-
నేడు బంగాళాఖాతంలో వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత ఉత్తరం వైపు వెళ్లి 26వ తేదీ ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుని తీవ్ర తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది.దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో శుక్ర, శనివారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది.శనివారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆదివారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవిస్తాయని తెలిపింది.నేడు, రేపు కొన్నిచోట్ల వడగాడ్పులుమరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సాధారణంకంటే 3నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండురోజులు వడగాడ్పులు వీయనున్నాయి. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 11, పార్వతీపురం మన్యం 11, కాకినాడ 1, తూర్పు గోదావరి 1 మండలం చొప్పున 33 మండలాల్లోను, శనివారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 7, పార్వతీపురం మన్యం 5, పశ్చిమ గోదావరి 1, ఏలూరు 2, కృష్ణా 2, బాపట్ల జిల్లాలో రెండు చొప్పున 24 మండలాల్లోనూ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి
● దీనికి ఉష్ణతాపం తోడు ● గాలిలో తేమ శాతం అధికం కావడమే కారణం ● అసౌకర్య వాతావరణంతో ఇబ్బంది పడుతున్న నగర ప్రజలు సాక్షి, విశాఖపట్నం : ఉక్కపోత జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఒకపక్క ఉష్ణతాపం ఇబ్బంది పెడుతుంటే.. అది చాలదన్నట్టు ఉక్కపోత దానికి తోడైంది. ఫలితంగా ఈ రెండూ జత కలిసి ముచ్చెమటలు పోయిస్తున్నాయి. ఉదయం పొద్దెక్కగానే అసౌకర్య వాతావరణం మొదలవుతోంది. ఎండ ముదిరే కొద్దీ ఉక్కపోత కూడా అధికమవుతోంది. సాయంత్రం సూర్యాస్తమయం అయినా వేడి తగ్గినా ఉపశమనం కలగడం లేదు. పలువురు తమ ఇళ్లలో ఏసీలు, ఫ్యాన్లు రేయింబవళ్లు ఆపడం లేదు. ఇళ్లు, కార్యాలయాల్లో ఫ్యాన్లు గిరాగిరా తిరుగుతున్నా ఏమంత ఫలితం ఉండడం లేదు. వీటి నుంచి బయటకు రాగానే చెమటతో తడిసి ముద్దవుతున్నారు. సాధారణంగా గాలిలో తేమ 50 శాతానికి లోపు ఉంటే ఉక్కపోత ప్రభావం కనిపించదు. కానీ అంతకు పైగా నమోదైతే మాత్రం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో గాలిలో తేమ 60–70 శాతం వరకు ఉంటోంది. గురువారం విశాఖలో గాలిలో తేమ 68 శాతం ఉంది. మరో మూడు, నాలుగు రోజులు ఈ తేమ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఉక్కపోత మరింత తీవ్రం కానుంది. అప్పటి వరకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించే అవకాశం లేదు. ఎందుకిలా? సాధారణంగా మైదాన ప్రాంతాలకంటే సముద్ర తీర ప్రాంతాలో ఉక్కపోత అధికంగా ఉంటుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయుగుండం, ఆపై తుపానుగాను బలపడనుంది. బంగాళాఖాతంలో ఇలాంటివి ఏర్పడినప్పుడు భూ ఉపరితలంలోని గాలులను అటు వైపు లాక్కుంటాయి. దీంతో ఉక్కపోత ప్రభావం మరింతగా పెరుగుతుంది. ప్రస్తుతం ఉక్కపోత పెరగడానికి ఇదే ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
పన్ను మోసాలపై విజి‘లెన్స్’
సాక్షి, విశాఖపట్నం : నకిలీ ఇన్వాయిస్ల పేరుతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సొమ్ము దోచుకుంటున్న కంపెనీలపై కేంద్ర, రాష్ట్ర పన్నుల శాఖల పరిధిలోని విజిలెన్స్ అధికారులు దృష్టిసారించారు. ‘పన్నుమోసం.. చెరో సగం’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. గత ఏడాదిన్నర కాలంలో వచ్చిన ఇన్వాయిస్ల డేటా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అదేవిధంగా వరుసగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందుతున్న సంస్థల వివరాలు పరిశీలిస్తున్నారు. ఏఏ సంస్థలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సొంతం చేసుకున్నాయి.. ఆ సంస్థల అడ్రస్లు ఏంటి.. ఏఏ ఇన్వాయిస్లను సబ్మిట్ చేసి.. క్రెడిట్స్ పొందాయి.. ఇలా విభిన్న కోణాల్లో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సంజీవని నిధికి హెచ్పీసీఎల్ ఉద్యోగుల విరాళం మహారాణిపేట: జిల్లాలోని పేదలు, అనారోగ్య బాధితులకు సాయం చేయాలనే దృక్పథంతో నెలకొల్పిన సంజీవని నిధికి హెచ్పీసీఎల్ ఉద్యోగులు రూ. 6,45,000 విరాళంగా అందించారు. హెచ్పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.రతన్ రాజ్ గురువారం కలెక్టర్ ఎ. మల్లికార్జునను కలిసి ఈ మొత్తం చెక్కును అందజేశారు. విశాఖ రిఫైనరీలో పని చేస్తున్న ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంజీవని నిధికి ఆర్థిక సాయం అందించారని ఈడీ తెలిపారు. ఉద్యోగుల చూపిన చొరవ, దాతృత్వాన్ని కలెక్టర్ ప్రశంసించారు. అర్హులందరికీ బీసీజీ వ్యాక్సినేషన్ మహారాణిపేట: అర్హులందరికీ బీసీజీ వ్యాక్సినేషన్ ఇస్తున్నామని డీఎంహెచ్వో పి.జగదీశ్వరరావు అన్నారు. గురువారం రేసపువానిపాలెంలోని తన కార్యాలయంలో డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 మంది సభ్యులతో టాస్క్ఫోర్స్ సమావేశం జరిగిందని తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారికి బీసీజీ వ్యాక్సినేషన్ వేస్తున్నామన్నారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామ న్నారు. అడిషనల్ డీఎంహెచ్వో పూర్ణేంద్రబాబు మాట్లాడుతూ అడల్ట్ బీసీజీ వాక్సిన్ త్వరితగతిన అందరూ వేసుకోవాలని, ఇది టీబీ రాకుండా చేస్తుందన్నారు. జిల్లా ఇమ్యూనిజేషన్ అధికారి జీవన రాణి, డ్రగ్ కంట్రోలర్ ఏడీ విజయ్కుమార్, యూఎన్డీపీ పీవో కమలాకర్ భట్టు, జిల్లా మీడియా విస్తరణాధికారి బి.నాగేశ్వరరావు, నోడల్ అధికారి బి.ఉమావతి పాల్గొన్నారు. -
కిక్కిరిసిన వరాహ పుష్కరిణి
● వైశాఖ పౌర్ణమికి పోటెత్తిన భక్తులు ● తరలివచ్చిన గరిడి బృందాలు సింహాచలం : వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం సింహగిరికి భక్తులు పోటెత్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇలవేల్పుగా కొలిచే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు, గ్రామీణ ప్రాంతాల భక్తులు, ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము ఒంటి గంట నుంచే కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. స్వామివారి ప్రతిరూపాలుగా వెంట తీసుకొచ్చిన కోలలకు పూజలు నిర్వహించారు. వంటలు వండుకుని సహపంక్తి భోజనాలు చేశారు. మెట్లమార్గం ద్వారా సింహగిరికి నడిచి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. గరిడి వాయిద్యాలతో స్వామిని కీర్తించారు. స్నానమాచరించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో వరాహ పుష్కరిణి కిక్కిరిసింది. వంటలు వండుకుని, సహపంక్తి భోజనాలు చేసే భక్తులతో అడవివరం ప్రాంతంలోని సంత ప్రాంగణం, ప్రియాగార్డెన్స్, హవేళి ప్రాంగణం, పాత అడవివరంలోని మామిడి తోటలు నిండుకున్నాయి. మార్కెట్ కూడలి నుంచి వరాహ పుష్కరిణికి వెళ్లే మార్గం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు భక్తులతో కిక్కిరిసింది. పుష్కరిణి వద్ద దేవస్థానం గార్డులు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దర్శనానికి వచ్చిన భక్తులతో సింహగిరి మెట్లమార్గం, సింహగిరిపై ఉన్న క్యూలు కిక్కిరిశాయి. ప్రసాద విక్రయశాల రద్దీగా మారింది. దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
కేజీహెచ్కు 5 బ్యాటరీ వాహనాలు
మహారాణిపేట: రోగుల రవాణా కోసం 24/7 పనిచేసే ఐదు బ్యాటరీ కార్లను కేజీహెచ్కు విశాఖ స్టీల్ప్లాంట్ అందజేసింది. కేజీహెచ్ ఆవరణలో గురువారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఎ.మల్లికార్జున, స్టీల్ప్లాంట్ డైరెక్టర్(ప్రాజెక్ట్) ఎ.కె.బాగ్చి వీటిని ప్రారంభించారు. సీఈఆర్(కార్పొరేట్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ)లో భాగంగా స్టీల్ప్లాంట్ రూ.40 లక్షలు వెచ్చించి బ్యాటరీతో నడిచే ఐదు వాహనాలను కొనుగోలు చేసి కేజీహెచ్కు అందించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగుల రవాణాకు ఉపయోగపడేలా బ్యాటరీ వాహనాలు అందించిన స్టీల్ప్లాంట్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ప్లాంట్ డైరెక్టర్ బాగ్చి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నామని, రోగుల కోసం ఈ వాహనాలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ పి.అశోక్కుమార్ ఉక్కు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ డైరెక్టర్కు జ్ఞాపిక అందజేశారు. అనంతరం కలెక్టర్, స్టీల్ప్లాంట్ డైరెక్టర్ బ్యాటరీ కార్లను నడిపారు. స్టీల్ప్లాంట్ సీజీఎం(సర్వీసెస్) ప్రవీణ్ కుమార్, ఏఎంసీ ప్రిన్సిపాల్ జి.బుచ్చిరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు, ఉక్కు కర్మాగారం ఫారెస్ట్ అండ్ కై ్లమేట్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఈవీఆర్ రాజు తదితరులు పాల్గొన్నారు. రూ.40లక్షలతో కొనుగోలు చేసిన స్టీల్ప్లాంట్ -
ఇసుకకొండకు పోటెత్తిన భక్తులు
డాబాగార్డెన్స్: నగరంలోని ఇసుకకొండపై వెలసిన రమా సహిత సత్యనారాయణస్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. బుద్ధ, వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు జరిపారు. వేకువజాము 4 గంటల నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. నగరం నుంచే గాక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ మండపంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు జరిగాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షించారు. సాయంత్రం వరకు భక్తుల తాకిడి కనిపించింది. భక్తుల సౌకర్యార్థం సర్వదర్శనంతో పాటు రూ.20, రూ.200, రూ.300 టికెట్లు అందుబాటులో ఉంచారు. వేకువజాము 4 గంటలకు అనివెట్టి మండపం వద్ద సామూహిక వ్రతాలు, ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం 7 గంటల నుంచి ఆలయ మండపంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. వేసవి తీవ్రత దృష్ట్యా పెండాల్స్ ఏర్పాటు చేశారు. సత్యదేవుని ఆలయంలో పౌర్ణమి పూజలు -
తిమ్మాపురంలో విజయ్దేవరకొండ సందడి
కొమ్మాది : భీమిలి బీచ్ రోడ్డు తిమ్మాపురంలో ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ సందడి చేశారు. ఆయన నటిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కోసం ఈ నెల 5న నగరానికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఆర్కే బీచ్, యారాడ బీచ్ల్లో ఏర్పాటు చేసిన సెట్ల వద్ద సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. బుధవారం తిమ్మాపురంలోని ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫొటో షూట్ కోసం ఇక్కడకు వచ్చారు. అభిమానులతో ఫొటోలు తీసుకున్నారు. వారితో కాసేపు ముచ్చటించి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ అంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని, ఇక్కడి ప్రకృతి అందాలు, బీచ్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. వచ్చే నెల 3 వరకు నగరంలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొనసాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. -
ల్యాప్టాప్లు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్
ఎంవీపీకాలనీ: ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను విశాఖపట్నం ఎంవీపీ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఎంవీపీ కాలనీ పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ద్వారకా క్రైమ్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కొన్నేళ్లుగా తమిళనాడుకు చెందిన ముఠా ఆంధ్రా, మహారాష్ట్రలలో ల్యాప్టాప్లు, సెల్ఫోన్లను దొంగిలిస్తోందని చెప్పారు. దొంగిలించిన వాటిని తమిళనాడులో విక్రయిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో నమోదైన ఓ కేసు దర్యాప్తులో భాగంగా తమిళనాడుకు చెందిన గణేష్, శంకర్, మంజునాథ్లను విశాఖలోని వెంకోజీపాలెం వద్ద అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి 6 ల్యాప్టాప్లు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందన్నారు. చెడు వ్యసనాలకు బానిసలైన ఈ ముఠా సభ్యులు దొంగతనాలబాట పట్టారన్నారు. ఈ ముఠా 2021 నుంచి విశాఖలో నేరాలు చేస్తోందని, గత 15 రోజుల వ్యవధిలో మూడు చోరీలకు పాల్పడినట్లు వివరించారు. విశాఖ నగరంతోపాటు ఆనందపురం, భీమిలిలో సైతం చోరీలు చేశారని తెలిపారు. సమావేశంలో క్రైమ్ ఎస్ఐ జగదీష్, సిబ్బంది పాల్గొన్నారు. ఆరు ల్యాప్టాప్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం -
పలు రైళ్ల రద్దు
తాటిచెట్లపాలెం: ఈస్ట్కోస్ట్ రైల్వే నౌపడ, పర్లాకిమిడి యార్డ్, పూండి–నౌపడ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న వంతెన పునర్నిర్మాణ పనుల నిమిత్తం ఈ మార్గంలో నడిచ పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు, మరికొన్నింటిని రీ షెడ్యూల్ చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. విశాఖపట్నం–గుణుపూర్–విశాఖపట్నం(08522/08521) పాసింజర్ స్పెషల్స్ ఈ నెల 24, 27వ తేదీల్లోను, పలాస–విశాఖపట్నం–విశాఖపట్నం(07471/07470) పాసింజర్ స్పెషల్స్ ఈ నెల 27వ తేదీన రద్దు చేసినట్లు పేర్కొన్నారు. పలు రైళ్లు రీ షెడ్యూల్ ● ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం–బ్రహ్మపూర్ (18526) ఎక్స్ప్రెస్ సాయంత్రం 4గంటలకు బయల్దేరుతుంది. ● ఈ నెల 27వ తేదీన ఉదయం 4.30 గంటలకు బయల్దేరాల్సిన సికింద్రాబాద్ –షాలిమర్ (07225) సమ్మర్ స్పెషల్ గంట ఆలస్యంగా 5.30 గంటలకు బయల్దేరుతుంది. ● ఈ నెల 26వ తేదీన రాత్రి 11.40 గంటలకు బయల్దేరాల్సిన సికింద్రాబాద్ –సంత్రగచ్చి (07234) సమ్మర్ స్పెషల్ సుమారు 3 గంటలు ఆలస్యంగా 27వ తేదీ తెల్లవారు 2.4గంటలకు బయల్దేరుతుంది. -
టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు
● కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ● పరీక్షలకు సర్వం సిద్ధం చేసిన అధికారులువిశాఖ విద్య : పదో తగరతి, ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఒకేసారి టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతుండటంతో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రతీ రోజూ ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పరీక్షలు జరగనున్నాయి. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీటి సదుపాయంతోపాటు ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలతో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 59 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ఇంటర్మీడియెట్ పరీక్షలకు జిల్లాలో మొదటి సంవత్సరం జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 31,768 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసమని జిల్లాలో 49 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.గంటల వరకు పరీక్ష జరగనుంది. అదే విధంగా సెకండర్ ఇయర్ జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 8,229 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరికి ప్రతీ రోజూ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. వీరి కోసమని జిల్లాలో 10 కేంద్రాలను ఏర్పాటు చేశారు. టెన్త్ పరీక్షలకు 4,836 మంది విద్యార్థులు జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 4,836 మంది విద్యార్థులు హాజరుకానుండగా 20 కేంద్రాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి జూన్ 3 వరకు ప్రతీ రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇదిలా ఉండగా సార్వత్రిక విద్యా విధానంలో(ఓపెన్ స్కూల్) టెన్త్, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు జూన్ 1 నుంచి 8 వరకు ప్రతీ రోజూ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా జిల్లా అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మాస్ కాపీయింగ్కు అడ్డుకట్ట వేసేలా పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. పరీక్ష రాసే గదిలో ఏం జరుగుతుందనేది నేరుగా పరిశీలన చేసేలా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలను ఆర్ఐవో పి.మురళీధర్ నేతృత్వంలోని ముగ్గురు జిల్లా స్థాయి అధికారుల బృందం(డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ) పర్యవేక్షణ చేయనున్నారు. జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి బి.రాధ అబ్జర్వర్గా వ్యవహరించనున్నారు. అదే విధంగా రెండు ప్లైయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ఇందులో ఎస్ఐ లేదా ఏఎస్ఐ, డిప్యూటీ తహసీల్దార్, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే సీనియర్ లెక్చరర్ ఉంటారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి చేశాం పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎటువంటి ఇబ్బంది ఎదురైనా సకాలంలో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చేలా కేంద్రాల సూపరింటెండెంట్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఇంటర్మీడియెట్ బోర్డు అధికారుల ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, జేసీ మయూర్ అశోక్ సూచనలతో వార్షిక పరీక్షల మాదిరే, సప్లిమెంటరీ పరీక్షలను కూడా జిల్లాలో విజయవంతం చేసేలా అంతా సమన్వయంతో పనిచేస్తున్నాం. – పి.మురళీధర్, ఆర్ఐవో, ఉమ్మడి విశాఖ -
గురుకుల విద్యాలయాల్లో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ వాయిదా
కంచరపాలెం : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల/కళాశాలల్లో 2024 – 25 విద్యా సంవత్సరానికి విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా పరిధిలోని ఆరు గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగుల సీట్ల భర్తీ కోసం ఈ నెల 24న నిర్వహించనున్న కౌన్సెలింగ్ వాయిదా వేసినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల జిల్లా సమన్వయ అధికారి ఎస్.రూపవతి ఒక ప్రకటనలో తెలిపారు. 24న శుక్రవారం మేఘాద్రిగెడ్డ గురుకుల పాఠశాలలో జరగాల్సిన స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ సాంకేతిక కారణాల దృష్ట్యా వాయిదా వేసినట్లు ఆమె తెలిపారు. మరింత సమాచారం కోసం 7658945570, 8790356309లో సంప్రదించాలని ఆమె కోరారు. -
సంకీర్తనా సార్వభౌముడు అన్నమయ్య
సీతంపేట: అన్నమాచార్య జయంతి సందర్భంగా శృతిలయ సంస్థ అధ్యక్షుడు వి.ప్రభాకర్ సారథ్యంలో ఇటీవల నిర్వహించిన సంకీర్తనల పోటీల విజేతలకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో గురువారం బహుమతుల ప్రదానం జరిగింది. సింహాచలం దేవస్థానం పురోహితుడు సీతారామాచార్యులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైశాఖ పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రంలో అన్నమయ్య జన్మించారని తెలిపారు. పద కవితా పితామహుడిగా అన్నమయ్య పేరు గాంచి సరళమైన తెలుగు భాషలో వెంకటేశ్వరస్వామిని కీర్తిస్తూ 32 వేల సంకీర్తనలు రచించి, సంకీర్తనా సార్వభౌముడిగా ఖ్యాతి పొందారన్నారు. సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ శృతిలయ సంస్థ ద్వారా చేపడుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీనివాస కల్యాణ ఉత్సవాల గురించి ప్రశంసించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వంకాయల సన్యాసిరాజు, కొణతాల రాజు, ఆధ్యాత్మిక వేత్త ఎం.వి.రాజశేఖర్, పి.రంగనాథ ఆచార్యులు, సంస్థ కార్యదర్శి ఎం.ఎస్.మాధవ్, ప్రోగ్రాం కన్వీనర్ సిహెచ్.వి.సత్యనారాయణ, మేడా మస్తాన్రెడ్డి పాల్గొన్నారు. -
కౌంటింగ్కు కట్టుదిట్టం
● 176 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ● చివరి నిమిషంలో విధుల నిర్వహణ ప్రాంతాల ప్రకటన ● ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తితే వీవీ ప్యాట్ల ఓట్ల లెక్కిస్తాం ● ప్రత్యేకంగా పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ● జిల్లా ఎన్నికల అధికారి మల్లికార్జునసాక్షి, విశాఖపట్నం: ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.మల్లికార్జున స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన అసెంబ్లీ, పార్లమెంట్ కౌంటింగ్ గదులు పక్కపక్కనే ఉండటం వల్ల ఎక్కడా ఈవీఎంలు తారుమారు జరిగే అవకాశం లేదన్నారు. ప్రైవేట్ వ్యక్తులు లేకుండా.. పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులకే విధులు అప్పగించామన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో చివరి నిమిషం వరకు సిబ్బంది ఏ నియోజకవర్గం టేబుల్ వద్ద విధులు నిర్వహిస్తున్నారనే తెలియనివ్వకుండా.. జంబ్లింగ్ పద్ధతిలో కేటాయిస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామన్నారు. ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తితే.. వీవీ ప్యాట్ల ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ వీసీ హాలు నుంచి కలెక్టర్, ఎంసీసీ నోడల్ అధికారి సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఏడీసీ కె.ఎస్.విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ డా.మల్లికార్జున ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పోస్టల్ బ్యాలెట్ పక్కాగా.. పార్లమెంట్ పరిధిలోని పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియను మూడు రౌండ్లలో నిర్వహించనున్నాం. ఇందుకు గానూ రెండు హాళ్లను సిద్ధం చేశాం. 18 టేబుళ్లను కేటాయించాం. 18 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లను, 36 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను, మరొక 18 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించాం. జిల్లాలోని అసెంబ్లీలకు వచ్చే సరికి పార్లమెంట్తో కలిపే అన్ని ఏర్పాట్లు చేశాం. అదనంగా పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి మరొక మూడు రౌండ్లు పార్లమెంట్ పరిధిలో పెరుగుతాయి. అసెంబ్లీల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు గాను ఐదు హాళ్లలో 33 టేబుళ్లు ఏర్పాటు చేసి.. 15 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నాం. ఇందుకు గాను 24 మంది అదనపు ఏఆర్వోలు, 33 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, 57 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 33 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించాం. చివరి నిమిషంలో విధుల కేటాయింపు కౌంటింగ్లో విధుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఇప్పటి వరకూ ఏ అధికారికిగానీ, సిబ్బందికి గానీ.. వారు ఏ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్లో విధులు నిర్వర్తిస్తామన్న విషయం తెలీదు. సంబంధిత అధికారులకు, సిబ్బందికి నిర్ణీత కాలంలో శిక్షణ అందిస్తాం. ఈ నెల 25న తొలి విడత ర్యాండమైజేషన్, జూన్ 2న రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహిస్తాం. లెక్కింపు కేంద్రాల లోపలికి గణన సిబ్బంది, ఆర్వో, ఏఆర్వోలు, ఎన్నికల అబ్జర్వర్తో పాటు కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే కౌంటింగ్ ప్రక్రియలో భాగస్వాములను చేశాం. చివరి నిమిషం వరకూ ఎవరు ఏ టేబుల్ వద్ద ఉంటారో తెలియకుండా జాగ్రత్త పడుతున్నాం. జంబ్లింగ్ పెట్టడానికి ప్రధాన కారణం.. ఎవరు ఏ నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తారో తెలియదు కాబట్టి.. ఎలాంటి ఆరోపణలూ రాకుండా ఉంటాయి. సిబ్బందినంతా ఉదయం 5 గంటలకే కౌంటింగ్ కేంద్రాల వద్దకు రావాలని ఆదేశాలు జారీ చేశాం. కౌంటింగ్ ప్రక్రియ అంతా.. ఒకే చోట కాబట్టి.. ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవు. మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు నిర్వహించాం. నిర్ణీత సమయంలోగా ఫలితాలు ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. నిర్ణీత సమయంలోగా ఫలితాలను వెల్లడించేందుకు అనుగుణంగా ప్రణాళికాయుత చర్యలు చేపడుతున్నాం. ఈవీఎంల లెక్కింపుతో దాదాపు గెలుపు ఎవరిదన్న విషయం ఖరారైపోతుంది. కానీ.. ఐదు వీవీ ప్యాట్ల లెక్కింపు అనంతరం సంబంధిత అధికారి నుంచి ఇంక్సైన్డ్ కాపీ వచ్చిన తర్వాతే పూర్తి స్థాయి ఫలితం ప్రకటిస్తాం. అది ఎంత సమయం పడుతుందన్నది కచ్చితంగాా చెప్పలేం. అయితే నిర్దేశించిన సమయంలోనే ఫలితాలు వెలువరించేందుకు ప్రయత్నిస్తాం. 98 టేబుల్స్.. 140 రౌండ్లు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి ఏయూ పరిధిలో ఏడు హాళ్లు సిద్ధం చేశాం. నియోజకవర్గానికి రెండేసి చొప్పున మొత్తం 98 టేబుళ్లు ఏర్పాటు చేశాం. మొత్తం 140 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఒక్కో టేబుల్కు గానూ కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ని నియమించాం. మూడంచెల భద్రత స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాం. కౌంటింగ్ సమయంలో మూడంచెల విధానంలో భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచాం. కేంద్ర బలగాలతో పాటు సుమారు 500 మంది సివిల్ పోలీసులు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 176 సీసీ కెమెరాలు అమర్చాం. వాటిని మానిటరింగ్ రూమ్కు అనుసంధానం చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నాం. -
సాగర సంరక్షణ సమష్టి బాధ్యత
బీచ్రోడ్డు: సుందరమైన విశాఖ తీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుని.. పరిరక్షించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య సహాయ అధికారి బి.ప్రసాదరావు పిలుపునిచ్చారు. బీచ్ వీధి వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్లో మేము సైతం అనే కార్యక్రమాన్ని గురువారం బీచ్రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ సముద్ర తీర ప్రాంతం ఎంతో సుందరమైందని, ఇది మనకి ప్రకృతి ఇచ్చిన వరం అన్నారు. తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులు దుకాణాలు వద్ద చెత్త సేకరణ బకెట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ స్పూన్లు వినియోగించకూడదన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ఈ సారి విశాఖ మరింత మెరుగైన ర్యాంక్ సాధించేందుకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని అన్నారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజగర్ బి.సత్యనారాయణ, గోవింద్, సంక్షేమ సంఘం సభ్యులు సిహెచ్ రమణ, గిదితురు శ్రీను, తెడ్డు శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఏడీ ఫ్లైఓవర్పై లారీ బోల్తా
గోపాలపట్నం: ఎన్ఏడీ ఫ్లైఓవర్పై పేపర్ బండిల్స్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం, బ్రిడ్జిపైనే లారీ బోల్తా పడటంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివీ.. కోల్కతా నుంచి షీలానగర్కు పేపర్ బండిల్స్ లోడుతో వెళ్తున్న లారీ.. ఎన్ఏడీ ఫ్లైఓవర్పైకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. లారీలో ఉన్న పేపర్ బండిల్స్ రోడ్డుపై పడిపోయాయి. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల నుంచి 3 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఇతర వాహనాల రాకపోకలు లేకపోవడం, లారీ కూడా బ్రిడ్జిపైనే బోల్తా పడటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఈ ప్రమాదంలో క్లీనర్ ఆలీకి స్వల్ప గాయాలయ్యాయి. కంచరపాలెం ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు, ఎస్ఐ బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బోల్తా పడిన లారీలో ఉన్న 60 బండిల్స్ను మరో లారీలోకి క్రేన్ సాయంతో లోడింగ్ చేసి షీలానగర్ తరలించారు. లారీని బ్రిడ్జి పై నుంచి తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. బ్రిడ్జిపైకి ఎక్కి రోటరీలో వెళ్లే సమయంలో డ్రైవర్ నిద్రమత్తు వల్ల లారీని అదుపు చేయలేక బోల్తా పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎయిర్పోర్టు పోలీసులు ప్రమాద వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది. తప్పిన పెనుప్రమాదం పేపర్ బండిల్స్ను మరో లారీలో తరలించిన ట్రాఫిక్ పోలీసులు -
ఏటీఎం కేంద్రం వద్ద ఉక్కు ఉద్యోగికి టోకరా
అగనంపూడి : ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్న క్రమంలో ఏటీఎం కేంద్రాల వద్ద కూడా మోసగాళ్లు చేతి వాటం చూపించి టోకరా వేస్తున్నారు. అగనంపూడిలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం కేంద్రం వద్ద ఉక్కు ఉద్యోగికి టోకరా వేసిన సంఘటనపై దువ్వాడ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. అగనంపూడి పెదమడక నిర్వాసితకాలనీలో నివసిస్తున్న ఉక్కు ఉద్యోగి ఎన్.బి.నాయక్ బుధవారం రాత్రి 8 గంటలకు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో రూ.5 వేలు డ్రా చేశారు. తర్వాత మరో రూ.3 వేలు తీసేందుకు ప్రయత్నించగా డబ్బులు రాలేదు. యాక్సిస్ బ్యాంక్ కార్డుతో డబ్బులు రాకపోవడంతో వెనుకనున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తికి కెనరా బ్యాంక్ కార్డు ఇవ్వడంతో ఆయన కూడా ప్రయత్నించాడు. అయినప్పటికీ డబ్బులు రాకపోవడంతో నాయక్ ఇంటికి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం ఏ షిఫ్ట్ విధులకు వెళ్లి ఫోన్లో మెసేజ్లు చూడగా బుధవారం రాత్రి రూ.25వేలు, గురువారం ఉదయం రూ.50వేలు నగదు డ్రా చేసినట్టు మెసేజ్లు చూసి అవాక్కయ్యారు. సహచర ఉద్యోగి సహకారంతో ఏటీఎం కార్డును బ్లాక్ చేసి తర్వాత దువ్వాడ సీఐ ఎర్రంనాయుడుకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏటీఎం కేంద్రానికి చేరుకొని ఆరా తీశారు. అయితే ఏటీఎం కేంద్రంలోని భద్రతా సిబ్బందిని ఇటీవలే తొలగించారని, అలాగే సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని తెలిసింది. ఏటీఎం కేంద్రాల వద్ద భద్రత డొల్లగా ఉండడం వల్ల ఇటువంటి మోసాలు తరచూ జరుగుతున్నాయని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఐ ఎర్రంనాయుడు కోరారు. -
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని ఉంది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఈ వాయుగుండం అదే దిశలో పయనిస్తూ 25 సాయంత్రం ఈశాన్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలోకి చేరుకోనుంది. ఆపై అది తుపానుగా మారే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతం నుంచి దారి మళ్లి బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశం ఉన్నందున దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై నామమాత్రంగానే ఉండనుంది. ఫలితంగా రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ, శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ, శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా మారుతుందని, అందువల్ల మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. నేడు 26 మండలాల్లో వడగాడ్పులు..రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా మళ్లీ అక్కడక్కడ వడగాడ్పులు వీయనున్నాయి. గురువారం శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 5, పార్వతీపురం మన్యం 11, అల్లూరి సీతారామరాజు 1 (కూనవరం) వెరసి 26 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 5, పార్వతీపురం మన్యం 7 మండలాల్లోనూ వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. -
ఇంటర్ విద్యార్థులకు తత్కాల్ అవకాశం
విశాఖ విద్య: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు తత్కాల్ అవకాశం కల్పించినట్లు ఆర్ఐవో పి.మురళీధర్ తెలిపారు. ఈ నెల 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతున్నాయన్నారు. అనివార్య కారణాలతో ఫీజు చెల్లించలేని విద్యార్థులు తత్కాల్ విధానంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల్లోపు నెట్ బ్యాకింగ్ ద్వారా ఫీజు చెల్లించినట్లయితే పరీక్షలకు అనుమతిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా కాలేజీల ప్రిన్సిపాళ్లు తగిన చొరవ తీసుకోవాలని సూచించారు. ‘దయాల్బాగ్’లో ఆన్లైన్ కోర్సులు ఆరిలోవ: విశాలాక్షినగర్, దయాల్నగర్లోని దయాల్బాగ్ విద్యా సంస్థలో బి.కాం(ఆనర్స్), బీబీఏ కోర్సులను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్లు సెంటర్ ఇన్చార్జి దక్షణమూర్తి తెలిపారు. ఇందులో చేరాలంటే ఇంటర్లో ఉత్తీర్ణత సాధించాలని, వయోపరిమితి లేదన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 25లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వీటితో పాటు రెగ్యులర్ కోర్సులకు(ఆఫ్లైన్) కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసిన వారు ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ కోర్సు(డిప్లమో)కు, ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన వారు బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ కోర్సు(అగ్రికల్చర్ టెక్నాలజీ)కు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఈ రెండు కోర్సులు మూడేళ్ల కాలపరిమితితో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు దయాల్బాగ్ నగర్లోని డీఈఈ సెంటర్/99633 40611కు సంప్రదించాలన్నారు.నేడు అంతరాలయ దర్శనం రద్దు సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం అంతరాలయ దర్శనం రద్దు చేశామని సింహాచలం దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. రూ.300 టికెట్టు తీసుకునే భక్తులకు కూడా నీలాద్రిగుమ్మం వద్ద నుంచి లఘు దర్శనం ఉంటుందని, భక్తులంతా ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. బైక్లను గజపతి సత్రం వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో మాత్రమే నిలపాలన్నారు. -
నమో నారసింహ
● సింహగిరిపై వైభవంగా శ్రీనృసింహ హోమం ● తొలిసారిగా ఆలయ ఉత్తర రాజగోపురం ఎదురుగా భారీ ఎత్తున నిర్వహణ ● స్వామి సేవలో తరించిన ఉభయదాతలుసింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం, నృసింహ జయంతి సందర్భంగా బుధవారం సింహగిరిపై నృసింహ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలిసారిగా ఆలయ ఉత్తర రాజగోపురం ఎదురుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. నృసింహ నామస్మరణలో భక్తులు మునిగి తేలారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా చక్రపెరుమాళ్, స్వామి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేర్వేరు పల్లకీల్లో.. వేద మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల మధ్య ఆలయం నుంచి ఊరేగింపుగా హోమ ప్రాంగణానికి తీసుకొచ్చారు. స్వామి ఉత్సవమూర్తులను వేదికపైన, చక్రపెరుమాళ్లను హోమగుండం వద్ద అధిష్టింపజేశారు. యాగంలో పాల్గొన్న ఉభయదాతలకు కంకణధారణ చేసి ఆశీనింపజేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కలశారాధన, అగ్నికార్యం చేశారు. అనంతరం నృసింహ హోమాన్ని విశేషంగా నిర్వహించారు. యాగంలో పాల్గొన్న ఉభయదాతలందరిచేత స్వామి అష్టోత్తరనామావళిని పఠింపజేశారు. తర్వాత పూర్ణాహుతి, కుంభప్రోక్షణ కార్యక్రమాన్ని విశేషంగా చేపట్టారు. హోమంలో ఉంచిన ప్రధాన కలశాన్ని ప్రధానార్చకుడు గొడవరి శ్రీనివాసాచార్యులు శిరస్సుపై పెట్టుకుని తిరువీధిగా ఆలయంలోకి తీసుకెళ్లి.. స్వామి మూలవిరాట్కి సమర్పించారు. అనంతరం ఆ జలాలను యజ్ఞశాలకు తీసుకొచ్చి భక్తులపై చల్లారు. దేవస్థానం తరపున ఉభయదాతలకు స్వామి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. ప్రిలిగ్రిమ్స్ సెంటర్లో భోజనం సదుపాయం కల్పించారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు దంపతులు, ట్రస్ట్బోర్డు మాజీ సభ్యులు పాల్గొన్నారు. దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధాన అర్చకులు ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, పారాయణదారులు, వేదపండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
వైభవుడికి ఊంజల్ సేవ
మురళీనగర్: కప్పరాడ ఎన్జీజీవోస్ కాలనీలో కొలువైన వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా వైభవుడికి ఊంజల్ సేవ నిర్వహించారు. ఉదయం 5 గంటలకు స్వామికి సుప్రభాత సేవ, ప్రాతఃకాలార్చన, బాలభోగం, మంగళాశాసనం, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్గ్వరుణ, రక్షాసూత్రబంధన, మృత్సంగ్రహణం, మహానివేదన చేపట్టారు. మంగళవారం రాత్రి ఊంజల్ సేవ నిర్వహించి, బుధవారం ఉదయం తిరువీధి మహోత్సవం జరిపించారు. గురువారం ఉదయం 6 గంటలకు పౌర్ణమి సందర్భంగా స్వామికి పంచామృతాభిషేకం నిర్వహిస్తామని ఈవో బండారు ప్రసాద్ తెలిపారు. -
కౌంటింగ్కు పక్కాగా ఏర్పాట్లు
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జునమహారాణిపేట: ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో వచ్చే నెల 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రిటర్నింగ్ అధికారులు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి, కౌంటింగ్ ఏర్పాట్ల గురించి వివరించాలని, తద్వారా వారిలో ఉండే అపోహలు తొలగించాలని సూచించారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద సీసీ కెమెరాలు, బారికేడ్లు, కౌంటింగ్ హాల్లో టేబుళ్ల ఏర్పాటు, రాజకీయ పార్టీల ఏజెంట్లకు గుర్తింపు కార్డుల మంజూరు గురించి రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 31వ తేదీ సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ ఏర్పాటు, సెల్ ఫోన్ భద్రపరచు సెంటర్, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ విధుల కోసం సిబ్బంది మొదటి విడత రాండమైజేషన్ ఈ నెల 25న, రెండవ విడత రాండమైజేషన్ జూన్ 2న నిర్వహించనున్నట్టు తెలిపారు. కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈ నెల 27న శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. కౌంటింగ్ సమయానికి ఒక నిమిషం ముందు వరకు వచ్చే పోస్టల్ బ్యాలెట్లను స్వీకరించాలని ఆదేశించారు. పలు అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జీవీఎంసీ ఏడీసీ కె.ఎస్.విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారులు హుస్సేన్ సాహెబ్, కె.భాస్కర్ రెడ్డి, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్కు జాతీయస్థాయి అవార్డు
సీతమ్మధార: మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కు జాతీయస్థాయి అవార్డు లభించింది. ముంబైలో జరిగిన ‘భారత రత్న సహకారిత సమ్మాన్–2024’లో బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.రామకృష్ణంరాజు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.మురళీకృష్ణ వర్మ ఈ అవార్డును అందుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ సతీష్ మరాఠే, డైరెక్టర్ జనరల్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఐటీ,గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుమణేశ్ జోషి, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, క్రెడిట్ సొసైటీ, ఐకానిక్ ఇండస్ట్రీ లీడింగ్ స్పీకర్ లక్ష్మి దాస్,నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, క్రెడిట్ సొసైటీస్, ఐకానిక్ ఇండస్ట్రీ లీడింగ్ స్పీకర్స్ అజయ్ బ్రహ్మ హెచ్ తదితరుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణం రాజు, మురళీకృష్ణ వర్మ మాట్లాడుతూ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో తుని, అనకాపల్లి శాఖలను ప్రారంభించనున్నట్టు బ్యాంక్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.రామకృష్ణంరాజు, జనరల్ మేనేజర్ ఎన్.ఎన్. సత్యనారాయణ తెలిపారు. -
పన్ను మోసం.. చెరో సగం!
అనగనగా.. ఒక ఫేక్ కంపెనీ.. ఆ ఫేక్ కంపెనీకి ఒక ఫేక్ ఓనర్.. ఆ ఫేక్ ఓనర్.. ఆ ఫేక్ కంపెనీ పేరుతో వ్యాపార లావాదేవీలు చేసినట్లు ఫేక్ ఇన్వాయిస్లు సృష్టిస్తాడు. వాటిని జీఎస్టీ కార్యాలయంలో సమర్పించి.. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను కొట్టేస్తాడు. అయితే ఆ ఫేక్ కంపెనీ ఓనర్కి ఈ సలహా ఇచ్చింది మాత్రం.. జీఎస్టీ ఉద్యోగే.! ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాగానే ఆ ఫేక్ ఓనర్.. ఈ ఒరిజినల్ ఉద్యోగి కలిసి చెరో సగం పంచేసుకుంటారు. ఇది కథ కాదు.. జీఎస్టీ పరిధిలో నిత్యం జరిగే మోసం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ కంపెనీలను గుర్తిస్తున్నా.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను మాత్రం ఏదో ఒక రూపంలో కేటుగాళ్లు మోసం చేస్తూనే ఉన్నారు. అయితే వీరికి సాయం చేస్తోంది స్టేట్, సెంట్రల్ జీఎస్టీ కార్యాలయాల్లోని సిబ్బంది కావడం గమనించదగ్గ విషయం. అందుకే ఇంటి దొంగని ఈశ్వరుడైనాపట్టుకోలేడంటారు. సాక్షి, విశాఖపట్నం: ఇంటర్ చదివి జులాయిగా తిరిగే ఓ యువకుడు రెండేళ్ల కిందట చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో పని చేసి.. జీఎస్టీలో లొసుగులను పసిగట్టాడు. తర్వాత వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ మొదలైన నగరాల్లో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 20 ఫేక్ కంపెనీలు సృష్టించి పన్ను మోసాలకు పాల్పడేందుకు ఎత్తుగడ వేశాడు. 20 నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి బిల్లులు జనరేట్ చేశాడు. ఈ సంస్థల నుంచి దేశంలోని వివిధ నగరాల్లోని కంపెనీలకు సరకు లావాదేవీలు జరిపినట్లు రూ.265 కోట్ల మేర నకిలీ ఇన్వాయిస్లు రూపొందించాడు. వీటిని ఉపయోగించుకుని రూ.31 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని సొంత చేసుకునేందుకు ప్రయత్నించాడు. అప్పటికే 10 కోట్ల వరకు క్రెడిట్ చేసుకున్న యువకుడి వ్యవహారం చివరికి జీఎస్టీ విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలైంది. రూ.200 కోట్లకు పైగా రికవరీ.. అయినా.. నకిలీ ఇన్వాయిస్ల పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఫేక్ కంపెనీల పేరుతో పన్నుల చెల్లింపును ఎగవేసేలా వ్యూహాలను అమలు పరుస్తున్నారు. కొన్ని కంపెనీలు.. చిన్న చిన్న తప్పులతో దొరికిపోతుంటే.. చాలా మంది వ్యాపారులు మాత్రం దర్జాగా ఇన్పుట్ క్రెడిట్ని తమ ఖాతాల్లోకి జమ చేసుకుంటున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ విశాఖపట్నం జోనల్ యూనిట్ పరిధిలో దాదాపు 350కి పైగా నకిలీ కంపెనీల గుట్టురట్టు చేసి రూ.200 కోట్లకు పైగానే రికవరీ చేసింది. అయినా ఫేక్ కంపెనీలు నకిలీ ఇన్వాయిస్లతో రెచ్చిపోతున్నాయి. రాష్ట్ర పన్నుల శాఖలోనూ... కేవలం సెంట్రల్ జీఎస్టీ పరిధిలోనే కాకుండా.. రాష్ట్ర పన్నుల శాఖ పరిధిలోనూ ఫేక్ ఇన్వాయిస్ల పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తుక్కు పరిశ్రమలు, సిమెంట్, స్టీల్ వ్యాపారులు, సిగరెట్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విక్రయ వ్యాపారులు, వస్త్ర దుకాణాలు.. ఇలా చాలా వ్యాపారాల పేరుతో నకిలీ కంపెనీలున్నాయి. వాటిని కనిపెట్టడం పన్నుల శాఖ అధికారులకు కత్తిమీద సాముగా మారింది. వందల కోట్ల రూపాయలు కాజేస్తున్నా.. వారిని పట్టుకోలేకపోతున్నారు. ప్రతి బిల్లుని నిశితంగా పరిశీలించాల్సిన రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ పరిధిలోని అధికారులు, సిబ్బంది.. తూతూ మంత్రంగా పరిశీలిస్తుండటంతో మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సిబ్బంది చేతివాటంతోనే.. స్టేట్ జీఎస్టీ విశాఖ డివిజన్ పరిధిలోని సర్కిళ్లతో పాటు ప్రధాన కార్యాలయంలోని కొందరు సిబ్బంది ఫేక్ కంపెనీలు సృష్టిస్తున్న వ్యాపారులతో చేతులు కలుపుతున్నట్లు సమాచారం. ఫేక్ ఇన్వాయిస్లను పక్కాగా ఎలా తయారు చేయాలి? వాటిని ఏ సమయంలో సమర్పిస్తే.. ఎవరికీ అనుమానం రాకుండా పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ జరగదు.. ఎలా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని సొంతం చేసుకోవచ్చు.. ఇలా సమగ్ర వివరాలతో స్కెచ్ వేసి.. తూ.చ తప్పకుండా అమలయ్యేటట్లుగా ప్లాన్ చేస్తున్నారు. ఫైల్స్ తమ దగ్గర నుంచే వెళ్లేలా చూసుకుని.. ఎవరికీ అనుమానం రాకుండా ఇన్పుట్ని కొట్టేస్తూ.. చెరి సగం పంచేసుకుంటున్నారు. స్టేట్ ట్యాక్స్ కార్యాలయంలోని కొందరు సిబ్బందితో పాటు సూర్యాబాగ్, సిరిపురం, ద్వారకానగర్, డాబాగార్డెన్స్, కురుపాం మార్కెట్, గాజువాక, అనకాపల్లి, చినవాల్తేరు సర్కిళ్ల పరిధిలో ఈ తరహా నకిలీ ఇన్వాయిస్లు ఎక్కువగా వస్తున్నాయి. వీరికి మోసగాళ్లకు ఆయా సర్కిళ్ల పరిధిలో కొందరు ఉద్యోగులు సహకారం అందిస్తూ.. ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్నారు. దీని వల్ల జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నా.. ఇన్పుట్ క్రెడిట్ కుంభకోణంతో ఖజానాకు చిల్లు పెడుతున్నారు. ఉన్నతాధికారులెవ్వరూ పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఫేక్ కంపెనీలతో నకిలీ ఇన్వాయిస్ల సృష్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సొంతం చేసుకునేందుకు వ్యాపారుల కుయుక్తులు సహకరిస్తున్న జీఎస్టీ సిబ్బంది ఇన్పుట్ వచ్చిన వెంటనే చెరో సగం పంచుకుంటున్న వైనం విశాఖ డివిజన్ పరిధిలో రూ.కోట్లలో మోసాలు -
నూతిలో ఈతకొడుతూ వ్యక్తి మృతి
దత్తిరాజేరు: విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కుచ్చరపాటిశివకుమార్ (60) ప్రమాదవశాత్తూ నూతిలో ఈతకొడుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినకాదలో జరుగుతున్న గ్రామదేవత పండగకు బంధువుల ఇంటికి శివకుమార్ వచ్చాడు. గ్రామ సమీపంలోని రాజులపేట వద్ద ఉన్న బావిలో మంగళవారం సాయంత్రం దిగి ఈత కొడుతుండగా.. ఊబిలో కాళ్లు కూరుకుపోయి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు భార్గవ్రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శిరీష తెలిపారు. -
రూ.1.22 కోట్లతో వైద్య పరికరాలు
మహారాణిపేట: రోగులకు మెరుగైన, మరింత నాణ్యమైన వైద్య సేవలందించేలా ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్సార్)లో భాగంగా హెచ్పీసీఎల్ సంస్థ రూ.1.22 కోట్ల సాయాన్ని వైద్యశాలకు అందించింది. ఈ మొత్తంతో సమకూర్చిన ఆధునిక వైద్య పరికరాలను కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించి, అందుబాటులోకి తీసుకొచ్చారు. నిపుణుల సూచనల మేరకు ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫాకో మిషన్, ల్యూమిరా 300 స్టాండర్డ్ మైక్రోస్కోప్లు, హంఫెరీ విజువల్ ఫీల్డ్ అనలైజర్ తదితర పరికరాలను కొనుగోలు చేశారు. వైద్య పరికరాల పనితీరును కలెక్టర్ పరిశీలించారు. వాటి ప్రయోజనాలను, వినియోగ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.మీనాక్షి, ఆప్తమాలజీ విభాగాధిపతి డాక్టర్ టి.జ్యోతిర్మయి, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బుచ్చిరాజు, హెచ్పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.రతన్ రాజ్, చీఫ్ జనరల్ మేనేజర్ జి.కిరణ్ కుమార్, కేజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, వైద్యాధికారులు పాల్గొన్నారు.ప్రాంతీయ కంటి ఆస్పత్రికి హెచ్పీసీఎల్ వితరణ
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్కే రక్షణ లేదు..
- Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- ‘ఈజీ’ ఐపాస్.. టీజీ ఐపాస్కు భారీగా మార్పులు!
- తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement