-
గాలివాన బీభత్సం
నిజాంసాగర్/పిట్లం/గాంధారి: జిల్లాలోని పలు ప్రాంతాలలో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల ఇళ్ల రేకులు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. చెట్లు నేలకూలాయి. మహమ్మద్నగర్ మండలంలోని మగ్ధుంపూర్, గాలిపూర్ గ్రామాల్లో గాలివానలతో భయానక వాతావరణం నెలకొంది. బలమైన గాలులకు చెట్ల కొమ్మలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రెండు గ్రామాల్లో పలు ఇళ్ల రేకులు కొట్టుకుపోవడంతో నిరుపేదలు ఇబ్బందిపడ్డారు. రెండు గ్రామాలలో 60కిపైగా విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో అంధకారం నెలకొంది. వైర్లు తెగి ఇళ్లపై పడడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ట్రాన్స్కో ఏఈ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ట్రాన్స్కో సిబ్బంది రెండు గ్రామాల్లో మరమ్మతులు చేపడుతున్నారు. గాంధారి, పిట్లం మండలాలలో బుధవారం సాయంత్రం గాలి దుమారంతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. పోతురెడ్డిపల్లి హనుమాన్ ఆలయం వద్ద ఉన్న గోశాల రేకుల షెడ్డు గాలికి ధ్వంసమైంది. సుమారు 2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని గోశాల నిర్వాహకుడు తేజ స్వామి తెలిపారు. -
‘266 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి’
భిక్కనూరు: జిల్లాలో 266 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. బుధవారం ఆయన మండలంలోని రైస్ మిల్లులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 48,503 మంది రైతుల నుంచి రూ.616 కోట్ల విలువైన 2,79,446 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇప్పటికే రైతుల ఖాతాలలో రూ.551 కోట్లు జమ చేశామని తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి వేగంగా రైస్మిల్లులకు తరలించాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కు సూచించారు. గోదాములను వినియోగించుకోండి దోమకొండ: కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి సహకార సంఘాల గోదాములను వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సూచించారు. బుధవారం ఆయన సంగమేశ్వర్, ముత్యంపేటలలోగల ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యంపేట, చింతమానిపల్లిలోని సహకార సంఘాల గోదాములను ఖాళీ చేయించి, సమీపంలోని రైస్ మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని నిలువ చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మల్లికార్జన్ బాబు, పౌరసరఫరాల శాఖ జిల్లా ఇన్చార్జి మేనేజర్ నిత్యానందం, డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు. -
ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
కామారెడ్డి క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. జిల్లాలో 60 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉందన్నారు. దగ్గి, సదాశివనగర్, భిక్కనూరు టోల్ ప్లాజా, ఆర్టీఏ చెక్పోస్ట్, టేక్రియాల్ తదితర ప్రాంతాలలో తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి నివారణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు, రుంబుల్ స్ట్రిప్స్, బారికేడ్లు, బ్లింకర్లు, కల్వర్టుల వద్ద రేడియం స్టిక్కర్లు, మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు, స్పీడ్ గన్లు, ిసీసీ కెమెరాలు, హైమాస్ట్ లైట్లు వంటివి ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అత్యవసర సమయంలో వాహనాలు రహదారి పక్కన ఆపడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రమాదానికి గురైన వారికి తక్షణ వైద్య సహాయం అందేలా చూడాలన్నారు. వెంటిలెటర్తో కూడిన అంబులెన్స్లు సిద్ధంగా ఉంచాలన్నారు. రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో బాధితులకు సహాయం చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ సింధు శర్మ, ట్రెయినీ ఐపీఎస్ కాజల్ సింగ్, డీఎస్పీ నాగేశ్వర్రావు, నేషనల్ హైవే రెసిడెంట్ ఇంజినీర్ రామారావు, టోల్గేట్ ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్ కుమార్, ఆర్అండ్బీ ఈఈ రవిశంకర్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంసింగ్, సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధి నూర్ ఖేతార్ తదితరులు పాల్గొన్నారు.చివరి దశలో ధాన్యం కొనుగోళ్లు..కామారెడ్డి క్రైం: జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు వచ్చిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో బుధవారం రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయ్యిందన్నారు. మరో 30,137 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. లక్ష్యం మేరకు ధాన్యం అన్లోడ్ చేసుకున్న మిల్లులకే వచ్చే ఖరీఫ్ సీజన్లో ధాన్యం కేటాయిస్తామన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యం దించుకోవాలని మిల్లర్లకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డీఎస్వో మల్లికార్జున్ బాబు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
ఆడపిల్లపై వివక్ష
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా, మగవారికి దీటుగా ఎదుగుతున్నా వివక్ష మాత్రం తగ్గడం లేదు. కొందరు ఆడపిల్ల అంటేనే భారంగా భావిస్తున్నారు. కొడుకై తే ప్లస్ అని, కూతురైతే మైనస్ అని లెక్కలేసుకుంటూ.. పుట్టబోయేది ఆడబిడ్డని తెలిస్తే చాలు కడుపులోనే ప్రాణం తీసేస్తున్నారు. దీంతో జిల్లాలో బాలబాలికల నిష్పత్తి ఆందోళన కలిగించేలా తగ్గిపోతోంది. – సాక్షి, కామారెడ్డిమార్పు రాకుంటే కష్టమే ఆడపిల్లలు వద్దనుకుని అబార్షన్లు చేయించడం మూలంగా ఆడ, మగ నిష్పత్తి దెబ్బతింటోంది. ఆడపిల్లల సంఖ్య ఏడాదికేడాది తగ్గిపోతుండడంతో ఇప్పటికే చాలామంది యువకులకు పెళ్లి కావడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ మరింత భయంకరంగా మారే అవకాశాలున్నాయి. అధికారులు స్పందించి స్కానింగ్ సెంటర్లపై నిఘా పెంచడంతోపాటు ఆడపిల్లలపై వివక్ష అంతానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. జిల్లా జనాభా లెక్కలు చూసినా, జిల్లా ఓటర్ల లెక్కలను గమనించినా ఆడవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాలుగా ఆడపిల్లలపై వివక్ష పెరిగిపోయి జననాలు తగ్గిపోతున్నాయి. దీంతో ఆడ, మగ నిష్పత్తి క్రమంగా దెబ్బతింటోంది. జిల్లాలో గతేడాది 11,303 జననాలు నమోదయ్యాయి. ఇందులో 6 వేల మంది మగ సంతానం కాగా 5,304 మాత్రమే ఆడపిల్లలున్నారు. అంటే మగవారికన్నా 696 మంది ఆడపిల్లలు తక్కువగా జన్మించారు. ఐదారేళ్లుగా ఆడపిల్లల నిష్పత్తి పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. స్కానింగ్తో తెలుసుకుని.. జిల్లాలో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. చట్టప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని తెలిసినా.. పలు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు కాసులకు కక్కుర్తి పడి పరీక్షలు చేస్తూ కడుపులో పెరుగుతోంది ఆడో, మగో ముందే చెప్పేస్తున్నారు. ఆడపిల్ల వద్దనుకునే వారే ఎక్కువగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటుండడంతో.. పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయిస్తున్నారు. జిల్లా యంత్రాంగం అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు అబార్షన్లు చేస్తున్న విషయం జిల్లా యంత్రాంగానికి తెలిసినా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. డబ్బులకు ఆశపడి ఆస్పత్రుల నిర్వాహకులు అబార్షన్లు చేస్తున్నా అడ్డుకునేవారు లేకుండాపోయారు. ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా గతేడాది నమోదైన జననాల వివరాలు..ప్రాజెక్టు బాలికలు బాలురు మొత్తం వ్యత్యాసం బాన్సువాడ 1,037 1,136 2,173 99దోమకొండ 991 1,164 2,155 173కామారెడ్డి 1,253 1,438 2,691 185మద్నూర్ 912 1,022 1,934 110ఎల్లారెడ్డి 1,111 1,240 2,351 129మొత్తం 5,304 6,000 11,304 696 యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు ఆడపిల్ల అని తెలిస్తే పుట్టక ముందే చంపేస్తున్న వైనం జిల్లాలో పడిపోతున్న ఆడ, మగ నిష్పత్తి ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు -
29న అథ్లెటిక్స్ ఎంపికలు
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఈనెల 29న ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ పురుషులు, మహిళలతోపాటు అండర్–8, 10, 12, 14, 16, 18, 20 విభాగాలలో బాలబాలికలకు 50, 80, 100, 400, 800 మీటర్ల పరుగు, డిస్కస్, జావెలిన్ త్రో అంశాలలో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్సెస్సీ మెమో జిరాక్స్, లేదా పుట్టిన తేదీ సర్టిఫికెట్తో ఎంపిక పోటీలకు హాజరు కావాలని సూచించారు. -
గంజాయి కేసులో తొమ్మిది మంది అరెస్టు
మోర్తాడ్: బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చిన హైదరాబాద్కు చెందిన ఆరుగురితో పాటు కమ్మర్పల్లికి చెందిన ఒకరు, నిర్మల్కు చెందిన మరో ఇద్దరు గంజాయి కేసులో అరెస్టు అయ్యారు. ఏర్గట్ల ఎస్సై మచ్చేందర్రెడ్డి బుధవారం తెలిపిన వివరాలు.. కమ్మర్పల్లికి చెందిన ఎండీ ఆరీఫ్ ఇంట్లో శుభకార్యానికి హైదరాబాద్కు చెందిన అబ్దుల్ రహమాన్, ఎండీ అజర్, ఎస్కే శంషద్, సమీర్, ప్యార్శని వంశీవర్ధన్, ఎండీ సలీం పాషా హాజరయ్యారు. వీరు ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ ఈతవనంలో మంగళవారం గంజాయి తాగుతూ హంగామా చేశారు. స్థానికుల ఫిర్యాదులో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. వీరు నిర్మల్కు చెందిన షేక్ షాదుల్లా, సయ్యద్ అజారుద్దీన్ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు గుర్తించి, వారిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. 268 గ్రాముల గంజాయి, ఒక స్కార్పియో వాహనం, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. -
చోరీ కేసులో ఒకరి అరెస్ట్
ఖలీల్వాడి: నగరంలోని నాలుగో టౌన్ ఠాణా పరిధిలోని షిర్డీ సాయినగర్లో చోరీకి పాల్పడిని ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్చార్జి సీఐ విజయ్బాబు తెలిపారు. వివరాలు.. ఈ నెల 4న మధ్యాహ్నం షిర్డీ సాయినగర్కు చెందిన దాచ మధుసూదన్ ఇంట్లో పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన శివకుమార్ చోరీ చేశాడు. రెండున్నర తులాల బంగారం, కిలో వెండి ఎత్తుకెళ్లాడు. బుధవారం నిజామాబాద్ బస్టాండ్లో శివకుమార్ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. బంగారం, వెండి స్వాధీనం చేసుకొని శివకుమార్ను రిమాండ్ తరలించామన్నారు. నిందితుడికి విజయ్కుమార్ సహకరించినట్లు తెలిపారు. బెల్టుషాపుపై దాడి మోపాల్: మండలంలోని మంచిప్పలో బెల్టుషాపుపై పోలీసులు బుధవారం దాడి చేశారు. రూ.1. 70లక్షల విలువైన 363 లీటర్ల మద్యం పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. గ్రామంలో బెల్టుషాపు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసినట్లు పేర్కొన్నారు. బెల్టుషాపు నిర్వహిస్తున్న బానోత్ వెంకట్రాంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. -
డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలుశిక్ష
కామారెడ్డి క్రై ం: మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరికి కామారెడ్డి కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితం పట్టణ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా భుక్యా బందర్, మాయం రాజయ్య డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డారు. వారిని బుధవారం కోర్టుకు హాజరుపర్చగా ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ప్రతాప్ జైలు శిక్ష విధించారని ఎస్హెచ్ఓ తెలిపారు. దాడి చేసిన వ్యక్తిపై కేసు ఖలీల్వాడి: దాడి కేసులో నగరంలోని గాజులపేటకు చెందిన శివకుమార్పై కేసు నమోదు చేసినట్లు రెండో టౌన్ ఎస్సై రాము తెలిపారు. వివరాలు.. గాజులపేట్ చెందిన పల్లికొండ అశోక్ తన తండ్రి, తమ్ముడితో కాలనీలోని పాత ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటి వద్ద చెత్త వేశారని అదే కాలనీకి చెందిన శివకుమార్ వారితో గొడవకు దిగాడు. అనంతరం కర్రతో దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
సీపీ ఆఫీస్కు కానిస్టేబుల్ అటాచ్
ఖలీల్వాడి: నగరంలోని మూడో టౌన్ పోలీస్స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ అప్సర్ను సీపీ ఆఫీస్కు అటాచ్ చేసినట్లు ఆలస్యంగా తెలిసింది. ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికలలో ఓ జాతీయపార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను తనిఖీల పేరిట అప్సర్ ఇబ్బందులు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలింగ్ చిట్టీలు పంచుతున్న ఓ వ్యక్తిని తనిఖీలు చేయడంతోపాటు అతని జేబులో ఉన్న డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సంబంధిత పార్టీ నేతలు సీపీ కల్మేశ్వర్ దృష్టికి తీసుకువెళ్లడంతో సీపీ ఆఫీస్కు అటాచ్ చేశారు. ఆయనకు ప్రస్తుతం డిచ్పల్లిలోని సీఎంసీ మెడికల్ కాలేజీ వద్ద ఈవీఎంల బందోబస్తు డ్యూటీ వేసినట్లు తెలిసింది. -
ఆ గట్టూ నాదే..! ఈ గట్టూ నాదే..!!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బాల్కొండ, ఆర్మూర్లలో పరిస్థితి ఒకలా ఉండగా, జిల్లా కేంద్రాలైన నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి సెగ్మెంట్లలో షబ్బీర్ అలీ పెత్తనం పట్ల పలువురు మొదటి, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు గుస్సా అవుతున్నారు. షబ్బీర్ పేరు చెప్పుకుని కొందరు నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేశారు. దీంతో నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగిన షబ్బీర్ అలీ ఓటమి చెందారు. ఓడినవారే నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే షబ్బీర్ నిజామాబాద్ అర్బన్ ఇన్చార్జిగా ఉంటూనే తన సొంత నియోజకవర్గమైన కామారెడ్డిలోనూ పెత్తనం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో షబ్బీర్కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ ర్యాంకు పదవి వచ్చింది.నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి దక్కించుకోలేకపోయిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. మహేశ్ గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. మరోవైపు బీసీ కోటాలో కేబినెట్ రేసులోనూ ఉన్నారు. మహేశ్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గట్టి ప్రాబల్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో షబ్బీర్ కామారెడ్డిలో పెత్తనం చేస్తూనే నిజామాబాద్ అర్బన్లో హవా నడిపిస్తుండటం పట్ల ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్లో ఉండి పనిచేసిన పలువురు రౌడీషీటర్లను సైతం షబ్బీర్ కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారంటూ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కామారెడ్డిలోనూ పలువురు అవకాశవాదులను పార్టీలోకి చేర్చుకుని మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమకు అన్యాయం చేస్తున్నారని కార్యకర్తలు, నాయకులు వాపోతున్నారు. మరోవైపు షబ్బీర్ తమ్ముడు, మేనల్లుడు, ఇతర బంధువులు ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారంటూ పలువురు సీనియర్ కార్యకర్తలు పీసీసీ నాయకత్వానికి ఫిర్యాదులు చేయడం గమనార్హం. -
24లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి
కామారెడ్డి క్రైం: జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఈనెల 24వ తేదీలోగా పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి శరత్ సూచించారు. సోమవారం ఆయన హైదరాబాద్నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి శుక్రవారంలోగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో కొనుగోళ్లు పూర్తై మూసివేసిన 180 కేంద్రాల సిబ్బంది, హమాలీలు, తూకం యంత్రాలను వడ్లు ఎక్కువగా ఉన్న కేంద్రాలకు తరలించాలని సూచించారు. లారీలను సకాలంలో సమకూర్చేలా రవాణా కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. 2.64 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ.. జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 2.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. 97 శాతం ట్యాబ్ ఎంట్రీ పూర్తయ్యిందని, 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. శుక్రవారం నాటికి అన్ని కేంద్రాలలో కొనుగోళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అడ్లూర్, తలమడ్ల తదితర గ్రామాల్లో పంట కోతలు నడుస్తున్నాయన్నారు. కొనుగోలు కేంద్రాలకు మరో 760 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డీఎస్వో మల్లికార్జున్ బాబు, ఇన్చార్జి డీఎం నిత్యానందం, డీఏవో భాగ్యలక్ష్మి, సహకార శాఖ అధికారులు ప్రశాంత్రెడ్డి, భూమయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, ఆర్డీవోలు, తహసీల్దార్లు, వ్యవసాయ, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి శరత్ -
సరిపడా ఎరువులు ఉన్నాయి
మోపాల్: రాష్ట్రంలోని రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, జిల్లాలో 22వేల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉందని వివరించారు. సోమవారం మోపాల్ సొసైటీని ఆయన పరిశీలించారు. ఇఫ్కో జాతీయ డైరెక్టర్గా ఎన్నికైన గంగారెడ్డిని మోపాల్, బాడ్సి సొసైటీల చైర్మన్లు గ్యానాజి గంగారెడ్డి, నిమ్మల మోహన్రెడ్డి సన్మానించారు. మోపాల్ సొసైటీ చైర్మన్గా ఎన్నికై న గ్యానాజి గంగారెడ్డిని మార గంగారెడ్డి సత్కరించారు. అనంతరం మార గంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగలు, జొన్నలు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. పంటల ధరలు కనీస మద్దతు ధర కంటే దిగువన ఉంటే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారని తెలిపారు. అవసరానికి మించి ఎరువుల నిల్వలు ఉన్నాయన్నారు. సొసైటీ చైర్మన్లు కూడా వారికి సరిపోయే ఎరువులు తీసుకుని తమ గోదాముల్లో నిల్వ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఎల్లోల సాయిరెడ్డి, డైరెక్టర్లు రాజశేఖర్రెడ్డి, తిరుపతి, సీఈవో సాయిచంద్ పాల్గొన్నారు. మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి -
రైతు వేదికలపై చిన్నచూపు!
నిజాంసాగర్: రైతులంతా ఒకచోట చేరి వ్యవసాయం, సాగు చేసే పంటల గురించి చర్చించుకోవడం కోసం ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ను ఏర్పాటుచేసి, ఒక్కో క్లస్టర్కు ఒక రైతు వేదికను నిర్మించారు. జిల్లాలో 104 రైతు వేదికలున్నాయి. అయితే వీటిపై అధికారుల పర్యవేక్షణ లోపించింది. నిర్వహణను పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. ఏఈవోలు రైతు వేదికలకు చుట్టపు చూపుగా వచ్చివెళ్తున్నారన్న విమర్శలున్నాయి. అంతేకాకుండా ఈ నిర్మాణాలు గ్రామ శివారులో ఉండడంతో కొన్నిచోట్ల మందుబాబులకు అడ్డాగా మారాయన్న విమర్శలున్నాయి. నిధులు లేక.. జిల్లా వ్యాప్తంగా ఆయా క్లస్టర్లల్లో నిర్మించిన రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో వాటి నిర్వహణను వ్యవసాయశాఖ అధికారులు గాలికి వదిలేశారు. గత ప్రభుత్వం రైతు వేదికల నిర్వహణ కోసం నెలకు రూ. 9 వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. అప్పట్లో ఐదు నెలలకు సంబంధింన నిధులు మంజూరయ్యాయి. వచ్చిన నిధులతో రైతు వేదికల్లో పర్నిచర్ ఏర్పాటుతో పాటు కరెంట్ బిల్లులు చెల్లించారు. ఆ తర్వాత నిధులు మంజూరు కాకపోవడంతో రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. కొన్నిచోట్ల రైతు వేదికలను శుభ్రం చేసేందుకు పంచాయతీ కార్మికులు ముందుకు రావడం లేదు. దీంతో నిరుపయోగంగా మారాయి. సర్కారు నిధులు మంజూరు చేసి రైతు వేదికలను వినియోగంలోకి తేవాలని రైతులు కోరుతున్నారు. నిధులు రావడం లేదు క్లస్టర్ల వారీగా ఏఈవోలు రైతు వేదికల్లో రైతులకు అందుబాటులో ఉండాలి. పంటల సాగుకు సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వాలి. ఈ విషయాన్ని ఏఈవోలకు స్పష్టం చేశాం. రైతు వేదికలకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడం లేదు. దీంతో వేదికల నిర్వహణకు కాస్త ఇబ్బంది ఉంది. – భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నిర్వహణను పట్టించుకోని సర్కారు వినియోగంలోకి తేవాలంటున్న రైతులు -
ఖాళీ లారీల మళ్లింపు
భిక్కనూరు: కొనుగోలు కేంద్రాలనుంచి ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లారీల కొరత సమస్యను అధిగమించడం కోసం భిక్కనూరు తహసీల్దార్ శివప్రసాద్ రవాణా శాఖ అధికారులు, పోలీసుల సహకారంతో సోమవారం టోల్ ప్లాజా వద్ద వాహనాలను ఆపారు. జాతీయ రహదారి మీదుగా ఖాళీగా వెళ్తున్న లారీలు, వ్యాన్లను నిలిపివేసి ధాన్యం బస్తాలను తరలించేందుకు గ్రామాలకు పంపిస్తున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శివప్రసాద్ మాట్లాడుతూ లారీల కొరతతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం బస్తాలు పేరుకుపోతున్నాయన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాతీయ రహదారి మీదుగా ఖాళీగా వెళ్తున్న లారీలను మళ్లిస్తున్నామన్నారు. -
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి క్రైం: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. 24 నుంచి జూన్ 3 వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల అధికారులు వెంటనే ఆయా పరీక్ష కేంద్రాలను సందర్శించి ఫర్నిచర్, వి ద్యుత్, తాగునీరు, వెలుతురు లాంటి మౌలిక సదుపాయాలను పరిశీలించాలన్నారు. ఏవైనా లోటుపా ట్లు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించా రు. మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్లను అనుమతించవద్దన్నారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్క ని మిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రం లోనికి అనుమతించవద్దన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. సమావేశంలో ఇంటర్ బోర్డు నోడల్ అధి కారి షేక్ సలాం, పరీక్షల విభాగం అధికారులు శ్రీ నాథ్, నాగేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్లోడ్ చేసుకోవాలి
కామారెడ్డి క్రైం: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సూచించారు. రవాణా కాంట్రాక్టర్లు, రైస్ మిల్లు ల ప్రతినిధులు, సహకార, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులతో సోమవారం ఆయన తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్లుల యజమానులు ఎప్పటికప్పుడు అన్లోడ్ చే యించుకోవాలన్నారు. కేంద్రాల్లో ధాన్యం నిల్వ లు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఎస్వో మల్లికార్జున్ బాబు, ఇన్చార్జి డీఎం నిత్యానందం, ఇన్చార్జి డీటీవో శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో సందడి!
మంగళవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2024– 9లో uసాక్షి, కామారెడ్డి : జిల్లాలో 526 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ఈ ఏడాది జనవరి 31వ తేదీతో ముగిసింది. అయితే గడువులోగా ఎన్నికలను నిర్వహించకపోవడంతో పాలనను ప్రత్యేకాధికారులకు అప్పగించిన ప్రభుత్వం.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు ముగియడం, జూన్ 4న ఓట్ల లెక్క తేలనున్న నేపథ్యంలో అందరి దృష్టి పంచాయతీ ఎన్నికలపై పడింది. విందులతో మచ్చిక చేసుకునే ప్రయత్నం... అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ కోసం పనిచేసిన గ్రామ స్థాయి నేతలు చాలామంది ఈసారి సర్పంచ్గానో, ఎంపీటీసీగానో పోటీ చేయాలన్న ఉత్సాహంతో ఉన్నారు. ఆశావహులు ఊళ్లలో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారం పది రోజులుగా గ్రామాల్లో పలుకుబడి ఉన్నవారికి దావత్లు ఇస్తున్నారు. కుల సంఘాల సమావేశాలకు వెళ్లి మద్దతు కోరుతున్నారు. కొందరు తమ దేవుళ్ల పండుగల పేరుతో ఊళ్లో అందరినీ పిలిచి దావత్లు ఇస్తున్నారు. ఎన్నికలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ ఆశావహులు మాత్రం ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రామాల్లో యువతను తమకు అనుకూలంగా మలచుకునేందుకు విందులు ఇస్తున్నారు. విదేశాల నుంచి వచ్చేందుకు సిద్ధం... బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన వారిలో కొందరు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సర్పంచ్ పదవి ద్వారా తమ పలుకుబడి పెరుగుతుందని కొందరు గల్ఫ్ నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన వేలాది మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. సొంతూరుకు వెళ్లి సర్పంచ్గా ఎన్నికల బరిలో దిగాలని ఆరాటంతో ఉన్న వారు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక గ్రామ రాజకీయాలు మరింత రంజుగా మారనున్నాయి.న్యూస్రీల్ఆశల పల్లకీలో.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆరాటం చాలా మందిలో కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బులు సంపాదించిన వారైతే ఎలాగైనా సరే సర్పంచ్గా గెలిచితీరాలన్న పట్టుదలతో ఎంతైనా ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజా మాజీ సర్పంచ్లు బిల్లులు రాక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ పంచాయతీల ద్వారానే చేపట్టే విధంగా కార్యక్రమాలు చేస్తుండడంతో సర్పంచ్ల ప్రాధాన్యత పెరుగుందని భావిస్తున్నారు. అందుకే చాలామంది పోటీకి రెడీ అవుతున్నారు. వివిధ పార్టీల్లో క్రియాశీలకంగాా తిరుగుతున్న వారితో పాటు, కొత్త వారు సైతం పోటీకి ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో తీవ్ర పోటీ ఉండవచ్చని భావిస్తున్నారు. ఒక్కో పంచాయతీలో పది నుంచి ఇరవై మంది దాకా పోటీ పడే అవకాశాలున్నాయి. రిజర్వేషన్లపై అయోమయం..గత ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్ చట్టం తీసుకువచ్చి స్థానిక సంస్థల రిజర్వేషన్ల గడువును పదేళ్లకు పొడిగించిన విషయం తెలిసిందే. ఆ చట్టం ప్రకారం ఈసారి కూడా పాత రిజర్వేషన్లే కొనసాగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మారిన నేపథ్యంలో పాత రిజర్వేషన్లపై అయోమయం నెలకొంది. కొత్త ప్రభుత్వం పాత రిజర్వేషన్లను కొనసాగిస్తుందా లేక మారుస్తుందా అన్న విషయం తేలాల్సి ఉంది.పల్లెల్లో మళ్లీ రాజకీయ సందడి మొదలయ్యింది. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఎన్నికలలో సత్తా చాటాలన్న ఉత్సాహంతో ఉన్నవారు.. ఊళ్లో తమ బలాన్ని పెంచుకునేందుకు అప్పుడే దావత్లూ షురూ చేశారు. పంచాయతీ ఎన్నికలపై ప్రారంభమైన చర్చ పోటీకి సై అంటున్న నాయకులు అప్పుడే మొదలైన దావత్ల పర్వం -
‘బెస్ట్ అవైలబుల్’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంలో ప్రవేశాలకోసం గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన అభివృద్ధి జిల్లా అధికారి అంబాజీ సూచించారు. జిల్లాలో మూడో తరగతిలో 7 సీట్లు, 4, 5 తరగతులలో 6 సీట్లు, ఎనిమిదో తరగతిలో 5 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వచ్చేనెల ఆరో తేదీ వరకు కలెక్టరేట్లోని 208 వ నంబర్ గదిలో సంప్రదించాలని సూచించారు. 12వ తేదీన సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.‘రైళ్లలో జనరల్ బోగీలు పెంచాలి’ కామారెడ్డి అర్బన్: ప్రతి ఎక్స్ప్రెస్ రైలులో ఐదు సాధారణ బోగీలను అందుబాటులో ఉంచాలని సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ పరికిపండ్ల అశోక్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి కోటి ఉత్తరాల ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని రాశివనం వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రధాన మంత్రికి ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతు ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా ‘ది ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, 152 సౌత్బ్లాక్, న్యూఢిల్లీ, 110011 చిరునామాకు వంద ఉత్తరాలు రాయించాలని కోరారు. కార్యక్రమంలో రాశివనం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మ్యాడం లింగం, కన్వీనర్ శంకర్, ప్రతినిధులు ఆంజనేయులు, బాలయ్య, రవీందర్, నర్సింలు, హన్మాండ్లు, వెంకట్రెడ్డి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా కొనసాగుతా ఎల్లారెడ్డి: మున్సిపల్ చైర్మన్గా తాను య థావిధిగా కొనసాగు తానని కుడుముల సత్యనారాయణ పే ర్కొన్నారు. సోమవా రం ఆయన మున్సిపల్ కార్యాలయంలో వి లేకరులతో మాట్లాడారు. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టారని, ఫలితాన్ని అధికారులు వెల్లడించలేదని పేర్కొన్నారు. కోర్టు స్టే అమలులో ఉండడంతో అధికారులు తన పదవికి సంబంధించి గాని, అధికారాల గురించి గా నీ అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదన్నారు. త నను ఎవరు పదవి నుంచి దింపలేదని, చాంబర్కు తాళం వేయలేదని పేర్కొన్నారు. కో ర్టు ఆదేశాలు వచ్చేంత వరకు తాను చైర్మన్ గా అన్ని బాధ్యతలను నిర్వహిస్తానన్నారు. రేపు పాలిటెక్నిక్ మాక్ టెస్ట్ కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్లో బుధవారం పాలిటెక్నిక్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ చరణ్ తెలిపారు. సోమవారం పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బుధవారం ఉదయం 10 గంటలకు మాక్ టెస్ట్ ఉంటుందన్నారు. పాలిసెట్కు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా హాస్టల్స్ కన్వీనర్ ఖలీల్, నాయకులు వెంకటేష్, రాజు, నవీన్, బలరాం తదితరులు పాల్గొన్నారు. ‘మిషన్ భగీరథ నీటిని తాగాలి’ నిజాంసాగర్: సింగూరు జలాశయం నుంచి సరఫరా అవుతున్న ప్యూరిఫైడ్ మిషన్ భగీర థ నీటిని తాగాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి సూచించారు. సోమవారం ఆయన అ చ్చంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని లింగంపల్లి గ్రామాన్ని సందర్శించారు. ప్రజలు మిషన్ భగీరథ నీటిని తాగడం లేదని తెలుసుకుని వారితో మాట్లాడారు. ఇంటింటికి శు ద్ధ జలాలను సరఫరా చేస్తున్నామని, ఆ నీటి నే తాగాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో గంగాధర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సుమలత తదితరులు ఉన్నారు. -
కొనసాగుతున్న వాలీబాల్ సమ్మర్క్యాంపు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం వాలీబాల్ సమ్మర్ క్యాంపు కొనసాగింది. విద్యార్థులు, యువకులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళలలో మైదానంలోకి వచ్చి వాలీబాల్ ఆడుతున్నారు. ఈసందర్భంగా పీఈటీ బాలు మాట్లాడుతూ.. యువకులు సెల్ఫోన్లో గేమ్స్ ఆడడం వల్ల మానసిక వ్యాధుల బారిన పడుతున్నారని, శారీరక శ్రమతో కూడిన ఆటలు ఆడినట్లయితే ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. క్యాంపు ఈనెల 31 వరకు కొన సాగుతుందన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోండి ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): దోమల నివారణకు తగిన చర్యలను తీసుకోవాలని పలువురు మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణకు సోమవారం వినతిపత్రం అందించారు. పట్టణంలోని పలు కాలనీలలో దోమల బెడద తీవ్రంగా ఉందని, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని వారు విన్నవించారు. దోమల నివారణకు తక్షణం చర్యలు తీసుకుంటానని చైర్మన్ కాలనీవాసులకు సూచించారు. సీపీ కార్యాలయానికి ఎస్సై అటాచ్!నిజామాబాద్ క్రైం: ఓ మహిళ ఫిర్యాదు మేరకు నగరంలోని నాల్గోటౌన్ ఎస్హెచ్వో సంజీవ్ను సీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం. గతంలో సదరు మహిళ సీపీ కార్యాలయం వద్ద హంగామా చేయగా.. కేసు నమోదైంది. మహిళకు సంబంధించిన కేసు విషయంలో అటాచ్ ప్రతిపాదన ఉన్నతాధికారుల చెంతకు వెళ్లినట్లు సమాచా రం. అయితే, ఎస్సైని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు అందలేదని డిపార్ట్మెంట్ వర్గాల ద్వారా తెలిసింది. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఖలీల్వాడి: నగరంలోని ఆరోటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని షాద్నగర్ కాలనీ(సారంగాపూర్)కి చెందిన మహ్మద్ అబ్దుల్ సలాం ఆదివారం చోరీ జరిగింది. సలాం ఇంటికి తాళం వేసి తన కుటుంబ సభ్యులతో కలిసి బయటకి వెళ్లి రాత్రి సమయంలో తిరిగి రాగా, దుండగులు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని 20తులాల బంగారు నగలు, రూ.30వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. సీసీ ఫుటేజీ పోలీసులు పరిశీలిస్తున్నారు. బాన్సువాడలో ఆటో..బాన్సువాడ : ఇంటి ముందు నిలిపి ఉంచిన ఆటోను దుండగులు ఎత్తుకెళ్లినట్లు సీఐ కృష్ణ తెలిపారు. పట్టణంలోని పాత బాన్సువాడకు చెందిన నక్క రవి ఈ నెల 19న తన తమ్ముడైన నల్ల రాజశేఖర్ ఇంట్లో జరిగిన పంక్షన్కు వెళ్లాడు. రాత్రి అక్కడే ఆటోను పార్క్ చేసి తన ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం వచ్చి చూసే సరికి ఆటో కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
వివాహిత అదృశ్యం
కామారెడ్డి క్రైం: దోమకొండ మండలం అంబారీపేట గ్రామానికి చెందిన సింగం రేణుక అదృశ్యమైనట్లు పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి సోమవారం తెలిపారు. ఆమె భర్త పరశురాములుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం రాత్రి 8 గంటలకు అడ్మిట్ చేశారు. ఆయన చికిత్స జరుగుతుండగానే 11 గంటల సమయంలో రేణుక ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. రేణుక ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. మందర్నకు చెందిన వ్యక్తి.. బోధన్రూరల్: సాలూర మండలంలోని మందర్న గ్రామానికి చెందిన పీరాజీ (40) అదృశ్యమైనట్లు బోధన్ రూరల్ ఎస్సై నాగనాథ్ తెలిపారు. పీరాజీకి కొంతకాలంగా మతిస్థిమితం లేదని, ఈ ఏడాది జనవరి 19న ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆయన తిరిగిరాలేదన్నారు. కుటుంబ సభ్యులు అప్పటి నుంచి పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పరిహారం అందించాలని వినతి
రెంజల్(బోధన్): రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన తమకు పరిహారం వెంటనే అందించే ఏర్పాట్లు చేయాలని మండలంలోని బోర్గాం గ్రామస్తులు ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్తో మొరపెట్టుకున్నారు. సోమవారం బాధిత రైతులతో ఆర్డీవో సమావేశమైన ఆయన ప్రభుత్వం పరిహారం మంజూరు చేసిందని తెలిపారు. భూముల సర్వే నంబర్లతోపాటు పట్టా ఒకరి పేరున ఉండగా మరొకరు కబ్జాలో ఉన్నారని వాటిని సవరించిన తర్వాత అందిస్తామని ఆర్డీవో సూచించారు. భూములు నష్టపోయిన రైతులకు మంజూరైన పరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. బోధన్ నుంచి భైంసా వరకు నేషనల్ హైవే పనులు కొనసాగుతుండగా, కొందరు రైతులకు పరిహారం అందించగా మరి కొందరు రైతులకు అందాల్సిన సొమ్మును తప్పొప్పుల కారణంగా నిలిపివేశారు. దీంతో రైతులు అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. ఆర్డీవో వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్చార్జి తహసీల్దార్ శ్రావణ్కుమార్ ఉన్నారు. -
తిమ్మాపూర్లో చైన్ స్నాచింగ్
మోర్తాడ్(బాల్కొండ): మందుల కోసం మెడికల్కు వెళ్తున్న మహిళ మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. మండలంలోని తిమ్మాపూర్లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పల్లెపు గంగు అనే మహిళ తిమ్మాపూర్ బైపాస్ రోడ్డు మీదుగా ఇంటివైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. స్కూటీపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను మాటల్లో దింపి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధిత మహిళ ఇంటికి వెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దుండగుల కోసం ఎంత గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమ్గల్ సీఐ శ్రీనివాస్, ఏర్గట్ల ఎస్సై మచ్ఛేందర్రెడ్డి, మోర్తాడ్ ఏఎస్సై గోపాల్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గ్రామంలోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నలుగురికి జైలు
● ఒకరికి 15 రోజులు.. మరొకరికి 20 రోజులు ఖలీల్వాడి/డిచ్పల్లి: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన పలువురికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 31 మందికి జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం సోమవారం కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ నారాయణ తెలిపారు. 29 మందికి రూ.40,500 జరిమానా విధించిన న్యాయమూర్తి, ఒకరికి 20 రోజులు, మరొకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారని వివరించారు. డిచ్పల్లి పీఎస్ పరిధిలో.. డిచ్పల్లి: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఒకరికి న్యాయమూర్తి 15రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై యూ.మహేశ్ తెలిపారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తిని సోమవారం నిజామాబాద్ జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎంఎం అలీ సిరాజ్ ఎదుట హాజరుపర్చగా జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. కామారెడ్డి పీఎస్ పరిధిలో.. కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి న్యాయమూర్తి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితం పట్టణ పోలీసులు వాహనాలు తనిఖీ చేయగా, ఓ వ్యక్తి మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడ్డాడని, అతడిని సోమవారం కోర్టులో హాజరుపర్చామన్నారు. ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ప్రతాప్ సదరు వ్యక్తి రెండు రోజుల జైలు శిక్ష విధించారని ఎస్హెచ్వో తెలిపారు. -
కేవీఆర్కు పెరిగిన క్రేజ్
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఐదారేళ్లుగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. మహిళా సంఘాలకు రావాల్సిన వడ్డీ రాయితీ కోసం కొట్లాడారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల్లోని డొల్లతనాన్ని వెలికితీశారు. రైతు సమస్యలపై గళమెత్తారు. ఇలా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరు చేసి నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగారు. బీజేపీ అంటే గిట్టని వారు సైతం వెంకటరమణారెడ్డి వివిధ సమస్యలపై చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సపోర్ట్ చేయడం గమనార్హం.కేసీఆర్, రేవంత్రెడ్డిలను ఓడించి..అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి కామారెడ్డి నుంచి బరిలో దిగినా వెంకటరమణారెడ్డి ఎక్కడా తగ్గలేదు. ఇద్దరినీ ఓడిస్తానని శపథం చేశారు. ఇద్దరు ఉద్ధండులతో జరిగిన పోరులో వెంకటరమణారెడ్డి మూడో స్థానానికి వెళ్లడం ఖాయ మని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వెంకటరమణారెడ్డి జెయింట్ కిల్లర్గా అవతరించారు. ఈ విజయంతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వెంకటరమణారెడ్డి వాక్ చాతుర్యం, పోరాట పటిమే ఆయనను గెలిపించాయని బీజేపీ నాయకత్వం గుర్తించింది. దీంతో పార్టీ ఆయనకు క్రియాశీలక బాధ్యతలు అప్పగించింది. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్కు రాష్ట్ర కన్వీనర్గా కేవీఆర్ను నియమించారు. దానికోసం రాష్ట్ర రాజధానితో పాటు వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆ కార్యక్రమం ముగియగానే లోక్సభ ఎన్నికలు రావడంతో జహీరాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జీగా బీజేపీ ఆయనకు బాధ్యతలు అప్పగించింది. దాదాపు మూడు నెలలపాటు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పర్యటించి, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికలకు సన్నద్ధం చేశారు. నేతల మధ్య సమన్వయం కుది ర్చారు. ఎన్నికల సభలు, ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని శ్రేణుల్లో హుషారు పెంచారు. చేవెళ్ల, మహబూబ్నగర్, ఖమ్మం, భువనగిరి తదితర పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన పలు సభల్లో ప్రసంగించారు. ప్రస్తుతం నల్గొండ–వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ఆయనకు ఉమ్మడి వరంగల్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంకు లేదు. కొన్ని ప్రాంతాల్లో నాయకత్వ సమస్య వేధిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల ఇన్చార్జీగా నియమితులైన వెంకటరమణారెడ్డి.. దాదాపు మూడు నెలల పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పలు సమావేశాలు నిర్వహించారు. జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో క్యాడర్తో జరిగిన సమావేశాల్లో పాల్గొని ఎన్నికల్లో గెలవడం కోసం వ్యవహరించాల్సిన వ్యూహాల గురించి వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 1,72,766 ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్లమెంట్ స్థానంలో పార్టీ గెలవాలంటే మరో నాలుగు లక్షల ఓట్లు సంపాదించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇన్చార్జి బాధ్యతలు మోసిన వెంటరమణారెడ్డి పార్టీ అభ్యర్థి తరఫున పార్లమెంటు నియోజక వర్గం అంతటా కలియతిరిగారు. ఈ ఎన్నికలలో బీబీ పాటిల్ గెలిస్తే బీజేపీలో వెంకటరమణారెడ్డి ప్రాధాన్యత మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.పాటిల్ గెలిస్తే మరింత ప్రాధాన్యత కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో ఇద్దరు ఉద్ధండులను ఓడించి జెయింట్ కిల్లర్గా మారిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి బీజేపీలో మంచి ప్రాధాన్యత లభిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లలోనే అయోధ్య రామాలయ ప్రారంభ వేడుకల కోసం ఏర్పాటు చేసి అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్గా నియమించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జీగా వ్యవహరించారు. ఆయన సమర్థతను గుర్తించిన బీజేపీ.. ప్రస్తుతం జరుగుతున్న నల్గొండ–వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్కే రక్షణ లేదు..
- Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- ‘ఈజీ’ ఐపాస్.. టీజీ ఐపాస్కు భారీగా మార్పులు!
- తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement