-
వివాహిత ఆత్మహత్య కేసులో భర్త అరెస్టు
జయపురం: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటనలో భర్తను జయపురం సదర్ పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఈశ్వర తండి బుధవారం తెలిపారు. బమొణిగాం సమీపంలోని సిరిగుడ గ్రామానికి చెందిన తులసికి బుదురాం అనే వ్యక్తితో గత ఏడాది వివాహం జరిగింది. బరిణిపుట్లో నివాసముంటున్న వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో గత 15న తులసి తన కన్నవారింటికి వచ్చేసింది. ఆ మరునాడు బుదురాం అత్తవారింటికి వెళ్లి భార్యను బుజ్జగించి తన ఇంటికి తీసువెళ్లాడు. ఈ నెల 17న తులసికి కడుపు నొప్పి వచ్చిందంటూ జయపురం జిల్లా కేంద్రాస్పత్రిలో చేర్చారు. తర్వాత ఇంటికి వచ్చి క్రిమి సంహారక మందు తాగేసింది. వెంటనే కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల మెడికల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. భర్త, అత్తమామలు వరకట్నం కోసం వేధించడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోస్కోతో పాటు వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ‘నేను మావోయిస్టును కాను’ రాయగడ: ‘నేను మావొయిస్టును కాను. సాధారణ మనిషిని. తల్లిదండ్రులు, అక్కాచెల్లెలు ,అన్నదమ్ములతో కలిసి కొండపై వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాను. మావోయిస్టులు ఎలా ఉంటారొ కూడా తెలియదు. వారు ఎటువంటి దుస్తులు వేసుకుంటారో కూడా తెలియదు. అటువంటి నాపై మావోయిస్టుగా పొలీసులు ముద్రవేయడం చాలా బాధాకరం’ అంటూ నియమగిరి పర్వత ప్రాంతంలో నివిసిస్తున్న డొంగిరియా తెగకు చెందిన మింజిలి శికక ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తాను మావొయిస్టు కాదంటే పోలీసులు లొంగిపోవాలని బెదిరించడం తగదని వాపోయారు. ఈ మేరకు ఓ ఒడియా న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తనను పట్టుకున్నవారికి రెండు లక్షల రుపాయల పారితోషికం ఇస్తామని పోలీసులు ప్రకటించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తన స్వగ్రామంలో సాధారణ జీవితం గడుపుతున్నానని, ఎటువంటి అసాంఘిక శక్తులతో కలిసి పనిచేయడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికై నా పొలీసులు స్పందించి తనపై మావోయిస్టు ముద్రను తొలగించాలని కోరారు. -
భద్రత కట్టుదిట్టం
భువనేశ్వర్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 25న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్థానిక కమిషనరేట్ పోలీసులు రాజధానిలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. పోలింగ్ సమయంలో హింసను నివారించడంలో భాగంగా పలు చర్యలు చేపడుతున్నట్లు పోలీసు కమిషనర్ సంజీవ్ పండా విలేకరులకు బుధవారం తెలిపారు. భువనేశ్వర్ కమిషనరేట్ పోలీస్ పరిధిలోని 1,132 పోలింగ్ కేంద్రాల్లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు పోలీసులు భద్రతా చర్యలను పెంపొందించారు. వీటిలో 145 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 421 సఖి పోలింగ్ కేంద్రాల్లో సురక్షిత ఎన్నికల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. 525 పోలింగ్ బూత్లలో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఘర్షణలు నివారించడానికి 15 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 15 వ్యూహాత్మక నిఘా బృందాల్ని రంగంలోకి దింపారు. అంతేకాకుండా, సమస్యాత్మక పోలింగు కేంద్రాల వద్ద కేంద్ర రిజర్వు పోలీసు దళం సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరిస్తారు. నేటితో ప్రచారానికి తెర రాష్ట్రంలో మూడో దశ పోలింగ్ పురస్కరించుకుని రాజకీయ పక్షాల ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగుస్తుంది. ఎన్నికల ప్రచారం ముగియడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు పోలీసు కమిషనరు తెలిపారు. శాంతి, భద్రతల పరిరక్షణలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
కొంటామల్లో రీపోలింగ్
భువనేశ్వర్: కంధమల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కొంటామల్ ప్రాంతంలో రీపోలింగ్ నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించింది. ఈ నెల 23న కొంటామల్ బూత్ నంబర్ 26, 28లో రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని ప్రధాన ఎన్నికల అధికారి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఓటర్లు, అభ్యర్థులకు దీనిపై అవగాహన కల్పించాలని బౌధ్, కంధమల్ జిల్లాల కలెక్టర్లను భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. దిలీప్కుమార్ మహపాత్రోను బౌధ్ అదనపు కలెక్టర్గా, కొంటామల్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా కమిషన్ నియమించింది. కొంటామల్ నియోజకవర్గంలో బూత్ రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో భారత ఎన్నికల సంఘం అనుమతితో బౌద్ జిల్లాలోని కొంటామల్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని రెండు పోలింగ్ బూత్లు 26 – కిరాసిరా, 28 – మహేశ్వరపిండ్లలో ఈ నెల 23న రీ–పోలింగ్ షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ విషయమై రాజకీయ అభ్యర్థులు, ఏజెంట్లందరికీ లిఖితపూర్వకంగా తెలియజేయాలని, ఓటర్లకు అవగాహన కల్పించేందుకు తగిన ప్రచారం చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి జిల్లా ఎన్నికల అధికారికి సూచించారు. -
శ్రామిక్ కాంగ్రెస్లో పలువురి చేరిక
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ యూనియ న్ నుంచి పలువురు కార్యకర్తలు శ్రామిక్ కాంగ్రెస్లో చేరారు. ఖుర్దారోడ్ రైల్వే మండలం తాల్చేరు శాఖ ముందంజ కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యూనియన్ కార్యకర్తలు తూర్పు కోస్తా రైల్వే శ్రామి క్ కాంగ్రెస్లో చేరడంపై ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర సాహు అభినందించారు. వీరందరికీ శ్రామిక్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కొత్తగా శ్రామిక్ కాంగ్రెస్లో చేరిన వారిలో శ్రామిక్ యూనియన్ తాల్చేరు శాఖ మాజీ కార్యదర్శి అమరనాథ్ ప్రసాద్, యువజన శాఖ మాజీ సహ సమన్వయకర్త విపిన్ మిశ్రా ప్రముఖులుగా పేర్కొన్నారు. వీరి నేతృత్వంలో పలువురు కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఖుర్దారోడ్ మండలం ఓపెన్ లైన్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రామిక్ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర సాహు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. -
సైకిల్ దొంగ అరెస్టు
జయపురం: సైకిళ్లను దొంగిలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు పట్టణ పోలీసులు మంగళవా రం తెలిపారు. అతని నుంచి స్థానిక సునారీ వీధి బక్షి అపార్ట్మెంట్లో దొంగిలించిన సైకిల్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 18వ తేదీన స్థానిక సునారివీధి బక్షి అపార్ట్మెంట్లో ఉంటున్న కె.ఎం.అనిష్ కుమారుడు తన సైకిల్ ను ఇంటి ముందు పార్క్ చేసి లోనికి వెళ్లాడు. కొంచెం సమయం తరువాత ఇంటిలో నుంచి బయటకు వచ్చి చూడగా సైకిల్ కనిపించలేదు. దీంతో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఏఎస్సై విష్ణు మడకామి.. చోరీకి పాల్పడిన ఎస్.ఆనంద (అలియాస్ ఉరఫ్ పటలా కిశోర్కుమార్)ను అరెస్టు చేయడంతో పాటు దొంగిలించిన సైకిల్ ను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. పదిరోజుల క్రితం ఆనంద ఒక సైకిల్ను దొంగిలించి పట్టుబడి జామీనుపై బయటకు వచ్చినట్టు వివరించారు. స్థానిక నొడియబెడ సాహిలో ఉంటున్న ఆనంద.. పట్టణంలో సైకిళ్లను దొంగి లి విక్రయించగా వచ్చే డబ్బులతో జల్సా చేస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. -
పకడ్బందీగా రథయాత్ర నిర్వహణ
పర్లాకిమిడి: జూలై 7న జగన్నాథ గుండిచా రథయాత్ర అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహిద్దామని కలెక్టర్ స్మృతిరంజన్ ప్రధాన్ అన్నారు. రథయాత్ర నిర్వహణపై కలెక్టరేట్ వద్ద గ్రామీణ స్వయం ఉపాధి కాన్ఫరెన్సు హాలులో బుధవారం కమిటీ చైర్మన్ సబ్ కలెక్టర్ అలోక్ పండా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు పూర్ణచంద్ర మహాపాత్రో, డీఎస్పీ చంద్రశేఖర్ హోత్తా, డి.ఆర్.డి.ఎ. కార్యనిర్వహణాధికారి గుణనిధినాయక్, తహశీల్దారు నారాయణ బెహరా తదితరులు హాజరయ్యారు. పారిశుద్ధ్యం, తాగునీరు, అంబులెన్సు, రోడ్డు మరమ్మతులు, మీనాబజార్కు వేలంపాట, రథ నిర్మాణానికి కొత్త కలప తదితర అంశాలపై చర్చించారు. గత ఏడాది జరిగిన రథయాత్ర జమాఖర్చులను సబ్ కలెక్టర్ అలోక్ పండా వివరించారు. -
● ముగ్గురు అరెస్టు
జయపురం: మల్కన్గిరి నుంచి వ్యాన్లో జయపురం వస్తున్న బట్టల వ్యాపారిని అడ్డగించి అతని నుంచి రూ.1.80 లక్షలు దోచుకు పోయిన ముగ్గురు దుండగులను అరెస్టు చేశామని బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళి ప్రధాన్ బుధవారం తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.22,800 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక బైక్, మాస్క్లు, టీచొక్కాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన జయపురం పట్టణానికి చెందిన బట్టల వ్యాపారి ఎ.సత్యనారాయణ గుప్త సంతలకు వెళ్లి వ్యాన్లో విజయవాడ– రాంచీ జాతీయ కారిడార్లో మల్కనగిరి నుంచి బొయిపరిగుడ మీదుగా జయపురం వస్తున్నారు. బొయిపరిగుడ–జయపురం మధ్య మహులి ఘాట్ రోడ్డులో మోటారుబైక్లపై ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చి వ్యాన్ను అడ్డుకున్నారు. తాము ఫైనాన్స్ కంపెనీ నుంచి వచ్చామని చెప్పి వ్యాన్ తాళాలు తీసుకున్నారని పోలీసు అధికారి దీపాంజళీ ప్రధాన్ వివరించారు. కొంత సమయం తరువాత మరో ముగ్గురు ముఖానికి మాస్క్లు వేసుకొని వ్యాన్ వద్దకు వచ్చి మారణాయుధాలను బట్టల వ్యాపారి సత్యనారాయణగుప్తకు చూపించి డబ్బు ఇమ్మని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే చంపుతామని హెచ్చరించారు. వ్యాపారి నిరాకరించటంతో అతడిని దుండగులు కొట్టి బయటకు నెట్టి వ్యాన్లో ఉన్న డబ్బుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను తీసుకొని దుండగులు పరారయ్యారు. దీంతో బాధిత వ్యాపారి బొయిపరిగుడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దుండగులు జయపురం వాసులని వెల్లడైందని పోలీసు అధికారి పేర్కొన్నారు. జయనగర్ బబులా బాగ్ హరిజన్, సురేష్ హరిజన్, అలోక్ కుమార్ పంగిలను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి చెప్పారు. పట్టుబడిన దొంగలను గతంలో వివిధ కేసుల్లో జయపురం, నందపూర్ పోలీసులు అరెస్టు చేసి ఉన్నారన్నారు. ఈ కేసులో మిగతా వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు. -
భూమి కాదు.. బంగారు ఇటుక!
సారవకోట: మండలంలోని ధర్మలక్ష్మిపురం గ్రామ సమీపంలో ఈ నెల 18న పోలీసులమని చెప్పి దోచుకెళ్లిన దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నౌతళ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్, ఫోన్ నంబర్లు ఆధారంగా పది మంది నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర, అంతర్రాష్ట్ర ముఠాలకు ఈ ఘటనలో ప్రమేయమున్నట్లు తెలుస్తోంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో ధర్మలక్ష్మిపురం, బొంతు గ్రామాలలో భూములు కొనుగోలు కోసం తెచ్చిన డబ్బును పోలీసులమని చెప్పి తీసుకెళ్లినట్లు పెర్కొన్నారు. వాస్తవానికి, నిందితులను విచారించిన తరువాత 5 కేజీల బంగారం ఇటుకను ఒడిశాకు చెందిన వ్యక్తి అమ్ముతామని చెప్పగా అనకాపల్లి జిల్లా మామిడిపల్లి గ్రామానికి చెందిన డి.మణికంఠ రూ.10 లక్షలతో ధర్మలక్ష్మిపురం గ్రామానికి చేరుకున్నాడు. ముఠా సభ్యులు పక్కా స్కెచ్తో రెండు కార్లలో ధర్మలక్ష్మిపురం గ్రామానికి చేరుకుని బంగారం ఇటుకను ఇచ్చి డబ్బులు తీసుకుంటున్న సమయంలో నౌతళ వైపు నుంచి వాహనంలో ముగ్గురు వ్యక్తులు పోలీసు దుస్తులు ధరించి వచ్చి ఎన్నికల సమయంలో నగదు తరలించరాదని, ఈ నగదును డీఎస్పీ కార్యాలయంలో అప్పగిస్తామని చెప్పి వెళ్లిపోయారు. బాధితులు మోసాన్ని గుర్తించి తెరుకునే లోపు ముఠా సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లో కేసు నమోదు కాగా ఎస్ఐ అప్పారావు దీనిని సవాల్గా తీసుకుని నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు, మన రాష్ట్రంలోని విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన పలువురికి ఈ ముఠాతో సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు 10 మందిని విచారిస్తుండగా మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. -
కూర్మనాథుని సన్నిధిలో పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్
గార: విష్ణుక్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని విజయవాడ పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ వి.రాముడు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు చేయించుకుని లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించారు. ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు క్షేత్ర మహాత్యాన్ని వివరించగా, ఈవో జి.గురునాధం స్వామి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. సారా స్థావరాలపై దాడులు మెళియాపుట్టి: మండలంలోని సీడిపాలెంలో డీటీఎఫ్, ఎస్ఈబీ, ఇంటెలిజెన్స్ బృందాలు బుధవారం సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. 1200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. 45 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. దాడుల అనంతరం ఆయా గ్రామాల ప్రజలకు నాటుసారా తయా రీ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించా రు. ఈ దాడుల్లో పలాస డీటీఎఫ్ సీఐ రామచంద్రకుమార్, టెక్కలి ఎస్ఈబీ సీఐ రాజశేఖర్నాయుడు, ఎస్ఈబీ ఎస్సై గణేష్ పాల్గొన్నారు. నేటితో ముగియనున్న ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలో నాలుగు ఆన్లైన్ పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్టెస్ట్– 2024 (ఏపీ ఈఏపీ సెట్) పరీక్షలు గురువారంతో ముగియనున్నాయి. ఈ నెల 16 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 16, 17 తేదీల్లో బైపీసీ స్ట్రీం, 18 నుంచి ఎంపీసీ స్ట్రీం పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 12286 మందికి గాను 11654 మంది హాజరయ్యారు. 702 మంది గైర్హాజరయ్యారు. నాలుగు కేంద్రాల్లో బుధవారం 2070 మందికి 1954 మంది హాజరయ్యారు. బుధవారం నరసన్నపేట కోర్ టెక్నాలజీస్ సెంటర్లో మొదటి షిఫ్టులో 327 మందికి 310 మంది, రెండో షిఫ్టులో 328 మందికి 307 మంది, ఐతం టెక్కలిలో మొదటి షిఫ్టులో 300 మందికి 283 మంది, రెండో షిఫ్టులో 300 మందికి 285 మంది, చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కాలేజ్లో మొదటి షిఫ్టులో 229 మందికి 216 మంది, రెండో షిఫ్టులో 228 మందికి 213 మంది, ఎచ్చెర్లలోని శ్రీవెంకటేశ్వరా ఇంజినీరింగ్ కాలేజ్లో మొదటి షిఫ్టులో 179 మందికి 171 మంది, రెండో షిఫ్టులో 179 మందికి 169 మంది హాజరయ్యారు. సెట్ అబ్జర్వర్లు పర్యవేక్షిస్తున్నారు. ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ ●● ఒకరి మృతి..మరొకరికి గాయాలు టెక్కలి రూరల్: స్థానిక ఆదిఆంధ్ర వీధి సమీప జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస నుంచి శ్రీకాకుళం వైపు గ్రానైట్ లోడ్ లారీతో వస్తున్న ఎం.నాగరాజు, ఎల్.లకిత్కుమార్లు టెక్కలి ఆదిఆంధ్ర వీధి సమీపంలోకి వచ్చే సరికి రోడ్డు పక్కన ఆపి లారీ పైభాగంలో పడుకున్నారు. అదే సమయంలో పలాస నుంచి ఇనుప రాడ్ల లోడుతో విశాఖ వైపు వెళ్తున్న మరో లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీపై ఉన్న ఇద్దరు యువకులు కిందకు తుళ్లిపడ్డారు. వీరిని ఢీకొట్టిన లారీ డ్రైవర్ సుకంత తలై(34) క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది, టెక్కలి సీఐ పైడయ్య, సిబ్బంది ఘటనా స్థలనికి చేరుకుని సుమారు 2 గంటలు శ్రమించి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుకంత మృతిచెందాడు. మరో లారీలో ఉన్న నాగరాజుకు చెయ్యి విరిగింది. వివరాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మృతుడు ఒడిశా రాష్ట్రం కుర్దాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. -
శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ..
● బస్సు కింద పడి మహిళ మృతి ● ఆందోళనకు దిగిన గిరిజనులు పాతపట్నం: మండలంలోని ద్వారకాపురం సమీ పంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి మండలం తూముకొండ రామచంద్రపురం గ్రామానికి చెందిన కోట హేమలత(45) తన కన్నవారి గ్రామమైన పాతపట్నం మండలం శిష్టుజగన్నాధపురంలో బారశాల శుభకార్యానికి కొడుకు మనోజ్తో కలిసి బుధవారం ఉదయం బయలుదేరింది. తిరుగు ప్రయాణంలో బస్సు కోసం తెంబూరు రోడ్డుకు శిష్టుజగన్నాధపురం గ్రామానికి చెందిన గుజ్జివాడ గురుమూర్తి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. తెంబూరు రోడ్డుకు వచ్చేసరికి ఆర్టీసీ బస్సు వెళ్లిపోతుండడంతో ఓవర్ టెక్ చేయడంతో ద్వారకాపురం వద్ద అదుపుతప్పడంతో ముగ్గురూ కింద పడిపోయారు. హేమలత బస్సు వెనుక టైరు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈమె భర్త కాంతారావు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిందిరు. కుమారుడు మనోజ్, కుమార్తె కుసుమ, మృణాళి ఉన్నారు. బ స్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే పాతపట్నం పోలీసుస్టేషన్కు చేరుకుని జరిగిన విషయం పోలీ సులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న సీఐ నల్లి సాయి, పాతపట్నం, మెళియాపుట్టి ఎస్ఐలు మాహమ్మద్ యాసీన్, రాజేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అప్పటికే గిరిజనులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. బస్సు ఆపకుండా డ్రైవర్ వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు మృతదేహాన్ని తీసుకువెళ్లద్దంటూ గిరిజన నాయకులు చౌదరి లక్ష్మణరావుతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో తెంబూరు, పాతపట్నం రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. టెక్కలి ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు, సీఐ సాయి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పాతపట్నం సీహెచ్సీకి తరలించారు. -
వారికిజీవనాధారం!
భూమికి సారం.. ఎల్.ఎన్.పేట: మోతాదుకు మించి ఎరువులు, పురుగు మందుల వినియోగంతో భూసారం తగ్గిపోతోంది. ఇలాంటి చర్యలు భవిష్యత్తరాలకు ప్రతికూలంగా మారుతాయని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పలు సందర్భాల్లో రైతులకు అవగాహన కలిగిస్తూ వస్తున్నారు. దీంతో రైతుల ఆలోచనా విధానంలో మార్పు వస్తోంది. దీంతో పాత సంప్రదాయ పద్ధతుల్లోనే భూసారం పెచేందుకు రైతు లు ఆసక్తి కనబర్చుతున్నారు. ఇందులో ప్రధానమైనవి గొర్రెలు, మేకల (జీవాల) మందలను కాపు కాయటం, చెరువు పూడిక మట్టిని పొలాల్లో వేయ టం, కుల్లిన గత్తం వేసుకోవటం, పచ్చిరొట్టసాగు వంటి పద్ధతులు పాటించడం వంటివి చేస్తున్నారు. జీవాలతో వలస.. పొలంలో జీవాల మందల కాపు కాయటంతో భూమికి సారంతో పాటు పెంపకందారులకు ఆదాయమార్గంగా ఉంటుంది. కోటబొమ్మాళి, రణస్థలం, గార, ఎల్.ఎన్.పేట, టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, పలాస, వజ్రపుకొత్తూరు, లావేరు, ఎచ్చెర్ల, జి.సిగడాం, ఆమదావలస, శ్రీకాకుళం రూరల్, నరసన్నపేట తదితర మండలంలో జీవాల మంద కాపు కాసేవారు ఎక్కువగా ఉన్నారు. వీరు జిల్లా నలుమూలలకు జీవాల మందలను తీసుకుని వలసలు వెళ్తుంటారు. తక్కువ ఖర్చుతో.. పగలంతా మేతకు వెళ్లి గొర్రెలు, మేకల మందను రాత్రికి రైతు పొలానికి తీసుకువస్తారు. రాత్రంతా పొలంలో ఉంచుతారు. ఒక రాత్రి పొలంలో ఉంచడంతో అవి వేసే పేడ(గెత్తం) వల్ల భూ సారం పెరుగుతుంది. ఒక రాత్రి రైతు పొలంలో మంద ఉంచేందుకు పది కుంచాల బియ్యం(30కిలోలు), రూ.300 నగదు, కూరగాయలు, చింతపండు, పప్పులు జీవాలు పెంచే వారికి రైతులు ఇస్తారు. ఎకరా పొలంలో నాలుగైదు రాత్రులు మంద కాపుకాయటం వల్ల భూమి సారవంతంగా మారుతుంది. పంట సమయంలో ఎరువులు, పురుగుల మందుల ఖర్చు సగానికి తగ్గిపోతుంది. పురుగుల మందు, ఎరువుల అవశేషాల్లేని పంట దిగుబడులను సాధించవచ్చు. వేసవిలో అనుకూలం.. గొర్రెలు, మేకల (జీవాల) మందలను కాపుకాసేందుకు వేసవి అనుకూలం. ఖరీఫ్ తరువాత రబీలో ఆరుతడి పంటలు, వాణిజ్య పంటలు వేసుకుంటా రు. పంట కోత తరువాత మందలు కాపుకాస్తారు. వేసవి వర్షాలు పడినప్పుడు పొలం దుక్కి చేస్తారు. ఆ సమయంలో గొర్రెల, మేకల వ్యర్థాలు భూమిలో కలిసి భూసారాన్ని పెంచుతాయి. ఈ వ్యర్థాలు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. మందకాపునకు వేసవి అనుకూలం సేంద్రియ ఎరువుగా గొర్రెలు, మేకల వ్యర్థాలు భూసారం పెంచేదిశగా అడుగులు మందలు కాపుకాసే కుటుంబాలు జిల్లాలో 20 వేలు పైనే పూర్వికుల నుంచీ.. మేకలు, గొర్రెలు కలిసి మంద కాయడం పూర్వీకుల నుంచి వస్తోంది. మా నాన్న నుంచి నేను కూడా మంద పెంచటం నేర్చుకున్నాను. ప్రతి రోజు మరో ఇద్దరు కలిసి జీవాలను మేతకు తీసుకుని వెళతాను. వేసవిలో రైతుల పొలాల్లో కాపుకాయటం వల్ల బియ్యం, కొద్ది మొత్తంలో డబ్బులు, కూరగాయలు ఇస్తారు. పొలాల్లో మంద కాపు కాయటం వలన భూమికి మేలు జరుగుతుంది. – బొమ్మాళి శిమ్మన్న, గొర్రెల మంద యజమాని, కృష్ణాపురం, ఎల్.ఎన్.పేట భూసారం పెరుగుతుంది పొలంలో గొర్రెలు, మేకల మందలను కాపుకాయటం వల్ల భూసారం పెరుగుతుంది. ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గుతుంది, పంట దిగుబడుల్లో ఎరువులు, పురుగు మందుల ప్రభావం లేకుండా ఉంటుంది. ఎరువుల వాడకంతో మిత్ర పురుగులు నశిస్తాయి. భూమి పొరల్లో ఉండే మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతుంది. ఏటా మందల కాపుకాయటం వల్ల భూమి సారవంతంగా మారుతుంది. – పైడి లతశ్రీ, ఎఓ, ఎల్.ఎన్.పేట -
భర్త హత్య కేసులో భార్య అరెస్టు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని గూనపాలెంలో ఈ నెల 17న పారిశుద్ధ్య కార్మికుడు సీరా సురేష్ (32) హత్యకు గురైన సంగతి విదితమే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. భార్య తిరుమలే తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు సురేష్ భార్య తిరుమలను ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ లెంక సన్యాసినాయుడు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరుమల ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పనిచేసేది. ఒడిశా రాష్ట్రం కటక్కు చెందిన రియాజ్ఖాన్ కూడా అదే ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పనిచేసేవాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమ వ్యవహారం నడపడం, అది సురేష్కు నచ్చక భార్య తిరుమలతో తరచూ గొడవపడటంతో చివరకు హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. రియాజ్ఖాన్తో పాటు అతని మిత్రుడు నఫరుద్దీఖాన్(ఒడిశా) హత్య చేయడానికి సహకరించాడు. నఫరుద్దీన్ఖాన్ ఆమదాలవలసలోని ఓ దాబాలో పనిచేస్తుండేవాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నఫరుద్దీన్ఖాన్ ఉండగా, రియాజ్ఖాన్ పరారీలో ఉన్నాడు. ఈ కేసుకు విచారణాధికారిగా ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ విజయ్కుమార్ వ్యవహరించగా, సీఐ లెంక సన్యాసినాయుడు అతని బృందంలోని ఎస్ఐ గణేష్, పీసీలు ఈ కేసును చాకచక్యంగా ఛేదించారు. డీఎస్పీ సీఐ, ఎస్ఐలను ఎస్పీ రాధిక అభినందించారు. -
గురువారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2024
భువనేశ్వర్: ఖుర్దా జిల్లావ్యాప్తంగా వివిధ శాసనసభ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో ఏర్పడే సాంకేతిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు 24 మంది ఈసీఐఎల్ ఇంజినీర్లను నియమించనున్నట్లు కలెక్టర్ చంచల్ రాణా తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన మొదటి, రెండో దశ ఎన్నికలు పురస్కరించుకుని తలెత్తిన ఈవీఎం మొరాయింపు సంఘటనల దృష్ట్యా, ఈనెల 25వ తేదీన జరగనున్న మూడో దశ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉందన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుంచి జిల్లాస్థాయి కంట్రోల్ యూనిట్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంబంధిత సమస్యలు, ఫిర్యాదులను దాఖలు చేసేందుకు ప్రజలకు టోల్ ఫ్రీ నంబర్ 1950ను అందుబాటులో ఉంచినట్లు గుర్తుచేశారు. ముద్రణ, ఎలక్ట్రానిక్, సాంఘిక ప్రసార మాధ్యమాలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉంటుందన్నారు. నకిలీ సమాచారంపై నిఘా నకిలీ సమాచారం ప్రసారం నిరోధించడానికి పోలింగ్కు 72 గంటల ముందు నుంచే గట్టి నిఘా ఉంటుందని హెచ్చరించారు. ప్రతీ రిటర్నింగ్ అధికారి (ఆర్వో), జిల్లా ఎన్నికల కార్యాలయంలో కమ్యూనికేషన్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఈవీఎంలు పని చేయకపోవడం, ఎన్నికల్లో హింస, ఓటరు పోలింగ్ శాతాలు సకాలంలో నవీకరణలకు సంబంధించిన వ్యవహారాలను ఈ కేంద్రాలు పర్యవేక్షిస్తాయి. అలాగే పరిశీలకులు, రాజకీయ పార్టీల ఫీడ్బ్యాక్ ఆధారంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద 55 మంది మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నామని తెలిపారు. మొత్తం 1,923 పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగుల ఓటర్లకు చేయూతగా నిలిచేందుకు ప్రతీ కేంద్రానికి ఒక్కొక్కరు చొప్పున వాలంటీర్ని నియమించారు. వీరందరికీ రెండు విడతల్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. వివిధ పోలింగ్స్టేషన్లలో ర్యాంప్, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యామ్నాయ హామీ పూర్వక వ్యవస్థతో సోలార్, డిజి బ్యాకప్ వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మాట్లాడుతున్న కలెక్టర్ చంచల్ రాణా న్యూస్రీల్ ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు ఖుర్దా జిల్లా కలెక్టర్ చంచల్ రాణా వడదెబ్బ నివారణకు చర్యలు వడదెబ్బ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేసేందుకు బారులుతీరిన వృద్ధులకు కుర్చీలతో పాటు ఆకస్మిక వడదెబ్బ సత్వర చికిత్స సదుపాయాలు, సౌకర్యాలను అందుబాటులో ఉంచుతారు. ఓటు వేసేందుకు వచ్చే ఉద్యోగినులైన తల్లుల బిడ్డలను సురక్షితంగా ఉంచేందుకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో క్రెచ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రథమ చికిత్సపై ప్రాథమిక అవగాహన ఉన్న ఆరోగ్య కార్యకర్తలను ప్రతీ పోలింగ్ బూత్ వద్ద ఉంచుతారు. పోలీసు బృందం సహాయంతో సంచాలక ఆరోగ్య యూనిట్ను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రతీ పోలింగ్ స్టేషన్లో ఓటర్ సౌకర్య (ఫెసిలిటేషన్) సెంటర్ను ఏర్పాటు చేశామని, అన్ని సఖి బూత్లకు అదనపు బాల్టీలు, మగ్లను అందజేస్తామన్నారు. పోలింగ్ కేంద్రం ఆవరణలో మూడు చొప్పున చెత్త సేకరణ బుట్టలు ఏర్పాటు చేసి, పోలింగ్ బూత్ల పరిసరాల్లో వ్యర్థాలను తొలగించి చక్కటి పర్యావరణం కల్పించేందుకు సన్నాహాలు పూర్తైనట్లు పేర్కొన్నారు. మండల అభివృద్ధి అధికారులు (బీడీవో), కార్యనిర్వహణ అధికారులు (ఈవో), ముఖ్యంగా భువనేశ్వర్ నగర పాలక సంస్థ బీఎంసీ కమిషనర్ పర్యవేక్షణలో సకాలంలో శుభ్రపరచడం మరియు తొలగించడం వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఓటింగ్ సౌలభ్యం కోసం వికలాంగులకు రవాణా సౌకర్యం కూడా కల్పించబడిందని వివరించారు. -
వృద్ధులకు చీరలు పంపిణీ
రాయగడ: పట్టణంలోని శక్తి సీనియర్ సిటిజన్ వృద్ధాశ్రమంలో ఉన్న మహిళలకు స్థానిక ఉత్కళ మీడి యా పాత్రికేయుల సంఘం ప్రతినిధులు బుధవా రం చీరలను పంపిణీ చేసింది. ఆశ్రమంలో ఉన్న సుమారు 30 మందికి చీరలతొ పాటు పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి టికిరిలోని ఉత్కళ అల్యూమిన కర్మాగారం జనరల్ మేనేజరు (పీఆర్ విభాగం) పితంబర్ నాయక్, స్వయం సంపూర్ణ నంద (పీఆర్వో) , సీనియర్ న్యాయవాది ప్రదీప్కుమర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సంఘం అధ్యక్షులు దయానిధి ఖడంగా మాట్లాడుతూ.. తమ సంఘం ఆవిర్భవించనప్పటి నుంచి ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో సరోజ్ కుమార్ సాహు, మనోజ్ కుమార్ సాహు తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
పర్లాకిమిడి : ఈ నెల 19న గురండి పోలీసు ఠాణా పరిధిలో సర్దాపురం గ్రామ వంతెన వద్ద జరిగిన ప్రశాంత్ జెన్నా హత్య కేసును పోలీసులు రెండురోజుల్లో ఛేదించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. బుధవారం స్థానిక సబ్–డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద్ నాయక్, గురండి ఐఐసీ రవీంద్ర కుమార్ పాత్రో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. గుసాని సమితి అగరఖండి పంచాయతీ భిన్నల గ్రామానికి చెందిన ప్రశాంత్ జెన్నా(24) సర్దాపురం గ్రామానికి చెందిన సింహాచల ప్రధాన్, సురేంద్ర ప్రధాన్లు స్నేహితులు. అయితే హైదరాబాద్లో పనిచేసి తిరిగొచ్చిన ప్రశాంత్ తరచూ తన స్నేహితుడు సింహాచల ప్రధాన్ ఇంటికి వెళ్లడంతో ఆయన భార్య ప్రభాతి ప్రధాన్తో వివాహేతర సంబంధం ఉన్నట్లు గ్రామంలో పుకార్లు రేగాయి. దీంతో ప్రభాతి ప్రధాన్ ఈ ఏడాది ఫిబ్రవరి 27 విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. దీనికి ప్రశాంతే కారణమని సింహచల్ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 18న పని ఉందని ప్రశాంత్ జెన్నాను సింహాచల్ సర్దాపురం రప్పించాడు. వంతెన వద్దకు వచ్చేసరికి సింహాచల ప్రధాన్, అనుచరుడు కలియా, ఇతర నిందితులు మారణాయుధాలతో దడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాల పాలై న ప్రశాంత్ జెన్నా బంధువులు పర్లాకిమిడి ఆస్పత్రి కి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళంలో రాగోలు జెమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్య లో మృతి చెందాడు. విచారణ జరిపిన పోలీసులు ప్రధాన నిందితుడు సింహాచల ప్రధాన్ (సర్దాపురం), సంతోష్ స్వయిని (భిన్నల)లను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. మరో ముగ్గురు నిందితులు సురేష్ బారిక్, కలియా అలియాస్ లోబా జెన్నాలు పరారీలో ఉన్నారు. -
వైభవంగా ఊయల ఉత్సవం
శ్రీకాకుళం కల్చరల్: నారాయణ తిరుమలలో జరుగుతున్న వేంకటేశ్వరుని కల్యాణోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారికి ఊయల ఉత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గురుగుబెల్లి శ్రీనివాసులు నేతృత్వంలొ భూనీలా సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా పూలతో అలంకరించిన ఊయలను కల్యాణ మండపంపై కొలువుదీర్చి కల్యాణం జరిపించారు. స్వామివారిని కవచ ధారణలో అలంకరించి విశేష ఆరాధనలు, సహస్రనామార్చనలు చేయగా..అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. కార్యక్రమంలో వేంకటరామానుజ సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. -
అసిస్టెంట్ ఇంజినీర్కు మూడేళ్ల జైలుశిక్ష
పర్లాకిమిడి: గ్రామీణ తాగునీరు, శానిటేషన్ డివిజన్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్, అదనపు ఇన్చార్జి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేసిన నారాయణ పండా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో మూడేళ్ల జైలు శిక్ష, రూ.20వేలు జరిమానా విధిస్తూ బరంపురం విజిలెన్సు కోర్టు న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెల్లడించారు. గడువులోగా జరిమానా కట్టకపోతే మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రిటైర్మెంట్ పెన్షన్ కూడా నిలుపుదల చేయాలని సంబంధిత ఈఈకి ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఆస్పత్రిని సందర్శించిన ముస్కాన్ బృందం జయపురం: స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రిని ముస్కాన్ రాష్ట్ర బృందం బుధవారం సందర్శించింది. ఎంసీహెచ్ భవనంలో ఉన్న శిశు ఇండోర్, ఔట్ డోర్, ఎస్ఎన్సీయూ డీఈఐసీ (డిస్ట్రిక్ట్ అర్లి ఇంటరవెన్షన్ సెంటర్), ఎన్ఆర్సీలను పరిశీలించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు బృంద సభ్యులు సూచించారు. కొద్దిరోజుల్లో కేంద్ర మస్కాన్ బృందం కూడా ఆస్పత్రిని సందర్శిస్తోందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు బృందాలు అసెస్మెంట్లలో జిల్లా కేంద్ర ఆస్పత్రి సేవలు బాగున్నట్టు గుర్తిస్తే సర్టిఫికెట్ను అందిస్తారు. ఆస్పత్రిని సందర్శించిన ముస్కాన్ బృందంలో భువనేశ్వర్లోని కేపిటల్ ఆస్పహత్రి శిశు రోగ విభాగ ప్రభుత్వ ప్రొఫెసర్ డాక్టర్ పుష్పరాజ్ ప్రధాన్ నేతృత్వం వహించారు. ఈ బృందం తొలుత జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్రనాథ్ మిశ్రతో చర్చించారు. డాక్టర్లు, స్టాఫ్ నర్స్లు, అటెండెర్ల పనితీరు, వారిసేవలపై చర్చించింది. కార్యక్రమంలో ఆస్పత్రి శిశు వైద్య నిపుణులు డాక్టర్ దుర్గాప్రసాద్ పాత్రో, డాక్టర్ గౌతమ త్రిపాఠీ, ఆస్పత్రి మేనేజర్ తధాగత దాస్, మ్యాట్రిన్ జ్యోత్స్నరాణి బెహర, జ్యోతిప్రభ సాహు, స్టాఫ్ నర్స్ గీతాంజలీబెహర ఉన్నారు. 36 కిలోల గంజాయి స్వాధీనం ● నలుగురి అరెస్టు రాయగడ: గంజాయి రవాణా గుట్టు రట్టయింది. రాయగడ రైల్వేస్టేషన్ కూడలిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను పొలీసులు తనిఖీ చేయగా వారి బ్యాగుల్లో 36 కిలోల గంజాయి బయటపడింది. దీంతో వారిని మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అరెస్టయిన వారిలో శిబాన్ సొబొరొ, నవఘన సరక, మనొజ్ మాఝి, సుమంత్ మాఝిలు ఉన్నట్లు స్థానిక పొలీస్ స్టేషన్ ఐఐసీ కేకేబీకే కుహొరో తెలిపారు. అరెస్టయి వారిలో నవఘన సరక అనే యువకుడు కటక్ పొలీస్ విభాగంలో వోఎస్ఏపీ పొలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్లు విచారణలో తెలిసింది. ఎప్పటిలాగే పొలీసులు రైల్వే స్టేషన్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో నిందితులు పట్టుబడ్డారు. జిల్లాలోని కెందుగుడ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి రైలులో రాయిపూర్కు రవాణా చేసేందుకు నిందితులు సన్నహాలు చేసినట్టు తమ దర్యాప్తులో తెలిసిందని కుహొరొ తెలిపారు. 26న ప్లస్ టూ పరీక్ష ఫలితాలు వెల్లడి భువనేశ్వర్: రాష్ట్రంలో ఉన్నత మాధ్యమిక విద్యా మండలి (సీహెచ్ఎస్ఈ) నిర్వహించిన 12వ తరగతి బోర్డు పరీక్ష (+2) ఫలితాలు ఈ నెల 26న విడుదల కానున్నాయి. ఈ సంవత్సరం ఆర్ట్సు, సైన్స్, కామర్స్, వృత్తి విద్యా కోర్సు పరీక్ష ఫలితాల స్థానిక సీహెచ్ఎస్ఈ ప్రధాన కార్యాలయంలో ఒకేసారి ప్రకటించనున్నారు. ఫలితాలు www.orissaresults. nic.inలో అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులు తమ ఫలితాలను తమ హెచ్ఎస్ స్కూల్ ఈ–స్పేస్, డిజీ లాకర్లో కూడా పొందవచ్చని సీహెచ్ఎస్ఈ తెలియజేసింది. సీహెచ్ఎస్ఈ నిర్వహించిన 12వ తరగతి బోర్డు పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి మార్చి 20 వరకు జరిగాయి. 3,86,250 మంది విద్యార్థులు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి 22 నుంచి ప్రారంభమైంది. -
వివాహిత అనుమానాస్పద మృతి
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని డొంకూరు మత్స్యకార గ్రామంలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరా ల ప్రకారం.. డొంకూరు గ్రామానికి చెందిన వాసుపల్లి రామారావు, ఉష(30) దంపతుల మధ్య రెండు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉష తన అత్త వారి ఇంట్లోనే దూలానికి వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఇచ్ఛాపురం సామాజికి ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ ఎన్.లక్ష్మణరావు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఉషకు భర్తతో పాటు పదేళ్ల కుమార్తె నందన, ఐదేళ్ల కుమారుడు రిత్విక్ ఉన్నారు. ఉష మృతిపై అనుమానాలు ఉన్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. ‘పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి’ ఎచ్చెర్ల క్యాంపస్: విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రీసోర్సు పర్సన్ ముద్దాడ ఇందుమతి అన్నారు. మండలంలోని ధర్మవరం గ్రంథాలయంలో కొనసాగుతున్న వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా బుధవారం విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ అంశాలపై మాట్లాడిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గ్రంథాలయ అధికారి మలిపెద్ది చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
3 రోజుల పాపకు అరుదైన వెన్నెముక శస్త్రచికిత్స
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని గ్లోబల్ న్యూరోకేర్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్ దేవరెడ్డి గౌతమ్(న్యూరోసర్జన్) బుధవారం మూడు రోజుల పాపకు అరుదైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. గార మండలం కొర్ని గ్రామానికి చెందిన ప్రగడ చిన్నబాబు, శ్రీలత దంపతులకు మూడు రోజుల క్రితం పాప జన్మించింది. చిన్నారికి వెన్నెముక నరాలు బయటకు వచ్చాయి. దీనిని వైద్య పరిభాషలో మెనిం గోమైలోసీల్గా పేర్కొంటారు. ఈ నరాలను సరి చేసేందుకు అనస్థీషియాలజిస్ట్ డా.గొనప భవానీ నేతృత్వంలో డా.దేవరెడ్డి గౌతమ్ ఆధ్వర్యంలో నాలుగు గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ 2.5కేజీల బరువు గ ల పాపకు ఇటువంటి ఆపరేషన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని, పూర్తిగా మైక్రోస్కోపిక్ సర్జరీ చేయడంతో చక్కని ఫలితం లభించిందని తెలిపారు. శస్త్ర చికిత్సకు సహకరించిన డాక్టర్ సీపా న రాజేష్, డాక్టర్ రామకోటేశ్వర రావు(నియోటేలాలజిస్ట్)లకు కృతజ్ఞతలు తెలిపారు. -
నవధాన్యాల సాగుతో పొలం సారవంతం
రేగిడి: రైతులు ఖరీఫ్కు ముందు పంటపొలాల్లో నవధాన్యాలను వేయడం వల్ల భూమి సారవంతమవడమే కాకుండా జీవ వైవిధ్యం పెరుగుతుందని ప్రకతి వ్యవసాయం మాస్టర్ ట్రైనర్ కిరణ్కుమార్ అన్నారు. మండలంలోని చాటాయివలస గ్రామంలో సర్పంచ్ కరణం గోవిందరావుకు చెందిన ఐదెకరాల పొలంలో బుధవారం 30 రకాల నవధాన్యాల విత్తనాలను వేయించారు. రైతులు ఖరీఫ్ దుక్కులు చేసే సమయంలో నవధాన్యాల విత్తనాలు వేసుకోవడం వల్ల భూసారం పెరుగుతుందన్నారు. తరువాత సాగుచేసే పంటలకు పోషకాలు సమృద్ధిగా అందుతాయని, ఫలితంగా అధిక దిగుబడులు వస్తాయన్నారు. రైతులంతా నవధాన్యాలను సాగుచేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పొగిరి అప్పలనాయుడు, ఐసీఆర్పీలు ఐ.తవిటినాయుడు, రమణ తదితరులు పాల్గొన్నారు. పచ్చిరొట్టతో నేల సారవంతం రేగిడి: పచ్చిరొట్ట ఎరువుల ద్వారా నేల సారవంతంగా ఉంటుందని మండల వ్యవసాయశాఖ అధికారి జి.మురళీకృష్ణ అన్నారు. మండలంలోని చాటాయివలస గ్రామంలో పీఎండీఎస్ క్రాప్ కటింగ్ కార్యక్రమంపై బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. పచ్చిరొట్ట ఎరువులతో కలిగే లాభాలను వివరించారు. 18 రకాల పప్పుగింజల విత్తనాలను దమ్ముకు ముందు పొలంలో వేయడం వల్ల నేలకు మంచి సత్తువ వస్తుందన్నారు. కిలో పచ్చిరొట్ట ఎరువు వందకిలోల పశువుల ఎరువుతో సమానమని తెలిపారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ కెంబూరు శ్రీనివాసరావు, సర్పంచ్ కరణం గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. -
పరువు పోతుందని ప్రాణాలు తీసుకున్నాడు..
చీపురుపల్లి: ఇద్దరిదీ ఒకే ఊరు.. కులాలు వేరైనప్పటికీ మనసులు కలిశాయి.. ఏడాది కాలంగా ప్రేమించుకుంటూ, సాన్నిహిత్యంగా మెలిగారు.. పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి చేయడం, పంచాయితీ పోలీస్స్టేషన్కు చేరడంతో ఎక్కడ పరువు పోతుందోనని ఆందోళనతో యువకుడు రెండు రోజుల కిందట ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్లాం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ మేరకు మృతుడి సోదరుడు మరువాడ రాము పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కె. కిరణ్కుమార్ నాయుడు బుధవారం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్లాం గ్రామానికి చెందిన మరువాడ లక్ష్మణరావు అదే గ్రామానికి చెందిన యువతితో ఏడాది కాలంగా ప్రేమలో ఉంటూ, సాన్నిహిత్యంగా మెలిగాడు. ఈ క్రమంలో యువతి తనను పెళ్లి చేసుకోమని లక్ష్మణరావుపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే లక్ష్మణరావు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో యువతి, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అక్కడ కూడా యువతి తనకు లక్ష్మణరావుతో పెళ్లి కావాలని పట్టుబట్టింది. దీంతో గ్రామపెద్దలు ఇరువర్గాలతో మాట్లాడి వస్తామని పోలీస్స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అయితే కులాంతర వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారో, లేదో.. పోలీస్ కేసు నమోదైతే పరువుపోతుందనే ఆందోళనతో లక్ష్మణరావు రెండు రోజుల కిందట గ్రామ సమీపంలోని తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేశాం.. లక్ష్మణరావు ఆత్మహత్యకు సంబంధించి సోదరుడు రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై కె. కిరణ్కుమార్ నాయుడు తెలిపారు. మృతదేహానికి చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు చెప్పారు. కర్లాంలో యువకుడి ఆత్మహత్య కేసు నమోదు చేసిన పోలీసులు -
‘రత్న భాండార్’లో ఏముంది? తాళాలు ఏమయ్యాయి?
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా జగన్నాథ ఆలయానికి సంబంధించిన రత్న భాండార్ గురించి ప్రస్తావించారు. ఈ రత్న భాండార్ తాళాలు గత ఆరేళ్లుగా కనిపించడం లేదని, అవి ఏమైపోయాయనేది ఒడిశా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. ఈ భాండాగారంలో అపారమైన సంపద దాగి ఉందని మోదీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన దర్యాప్తు నివేదిక బయటపెట్టేందుకు ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసమో ఈ విషయాన్ని దాచి ఉంచుతున్నారని మోదీ ఆరోపించారు. మోదీ విమర్శల నేపధ్యంలో ‘రత్న భాండార్’ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ ‘రత్న భాండార్’లో ఏముంది? పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారంలోని అంతులేని శ్రీవారి ఆభరణాలు, బంగారు, వెండి,వజ్ర వైఢూర్యాలు క్షేమంగా ఉన్నాయా? ఖజానాకు సంబంధించిన కీలక తాళం పోయి యాభై ఏళ్లు దాటినా ఇంత వరకు దాన్ని ఎందుకు చేధించలేదు?ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు అనుమానస్పద మౌనాన్ని కొనసాగిస్తోంది? శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి బుస బుసలు వినిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది వేయి పడగల ఆదిశేషునివేనా? అసలు జగన్నాధుని కొలువులో ఏం జరుగుతోంది? దేవుడి ఆస్తులకే మనిషి శఠగోపం పెడుతున్నాడా?అక్కడున్న రహస్యం ఏంటి?అందరినీ కాపాడ్డానికి ఆ దేవుడు ఉన్నాడు. మరి దేవుడి సంపద కాపాడటానికి ఎవరున్నారు? కచ్చితంగా మనిషిని నమ్మడానికి వీల్లేదు. తన సంపదను దేవుడే కాపాడుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఒడిషా లోని అత్యంత ప్రాచీనమైన పూరీ జగన్నాథుని దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలు ఉన్న భాండాగారం గది తాళాల మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. తాళాలు ఎలా పోయాయో ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఆలయ కమిటీ ఏమీ తెలీదంటోంది. తాళాలు పోయిన యాభై ఏళ్ల తర్వాత కూడా ఎవ్వరిలోనూ కంగారు లేదు. వాటిని వెతికి పట్టుకోవాలన్న ఆతృత లేదు. పాలకుల వైఖరిని చూసి భక్తులు మండిపడుతున్నారు. దేవ దేవుడి ఆభరణాలు ఉన్నాయా? దిగమింగేశారా? చెప్పండంటూ నినదిస్తున్నారు.దేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి. ఈ నాలిగింటినీ కలిపి చార్ ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం. 12వ శతాబ్ధంలో రాజా అనంత వర్మ చోడగంగదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమ్ దేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం.దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారి అయినా జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు.ఇక్కడ నిత్యం దేవ దేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు.ఇక ఏటా జూన్, జులై నెలల్లో జరిగే జగన్నాథ రథ యాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరీ వస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్ధం. అంటే ముల్లోకాలనూ చల్లగా చూసే విష్ణుమూర్తే అని అర్ధం చేసుకోవాలి.ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాధానం లేని ప్రశ్నలా అందరినీ వేధిస్తోంది. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్ధం నుండి 18వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవ దేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు.ఈ సంపదలన్నింటినీ శ్రీక్షేత్రంలోని రత్నభండాగారంలోని మూడో గదిలో దాచారు. ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్నభాండాగారాన్ని తెరిపించినపుడు అందులో 597కి పైగా రక రకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదను వెలగట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైఢూర్య, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాశులు రాశులుగా పోసి ఉన్నట్లు గురించారు. రత్నభాండాగారంలోని రహస్యగదిగా పిలుస్తోన్న మూడో గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్లచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని వందేళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు.అంతా బానే ఉంది కానీ కొన్నేళ్లుగా ఈ రహస్య గదే పెద్ద మిస్టరీగా మారింది. రత్నభాండాగారంలోని మూడో గదికి మూడు తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళంచెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళంచెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది.ఈ మూడు తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవడం కుదరదు. రత్నభాండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినపుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఈ గదిలో భద్రపరుస్తారు. రెండో గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. అయితే మూడో గదిని మాత్రం దశాబ్ధాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్దం కావడం లేదు. మొత్తానికి భక్తులు, ప్రజాసంఘాలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తేలిందేంటంటే ఈ మూడు తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని.దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ 2018లో అధికారికంగా రత్నభాండాగారానికి చెందిన మూడో గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని అది ఎక్కడికిపోయిందో తెలవడం లేదని ప్రకటించారు. దాంతో ప్రభుత్వంపైనా ఆలయ పాలనా యంత్రాంగం పైనా విమర్శలు వెల్లువెత్తాయి.1964లో చివరి సారి మూడో గదిని తెరిచినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటున్నారు. దీనిపై విపక్షాలు విరుచుకుపడటంతో కొన్నాళ్ల కింద పాలక పక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవ దేవుడి ఆభరణాలు కానీ సంపద కానీ ఎక్కడికీ పోలేదని.. పూచిక పుల్ల కూడా ఎవరూ దోచుకుపోలేదని అన్నీ భద్రంగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు.అసలు తాళాలు పోయాయని ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. తాళాలు పోవడంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారంలో ఎవరు బాధ్యులో తేల్చాలని ఆయన ఆదేశించారు. రఘువీర్ దాస్ కమిటీ నెలల తరబడి దర్యాప్తు చేసిన తర్వాత 324 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆ నివేదికలో ఏం ఉందన్నది మిస్టరీగా మారింది. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న రెండు తాళాలతో మూడో గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు.అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్ధాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ఇక్కడ పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల వాళ్లే కొనసాగుతున్నారు.ప్రధాన అర్చకులయితే.. ఓ అడుగు ముందుకేసి దేవాలయ రత్నభాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టం అని హెచ్చరిస్తున్నారు.దేవుడి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని పెను విపత్తులు తరుముకు వస్తాయని వారు బెదిరిస్తున్నారు.జగన్నాధుని భక్తితో కొలిచే వారు మాత్రం తమ దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటున్నారు. మూడో గది తాళాలు ఎలా పోయాయో ఎవరు కొట్టేశారో ఎందుకు తేల్చడం లేదంటూ వారు నిలదీస్తున్నారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ నేలమాళిగల్లో అపార ధనరాశులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు ఆదేశాలతో నేలమాళిగలను తెరిచారు. అయితే అందులో ఆరు నేలమాళిగలు ఉండగా అధికారులు కేవలం అయిదు నేలమాళిగలను మాత్రమే తెరిచారు. నిజానికి ఈ ఆరో నేలమాళిగే అన్నింటిలోకీ కీలకమైందని అప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే మిగతా అయిదు నేలమాళిగలతో పోలిస్తే ఆరో నేలమాళిగ చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెబుతున్నారు.ఆరో నేలమాళిగ కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాళిగల్లోనే ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఆరో నేలమాళిగలో దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ధనరాశులు కచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన. అయితే అధికారులు మాత్రం ఆరో నేలమాళిగను ఈ రోజుకీ తెరవలేదు. ఆరో నేలమాళిగ ను మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసర్పం బొమ్మ ఉంది. ఆ తలుపులను నాగబంధంతో బంధించారని ప్రచారం జరుగుతోంది. ఆ నాగబంధాన్ని ఖాతరు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికే అరిష్టమని దేవుడి ఉగ్రరూపం విలయ రూపంలో విరుచుకుపడి మానవాళిని నాశనం చేసేస్తుందని ఆలయ పూజారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఏదో మెలిక ఉందనిపిస్తుందంటున్నారు హేతువాదులు.ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో అయిదు మాళిగల తలుపులు తెరిస్తే ఏమీ కానిది ఆరో మాళిగ తెరిస్తేనే ఏదో అయిపోతుందని అనడంలో అర్ధం ఏముందని వారు నిలదీస్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న సున్నితమైన ఆలోచనతో ఆరో నేలమాళిగ తెరవకూడదని నిర్ణయించేసుకున్నారు.పూరీలోని జగన్నాథుని ఆలయంలోనూ కీలకమైన మూడో గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉఏనేన్నాయా? లేక వేయి పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా? అన్నది అర్ధం కావడం లేదు. పాముల బుస బుసలు మాత్రం వినిపిస్తున్నాయని అధికారులు అన్నారన్న ప్రచారంలో ఎంత వరకు నిజముంది? వెంటనే ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరించడం దీనికి కొనసాగింపా? అన్నది తెలియాల్సి ఉంది.అసలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? కొందరు భక్తులు అయితే మూడో గదిలోని విలువైన ఆభరణాలు, సంపదలను రాబందులు తన్నుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టే మూడో గది తాళాల గురించి కానీ రఘువీర్ దాస్ కమిటీ నివేదిక గురించి కానీ ప్రభుత్వం మాట్లాడ్డం లేదని వారంటున్నారు.మూడో గదిని ప్రజల సమక్షంలో తెరిస్తే నిజా నిజాలు బయటకు వస్తాయని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు.అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరో నేలమాళిగ తరహాలోనే పూరీ జగన్నాథ ఆలయంలోని కీలకమైన ఈ మూడోగది మిస్టరీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చునని కొందరు మేథావులు అంటున్నారు. పాలకులు మాత్రం ఏమీ అనడం లేదు. ఆలయ సిబ్బంది కూడా బెల్లంకొట్టిన రాయిలా మాట్లాడ్డం లేదు. భక్తులు మాత్రం దేవుడికి అపచారం జరిగిందని బాధపడుతున్నారు. అది దేశానికి ఏ మాత్రం మంచిది కాదని ఏ క్షణంలో ఏం ముంచుకు వస్తుందోనని వారు భయపడుతున్నారు. ఇక నిజా నిజాలు వెలికి తీసి దోషులకు శిక్షపడేలా చేయాల్సింది ఆ జగన్నాథుడే. ఆయనే కద జగన్నాటక సూత్రధారి. తన ఆస్తులను ఎవరు కొట్టేశారో పట్టుకుని బోనులో పెట్టాల్సింది దేవుడే ఇక.భక్తుల మనోభావాలను అడ్డుపెట్టుకుని దేవుడి సంపదలు కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆధ్యాత్మిక వాదులు హెచ్చరిస్తున్నారు. వెలకట్టలేని అపార దేవుడి సంపదకు రక్షణ కల్పించాల్సిన పాలకులు ఘోరంగా విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిజానిజలేంటో వెలుగులోకి తీసుకురావాలని వారు పట్టుబడుతున్నారు. -
3 క్వింటాళ్ల గంజాయి పట్టివేత
● ఇద్దరు అరెస్టు జయపురం: గంజాయి అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టుచేశారు. కొరాపుట్ జిల్లా దమంజోడి పోలీసులు రెండు కార్లలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ప్రమీళ బిడిక మంగళవారం తెలిపారు. పట్టుబడిన గంజాయి మూడు క్వింటాళ్ల మూడు కేజీలు ఉన్నట్లు వెల్లడించారు. పట్టుబడిన వారు రాయగడ జిల్లా పుటాసింగ్ పోలీసు స్టేషన్ పరిధి నువాద గ్రామానికి చెందిన సునీల్ నిమల, గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి పరిధి బురిపొదర్కు చెందిన నిర్బిగా గుర్తించినట్టు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశామన్నారు. గంజాయి అక్రమ రవాణపై విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు సోమవారం సాయంత్రం సబ్ఇన్స్పెక్టర్ దీపక్ పండ నేతృత్వంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా విషయం వెలుగు చూసిందని స్పష్టం చేశారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
జయపురం: జయపురం పరిధిలో మంగళవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. కొరాపుట్ జిల్లా 26వ జాతీయ రహదారిలో పొట్టంగి సమితి పుకాళీ గ్రామ కూడలి సమీపంలో కొబ్బరి కాయలు రవాణా చేస్తున్న ఒక వ్యాన్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్పర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కుందులి కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. మృతుడిని షేక్ ఆర్సిచ్(47)గా గుర్తించారు. ఈ వ్యాన్ ఆంధ్రా నుంచి వస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వల్ల ఆ దారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నవరంగపూర్ పోలీసు స్టేషన్ పరిధి కేశరీ గుడ గ్రామ సమీపంలో సోమవారం రాత్రి రెండు బైక్లు ఢీకొనడంతో ఇద్దు మృతి చెందారు. వీరిని పడాల్గుడ పంచాయతీ నీలకంఠగుడ గ్రామానికి అభి జాని(25) గెల గదబగుడ గ్రామానికి చెందిన చందన గదబ(19)లుగా గుర్తించారు. పడాల్గుడ గ్రామంలో జరుగుతున్న బలిజాతరను చూచేందుకు అభి జాని, చందన గదబలు రెండు బైక్లపై వెళ్లారు. జాతర ముగిశాక గ్రామానికి తిరిగి వస్తుండగా కేశరీగుడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు బైక్లపై నలుగురు ప్రయాణిస్తున్నారని, అందరూ తీవ్రంగా గాయపడ్డారని వారిని నవరంగపూర్ ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఇక్కడ అభి మృతి చెందగా చందనను కొరాపుట్ తరలిస్తుండగా అక్కడ సహిద్ లక్ష్మణ నాయిక్ ఆస్పత్రిలో మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు -
కరాటే పోటీల్లో బంగారు పతకం
రాయగడ: మలేసియాలోని పెర్క్ ఎలీనా స్టేడియంలో ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన 20వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో రాయగడ యువకుడు సత్తా చాటాడు. భారత్ తరుపున ఈ పోటీల్లో పాల్గొన్న ఎల్.రమేష్ కుమార్ 50 కిలోల కేటగిరిలో బంగారు పతాకాన్ని సాధించాడు. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో మలేసియా, ఇండోనేషియా, సింగపూర్ వంటి దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. బంగారు పతకాన్ని సాధించి తిరిగి స్వగ్రామానికి మంగళవారం వచ్చిన రమేష్ కుమార్కు స్థానిక సాక్ష్యం అనే సంస్థ ఘనంగా స్వాగతం పలికింది. రైల్వేస్టేషన్లో ఆయనకు స్వాగతం పలికినవారిలో జిల్లా క్రీడాశాఖ అధికారి షేక్ ఆలీనర్, తెరువలిలోని ఇంఫా పరిశ్రమ పీఆర్వో శక్తి కుమార్ పాణిగ్రహి, బృందావన్ బెహర, శ్యామ్దాస్, దివ్యా పండ తదితరులు ఉన్నారు. దివ్యాంగుడైన రమేష్ కరాటే వంటి క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించడంపై అందరూ అభినందనలు తెలియజేశారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ఆ ఉద్యోగులకు శుభవార్త.. జీతాల పెంపు, రూ.1.8 లక్షల బోనస్ కూడా
కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
'బుజ్జి' ఎక్కడ తయారైందంటే?.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
రేవ్ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)
ఈ బ్రాండ్ అంత ఈజీగా రాలేదు: దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కేటీఆర్
బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)
బీఆర్ఎస్కు10 ఏళ్ళు పట్టింది.. కాంగ్రెస్కు 5 ఏళ్ల పాలన గగనం: కిషన్ రెడ్డి
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్రెడ్డి
తప్పక చదవండి
- కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement