-
ఖమ్మం: మరీ ఇంత ఘోరమా?
సాక్షి, ఖమ్మం: జిల్లాలో వేకువ ఝామునే ఘోరం జరిగింది. ఓ వృద్ధురాలు, ఆమె ఇద్దరు మనవరాళ్లు దారుణ హత్యకు గురయ్యారు. ఆ వృద్ధురాలి తనయుడు కనిపించకుండా పోవడంతో అతనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం జరిగింది. పిట్టల పిచ్చమ్మ(60), ఆమె మనవరాళ్లు నీరజ(10), ఝాన్సీ(6)లు హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం రక్తపు మడుగులో ఉన్న ఇద్దరినీ గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇద్దరు చిన్నారుల తండ్రి వెంకటేశ్వర్లే ఈ హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండేళ్ల కిందట ఆ చిన్నారుల తల్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. అయితే ఆమెను కూడా భర్తే వెంకటేశ్వర్లే హత్య చేసి ఉంటాడని పోలీసులు వద్ద స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంకటేశ్వర్లు ఆచూకీ కోసం పోలీసులు యత్నిస్తున్నారు. -
‘గుర్తింపు’ రాని సంఘం?
● 143 రోజులైనా గుర్తింపు సంఘానికి రాని పత్రం? ● మేనిఫెస్టోలోని హామీలు అమలయ్యేనా?సింగరేణి(కొత్తగూడెం): గతేడాది డిసెంబర్ 27న సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. అవి జరిగి సుమారు 143 రోజులైన గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీకి గుర్తింపు పత్రం అందలేదు. కోడ్ ఆఫ్ డిసిప్లేన్ ప్రకారంగా 7వ దఫా జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికలు రెండేళ్ల కాలపరిమితితో జరిగాయి. అయితే, ఇవి నాలుగేళ్ల కాలపరిమితితో జరిగియాని కొందరు సింగరేణివ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాగా, కార్మిల్లోనూ ఈ ఎన్నికలు రెండేళ్ల కాలపరిమితితో జరిగాయా? లేక నాలుగేళ్లా అనే సందిగ్ధత నెలకొందని సమాచారం. ఓడిపోయిన సంఘాలేమో రెండేళ్ల కాలపరిమితి అని, గెలిచి న సంఘాలేమో నాలుగేళ్ల కాలపరిమితి అని చెబు తున్నాయని, వీటిలో ఏది వాస్తవమో, ఏది అవాస్తవ మో అర్థంకాని పరిస్థితి ఉందని కార్మికులు చెబుతున్నారు. ఇదిలాఉండగా సింగరేణిలో ఇప్పటివరకు ఏడు పర్యాయాలు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగా ఒక్కసారి తప్ప, మిగిలిన అన్నిసార్లు ఒకటి, రెండేళ్లు ఆలస్యంగానే జరిగాయి. చివరిసారిగా జరిగిన ఎన్నికలు (2017లో) నాలుగేళ్ల కాలపరిమితితో జరగగా ఆరేళ్ల తరువాత 2023లో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. దీనిని బట్టి చూస్తే కోడ్ ఆఫ్ డిసిప్లేన్తో గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితితో సంబంధంలేదని తెలుస్తోంది. 36 అంశాలు అమలయ్యేనా..? సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు కార్మిక సంఘాలు కొన్ని హామీలిచ్చాయి. వాటిలో ఏఐటీయూసీ కూడా 36 అంశాల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఓట్ల శాతానికి సంబంధించిన వివరాలను డిప్యూటీ డీవైసీఎల్సీ దేవరకొండ శ్రీనివాస్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా బయటకు వెల్లడించారు. కానీ, అందుకు సంబంధించిన అధికారిక గుర్తింపు పత్రం ఇప్పటికీ రాలేదు. పారిశ్రామిక చట్టం ప్రకారం సంస్థలో కార్మికుల సమస్యల విషయంలో యాజమాన్యంతో చర్చించాలంటే అందుకు కార్మికశాఖ కార్యాలయం నుంచి గుర్తింపు సంఘంగా పలానా సంఘం ఎన్నికై ందని ఉత్తర్వులు రావాల్సి ఉంది. గుర్తింపు సంఘం కాలపరిమితి రెండేళ్లలో ఇప్పటికే ఐదు నెలలు కావస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన సమయంలో కార్మికులకు ఎన్నికల ముందు ఏఐటీయూసీ ఇచ్చిన హామీలు అమలవుతాయా? లేదా? అని కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఒక్కటయ్యేందుకు యత్నం.. సింగరేణి సంస్థలో గతేడాది డిసెంబర్ 27న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో 5 ఏరియాల్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) గెలిచి గుర్తింపు సంఘంగా ఎన్నికై ంది. 1998లో జరిగిన ఒప్పందం ప్రకారం.. ఎన్ని ఏరియాలు గెలిచినప్పటి కీ ఓటింగ్ శాతాన్ని బట్టి గుర్తింపు సంఘం ఎంపిక ఉంటుందనే నిబంధనల మేరకు ఏఐటీయూసీని గుర్తింపు సంఘంగా ప్రకటించారు. కాగా, 2003లో ఐఎన్టీయూసీ ఒక్కసారి గుర్తింపు సంఘంగా గెలిచింది. మరో మూడు పర్యాయాలు గుర్తింపు సంఘంగా పనిచేసిన ఏఐటీయూసీ.. ఐఎన్టీయూసీతో కలి సి పనిచేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో రెండుయూనియన్ల నాయకులు ఒక్క తాటిపైకి వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి.దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అంశాలు కంపెనీలో కొత్త ఉద్యోగాల రూపకల్పనకు నూతన గనుల ఏర్పాటు ఏడాదిలో మూడు నెలల వేతనం ఆదాయ పన్ను రూపంలో కార్మికుల వేతనం నుంచి కోత, దీని నివారణకు మార్గాలు ప్రతి కార్మికుడికి 250 గజాల స్థలం, రూ.25 లక్షల వడ్డీ లేని రుణం కార్మికుల కుటుంబీకులకు కార్పొరేట్ వైద్యం, గతంలో మాదిరిగా కాకుండా అన్ని వసతులతో కూడిన క్వార్టర్లు అలియాస్ పేర్ల మార్పిడి క్లియరెన్స్తో పెండింగ్లో ఉన్న వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ -
మధుర ఫలం.. చేదు ఫలితం
● ఉమ్మడి జిల్లాలో తగ్గిన మామిడి కాత ● రైతులకు, కౌలుదారులకూ తీవ్ర నష్టం ● వినియోగదారులపై తప్పని ధరల భారంఈ సారి కాలం కలిసిరాలేదు ఈసారి మామిడికి కాలం కలిసి రాలేదు. పూత, కాత దశల్లో వాతావరణం అనుకూలించకపోవడం, నల్లి రోగం వెంటాడటం, కోత దశలో వడగండ్ల వానలు, ఈదురు గాలులు, భారీ వర్షాలు తోటలను ఊడ్చేశాయి. ఎకరానికి కనీసం క్వింటా దిగుబడి కూడా రాలేదు. – మంచె కృష్ణయ్య, కొమరారం, ఇల్లెందు మండలం ఇల్లెందురూరల్: ధాన్యం పండించిన రైతులనే కాదు.. కాతనే నమ్ముకున్న మామిడి రైతులనూ ఈ సీజన్ బోల్తా కొట్టించింది. అకాల వర్షంతో పూతకు తెగుళ్లు ఆవహించడం, కాయలను నల్లి రోగం వెంటాడటంతో రైతులకు నష్టాలు తప్పేలా లేవు. దిగుబడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు ప్రస్తుతం నిరాశే ఎదురవుతోంది. కాత ఉన్న చెట్లపై వడగండ్ల వానలు, గాలి దుమారాలు ప్రతాపం చూపించాయి. ప్రజలు ఎంతగానో ఇష్టపడే మామిడి పండుకు ఈసారి చేదు అనుభవమే ఎదురవుతోంది. ఉమ్మడి జిల్లాలో 53వేల ఎకరాల్లో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మామిడి 53 వేల ఎకరాల్లో సాగవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 42వేల ఎకరాల్లో మామిడి పంట సాగు చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో అత్యధి కంగా అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, అశ్వారావుపేట మండలాల్లో, ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు, కల్లూ రు, కామేపల్లి మండలాల్లో ఈ పంట సాగవుతోంది. ఆయా తోటల్లో అత్యధికంగా బంగినపల్లి, దశేరీ, కేసరి, హిమాయత్, రాయల్ స్పెషల్, తోతాపురి, చిన్నరసాలు, పెద్ద రసాలు ప్రధానంగా కనిపిస్తాయి. పూత దశ నుంచే.. ఈ ఏడాది కూడా మామిడి రైతుకు కాలం కలసి రాలేదు. వాతావరణంలో పెను మార్పులు తీవ్ర ప్రభావం చూపాయి. ఖరీఫ్ చివరలో కురిసిన వర్షాలకు తోడు నిచాన్ తుఫాన్ ప్రభావంతో చిక్కగా వచ్చిన పూత చివరకు చిగురుగా మారింది. దీంతో దిగుబడిపై ప్రారంభంలోనే నీళ్లు చల్లినట్టయింది. రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో ఆశించినంత కాకున్నా కొంతమేర కాత వచ్చింది. ఈ సమయంలో కాయలను చుట్టేసిన నల్లి రోగం వారికి శాపంగా మారింది. దీని నివారణకు పలు క్రిమిసంహారక మందులు పిచికారీ చేసినా ఫలితం కనిపించలేదు. ఈ అవాంతరాలను తట్టుకొని కోత దశకు చేరుకున్న సమయంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానలు, గాలి దుమారాలు ఆ కొద్దిపాటి కాతను కూడా నేలపాలు చేశాయి. దీంతో మామిడి రైతులు పెట్టుబడి కూడా రాని దయనీయ స్థితికి చేరుకున్నారు. కౌలు రైతుల గగ్గోలు.. మామిడి రైతులు అత్యధికంగా పూత దశలోనే తోటలను వ్యాపారులకు కౌలు ఇవ్వడం పరిపాటి. పూత దశలో తోటలను పరిశీలించిన అనంతరం వ్యాపారులు ధర నిర్ణయించి రైతులకు ముందుగా కొంత, పంట చేతికందిన తర్వాత మిగతా సొమ్ము చెల్లిస్తారు. ఈ పద్ధతి అనేక ఏళ్లుగా కొనసాగుతోంది. ఇదే తరహాలో ఈసారి కూడా కౌలు రైతులు మామిడి తోటలు పట్టేందుకు ముందుకొచ్చారు. గతేడాది నల్లి రోగం మినహాయిస్తే మామిడి దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో ఈసారి కౌలు రైతులు మామిడి తోటలకు పూత రాకముందే కొనుగోలు చేశారు. కాత కూడా ఆశాజనకంగా ఉంటుందని భావించారు. కానీ కాత దశలో నల్లిరోగం, కోత దశలో భారీ వర్షాలు, వడగండ్ల వాన, ఈదురుగాలుల ప్రభావంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో కౌలుకు తీసుకున్న రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఽసన్నగిల్లిన వ్యాపారం.. ప్రతి ఏడాది ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వరంగల్, హైదరాబాద్, జగిత్యాల ప్రాంతాలకు మామిడికాయలు ఎగుమతి అవుతాయి. ఇంతేకాకుండా కొంత మంది చిరువ్యాపారులు కాయలను తోటల వద్దే కొనుగోలు చేసి స్థానికంగానే విక్రయిస్తుంటారు. సాధారణంగా తోటల్లో ఎకరానికి 3నుంచి 4 టన్నుల కాయలు రావాల్సి ఉండగా ఈసారి ఎకరానికి టన్ను కాయలు కూడా రావడం గగనమే అనిపిస్తోంది. మే నెల సగం గడుస్తున్నా మార్కెట్లో చెప్పుకోదగిన విధంగా కాయల విక్రయాలు సాగడం లేదు. ఈ పరిణామంతో ఫలరాజు ధర ఆకాశాన్ని అంటుతోంది. ఇష్టంగా తినాలని ఆశపడే వినియోగదారులకు పెరిగినఽ ధరలు చేదు ఫలితాలనిస్తున్నాయి.మామిడి ధరలు భారీగా పెరిగాయి ఎప్పుడూ ఏప్రిల్ నెలలోనే మార్కెట్లో కనిపించే మామిడి ఈ సారి మే సగం గడిచినా ఎక్కువగా రావడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మామిడి ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. కాయలను చూస్తే ఇష్టంగా తినాలని అనిపించినా ధర చూసి కోరికను అదుపు చేసుకుంటున్నాం. – యాటకూరి లీలావతి, సుభాష్నగర్, ఇల్లెందు -
హ్యాండ్బ్యాగ్ అప్పగించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
ఖమ్మంక్రైం: ఖమ్మం స్టేషన్లో రైలు ఎక్కే సమయాన కింద పడిపోయిన హ్యాండ్ బ్యాగ్ను మహిళకు అప్పగించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ భేష్ అనిపించుకున్నారు. ఈనెల 15న ఖమ్మంలో రైలు ఎక్కుతున్న గాయత్రి హడావుడిలో తన హ్యాండ్ బ్యాగ్ జారవిడుచుకుంది. రైలు డోర్నకల్ వెళ్లాక గమనించిన ఆమె అక్కడి ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు ఖమ్మం సిబ్బందికి తెలిపారు. దీంతో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అమిత్కుమార్ ప్లాట్ఫాంపై వెతికి హ్యాండ్ బ్యాగ్ను గుర్తించగా, శుక్రవారం ఖమ్మంలో గాయత్రికి అందజేశారు. అందులో రూ.15,800 నగదుతో పాటు మూడు గ్రాముల బంగారు మంగళసూత్రం ఉండగా ఆమె కానిస్టేబుల్కు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే, అమిత్కుమార్ను ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాస్రెడ్డి, సిబ్బంది అభినందించారు. -
సద్గురు ఆశ్రమంలో సీడ్బాల్ ్స తయారీ
● నాలుగు రోజుల పాటు ప్రక్రియ ● మొక్కలు విరివిగా నాటేలా ఏర్పాట్లుములకలపల్లి: సత్సంగాల ద్వారా ప్రజానీకాన్ని ఆధ్యాత్మికత బాట పట్టిస్తున్న సద్గురు ఫౌండేషన్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సీడ్బాల్స్ తయారీకి సిద్ధమైంది. ములకలపల్లి మండలం రామచంద్రాపురంలోని సద్గురు ఆశ్రమం, అచలపీఠం ఆధ్వర్యాన సామాజిక, ప్రజాహిత, దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గాజర్ల వీరభద్రం నేతృత్వాన ఇప్పుడు మొక్కలు నాటడంపై దృష్టి సారించారు. నానాటికి పెరిగిపోతున్న భూతాపాన్ని అరికట్టేలా అడవుల పెంపకం కోసం కొండలు, గుట్టలు, ఎత్తయిన ప్రదేశాలు, అడవుల్లోని ఖాళీ ప్రాంతాల్లో సులువుగా విత్తనాలు చల్లేలా సీడ్బాల్స్ సిద్ధం చేస్తున్నారు. ఆశ్రమ ప్రాంగణంలో శుక్రవారం సీడ్బాల్స్ తయారీ ఆరంభించగా డీఎఫ్ఓ కోటేశ్వరరావు పాల్గొని సూచనలు చేశారు. నాలుగు రోజులపాటు కొనసాగే ప్రక్రియలో లక్ష సీడ్బాల్స్ తయారుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నల్లమట్టి, సేంద్రియ ఎరువు కలిపి చింత, వెదురు, కానుగ, బండారు, ఎగిసె తదితర జాతుల విత్తనాలు పెట్టి సిద్ధం చేస్తున్న సీడ్బాల్స్ను వర్షాలు పడగానే ఎంపిక చేసిన ప్రదేశంలో విసరాలని భావిస్తున్నారు. ఈ విషయమై సద్గురు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గాజర్ల వీరభద్రం మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఇందుకోసం మొక్కల పెంపకానికి లక్ష సీడ్బాల్స్ను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. -
తీర్పు దిక్సూచిలా ఉండాలి..
● ప్రశ్నిస్తానన్న వ్యక్తి గొంతు ఏమైంది? ● బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డిసాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే విద్యావంతులు, ప్రజలు, నిరుద్యోగుల పక్షానే కాక తెలంగాణలోని సబ్బండ వర్గాల పక్షాన ప్రశ్నించడానికి, పోరాడటానికి మండలికి పంపించినట్లు అవుతుందని.. తద్వారా ఈ తీర్పు దిక్సూచిలా నిలుస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి వెల్ల డించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు కావాలా... ప్రశంసించే వారు కావా లా అనేది తేల్చుకోవాల్సిన సమ యం ఆసన్నమైందని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి తనది ప్రశ్నించే గొంతుక అని చెబుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో హామీలు నెరవేర్చకున్నా ప్రశ్నించని తీరును గమనించాలని కోరారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని, ఈ ఎన్నికలకు సమాజంలో ప్రాముఖ్యత ఉందన్నారు. మేధావులు, విద్యావంతులు, వివేకవంతులు కలిసి ఓటు ఇవ్వాల్సి ఉందని తెలి పారు. గత పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను చూస్తే చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్, రామచంద్రరావు, డాక్టర్ నాగేశ్వరరావు, కపిలవాయి దిలీప్మార్, పల్లా రాజేశ్వరరెడ్డి ఇలా ఏ పార్టీ వారైనా విద్యావంతులు, మేధావులు, ప్రజ లకు ఆదర్శంగా నిలిచే వారు ఎన్నికయ్యారని చెప్పారు. ఇదే పరంపరను కొనసాగించాల్సిన బాధ్యత విద్యావంతులపై ఉన్నందున తప్పకుండా నెరవేరుస్తారనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోసం ప్రయత్నం చేద్దామని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. అదే తనను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి హామీల అమలుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ప్రకటన, ఉద్యోగ నోటిఫికేషన్, మెగా డీఎస్సీ ఊసెత్తని అంశాన్ని అందరూ గమనించాలని రాకేష్రెడ్డి కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పార్టీ నాయకులు గుండాల కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి, పగడాల నాగరాజు, బిచ్చాల తిరుమలరావు, డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పోరాడే అవకాశం కల్పించండి
ఖమ్మం మామిళ్లగూడెం: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తూ నిరుద్యోగుల సమస్యలపై పోరాడే అవకాశం కల్పించాలని ఖమ్మం – నల్లగొండ – వరంగల్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి కోరారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ తరఫున ప్రాతినిధ్యం ఉన్నా, లేకున్నా ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి అభివృద్ధి ఫలాలు మంజూరు చేస్తున్నారని తెలి పారు. ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి వంటి హామీలన్నీ విస్మరించిందని ఆరోపించారు. ఈమేరకు విశ్వసనీయత కలిగిన బీజేపీ, ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేసేలా తనను పట్టభద్రులు గెలిపించాలని కోరారు. ఈసమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, మాజీ ఎమ్మె ల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి, నాయకులు తాండ్ర వినోద్రావు, శ్యాంరాథోడ్, గెంటెల విద్యాసాగర్, ప్రభాకర్రెడ్డి, అల్లిక అంజయ్య, ఈ.వీ.రమేష్, నెల్లూరి కోటేశ్వరావు, చావా కిరణ్, వీరస్వామి, సుదర్శన్, వాసుదేవరావు పాల్గొన్నారు.బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి -
ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ ఇన్చార్జిలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వరంగల్ – నల్లగొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇన్చార్జిలు, కో ఆర్డినేటర్లను నియమించారు. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి.మహేష్కుమార్ గౌడ్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు ఇన్చార్జ్లుగా వ్యవహరించనుండగా, కో ఆర్డినేటర్గా నాయకులను నియమించారు. ఖమ్మం ఇన్చార్జిగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కో ఆర్డినేటర్గా నూకల నరేష్రెడ్డి, పాలేరు ఇన్చార్జిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కో ఆర్డినేటర్గా ఎం.రఘునాథ్యాదవ్, మధిర ఇన్చార్జిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కోఆర్డినేటర్గా మహమ్మద్ జావీద్, వైరా ఇన్చార్జిగా ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్, కోఆర్డినేటర్గా బొర్రా రాజశేఖర్, సత్తుపల్లి ఇన్చార్జిగా ఎమ్మెల్యే మట్టా రాగమయి, కో ఆర్డినేటర్గా రాయల నాగేశ్వరరావు వ్యవహరించనున్నారు. ఇక కొత్తగూడెం ఇన్చార్జిగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కో ఆర్డినేటర్గా టి.బ్రహ్మయ్య, అశ్వారావుపేట ఇన్చార్జిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, కోఆర్డినేటర్గా పిడమర్తి రవి, భద్రాచలం ఇన్చార్జిగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కోఆర్డినేటర్గా తోటకూర రవిశంకర్, ఇల్లెందు ఇన్చార్జిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య, కోఆర్డినేటర్గా మువ్వా విజయ్బాబు, పినపాకకు ఇన్చార్జిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్గా బి.నాగేశ్వరరావు వ్యవహరిస్తారని వెల్లడించారు. -
పంచాయతీ ఎన్నికలకు కసరత్తు
ఖమ్మంవన్టౌన్: గ్రామపంచాయతీల ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశముంది. లోక్సభ ఎన్నికలు పూర్తికాగా, 27న ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. వీటి ఫలితాలు వెల్లడి కాగానే జూన్ మొదటి వారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు సమాయత్తం కావాలని అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. జిల్లాలో 589 పంచాయతీలు, 5,398 వార్డులు ఉన్నాయి. జీపీల పాలకవర్గం గడువు జనవరిలో ముగియడంతో ప్రత్యేకాధికారుల ఆధ్వర్యాన పాలన కొనసాగుతోంది. ఏపీ నుంచి బ్యాలెట్ బాక్సులు జిల్లాలో ప్రస్తుతం 2,171 బ్యాలెట్ బాక్స్లు అందుబాటులో ఉన్నా ఇవి సరిపోయే అవకాశం లేదు. దీంతో ఏపీ నుంచి సమకూర్చుకోనున్నారు. కాకినాడ జిల్లా నుండి 540, ఎన్టీఆర్ జిల్లా నుండి 830 బ్యాలెట్ బాక్స్లను తీసుకొచ్చేందుకు సోమవారం ఉద్యోగులు వెళ్లనున్నారని డీపీఓ హరికృష్ణ తెలి పారు. కాగా, జిల్లాలో ఉన్న బ్యాలెట్ బాక్స్లకు సైతం ఈనెల 31వ తేదీలోపు మరమ్మతులు చేయించి సిద్ధం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. బ్యాలెట్ బాక్స్ల సేకరణపై అధికారుల దృష్టి -
No Headline
ద్రోణి కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం.. అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం వానాకాలం పంటల సాగుకు సమాయత్తం అవుతోంది. జిల్లాలో ప్రధాన పంట అయిన పత్తి సాగు కోసం రైతులు దుక్కులు దున్నుతున్నారు. అలాగే, ఇతర పంటలకు సైతం విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించి విత్తనాభివృద్ధి సంస్థకు అందించింది. అలాగే సాగు విస్తీర్ణం ఆధారంగా ఎరువులను అందుబాటులో తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 7,03,676 ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం -
చకచకా ఓటరు స్లిప్పుల పంపిణీ
● ఎమ్మెల్సీ ఎన్నిక ఏర్పాట్లలో వేగం ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ గౌతమ్ ఖమ్మం సహకారనగర్: నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లలో వేగం పెంచాలని, ఓటర్ స్లిప్లు చకచకా పంపిణీ చేస్తూ ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు నివేదిక ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఆయన ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీసీ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీఎల్ఓల ద్వారా ప్రతీ ఓటర్కు ఓటర్ స్లిప్పులు అందజేయడమే కాక బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలని తెలిపారు. ఎన్నికల ఉద్యోగులకు ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 20, 26వ తేదీల్లో శిక్షణ ఉంటుందన్నారు. కాగా, ఈనెల 26న ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామగ్రి అందజేయనుండగా, పోలింగ్ ముగిశాక సామగ్రిని నల్లగొండలోని నాగార్జున కళాశాలలో అందజేయాలని సూచించారు. తహసీ ల్దార్లు సెక్టార్ అధికారులుగా, నాయబ్ తహసీల్దార్లు ఫ్లయింగ్ స్క్వాడ్గా, ఆర్ఐలు ప్రత్యేక వీడియో టీమ్లుగా ఏర్పడి విధులు నిర్వర్తించాలని సూచించారు. కాగా, ఓటింగ్ విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం ధరణి దరఖాస్తుల పరిష్కారంపై సూచనలు చేశారు. బ్యాలెట్ బాక్స్లపై కార్యాచరణ ఎమ్మెల్సీ ఎన్నికకు కావాల్సిన బ్యాలెట్ బాక్సులను సమకూర్చుకోవాలని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జెడ్పీ ఆవరణలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరచిన బ్యాలెట్ బాక్సులను ఆయన పరిశీ లించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరవేసేలా, పోలింగ్ ముగిశాక నల్లగొండకు చేర్చేలా ఎన్ని బస్సులు అవసరమో ఆరా తీసిన ఆయన బస్సులో ఎన్ని బాక్సులు, ఎందరు సిబ్బంది పడతారో పరిశీలించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించండి ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. హైదరాబాద్ నుండి శుక్రవారం ఆమె వివిధ అంశాలపై వీసీ ద్వారా సమీక్షించారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ను విజయవంతంగా నిర్వర్తించడంలో కలెక్టర్లు, ఉద్యో గులను అభినందించారు. కాగా, పాఠశాలల పనుల్లో వేగం పెంచాలని, విద్యార్థులకు యూనిఫాం త్వరగా కుట్టించాలని, ధరణి, ప్రజావాణి దరఖాస్తులను స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ 753 పాఠశాలల్లో పనులు చేపట్టగా, 701 పాఠశాలల్లో విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. 217 పాఠశాలల్లో ప్రతిపాదిత పనులన్నీ పూర్తికాగా ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. ఈసమావేశాల్లో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, మధుసూదన్నాయక్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, వివిధ శాఖల అధికారులు శ్రీలత, వెంకటరమణ, శ్రీనివాసరావు, రాజేశ్వరి, సోమశేఖరశర్మ, సన్యాసయ్య, చందన్కుమార్, విజయనిర్మల, చంద్రమౌళి, శ్యాంప్రసాద్, అలీమ్, శ్రీనివాస్తో పాటు అరుణ, రాంబాబు, మదన్గోపాల్, అనురాధ, సత్యనారాయణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి తుమ్మలను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి
ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్ధి చింతపండు నవీన్కుమార్(తీన్మార్ మల్లన్న) ఖమ్మంలో కలిశారు. ఈ సందర్భంగా మల్లన్నను మంత్రి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంపై చర్చించారు. డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, నాయకుడు నల్లమ ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జైలును సందర్శించిన న్యాయమూర్తి ఖమ్మంలీగల్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కే.వీ.చంద్రశేఖర్రావు శుక్రవారం ఖమ్మం రూరల్ మండలంలోని జిల్లా జైలును సందర్శించారు. ఈ సందర్భంగా విచారణ ముద్దాయిలతో మాట్లాడి కేసు వివరాలు, వాయిదా తేదీలు, ఆరోగ్య సమస్యలు, మౌలిక వసతులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖైదీలకు న్యాయసేవాధికార సంస్థ తరఫున ఉచితంగా న్యాయ సాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైలు పర్యవేక్షణాధికారి ఏ.శ్రీధర్ పాల్గొన్నారు. స్ట్రాంగ్రూంల వద్ద భద్రతపై సీపీ ఆరా ఖమ్మంరూరల్: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను మండలంలోని పొన్నేకల్లో శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూంల్లో భద్రపర్చగా పోలీస్ కమిషనర్ సునీల్దత్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ స్ట్రాంగ్రూంలకు నలువైపులా కేంద్ర పోలీస్ బలగాలు, ఏఆర్, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటుచేశామని తెలిపారు. అంతేకాక నిరంతరం సీసీ కెమెరాల నిఘా కొనసాగుతోందని చెప్పారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీపీ వెంట ట్రెయినీ ఐపీఎస్ మౌనిక, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాప్యం లేకుండా కొనుగోళ్లు ● అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఖమ్మం సహకారనగర్: జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోలు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ వెల్లడించారు. ‘సాక్షి’లో ‘కొనుగోళ్లు కొంతే’ శీర్షికన శుక్రవారం కథనం ప్రచురితం కావడంతో ఆయన స్పందించారు. ఈమేరకు సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన అదనపు కలెక్టర్ సూచనలు చేశారు. శుక్రవారం నాటికి 21వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. నిరంతరం పర్యవేక్షిస్తూ వేగం పెంచాలని ఆదేశించారు. ఇంటర్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు కల్పించేందుకు కౌన్సెలింగ్ తేదీలు ఖరారు చేసినట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ తెలిపారు. ఈనెల 23న బాలికలకు భద్రాచలంలోని టీటీడబ్ల్యూఆర్జేసీలో, బాలురకు 25వ తేదీన కిన్నెరసానిలోని టీటీడబ్ల్యూఆర్జేసీలో కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థినీ, విద్యార్థులు టీసీ, ఎస్సెస్సీ మెమో, కులం, ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్లు, ఆధార్ ఒరిజినల్, జిరాక్స్తో హాజరు కావాలని పీఓ ప్రతీక్జైన్ సూచించారు. -
సాగుకు సన్నాహాలు
ముందస్తుగానే పనుల్లోకి.. అకాల వర్షాలతో రైతులు పత్తి సాగు కోసం దుక్కి దున్నడం మొదలుపెట్టారు. ప్రభుత్వం గత ఏడాది పంటల సాగును ముందుకు తీసుకెళ్లేందుకు యత్నించినా వర్షాభావ పరిస్థితులతో ఆలస్యమైంది. అయితే ఈసారి ఇప్పటికై తే వాతావరణం అనుకూలంగా ఉండడం.. జూన్ మొదటి వారంలోనే రుతు పవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యాన సాగు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. సబ్సిడీపై విత్తనాలు ఈ ఏడాది రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. నాలుగేళ్ల క్రితం కేజీ వరి విత్తనాలకు రూ.5 సబ్సిడీతో ప్రభుత్వం సరఫరా చేసినా ఆ తర్వాత నిలిపేశారు. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో విత్తన సబ్సిడీని పునరుద్ధరించనున్నట్లు ప్రచారం సాగుతోంది. వరి సాగుకు ముందు భూసారం పెంచేలా సాగుచేసే పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు, పిల్లి పెసర, జనుము విత్తనాలను 50 శాతం సబ్సిడీ రైతులకు అందిస్తారు. ఇది కొసాగించడంతో పాటు అపరాల పంటలైన పెసర, మినుము, కంది వంటి పంటల విత్తనాలు కూడా సబ్సిడీపై అందిస్తారు. గతం లో అపరాల పంట లకు 30 నుంచి 40 శాతం వరకు సబ్సిడీ ఉండగా.. ఈసారి ఎంత మేర ఇస్తారో ప్రభుత్వ నిర్ణ యం రావాల్సి ఉంది. 7,03,676 ఎకరాల్లో అంచనా ఈ ఏడాది వానాకాలంలో అన్నీ కలిపి 7,03,676 ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ పంటల ప్రణాళిక రూపొందించింది. ఇందులో ప్రధానంగా వరి 2,83,943 ఎకరాల్లో, పత్తి 2,01,834 ఎకరాల్లో సాగవుతాయని పేర్కొన్నారు. ఇందు కోసం 2,24,819.88 మెట్రిక్ టన్నుల ఎరువులు, 5.50 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు, 72,798 క్వింటాళ్ల ఇతర పంటల విత్తనాలు అవసరమని భావిస్తున్నారు.వానాకాలం పంటల సాగు విస్తీర్ణం ప్రణాళిక పంట విస్తీర్ణం (ఎకరాలు) వరి 2,83,943 పత్తి 2,01,834 మిర్చి 88,906 పెసర 15,357 మొక్కజొన్న 3,374 చెరుకు 2,432 కంది 1,005 మినుము 436 వేరుశనగ 270 ఇతర పంటలు 1,06,119మొత్తం 7,03,676 విత్తనాల వివరాలు విత్తనాలు క్వింటాళ్లు వరి 70,986 మొక్కజొన్న 135 కంది 80 పత్తి 5.50 లక్షల ప్యాకెట్లు పెసర 1,229 మినుము 35 వేరుశనగ 243 మిరప 90కావాల్సిన ఎరువులు ఎరువులు మెట్రిక్ టన్నులు యూరియా 89,165.94 డీఏపీ 33,154.54 ఎంవోపీ 25,579.5 కాంప్లెక్స్ 83,339.9 ఎస్.ఎస్.పీ 2,580మొత్తం 2,24,819.88అకాల వర్షాలతో దుక్కి దున్నుతున్న రైతులు నాన్ ఆయకట్టులో భారీగా సాగవనున్న పత్తి పంటల ప్రణాళిక రూపొందించిన వ్యవసాయ శాఖ అన్నీ కలిపి 7.03 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా సబ్సిడీపై పంపిణీకి విత్తనాలు రెడీ ముందస్తుగా అందుబాటులో ఎరువుల నిల్వలుపత్తి సాగుకే మొగ్గు జిల్లాలో ప్రధాన పంటగా కొనసాగుతున్న పత్తిని ఈ ఏడాది దాదాపు 2.50 లక్షల ఎకరాల్లో సాగు చేసే అవకాశముంది. అయితే వ్యవసాయ శాఖ పత్తి సాధారణ విస్తీర్ణం 2,01,834 ఎకరాలుగా అంచనా వేసింది. వర్షాలు అనుకూలిస్తే ఇది పెరిగే అవకాశముండగా.. ఇప్పటికే కావాల్సిన విత్తన వివరాలను తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు అందించారు. అంతేకాక డీలర్లు సైతం డిమాండ్ ఉన్న బీటీ–1, బీటీ–2 విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. -
ఉపాధి ఉరుకులు!
జిల్లాలో ఉపాధి హామీ పథకం వివరాలు మండలాలు 20 గ్రామపంచాయతీలు 589 మొత్తం జాబ్ కార్డులు 3.05 లక్షలు కూలీల సంఖ్య 6.45 లక్షలు యాక్టివ్ జాబ్ కార్డులు 1.81 యాక్టివ్ కూలీలు 3.05 ఈ ఏడాది ఇప్పటివరకు పనికి వెళ్లిన కూలీలు 1.99 లక్షలుఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో ఉపాధి హామీ పథకం ఉరుకులు పెడుతోంది. గ్రామీణ ప్రాంతంలో పనులు దొరకని సమయాన పేదలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వాలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకం ద్వారా పనులకు వచ్చే కూలీల సంఖ్య జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా పెరిగింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 47 రోజుల్లోనే 29.01 లక్షల పనిదినాలను కూలీలు పూర్తి చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరమంతా కలిపి 54.79 లక్షల పనిదినాలే పూర్తి చేయగా, ఈ ఏడాది అందులో సగం పనిదినాలను నెలన్నర రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. కాగా, జిల్లాకు ఈ ఏడాది ప్రభుత్వం 56 లక్షల పని దినాలను లక్ష్యంగా నిర్దేశించింది. రోజుకు లక్ష మందికి పైగానే... ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో వ్యవసాయ పనులు ఆశించిన మేరకు లేవు. ఏటా ఏప్రిల్ వరకు వ్యవసాయ పనులు లభించేవి. కానీ వర్షాలు సరిగ్గా లేక, సాగర్ జలాలు విడుదల కాక యాసంగిలో పంటలు పెద్దగా లేకపోవడం.. జనవరి, ఫిబ్రవరిలోనే పనులు ముగియడంతో కూలీలు మార్చి నుంచే ఉపాధి పనుల బాట పట్టారు. అయితే, తొలినాళ్లలో సరిపడా పనిదినాలు కల్పించలేకపోయిన అధికారులు... కలెక్టర్ ఆదేశాలతో దృష్టి సారించారు. చెరువుల్లో పూడికతీత పనులతో పాటు పంట కాల్వలు శుభ్రం చేయడం వంటి పనులను కల్పిస్తుండడంతో గత నెల 23వ తేదీ నుండి రోజుకు లక్ష మందికి పైగానే కూలీలు హాజరవుతున్నారు. గత వారంలో సగటున 1.09 లక్షలకు పైగా కూలీలు హాజరైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 1.28 లక్షల కుటుంబాలు పథకం ద్వారా పనులకు వస్తుండగా, వ్యక్తిగతంగా 1.99 లక్షల మంది కూలీలు హాజరయ్యారు. అలాగే, ఒక కుటుంబం ఇప్పటికే వంద రోజుల పనిదినాలను పూర్తి చేసుకుంది. కాగా, వర్షాలు పడి వ్యవసాయ పనులు మొదలయ్యేవరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు. రూ.62.76 కోట్ల వ్యయం జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు చేపట్టిన పనులకు ప్రభుత్వం రూ.62.76 కోట్లు వెచ్చించింది. కూలీలు చేసిన పనికి కొలతల ఆధారంగా వేతనం చెల్లిస్తుంటారు. ఈ ఆర్థిక సంవత్సరం వెచ్చించిన నిధుల్లో వేతనాల కింద రూ.59.95 కోట్లు చెల్లించగా, సామగ్రి, స్కిల్డ్ వేజెస్ కింద రూ.67.46 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పటి వర కు ఒక్కొక్కరికి రోజుకు సుమారు రూ.201.94 కూలి అందినట్లు తెలుస్తోంది. ఉపాధి హామీ పథ కం లెక్కల ప్రకారం రోజుకు రూ.300 చెల్లించాల్సి ఉన్నా పని కొలతల ఆధారంగా లెక్కిస్తున్నారు. కూలీలకు ఈనెల 7వరకు వేతనాలు చెల్లించగా, 8వ తేదీ నుండి బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. 46 రోజుల్లో 29.01 లక్షల పనిదినాలు పూర్తి కొద్దిరోజులుగా లక్షకు పైగా కూలీల హాజరు వ్యవసాయ పనులు లేకపోవడంతో భారీగా నమోదు మరికొద్ది రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం -
సకాలంలో యూనిఫాం సిద్ధం చేయాలి
నేలకొండపల్లి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కావాల్సిన యూనిఫామ్ సకాలంలో సిద్దం చేయాలని అందించాలని డీఆర్డీఏ ఏపీడీ నూరుద్ధీన్ సూచించారు. నేలకొండపల్లిలోని ఎమ్మార్సీలో శుక్రవారం ఆయన యూనిఫాంకు కావాల్సిన బట్టలను టైలర్లకు అందజేసి మాట్లాడారు. విద్యాసంస్థలు తెరిచేనాటికి యూనిఫాం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నందున టైలర్లు ఒక జత త్వరగా సిద్ధం చేయాలని తెలిపారు. ఈ విషయంలో ఐకేపీ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఐకేపీ డీపీఎం దర్గయ్య, ఎంపీడీఓ ఎం. ఎర్రయ్య, ఎంఈఓ బి.రాములు, ఐకేపీ ఏపీఎం అశోక్రాణి, ఎంపీఓ సీ.హెచ్.శివ పాల్గొన్నారు. -
బీపీ అదుపు తప్పితే ఆరోగ్యానికి ముప్పు
ఖమ్మంవైద్యవిభాగం: రక్తపోటు(బీపీ) అదుపులో లేకపోతే ఆరోగ్యానికి ముప్పు ఎదురవుతుందని జిల్లా జనరల్ ఆస్పత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నారగోని రాంప్రసాద్ తెలిపారు. ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును సూపరింటెండెంట్ ఎల్.కిరణ్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా రాంప్రసాద్ మాట్లాడుతూ బీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ లక్షణాలు బయటపడవని, లక్షణాలు బయటపడేలోగా ప్రమాద స్థితికి చేరుకుంటారన్నారు. ఈ మేరకు తరచుగా పరీక్షలు చేయించుకుంటూ, బీపీలో హెచ్చుతగ్గులు ఉంటే తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలని, ప్రతీరోజు వాకింగ్ను అలవాటుగా మార్చుకోవాలని తెలిపారు. ఈసమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్కుమార్, వైస్ ప్రిన్సిపాల్ సరిత, వైద్యులు పాల్గొన్నారు. -
బీఏఎస్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వా రా నిర్వహిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకంలో భాగంగా 1, 5వ తరగతుల్లో ప్రవేశానికి ఎస్సీ విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. ఐదో తరగతి(రెసిడెన్షియల్)లో 131 సీట్లు, ఒకటో తరగతి (నాన్ రెసిడెన్షియల్)లో 128 సీట్లు ఉన్నాయని, కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు డిగ్రీ, ఆ పైన విద్యార్హతలు ఉంటే దరఖాస్తుకు అనర్హులని, 50 శాతం సీట్లను వ్యవసాయ కూలీల పిల్లలు, మొదటి తరం విద్యనభ్యసించనున్న పిల్లలకు కేటాయిస్తామని తెలిపా రు. మిగిలిన 50శాతం సీట్లలో అనాథలు, జోగినిల పిల్లలు, కార్మికుల పిల్లలకు రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఐదో తరగతిలో ప్రవేశాలకు 4వ తరగతి ఉత్తీర్ణుత, ఒకటో తరగతిలో ప్రవేశాలకు 1 జూన్ 2018 నుండి 31 మే 2019 మధ్య జన్మించిన వారై ఉండాలని, రేషన్కార్డు, ఆధార్కార్డు జిరాక్స్, మీసే వా నుంచి తీసుకున్న కుల, ఆదాయ, నివాస ధృవీకరణతో పత్రాలతో ఈనెల 20నుండి జూన్ 7వ తేదీ లోపు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో అందజేయాలని డీడీ సూచించారు. -
రెండో రోజూ కొనసాగిన తనిఖీలు
నేలకొండపల్లి: మండలంలోని మోటాపురంలో ఓ వ్యాపారి భారీగా ధాన్యం నిల్వ చేశారనే ఫిర్యాదుతో సివిల్ సప్లయీస్ అధికారులు చేపట్టిన తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగాయి. సివిల్ సప్లయీస్ డీటీ మహ్మద్ అబ్ధుల్ నిసార్, ఆర్ఐ నరేష్ సంబంధిత వ్యాపారి వద్ధ ఉన్న ధాన్యం స్టాక్ను పరిశీలించి లెక్కలు వేయడంతో పాటు శాంపిల్స్ సేకరించారు. ఇదిలా ఉండగా పలువురు రైతులు ఆ ధాన్యం బస్తాలు తమవేనని అధికారులకు వివరణ ఇచ్చారు. అయితే, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకు ధాన్యం కదిలించొద్దని వ్యాపారిని ఆదేశించారు. -
పోక్సో కేసులో 20ఏళ్ల జైలుశిక్ష
కొత్తగూడెంటౌన్: పోక్సో కేసులో ఓ వ్యక్తికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ భద్రాద్రి జిల్లా జడ్జి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పు చెప్పారు. ఖమ్మంకు చెందిన బాలిక కాళ్లకు పక్షవాతం రాగా నాటువైద్యం చేయించేందుకు తల్లిదండ్రులు అశ్వా పురం మండలం మంచికంటి నగర్లోని అమ్మమ్మ ఇంట్లో వదిలివెళ్లారు. వీరి ఇంటి సమీపాన ఉండే జవ్వాజి సాంబశివరావు తన ఇంట్లో టీవీ చూపిస్తానని 2021 డిసెంబర్ 30న ఒంటరిగా ఉన్న బాలికను ఎత్తుకుని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడి ఆమె కేకలు వేయగా పరారయ్యాడు. దీంతో కేసు దర్యాప్తు చేపట్టి పోలీసులు కోర్టు లో చార్జీషీటు దాఖలు చేయగా విచారణలో సాంబశివరావుపై నేరం రుజువైనందున 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు. అలాగే, బాధితురాలికి పునరావాస పరిహారం కింద రూ.ఐదు లక్షలు చెల్లించాలని ఆదేశించారు. ప్రాసిక్యూషన్ తరఫున వి.నాగిరెడ్డి వాదించారు. -
తీన్మార్ మల్లన్నను అనర్హుడిగా ప్రకటించాలి
● కలెక్టరేట్లో ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ దీక్ష ఖమ్మం సహకారనగర్: వరంగల్ – ఖమ్మం – నల్ల గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను అనర్హుడిగా ప్రకటించాలని స్వతంత్ర అభ్యర్థి బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. ఈమేరకు డిమాండ్తో శుక్రవారం ఆయన ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తిరుమలగిరిలో జరిగిన సమావేశంలో తీన్మార్ మల్లన్న తన వ్యాఖ్యల ద్వారా 4.61లక్షల గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేశారని తెలిపారు. తనను శాసనమండలికి పంపుతారా లేకుంటే శ్మశానానికి పంపుతారా అనేది తేల్చుకోవాలంటూ చేసిన వ్యాఖ్య లపై కేంద్ర, రాష్ట్ర ఎన్ని కల సంఘం అధికారులు, ఆర్ఓకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశామని చెప్పారు. అలాగే, ఈనెల 16వ తేదీన ఖమ్మం అదనపు కలెక్టర్, ఏఆర్ఓ మధుసూదన్ నాయక్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో దీక్ష చేపట్టానని తెలిపారు. ఈమేరకు ఏఆర్ఓ మధుసూదన్ నాయక్ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేస్తానని చెప్పారని, శుక్రవారం వరకు చర్యలు తీసుకోకుంటే నల్లగొండ ఆర్ఓ కార్యాలయం వద్ద దీక్ష చేపడతానని జడ్సన్ వెల్లడించారు. -
కురుస్తున్న పెద్దాస్పత్రి భవనం
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం పెద్దాస్పత్రిలోని పాత భవనం చిన్నపాటి వర్షానికి సైతం కురుస్తోంది. భవనం పైఅంతస్తులో కార్యాలయం, ల్యాబ్లు, కింది అంతస్తులోని డయాలసిస్ కేంద్రం, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం క్లినిక్ నిర్వహిస్తున్నారు. అయితే భవనం నిర్మించి 60 ఏళ్లు దాటడంతో శిథిలావస్థకు చేరింది. ఈనేపథ్యాన గురువారం రాత్రి కురిసిన వర్షానికి శుక్రవారం ఉదయం వరకు నీటి ధారలు కారుతూనే ఉన్నాయి. దీంతో సిబ్బంది పలుచోట్ల థర్మకోల్ పెట్టెలు పెట్టి నిండగానే నీటిని బయట పారబో శారు. వర్షాకాలంలో సమస్య తీవ్రరూపం దాల్చనున్నందున అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు. -
రైలొచ్చినా రోడ్డుమార్గమే..
● 2022లో అందుబాటులోకి బొగ్గు రైలు ● అయినా సత్తుపల్లి నుంచి ఆర్సీహెచ్పీకి లారీల్లో రవాణా ● పర్యావరణ అభ్యంతరాలను పక్కనపెట్టడంపై విమర్శలు ● మరోపక్క లోడింగ్ లేక లారీ యజమానుల నిరసన సత్తుపల్లి: సత్తుపల్లి ఓపెన్కాస్టుల్లో తవ్వకాలు ప్రారంభమైనప్పుడే బొగ్గు తరలింపునకు రైలు మార్గానికి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని పర్యావరణశాఖ నిబంధన విధించింది. అయినప్పటికీ 2005లో బొగ్గు తవ్వకాలు ప్రారంభం కాగా 17ఏళ్ల పాటు కొత్తగూడెంకు టిప్పర్ల ద్వారానే రవాణా చేశారు. పర్యావరణ శాఖ పలుమార్లు తాఖీదులు ఇవ్వడంతో ఒత్తిడి తీసుకురావడంతో రైల్వేలైన్ పూర్తి చేసి 2022 జూన్లో బొగ్గు రవాణాను ప్రారంభించారు. దీంతో కొత్తగూడెంకు టిప్పర్లతో బొగ్గు రవాణాకు బ్రేక్ పడింది. అయితే ఇటీవల పర్యావరణ శాఖ అభ్యంతరాలను పక్కనబెట్టి మళ్లీ కొత్తగూడెం ఆర్సీహెచ్పీకి టిప్పర్ల ద్వారా 9 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రైల్వేలైన్ మొదలయ్యాక కొత్తగూడెంకు రోడ్డుమార్గంలో రవాణా చేయబోమని చెప్పిన అధికారులు మళ్లీ అదే మార్గాన్ని ఎంచుకోవడంపై లారీల యజమానులు తప్పుపడుతున్నారు. కాకినాడ లోడింగ్ ఆగడంతో.. సత్తుపల్లి లారీ యూనియన్ కార్యాలయం ద్వారా 750 లారీలను బొగ్గు రవాణాకు వినియోగిస్తున్నారు. ఈ లారీల మీద ప్రత్యక్షంగా 3వేల మంది, పరోక్షంగా 8వేల మంది జీవనం సాగిస్తున్నారు. అయితే, ప్రజాప్రయోజనాల వాజ్యం దాఖలు కావడంతో గతేడాది జనవరి నుంచి కాకినాడ పోర్టుకు బొగ్గు రవాణా నిలిచిపోవడంతో సమస్య ఉత్పన్నమైంది. కాకినాడకు బొగ్గు రవాణా ఉంటే రోజుకు 100 నుంచి 150 లారీలకు లోడింగ్ దక్కేది. కాగా ఫిట్ హెడ్ డెలివరీ(పీహెచ్డీ) కింద సత్తుపల్లి, కిష్టారం ఓసీల నుంచి రోజుకు 7వేల నుంచి 8వేల టన్నుల బొగ్గు రవాణా ఉంటేనే సత్తుపల్లిలోని లారీల యజమానులు, డ్రైవర్లకు ఉపాధి లభిస్తుంది. కానీ సత్తుపల్లి ఓసీల్లో నాణ్యమైన జీ–8, జీ–13 బొగ్గు ఉందని చెబుతున్నా... పరిశ్రమల నుంచి సరిపడా ఆర్డర్లు రాకపోవటంతో లోడింగ్ వ్వలేకపోతున్నామని అదికారులు చెబుతున్నారు. నాణ్యమైన బొగ్గు ఇవ్వకపోవడంతోనే పరిశ్రమలు ముందుకు రావడం లేదని యజమానులు వాదిస్తుండగా.. ఆర్థిక సంవత్సరం ఆరంభ సమయం కావడమే కారణమని అధికారులు చెబుతున్నారు. కొనసాగుతున్న నిరసనలు బొగ్గు లోడింగ్ పెంచాలని, కొత్తగూడెం ఆర్సీహెచ్పీకి రవాణా నిలిపివేయాలనే డిమాండ్తో సత్తుపల్లి లారీ యూనియన్ ఆధ్వర్యాన చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం వంటావార్పు ద్వారా నిరసన తెలపగా, శనివారం నుంచి అఖిలపక్షంతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టనున్నటువెల్లడించారు. అలాగే, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. లారీ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కొండపల్లి రమేష్రెడ్డి, కీజర్తో పాటు పీఎల్.ప్రసాద్, ఎస్.కే.మౌలాలీ, కోటిరెడ్డి, చిన్నంశెట్టి సూరిబాబు, దురిశేటి శ్రీనివాసరావు, వెలిశాల చెన్నాచారి, ఐ.శ్రీను, కోటా మోహన్రావు, వేముల విశ్వనాథం, ఎస్.కే.మస్తాన్, ఎస్.కే.లియాఖత్ తదితరులు పాల్గొన్నారు. ఓవర్ లోడ్.. ప్రమాదాలు సత్తుపల్లి జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీ నుంచి కొత్తగూడెం ఆర్సీహెచ్పీ వరకు రోజుకు వంద టిప్పర్లతో బొగ్గు రవాణా చేసిన సమయాన ప్రమాదాలు నిత్యకృత్యం కాగా.. మళ్లీ అదే మార్గాన్ని ఎంచుకోవడంతో ఎప్పుడేం జరుగుతోందనని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఒక్కో టిప్పర్ రోజుకు ఐదారు టిప్పులు వేయాల్సి రావడంతో డ్రైవర్లు అతివేగంగా నడుపుతారని గత అనుభవాలు చెబుతున్నాయి. 2005 నుంచి 2022 వరకు 200మందికిపైగా మృత్యువాత పడగా సుమారు 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారంటే పరిస్థితులు ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు కనీసం 25వేల టన్నుల బొగ్గు రవాణా చేయాల్సి ఉండగా, కిలోమీటర్కు టన్నుకు రూ.3.29పైసలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. కానీ 14టైర్ల టిప్పర్లో 24 టన్నులకు బదులు అదనంగా ఐదారు టన్నులు లోడింగ్ చేస్తుండడం.. మితిమీరిన వేగంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాక డ్రైవర్లు విశ్రాంతి లేకుండా విధులు నిర్వర్తిస్తుండడం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని అప్పట్లో గుర్తించి కొత్తగూడెంకు టిప్పర్ల ద్వారా బొగ్గు రవాణాను నిషేధించారు. -
తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
ఖమ్మంవన్టౌన్: ఖమ్మం – నల్లగొండ – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27న జరగనుండగా కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మండలాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిగా మల్లన్నకు పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా ప్రచా రం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సూరంశెట్టి కిషోర్, గాలి దుర్గారావు, భూక్యా బాలాజీ, చంద్ర ప్రకాష్, నరేందర్, సుధాకర్, శివ, వేణు, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం డిపోలో విజయోత్సవం ఖమ్మంమయూరిసెంటర్: లోక్సభ ఎన్నికల సందర్భంగా నడిపిన బస్సుల ద్వారా అత్యధిక ఆదాయం సాధించడంతో ఖమ్మం డిపో ఉద్యోగులు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. ఈసందర్భంగా ఉద్యోగులకు స్వీట్లు అందజేశారు. డిపో ద్వారా 3.12 లక్షల కి.మీ. బస్సులు నడిపించడంతో రూ.2కోట్ల ఆదాయం సమకూరడమే కాక 99శాతం ఓఆర్తో ఖమ్మం డిపో మొదటి స్థానంలో నిలిచిందని డీఎం శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 14న 109, 15న 105, 16న 104 శాతం ఓఆర్ నమోదైందని చెప్పారు. ఈవిషయంలో డ్రైవర్, కండక్టర్లతో పాటు ఉద్యోగి పాత్ర కీలకమని ఆయన అభినందించారు. రాళ్ల దాడిలో పోలీస్ పెట్రోకార్ ధ్వంసం ఖమ్మంక్రైం: మద్యం మత్తులో గొడవ పడిన ఇద్దరు విసిరిన రాళ్లు పడడంతో ఖమ్మం త్రీటౌన్ పోలీస్స్టేషన్కు సంబంధించిన పెట్రోకార్ ధ్వంసమైంది. పోలీసుల కథనం ప్రకా రం.. జనగామకు చెందిన హరీష్, ఆయన స్నేహితుడు అలీ కాల్వొడ్డులోని బైపాస్ ప్రాంతం బార్లో గురువారంరాత్రి మద్యం తాగారు. ఆతర్వాత వీరిద్దరు ఘర్షణ పడుతుండగా పోలీసులకు సమాచారం అందటంతో పెట్రోకార్లో వచ్చారు. కాగా, హరీశ్, అలీ పోలీసుల ఎదుటే రాళ్లతో దాడి చేసుకోగా రాళ్లు పడడంతో పోలీసుల పెట్రోకార్ అద్దాలుమయ్యాయి. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధురాలిపై దాడి.. ఆభరణాలు చోరీ ఖమ్మంఅర్బన్: రోడ్డు పక్కన నిలబడిన వృద్ధురాలిపై దాడి చేసిన వ్యక్తి బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన ఇది. ఖమ్మం మమత రోడ్డులో నివాసముంటున్న 80ఏళ్ల వృద్ధురాలి కుమారులు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఆమె రోజులాగే గురువారం సాయంత్రం ఇంటి ఎదుట నిలబడగా, గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వృద్దురాలి మెడలో బంగారం చోరీకి యత్నించాడు. ఈక్రమంలోనే ఆమెను నెట్టివేయగా కింద పడడంతో తలకు తీవ్రగాయమైంది. ఆపై వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లినట్లు తెలిసింది. అయితే, ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు. భవనం పైనుంచి పడి మేసీ్త్ర మృతి ఖమ్మంక్రైం: నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడిన మేసీ్త్ర మృతి చెందాడు. ఖమ్మం త్రీటౌన్ సీఐ రమేష్ వెల్లడించిన వివరాలు.. ఖమ్మం అగ్రహారానికి చెందిన పాయం వీరస్వామి(45) సుతారీ మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఆయన శ్రీనివాస్ నగర్లోని ఓ భవనం ప్లాస్టరింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారు బోల్తా పడడంతో వ్యక్తి.. కూసుమంచి: మండలంలోని జీళ్లచెరువు సమీ పాన జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున కారు బోల్తా పడిన ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మంలోని పోలీస్ హౌసింగ్ కాలనీకి చెందిన వడ్లమూడి వెంకటేశ్వర్లు(50) తన బంధువును హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్చి తిరిగి కారులో వస్తున్నాడు. ఈక్రమాన జీళ్లచెరువు సమీపంలోకి రాగానే అడ్డుగా వచ్చిన గేదెను తప్పించే కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో వెంకటేశ్వర్లు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
వానొస్తే మునకే!
● భద్రగిరిలో కానరాని ముందస్తు నివారణ పనులు ● స్లూయీజ్ల పటిష్టతకు చేపట్టని చర్యలు ● శాశ్వత మోటార్లు ఏర్పాటు చేయాలంటున్న బాధితులుపటిష్టతకు ప్రణాళికలేవి ? ప్రధానంగా పట్టణంలోని వరద నీటితో పాటు విస్తా కాంప్లెక్స్, ఇతర ప్రాంతాల్లోని స్లూయీజ్ల వద్ద నీటిని తోడేందుకు ఈ సీజన్లో మోటార్లను అద్దెకు తీసుకొస్తుంటారు. అయితే రామాలయం వద్ద ఉన్న స్లూయీజ్ల్లో నీటి తోడకానికి మాత్రం భారీ మోటార్లు అవసరం కావడంతో అదనంగా సింగరేణికి చెందిన ఇంజన్లను సైతం వినియోగిస్తుంటారు. భారీగా చేరిన వరదను తోడే క్రమంలో మోటార్లు మొరాయిస్తుంటాయి. దీంతో పట్టణంలో కురిసే చిన్నపాటి వర్షానికే ఆ ప్రాంత ప్రజలు ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తోంది. అయితే ప్రతి యేటా స్లూయీజ్ల లీకేజీకి, పటిష్టతకు చర్యలు చేపడతామని అంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ఏడాది ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళిక రూపొందించిన దాఖలాలు లేవు. దీనికి తోడు కరకట్ట సైతం పలు ప్రాంతాల్లో దెబ్బ తిన్నది. ప్రధానంగా నీటిని ఎత్తి గోదావరిలో కలిపే ప్రాంతాలలో రివైలింగ్ సైతం క్రమంగా కొట్టుకుపోతోంది. వర్షాకాలం సమీపిస్తున్నందున ఇకకై నా అధికారులు చర్యలు చేపట్టకుంటే మళ్లీ నష్టం తప్పదనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. భద్రాచలం: భద్రాచలంలో పెద్ద వర్షం వచ్చినా.. గోదావరికి వరదలు సంభవించినా.. ముందుగా వరదనీరు చేరేది రామాలయం పరిసర ప్రాంతాలే. చినుకు పడిందంటే దేవస్థానం చుట్టుపక్కల గల చిరు వ్యాపారులు, స్థానికులు వణికిపోతున్నారు. చుట్టూ నీరు చేరడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తుల రాక కూడా తగ్గుతుండడంతో ఆలయం వెలవెల బోతుంది. ఇది ప్రతి యేటా నిత్యకృత్యమే అవుతోంది. వర్షాకాలంలో హడావిడి చేసే అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు ముందస్తు నివారణ చర్యలు చేపట్టడంలో చిత్తశుద్ధి చూపడం లేదు. దీంతో ఈ ఏడాది వర్షాకాలంలో ఎలా ఉంటుందోనని స్థానికులు ఇప్పటి నుంచే భయపడుతున్నారు. నివారణ చర్యల్లో నిర్లక్ష్యం.. భద్రాచలం వద్ద సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు గోదావరి వరదలు సంభవిస్తుంటాయి. నదిని వరద ముంచెత్తడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో పునరావాస శిబిరాలకు తరలివెళ్లాల్సి వస్తుంది. అయితే భద్రాచలంలో మాత్రం పరిస్థితి మరో తీరుగా ఉంటుంది. వరదలు వచ్చిన సమయంలో పట్టణంలోని వరద నీరు, మురుగు నీరు గోదావరిలో కలిసేందుకు కరకట్టల వద్ద ఏర్పాటు చేసిన స్లూయీజ్లను మూసివేస్తారు. దీంతో రామాలయం, విస్తా కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న పట్టణ వరదనీటితో స్వామివారి అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్, చప్టా దిగువ ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ఇక సుభాష్ నగర్, కొత్త అశోక్నగర్ కాలనీ ప్రాంతాల వైపు ఏర్పాటు చేసిన స్లూయీజ్ల లీకేజీతో వాటితో పాటు పలు కాలనీల్లోకి వరద నీరు చేరుతుంది. ఇలా మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించిన ప్రతి సారి ఈ సమస్య భద్రాచలాన్ని వేధిస్తూనే ఉంటుంది. దీంతో ఒక్కోమారు అర్ధరాత్రి ఊహించకుండా వచ్చే నీటితో కాలనీ వాసులు ఇళ్లలో సర్వం కోల్పోయి శిబిరాల్లో తలదాచుకున్న సందర్భాలు గత రెండేళ్లలోనే అధికంగా ఉన్నాయి. ఇలా ప్రతి ఏడాది వర్షాకాలంలో పలుమార్లు ఈ సమస్య ఈ ప్రాంత వాసులను ఇబ్బంది పెడుతుంటుంది. ప్రతి సంవత్సరం ఈ సమస్య ఏర్పడుతున్నా పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మే నెల సగం గడిచింది. జూన్ నుంచి వర్షాకాలం ప్రారంభం కానుంది. అయితే గత అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా నష్టపోతూనే ఉన్నాం వర్షాకాలంలో వచ్చే వరదతో ప్రతి ఏటా నష్టపోతూనే ఉన్నాం. ఇటీవల కొద్దిపాటి వర్షం వచ్చినా నీరు చేరుతుండడంతో మా దుకాణాలు, ఇళ్లు మునిగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతున్నా అధికారులు మా బాధను పట్టించుకోవడం లేదు. మళ్లీ వర్షాకాలం వస్తోందంటేనే భయమేస్తోంది. ఈ సారైనా శాశ్వత ప్రాతిపదికన మోటార్లు ఏర్పాటు చేసి మా ఇక్కట్లు తీర్చాలని కోరుతున్నాం. – పి.రమణ, విస్తా కాంప్లెక్స్ చిరు వ్యాపారి -
51 జంటలకు సామూహిక వివాహాలు
కొత్తగూడెంరూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం గ్రామంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వివాహాలు జరిపించారు. త్రిదండి దేవనాథ జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వేడుకకు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన 51 జంటలు హాజరై సామూహిక వివాహాలు చేసుకున్నాయి. నూతన వధూవరులకు గ్రామానికి చెందిన కొండపల్లి సాయిగోపాల్ – సుజాత దంపతులు వధూవరులకు మంగళసూత్రాలు, నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం వధూవరులతో పాటు బంధు, మిత్రులకు భోజనం కూడా ఏర్పాటు చేశారు. కాగా, సాయిగోపాల్ దంపతులు గత 18 సంవత్సరాలు గా ప్రతీ వైశాఖ శుద్ధ దశమి రోజున సామూహిక వివాహ వేడుకలు నిర్వహిస్తుండడం విశేషం. నూత న జంటలను వసుంధర సుమంగళి వస్త్రాలయం అధినేత తాటిపల్లి శంకర్బాబు దంపతులు, కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి, ఆళ్ల మురళి, కోనేరు సత్యనారాయణ, ఊకంటి గోపాల్రావు, డాక్టర్ శంకర్నాయక్ తదితరులు ఆశీర్వదించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్లో కొనసాగుతారా.. లేక?
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం: ఐజీ వినీత్ బ్రిజ్లాల్
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
తప్పక చదవండి
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
- కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ అరెస్ట్
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
Advertisement