రాయవరం: వేసవి సెలవుల్లోనూ పని చేయాలా అంటూ పెదవి విరుస్తున్న వారికి జిల్లాలోని పలువురు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. మనబడి మన బాధ్యతను గుర్తు చేసుకుంటూ 2024–25 విద్యా సంవత్సరం అడ్మిషన్లపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు. ఉన్నత పాఠశాలల సమీప గ్రామాలకు వెళ్లి మన బడిలోనే మీ పిల్లలను చేర్పించండి..అంటూ తల్లిదండ్రులను కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మౌలిక సౌకర్యాలు, అందిస్తున్న విద్యాప్రమాణాలను తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఈ ఏడాది పదవ తరగతి ఫలితాల్లో సాధించిన ఉత్తీర్ణతను..విద్యార్థులు సాధించిన మార్కులను..కరపత్రాల రూపంలో ముద్రించి గ్రామాల్లోని ఇంటింటికి తిరిగి పంచుతున్నారు. జిల్లాలో పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ బడుల పరిరక్షణ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు.
ప్రైవేటుకు దీటుగా..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2024–25 విద్యాసంవత్సరం అడ్మిషన్లపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేలా మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు వెబెక్స్, గూగుల్ మీట్ సమావేశాల ద్వారా మార్గదర్శకత్వం చేశారు. దీంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అడ్మిషన్ల ప్రక్రియను బాధ్యతగా తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు వలవేస్తూ ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించాయి. దీనికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు.
వారిపైనే ఫోకస్..
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్న ప్రీ స్కూల్స్లో 3–6 సంవత్సరాల వయసు ఉన్న వారు 40వేల మంది ఉన్నారు. వీరిలో ఐదేళ్లు పైబడిన వారు దాదాపుగా 12వేల మంది వరకు ఉన్నారు. ఐదు సంవత్సరాల వయసు పైబడిన పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ఫోకస్ పెట్టారు. ప్రైవేట్ కాన్వెంట్స్లో యూకేజీ చదువుతున్న విద్యార్థులు కూడా దాదాపుగా ఆరువేల మంది వరకు ఉన్నారు. గత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో 18,302 అడ్మిషన్లు జరిగాయి. ఈ ఏడాది కూడా ఇంచుమించుగా అదే సంఖ్యలో అడ్మిషన్లు జరిగే అవకాశముంది. ఐదవ తరగతి నుంచి 22,757 మంది విద్యార్థులు ఆరవ తరగతిలోకి ప్రమోట్ అవుతున్నారు. 7వ తరగతి నుంచి 8వ తరగతిలోకి 21,552 మంది ప్రమోట్ అవుతుండగా, 219 ప్రాథమిక పాఠశాలల్లో రెండవ తరగతి చదువుతున్న 1,511 మంది ఉపాధ్యాయులు మూడవ తరగతిలో చేరనున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికే ఐదో తరగతి చదువుతున్న వారితో పాటుగా, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను కూడా చేర్చుకునేందుకు వారి తల్లిదండ్రులను మోటివేట్ చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చేవారు ఎవరైనా ఉంటే వారికి ముందస్తుగా అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తల సహకారం తీసుకుంటూ అడ్మిషన్లు పెంచుతున్నారు.
నేరుగా విద్యార్థుల
ఇళ్లకే ఉపాధ్యాయులు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై
ప్రధానోపాధ్యాయుల ఫోకస్
వేసవి సెలవుల్లోనూ
విధుల పట్ల అంకితభావం
స్ఫూర్తిగా నిలుస్తున్న
పలువురు హెచ్ఎంలు, టీచర్లు
వచ్చే నెల 12న పాఠశాలల
పునఃప్రారంభం
కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రచారం
పలు ప్రభుత్వ పాఠశాలలు వినూత్నంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇటీవల పదవ తరగతి ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు సాధించిన అద్భుత ఫలితాలను ప్రచారాస్త్రాలుగా వినియోగించుకుంటున్నారు. ‘పది’ ఫలితాల్లో మెరిట్ విద్యార్థుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఆయా పాఠశాలల వద్ద ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నారు. ఎన్ఎంఎంఎస్, చెకుముకి వంటి టాలెంట్ టెస్టులు, జవహర్ నవోదయ, ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులు సాధించిన సీట్ల వివరాలను ఫ్లెక్సీల్లో పొందుపర్చారు. పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలనే విద్యార్థుల అడ్మిషన్లకు ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నారు. కొందరు ప్రధానోపాధ్యాయులు ఫ్లెక్సీలను ఆటోలకు కట్టి, మైకు ద్వారా ప్రచారం చేయించారు. పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోవు అంటూ సగర్వంగా ప్రచారం చేసిన వైనం ఎక్కడికక్కడ కన్పించింది.
నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోంది. పాఠశాల నుంచి గతంలో ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. గత విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠఽశాలల నుంచి వచ్చి మా పాఠశాలల్లో అడ్మిషన్స్ పొందారు. ఈ విద్యా సంవత్సరంలో 11 మంది విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్కు ఎంపికయ్యారు. విద్యార్థులు సాధించిన విజయాలను తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నాం.
– కె.వెంకటలక్ష్మి, జీహెచ్ఎం,
జెడ్పీహెచ్ఎస్, మురముళ్ల, ఐ.పోలవరం మండలం
తల్లిదండ్రుల స్పందన బాగుంది
ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే పొందే ప్రయోజనాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నాం.
వేసవి సెలవులను ఆలోచించకుండా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. ఉపాధ్యాయులు కూడా బాధ్యతగా విద్యార్థులను చేర్పించేందుకు స్వచ్ఛందంగా వచ్చారు. తల్లిదండ్రుల నుంచి స్పందన కూడా బాగుంది.
– జి.కనకదుర్గ, జీహెచ్ఎం,
జెడ్పీహెచ్ఎస్, ముంగండ,
పి.గన్నవరం మండలం
సంతోషించదగ్గ విషయం
ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవడం సంతోషించదగ్గ విషయం. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు అంగన్వాడీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులను చేర్చుకుంటున్నారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలను వదిలిపెట్టే విద్యార్థులను ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చేర్చుకుంటున్నారు. విద్యార్థుల చేరికతోనే పాఠశాలలు బలోపేతం అవుతాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి.
– ఎం.కమలకుమారి, డీఈవో, అమలాపురం