-
గొర్రెల మందపై వీధి కుక్కల దాడి
ఆలూరు రూరల్: వీధి కుక్కల దాడిలో 10 గొర్రెలు మృతి చెందాయి. 6 గొర్రెలు గాయపడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం మండలంలోని పెద్దహోతూరు గ్రామ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. గొర్రెల కాపరి ఉపేంద్ర తెలిపిన వివరాలు.. గ్రామ సమీపంలోని పొలంలో 150 గొర్రెల మందను నిలిపారు. మధ్యాహ్నం తాగునీరు తెచ్చేందుకు ఉపేంద్ర గ్రామానికి వచ్చాడు. ఈ సమయంలో 5 వీధి కుక్కలు గొర్రెల మందపై దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో 10 గొర్రెలు మృతిచెందగా, 6 గొర్రెలు గాయపడ్డాయి. దాదాపు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కాపరి ఉపేంద్ర కోరాడు. కర్ణాటక మద్యం స్వాధీనం నందవరం: అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తిమ్మయ్య తెలిపారు. మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్లో ఎస్ఐ మాట్లాడుతూ.. నందవరం మండల పరిధి లోని నాగలదిన్నె పోలీసు చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించామన్నారు. ఎమ్మిగనూరు మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన గొల్ల రామకృష్ణ కర్ణాటక మద్యాన్ని బైక్పై తలిరలిస్తుడంగా నాగలదిన్నె బ్రిడ్జి వద్ద పట్టుకున్నట్లు వివరించారు. కర్ణాటక మద్యం 576 జాన్స్ ఒరిజినల్ చాయిస్ విస్కీ 90 ఎంఎల్ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, బైక్ను సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమ మద్యం, పేకాట, మాట్కా, గూట్క, అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
కల నెరవేరి..వైద్య విద్య దరి చేరి
● నంద్యాలలో రూ. 475 కోట్లతో వైద్య కళాశాల, బోధనాసుపత్రి ● 50.93 ఎకరాల్లో నిర్మాణం ● ఆధునిక వసతులతో తరగతి గదులు, ల్యాబ్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నిర్మాణం ● తొలి ఏడాది 150 మందికి సీట్లు నంద్యాల టౌన్: వైద్య విద్య డిమాండ్కు తగినట్టుగా రాష్ట్రంలో వైద్య కళాశాలలు లేకపోవటంతో ఎంబీబీఎస్ చదివేందుకు ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. అయితే అక్కడ చదివితే పీజీ ప్రవేశాల్లో నాన్–లోకల్గా పరిగణిస్తున్నారు. ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర విద్యార్థులకు ఊరట కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూరదష్టితో ఆలోచించి ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగా నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్య తరగతులు ప్రారంభమయ్యాయి. కార్పొరేట్ కళాశాలకు దీటుగా సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైద్య కళాశాల అందుబాటులోకి వస్తుండటంతో పేదలకు మెరుగైన వైద్య సేవలు లభించడంతో పాటు పరోక్షంగా, ప్రత్యేక్షంగా వందల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. జాతీయ మెడికల్ కమిషన్ అనుమతులతో గత ఏడాది సెప్టెంబర్లో దీనిని ప్రారంభించి, 2023–24 విద్యా సంవత్సర అడ్మిషన్లు చేపట్టారు. దీంతో ఏటా కొత్తగా 150 మంది ఎంబీబీఎస్ చేసే అవకాశం కల్పించగా వీరిలో నంద్యాల జిల్లాకు చెందిన 17 మంది విద్యార్ధులు కళాశాలలో సీటు సాధించగలిగారు. వీరంతా అన్ని వసతులతో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. వైద్యవిద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ప్రభుత్వ సంకల్పానికి నంద్యాల కళాశాల నిర్మాణానికి కొందరు అడుగడుగునా అవాంతరాలు సృష్టించారు. కోర్డుకు వెళ్లి కళాశాల నిర్మాణంపై స్టే తెచ్చారు. దీంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్య కళాశాల ఏర్పాటు కొంతకాలం సందిగ్ధంలో పడింది. ఎట్టకేలకు హైకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వం పక్షాన నిలిచి రాష్ట్ర ప్రజలు, విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న వైద్య కళాశాల నిర్మాణం చేపట్టవచ్చని ఆదేశాలు జారీ చేయటంతో ప్రభుత్వం పై బురద జల్లుదామనే వారి ఆటకట్టించినట్లైంది. 50.93 ఎకరాల విస్తీర్ణంలో.. నంద్యాల మెడికల్ కళాశాల భవనం, బోధనాసుపత్రి భవనాలను ప్రభుత్వం 50.93 ఎకరాల్లో 11.84 లక్షల చదరపు అడుగులలో నిర్మించింది. ఇందు కోసం ప్రభుత్వం రూ.475 కోట్ల నిధులను కేటాయించింది. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు అన్ని అధునాత వసతులు కల్పించేలా జీ ప్లస్ 3 ఫ్లోర్లతో భవనాన్ని నిర్మించారు. ఇందులో 3 మ్యూజియమ్స్, 8 టీచింగ్ గదులు, 8 లేబోరేటరీలు, 2 ఎగ్జామినేషన్ హాళ్లు, 4 లెక్చరర్ హాళ్లు ఉన్నాయి. రెసిడెన్షియల్, యూజీ హాస్టళ్లు, స్టాఫ్ అకామిడేషన్, వర్కింగ్ స్టాఫ్, నర్సెస్ రూమ్స్, గెస్ట్ హౌస్, స్టూడెంట్ నర్సెస్ హాస్టళ్లు, నర్సింగ్ కాలేజీ భవనం ఉంటుంది. హాస్టల్లో డైనింగ్ హాల్, సెంట్రల్ కిచెన్, లాండ్రీ, సెంట్రల్ డ్రగ్ స్టోర్, బయోమెడికల్ వేస్ట్ రూమ్ ఏర్పాటయ్యాయి. పూర్తి స్థాయి విద్యార్థులతో మొదటి సంవత్సరం వైద్య విద్య తరగతులు విజయవంతంగా సాగుతున్నాయి. నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలచరిత్రలో నిలిచిపోయేలా.. కాలంతో పోటీ పడి ఏడాది సమయంలోనే కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసి నంద్యాల వాసుల కలలు నిజం చేస్తు చరిత్రలో నిలిచిపోయేలా ముఖ్య మంత్రి జగన్ మోహన్రెడ్డి చేతుల మీదుగా గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభమైంది. వైద్యం, వైద్య విద్య పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసున్న విధానాలు చూసి ఓర్వలేని కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వానికి మచ్చతెచ్చేలా ప్రయత్నం చేసి కళాశాల నిర్మాణంలో ఎన్ని ప్రతిబంధకాలు సృష్టించినా స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి అహర్నిశలు శ్రమించి అధికారులతో మమేకమై నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి ఎనలేని కృషి చేశారు. -
సొంత జిల్లాలోనే అవకాశం వచ్చింది
నేను, మా అక్క డాక్టర్ కావాలన్నది మా నాన్నగారి ఆశయం. అక్కకు విజయవాడ సిద్దార్థ ప్రభుత్వ వైద్య కళాశాల సీటు వచ్చింది. ఎంత కష్టపడి చదివినా ర్యాంక్ ఆధారంగా సీటు ఇతర రాష్ట్రాల్లోనో, దూర ప్రాంతాల్లోనో వస్తుందమోనని నాకు భయమేసింది. హాస్టల్ ఇబ్బందులు, రవాణా కష్టాలు లేకుండా నంద్యాలోనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు దక్కింది. పుట్టిన ఊరిలోనే వైద్య విద్య అభ్యసించడం ఆనందంగా వుంది. ఇక్కడ మంచి సౌకర్యాలు ఉన్నాయి. – లక్ష్మి హేమలత రెడ్డి, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం, నంద్యాల -
థ్యాంక్యూ జగనన్న
మా నాన్న వ్యవసాయం చేస్తూ నన్నుచదివించారు. నంద్యాలలో మెడికల్ కాలేజి లేకపోవటంతో ఇంటికి దూరంగా వుండి ఇంకెక్కడో మెడిసిన్ చదవాలి అనుకునేవాడిని. వైద్య విద్యకు ప్రాధాన్యం ఇచ్చి కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించారు. భవనాలు, తరగతి గదులు, ల్యాబ్ చూసి ఆశ్చర్య పోయాను. ప్రైవేటు కళాశాలలకు దీటుగా దీనిని తీర్చిదిద్దారు. విద్యాభ్యాసానికి మంచి వాతావరణం ఉంది. థ్యాంక్యూ సీఎం సార్. – ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం, నంద్యాల ● -
భక్తజన సంద్రంగా మహానంది
మహానంది: క్షేత్రం భక్తుల సందడి కొనసాగుతోం. సెలవు రోజులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. సాధారణ, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం క్యూలైన్ల ద్వారా భక్తులు శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు చేపట్టారు. అభిషేకం, మహదాశీర్వచనం ఆర్జిత సేవల ద్వారా భక్తులు వేచి ఉండి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా దర్శనం కొనసాగింది. సాధారణ, ఉచిత దర్శనానికి సుమారు రెండు గంటల పాటు సమయం పట్టింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఈఓ కాపు చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఏఈఓలు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు కోదండరామాలయం, వినాయకనంది, గరుడనంది ఆలయాలను సందర్శించారు. ఓంకారంలో భక్తుల సందడి బండిఆత్మకూరు మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓంకారం ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల భక్తులు ఆలయానికి చేరుకుని శ్రీ గంగ, ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వరస్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం మెట్ల మార్గం ద్వారా భక్తులు కొండపైకి చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించి పూజలు చేశారు. కాశిరెడ్డినాయన అన్నప్రసాద వితరణ కేంద్రం వద్ద అన్నప్రసాదాలు స్వీకరించారు. -
రమణీయం..రథోత్సవం
ఆళ్లగడ్డ: భక్తుల గోవింద నామస్మరణలు.. వేదపండితుల మంత్రోచ్చారణలు.. డప్పుల వాయిద్యాల మధ్య శ్రీ జ్వాలా నరసింహుడి రథోత్సవం నేత్ర పర్వంగా కొనసాగింది. అహోబిలేశుడి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజు మంగళవారం ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీ జ్వాలా నరసింహస్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా నిత్యపూజల్లో భాగంగా ఉత్సవమూర్తులైన జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు వేద పండితుల ఆధ్వర్యంలో అభిషేకం, తిరుమంజనం నిర్వహించి నూతన పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలతో ముస్తాబు చేశారు. అనంతరం వివిధ పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామి అమ్మవార్లను ఉంచి రథోత్సవాన్ని ప్రారంభించారు. దేవస్థాన మాడ వీధుల్లో రథోత్సవం కనుల పండువగా సాగింది. దిగువలో ప్రహ్లాదవరదుని వైభవం స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను దేవాలయం ఎదురుగా యాగశాలలో కొలువుంచి అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య స్వాతి, సుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
సేద్యానికి బలిమి.. రైతుకు చెలిమి
ఎమ్మిగనూరు: సంప్రదాయ సేద్యానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ బనవాసి ‘కృషి విజ్ఞానకేంద్రం వ్యవసాయంలో వినూత్న అడుగులు వేస్తోంది. జిల్లాలోని వ్యవసాయ నిపుణులతో కలసి మెరుగైన వంగడాలు సృష్టిస్తూ వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు సమష్టిగా‘ కృషి’ చేస్తున్నారు. ఎమ్మిగనూరు మండలం బసవాసి వద్ద ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధన మండలి సంయుక్త ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని బనవాసిలో 2010 అక్టోబర్ 31న స్థాపించారు. ఈ కేవీకేలో ఏడుగురు శాస్త్రవేత్తలు, 9 మంది బోధనేతర సిబ్బంది సేవలందిస్తున్నారు. సస్య రక్షణ, సస్య ఉత్పత్తి, విస్తరణ, పశు విజ్ఞానం, ఉద్యాన విభాగం, గృహ విజ్ఞాన విభాగ శాస్త్రవేత్తలు, కార్యక్రమ సమస్వయకర్త రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. రైతులకు మెరుగైన సూచనలు చేస్తూ.. నూతన వంగడాలు సృష్టిస్తూ బనవాసి కేవీకే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. అందుకు ప్రతిఫలంగా ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాల యం 2018–19 సంవత్సరానికి రాష్ట్రస్థాయి ఉత్తమ పరిశోధన కేంద్రంగా ఎంపిక చేసింది. అలాగే భారత వ్యవసాయ పరిశోధన మండలి ద్వారా కేవీకే ఆరు ప్రశంసా పత్రాలను అందుకుంది. సాంకేతిక పరిజ్ఞానంతో రైతుకు చేరువై.. ● కేవీకే గత పదేళ్లలో 11 పంటలలో 35 నూతన వంగడాలను రైతులకు పరిచయం చేసి దాదాపు దత్తత గ్రామాలలో 5,954 హెక్టార్లతోపాటు జిల్లాలో 2.0 లక్షల హెక్టార్లలో వాటిని పండించే విధంగా కృషి చేయడం జరిగింది. ● పత్తిలో గులాబీరంగు, పురు నివారణకు, మిరపలో వైరస్ తెగుళ్ల నివారణకు, రసం పీల్చే పురుగు నివారణకు సమగ్ర సస్య రక్షణా విధానాలను దాదాపు 20,000 హెక్టార్లలో అవలంభించే విధంగా రైతులను చైతన్య పర్చింది. ● మూడు రైతు సహకార సంఘాలను ఏర్పాటు చేసి వాటి బలోపేతానికి కృషి చేస్తోంది. 32 వేల మంది రైతుల డేటా బేస్ ఏర్పాటు చేసి వారికి నిత్యం వ్యవసాయ అనుచర సమాచారాన్ని సంక్షిప్త సందేశాల ద్వారా పంపుతోంది. ● మూడు మొబైల్ ఆప్లను తయారు చేసి దాదాపు 15 వేల మంది రైతులు వినియోగించుకునేలా శాస్త్రవేత్తలు కృషి చేశారు. ● 17 మందిని ఔత్సాహికులుగా తయారు చేసి వారికి స్వయం ఉపాధి కల్పించడం, 22 మంది రైతులను విత్తనోత్పత్తిదారులుగా మార్చేశారు. ● సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతు లు పండించే పంటలకు సేంద్రియ ఉత్పత్తులుగా ధ్రువీకరణ పత్రాలను అందివ్వడం జరుగుతోంది. ● పదేళ్లలోనే 223 లక్షల విలువైన వివధ రకాల ప్రాజెక్టులను అమలు పరచి వాటి ఫలితాలను రైతులకు అందివ్వడం జరిగింది. ● 12 వాట్సాప్ గ్రూపుల ద్వారా దాదాపు 5 వేల మంది రైతులకు ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన సమాచారాన్ని ప్రతి రోజు అందిస్తున్నారు. ● కేవీకే పరిధిలో తరచూ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నారు. కేవీకే ప్రధాన ఉద్దేశం క్షేత్ర స్థాయి, ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలను నిర్వహించడం, రైతులకు, మహిళలకు, గ్రామీణ యువతకు, విస్తరణాధికారులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం. నాణ్యమైన విత్తనోత్పత్తి చేపట్టి రైతులకందించడం, జ్ఞాన, వనరుల కేంద్రంగా పని చేయడం, దీర్ఘకాలిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధి కల్పించడం. కేవీకేలో ప్రదర్శన క్షేత్రాలు.. మిశ్రమ వ్యవసాయ విధానాలు, ఉద్యాన పంటలు, పండ్ల తోటలు, వానపాములు, ఎరువు తయారీ యూనిట్లు ప్రోత్సహించటం. షేడ్నెట్లులో నారు పెంపకం, పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకంలో మెలకువలందించడం చేస్తున్నారు. ఉద్యాన పంటల పెంపకం, పచ్చి గడ్డి రకాల ప్రదర్శనా క్షేత్రం, భూసార పరీక్షల కేంద్రం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారు కేంద్రం, చిరుధ్యానాల ప్రాసెసింగ్, అజొల్లా యూనిట్లను ఏర్పాటు చేసి ఔత్సాహికులకు తోడ్పాటునందిస్తున్నారు. కేవీకే ద్వారా పరిచయం చేసిన నూతన వంగడాలు వరి : ఎన్డీఎల్ఆర్–7, ఎన్డీఎల్ఆర్–8, ఎన్ఎల్ఆర్– 34449 కంది : పీజీఆర్–176, ఎల్ఆర్జీ–52 శనగ : ఎన్బీఈజీ–1,49,47,119 మినుము: టీబీజీ – 104, ఎల్బీజీ 752 కొర్ర : ఎస్ఐఎ3156, 3085, సూర్యనంది జొన్న : ఎన్టీజే–5, ఎన్జే – 15 వైరెటీ వేరుశనగ: ధీరజ్, కె. అమరావతి, కె–1812, ధరణీ వైరెటీ కుసుమ : డీఎస్హెచ్ – 185, ఐఎస్ఎఫ్–764, పీబీఎన్ఎస్ – 12 ధనియాలు : ఏపీహెచ్యూ ధనియా–1, సుగుణ వాము : ఎల్ఎస్ 1,2 సజ్జ : ఏబీవీ 04 అన్నదాతల సేవలో బనవాసి కేవీకే వ్యవసాయంలో వినూత్న ఒరవడి నూతన వంగడాల ఆవిష్కరణలో ముందంజ వ్యవసాయం పండుగ కావాలి వాతావరణం, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు పంటలు సాగుచేయాలి. వ్యవసాయంతో పాటు, దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేసేందుకు కేవీకే శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకం, సంక్షేమ పథకాలకు వ్యవసాయ పరిశోధనలు ఫలించి వ్యవసాయం పండుగలా మారాలి. – డాక్టర్ అశోక్ కుమార్, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త -
మెరుగైన వైద్య సేవలందించాలి
ఆలూరు రూరల్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీసీహెచ్ఎస్ఓ (వైద్య విధాన పరిషత్ జిల్లా అధికారి) మాధవి అన్నారు. మంగళవారం ఆమె ఆలూరు సీహెచ్సీని తనిఖీ చేసి మాట్లాడారు. వాతావరణంలో మార్పులతో విష జ్వరాలు ప్రబలుతున్నందున్న వైద్యులు అప్రమత్తంగా ఉండి రోగులకు అన్ని రకాల వైద్య సేవలందించాలని సీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ వాహిద్కు ఆదేశించారు. ఆస్పత్రిలోని 30 పడకల వార్డును పరిశీలించారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అవసరమయ్యే మందుల కోసం ఎప్పటికప్పుడు ఇండెంట్ పంపించాలన్నారు. నూతనంగా నిర్మించిన సీహెచ్సీ భవనాన్ని పరిశీలించి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం జనరల్ సర్జరీలతో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని చెప్పారు. ఆస్పత్రిలో సుఖ ప్రసవాల శాతం పెంచాలని చెప్పారు. అంతకు ముందు ఆస్పత్రి రికార్డులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఆస్పత్రిలో సేవలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు గీతావాణి, ఫైజున్నిసా బేగం, మయూర్, శ్రీకాంత్, రామకృష్ణ, సంధ్య సీహెచ్సీ సిబ్బంది ఉన్నారు. ఆలూరు సీహెచ్సీ తనిఖీలో డీసీహెచ్ఎస్ఓ మాధవి -
ఏపీఈఆర్సీ భవనం సిద్ధం
● 23న ప్రారంభించేందుకు ముమ్మరంగా సన్నాహాలు ● జూన్ 2 నుంచికర్నూలు కేంద్రంగా సేవలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కేంద్రం కర్నూలు నగరంలో మరో రాష్ట్ర స్థాయి కార్యాలయం రూపుదిద్దుకుంది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ కర్నూలులో ఏర్పాటు కావడం విశేషం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా న్యాయశాఖకు సంబంధించిన మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త వంటి రాష్ట్ర స్థాయి కార్యాలయాలు ఇప్పటికే కర్నూలులో ఏర్పాటు అయ్యాయి. తాజాగా న్యాయశాఖకు సంబంధించిన ఏపీఈఆర్సీ రాష్ట్రస్థాయి కార్యాలయం కూడా కర్నూలులో ఏర్పాటు అయింది. ఏపీఈఆర్సీ కార్యాలయాన్ని ఈ నెల 23న చైర్మన్ జస్టీస్ నాగార్జునరెడ్డి ప్రారంభించనున్నారు. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామ సమీపంలోని ఏపీ ట్రాన్స్కోకు సంబంధించిన స్థలంలో ఏపీఈఆర్సీకి జీ+1 భవనాన్ని నిర్మించారు. 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గెస్ట్హౌస్ కూడా నిర్మించారు. చిన్న, చిన్న పనులు మినహా పనులన్నీ పూర్తి అయ్యాయి. కోర్టు హాల్, కాన్ఫరెన్స్ హాల్, చైర్మన్తో పాటు సభ్యుల చాంబర్లు తదితరవన్నీ సిద్ధమయ్యాయి. దాదాపు రూ. 25 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. విద్యుత్ శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఏపీఈఆర్సీ మీదనే ఆధారపడి ఉంటాయి. ఈ భవనాన్ని ఈ నెల 23న ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించడంతో ఫినిషింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పనులను విద్యుత్ శాఖ ఎస్ఈ ఉమాపతితో పాటు సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈ పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి రాజధాని గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగియనుండటంతో అదే రోజు హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయం కర్నూలుకు తరలించనున్నారు. విశాఖలో యథావిధిగా క్యాంపు కార్యాలయం కొనసాగుతుంది. జూన్ 2 నుంచి ఏపీఈఆర్సీ సేవలు కర్నూలు కేంద్రంగా అందించడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. -
అనధికార పత్తి విత్తనాలు కొనొద్దు
కర్నూలు(అగ్రికల్చర్): పత్తిలో నకిలీలకు అవకాశం ఉందని, కొనుగోలు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. మంగళవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ పత్తి సాగులో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని, ఈ ఏడాది ఖరీఫ్లో పత్తి 2,43,689 హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉందన్నారు. ● బ్రాండెడ్ విత్తనాల పేరిట అదే తరహా ప్యాకింగ్తో నకిలీలు తయారు చేసి రైతులకు అంటగట్టే ప్రమాదం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ● నకిలీ విత్తనాలు అమ్మినప్పుడు ఎలాంటి బిల్లు ఇవ్వరని.. ప్రాసెసింగ్, విత్తనశుద్ధి, ఇతర ప్రమాణాలు ఏ మాత్రం ఉండవన్నారు. ● వ్యవసాయ శాఖ నుంచి లైసెన్స్ పొందిన డీలరు దగ్గరే, అనుమతి ఉన్న కంపెనీల విత్తనాలనే కొనుగోలు చేసి విధిగా ఆథరైజ్డ్ బిల్లు తీసుకోవాలన్నారు. ● బిల్లులో కొనుగోలు చేసిన విత్తన రకం, గడువు తేదీ, నికర ధర, కంపెనీ పేరు, డీలరు సంతకం, రైతు సంతకం ఉన్నాయో లేదో సరిచూసుకోవాలన్నారు. ● పంటకాలం పూర్తయ్యే వరకు బిల్లులను భద్రపరుచుకోవాలన్నారు. ● లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, తెరచిన డబ్బాల నుంచి విత్తనాలు కొనుగోలు చేయారాదన్నారు. ● డీలర్లు, కంపెనీల వారీగా వైరెటీ/రకం వారీగా నిల్వలు, ఎంఆర్పీ వివరాలను తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. -
ఊరికి పంపలేదని వివాహిత ఆత్మహత్య
చాగలమర్రి: స్థానిక చింతలచెరువు రస్తాకు చెందిన బోర్రా వెంకటసుబ్బమ్మ(49) మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో కుటుంబ సభ్యులందరూ నిద్రిస్తుండగా క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమార్తె నందిరెడ్డి మౌనిక తెలిపిన వివరాలివీ.. వెంకట సుబ్బమ్మ(49)కు మూడేళ్ల క్రితం నంద్యాల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు గాయమైంది. దీంతో భర్త బోర్రా చంద్రశేఖర్రెడ్డి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అప్పటి నుంచి ఆమె ప్రతి చిన్న విషయానికి అందరిపై కోపగించుకోవడం, చనిపోతానని బెదిరించడం చేస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నివాసం ఉంటున్న తన సోదరి లక్ష్మీదేవి ఇంటికి వెళ్తానని భర్త చంద్రశేఖర్రెడ్డిని కోరగా ఆయన వారించాడు. మనస్థాపం చెందిన ఆమె సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో సొంత పెస్టిసైడ్ షాపులోని క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజూమున 4 గంటల సమయంలో కుమార్తె మౌనిక ఆమెను నిద్రలేపేందుకు ప్రయత్నించగా అపస్మారక స్థితిలో ఉండటంతో పాటు నోటిలో నురగను గుర్తించింది. వెంటనే స్థానిక కేరళ ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చాగలమర్రి ఎస్ఐ రమణయ్య తెలిపారు. -
స్కూళ్ల బస్సులు కండీషన్లో ఉండాలి
నందికొట్కూరు: ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు కండీషన్లో లేని బస్సులను నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆర్టీఓ ఏఎస్ఎన్ రెడ్డి హెచ్చరించారు. ఆయన మంగళవారం పట్టణంలోని ప్రైవేటు స్కూళ్ల బస్సులను కండీషన్గా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలను స్కూలుకు తరలించేందుకు పూర్తి కండీషన్లో ఉన్న బస్సులను మాత్రమే ఉపయోగించాలన్నారు. కాలం చెల్లిన బస్సులు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే లైసెన్స్ లేని డ్రైవర్లను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయమని స్పష్టం చేశారు. లోపాలున్న బస్సులకు సకల మరమ్మతులు చేయించాలని, లేనిపక్షంలో బస్సులను సీజ్ చేస్తానని హెచ్చరించారు. మహిళ అదృశ్యం మిడుతూరు: మండల పరిధిలోని పీరుసాహెబ్ పేట గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం కావడంతో భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగన్మోహన్ మంగళవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. పీరుసాహెబ్ పేటకు చెందిన రంజిత్కుమార్ రెడ్డికి ఓర్వకల్లు మండలం బైరాపురం గ్రామానికి చెందిన చంద్రకళతో ఆరేళ్ల క్రితం వివాహం అయ్యింది. వారికి ఇద్దరు సంతానం. ఆదివారం చంద్రకళ తండ్రి పీరుసాహెబ్పేటకు వచ్చి కూతురిని చూసి కొంత మొత్తం ఇచ్చాడు. తండ్రితో పాటు తాను పుట్టింటికి వస్తానని చెప్పగా ఇప్పుడు వద్దు పనులున్నాయని చెప్పి వెళ్లిపోయాడు. తండ్రి వెళ్లిన తర్వాత సోమవారం ఆ డబ్బుతో చంద్రకళ ఇంటి నుంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల గ్రామాలు, బంధువులను విచారించినా ఆచూకీ తెలియకపోవడంతో మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో భర్త రంజిత్కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో చేపడతాం
కర్నూలు(సెంట్రల్): జూన్ 4న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు చేపడతామని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలిపారు. మంగళవారం రాయలసీమ యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాళ్లలోని ఏర్పాట్లను కలెక్టర్ ఎస్పీ జి.కృష్ణకాంత్తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్లకు పటిష్ట బందోబస్తు కల్పించామన్నారు. కౌంటింగ్ హాళ్లలోకి ఏజెంట్లను పంపే ముందు ఐడీ కార్డుల పరిశీలనకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ ఎస్ఈ నాగరాజును ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది కౌంటింగ్ హాళ్లలో వెళ్లేందుకు ప్రత్యేక ద్వారాలను సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ వెంట పాణ్యం రిటర్నింగ్ అధికారి/జేసీ నారపురెడ్డి మౌర్య, కర్నూలు ఆర్వో భార్గవ్తేజ, డీఆర్వో కె.మధుసూధన్రావు టున్నారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ఫోన్లను అనుమతించం కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడానికి వీల్లేదని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 1 లోపు కౌంటింగ్ ఏజెంట్లను ఫారం–18 సమర్పించి నియమించుకోవాలన్నారు. ఒక్కో టేబుల్ ఒక ఏజెంట్ను నియమించుకోవచ్చని, వాళ్లు సంబంధిత టేబుల్ వద్దే ఉండి కౌంటింగ్ను పర్యవేక్షించాలన్నారు. రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ బ్లాకుల్లో కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ● జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ఏజెంట్లు 7 గంటల్లోపు అక్కడికి చేరుకోవాలన్నారు. ●ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ఉంటుందన్నారు. ● పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ను సంబంధిత నియోజకవర్గానికి కేటాయించిన కౌంటింగ్ హాళ్లలోనే చేపడతామన్నారు. ● పాణ్యం, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 4–5 వేల మధ్య ఉండడంతో ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ● కర్నూలు పార్లమెంట్కు సంబంధించి లైఫ్ సైన్సెస్ బ్లాక్లోని ప్రత్యేక రూమ్లో 14 టేబుళ్లతో కౌంటింగ్ చేపడతామన్నారు. ● సమావేశంలో డీఆర్వో కె.మధుసూధన్రావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సంతెకూడ్లూరులో గంజాయి పట్టివేత
ఆదోని రూరల్: మండల పరిధిలోని సంతెకూడ్లూరు గ్రామంలో మంగళవారం కర్ణాటక పోలీసులు సోదాలు జరిపి 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బళ్లారి కౌల్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో ఇద్దరు పట్టుబడ్డారు. వారిని విచారించగా సంతెకూడ్లూరు గ్రామానికి చెందిన బోయ రవి, బోయ చంద్ర అనే వ్యక్తులు తమకు గంజాయి అమ్మినట్లు తెలిపారు. ఈ సమాచారంతో మంగళవారం ఆదోని రెవెన్యూ అధికారులు, వీఆర్వో చిన్న ఈరన్న, ఇస్వీ ఎస్ఐ శ్రీనివాసులుతో కలిసి సంతెకూడ్లూరులోని సదరు వ్యక్తుల ఇళ్లలో సోదాలు జరిపారు. 50 కేజీల గంజాయి లభించడంతో స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. పట్టుబడిన ఇద్దరు అన్నదమ్ములు. చిన్నగొనేహాల్ గ్రామ సరిహద్దుల్లోని తమ పొలాల్లో గుట్టుగా గంజాయి పండిస్తూ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసిందని కౌల్బజార్ పీఎస్ సీఐ ధర్మాకర్ తెలిపారు. -
ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు ఫిర్యాదులు
● కర్నూలు నగరంలోని పాతబస్తీకి చెందిన లక్ష్మిదేవికి 65 ఏళ్లు. ఇటీవల బాత్రూమ్లో ప్రమాదవశాత్తూ జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. కుటుంబ సభ్యులు బుధవారపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీలో ప్యాకేజీలో వచ్చే ఇన్ప్లాంట్ నాసిరకానిదని, నాణ్యమైనది వేయాలంటే అదనంగా రూ.25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మనిషి ఆరోగ్యంగా నడిస్తే చాలని భావించి వారు వైద్యులు చెప్పిన అదనపు సొమ్ము ముట్టజెప్పారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు జేబులో ఉందంటే ఎంతో ధైర్యం. ఎలాంటి జబ్బు వచ్చినా ఆదుకుంటుందనే భరోసా. కానీ దురాశకు లోనైన పలువురు వైద్యులు, ఆసుపత్రుల యాజమాన్యాల కారణంగా ఈ పథకం అభాసుపాలవుతోంది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో అధిక శాతం రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. రోగి ఆరోగ్యపరిస్థితి వివరించి భయపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా ఆసుపత్రులకే కొమ్ము కాస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ● గూడూరుకు చెందిన వెంకటనర్సమ్మ ఛాతీలో నొప్పిగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యుని వద్దకు వెళ్లింది. ఆమెకు ఈసీజీ, 2డీ ఎకో పరీక్షల అనంతరం యాంజియోగ్రామ్ చేయాలన్నారు. ఆ పరీక్ష కూడా చేశాక గుండె రక్తనాళంలో బ్లాక్ ఉందని స్టెంట్ వేయాలని చెప్పారు. దానికి ఆరోగ్యశ్రీలో వచ్చే డబ్బు సరిపోదని, పైన రూ.30వేలు ఖర్చు పెట్టుకోవాలని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో అంగీకరించారు. ● ఆదోనికి చెందిన శ్రీనివాసులుకు ఇటీవల కడుపునొప్పి అధికం కావడంతో స్థానిక ఆర్ఎంపీ కి చూపించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు వెళ్లాలని సూచించారు. కర్నూలులోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు సొంత స్కానింగ్ మిషన్లోనే పరీక్షించి అపెండిక్స్ ఉందని చెప్పి ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేశారు. అయితే ఈ విషయంలో వైద్యులు మోసం చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ● రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులపై ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. ● ఆసుపత్రుల పనితీరు, వైద్యచికిత్సల విధానం, డబ్బులు ఏమైనా అడుగుతున్నారా అనే కోణంలో క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు, 104 వాహన సిబ్బందిచే వివరాలు సేకరిస్తున్నారు. ● ఇటీవల అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారని కర్నూలులో 48 మంది, నంద్యాల లో 30 మంది ఫిర్యాదు చేశారు. ● ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే వ్యాధినిర్ధారణ పరీక్షలు, మందులు బయటకు రాస్తుండటం గమనార్హం. ● వైద్యసేవలకు కింది స్థాయి సిబ్బంది డబ్బు లు అడుగుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ● అదే ప్రైవేటు ఆసుపత్రుల్లో అయితే ఆరోగ్యశ్రీ చికిత్సకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. మెడికల్ కేసా.. ఆరోగ్యశ్రీలో లేదు జిల్లాలోని పలు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో మెడికల్ కేసులకు స్థానం లేకుండా చేశారు. మెడికల్ కేసులకు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ సరిపోదంటూ లాభాలు వచ్చే సర్జరీ కేసులు మాత్రమే తీసుకుంటున్నారు. మెడికల్ కేసులంటే పలు రకాల జ్వరాలు, వాంతులు, విరేచనాలు, పీసీవోడీ, తీవ్ర ఆయాసం, పక్షవాతం తదితర వ్యాధులకు జిల్లాలోని 98 శాతం ఆసుపత్రుల్లో చోటు లేకుండా చేశారు. కేవలం రెండు, మూడు ఆసుపత్రుల్లో మాత్రమే మెడికల్ కేసులు చూస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) వచ్చి కాళ్లు, చేతులు పడిపోయినా ఒకటి, రెండు ప్రైవేటు ఆసుపత్రులు మినహా ఎవ్వరూ చికిత్స చేయని పరిస్థితి. కాళ్లు, చేతులు పడిపోవడం కాదు మెదడులో రక్తనాళాలు చిట్లితేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందంటూ వెనక్కి పంపిస్తున్నారు. దీంతో పక్షవాతం కేసులన్నీ అధిక శాతం చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరుతున్నారు. ఫిర్యాదులపై విచారణ చేస్తున్నాం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో డబ్బు వసూలు చేస్తున్నారని ఇటీవల కాలంలో ఫిర్యాదు లు అధికంగా వస్తున్నాయి. తాజాగా 48 మంది రోగులు, వారి సహాయకులు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు విచారణ చేసి పలు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఇలా డబ్బులు వసూలు చేసిన ఆసుపత్రుల నుంచి మూడు రెట్లు అదనంగా కట్టించాం. – డాక్టర్ భాస్కరరెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్, కర్నూలు కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో 72 నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇవి కాకుండా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల.. ఆదోని, ఎమ్మిగనూరు సీహెచ్సీలు, పీహెచ్సీలను సైతం ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి నెట్వర్క్ ఆసుపత్రులుగా మార్చారు. పీహెచ్సీల్లో జరిగే ప్రసవాలకూ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నారు. ఫలితంగా వచ్చే నిధులతో ఆయా ఆసుపత్రులు బలోపేతం అవుతాయనేది ప్రభుత్వ ఉద్దేశం. ఆయా ఆసుపత్రులకు వెళ్లిన వారు ఎవరూ డబ్బు లేదని చికిత్స చేయించుకోకుండా వెనక్కి రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం భారీగా అనుమతులు ఇచ్చింది. కర్నూలులోని కొత్తబస్టాండ్, గాయత్రి ఎస్టేట్లోని పలు చిన్న చిన్న ఆసుపత్రులను సైతం ఇందులో చేర్చారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆయా ఆసుపత్రులు దుర్వినియోగం చేస్తున్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే ప్యాకేజి సరిపోదని రోగుల నుంచి అదనంగా డబ్బు వసూలు చేస్తున్నాయి. విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదని రోగులను పరోక్షంగా బెదిరిస్తుండటం గమనార్హం. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని చెబుతుండటం చూస్తే పరోక్షంగా ఆసుపత్రులకు సహకరించినట్లుగా కనిపిస్తోంది. సర్జరీ కేసులైతే ఓకే.. మెడికల్ కేసులకు చికిత్స చేయని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఆపరేషన్ చేయాల్సి వస్తే మాత్రం వెంటనే చేర్చుకుంటున్నాయి. ఇందులో పలు రకాల ఆపరేషన్లతో పాటు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఆపరేషన్లు నిర్వహించడం తదితరాలు ఉన్నాయి. ఇలాంటి కేసులను ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి సైతం ప్రైవేటు ఆసుపత్రులు ఎగరేసుకుపోతున్నాయి. ఈ మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, న్యూరోసర్జరీ, కార్డియాలజీ విభాగాల నుంచి రోగులను నిత్యం ప్రైవేటు ఆసుపత్రులు వారి సొంత అంబులెన్సుల్లో తరలిస్తుండటం గమనార్హం. తీరా ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స ప్రారంభించే సమయంలో వాస్తవానికి ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే డబ్బులకు సాధారణ స్టెంట్స్, ఇన్ప్లాంట్స్, మెష్లు తదితర వైద్యపరికరాలు వస్తాయని.. నాణ్యమైనవి వేసుకుంటే రోగికి మేలు జరుగుతుందని రోగుల కుటుంబీకులను భయాందోళనకు గురిచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీతో వ్యాపారం ప్రభుత్వ ప్యాకేజీ సరిపోదంటూ సాకులు వ్యాధిని బట్టి అదనపు వసూళ్లు మెడికల్ కేసులను చేర్చుకునేందుకు ససేమిరా నెట్వర్క్ ఆసుపత్రుల ఇష్టారాజ్యం ఫిర్యాదులపై అధికారుల మీనమేషాలు -
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
కర్నూలు(సెంట్రల్): కర్నూలు జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ క్టర్ జి.సృజన రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ జవహర్రెడ్డికి వివరించారు. మంగళవారం విజయవాడ నుంచి సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాగునీరు, ఉపాధి పనులు, ఎన్నికల కౌంటింగ్ తదితర పనులపై కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్థితులను కలెక్టర్ సీఎస్కు వివరించారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో అనుమతులు మేరకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు నగరానికి సంబంధించి కొన్ని వార్డులు మినహా ప్రతి రోజూ నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఎస్ఎస్ ట్యాంకులో 60రోజులకు సరిపడ నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. వర్షాలు పడుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో నీటి కష్టాలు తగ్గుతున్నాయని, బోర్లలో నీటి నిల్వలు పెరుగుతుండడంతో ఇబ్బందులు తొలగి పోతున్నట్లు వివరించారు. మరోవైపు ఎమ్మిగనూరు పట్టణానికి వచ్చే15 రోజుల్లో నీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. మరోవైపు జిల్లాలో అడిగిన వాందరికీ ఉపాధి పనులు చూపుతున్నామని, ఎన్నికల కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వివరించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి డీఆర్వో కె.మధుసూధన్రావు, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, విద్యుత్ ఎస్ఈ ఉమాపతి, ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖరరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, గనుల శాఖ డీడీ రాజశేఖర్ పాల్గొన్నారు. సీఎస్కు వివరించిన కలెక్టర్ జి.సృజన -
ఇసుక రీచుల్లో నిరంతర నిఘా
కర్నూలు (న్యూటౌన్): జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఆదేశాల మేరకు ఇసుక రీచుల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ టి.రాజశేఖర్ తెలిపారు. గుడికంబాలి, మరాలి గ్రామాల్లోని ఇసుక రీచుల్లో పోలీసు, రెవెన్యూ సిబ్బందితో మంగళవారం నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేస్తామన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తవ్వి తరలించాలని చూస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రదేశంలోనే ఇసుక సేకరించాలన్నారు. తుంగభద్ర నది తీర ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలపై 1800 599 4599 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. -
మహిళా సాధికారతే లక్ష్యంగా..
కర్నూలు (న్యూటౌన్): మహిళా సాధికారతే లక్ష్యంగా తపాలాశాఖ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్సీ) పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. 2 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.2లక్షల వరకు గరిష్ట పెట్టుబడి పెడితే తపాలాశాఖ 7.5 శాతం వడ్డీరేటు చెల్లిస్తోంది. 18 ఏళ్లు నిండిన మహిళలు లేదా మైనర్ బాలిక అయితే చట్టబద్ధమైన సంరక్షకుని పేరు మీద అకౌంట్ తెరవచ్చు. కనిష్టంగా రూ.1000 నుంచి రూ.2లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం 01–04–2023 నుంచి 31–03–2025 వరకు రెండేళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. జమ అయిన మొత్తంలో ఒక సంవత్సరం తర్వాత నుంచి 40శాతం వరకు పాక్షికంగా ఉపసంహరించుకునే సౌకర్యం కూడా ఉంది. ఖాతాదారునికి ప్రాణాంతక వ్యాధులతో అనారోగ్యం ఏర్పడినప్పుడు, వైద్య సహాయం కోసం, సంరక్షకుని మరణం వంటి తీవ్ర కారుణ్య కారణాలలో ఖాతాను అకాల మూసివేతకు అనుమతించబడుతుంది. ఈ కారణాలతో ఖాతా ముందుగానే మూసివేయబడితే అసలు మొత్తం వడ్డీతో సహా సథకానికి వర్తించే రేటు ప్రకారం చెల్లించబడుతుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి 6 నెలలు పూర్తయిన తర్వాత 5.5 శాతం వడ్డీతో ఖాతాను ఎప్పుడైన ముగించుకోవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సైతం మహిళలు ఈ ఎంఎస్ఎస్సీ ఖాతాను ప్రారంభించవచ్చు. ఖాతా ఎలా తెరవాలంటే.. ఎంఎస్ఎస్సీ స్కీమ్లో పెట్టుబడి పెట్టడానికి, మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ కాపీని సమీపంలోని పోస్టాఫీసు లేదా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకుకు తీసుకెళ్లాలి. డిపాజిట్ మొత్తం చెక్కును పూరించాలి. తర్వాత ఖాతా ప్రారంభ ఫారమ్ తీసుకొని దానిని పూరించి అవసరమైన పత్రాలు సమర్పించాలి.మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం ప్రయోజనం వివరాలుమహిళలు సద్వినియోగం చేసుకోవాలి తపాలా శాఖ ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సర్టిఫికెట్ పథకం మహిళలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. తక్కువ పెట్టుబడితో అధిక వడ్డీ పొందే సదుపాయం ఈ పథకంలో ఉంటుంది. ఈ పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన కూడా అమలు చేస్తున్నాం. – జి. జనార్దన్రెడ్డి, పోస్టల్ సూపరింటెండెంట్, కర్నూలు డివిజన్ ఎంఎస్ఎస్సీ పేరుతో నూతన పథకాన్ని తీసుకొచ్చిన తపాలా శాఖ తక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడి 2025 మార్చి వరకు అందుబాటులో పథకం జమ చేసిన 2 సంవత్సరాలకు ఫలితం మొత్తం లభించు వడ్డీ రూ.1000 రూ.160 రూ.1,160 రూ.10,000 రూ.1,602 రూ.11,602 రూ.50,000 రూ.8,011 రూ.58,011 రూ.1,00,000 రూ.16,022 రూ.1,16,022 రూ.2,00,000 రూ.32,044 రూ.2,32,044 -
స్థిరమైన ఆదాయ మార్గాలపై దృష్టి సారించండి
బనగానపల్లె రూరల్: యువ రైతులు స్థిరమైన ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలని జాతీయ వ్యవసాయ పరిశోధన, శిక్షణ యాజమాన్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మండలంలోని యాగంటిపల్లె గ్రామ సమీపంలో ఉన్న కృషివిజ్ఞాన కేంద్రం(కేవీకే)లో హైదరాబాద్ జాతీయ వ్యవసాయ పరిశోధన, శిక్షణా యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు లాభదాయకమైన పొట్టేళ్లు, మేకల పెంపకంపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కేవీకే ప్రధాన సీనియర్ శాస్త్రవేత్త ధనలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయంలో కచ్చితమైన ఆదాయం రావడం కష్టతరంగా మారిందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వ్యవసాయ అనుబంధ రంగమైన జీవాల పెంపకంపై యువత దృష్టి సారించాలన్నారు. గొర్రెలు, జీవాల పెంపంకంలో శాసీ్త్రయ పద్ధతులు పాటిస్తే వ్యాపారాత్మకంగా మలచుకొని సుస్థిర ఆదాయం పొందవచ్చన్నారు. రైతులు వ్యవసాయం సంఘటితంగా చేసి దళారీ వ్యవస్థ నుంచి బయటపడినప్పుడే మెరుగైన ధర లభిస్తుందన్నారు. ● ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ బాలకృష్ణన్ మాట్లాడుతూ దేశంలో 60శాతం పొట్టేళ్లు, మేకల మాంసం తెలుగు రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అవుతుందన్నారు. డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని యువత ఎన్ఎల్ఎం సబ్సిడీ పథకం కింద జీవాల పెంపకం యూనిట్ ప్రారంభించాలని సూచించారు. ● కేవీకే ప్రధాన శాస్త్రవేత్త ధనలక్ష్మీ మాట్లాడుతూ హరిజన యువత కేవలం వ్యవసాయ కూలీలుగా మారకుండా సొంతంగా ఉపాధి అవకాశమైన జీవాల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. ● కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ రమణయ్య, డాక్టర్ బాలరాజు, ఆదినారాయణ, లక్ష్మీప్రియలు జీవాలు, గొర్రెలు, కోళ్ల పెంపకంలో మెలకువలను వివరించారు. ● అనంతరం లాభదాయకంగా సాంద్ర పద్ధతిలో జీవాల పెంపకం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ● కార్యక్రమంలో కేవీకే ఏఓ సురేష్కుమార్, నందికొట్కూరు డివిజన్కు చెందిన యువరైతులు పాల్గొన్నారు. -
గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పెంపు
కర్నూలు(న్యూటౌన్): జిల్లాలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల(బాలికలు), కర్నూలు(బాలికలు), ఆలూరు(బాలురు)ల్లో 3వ తరగతి ప్రవేశాలతో పాటు 4 నుంచి 9వ తరగతి వరకున్న బ్యాక్లాగ్ సీట్ల ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 27 వరకు పొడిగించినట్లు ఏపీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ కన్వీనర్/ప్రిన్సిపాల్ ఎ.లక్ష్మిగుర్రప్ప మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీతో గడువు ముగిసినా విద్యార్థుల సౌకర్యార్థం గడువు పొడిగించామన్నారు. ఈ అవకాశాన్ని కర్నూలు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఐటీఐలో 100శాతం అడ్మిషన్లు పూర్తి చేయాలి నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని ఐటీఐ కళాశాలల్లో వందశాతం అడ్మిషన్లు జరగాలని ఆ కళాశాలల జిల్లా అధికారి సోమశివారెడ్డి అన్నారు. మంగళవారం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జరిగిన సమావేశానికి డీఈఓ, డీవీఈఓ, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది విద్యాశాఖ అధికారుల సమన్వయంతో 100 శాతం సీట్లు భర్తీ చేయాలన్నారు. 2024–25 విద్యాసంవత్సరానికి తొలి విడత కౌన్సెలింగ్కు అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుకు అవకాశం ఉందన్నారు. వ్యక్తిపై హత్యాయత్నం ఆస్పరి: చొక్కన హళ్లి గ్రామం దగ్గర అటికెటలగుండు గ్రామానికి చెందిన అయ్యన్నపై మంగళవారం హత్యాయత్నం జరిగింది. ఆస్పరి సీఐ హనుమంతప్ప తెలిపిన వివరాలు మేరకు .. పత్తికొండ మండలం అటికెటల గుండు గ్రామానికి చెందిన అయ్యన్న తన భార్య స్వగామమైన ఆస్పరి మండలం యాటకల్లుకు ఆటోలో వెళ్తున్నాడు. అటికెలగుండు గ్రామానికి చెందిన బోయ మస్తాన్, రమేష్, దస్తగిరి, రాముతో పాటు మరో ఐదుగురు చొక్కనహళ్లి గ్రామం దగ్గర ఆటోను అడ్డగించి అయ్యన్నపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన అయ్యన్నను చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ చెప్పారు. వ్యక్తిగత విషయాల్లో కక్ష పెంచుకుని హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసిందన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 9 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
పి.కోటకొండలో కార్డెన్ సెర్చ్
● పట్టుబడిన కర్ణాటక, తెలంగాణ మద్యం దేవనకొండ: మండలంలోని పి.కోటకొండ గ్రామంలో మంగళవారం సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కర్ణాటక రాష్ట్రానికి చెందిన 93 మద్యం టెట్రా ప్యాకెట్లను, తెలంగాణ రాష్టరానికి చెందిన 25 మాన్సన్ హౌస్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ముచ్చు రామచంద్రుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో సీఐ సమావేశమయ్యారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా అల్లర్లు, గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
సీబీఎస్ఈ అమలుకు 69 పాఠశాలల ఎంపిక
గోస్పాడు: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడలో భాగంగా జిల్లాలో 69 ప్రభుత్వ పాఠశాలలను సీబీఎస్ఈ సిలబస్ అమలుకు ఎంపిక చేసినట్లు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయ పరిశీలకులు శరత్ తెలిపారు. సీబీఎస్ఈ పై జిల్లాస్థాయి సబ్జెక్టు ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన విద్యను అందిస్తుందన్నారు. ఇందులో భాగంగా సీబీఎస్ఈ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో పనిచేసే సబ్జెక్టు ఉపాధ్యాయులకు సీబీఎస్ఈ బోధనపై ముందస్తుగా అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంఈఓ అబ్దుల్ కరీం, ప్రిన్సిపాల్లో ఖాజా హుసేన్, ఇస్రాత్ బేగం, సబ్జెక్టు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ద్వాదశి వేడుకలు
మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో ద్వాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా సోమవారం రాఘవేంద్రుల మూలబృందావనానికి విశేష పుష్ప, పంచామృతాభిషేకాలు చేశారు. బంగారు కవచాలతో విశిష్టంగా అలంకరించారు. అలంకరణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు పట్టారు. ఆదివారం ఏకాదశి సందర్భంగా పండితుల, అర్చకులు, బ్రాహ్మణులు, సేవా భక్తులు ఉపవాస దీక్షలో కొనసాగారు. ద్వాదశి సందర్భంగా శ్రీమఠం ఉదయం 8గంటల నుంచే అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ద్వాదశి వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆశాజనకంగా వర్షాలు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు కర్నూలు జిల్లాలో నాలుగు , నంద్యాల జిల్లాలో 10 మండలాల్లో వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లా చిప్పగిరిలో 50.2 మిమీ, హాలహర్విలో 14.4, కర్నూలు అర్బన్లో 4.8, కర్నూలు రూరల్లో 3.8 మి.మీ. ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లాలో మే నెల సాధారణ వర్షపాతం 40.1 మిమీ ఉండగా, 20 రోజుల్లో 80.7 మి.మీ. నమోదైంది. నంద్యాల జిల్లా మహానందిలో 28.8, రుద్రవరంలో 25.2, ఆళ్లగడ్డలో11.2, వెలుగోడులో 4.4, దొర్నిపాడులో 4.2, శ్రీశైలంలో 3.4 మి.మీ. ప్రకారం వర్షాలు కురిశాయి. నంద్యాల జిల్లాలో మే నెల సాధారణ వర్షపాతం 36.9 మి.మీ. ఉండగా, 91.6 మి.మీ. నమోదైంది. రెండు జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతుండటంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కందులు క్వింటా రూ.12,121 కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందులు క్వింటా ధర రూ.12,121 పలికాయి. సోమవారం కర్నూలు మార్కెట్కు 36 లాట్ల కందులు రాగా నాలుగైదు లాట్లు మినహా మిగిలిన అన్ని లాట్లకు రూ.12వేలపైనే ధర లభించింది. శనగలకు రూ.6,209, మినుములకు రూ.9,109, ఎండుమిర్చికి రూ.13,444, కొర్రలకు రూ.4,728 ప్రకారం ధర లభించింది. ఉల్లి గడ్డలు మార్కెట్కు రావడం లేదు. 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు 24వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి ఎస్.వి.ఎస్ గురువయ్యశెట్టి తెలిపారు. సోమవారం స్థానిక టౌన్ మోడల్ కాలేజీలో పరీక్షల నిర్వహణపై సీఎస్, డీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారి కోసం 35 కేంద్రాలు, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం 22 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయని, 15,981 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నామని, 6,9 62 మంది విద్యార్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ప్రతి కేంద్రం దగ్గర 144 సెక్షన్లో అమలులో ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా వృత్తివిద్యాధికారి జమీర్ పాషా, డీఈసీ సభ్యులు పరమేశ్వర్రెడ్డి, లాలెప్ప, ప్రభుచరణ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల బ్యాంకు ఖాతాలకు ఇన్పుట్ సబ్సిడీ
2023 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కరువు మండలాల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసే ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఏకంగా రూ.460.47 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేయడం పట్ల రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 70,982 హెక్టార్లలో పంట నష్టం 2023–24 రబీ కరువు మండలాలకు సంబంధించి వ్యవసాయ శాఖ యంత్రాంగం పంపిన ప్రాథమిక రిపోర్టు ప్రకారం 70,982.46 హెక్టార్లలో 33 శాతం పైన పంటలు దెబ్బతిన్నాయి. 18 కరువు మండలాల్లో 58,901 మంది రైతులు పంటలను నష్టపోయారు. ఈ రైతులకు రూ.71,57,64,304 ఇన్పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయితీ) అవసరమవుతుందని ప్రాథమిక నివేదికలో వ్యవసాయ యంత్రాంగం పేర్కొంది. తాజాగా సోషల్ ఆడిట్కు పెట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ ద్వారా తుది నివేదికను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. -
కౌంటింగ్కు సన్నద్ధం
● సిబ్బందికి మే 24న మొదటి, 31న రెండో విడత శిక్షణ ● కౌంటింగ్ కోసం 1,200 మంది సిబ్బంది ఎంపిక ● జూన్ 4వ తేదీన కౌంటింగ్, ఫలితాల ప్రకటన కర్నూలు(సెంట్రల్): సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకమైన కౌంటింగ్ ప్రక్రియకు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. జూన్ 4న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కౌంటింగ్ను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మే 24, 31వ తేదీల్లో కౌంటింగ్ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు రెండు విడతలుగా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు... రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. అలాగే పార్లమెంట్కు ఎన్నికలకు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం కూడా మరో 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్తోపాటు ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తంగా ఒక టేబుల్కు నలుగురు ఉద్యోగులు ఉండి ఓట్ల లెక్కింపు చేస్తారు. అదే సమయంలో కౌంటింగ్ ప్రక్రియను పక్కన ఉండి చూడడానికి రాజకీయ పార్టీల ఏజెంట్లకు కూడా అనుమతి ఇస్తారు. జిల్లాలోని కర్నూలు, పాణ్యం, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోదానిలో 28 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. మొత్తంగా పార్లమెంట్, అసెంబ్లీ కలిపి 224 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో టేబుల్కు 4 చొప్పున 896 మంది సిబ్బందిని కౌంటింగ్ కోసమే ఎంపిక చేశారు. వీరితోపాటు కౌంటింగ్లో ఇతర విధుల్లో పాల్గొనే సిబ్బందితో కలిపి మొత్తం1,200 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్లపై నిరంతర పర్యవేక్షణ ఎన్నికలు ముగియగానే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరచారు. వీటిని ప్రతినిత్యం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీ పర్యవేక్షణ చేస్తున్నారు. తుది పోలింగ్ వివరాల ప్రకారం కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో 76.80 శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే జిల్లాలోని కర్నూలు, పాణ్యం, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 76.42 శాతంమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే 2019 ఎన్నికలతో పోల్చుకుంటే నమోదైన ఓటింగ్ శాతం అసెంబ్లీల్లో స్పల్పంగా పెరగగా..పార్లమెంట్లో స్వల్పంగాా తగ్గింది. పకడ్బందీ ఏర్పాట్లు... జూన్ 4న కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలిపారు. సోమవారం రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల లైవ్ ఫీడింగ్ను ఆమె జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, జేసీ నారపురెడ్డి మౌర్య, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కల్యాణితో కలసి పరిశీలించారు.అనంతరం స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ చేపట్టే హాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కౌంటింగ్ హాల్లో ఏ విధంగా టేబుళ్లు ఏర్పాటు చేసుకుంటే సౌకర్యంగా ఉంటుందో చూసుకోవాలని ఆర్వోలకు సూచించారు. అదే విధంగా వీవీ ప్యాట్ల కౌంటింగ్కు కూడా ప్రత్యేక బూత్లు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కోడుమూరు ఆర్వో, కర్నూలు ఆర్డీఓ ఎం.శేషిరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ నాగరాజు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.203 కోట్లు విడుదల
‘చార్ధామ్’లో ఆటంకాలు.. వెనుదిరుగుతున్న భక్తులు?
రైతుల సమస్యలపై సమరశీల పోరాటం
7న దళితమిత్ర రాష్ట్ర మహా సభ
25న గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ప్రసాద్గౌడ్
సింహ వాహనంపై చెన్నకేశవుడు
గడువు దాటిన సిలిండర్తో జాగ్రత్త..!
మూల్యాంకన కేంద్రాల తనిఖీ
తాటి ముంజెలు.. లాభాలు బోలెడు
తప్పక చదవండి
- కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
- ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
- మోదీ గ్యారంటీలా? కేజ్రీ పథకాలా?.. ఢిల్లీ జనం మదిలో ఏముంది?
- రెప్పపాటులోనే మృత్యు ఒడికి
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement