల్లాపూర్, బిజినేపల్లి, తెలకపల్లి గ్రామాలను ఎంపిక చేసి ప్రతి గ్రామానికి ఐదు మంది అధికారులను ఐదు రోజులపాటు సోమవారం నుంచి శుక్రవారం వరకు సందర్శించడానికి అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ చిన్న ఓబులేసు, డీపీఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
తెలకపల్లికి శిక్షణ ఐఏఎస్ల బృందం
తెలకపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను పరిశీలించడానికి ఐఏఎస్ల బృందం సోమవారం తెలకపల్లికి చేరుకుంది. స్థానిక మేజర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఐఏఎస్ల బృందం ఎంపీడీఓ కృష్ణయ్యతో సమావేశమయ్యారు. మండలానికి స్టడీ టూర్ నిమిత్తం ఆరుగురు శిక్షణ ఐఏఎస్ల బృందం సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని, వారికి అన్ని రకాల వివరాలు అందించాలని ఎంపీడీఓ తెలిపారు. సమావేశంలో ఎంపీఓ వెంకటయ్య, తెలకపల్లి ఈఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
పంటల సాగు వివరాలు (ఎకరాల్లో)..
పత్తి 2,73720 వరి 1,40,082 మొక్కజొన్న 45,237 కందులు 3,755 జొన్న 3,442 వేరుశనగ 847 ఆముదం294 మినుములు 747 హార్టికల్చర్: 57,349 ఇతర పంటలు: 5,636 విత్తనాల అవసరం అంచనా (క్వింటాళ్లలో).. వరి 35,020.50 పత్తి 8,55,540 కందులు 112.65 జొన్న 137.68 ఆముదం5.88 మొక్కజొన్న 11,309.25 మినుములు 59.76 వేరుశనగ 484.8 ఇతర పంటలు 10.055 -
అచ్చంపేటలో భారీ వర్షం
అచ్చంపేట రూరల్: పట్టణంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల కాలనీల్లోని ఇళ్లకు, దుకాణాల్లోకి నీళ్లు చేరాయి. బస్టాండు నుంచి నాగర్కర్నూల్ వెళ్లే దారి పెద్ద చెరువును తలపించింది. దీంతో గంటల పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. అలాగే ఉప్పునుంతల రోడ్డు బీఎస్ఎన్ఎల్ టవర్ సమీపంలో కల్వర్టు వద్ద భారీ వరద నీరు ప్రవహించడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మల్లకుంట వద్ద నీరు రోడ్డుపైకి వచ్చింది. కురిసిన భారీ వర్షానికి అచ్చంపేట అతలాకుతలమైంది. చాలా కాలనీల్లోకి వరద నీరు రావడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగి అంధకారం ఏర్పడింది. విద్యుత్ అధికారులు మరమ్మతు చేపడుతున్నారు. -
పక్కా ప్రణాళిక
4.73 లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు అంచనా నాగర్కర్నూల్/అచ్చంపేట: జిల్లాలో యాసంగి పంట కోతలు ముగుస్తున్న క్రమంలో రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. యాసంగి చివరలో కేఎల్ఐ నీళ్లు నిలిచిపోవడంతో వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులకు నష్టం వాటిల్లింది. ఈనేపథ్యంలో వచ్చే వానాకాలంలో అయినా మంచి దిగుబడి సాధించాలనే ఆలోచనలో రైతులు ఉన్నారు. అందుకు అనుగుణంగా జిల్లా వ్యవసాయ శాఖ పక్కా ప్రణాళికను రూపొందించింది. వానాకాలంలో పంటసాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఎలాంటి కొరత లేకుండా.. వానాకాలం సాగుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువుల కోసం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఎరువుల విషయానికి వస్తే.. జిల్లాకు 1,30,754 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు. యూరియా 53,475 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా.. ప్రస్తుతం 16,015 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. డీఏపీ 18,085 మెట్రిక్ టన్నులకుగాను 1,914, ఎస్ఎస్పీ 1,862 మెట్రిక్ టన్నులకుగాను 275, ఎంఓపీ 3,351 మెట్రిక్ టన్నులకుగాను 243, కాంప్లెక్స్ ఎరువులు 53,981 మెట్రిక్ టన్నులకుగాను 5,122 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. అయితే రైతులకు ఎరువులు అవసరమయ్యే వరకు నెలవారీ కోటా వస్తుందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా 9,02,680 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉన్నట్లు నివేదిక సమర్పించినట్లు పేర్కొంటున్నారు. రాయితీపై విత్తనాలు.. అధిక విస్తీర్ణంలో సాగయ్యే పత్తి విత్తనాలు మినహా ఇతర విత్తనాలను ప్రభుత్వం రాయితీపై అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ప్రైవేటు డీలర్లను ఆదేశించింది. పత్తి తర్వాత ఎక్కువగా సాగయ్యే వరి, కంది, మొక్కజొన్న విత్తనాలను రాయితీపై అందించే అవకాశం ఉంది. పెసర, జొన్న, మినుములు ఇతర పంటల విత్తనాలు, సేంద్రియ ఎరువుగా వినియోగించే జీలుగ, జనుము విత్తనాలు 50 వేల క్వింటాళ్ల వరకు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అత్యధికంగా వరి, పత్తిసాగయ్యే అవకాశం రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత తలెత్తకుండా అధికారుల చర్యలు అందుబాటులో 23,569 మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా 1.30 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం -
జూన్లో చల్లని కబురు..
జూన్ మొదటి వారంలో రుతుపవనాల రాకతో పాటు సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతుండటం రైతులకు చల్లని కబురుగా చెప్పవచ్చు. గతేడాది వానాకాలం ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో జూలైలో కురిసిన వర్షాలకు విత్తనాలు వేసుకున్నారు. ఈనెల ప్రారంభంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకోవడంతో వేసవి దక్కులు రాక రైతులు నిరాశ చెందారు. గత వారం రోజులుగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో దుక్కులు దున్నుకుంటున్నారు. చల్లబడ్డ వాతావరణంతో పొలంబాట పడుతున్నారు. తొలకరి వర్షాలు వచ్చేలోగా పంట పొలాలను సిద్ధం చేసుకునేందుకు రైతులు నడుం బిగించారు. -
కొత్త వీసీ ఎప్పుడో..?!
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. 2021 మే 21న ఆయన్ను వీసీగా మూడేళ్ల పదవీ కాలానికి వీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మంగళవారంతో ఆయన పదవీకాలం ముగియనుండటంతో వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ ఉస్మానియా యూనివర్సిటీకి తిరిగి వెళ్లనున్నారు. ఈ క్రమంలో కొత్త వీసీ ఎవరిని నియమిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. గత నాలుగు నెలల క్రితమే ప్రభుత్వం వీసీల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇలా వచ్చిన దరఖాస్తులపై సెర్చ్ కమిటీ పరిశీలన ఇంకా పూర్తి కాలేదని తెలుస్తుంది. అంతేకాకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వీసీల నియామకం ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొత్త వీసీలను నియమించే వరకు ఇప్పుడు ఉన్న వైస్ చాన్స్లర్నే మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు యూనివర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకి ఇవ్వనన్ని నిధులను కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. దీంతో రాష్ట్రంలోనే పీయూ వీసీ పోస్టుకు పోటీ పెరిగినట్లు తెలుస్తుంది. పరిపాలన వ్యవహారాల్లో.. పీయూ ఎగ్జిక్యూటీవ్ కమిటీ పదవీకాలం ఫిబ్రవరిలో ముగిసింది. ఈ కమిటీ 2020 ఫిబ్రవరిలో మూడేళ్ల పరిమితితో నియామకమైంది. 2023 ఫిబ్రవరిలో పదవీకాలం ముగియగా ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గడువు తీరిపోయింది. దీంతో 8 మంది సభ్యు లు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇక నలుగురు ఎక్స్ఆఫీషియో సభ్యులుగా వీసీ, రిజిస్ట్రార్, సీనియర్ ప్రొఫెసర్, విద్యా శాఖ కార్యదర్శి కొనసాగుతున్నారు. యూనివర్సిటీలో పరిపాలన పరమైన అనుమతుల కోసం వైస్ చాన్స్లర్తోపాటు ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ కూడా ఎంతో కీలకం కానుంది.నేటితో ముగిసిన పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ పదవీకాలం 2021 మే 21న మూడేళ్ల కాలానికి నియామకం ఫిబ్రవరిలోనే ముగిసిన ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ పదవీకాలం కీలకంగా మారిన వీసీ, ఈసీ రెండు నియామకాలు ప్రచారంలో ముగ్గురి పేర్లు వీసీల నియామకం కోసం దరఖాస్తులు చాలానే వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో అడ్మినిస్ట్రేషన్ లో సుదీర్ఘ అనుభవం, అకాడమిక్లో ప్రొఫెసర్ స్థాయి సీనియార్టీ ఉండే వారిని నియమిస్తారు. అంతేకాకుండా రిజర్వేషన్లు కీలకంగా మారను న్నాయి. మొదట ఓసీ కేటగిరిలో వీసీగాలు గోపాల్రెడ్డి, కట్టా నర్సింహారెడ్డికి అవకాశం వచ్చింది. తర్వాత బీసీ కేటగిరిలో భాగ్యనారాయణ, ఎస్టీ కేటగిరిలో రాజారత్నం, లక్ష్మీకాంత్ రాథోడ్ పనిచేశారు. రొటేషన్ పద్ధతిలో మరోసారి ఓసీ కేటగిరికి చెందిన వారికి అవకాశం ఇస్తారని, లేదా ఇప్పటి వరకు అవకాశం దక్కని ఎస్సీ కేటగిరి వారికి ఇస్తారనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే పాలమూరు యూనివర్సిటీ వీసీ నియామకంలో ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ రిజిస్ట్రార్గా పనిచేసిన ఓ వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపించడం గమనార్హం. -
పెరగనున్న సాగు విస్తీర్ణం..
గతేడాది వానాకాలంలో 4,41,247 ఎకరాల్లో పంటసాగు కాగా.. ఈఏడాది అదనంగా 33,911 ఎకరాల్లో సాగుచేస్తారని అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 4,73,760 ఎకరాలు సాగు అవుతుందని వ్యవసాయాధికారులు ప్రణాళిక రూపొందించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అందులో అత్యధికంగా పత్తి, వరిపంట సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ మేరకు పత్తిసాగు విస్తీర్ణాన్ని పెంచేలా ప్రభుత్వం సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక హార్టికల్చర్కు సంబంధించి మరో 57,349 ఎకరాల్లో వివిధ తోటలు సాగయ్యే అవకాశం ఉందని ప్రణాళిక సిద్ధంచేశారు. ఈమేరకు రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. గద్వాల, పెబ్బేరు, వనపర్తి, నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాల్లో తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు పుష్కలంగా పండాలని వేడుకున్నారు. అదేవిధంగా కొత్త వాహనాలకు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 8 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఎండోమెంట్ అధికారులు తెలిపారు. ‘అడవిలోకి పశువులు, గొర్రెలకు అనుమతి లేదు’ మన్ననూర్: అటవీ ప్రాంతంలోకి పశువులు, గొర్రెల తరలింపును నిషేధించినట్లు మన్ననూర్ డీఆర్ఓ రవికుమార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో పెంపుడు జంతువుల సంచారంతో వన్యప్రాణులకు కాళ్ల వైరస్ వ్యాధులు సంభవిస్తున్నట్లు పేర్కొన్నారు. వన్యప్రాణుల మనుగడను దృష్టిలో ఉంచుకొని పశువులు, గొర్రెలను అడవుల్లో మేపుకొనేందుకు అనుమతులను రద్దు చేయడంతో పాటు నిషేధం విధించినట్లు తెలిపారు. ఈమేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో హద్దుల సర్వే మన్ననూర్: అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమ్రాబాద్ ఫారెస్టు డివిజన్ పరిధిలో భూమి హద్దుల నిర్ధారణ సర్వే నిర్వహిస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ ఈశ్వర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21, 22, 23న నిర్వహించే ఈ సర్వేకు ఆయా ప్రజలు భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు 20వ తేదీ సోమవారం సాయంత్రం 6గంటల లోపు మన్ననూర్ డీఈఓ హాజీబాబ వద్ద తమ పేర్లను ఇవ్వాలని తెలిపారు. సర్వే కోసం రావాలనుకున్నవారు మొదటి రోజు 21వ తేది ఉదయం 5గంటలకు మన్ననూర్లోని ఎఫ్డీఓ కార్యాలయం వద్ద అందుబాటులో ఉండాలని సూచించారు. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించడానికి ఇది ఒక ప్రత్యేక అవకాశంగా భావించాలని ఆయన కోరారు. -
ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలి
కల్వకుర్తి: ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని జేపీనగర్ తండాలో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం సీతారామస్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవి కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ ఆనంద్కుమార్ పాల్గొన్నారు. -
పోషకాహారలోపం నిర్మూలనకు రాగి లడ్డూల పంపిణీ
చెంచు చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపుల్లో చదువుతో పాటు జనరల్ నాలెడ్జి, బయటి ప్రపంచంలోని విషయాలను సైతం బోధిస్తున్నారు. ఒక్కో గ్రామానికి ఒక్కో టీచర్ను నియమించి, ఆటాపాటలతో వారిలో చదువుపై ఆసక్తి పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చదువుతో పాటు డాన్స్, పేయింటింగ్, ఆర్ట్స్, క్రాప్ట్స్, వ్యాయామం, స్టోరీ టెల్లింగ్, అబాకస్, చెస్ వంటి వాటిల్లో మెళకువలు నేర్పుతున్నారు. చెంచు చిన్నారుల్లో పోషకాహార లోపం నిర్మూలించేందుకు ఐరన్ ఎక్కువగా ఉండే రాగి లడ్డూలు, రాగి జావా పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్నం వేళ అన్నం, పప్పు, కూరగాయలతో భోజనం అందిస్తున్నారు. నల్లమల పరిసర ప్రాంతాల్లో చిన్నారులు వేసవిలో ఎక్కువగా ఈత కోసం బావులు, చెరువుల వద్దకు వెళ్లి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వారికి చదువుపై ఆసక్తిని పెంచి, పాఠశాలల్లో డ్రాపౌట్లను తగ్గించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామని కోనేరు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. -
సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తాం
నాగర్కర్నూల్రూరల్: సాయుధ రైతాంగ పోరా ట ఉద్యమ సారధి పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం సుందరయ్య వర్ధంతి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పర్వతాలు మాట్లాడుతూ.. కులవివక్ష, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మహనీయుడు సుందరయ్య అని కొనియాడారు. సాయుధ రైతాంగ పోరాటంలో కీలకపాత్ర పోషించి 10 లక్షల ఎకరాల భూమిని పంచడంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. సామాజిక ప్రజా పోరాటాలను ఉధృతం చేసినప్పుడే సుందరయ్యకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందికొండ గీత, అశోక్, రామయ్య, సత్యనారాయణ, నర్సింహ, రవి, వెంకటేష్ పాల్గొన్నారు. -
మితిమీరిన వేగం.. గాల్లో ప్రాణం
ప్రత్యేక దృష్టి సారించాం.. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. నిర్లక్ష్యంగా వాహనాలు నడపటంతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. – గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎస్పీ, ●జిల్లాలో నిత్యం ఎక్కడో ఓచోట ఘోర రోడ్డు ప్రమాదాలు నాగర్కర్నూల్ క్రైం: మితిమీరిన వేగం.. నిర్లక్ష్యంగా.. మద్యం తాగి వాహనాలు నడపడంతో జిల్లాలో నిత్యం ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మరికొందరు అవిటివాళ్లుగా మారుతున్నారు. ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల్లో ఎన్నో కుటుంబాలు ఇంటిపెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు. జిల్లాలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత పోలీస్, రవాణా శాఖలతో పాటు సంబంధిత అధికారులపై ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తు న్నారు. జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టు గా ప్రస్తుతం మార్కెట్లోకి రకరకాల కార్లు, ద్విచక్రవాహనాలు వస్తుండటంతో యువత ఎక్కువగా వా టిని కొనుగోలు చేస్తున్నారు. వాహనాలు నడిపే క్రమంలో వేగపరిమితిని లెక్క చేయకుండా ఇష్టా రీతిగా నడిపి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. నాలుగు నెలల్లోనే 136 రోడ్డు ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఆందోళన కల్గిస్తోంది. ఈ నాలుగు నెలల్లోనే 136 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా.. 68 మంది మృత్యువాత పడ్డారు. 168 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాల నివారణపై ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహించడంతో పాటు రోడ్డు నిబంధనలను ఉల్లంఘించే వారిని, మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించి కేసులు నమోదు చేసి కోర్టులో శిక్షలు పడేలా చూస్తున్నారు. మాసం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు జనవరి 38 22 40 ఫిబ్రవరి 31 14 24 మార్చి 29 12 29 ఏప్రిల్ 38 20 75 మొత్తం 136 68 168 బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి.. కట్టడి చర్యలు తీసుకోవాలంటున్న వాహనదారులు బ్లాక్ స్పార్ట్స్ గుర్తించి ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని బాధితుల వేడుకోలు జిల్లాలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా సరిహద్దు ప్రాంతమైన వెల్దండ నుంచి శ్రీశైలం వరకు, కల్వకుర్తి నుంచి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ వరకు నేషనల్ హైవే ఉండటంతో వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. వెల్దండ మండలంలోని పెద్దాపూర్, చారకొండ మండలంలోని జూపల్లి, అమ్రబాద్ మండలంలోని మన్ననూరు, దోమలపెంట, వటువర్లపల్లి వద్ద, బిజినేపల్లి మండలంలోని మంగనూరు, పాలెం సమీపంలోని వెంకటాపూర్, నాగర్కర్నూల్ మండలంలోని చందుబట్ల, వనపట్ల గేట్, మంతటి గేట్ వద్ద తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నారు. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు నేషనల్ హైవే పనులు కొనసాగుతుండటంతో రోడ్డు ప్రమాదాలు జరుగకుండా అధికారులు పటిష్ట ఏర్పాటు చేయకపోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ప్రభుత్వ బడులను అన్నివిధాలా తీర్చిదిద్దుతాం
కొల్లాపూర్ రూరల్/పెంట్లవెల్లి: ప్రభుత్వ పాఠశాలలను అన్నివిధాలా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ మండలం సింగోటం, పెంట్లవెల్లి మండలంలోని కొండూరు పాఠశాలలను పరిశీలించి, సమస్యలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించి, మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గురుకులాల్లో సీట్ల కోసం ఏవిధంగా పోటీపడతారో అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం విద్యార్థులు వచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. తాను చదువుకున్న పెద్దమారూర్, కొండూరు, సింగోటం గ్రామాల్లో ప్రభుత్వ బడులను మోడల్ స్కూల్స్గా మార్చేందుకు కృషిచేస్తానని అన్నారు. ప్రజలు సంపాదించిన డబ్బంతా పిల్లల చదువుకు వెచ్చిస్తున్నారని.. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఉంటే స్థానికంగానే పిల్లలను చేర్పిస్తారన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచే విద్యార్థులకు విద్యాబోధన చేసేలా వలంటీర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ఆటలు, పాటలు, వివిధ కళల్లో విద్యార్థులు రాణించేలా ప్రోత్సాహం అందిస్తామన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దిడమే తన లక్ష్యమన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మధుగాం నర్సింహయాదవ్, మాజీ సర్పంచులు వెంకటస్వామి, నల్లపోతుల గోపాల్, ధర్మతేజ, రాము, శ్రీను, కురుమయ్య, రవి, నరసింహనాయుడు, బాలరాజు, రాచూరి శివ ఉన్నారు. -
నల్లమలలో భారీ వర్షం
అమ్రాబాద్: నల్లమలలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. అమ్రాబాద్ మండల కేంద్రంతో పాటు లక్ష్మాపూర్ (బీకే), మాధవానిపల్లి, ఒంగురోనిపల్లి, కుమ్మరోనిపల్లి తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. లక్ష్మాపూర్ చెరువులోకి కొంత మేర నీరు వచ్చి చేరింది. కాగా, ఆయా గ్రామాల్లో వరిపంట కోత దశకు వచ్చిన సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కోతలు కోసిన రైతుల ధాన్యం వర్షానికి తడిసిపోతోందని వాపోతున్నారు. వర్షాలతో ఓవైపు మేలు చేకూరుతుండగా.. మరోవైపు నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. -
ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం
అచ్చంపేట: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, మోడల్, కేజీబీవీ, మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే, సోషల్, ట్రైబల్, మైనార్టీ వెల్ఫేర్, ఓకేషనల్ జూనియర్ కళాశాలల్లో ఈనెల 9నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో మొత్తం 10,507 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. 9,621 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరంతా ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందనున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 76 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అడ్మిషన్ల ప్రక్రియ ఇలా.. ఇంటర్ ఫస్టియర్ తరగతులు జూన్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన టీసీ, స్టడీ సర్టిఫికెట్, తాత్కాలిక ఎస్ఎస్సీ మెమో ఆధారంగా ఇంటర్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఒరిజినల్ ఎస్ఎస్సీ మెమో సమర్పించిన తర్వాత అడ్మిషన్ నిర్దారిస్తారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం, పీహెచ్ 5 శాతం, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా 5 శాతం, ఎక్స్ సర్వీస్మెన్ 3 శాతం, ఈడబ్ల్యూఎస్ 10 శాతం సీట్లు కేటాయిస్తారు. 33.3 శాతం అంటే 1/3 వంతు సీట్లు బాలికలకు రిజర్వు చేస్తారు. పదో తరగతిలో పొందిన గ్రేడింగ్ ఆధారంగా అడ్మిషన్లలో ప్రాధాన్యం ఇస్తారు. తెలంగాణ ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన అనుబంధ కళాశాలల్లో మాత్రమే ప్రవేశాలు పొందాలని ఆధికారులు సూచిస్తున్నారు. అందుబాటులో ఉన్న కళాశాలల జాబితాను అధికారిక వెబ్సైట్ (tsbie.cgg.gov.in)లో చూడవచ్చు.సద్వినియోగం చేసుకోవాలి.. ఇంటర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తమకు నచ్చిన కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చు. అన్ని రకాల కోర్సులు, సదుపాయాలు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కాలేజీల్లోనే చేర్పించాలి. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించి ఆర్థికంగా నష్టపోవద్దు. – వెంకటరమణ, డీఐఈఓ -
ధాన్యం సేకరణ వేగవంతం
● కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని డీఎస్ఓ స్వామికుమార్ అన్నారు. వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడవకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. అదేవిధంగా రైతుల ఖాతాల్లో త్వరగా డబ్బులు పడేవిధంగా చూడాలన్నారు. రైతులు నేరుగా పొలం నుంచి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువస్తుండటంతో తేమ శాతం ఎక్కువగా ఉంటుందని.. ధాన్యంలో 17 శాతం లోపు తేమ ఉండేవిధంగా రైతులు తమ పొలాల్లోనే ఆరబెట్టుకొని తీసుకురావాలని కోరారు. డీఎస్ఓ వెంట తహసీల్దార్ పాండునాయక్, ఏపీఎం నిరంజన్, ప్రభాకర్, పీఏసీఎస్ సీఈఓ రవీందర్రావు, సీసీ నర్సింహ, వీఓఏ పర్వత్బేగం ఉన్నారు. ● ‘సాక్షి’ కథనానికి స్పందించిన అధికారులు ● కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్, డీఎస్ఓ కొల్లాపూర్ రూరల్/పెంట్లవెల్లి/తెలకపల్లి/ ఉప్పునుంతల: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ‘అన్నదాతల ఆగచాట్లు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. కొల్లాపూర్ మార్కెట్యార్డు, మాచినేనిపల్లి, పెంట్లవెల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ సీతారామారావు తనిఖీ చేయగా.. తెలకపల్లి, ఉప్పునుంతలలో ధాన్యం సేకరణ ప్రక్రియను డీఎస్ఓ స్వామికుమార్ పరిశీలించారు. రైతులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో తేమ శాతాన్ని చూశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించాలని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కొనుగోలుచేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. వడ్లను పూర్తిగా ఎండబెట్టిన తర్వాతే కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్లు శ్రీకాంత్, హిమబిందు, ఎంపీడీఓ ప్రసన్నకుమారి, రామన్గౌడ్, కబ్బీర్ ఉన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జి లుక్ చూశారా?
బంగారం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పట్టు చీరల ధరలు
కమల్ హాసన్ ఇండియన్-2.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
AP: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు
మమత సర్కారుకు షాక్.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (22-05-2024)
Vishal Marriage: పెళ్లెప్పుడు? విశాల్ సమాధానమిదే! ఇంక చేసుకున్నట్లే!
హీరామండి సిరీస్లో అదరగొట్టిన అందాల ముద్దుగుమ్మలు (ఫోటోలు)
ఆస్పత్రికి షారూఖ్ ఖాన్.. అసలేం జరిగిందంటే?
తీన్మార్మల్లన్నపై కేటీఆర్ సంచలన కామెంట్స్
తప్పక చదవండి
- జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
- విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్తో!
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
- Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
Advertisement