-
లూజ్ పెట్రోల్ విక్రయాలు వద్దు
అమలాపురం రూరల్: ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక సంఘటనల నేపథ్యంలో జిల్లాలోని బంకులు, బహిరంగ మార్కెట్లో లూజ్ పెట్రోల్ విక్రయాలు, మందుగుండు సామగ్రి తయారీ, అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.నూపుర్ అజయ్ సూచించారు. ఈ విషయమై బుధవారం అమలాపురం కలెక్టరేట్లో వర్తకులు, పోలీసు, అగ్నిమాపక విపత్తుల స్పందన విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం ముందుకు సాగాలన్నారు. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లూజ్ పెట్రోలు విక్రయాలను, మందుగుండు తయారీ, అమ్మకాలను 15 రోజుల పాటు నిషేధించామని స్పష్టం చేశారు. జిల్లా అడ్మిన్ ఎస్పీ ఎస్.ఖాదర్ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం గోదాములలో నిల్వ ఉన్న క్రాకర్స్ను నమోదు చేసి సీళ్లు వేయించాలని డీఎస్పీలను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మందుగుండు విక్రయాలు, నిల్వలు నిషిద్ధం అమలాపురం టౌన్: జిల్లాలో జూన్ 10వ తేదీ వరకూ బాణసంచా విక్రయాలు, నిల్వలు నిషిద్ధమని వాటి తయారీ కేంద్రాల నిర్వాహకులకు జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్ తెలిపారు. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఆయన బుధవారం పర్యవేక్షించారు. అక్కడ ఏర్పాట్లపై డీఎస్పీలు, సీఐలకు పలు సూచనలు చేశారు. ఇదిలా ఉంటే జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా క్యాసో తనిఖీలు కొనసాగాయి. ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల్లోని సమస్యాత్మక గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి లైసెన్స్లు లేని 24 మోటారు సైకిళ్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లమిల్లి గ్రామంలోని రాజీవ్ గృహకల్ప కాలనీ వద్ద తనిఖీలు నిర్వహించి లైసెన్స్లు లేని 10 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ పరిఽధి వాసాలతిప్పలో లైసెన్స్లు లేని 14 మోటారు సైకిళ్లు, పి.గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధి గాజులగుంట తదితర గ్రామాల్లో రెండు, రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిఽధి రాజబాబు నగర్లో 20, మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి చిన ద్వారపూడి తదితర సమస్యాత్మక గ్రామాల్లో ఆరు మోటారు సైకిళ్లు సీజ్ చేశారు. -
వైభవంగా నృసింహ జయంతి
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో బుధవారం నృసింహ జయంతిని ఆలయ అర్చకులు, వేదపండితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి దీక్షాధారుల దీక్ష విరమణ కార్యక్రమం ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు పర్యవేక్షణలో వేద పండితుడు చింతా వెంకటశాస్త్రి, అర్చకుడు జి.రాజేష్ నిర్వహించారు. స్వాములు గరుడ ముడిని భక్తిశ్రద్ధలతో సమర్పించారు. తొలుత ప్రధాన అర్చకుడు కిరణ్ ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు జరిగాయి. గోవింద నామస్మరణల మధ్య మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. గత నెల 23, 24 తేదీల్లో 27 రోజుల స్వామివారి దీక్ష చేపట్టిన స్వాములు, నృసింహ జయంతి రోజు బుధవారం దీక్షా విరమణ చేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పాల్గొన్నారు. దీక్షాధారులకు, భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను దేవస్థానం అందజేసింది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు అమలాపురం రూరల్: జిల్లాలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్, జనరల్, ఒకేషనల్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 24 నుంచి నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. బుధవారం అమలాపురం కలెక్టరేట్లోని డీఆర్వో చాంబర్లో ఈ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రఽఽథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్ కేటగిరీలో 7,733 మంది, ఒకేషనల్కు సంబంధించి 1,015 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అన్నారు. వీరికోసం జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ అధికారి వి.సోమశేఖరరావు మాట్లాడుతూ ఆయా కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా ఆ శాఖ అధికారులు దృష్టి సారించాలన్నారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆయా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను నిర్వహించాలని కోరారు. డీఈఓ ఎం.కమలకుమారి, డీఎంహెచ్ఓ ఎం.దుర్గారావుదొర పాల్గొన్నారు. నేడు జిల్లా స్థాయి చెస్ పోటీలు అమలాపురం రూరల్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా ఓపెన్ చెస్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకటసురేష్ తెలిపారు. ఈ పోటీల ద్వారా విజయవాడలో పురుషులకు, హిందూపురంలో మహిళలకు జరిగే రాష్ట్ర చెస్ చాంపియన్ షిప్ పోటీలకు నలుగురు చొప్పున ఎంపిక చేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారు ఏపీ చెస్.ఓఆర్జీ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. -
నేత్రపర్వంగా సత్యదేవుని రథోత్సవం
అన్నవరం: శ్రీసత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో ఐదో రోజు బుధవారం కొండ దిగువన నిర్వహించిన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు జరిగిన ఈ రథోత్సవాన్ని వేలాది మంది భక్తులు తిలకించారు. సత్యరథాన్ని ఉదయం తొమ్మిది గంటలకు పంపా సత్రం నుంచి తొలిపావంచా వద్దకు తీసుకువచ్చారు. అక్కడ రథాన్ని రంగురంగుల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. సాయంత్రం నాలుగు గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను అర్చకస్వాములు ఊరేగింపుగా కొండదిగువన తొలి పావంచా వద్దకు తీసుకువచ్చారు. అక్కడ సర్వాంగ సుందరంగా అలంకరించిన నూతన రథంపై స్వామి, అమ్మవార్లను ఉంచి పూజలు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు రథం ముందు కుంభం పోసి గుమ్మడికాయతో అర్చకులు దిష్టి తీశారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.రామచంద్రమోహన్ కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. వందల సంఖ్యలో భక్తులు దేవస్థానం సిబ్బంది, ధవళేశ్వరం నుంచి వచ్చిన రథం నడిపే నిపుణులు రథాన్ని లాగారు. తొలిపావంచా వద్ద నుంచి ఆంధ్రాబ్యాంక్ వరకు, అక్కడి నుంచి దేవస్థానం హైస్కూల్ వద్ద గల టోల్గేట్ వరకు తిరుగు ప్రయాణంలో మరలా తొలిపావంచా వద్దకు రథోత్సవం కొనసాగింది. అనంతరం స్వామి, అమ్మవార్లను రథం నుంచి కిందకు దించి ఊరేగింపుగా సత్యదేవుని ఆలయానికి చేర్చారు. దేవస్థానం డిఫ్యూటీ ఈఓ రమేష్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథరాజు, ఇంజినీరింగ్ ఈఈలు మురళి, నరసింహరెడ్డి, డీఈలు ఉదయ్, బీఎస్ రాంబాబు, ఎలక్ట్రికల్ డీఈ సత్యనారాయణ, ఏఈఓలు పాల్గొన్నారు. రథోత్సవంలో మొదట గ్రామస్ధులు తక్కువగా ఉన్నా, ఆరు గంటల సమయానికి వేల సంఖ్యలో తరలిరావడంతో అన్నవరం మెయిన్రోడ్డు కిక్కిరిసిపోయింది. ఈఓ కె.రామచంద్రమోహన్ రథోత్సవం ప్రారంభం నుంచి చివరి వరకు నాలుగు గంటల పాటు మైకు ద్వారా సిబ్బందికి సూచనలిచ్చారు. ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు భక్తులు, గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. కోలాటం, కేరళ డప్పులు, పులివేషాలు అందరినీ ఆకర్షించాయి. సత్యదేవుని రధోత్సవంలో రథానికి విద్యుత్ అలంకరణ చేసినా సాంకేతిక కారణాలతో వెలిగించ లేదు. స్వామి, అమ్మవార్లకు, రథం ముందు ఫోకస్ లైట్లు తప్ప విద్యుత్ అలంకరణ లేదు. 36 అడుగుల ఎత్తయిన రథంపై ఊరేగిన స్వామి, అమ్మవార్లు ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు -
పనుల ప్రగతిపై సంతృప్తి
వంతెన నిర్మాణాన్ని పరిశీలించిన ఏఐఐబీ బృందంపి.గన్నవరం: వశిష్ట నదిపై ఊడిమూడిలంక, జి.పెదపూడి లంక గ్రామాల ప్రజల కోసం రూ.49.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన పనులను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ప్రతినిధుల బృందం మంగళవారం పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డిని లంక గ్రామాల ప్రజలు కలుసుకుని, తాము పడుతున్న ఇబ్బందులను వివరించి, వంతెన నిర్మించాలని కోరిన విషయం విదితమే. దీంతో జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో వశిష్ట నదిపై వంతెన పనులు ప్రారంభమై, వేగంగా జరుగుతున్నాయి. దీంతో ఈ పనులను ఏఐఐబీ ప్రతినిధులు పరాద్ అహ్మద్ (బంగ్లాదేశ్), అశోక్కుమార్ (ఇండియా), యోగేష్ మల్లా (నేపాల్), లారా (ఫిలిప్పీన్), కౌశిక్ రెహమాన్ (బంగ్లాదేశ్)లు పీఆర్ సీఈ సీవీ సుబ్బారెడ్డి, ఎస్ఈ బి.రవీంద్ర, ఈఈ రమణమూర్తి తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. ఇప్పటి వరకూ జరిగిన పనుల ప్రగతిని పీఆర్ డీఈఈ అన్యం రాంబాబు వారికి వివరించారు. సుమారు రూ.9 కోట్ల మేర పనులు జరిగాయని ఆయన తెలిపారు. ఈ ప్యాకేజీలో భాగంగా ప్రధాన పంట కాలువపై వంతెన నిర్మాణ పనులు 75 శాతం పూర్తి అయ్యాయి. నదిపై వంతెన పనుల్లో భాగంగా ఏటిగట్టు వద్ద మూడు కల్వర్టు బాక్సులు, ఐదు పిల్లర్లను నిర్మించారు. వీటిలో మూడు పిల్లర్లు పూర్తి కాగా, మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. అబెక్ట్ పిల్లర్ నుంచి 210 మీటర్ల అప్రోచ్ రోడ్డు పూర్తయిందని డీఈఈ వివరించారు. పనుల ప్రగతి పట్ల కాంట్రాక్టు సంస్థను ఏఐఐబీ బృందం అభినందించింది. సైట్లో ఒక మహిళ రోలర్తో రోడ్డు చదును చేయడాన్ని చూసిన బృందం ఆమెను అభినందించారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని బృంద సభ్యులు సూచించారు. పీఆర్ ఈఈ కె.చంటిబాబు, ప్రాజక్ట్ అడ్వయిజర్ ప్రభాకర్రెడ్డి, నరసింహరావు, ఏఈఈ సత్యనారాయణ, కొండలరావు పాల్గొన్నారు. -
రాజ్యలక్ష్మి అమ్మవారికి వెండి చీర సమర్పణ
తాళ్లరేవు: మండల కేంద్రమైన తాళ్లరేవు కేశవపురం గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవీ, భూదేవి సమేత శ్రీ కేశవస్వామివారి దేవస్థానానికి ఒక దాత వెండి చీరను సమర్పించారు. స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలలో భాగంగా రాజ్యలక్ష్మి అమ్మవారికి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సూర్యనారాయణమూర్తి తన తల్లిదండ్రులు భాస్కరమ్మ, రామంల జ్ఞాపకార్థం సుమారు రూ.3 లక్షల విలువచేసే మూడు కిలోల వెండిచీరను ఆలయ కార్యనిర్వహణాధికారి యర్రా వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఆలయ అర్చకులు పెద్దింటి శ్రావణ కుమారాచార్యులు వెండి చీరకు సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో కొల్లు శ్రీను, బిళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 21న లక్ష్మీనృసింహునికి మహా జ్యేష్టాభిషేకం సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వచ్చే నెల 21వ తేదీన స్వామివారి మూలవిరాట్టుకు సప్తనది తీర్థ మహా జ్యేష్టాభిషేకం నిర్వహిస్తున్నట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆరోజు జ్యేష్టా నక్షత్ర పర్వదినాన గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి జలాలతో అర్చకులు, వేదపండితులు స్వామివారి మూలవిరాట్టుకు అభిషేకం చేస్తారన్నారు. ఇందులో పాల్గొన దలచిన భక్తులు టికెట్ రుసుము రూ.400 చెల్లించాలని ఆయన తెలిపారు. కాగా వచ్చే నెల 3వ తేదీన ఆలయంలో బహుళ ద్వాదశి పర్వదినాన స్వామికి శాంతి కల్యాణం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విద్యాహక్కు చట్టంలో 1,040 మందికి అడ్మిషన్లు రాయవరం: విద్యాహక్కు చట్టంలో భాగంగా జిల్లాలో ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి 1,040 మంది చిన్నారులకు ఒకటో తరగతిలో అడ్మిషన్స్ చేపట్టారు. విద్యా హక్కు చట్టం కింద ఒకటో తరగతిలో 25శాతం ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 3,076 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 2,576 మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమకు ఏ పాఠశాలలో అడ్మిషన్ కోరుకుంటున్నారో కూడా ఎంపిక చేసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు మొదటి విడతగా లాటరీ నిర్వహించి, 1,439 మందికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. ఎంపికై న జాబితాలను సంబంధిత ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు పంపించారు. అడ్మిషన్ల ప్రవేశానికి ఈ నెల 20 చివరి తేదీ కాగా 72.27 శాతం మంది అడ్మిషన్స్ పొందారు. 399 మంది తల్లిదండ్రులు వివిధ కారణాలతో తమ చిన్నారులను వారికి నిర్దేశించిన పాఠశాలల్లో చేర్చలేదు. -
సకాలంలో సాగు నీరు
సాక్షి అమలాపురం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పంట కాలువలు, డ్రైనేజీలలో పూడికతీత పనులను చేపట్టి రైతులకు సకాలంలో సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా డ్వామా జలవనరుల అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యుత్ సరఫరా, పోలింగ్ అనంతరం భద్రత, నరేగా పనుల నిర్వహణ, వేసవిలో తాగునీటి సరఫరాపై జిల్లాల వారీగా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవి దృష్ట్యా కాలువలో నీటి సరఫరా నిలిపివేసినందున నరేగా ద్వారా ఫీల్డ్ చానల్స్లో పేరుకుపోయిన పూడికతీత పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మొక్కల పెంపకం తదితర గ్రామాభివృద్ధి పథకాలను ఎక్కువగా చేపట్టాలన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల ద్వారా తాగునీరు ప్రజలకు సరఫరా చేయాలని ఆదేశించారు. పెట్రోలు, డీజిల్ లూజ్ అమ్మకాలు నిర్వహించకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల పరిధిలో డ్రోన్ ఫ్లయింగ్ పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. మందు గుండు సామగ్రిని అమ్మకాలు నిషేధించామన్నారు. జూన్ నాలుగో తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంలో ప్రజలు, మీడియా ప్రతినిధులు పూర్తి సంయమనం పాటించాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.నుపూర్ అజయ్, డీఆర్ఓ ఎం.వెంకటేశ్వర్లు డీఆర్డీఏ పీడీ శివశంకర్ ప్రసాద్, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, సీపీవో వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ సురేష్ బాబు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్లు టి.వైద్యనాథ్ శర్మ, పి. సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.అధికారులకు కలెక్టర్ శుక్లా ఆదేశం -
బందోబస్తుపై ముందస్తు కసరత్తు
అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జిల్లా పోలీసు శాఖ ముందస్తు కసరత్తుతో పటిష్టమైన బందోబస్తుకు చర్యలు చేపడుతోంది. జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్, ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా ఆదేశాలతో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తమ తమ ప్రాంతాల్లో ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాల్లో కేంద్ర బలగాలతో కలసి మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (క్యాసో) పేరుతో తనిఖీలు నిర్వహించి పలు అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకున్నారు. రికార్డులు లేని బైక్లు, డీజల్ ఆయిల్, నాటు సారాను సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన క్యాసో తనిఖీలు, పట్టుబడ్డ వస్తువుల వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయం మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో వివరించింది. – అమలాపురం డీఎస్పీ ఎం.మహేశ్వరరావు పర్యవేక్షణలో కాట్రేనికోన పోలీసు స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామం పోర గ్రామంలో క్యాసో తనిఖీలు నిర్వహించారు. సరైన రికార్డులు లేని 8 బైక్లను, ఒక ఆటోను సీజ్ చేశారు. ● అమలాపురం రూరల్ సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో అల్లవరం మండలం బోడసకుర్రు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద క్యాసో తనిఖీలు నిర్వహించారు. డాక్యుమెంట్స్ లేని 16 బైక్లను, ఒక ఆటోను ఎస్సై జి. హరీష్కుమార్ సీజ్ చేశారు. ● ఐ.పోలవరం మండలంలో సమస్యాత్మక గ్రామం భైరవపాలెంలో అనుమానస్పద వ్యక్తులను, చట్ట విరుద్ధమైన వస్తువులను తనిఖీలు చేశారు. డాక్యుమెంట్స్ లేని 21 మోటారు సైకిళ్లను, ఒక ఆటోను, 1450 లీటర్ల డీజిల్ ఆయిల్ను పోలీసు అధికారులు సీజ్ చేశారు. ● రామచంద్రపురం డీఎస్పీ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో మండపేట పట్టణం గొల్లపుంత కాలనీలో తనిఖీలు నిర్వహించారు. మండపేట సీఐ అఖిల్ జమ, ఎస్సై శ్రీహరికోటి శాస్త్రి ఈ తనిఖీలు చేపట్టి రికార్డులు సరిగా లేని 18 మోటారు సైకిళ్లను సీజ్ చేశారు. ● రామచంద్రపురం సీఐ పి.దొరరాజు ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్తూరి అపార్ట్మెంట్ వద్ద క్యాసో తనిఖీలు నిర్వహించారు. డాక్యుమెంట్లు సరిగా లేని 15 మోటారు సైకిళ్లను ఎస్సై కె.సురేష్బాబు సీజ్ చేశారు. ● రాయవరం పోలీసు స్టేషన్ పరిధిలోని మాచవరం, పసలపూడి, చెల్లూరు గ్రామాలు, మండపేట మండలం ద్వారపూడి గ్రామాల్లో పోలీసు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించి ఓట్ల లెక్కింపు రోజున పోలీసు ఆంక్షలపై అవగాహన కల్పించారు. ● మండపేట రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని కేశవరం గ్రామంలో తనిఖీలు చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 200 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ఓ కారును సీజ్ చేశారు. ● మలికిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో క్యాసో తనిఖీలు నిర్వహించారు. డాక్యుమెంట్లు సరిగా లేని 50 మోటారు సైకిళ్లను సీజ్ చేశారు. ● రావులపాలెం సీఐ ఎం.రామ్కుమార్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాలీ గ్రామంలో క్యాసో తనిఖీలు నిర్వహించి 6 మోటారు సైకిళ్లను సీజ్ చేశారు. ● జిల్లాలో ప్రతీ పోలీసు సర్కిల్, పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం క్యాసో తనిఖీలు నిర్వహించడంతోపాటు ఓట్ల లెక్కింపు రోజున ఎంతటి సంయమనంతో ఉండాలో ప్రజలకు పోలీసు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎవరూ రెచ్చగొట్టే మాటలు, ప్రకటనలు చేయవద్దని హితవు పలికారు. బాణసంచా కాల్పులు, పెట్రోలు లూజ్ అమ్మకాలపై విధించిన నిషేధాజ్ఞలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఓట్ల లెక్కింపు రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక గ్రామాల్లో క్యాసో తనిఖీలు పోలీసు ఆంక్షలపై ప్రజలకు అవగాహన సదస్సులు -
లెక్చరర్ సుబ్బారావుకు డాక్టరేట్, భారత్ కళారత్న అవార్డు
● బహుముఖ ప్రజ్ఞాశాలిగా అమెరికా జీహెచ్పీయూ గుర్తింపు ● ఈ నెల 25న చైన్నె భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో ప్రదానం కొత్తపేట: స్థానిక ఒక ప్రైవేట్ కళాశాల అధ్యాపకుడు, కవి, రచయిత వులుసు వీరవెంకట సత్య సుబ్బారావు అమెరికాకు చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ (జీహెచ్పీయూ) గౌరవ డాక్టరేట్, భారత్ కళారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఆ మేరకు జీహెచ్పీయూ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ పీ మాన్యూల్ ధ్రువీకరణ పత్రాలు పంపినట్టు సుబ్బారావు మంగళవారం కొత్తపేటలో విలేకరులకు తెలిపారు. రావులపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన వులుసు సుబ్బారావు సత్యహరిశ్చంద్ర, బాలనాగమ్మ తదితర పౌరాణిక నాటకాలు, అన్నా – చెల్లెలు, పూలకంగడు, కనకపు సింహాసనమున హుష్కాకి, అన్నదాత తదితర సాంఘిక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించిన కళాకారుడు. 2008లో కొత్తపేట వచ్చి స్థిరపడి ఒక ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా తన వృత్తిని కొనసాగిస్తూ, ప్రవృత్తిగా కవి, రచయితగా తన ప్రతిభను చాటుకుంటున్నారు. సుబ్బారావు బహుముఖ ప్రజ్ఞను గుర్తించిన జీహెచ్పీయూ గౌరవ డాక్టరేట్తో పాటు భారత్ కళారత్న అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 25 న చైన్నె భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా సుబ్బారావుకు డాక్టరేట్ను, అవార్డును ప్రదానం చేయనున్నారు. పురోహితుడు రామంకు సేవారత్న అవార్డు స్థానిక పురోహితుడు పెద్దింటి రామచంద్ర శ్రీహరి (రామం) జీహెచ్పీయూ సేవారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఆ మేరకు జీహెచ్పీయూ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ పీ మాన్యూల్ ధ్రువీకరణ పత్రాలు పంపినట్టు రామం విలేకరులకు తెలిపారు. ఆయన పలు ఆలయాల్లో అర్చకునిగా, గ్రామ పురోహితునిగా పనిచేస్తూ దేశ, విదేశాల కరెన్సీ నోట్లు, నాణేలు, డాలర్స్, రకరకాల వస్తువులు, 124 సంవత్సరాల పంచాంగాలు సేకరించారు. వివిధ సంస్థల అవార్డులు, రికార్డులు సాధించారు. ఈ నెల 25 న చైన్నెలో అవార్డును స్వీకరించనున్నారు. -
వస్తున్నాయ్ సత్యదేవుని రథచక్రాల్
● నేడు భారీ టేకు రథంపై ఊరేగనున్న స్వామి, అమ్మవార్లు ● ఆలయ చరిత్రలో తొలిసారిగా 36 అడుగుల ఎత్తు రథం వినియోగం ● సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి వరకు.. అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో ఐదో రోజు బుధవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆలయ చరిత్రలో తొలిసారిగా 36 అడుగుల ఎత్తు కలిగిన నూతన టేకు రథంపై స్వామి, అమ్మవార్లను ఊరేగించనున్నారు. ఈ ఊరేగింపు కొండ దిగువన మెయిన్రోడ్డులో సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సాగనుంది. స్వామి, అమ్మవార్ల రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్యాణ మహోత్సవాలలో సత్యదేవుని ఊరేగింపు రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమవడం ఎప్పటి నుంచో ఆనవాయితీ. అయితే భద్రతా ఏర్పాట్లతో బాటు, ముందు జాగ్రత్తగా బుధవారం జరిగే రథోత్సవాన్ని సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభిస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ రథోత్సవం కొనసాగనుంది. ఈ రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్టు దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్ తెలిపారు. పెద్ద రథంలేని లోటు తీరిందిలా... 135 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వార్షిక ఆదాయం రూ.157 కోట్లు. అయినప్పటికీ సుమారు 50 సంవత్సరాల క్రితం తయారు చేయించిన ఊరేగింపు వాహనాలు మినహా భారీ రథం లేదు. వెండి రేకు తాపడం చేసిన చిన్న రథం ఉన్నా దాని ఎత్తు పది అడుగులకు మించదు. ఆ రథం కూడా శిధిలావస్థకు చేరడంతో కొత్తగా స్వామివారి ఊరేగింపునకు రథం చేయించాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ గత ఏడాది కార్యరూపం దాల్చింది. దేవస్థానం ఈఓగా 2022–23 సంవత్సరంలో సేవలందించిన ఎస్ఎస్ చంద్రశేఖర్ అజాద్ స్వామివారిని రత్నగిరి ఆలయ ప్రాంగణంలో ఊరేగించేందుకు సుమారు 16 అడుగుల ఎత్తు కలిగిన చిన్నరథం, కల్యాణ మహోత్సవంలో కొండ దిగువన స్వామి, అమ్మవార్లను ఊరేగించేందుకు 36 అడుగుల ఎత్తు కలిగిన పెద్ద రఽథన్ని రూ.1.42 కోట్ల వ్యయంతో తయారు చేసేందుకు టెండర్లు ఖరారు చేశారు. వీటిని మురమండకు చెందిన మాణిక్యాంబ శిల్పకలా ఉడ్ వర్క్స్ అధినేతలు కొల్లాటి కామేశ్వరరావు, శ్రీనివాస్, మరో 20 మంది శిల్పులు తయారు చేశారు. రథసప్తమి నాడు చిన్న రథాన్ని ప్రారంభించారు. దీనిపై ప్రతి ఆదివారం స్వామి,అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో ఊరేగిస్తున్నారు. కల్యాణ మహోత్సవాలలో స్వామి, అమ్మవార్లను ఊరేగించేందుకురూ.1,04 కోట్లతో 36 అడుగుల ఎత్తు, 14.6 అడుగుల వెడల్పు, 21 అడుగుల పొడవుతో చేయించిన టేకు రఽథాన్ని గత నెల 26వ తేదీన లాంఛనంగా ప్రారంభించారు. గత గురువారం మెయిన్ రోడ్డులో ఈ రథానికి ట్రయిల్ రన్ నిర్వహించారు. అయితే రథాన్ని ఎత్తే మోటార్ కెపాసిటీ తక్కువ ఉండడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. రథం ఎత్తేందుకు జాకీకి 2హెచ్పీ మోటార్ ఏర్పాటు రథం జాకీకి ఎక్కువ లోడు ఎత్తే మోటార్ బిగించాలని ఈఓ కె.రామచంద్రమోహన్ ఆదేశించారు. దాంతో మంగళవారం ఆ మోటార్ స్థానంలో 2హెచ్పీ మోటార్ ఏర్పాటు చేశారు. దేవస్థానం ఈఈ మురళి, ఎలక్ట్రికల్ డీఈ సత్యనారాయణ, చౌదరి తదితరుల సమక్షంలో ఆ మోటార్ను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ మోటార్కు జనరేటర్ కూడా అమర్చుతున్నారు. కమిటీలు ఏర్పాటు చేశాం తొలిపావంచా వద్ద నుంచి ఆంధ్రాబ్యాంక్ సెంటర్కు అక్కడ నుంచి దేవస్థానం హైస్కూల్ వద్ద గల టోల్గేట్ వరకు మళ్లీ అక్కడ నుంచి తొలిపావంచా వరకు రథోత్సవం జరుగుతుంది. రథోత్సవం నిర్వహణకు దేవస్థానం సిబ్బందితో పలు కమిటీలు ఏర్పాటు చేశాం. బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను కోరాం. భక్తులు, గ్రామస్తులు సహకరించాలి. – కె.రామచంద్రమోహన్, ఈఓ, అన్నవరం దేవస్థానం రథోత్సవం ఇలా.. ఉదయం తొమ్మిది గంటలకు రథాన్ని పంపా సత్రం నుంచి తొలిపాంచా వద్దకు తీసుకువస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రథాన్ని పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని రథంపై ఉంచి పూజలు చేస్తారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.రామచంద్రమోహన్ కొబ్బరికాయలు కొట్టి రథం ముందు పోసిన కుంభం మీదుగా రథాన్ని లాగుతారు. రథోత్సవంలో భాగంగా సుమారు 200 మంది వివిథ కళారూపాలను ప్రదర్శిస్తారని అధికారులు తెలిపారు. రథోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం నుంచి మెయిన్రోడ్డులో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. -
శాంతికి ఉన్న శక్తి అనంతం
ప్రవచన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు బోట్క్లబ్: మన దేశంలో శాంతి అనే పదానికి ఎంతో శక్తి ఉందని ప్రవచన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. స్థానిక సూర్యకళామందిరంలో మంగళవారం రాత్రి ప్రముఖ సంగీత వాగ్గేయకారుడు కొచ్చర్లకోట రామరాజు కీర్తనల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశంలో సంగీతానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. ఎందరో మహానుభావులు సంగీత కళ ద్వారా వర్షాలు కురిపించి తమ ఘనతను చాటుకున్నారన్నారు. మన హిందూ దేవుళ్ల చేతుల్లో సైతం ఏదో ఒక సంగీత పరికరాన్ని అలంకరించి ఉంటారని పేర్కొన్నారు. మానసిక ప్రశాంతత కోసం మాత్రమే సంగీతం కాదన్నారు. ఎంతో మంది సంగీత కళాకారులు తమ సంగీత సాధనాలతో భగవంతుని సైతం మెప్పించారన్నారు. సంగీత కళాకారుడు కొచ్చర్లకోట రామరాజు కీర్తనలను ఆవిష్కరించే బాగ్యం తనకు దక్కడం గొప్ప విషయమన్నారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యకారిణి సభ్యులు వారణాసి రామ్మాధవ్ మాట్లాడుతూ రామరాజు వంటి మహానీయులు అప్పటిలోనే ఉచితంగా సంగీతం నేర్పడంతో పాటు నేర్చుకొనేవారికి ఉచితంగా వసతి కల్పించారన్నారు. కళలకు కుల మతాలు లేవన్నారు. కళలు డబ్బులు సంపాదించుకొనేందుకు కాదన్నారు. బ్రహ్మ వ్యవస్థలో కుల విభజన ఎక్కడా లేదన్నారు. 6వ శతాబ్దంలో కులాంతర వివాహాలు సైతం జరిగేవన్నారు. కొచ్చర్లకోట రామరాజు చారిటబుల్ ట్రస్ట్ న్యూఢిల్లీ ప్రతినిధి కొచ్చర్లకోట ప్రభాకర సుందరరావు మాట్లాడుతూ ఎప్పటి నుంచో కలగా మిగిలిన తన తాతగారి కీర్తనలు ఇన్ని రోజులకు సీడీ రూపంలో తయారు చేసి వినే భాగ్యం తమకు కలగడం గొప్ప విషయమన్నారు. అనంతరం రామరాజు రచించిన కీర్తనలను ప్రముఖ సంగీత విద్వాంసురాలు పెద్దాడ సూర్యకుమారి ఆలపించారు. తొలుత ముఖ్య అతిథులు జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీవీఎస్ఎల్ఎన్ మూర్తి, సుందర స్వామి పాల్గొన్నారు. -
ఉప్పుటేరులో దూకి వివాహిత మృతి
కొత్తపల్లి: వివాహేతర సంబంధం కారణంగా ఒక వివాహిత ఉప్పుటేరులో దూకి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అమరవల్లి గ్రామానికి చెందిన బోరా కనకదుర్గ(38)అదే గ్రామానికి చెందిన బోరా చిన రమణారెడ్డి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కనకదుర్గను కొంతకాలంగా చిన రమణారెడ్డి వేధింపులకు గురి చేస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక ఉప్పుటేరులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త బోరా రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై స్వామినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
No Headline
టీ పొడి దుకాణాలపై విజిలెన్స్ దాడులు మూడు షాపులపై కేసుల నమోదు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న దుకాణాలపై అధికారులు మంగళవారం దాడులు చేశారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరం టౌన్ హాలు రోడ్డులో ఉన్న తేజ అస్సాం టీ పొడి, కీర్తి అస్సాం టీ పొడి దుకాణాలపె దాడి చేయగా అక్కడ నిషేధించిన సింథటిక్ ఫుడ్ కలర్ టార్టాజైన్, సన్ సెట్ పసుపులను టీ పొడిలో కలపడం గుర్తించారు. వెంటనే ఆ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపారు. టీ పొడిని కల్తీ చేయడానికి ఉపయోగిస్తున్న టార్టాజైన్ (పసుపు) సన్ సెట్ పసుపులను స్వాధీనం చేసుకున్నారు. ప్యాకింగ్ లైసెన్సు లేకపోవడం, టీ పౌడర్ ప్యాకెట్లపై కన్జ్యూమర్ కేర్ వివరాలు లేకపోవడం గుర్తించారు. డోమెస్టిక్ గ్యాస్ సిలిండర్, స్టాంప్ లేని వెయింగ్ మెషీన్ను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం గుర్తించారు. అస్సాం టీ కంపెనీను తనిఖీ చేయగా టీ పౌడర్ ప్యాకెట్లపై కన్జ్యూమర్ కేర్ వివరాలు, ప్యాకింగ్ లైసెన్సు లేకపోకపోవడం గుర్తించారు. ఈ దుకాణాలపై విజిలెన్స్, రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు ముత్యాలు నాయుడు, నాగ వెంకటరాజు, జగన్నాథరెడ్డి, భార్గవ మహేష్, లక్ష్మీనారాయణ, రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ ఆలమూరు: మండలంలోని కలవచర్లకు చెందిన మదర్ థెరిసా స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఇటీవల విశాఖపట్నం రైల్వే గ్రౌండ్ ఆవరణలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో చక్కని ప్రతిభను కనబర్చారు. 38 కేజీల విభాగంలో బుంగ అశ్విన్( గోల్డ్), 35 కేజీల విభాగంలో ఖండవిల్లి మహిమాకర్ (సిల్వర్), 40 కేజీల విభాగంలో గెద్దాడ జ్యాయ్ కిరణ్ (సిల్వర్), బాలికల 30 కేజీల విభాగంలో కట్టా అనుశ్రీ కార్తికేయ (గోల్డ్), టెక్వాండో పోటీల్లో వడ్డి గిరిజ (గోల్డ్), వడ్డి కార్తికేయ (సిల్వర్) సాధించినట్టు గ్రాండ్ మాస్టర్ టి.అబ్బులు తెలిపారు. అవార్డులు సాధించిన విద్యార్థులను మాస్టర్స్ సంఘ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ చల్లా ప్రభాకరరావు, సీనియర్ మాస్టర్స్ లంకె వెంకటరెడ్డి, నార్గాని సెంథిల్ కుమార్, టి.లక్ష్మి, టి.కిరణ్, బుంగ అర్జున్ అభినందించారు. టీ పొడి దుకాణాలపై విజిలెన్స్ దాడులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): టౌన్ హాలు రోడ్డులో ఉన్న తేజ అస్సాం టీ పొడి, కీర్తి అస్సాం టీ పొడి దుకాణాలపె విజిలెన్స్ దాడి చేయగా అక్కడ నిషేధించిన సింథటిక్ ఫుడ్ కలర్ టార్టాజైన్, సన్ సెట్ పసుపులను టీ పొడిలో కలపడం గుర్తించారు. వెంటనే ఆ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపారు. ఈ దుకాణాలపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. -
అడ్మిషన్లకు ‘గురి’దేవుల కృషి
రాయవరం: వేసవి సెలవుల్లోనూ పని చేయాలా అంటూ పెదవి విరుస్తున్న వారికి జిల్లాలోని పలువురు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. మనబడి మన బాధ్యతను గుర్తు చేసుకుంటూ 2024–25 విద్యా సంవత్సరం అడ్మిషన్లపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు. ఉన్నత పాఠశాలల సమీప గ్రామాలకు వెళ్లి మన బడిలోనే మీ పిల్లలను చేర్పించండి..అంటూ తల్లిదండ్రులను కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మౌలిక సౌకర్యాలు, అందిస్తున్న విద్యాప్రమాణాలను తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఈ ఏడాది పదవ తరగతి ఫలితాల్లో సాధించిన ఉత్తీర్ణతను..విద్యార్థులు సాధించిన మార్కులను..కరపత్రాల రూపంలో ముద్రించి గ్రామాల్లోని ఇంటింటికి తిరిగి పంచుతున్నారు. జిల్లాలో పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ బడుల పరిరక్షణ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు. ప్రైవేటుకు దీటుగా.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2024–25 విద్యాసంవత్సరం అడ్మిషన్లపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేలా మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు వెబెక్స్, గూగుల్ మీట్ సమావేశాల ద్వారా మార్గదర్శకత్వం చేశారు. దీంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అడ్మిషన్ల ప్రక్రియను బాధ్యతగా తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు వలవేస్తూ ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించాయి. దీనికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. వారిపైనే ఫోకస్.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్న ప్రీ స్కూల్స్లో 3–6 సంవత్సరాల వయసు ఉన్న వారు 40వేల మంది ఉన్నారు. వీరిలో ఐదేళ్లు పైబడిన వారు దాదాపుగా 12వేల మంది వరకు ఉన్నారు. ఐదు సంవత్సరాల వయసు పైబడిన పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ఫోకస్ పెట్టారు. ప్రైవేట్ కాన్వెంట్స్లో యూకేజీ చదువుతున్న విద్యార్థులు కూడా దాదాపుగా ఆరువేల మంది వరకు ఉన్నారు. గత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో 18,302 అడ్మిషన్లు జరిగాయి. ఈ ఏడాది కూడా ఇంచుమించుగా అదే సంఖ్యలో అడ్మిషన్లు జరిగే అవకాశముంది. ఐదవ తరగతి నుంచి 22,757 మంది విద్యార్థులు ఆరవ తరగతిలోకి ప్రమోట్ అవుతున్నారు. 7వ తరగతి నుంచి 8వ తరగతిలోకి 21,552 మంది ప్రమోట్ అవుతుండగా, 219 ప్రాథమిక పాఠశాలల్లో రెండవ తరగతి చదువుతున్న 1,511 మంది ఉపాధ్యాయులు మూడవ తరగతిలో చేరనున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికే ఐదో తరగతి చదువుతున్న వారితో పాటుగా, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను కూడా చేర్చుకునేందుకు వారి తల్లిదండ్రులను మోటివేట్ చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చేవారు ఎవరైనా ఉంటే వారికి ముందస్తుగా అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తల సహకారం తీసుకుంటూ అడ్మిషన్లు పెంచుతున్నారు. నేరుగా విద్యార్థుల ఇళ్లకే ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై ప్రధానోపాధ్యాయుల ఫోకస్ వేసవి సెలవుల్లోనూ విధుల పట్ల అంకితభావం స్ఫూర్తిగా నిలుస్తున్న పలువురు హెచ్ఎంలు, టీచర్లు వచ్చే నెల 12న పాఠశాలల పునఃప్రారంభం కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రచారం పలు ప్రభుత్వ పాఠశాలలు వినూత్నంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇటీవల పదవ తరగతి ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు సాధించిన అద్భుత ఫలితాలను ప్రచారాస్త్రాలుగా వినియోగించుకుంటున్నారు. ‘పది’ ఫలితాల్లో మెరిట్ విద్యార్థుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఆయా పాఠశాలల వద్ద ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నారు. ఎన్ఎంఎంఎస్, చెకుముకి వంటి టాలెంట్ టెస్టులు, జవహర్ నవోదయ, ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులు సాధించిన సీట్ల వివరాలను ఫ్లెక్సీల్లో పొందుపర్చారు. పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలనే విద్యార్థుల అడ్మిషన్లకు ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నారు. కొందరు ప్రధానోపాధ్యాయులు ఫ్లెక్సీలను ఆటోలకు కట్టి, మైకు ద్వారా ప్రచారం చేయించారు. పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోవు అంటూ సగర్వంగా ప్రచారం చేసిన వైనం ఎక్కడికక్కడ కన్పించింది. నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోంది. పాఠశాల నుంచి గతంలో ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. గత విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠఽశాలల నుంచి వచ్చి మా పాఠశాలల్లో అడ్మిషన్స్ పొందారు. ఈ విద్యా సంవత్సరంలో 11 మంది విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్కు ఎంపికయ్యారు. విద్యార్థులు సాధించిన విజయాలను తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నాం. – కె.వెంకటలక్ష్మి, జీహెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, మురముళ్ల, ఐ.పోలవరం మండలం తల్లిదండ్రుల స్పందన బాగుంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే పొందే ప్రయోజనాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నాం. వేసవి సెలవులను ఆలోచించకుండా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. ఉపాధ్యాయులు కూడా బాధ్యతగా విద్యార్థులను చేర్పించేందుకు స్వచ్ఛందంగా వచ్చారు. తల్లిదండ్రుల నుంచి స్పందన కూడా బాగుంది. – జి.కనకదుర్గ, జీహెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, ముంగండ, పి.గన్నవరం మండలం సంతోషించదగ్గ విషయం ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవడం సంతోషించదగ్గ విషయం. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు అంగన్వాడీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులను చేర్చుకుంటున్నారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలను వదిలిపెట్టే విద్యార్థులను ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చేర్చుకుంటున్నారు. విద్యార్థుల చేరికతోనే పాఠశాలలు బలోపేతం అవుతాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. – ఎం.కమలకుమారి, డీఈవో, అమలాపురం -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ఉప్పలగుప్తం: మండలంలోని మునిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మునిపల్లి కోటిగట్టు ప్రాంతానికి చెందిన నాగారాపు లలిత (29) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఎస్ఐ కె.మనోహర జోషి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన నాగారపు భీమేంద్ర.. గొల్లవిల్లి పంచాయతీ పరిధి ఇందిరానగర్కు చెందిన లలితను ఐదు సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు. అయితే భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. భర్త వేధింపులు తాళ లేక సోమవారం సాయంత్రం లలిత ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని మరణించినట్టు భీమేంద్ర కుటుంబీకులు పోలీసులకు, లలిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి తహసీల్దార్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శవ పరీక్షలు నిర్వహించారు. తన అల్లుడు భీమేంద్ర తన కూతురు లలితను హతమార్చి ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించాడని మృతురాలి తల్లి పరమట పుష్పలత ఆరోపిస్తున్నారు. మృతురాలి సోదరుడు పరమట ప్రసాద్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వివరించారు. కొత్తపేట డీఎస్పీ కె.వి.రమణ, అమలాపురం రూరల్ సీఐ పి.వీరబాబు సమక్షంలో కేసు విచారణ జరుపుతున్నామని, భీమేంద్రను అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ జోషి తెలిపారు. -
తొలవరికి సిద్ధం
ఖరీఫ్ సాగుకు ప్రణాళిక సిద్ధం ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న వేళ రైతులకు అన్ని విధాలా సాయపడేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి గతేడాది మాదిరిగానే విత్తనాలు, ఎరువులు అందించనున్నాం. ఆ మేరకు ప్రణాళికాబద్ధంగా అన్నీ సిద్ధం చేశాం. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఆర్బీకేల్లో విత్తనాలతో పాటు దశల వారీగా అవసరమైన ఎరువుల సరఫరా చేయనున్నాం. నవంబర్, డిసెంబర్ నెలల్లో తుపాన్లు, భారీ వర్షాల బారినపడి పంట నష్టాలు సంభవించకుండా ముందుగానే సార్వా సాగు చేపట్టేలా రైతులు సిద్ధం కావాలి. ఆర్బీకే సేవలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలు, గ్రామాల్లో వ్యవసాయ సహాయకుల సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలు, అవసరం మేరకు ఎరువులు వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాలి. – వి.బోసుబాబు, జిల్లా వ్యవసాయ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట: ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి వ్యవసాయ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. అన్నదాతల కష్టం తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇబ్బంది లేకుండా వ్యవసాయ ప్రోత్సాహక పథకాలు అమలు చేసి తోడ్పాటునందిస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేలా వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. పంట దిగుబడిలో కీలకమైన నాణ్యత గల విత్తనాలు, ఎరువులు అందించేందుకు చర్యలు చేపట్టింది. ముందుగానే రైతులకు విత్తనాలు, ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించేలా చర్యలు తీసుకుంది. రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయడం వల్ల ముందుగా నారుమడులు పోసుకోవడానికి, వెదజల్లు పద్ధతిలో సాగు చేయడానికి వీలవుతుంది. ఆ మేరకు గత ఏడాది మాదిరిగానే ఖరీఫ్ (తొలకరి) సీజన్కు సంబంధించి ప్రధాన పంట కాలువలకు గోదావరి నీరు విడుదల చేయనుంది. ఖరీఫ్ ప్రణాళికకు సంబంధించి వివరాలను జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ ప్రణాళిక ఇలా.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి చీఫ్ ప్లానింగ్ విభాగం, జిల్లా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. ఎంటీయూ 7029 రకం సుమారు 73 శాతం వినియోగిస్తుండగా మిగిలిన 27 శాతం ఎంటీయూ 1318, ఎంటీయూ 1064 తదితర రకాలు వినియోగిస్తున్నారు. ఆ మేరకు 33,750 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా ఇప్పటికి సుమారు 23 వేల క్వింటాళ్ల విత్తనాలు రైతుల వద్ద, 7,250 క్వింటాళ్లు ప్రైవేట్ డీలర్ల వద్ద, 900 క్వింటాళ్ల విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. 3,500 క్వింటాళ్ల విత్తనాలకు ఏపీ సీడ్స్కు ఇండెంట్ పెట్టారు. ఈ ఖరీఫ్కు 43,493 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా దిగుమతి చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రైవేట్ డీలర్ల వద్ద, మార్క్ఫెడ్ వద్ద 37,950 మెట్రిక్ టన్నులు ఎరువులు ఉన్నాయి. ఆ మొత్తంలో యూరియా 13,250 మెట్రిక్ టన్నులు, డీఏపీ 2,900 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 2,100 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 10,600 మెట్రిక్ టన్నులు, సూపర్ 1,020 మెట్రిక్ టన్నుల ఎరువులు ఉన్నాయి. గ్రామాల్లో రైతులకు సరఫరా చేసేందుకు ప్రతి ఆర్బీకేకు 20 మెట్రిక్ టన్నుల ఎరువులు దిగుమతి చేయడానికి వ్యవసాయ శాఖ కమిషనరేట్ చర్యలు తీసుకుంటోంది. రైతు మోములో చిరునవ్వులు పూయించిన ప్రభుత్వం గత ఏడాది కౌలు రైతులకు సంబంధించి 63,900 సీసీఆర్సీ కార్డులు పంపిణీ చేశారు. వాటి ఆధారంగా 24,082 మంది రైతులకు రూ.78.78 కోట్లు వివిధ రూపాల్లో రుణాలుగా ఇచ్చారు. వ్యవసాయం దండగ అన్న టీడీపీ పాలకుల అభిప్రాయానికి పూర్తి భిన్నంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది. సాగు ప్రోత్సాహక, రైతు సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటి దిశగా నడిపించింది. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది. కొన్ని సీజన్లలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంట నష్టాలు చవి చూసినా ఏ సీజన్కు ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా అమలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంది. ఈ విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు మోములో చిరునవ్వులు పూయించింది. జిల్లాలో సార్వా సాగుకు ప్రణాళిక 1,68,780 ఎకరాల్లో వరి సాగుకు సమాయత్తం 33,750 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఏపీ సీడ్స్కు 3,500 క్వింటాళ్ల విత్తనాలకు ఇండెంట్ ఆర్బీకేల్లో 900 క్వింటాళ్లు రెడీ 42,493 మెట్రిక్ టన్నుల ఎరువుల వినియోగం లక్ష్యం ప్రైవేట్ డీలర్లు, మార్క్ఫెడ్ వద్ద 37,950 మెట్రిక్ టన్నులు ప్రతీ ఆర్బీకేకు 20 టన్నుల సరఫరాకు చర్యలు -
చికిత్స పొందుతూ క్షతగాత్రుడి మృతి
పి.గన్నవరం: మండలంలోని ఊడిమూడి గ్రామం వద్ద ఇటీవల ధాన్యం లోడు ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిలకలపూడి సురేష్ (35) మంగళవారం మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద రోడ్డు పక్కన 10 మంది వ్యవసాయ కార్మికులు ట్రాక్టర్లో ధాన్యం బస్తాలు లోడ్ చేసి, పగ్గాలు కడుతుండగా రావులపాలెం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టిన విషయం విదితమే. ప్రమాదంలో జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ, వాసంశెట్టి సూర్యనారాయణ, ఈరి కట్లయ్య, ఆదిమూలంవారిపాలేనికి చెందిన చిలకలపూడి మణిబాబు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో మణిబాబు అన్న చిలకలపూడి సురేష్కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో అతడిని గత శుక్రవారం రాత్రి కాకినాడలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సురేష్ మృతదేహానికి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ కేసు నమోదు చేయగా, సీఐ ప్రశాంతకుమార్ దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు మృతి చెందడంతో ఆదిమూలం వారిపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సురేష్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు భోరున విలపించారు. మృతుని తండ్రి చిలకలపూడి వెంకటేశ్వరరావు, తల్లి సత్యనారాయణయమ్మ, అన్న గోపాలకృష్ణ, వారి కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ● ఐదుకు చేరిన రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య ● అన్నదమ్ముల మృతితో ఏవీపాలెంలో విషాద ఛాయలు -
రత్నగిరిపై వేదఘోష
150 మంది పండితులకు సత్కారం అన్నవరం : రత్నగిరి సత్యదేవుని సన్నిధి మంగళవారం వేదఘోషతో ప్రతిఽధ్వనించింది. సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా వైశాఖ శుద్ధ త్రయోదశి, మంగళ వారం సాయంత్రం నవదంపతులు శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్ల సమక్షంలో వేదపండిత సదస్యం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన వేద,స్మార్త పండితులు స్వామివారి ముందు తమ వేదవిద్వత్తును ప్రదర్శించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది పండితులు వచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను పెళ్లిపెద్దలు సీతారాములు వెంట రాగా అనివేటి మంటపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి అక్కడి వేదికపై ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆలయ వేద పండితుడు ఉపాధ్యాయుల వేంకట సుబ్రహ్మణ్య ఘనపాఠి అధ్యక్షతన పండిత సదస్సు నిర్వహించారు. పండితులు స్వామివారి ముందు నాలుగు వేదాలు పఠించారు. తరువాత దేవస్థానం వేదపండితులు సత్యదేవుడు, అమ్మవార్లకు ఆశీస్సులందచేశారు. పండిత సత్కారం అనంతరం వేదపండితులను దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈఓ కె.రామచంద్రమోహన్ సత్కరించారు. సత్కారం పొందిన వారిలో తిరుపతి వైదిక యూనివర్సిటీ వేదార్ద విభాగ అధిపతి ప్రవా రామకృష్ణ సోమయాజీ, రాజమహేంద్రవరానికి చెందిన మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి, విజయవాడ దేవస్థానం వేద పండితులు ఉపాధ్యాయుల సుబ్రహ్మణ్య ఘనపాఠి, తంగిరాల వేంకటేశ్వర ఘనపాఠి, అన్నవరం దేవస్థానం విశ్రాంత వేద పండితులు ముష్టి కామశాస్త్రి తదితరులున్నారు. అన్నవరంలో నేడు తెల్లవారుజామున 3.00: సుప్రభాత సేవ ఉదయం 8.00: చతుర్వేద పారాయణ సాయంత్రం 4.00: కొండ దిగువన దేవస్థానం ఉద్యానవనంలో స్వామివారి వనవిహారం సాయంత్రం 5.00: కొండ దిగువన నూతన టేకు రథంపై సత్యదేవుడు, అమ్మవారి ఊరేగింపు ఉదయం 7.00 – 10.00, సాయంత్రం 5.00 – రాత్రి 11.00: రత్నగిరి కళావేదిక మీద, కొండ దిగువన సాంస్కృతిక కార్యక్రమాలు -
తాడిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
కొత్తపల్లి: తాడిచెట్టుపై కల్లు గీసేందుకు ఎక్కిన కార్మికుడు మృతి చెందిన ఘటన సోమవారం కొమరగిరిలో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కొమరగిరి శివారు వెంకటరాయపురానికి చెందిన కల్లుగీత కార్మికుడు శీలం లక్ష్మణరావు (53) సోమవారం ఉదయం కల్లు గీసేందుకు తాడిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు తాడిచెట్టుపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణరావుకు భార్య, ముగ్గురు ఆడ పిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. అతని కూలిపని ఆధారంగా బతికే ఆ కుటుంబ సభ్యులు లక్ష్మణరావు మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ జె.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మందుగుండు సామగ్రి తయారీ కేంద్రాలపై నిఘా
● ఇష్టానుసారం విక్రయాలు సాగిస్తే కఠిన చర్యలు ● ఎన్నికల ఫలితాల రోజున విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి అమలాపురం టౌన్: రాష్ట్రంలోని పల్నాడు తదితర జిల్లాల్లో ఎన్నికల తర్వాత వివాదాలకు, విధ్వంసాలకు తెగబడ్డ అల్లరి మూకలకు సిట్ దర్యాప్తులతో ముకుతాడు వేస్తున్న నేపథ్యంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసు శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా జిల్లాలో బాణసంచా, మందుగుండు సామగ్రి తయారీ కేంద్రాలపై నిఘా పెంచింది. జిల్లావ్యాప్తంగా ఉన్న తయారీ కేంద్రాల వద్దకు రెండు రోజులుగా ఆయా ప్రాంతాల పోలీసు అధికారులు స్వయంగా వెళ్లి తయారీదారులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వచ్చే నెల 4వ తేదీన ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి తర్వాత జరిగే విజయోత్సవ ర్యాలీల్లో బాణసంచా, మందుగుండు సామగ్రి కాల్చేందుకు తొలుత పోలీసుల నుంచి విధిగా అనుమతులు తీసుకోవాలి. విజయోత్సవ ర్యాలీల్లో బాణసంచా భారీ ఎత్తున కాల్చేందుకు అనుమతులు లేవు. విజయం సాధించిన అభ్యర్థుల అనుచరులు ఏర్పాట్లు చేసుకుని మందుగుండు సామగ్రి తయారీ కేంద్రాలకు వచ్చినప్పుడు తయారీదారులు కచ్చితంగా పోలీసుల నుంచి అనుమతి పత్రం ఉందా... లేదా...? రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్ ఈ మేరకు జిల్లాలోని పోలీసు అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో జిల్లావ్యాప్తంగా పలు తయారీ కేంద్రాల్లో పోలీసు అధికారులు సోమవారం విస్త్రృత తనిఖీలు చేసి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇదే విషయంపై జిల్లాలో ఎక్కడికక్కడ పోలీసు అధికారులకు స్థానిక ప్రజలు అవగాహన కూడా కల్పిస్తున్నారు. లైసెన్స్డ్ తయారీ కేంద్రాల్లో పరిమితులకు మించి బాణసంచా తయారు చేసినా, విక్రయించినా అనధికార కేంద్రాల ద్వారా విక్రయాలు సాగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా అమలాపురం పట్టణ పరిధిలో ఉన్న మందుగుండు సామగ్రి తయారీ కేంద్రాలను పట్టణ సీఐ కె.కృష్టోఫర్ తన సిబ్బందితో సోమవారం వెళ్లి విస్త్రతంగా తనిఖీ చేశారు. తయారీదారులకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. మద్యం అక్రమ నిల్వలపై కూడా పోలీసులు కన్నేసి ఉంచారు. ఓట్ల లెక్కింపు రోజున విజయోత్సవాల ముసుగులో అల్లర్లు జరిగే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పోలీసు తనిఖీలు
మూడంచెల భద్రతపై సమీక్షలు, సూచనలు అమలాపురం టౌన్: జిల్లాలోని అమలాపురం లోక్సభ నియోజకవర్గం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రంగా నిర్దేశించిన కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం ఇప్పటికే పోలీసు వలయంలో ఉంది. ఇప్పటికే ఓట్లు నిక్షిప్తమైన ఈవీఎంలు ఆ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరచిన సంగతి తెలిసిందే. జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్ మూడు రోజులుగా స్ట్రాంగ్రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతపై జిల్లా పోలీసు అధికారులు, కేంద్ర బలగాలతో సమీక్షిస్తూనే ఉన్నారు. మరోసారి సోమవారం సాయంత్రం తనిఖీలు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఏర్పాటు చేసిన అగ్ని మాపక శకటాలను కూడా ఆయన తనిఖీ చేసి ఆ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. జిల్లా ఎస్పీ శ్రీధర్, ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా ఆధ్వర్యంలో సమస్యాత్మక గ్రాౖమమైన కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట ప్రాంతాల్లో డీఎస్పీలు ఎం.మహేశ్వరరావు, బి.రామకృష్ణ, రమణ సీఐలు, ఎస్సైలతో కలసి తనిఖీలు చేశారు. లైసెన్స్లు లేకుండా అక్రమంగా తిరుగుతున్న మోటారు సైకిళ్లను పట్టుకుని సీజ్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. -
పాఠ్య పుస్తకాలొచ్చేస్తున్నాయ్
నిరంతరం సమీక్ష నోట్బుక్స్, పాఠ్య పుస్తకాల సరఫరా ప్రారంభమైంది. ఏ మేరకు సరఫరా అయ్యాయనే విషయమై నిరంతరం మండల విద్యాశాఖాధికారులతో సమీక్షిస్తున్నాం. విద్యాకానుక–5 సంబంధించి కాంపొనెంట్స్ వారీగా సమీక్ష చేస్తున్నాం. – బీవీవీ సుబ్రహ్మణ్యం, కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి, సమగ్ర శిక్షా, అమలాపురం మండల స్టాక్ పాయింట్ల తనిఖీ మండల స్టాక్ పాయింట్కు వచ్చిన మెటీరియల్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాం. మండల స్టాక్ పాయింట్లలో కాంపొనెంట్ వారీగా కమిటీలు ఏర్పాటు చేశాం. – ఎ.మదుసూధనరావు, డిప్యూటీ కలెక్టర్, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్షా, అమలాపురం. విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే... పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభమవుతాయి. ఆ రోజుకు ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్య పుస్తకం ఉండాలనేది ఉన్నతాధికారుల లక్ష్యం. ఆ మేరకు పాఠ్య పుస్తకాల సరఫరా వేగంగా సాగుతోంది. – ఎం.కమలకుమారి, జిల్లా విద్యాశాఖ అధికారిణి, అమలాపురం. ● ముందుచూపుతో మేల్కొన్న పాఠశాల విద్యాశాఖ ● 1–7 తరగతులకు పుస్తక గోదాం నుంచి మండలాలకు సరఫరా ● 8–10 తరగతులకు ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా మండల స్టాక్ పాయింట్లకు ● జిల్లాకు 16.75 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం రాయవరం: పాఠశాలలు పునఃప్రారంభించే సమయానికి ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్య పుస్తకం ఉంచేందుకు పాఠశాల విద్యాశాఖ మార్చి నుంచే చర్యలు ప్రారంభించింది. పాఠ్య పుస్తకాల పంపిణీలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు దఫాలుగా విద్యాకానుకను విజయవంతంగా, నాణ్యతతో విద్యార్థులకు అందజేశారు. అదే ఒరవడిలో పాఠశాల ప్రారంభం రోజునే పాఠ్య పుస్తకం, విద్యాకానుక కిట్లు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఈ ఏడాది కూడా పాఠ్య పుస్తకాలను విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే ఇచ్చే విధంగా పాఠ్య పుస్తకాల ముద్రణ, సరఫరా ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్లోనే నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు జిల్లా గోదాంకు రావడం ప్రారంభించాయి. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రతి పాఠ్య పుస్తకం కవర్పేజీలో మార్పులు చేసి, విద్యార్థిని ఆకట్టుకొనే విధంగా తీర్చిదిద్దారు. పాఠ్య పుస్తకంలో క్యూర్ కోడ్ను కూడా ముద్రించారు. దీని ద్వారా పాఠ్యాంశానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని పొందవచ్చు. దశల వారీగా అన్ని తరగతులకు సెమిస్టర్ విధానం పుస్తకాల బరువుతో విద్యార్థుల వెన్నుముకపై భారం పడకుండా ఉండేందుకు సెమిస్టర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో 1–9వ తరగతి వరకు సెమిస్టర్ విధానం అమలు చేయగా, ఈ ఏడాది పదవ తరగతికి కూడా అమలు చేశారు. గణితం, సైన్స్ సబ్జెక్టులను రెండు సెమిస్టర్లుగా విడదీశారు. సిలబస్ మొత్తాన్ని జూన్ నుంచి అక్టోబర్ వరకు సెమిస్టర్–1, నవంబర్ నుంచి మార్చి వరకు సెమిస్టర్–2గా విభజించారు. దశలవారీగా అన్ని తరగతులకు సెమిస్టర్ విధానం అమలు చేశారు. 1–10 తరగతులకు పాఠ్య పుస్తకాల్లో బైలింగ్విల్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఒక పేజీలో ఇంగ్లిషు, ఒక పేజీలో తెలుగు పాఠ్యాంశాన్ని ముద్రించి ఇవ్వడం వల్ల విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుని చదువుకునే వీలుంటుంది. 1–10 తరగతుల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలకు సంబంధించి 111 టైటిల్స్ను సరఫరా చేస్తున్నారు. రెండు విధాలుగా పాఠ్య పుస్తకాల సరఫరా గత విద్యా సంవత్సరం వరకు పాఠ్య పుస్తకాలు ఉమ్మడి జిల్లా పరిధిలోని ధవళేశ్వరంలో ఉన్న పుస్తక గోదాంకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ప్రింటింగ్ ప్రెస్ల ద్వారా సరఫరా చేసేవారు. అక్కడ నుంచి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు సరఫరా చేసేవారు. అయితే ఈసారి పాఠ్య పుస్తకాలను రెండు విధాలుగా సరఫరా చేస్తున్నారు. 1–7 తరగతులకు నేరుగా పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్లు పుస్తక గోదాం నుంచి మండల స్టాక్ పాయింట్లకు సరఫరా చేస్తుండగా, 8–10 తరగతులకు ప్రభుత్వ అనుమతి పొందిన ప్రింటింగ్ ప్రెస్ల నుంచి నేరుగా మండల స్టాక్ పాయింట్లకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే 1–7 తరగతులకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు 14,97,436 పుస్తకాలు సరఫరా కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు గ్రౌండ్ బ్యాలెన్స్తో కలిపి 6,54,000 పాఠ్య పుస్తకాలు సరఫరా అయ్యాయి. ఇక్కడ నుంచి ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా మండల స్టాక్ పాయింట్లకు సరఫరా కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే 8–10 తరగతులకు నేరుగా పాఠ్య పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు సరఫరా ప్రారంభమైంది. 16.75 లక్షల పుస్తకాల అవసరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని 22 మండలాల్లోని 1,580 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు ప్రభుత్వం ఏటా ఉచితంగా పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తోంది. సెమిస్టర్–1, సెమిస్టర్–2కు సంబంధించి జిల్లాకు 16.75 లక్షల పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్స్ సరఫరా కావాల్సి ఉంది. 1.83 లక్షల వరకు వర్క్బుక్స్ కూడా సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటికే పాఠ్యపుస్తకాల సరఫరా ప్రారంభమైంది. వేసవి సెలవులు ముగిసే నాటికి జిల్లా కేంద్రానికి, అక్కడి నుంచి మండల స్టాక్ పాయింట్లకు పాఠ్య పుస్తకాలను చేరవేసి, పాఠశాలల పునఃప్రారంభించే రోజునే విద్యార్థుల చేతికి విద్యాకానుక–5 అందజేయాలనే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ కృషి చేస్తోంది. పాఠ్య పుస్తకాల సరఫరా తరగతుల వారీగా ఇలా... తరగతి మొత్తం సెమిస్టర్ 1,2 నాన్ సెమిస్టర్ టైటిల్స్ 10 13 గణితం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, సైన్స్, సోషల్ 9 15 గణితం, పీఎస్ తెలుగు, హిందీ, ఇంగ్లిష్ బయాలజీ, సోషల్ 8 13 గణితం, పీఎస్ తెలుగు, హిందీ, ఇంగ్లిష్ బీఎస్, సోషల్ 7 09 గణితం, సైన్స్, తెలుగు, హిందీ, ఇంగ్లిష్, సోషల్ 6 09 గణితం, జనరల్ తెలుగు, హిందీ, ఇంగ్లిష్, సైన్స్, సోషల్ 5 12 గణితం,ఈవీఎస్ తెలుగు, ఇంగ్లిష్, 4 12 గణితం,ఈవీఎస్ తెలుగు, ఇంగ్లిష్, 3 12 గణితం,ఈవీఎస్ తెలుగు,ఇంగ్లిష్ 2 08 గణితం తెలుగు, ఇంగ్లిష్ 1 08 గణితం తెలుగు, ఇంగ్లిష్ -
కొబ్బరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
అంబాజీపేట: సంక్షోభంలో ఉన్న కొబ్బరి రైతులను ఆదుకునేందుకు నాఫెడ్ ఆధ్వర్యంలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ డిప్యూటీ కార్యదర్శి సంజయ్కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేసినట్టు ఆయిల్ఫెడ్ మేనేజర్ యు.సుధాకరరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 15న రాసిన లేఖ ఆధారంగా 8 వేల మెట్రిక్ టన్నుల మిల్లింగ్ కోప్రాను 6 నెలల వ్యవధిలో కొనుగోలు చేయనున్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది బాల్ కోప్రాను రూ.11,750 కు కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ.12 వేలకు కొనుగోలు చేస్తారన్నారు. మిల్లింగ్ కోప్రాను రూ.10,860కు గత ఏడాది కొనుగోలు చేయగా ఈ ఏడాది రూ.11,120కు కొనుగోలు చేస్తారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అవసరమైన అనుమతులు తీసుకున్న తరువాతే కొనుగోలు తేదీని ప్రకటించాలని సంజయ్కుమార్ సూచించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించే ముందు కేంద్ర నోడల్ ఏజెన్సీ అన్ని రకాల వసతులు పరిశీలించి తగిన నివేదికను రూపొందించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన జీవో కాపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హార్టీకల్చర్ కమిషనర్ శ్రీధర్కు పంపినట్లు సంజయ్కుమార్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికిరూ.లక్ష విరాళం ఆలమూరు: మండలంలోని చొప్పెల్లలో వేంచేసియున్న శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందింది. ఆలమూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వంటిపల్లి పాపారారావు సోమవారం స్థానిక ఆలయ కమిటీకి అందజేశారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇసుక ర్యాంపుల తనిఖీకి ప్రత్యేక యంత్రాంగం జిల్లా మైన్స్ అండ్ జియాలజీ ఏడీ సాయిరాం కపిలేశ్వరపురం: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని ఇసుక ర్యాంపులను తనిఖీ చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా మైన్స్ అండ్ జియాలజీ ఏడీ సాయిరాం తెలిపారు. మండలంలోని తాతపూడి, కపిలేశ్వరపురం ఇసుక ర్యాంపులను సోమవారం ఆయన ఆధ్వర్యంలోని అధికారుల బృందం తనిఖీ చేసింది. ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు జిల్లాలోని ఇసుక ర్యాంపులను తనిఖీ చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై ఇక నుంచి ర్యాంపుల నిర్వహణపై వారాంతపు నివేదికలను పంపించనున్నామన్నారు. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ర్యాంపులను సందర్శిస్తున్నామన్నారు. ర్యాంపుల నిర్వహణలో సమస్యలు తలెత్తినా, అక్రమాలు జరిగినా మైన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదులను మైన్స్, పోలీస్, ఎస్ఈబీ, ఇరిగేషన్ తదితర అధికారులతో కూడిన బృందం పరిశీలిస్తుందన్నారు. ఫిర్యాదులను పరిష్కరించేందుకు, ర్యాంపులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసేందుకు జిల్లాలో రెండు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఆర్ఐలు వి.శ్రీనివాస్, సుజాత, సర్వేయర్ ఎస్.సతీష్, వీఆర్వోలు ప్రసాద్, శ్రీనివాస్, పొల్యూషన్ కంట్రోల్ ఏఈఈబీ శ్రీఫణిత, ఎస్ఈబీ ఎ.సత్యవాణి ఉన్నారు. జంతు సంరక్షణ చట్టాల అమలుకు నోడల్ అధికారి కాకినాడ క్రైం: హైకోర్టు ఆదేశాల మేరకు జంతు సంరక్షణ చట్టాల అమలుకు జిల్లా ప్రత్యేక నోడల్ అధికారిగా అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావును నియమిస్తూ ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జంతు అక్రమ రవాణా, అక్రమ వధ వంటి అంశాల్లో ఎటువంటి సమాచారం అందినా ప్రజలు నేరుగా 94407 96501 నంబరుకు ఫోన్ చేసి, నోడల్ అధికారికి తెలియజేయాలని ఎస్పీ కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
నే...రుగా ఖాతాల్లోకి...
● క్రమం తప్పకుండా ఇచ్చారు నాకు చేయూత సొమ్ము వచ్చింది. గత నెలలోనే ఖాతాలో పడతాయనుకున్నాను. నాకు నాలుగవసారి ఈ సొమ్ము వచ్చింది. ప్రతిసారి క్రమం తప్పకుండా ర.18,750 చొప్పున ఇచ్చారు. బ్యాంకుకు వెళ్లి మరోసారి చూసుకోవాలి. నేను రుమాలీ రోటీ వ్యాపారం చేసుకుంటున్నాను. జగన్ ఇచ్చే సొమ్ము నా వ్యాపారానికి ఉపయోగపడుతోంది. – విప్పర్తి ఈశ్వరీదేవి, కొంకాపల్లి, అమలాపురం మండలం ● ఈ ప్రభుత్వంలోనే పరిహారం అందింది నాకు రెండున్నర ఎకరాల వరి పొలం ఉంది. గత ఏడాది మిచాంగ్ తుపాను వల్ల ఖరీఫ్ పంట కొంత వరకు నష్టపోయాను. ఇప్పుడు రూ.10,300 వరకు పెట్టుబడి రాయితీ రూపంలో అందింది. ఈ ప్రభుత్వంలోనే పంట నష్టపోయిన తరువాత పంట కాలంలో పరిహారం అందింది. – సలాది లక్ష్మణబాబు, రైతు, గొల్లవిల్లి, ఉప్పలగుప్తం మండలం● అన్నదాతలకు పెట్టుబడి రాయితీ... అక్కచెల్లెమ్మలకు చేయూత ● ఎన్నికల ముందే అందించేందుకు ప్రభుత్వం సిద్ధం ● కుటిల యత్నాలతో అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ● పోలింగ్ పూర్తి కావడంతో సొమ్ము జమ చేసిన వైనం ● జిల్లాలో 23,379 మంది రైతులకు లబ్ధి ● రూ.20.25 కోట్ల పంపిణీ ● ఇదే తరహాలో మహిళలకూ అందిన డబ్బు సాక్షి అమలాపురం: ఒకరు ఆపత్కాలంలో రాజకీయాలను పక్కనబెట్టి ఆదుకునే నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి. మరోవైపు ఆపత్కాలంలో సైతం స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసే చంద్రబాబునాయుడు. వీరిద్దరి మధ్య వ్యత్యాసాన్ని తాజా ఎన్నికలు మరోసారి నిరూపించాయి. పంట నష్టపోయిన వెంటనే రెండో పంట కాలంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు పరిహారం (పెట్టుబడి రాయితీ రూపంలో) అందజేస్తోంది. కొన్నిసార్లు నెల రోజులలోనే ఈ పెట్టుబడి రాయితీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచింది. గత ఏడాది ఖరీఫ్లో మిచాంగ్ తుపాను వల్ల వరి, ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు రబీలో పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఎన్నికల ముందు పరిహారం అందించడం ద్వారా ఓటర్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రభావితం చేస్తోందంటూ చంద్రబాబు తన కోటరీ మనుషులతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించారు. దీంతో రైతులకు పరిహారం పంపిణీ ఆలస్యమైంది. దీంతోపాటు చేయూత, ఈబీసీ నేస్తం వంటి పథకాల సొమ్ము లబ్ధిదారులకు అందకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. ఎన్నికలు పూర్తి కావడంతో ప్రభుత్వం రైతులకు, మహిళలకు పరిహారం, ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించింది. గత సంభవించిన ఏడాది మిచాంగ్ తుపాను వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు కలిగిన నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రాయితీ అందించింది. 23,379 మంది రైతులకు రూ.20.25 కోట్ల పెట్టుబడి రాయితీ అందించాల్సి ఉంది. ఈ సొమ్ము ఎన్నికల ముందు రైతుల ఖాతాలో జమ కావాల్సి ఉంది. చంద్రబాబు ఎన్నికల కమిషన్ ద్వారా కుట్ర పూరితంగా అడ్డుకున్నారు. అప్పట్లోనే పరిహారం అంది ఉంటే రైతులకు రబీ కోతలకు అక్కరకు వచ్చేది. గత ఏడాది మిచింగ్ తుపాను వల్ల కలిగిన నష్టంపై అధికారులు జనవరి మొదటివారంలో లెక్క తేల్చారు. తుపాను వల్ల భారీ వర్షాలతో వరితోపాటు ఉద్యాన పంటలైన అరటి, కూరగాయలు, కొబ్బరి పంటలకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. పంట నష్టాలపై తొలుత ప్రాథమిక అంచనాలు తయారు చేసిన జిల్లా యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాలతో డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తిస్థాయి నష్టపరిహార అంచనాలను రూపొందించింది. అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు వ్యవసాయ సబ్ డివిజన్లలో వరికి అధికంగా నష్టం వాటిల్లింది. మొత్తం వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి 28,938 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు లెక్క తేల్చారు. వరి సాగుకు పెట్టుబడి రాయితీగా హెక్టారుకు రూ.17,000, అరటికి హెక్టారుకు రూ.25 వేలు, కూరగాయలు, బొప్పాయి, పసుపు, పువ్వుల సాగుకు హెక్టారుకు రూ.17 వేల చొప్పన, తమలపాకు సాగుకు హెక్టారుకు రూ.75 వేల చొప్పున పెట్టుబడి రాయితీ అందనుంది. వీటితోపాటు దెబ్బతిన్న కొబ్బరి చెట్టుకు రూ.వెయ్యి చొప్పున రైతులకు అందుతోంది. లబ్ధిదారుల ఖాతాలో చేయూత సొమ్ము నవరత్నాలలో భాగంగా వైఎస్సార్ చేయూతను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వెనుకబడిన మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా వైఎస్సార్ చేయూతలో 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు నాలుగు దఫాలలో రూ.75 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. వైఎస్సార్ చేయూత పథకంలో జిల్లాలో లబ్ధిదారులకు నాల్గవ విడత సొమ్ము ఖాతాలో జమ కావాల్సి ఉంది. కాని ఎన్నికల కమిషన్ మోకాలు అడ్డడంతో లబ్ధిదారులకు ఈ నిధులు సకాలంలో జమ కాలేదు. జిల్లాలో 89,619 మంది లబ్ధిదారులకు రూ.168.03 కోట్లు మంజూరైన విషయం తెలిసిందే. దీనిని కూడా చంద్రబాబు అడ్డుకున్నారు. ఎన్నికల పూర్తి కావడం, నిధులు మహిళల ఖాతాలో వేసేందుకు ఎన్నికల కమిషన్ అంగీకరించడంతో దఫదఫాలుగా ఈ సొమ్ము లబ్ధిదారులు ఖాతాలో వేస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మొత్తం నాలుగు విడతలకు రూ.649.02 కోట్లు లబ్ధిదారుల ఖాతాలో జమ చేసినట్టయింది. అలాగే ఆసరా పథకం లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో నిధులు వారి ఖాతాలో జమయ్యాయి. ఈబీసీ నేస్తం సొమ్ము జమ రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ, చేయూతతోపాటు ఈబీసీ నేస్తం సొమ్మును సైతం ప్రభుత్వం మహిళల ఖాతాల్లో జమ చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు మైనార్టీ వర్గాలు కాకుండా ఇతర అగ్రవర్ణాలకు చెందిన మహిళలకు ఈబీసీ నేస్తం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలో ఈ పథకం ద్వారా 11,496 మంది మహిళలకు రూ.17.24 కోట్లను ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులకు నగదు జమ కాగా, మిగిలిన వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తోంది. ఈబీసీ నేస్తం ద్వారా 2021–22 ఆర్థిక సంవత్సరానికి 11,053 మందికి రూ.16.57 కోట్లు అందించగా, 2022–23 సంవత్సరానికి 12,818 మంది లబ్థిదారులకు రూ.19.22 కోట్లు అందించింది. తాజాగా మూడవ విడత సొమ్ము అందజేస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు రావడంతో లబ్ధిదారులైన మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
చోరీకి గురైన 281 ఫోన్లు బాధితులకు అందజేత
ఇప్పటి వరకు రూ.2.52 కోట్ల విలువైన ఫోన్లు అందించిన పోలీసులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో చోరీకి గురైన, పోగొట్టుకున్న 281 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఎస్పీ పి.జగదీష్ సోమవారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పి.జగదీష్ మాట్లాడుతూ పొగొట్టుకున్న ఫోన్లను చాట్బోట్ ద్వారా ఒక వాట్సాప్ మెసేజ్తో రివకరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నామని, ఇప్పటివరకు ఆ విధంగా రూ.2.52 కోట్ల విలువైన 1,393 ఫోన్లు బాధితులకు అందజేశామన్నారు. ఫోన్ చోరీకి గురైన వారు చాట్ బోట్ సేవలను సేవలను వినియోగించుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లు ఎవరికై నా దొరికితే వాటిని సొంతానికి వాడుకోవడం, గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా బిల్లులు లేని సెల్ఫోన్లలను కొనడం చేయరాదన్నారు. దొరికిన సెల్ ఫోన్లలను దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అందజేయాలన్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లు ఇతర రాష్ట్రాలైన కేరళ, కర్నాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి రికవరీ చేశామన్నారు. ఈ సందర్భంగా ఫోన్లు రివకరీ చేసిన అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్వోలు, ఐటీ కోర్ టీం ఎస్సై అయ్యప్పరెడ్డి, కానిస్టేబుల్స్ కిరణ్, గౌతమ్, ప్రియాంక, గౌతమీ, శ్యామల, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
ఆఊరిగాయల రుచే వేరు!
● పచ్చళ్ల తయారీలో ఆ గ్రామాలు అదుర్స్ ● విదేశాలకు సైతం ఎగుమతి ● పలు కుటుంబాలకు జీవనోపాధి ఆత్రేయపురం: ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్క ఊరు ప్రసిద్ధి. కానీ ఊరగాయల తయారీకి మాత్రం ఆ గ్రామాలే పెట్టింది పేరు. అక్కడ నుంచి ఊరగాయలు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. ఆ గ్రామాల వారు పచ్చళ్ల తయారీతో జీవనోపాధి పొందడంతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆహా ఏమి రుచి తినరా మైమరచి అన్నట్టు... తినేవారికి నోరూరించే పచ్చళ్ల తయారీకి ఆత్రేయపురం మండలం ప్రసిద్ధి చెందింది. ఆవకాయకు ఆంధ్రా పెట్టింది పేరు కాగా కోనసీమలోని ఆత్రేయపురం, నార్కెడిమిల్లి, అంకంపాలెం, ఉచ్చిలి, ర్యాలి గ్రామాలు పచ్చళ్ల తయారీకి ప్రసిద్ధి చెందాయి. ఆవకాయ పచ్చడి తయారీలో ఈ గ్రామాల వారు మామిడికాయలకు కారం, నూనె, ఆవపిండి, ఉప్పు, వెల్లుల్లి, మెంతులు తదితర మసాలా దినుసులతో పాటు, ఆప్యాయతలు రంగరించి సొంత వాడకానికి చేసినట్టుగా పచ్చళ్లు తయారు చేస్తుంటారు. దీంతో వీటి ముందు కార్పొరేట్ కంపెనీల పచ్చళ్లు సైతం దిగదుడుపే అవుతాయి. కుటీర పరిశ్రమగా.. ఆత్రేయపురం మండలంలో నార్కెడిమిల్లి, ఆత్రేయపురం, అంకంపాలెం, ఉచ్చిలి, ర్యాలి గ్రామాల్లో సుమారు 15 వేలకు పైగా జనాభా ఉండగా 20 శాతం మంది పచ్చళ్ల తయారీనే కుటీర పరిశ్రమగా ఎంచుకుని జీవనోపాధి పొందుతున్నారు. సుమారు వెయ్యి కుటుంబాల వారు వేసవిలో పచ్చడి తయారు చేసి ఏడాది పొడవునా అమ్మకాలు సాగిస్తుంటారు. దీంతో పాటు సీజన్ల వారిగా ఏడాది పొడవునా వివిధ రకాల పచ్చళ్లు తయారు చేస్తుంటారు. ఆవకాయ, తీపి ఊరగాయ, మాగాయ, టమాటా, అల్లం, ఎండు మిరపకాయ, చింతకాయ, ఉసిరి, గొంగూర, నిమ్మకాయ, కాలీఫ్లవర్, ములక్కాడ పచ్చళ్ళను ఆయా సీజన్లను బట్టి తయారు చేస్తుంటారు. ఎంచుకున్న కూరగాయలతో పాటు తగినంత ఉప్పు, కారం, వెల్లుల్లి, పోపులు, నూనె వంటి దినుసులు వేసి వీరి చేతులతో కలిపితే ఆ రుచులే వేరు. మహిళలు తయారు చేసిన పచ్చళ్లను కుటుంబంలోని పురుషులు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. కడప, పులివెందుల, విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులో ఈ పచ్చళ్ళకు మంచి పేరుంది. విదేశీ గడ్డపై కూడా ఈ పచ్చళ్లు నోరూరిస్తూ ఆంధ్రా సత్తా చాటుకున్నాయి. నార్కెడిమిల్లిలో సుమారు 170 డ్వాక్రా సంఘాలు పావలా వడ్డీ రుణాలతో పచ్చళ్లు తయారు చేస్తూ ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నారు. పెరిగిన ధరలతో తయారీ భారం ఆవకాయ తయారు చేసేందుకు ఉపయోగించే మామిడికాయలు, ఇతర దినుసుల ధరలు పెరగడంతో పచ్చళ్ల తయారీ పెనుభారమౌతోందని ఈ పరిశ్రమపై ఆధారపడిన వారు అంటున్నారు. మామిడికాయ టన్ను ఒక్కింటికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు వరకు చెల్లిస్తుండగా ఎండుమిర్చి క్వింటాల్ రూ.18 వేల నుంచి రూ.20 వేలు, క్వింటాల్ ఉప్పు బస్తా రూ.400, 20 లీటర్ల నూనె డబ్బా రూ.3,500, ఆవాల బస్తా రూ.700, మెంతులు బస్తా రూ.900, వెల్లుల్లి క్వింటాల్కు రూ.15వేలు పలుకుతుందని చెబుతున్నారు. దీనికితోడు కూలీ ధరలు విపరీతంగా పెరగడంతో టన్ను మామిడికాయలతో తయారు చేసిన పచ్చడికి సుమారు రూ.65 వేలు ఖర్చు అవుతోంది. ఈ గ్రామాల వారు ఇంటి వద్ద కేజీ పచ్చడి రూ.225 నుంచి రూ.300కి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. వీరి వద్ద నుంచి కొనుగోలు చేసిన చిరు వ్యాపారాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో విక్రయించి జీవనోపాధి పొందుతారు. సీజన్ వారీగా పచ్చళ్లను తయారు చేసి ఏడాది పొడవునా దాన్ని భద్రపరచి అమ్మకాలు సాగిస్తుంటారు. అందుకు గాను వేసవిలో తమకున్న పరపతినంతా ఉపయోగించి మూడు వేల కుటుంబాల వారు ప్రైవేటు వ్యక్తుల వద్ద, బ్యాంకుల వద్ద రుణాలు తెచ్చి పచ్చళ్లు తయారు చేస్తారు. సగటున ఒక్కొక్క కుటుంబం వారు పది టన్నుల మామిడికాయలు దిగుమతి చేసుకుంటారు. అందుకే వేసవిలో ఈ గ్రామాల్లో ఏ ఇంట చూసినా మామిడిరాశులు కనుల విందు చేస్తాయి. మూడు వేల కుటుంబాల వారు సుమారు 30 వేల టన్నుల వరకు మామిడికాయలను దిగుమతి చేసుకుంటారు. పచ్చళ్ల తయారీతో ఉపాధి పచ్చడి తయారీతో జీవనోపాధి పొందడంతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తున్నాను. గత 30 ఏళ్లుగా పచ్చడి తయారీలో అనుభవం ఉంది. – సుంకర బ్రహ్మానందం, అంకంపాలెం వేసవిలో తయారు చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తాను ఏటా వేసవిలో పెట్టుబడులు పెట్టి పచ్చళ్లు తయారు చేస్తాను. ఆ పచ్చళ్లను హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో విక్రయిస్తూ పలువురి ఉపాధికి తోడ్పడుతున్నాను. – అడ్డాల రమేష్, ఆత్రేయపురం
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement