-
కర్రసాము.. మెలకువలు పట్టేద్దాము
కోచ్ సూచనలను శ్రద్ధగా వింటున్న చిన్నారులు● ఏలూరు ఏఆర్డీజీకే హైస్కూల్లో వేసవి శిక్షణ శిబిరం ● ఆసక్తిగా నేర్చుకుంటున్న మహిళలు, చిన్నారులు ప్రాచీన సంప్రదాయ క్రీడల్లో కర్రసాము ఒకటి. మానసిక ఉల్లాసానికి, శారీరక వ్యాయామానికి, ఆత్మరక్షణకు ఇది దోహదం చేస్తుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు ప్రస్తుత కాలంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా ఏలూరులోని అశోక్నగర్ ఏఆర్డీజీకే హైస్కూల్లో గత రెండు రోజులుగా కర్రసాముపై మహిళలు, చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. కర్రసాము వల్ల కలిగే ఉపయోగాలను వివరిస్తూ ఆత్మరక్షణకు ఎలా ఉపయోగపడుతుందో వివరిస్తూ మెలకువలను నేర్పిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు కర్రసాము ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవం, హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కర్రసాము శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. జోగా చంద్రశేఖర్, జోగా మోహన్రావు, కె.శ్రీనివాసరావు కోచ్లుగా వ్యవహరిస్తున్నారు. – సాక్షి, ఫొటోగ్రాఫర్, ఏలూరు -
పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ఆగిరిపల్లి: కడుపునొప్పి తట్టుకోలేక ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. పోతవరప్పాడుకు చెందిన ప్రత్తిపాటి కోటేశ్వరరావు (58) కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న సుబ్బారావును చికిత్స కోసం కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలు
జంగారెడ్డిగూడెం రూరల్: తాడువాయి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఇటుకలు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ పైనుంచి ఓ ఇటుక జారి రోడ్డుపై పడింది. ట్రాక్టర్ వెనుక ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు మహిళలు ఈ ఇటుక పైనుంచి వాహనం వెళ్లడంతో అదుపుతప్పి కింద పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాఽథమిక చికిత్స అందించారు. ఇద్దరిపై విద్యుత్ చౌర్యం కేసుల నమోదు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని దేవరపల్లి మండలం యర్నగూడెం సెక్షన యాదవోలు గ్రామంలో అక్రమంగా విద్యుత్ను వినియోగిస్తున్నారని అందిన సమాచారం మేరకు ఏలూరు విద్యుత్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేసి ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ట్రాన్స్కో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ వి.రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ అధికారుల తనిఖీ సమయంలో దాండ్రు రాంబాబు అనే వ్యక్తి తన గృహంలోని ఏసీలకు విద్యుత్ను అక్రమంగా వినియోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. అలాగే ప్రగడ సుబ్బారావు అనే వ్యక్తి తన వాటర్ప్లాంట్కు అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వీరిపై కేసులు నమోదు చేసి వారికి రూ.2,25,039 అపరాధ రుసుము, రూ.28 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. జిల్లాలో ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అశ్లీల వీడియో తీసిన నలుగురి అరెస్ట్ మండవల్లి: ఓ బాలిక, బాలుడిపై అసభ్యకర వీడియో తీసి వాట్సాప్లో ఫార్వర్డ్ చేసిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు ఎస్సై రామచంద్రరావు బుధవారం చెప్పారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు జిల్లా మండవల్లి మండలం పులపర్రు గ్రామానికి చెందిన బాలికను ఈనెల 15న మధ్యాహ్నం 12 గంటలకు ఆమె స్నేహితురాలు చింతపాడు హైస్కూల్ వద్దకు రమ్మనగా వెళ్లింది. అక్కడ చింతపాడుకు చెందిన ఓ బాలుడు ఆమెను స్కూల్లోని తరగతి గదిలోకి తీసుకువెళ్లాడు. అక్కడ వీరిద్దరూ శారీరకంగా కలవగా కొందరు వీడియో తీశారు. ఈ వీడియో వాట్సాప్లో ఫార్వర్డ్ చేయగా ఈనెల 21న వీడియో వైరల్ అయ్యింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కై కలూరు రూరల్ సీఐ బి.కృష్ణకుమార్ బాధ్యుడైన బాలుడిని విజయవాడ జువైనెల్ హోమ్కు తరలించారు. వీడియో తీసి ఫార్వర్డ్ చేసిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కై కలూరు కోర్టులో హాజరుపరిచారు. -
చిలక జ్యోతిష్యుడి అవతారం ఎత్తావా ?
ఏలూరు టౌన్: సంక్షేమ పాలనతో దేశానికే ఆదర్శంగా నిలిచి, రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీ ఉండి అభ్యర్థి రఘురామకృష్ణరాజుకు లేదని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఘంటా ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఏలూరులో ఒక ప్రకటన విడుదల చేశారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచే సత్తా లేని రఘురామకృష్ణరాజు చిలకజోతిష్యుడి అవతారం ఎత్తాడని ఎద్దేవా చేశారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్లో రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ స్థానాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంటుందని, ఉండిలో రఘురామకృష్ణరాజు ఓటమి ఖాయమన్నారు. రాజకీయ జీవితం ప్రసాదించిన పార్టీకే వెన్నుపోటు పొడిచావనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పటానికి నువ్వు ఏమైనా దైవాంశసంభూతుడివా అంటూ ప్రశ్నించారు. ఉండి ప్రజల నుంచి రిటర్న్ గిఫ్ట్ తీసుకునేందుకు రెడీగా ఉండాలన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉండి నియోజకవర్గంలో పార్టీ తరపున అభ్యర్థిగా పీవీఎల్ నర్సింహరాజుకు మాండేట్ ఇచ్చారనీ, ఆయన పైనే గెలవలేని నువ్వా వైఎస్ జగన్ను విమర్శించేది అన్నారు. రాజకీయాల్లో విలువలకు కట్టుబడి జీవించే క్షత్రియులకు మచ్చతెచ్చేలా అనైతిక రాజకీయాలు చేయటానికి సిగ్గులేదా అని నిలదీశారు. జూన్ 4న కౌంటింగ్ అనంతరం భవితవ్యం ఏమిటో చూసుకోవాలనీ, వైఎస్సార్ సీపీ గురించి, లేదా నాయకుల గురించి అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని ప్రసాదరావు హెచ్చరించారు. టీడీపీ ఉండి అభ్యర్థి రఘురామపై వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు మండిపాటు -
బాణసంచా తయారీ, వినియోగంపై నిషేధం
ఏలూరు(మెట్రో): సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్, ప్రకటనలో గెలుపొందిన అభ్యర్ధులకు మద్దతుగా విజయోత్సవాలు నిర్వహించే క్రమంలో బాణసంచా కాల్చడం వంటి వాటివల్ల తలెత్తే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఏలూరు జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ, రవాణా, విక్రయాలపై జూన్ 5వరకు తాత్కాలిక నిషేధం విధిస్తూ కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఉత్తర్వులు జారీచేశారు. శాంత భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ నిషేధాజ్ఞలు విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. -
అక్కచెల్లెమ్మలకు ఆసరాగా..
●ఇచ్చిన మాట నిలుపుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా సంఘాలకు వంద శాతం రుణమాఫీ సొమ్మును ఆసరా పథకం పేరుతో క్రమం తప్పకుండా అందించారు. మొత్తం బ్యాంకు రుణాన్ని నాలుగు విడతల్లో మా పొదుపు ఖాతాలకు జమ చేశారు. ఆసరా సొమ్ము మాకు ఎంతో అక్కరకు రావడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు సీఎం వైఎస్ జగన్కు రుణపడి ఉంటారు. – కె.కల్పనాదేవి, పోతునూరు, దెందులూరు మండలం రూ.56 వేల లబ్ధి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి అందిస్తున్న సహాకారం మరువలేనిది. ఆసరా నాలుగు విడతల్లో రూ.14 వేలు చొప్పున రూ.56 వేలు లబ్ది చేకూరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు. – మేడిశెట్టి దుర్గ, పోతునూరు, దెందులూరు మండలం ఏలూరు (టూటౌన్): ఎన్నికల నిబంధనల పేరుతో ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు కలిగించినా ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసరా నాలుగో విడత నిధులను విడుదల చేశారు. ఏలూరు జిల్లా పరిధిలో 3.90 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నాలుగో విడత ఆసరా నిధులు రూ.362.59 కోట్లు ఇటీవల విడుదల చేశారు. ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో ఆసరా నిధుల విడుదలలో జాప్యం జరిగింది. దీనిపై జిల్లాలోని డ్వాక్రా మహిళల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికలైన తరువాత రోజునే ఆసరా, విద్యాదీవెన నిధులను సీఎం వైఎస్ జగన్ యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. దీంతో డ్వాక్రా మహిళల్లో సంతోషాలు వెల్లివిరిశాయి. జగన్ మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడంతే అని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాలుగో విడతలో రూ.337 కోట్లు జమ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మొత్తం నాలుగు విడతల్లో ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ మొత్తాలను మహిళల ఖాతాలకు నేరుగా జమచేశారు. దీనిపై జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ, అమ్మ ఒడి వంటి పథకాల ద్వారా ఆర్థిక సహాకారం అందిస్తూ మహిళా సాధికారతకు కృషి చేస్తుందని ప్రశంసిస్తున్నారు. తాజాగా నాలుగో విడతలో జిల్లాలోని 39,539 గ్రూపులకు చెందిన 3,89,801 మందికి రూ.337.34 కోట్లు నిధులను అందజేశారు. మొత్తం వైఎస్ఆర్ ఆసరా పథకంలో జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల మందికి పైగా మహిళలకు మొత్తం నాలుగు విడతల్లో రూ.1448.41 కోట్ల రుణమాఫీ ప్రయోజనం చేకూరింది. ఇంత పెద్ద మొత్తంలో మహిళల ఖాతాలకు అందించడం పట్ల జిల్లాలోని డ్వాక్రా సంఘాల సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.1448.41 కోట్లు రుణమాఫీ ఏలూరు జిల్లా పరిధిలోని 28 మండలాలు ఏలూరు అర్బన్ పరిధిలో కలిపి మొత్తం 39,539 డ్వాక్రా సంఘాలకు చెందిన 3,89,801 మంది మహిళలకు రూ.1448.41 కోట్ల మేరకు రుణమాఫీ జరిగింది. ఆసరా మొదటి విడతలో జిల్లాలోని 39,574 గ్రూపులకు రూ.362.59 కోట్లు, రెండో విడతలో 39,539 గ్రూపులకు రూ.360.58 కోట్లు, మూడో విడతలో 39,539 గ్రూపులకు రూ.364.26 కోట్లు, ఆసరా నాలుగో విడతలో 39,539 గ్రూపులకు రూ.362.65 కోట్ల లబ్ధి చేకూరింది. డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి ఆసరా నిధులు జమ గత నాలుగు విడతల్లో రూ.1448.41 కోట్ల లబ్ధి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ నాలుగు విడతల్లో ఆసరా పథకంలో లబ్ధి ఫేజ్ గ్రూపులు రుణమాఫీ (రూ.కోట్లలో) మొదటి విడత 39,574 362.59 రెండో విడత 39,539 360.58 మూడో విడత 39,539 362.65 నాలుగో విడత 39,539 362.59 మొత్తం లబ్ది : రూ.1,448.41 కోట్లు -
పశువుల బీమాతో ధీమా
పాడి రైతులు, గొర్రెలు, మేకలు పెంపకదారుల కోసం ప్రవేశపెట్టిన పశు బీమా రైతులకు ధీమా కలిగిస్తోంది. పశువులు చనిపోతే నష్టపరిహారం అందిస్తున్నారు. 8లో uకుక్కునూరు, వేలేరుపాడులో పారిశుధ్య కార్యక్రమాలు కుక్కునూరు: ఏజెన్సీ గిరిజన గ్రామాలలో ఈ నెల 17 నుంచి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో స్థానికులు కొంత మంది డయేరియాతో ఆసుపత్రి బారిన పడిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ సందర్బంగా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో పలు గ్రామాలలో మురుగు కాలువలు శుభ్రంచేయడం, తాగునీరు ట్యాంకులు క్లోరినేషన్ చేయడం, దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలతో పొగ పిచికారీ చేయడం తదితర కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా డీపీఓ కుక్కునురులో రక్షిత తాగునీటి ట్యాంకును పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్పిఓ రాజాల్లాహ్, పంచాయతీ కార్యదర్శి మోహనరావు, గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
ఈఏపీ సెట్కు 929 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీ ఈఏపీ సెట్ –24 పరీక్షల్లో భాగంగా సోమవారం నగరంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో మొత్తం 929 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరిగిన పరీక్షకు సిద్ధార్థ క్వెస్ట్ కాలేజ్లో 180 మందికి గాను 173 మంది హాజరు కాగా ఏడుగురు గైర్హాజరయ్యారు. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 141 మందికి 134 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 160 మందికి 155 మంది హాజరయ్యారు. ఉదయం సెషన్లో 481 మందికి 462 మంది హాజరు కాగా 19 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ నిర్వహించిన పరీక్షకు సిద్ధార్థ క్వెస్ట్ కాలేజ్లో 179 మందికి 172 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజినీరింగ్ కళాశాలలో 140 మందికి 138 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 160 మందికి 157 మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. క్రికెట్ అంపైర్గా నాగేంద్రసింగ్ ఏలూరు రూరల్ : ఈ నెల 23 నుంచి 26 వరకూ పూణేలో జరిగే జాతీయ దివ్యాంగుల క్రికెట్ పోటీలకు ఏలూరుకు చెందిన రాజపుట్ నాగేంద్రసింగ్ అంపైర్గా నియమితులయ్యారు. ఈ మేరకు మహరాష్ట్ర దివ్యాంగ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. ఏలూరులో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాగేంద్రసింగ్ గతంలో సైతం అనేక దివ్యాంగుల క్రికెట్ పోటీలకు అంపైర్గా వ్యవహరించారు. -
ఖరీఫ్ సాగుకు సంసిద్ధం
మంగళవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2024ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడడంతో నారుమడులు సిద్ధం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే రబీ కోతలు 95 శాతం పైగా పూర్తయ్యాయి. దీంతో అన్నదాతలు ఖరీఫ్ కోసం పొలాల్ని సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వ్యవసాయ శాఖ సైతం సాగు ప్రణాళికలు రూపొందించి జూన్ 2వ వారానికి నారుమడులు వేయించేందుకు రైతులను సిద్ధం చేస్తోంది. రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బందిని సైతం అప్రమత్తం చేసింది. సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ కోసం 10,800 క్వింటాళ్ల పచ్చి రొట్ట విత్తనాలను సిద్ధం చేయగా, 50 శాతం సబ్సిడీతో రైతులకు అందించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. గిరిజన ప్రాంతాల్లో 90 శాతం సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.83 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు అధికారులు చర్యలు తీసుకుని ఆ మేరకు నారుమడులు వేయించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో ఖరీఫ్ కోసం 18 వేల క్వింటాళ్ల వరి వంగడాలను అధికారులు సిద్ధం చేశారు. ఏపీ సీడ్స్, ప్రైవేట్ సంస్ధల ద్వారా సేకరించి రైతులకు అందించేందుకు ఎంటీయూ 7029, పీఎల్ఏ 1100, పీపీటీ 5204, ఎంటీయూ 1318 వంటి విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. జూన్ 2 వారానికల్లా నారుమడులు జిల్లా వ్యాప్తంగా 95 శాతం పైగా ఇప్పటికే వరికోతలు పూర్తయ్యాయి. జిల్లాలో రబీ సీజన్లో 79,954 ఎకరాల్లో వరి సాగు కాగా, 3.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. ఇప్పటికే 76 వేల ఎకరాల్లో వరికోతలు పూర్తయ్యాయి. మిగిలిన 3 వేల ఎకరాల్లో కోతలు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జూన్ 2వ వారం నాటికి నారుమడులు వేసేందుకు చర్యలు చేపట్టారు. జూన్ 2 నాటికి పచ్చిరొట్ట విత్తనాల ద్వారా పొలాలను కలియదున్నించి సాగు చేయించేందుకు వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. న్యూస్రీల్ఖరీఫ్కు సిద్ధం జిల్లాలో ఖరీఫ్కు వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 10,800 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను రైతుల భూముల్లో సారం పెంచేందుకు పంపిణీ చేస్తున్నాం. జూన్ 2వ వారం నాటికి జిల్లాల్లో నారుమడులు పూర్తిచేయించి ఖరీఫ్ సాగును ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో వరి వంగడాలు సైతం రైతులకు అందుబాటులో ఉంచుతున్నాం. – షేక్ హబీబ్ బాషా, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జిల్లా వ్యాప్తంగా 1.83 లక్షల ఎకరాల్లో వరి సాగు అందుబాటులో 10,800 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు 18 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ -
దాడి ఘటనపై పోలీసుల దర్యాప్తు
కామవరపుకోట: మండలంలో కంఠమనేనివారిగూడెంలో శనివారం రాత్రి దళిత యువకులపై టీడీపీ నాయకుల దాడి ఘటనపై సోమవారం జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, సీఐ రాజేష్ దర్యాప్తు చేశారు. గ్రామంలో ఘటనపై బాధితులను, గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని, బాధితుల ఫిర్యాదు మేరకు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధ్యులు ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని ఆయన తెలిపారు. ఐటీఐల్లో నూరుశాతం ప్రవేశాలకు కృషి చేయాలి ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 5 ప్రభుత్వ, 14 ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో అందుబాటులో ఉన్న అన్ని సీట్లు భర్తీ అయ్యేలా విద్యార్థుల్లో అవగాహన కల్పించి నూరు శాతం ప్రవేశాలు జరిగేలా కృషి చేయాలని జిల్లా ఉపాధి అధికారి సీ. మధుభూషణరావు సూచించారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో జిల్లా ఒకేషనల్ గైడెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 8వ తరగతి, 10వ తరగతి పాస్ లేదా ఇంటర్మీడియట్ ఫెయిలై ఉపాధి కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఐటీఐ కోర్సుల గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఐటీఐ ప్రధానాధికారి పీ రజిత మాట్లాడుతూ ఏలూరు జిల్లా ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో 876 సీట్లు, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 1672 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రత్యేక విద్య కోర్సుకు అడ్మిషన్లు ఏలూరు రూరల్: రిహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్సిఐ) డిప్లమో ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసిందని కోర్సు కో–ఆర్డినేటర్ కె.శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్లో 50 శాతం మార్కులు సాధించిన ఓసీ, బీసీ విద్యార్థులు, 45 శాతం మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండికాప్ విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. కోర్సు పూర్తి చేసిన వారు డీఎస్సీ, సర్వశిక్షాభియాన్, ఐఇఆర్టి రీసోర్సింగ్ టీచర్లుగా పని చేసేందుకు అర్హులన్నారు. ఆసక్తి గలవారు రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో పాటు విద్యార్హత, ఆధార్ జిరాక్స్ సర్టిఫికెట్లతో ఏలూరులోని దొండపాడులోని ఉమా ఎడ్యుకేషనల్ సొసైటీని సంప్రదించాలని సూచించారు. మరింత సమాచారం కోసం 99486–00642 నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు. నేటి నుంచి మీసాల వెంకన్న బ్రహ్మోత్సవాలు కై కలూరు: మీసాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన కై కలూరు శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజులు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఈవో వీఎన్కే.శేఖర్ మాట్లాడుతూ మంగళవారం స్వామి, అమ్మవారిని పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెను చేయడం, సుదర్శన హోమం, మాడవీధుల్లో గజ వాహనంపై స్వామివారి ఊరేగింపు, పంచామృతాభిషేకాలు, బుధవారం రాత్రి 7.10 గంటలకు శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యకల్యాణం, మాడ వీధులలో శేష వాహనం స్వామివారి ఊరేగింపు, చివరి రోజు గురువారం పురవీధుల్లో గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు ఉంటుందన్నారు. ఓఎన్జీసీ అధికారులతో సమీక్ష భీమవరం (ప్రకాశంచౌక్): ఓఎన్జీసీ పైపులైన్లు వెళ్లే గ్రామాలకు సాధ్యమైనంత మేర న్యాయం చేస్తామని, ఆయా గ్రామాల రైతులు అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో సీతారామపురం సౌత్, యర్రంశెట్టివారిపాలెం, రుస్తుంబాద గ్రామాల రైతులతో, ఓఎన్జీసీ అధికారులతో కలెక్టర్ సుమిత్ కుమార్ సమావేశమై చర్చించారు. ఆయా గ్రామాల ప్రజలకు సాధ్యమైనంత మేర న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. పైపులైన్లు వెళ్లే మూడు గ్రామాలకు 15 లక్షల రూపాయలు చొప్పున రూ.45 లక్షలు గ్రామాల అభివృద్ధికి ఓఎన్జీసీ అందిస్తుందన్నారు. -
ఇసుక అరకమ మైనింగ్పై కఠిన చర్యలు
వేలేరుపాడు/కుక్కునూరు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. వేలేరుపాడు మండలం రుద్రంకోట 1, 2 రీచ్లు, కుక్కునూరు మండలంలోని దాచారం, తదితర ఇసుక రీచ్లను జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అనుమతి ఉన్న ఇసుక రీచ్లలోనే ఇసుక మైనింగ్ చేయాలని, అనుమతిలేని ఇసుక రీచ్ల్లో తవ్వకాలు నేరమన్నారు. ఇసుక అక్రమ మైనింగ్, రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్కడా అక్రమ మైనింగ్ రవాణ జరగకుండా ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, ఇసుక అక్రమ మైనింగ్ చేసే వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు, గనులు, సెబ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానిక ప్రజలను ఇసుక అక్రమ మైనింగ్, రవాణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్థానికులతో మాట్లాడుతూ ఎక్కడైనా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతుంటే వెంటనే స్థానికులు దగ్గరలోని రెవిన్యూ, పోలీసు లేదా గ్రామ వీఆర్ఓలకు సమాచారం అందించాలన్నారు. సీసీ కెమెరాలు, సిబ్బందితో నిరంతర నిఘా జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని రుద్రంకోట 1, 2 రీచ్లు, దాచారం, వంజరం, ఇబ్రహీంపేట ఇసుక రీచ్ల వద్ద ఇసుక అక్రమ మైనింగ్, రవాణా నిరోధానికి సీసీ టీవీల ఏర్పాటు చేసి, సిబ్బందితో నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కుక్కునూరు మండలంలోని ఇబ్రహీంపేట ఇసుక రీచ్లను అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ మైనింగ్, రవాణాను ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించబోమన్నారు. ప్రతి ఇసుక రీచ్ వద్ద 24 గంటలూ పనిచేసేలా సీసీ కెమెరాలు, సిబ్బందితో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, ఇసుక అక్రమ మైనింగ్, రవాణాకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించారు. గతంలో ఇసుక అక్రమ రవాణా చేసిన వ్యక్తులకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే తనకు సమర్పిస్తే, సంబంధిత అక్రమ రవాణాదారులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట ఎస్పీ డి.మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ ఎన్.సూర్యచంద్ర రావు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో కె.అద్దయ్య, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ఆర్బ్ల్యూఎస్ ఎస్ఈ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ -
జనసేన నాయకుడి దౌర్జన్యం
నరసాపురం: ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే నరసాపురంలో జనసేన నాయకులు రెచ్చిపోతున్నారు. మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్ సమీపంలో ఆటోలో వెళుతున్న ఓ కుటుంబంపై జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అనుచరుడు బళ్ల బాబి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో దాడి చేశాడు. ఓ మహిళను, మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచాడు. వివరాలిలా ఉన్నాయి.. లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన కడలి శ్రీనివాస్ ఇంటికి ఆచంట వేమవరానికి చెందిన బొక్కా శ్రీనివాస్ అతని భార్య లక్ష్మి మరికొందరు బంధువులు వచ్చారు. వీరంతా కలిసి ఆటోలో పేరుపాలెం బీచ్కు వెళ్లారు. అదే ఆటోలో తిరిగి వస్తుండగా తూర్పుతాళ్లు గ్రామానికి చెందిన జనసేన చోటా నాయకుడు బళ్ల బాబి, అతడి స్నేహితులు మరో ముగ్గురు కారులో వస్తున్నారు. కారుకు ఆటో సైడ్ ఇవ్వలేదనే కోపంతో ఆటోను వెంబడించి కేపీపాలెం గ్రామం వద్ద ఆపారు. అసలు విషయం పక్కన పెట్టిన అసలు మీరు ఎవరు? మొన్న ఎన్నికల్లో జనసేనకు ఓటు వేశారా? వైఎస్సార్సీపీకి ఓటు వేశారా అంటూ బాబి వారిని నిలదీశాడు. మీరు బీసీల్లా ఉన్నారు.. మీరు వైఎస్సార్సీపీకి ఓటు వేసి ఉంటారంటూ వారిపై బాబి, అతడి స్నేహితులు దాడి చేసి అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో లక్ష్మితో పాటు బొక్కా శ్రీనివాస్, కడలి శ్రీనుకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నరసాపురం డీఎస్పీ జి.శ్రీనివాస్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అయితే కేసులో పోలీసులు జనసేన నేత బళ్ల బాబీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితుల బంధువులు ఆందోళన చేశారు. బాబీని కొంతసేపు ఆస్పత్రిలోని ప్రత్యేక గదిలో ఉంచిన పోలీసులు అతడిని రూరల్ స్టేషన్కు తరలించారని, కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. -
స్ట్రాంగ్ రూం భద్రత పరిశీలన
బుట్టాయగూడెం/ఏలూరు(మెట్రో) : పోలవరం నియోజకవర్గ ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతను ఐటీడీఏ పీఓ, పోలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం.సూర్యతేజ ఆదివారం పరిశీలించారు. ఏలూరు సీఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల భద్రతపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈవీఎంలకు ప్రభుత్వం మూడంచెల భద్రత కల్పించిందన్నారు. తలుపులకు వేసిన తాళాలను, తాళాలకు ఉన్న సీల్ను పరిశీలించారు. సీసీ కెమెరాలను, మూడంచెల భద్రతను పరిశీలించారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూం పరిసర ప్రాంతాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని అన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈవీఎం కంట్రోల్ రూమ్ను కూడా పరిశీలించారు. కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
భీమవరం (ప్రకాశం చౌక్): సాధారణ ఎన్నికలలో భాగంగా కౌంటింగ్ ప్రక్రియ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని, ఇందులో లోటుపాట్లకు తావులేకుండా చూడాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఎన్నికల కౌంటింగ్ కోసం సన్నద్ధంగా ఉండాలని, ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో బందోబస్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని, వెంటనే ట్రాఫిక్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద రెయిన్ ప్రూప్ టెంట్ల ఏర్పాటు చేపట్టాలని ఆదేశించారు. అధిక సంఖ్యలో లెక్కింపు కేంద్రాల వద్దకు వివిధ పార్టీల కార్యకర్తలు, ప్రజలు చేరుకునే అవకాశం ఉన్నందున భారీ వాహనాలను అనుమతించకుండా దారి మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల ప్రవేశ మార్గంలో గుర్తింపు కార్డులు కలిగిన వ్యక్తులను మాత్రమే అనుమతించాలన్నారు. స్ట్రాంగ్ రూంల వద్దనే కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంలను కౌంటింగ్ రూంలకు షిఫ్ట్ చేసి కౌంటింగ్ ప్రారంభిస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రవేశించే వారికి సెల్ ఫోన్ అనుమతి ఉండదన్నారు. జూన్ 4 ఉదయం ఎనిమిది గంటలకు ఓట్లు లెక్కింపు పక్రియ ప్రారంభమవుతుందన్నారు. లెక్కింపు వివరాలను డిస్ప్లే బోర్డులో ప్రదర్శిస్తారన్నారు. -
దళిత యువకులపై దాడికి ఖండన
చింతలపూడి: కామవరపుకోట మండలం, కంఠమనేని వారి గూడెం గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి చేసి గాయపరిచిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎయిమ్ జిల్లా అధ్యక్షుడు వాసే ఆనంద్ డిమాండ్ చేశారు. శనివారం కంఠమనేనివారిగూడెం గ్రామానికి చెందిన గెడ్డం రవితేజ, దొడ్డిగర్ల మంగరాజులపై అదే గ్రామానికి చెందిన జాలపర్తి రాహుల్, కొమ్మిన రత్నాజీ, గద్దే సుభాష్లు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ఆదివారం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాఽధితులను అంబేడ్కర్ మిషన్ నాయకులు పరామర్శించారు. జరిగిన సంఘటన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఎయిమ్ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ దళిత యువకులను అకారణంగా కొట్టడమే కాక కులం పేరుతో దూషించినందుకు బాధ్యులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎయిమ్ జిల్లా కార్యదర్శి పోడేటి రాంబాబు, ఎయిమ్ నాయకులు కౌరి కృష్ణ, కాకర్ల సత్యన్నారాయణ, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపుపై ఈసీ సూచనలు
ఏలూరు(మెట్రో): ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని రిటర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి జోషి సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి జోషి ఆదివారం పోలింగ్ పూర్తయిన రాష్ట్రాలకు చెందిన జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్న కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై చేపట్టిన చర్యలను తెలియజేస్తూ ఏలూరు జిల్లాలో ఏలూరు పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ జరిగిందని, అనంతరం ఈవీఎంలకు స్ట్రాంగ్ రూంలలో పటిష్ట భద్రత కల్పించామన్నారు. ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి ఇప్పటికే శిక్షణ అందించినట్లు చెప్పారు. -
అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
నూజివీడు: టైర్ పేలి ఆయిల్ ట్యాంకర్ లారీ బోల్తా కొట్టిన ఘటనలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో మీర్జాపురంలోని కచ్ఛా డ్రెయిన్లో మంటలు చెలరేగాయి. పోలీసులు, గ్రామస్తులు అప్రమత్తమై మంటలు వ్యాపించకుండా నిలువరించగా, నూజివీడు, హనుమాన్జంక్షన్కు చెందిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. వివరాలిలా ఉన్నాయి. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో ట్యాంకర్లోని పెట్రోలు, డీజిల్ లీకేజీ కాగా, ఆ ఆయిల్ను మురుగు కాల్వలోకి మళ్లించారు. క్రేన్ల సాయంతో బోల్తా పడిన ట్యాంకర్ను పైకిలేపి రోడ్డుపైకి తీసుకురావడంతో రాత్రి 10 గంటల సమయంలో ట్యాంకర్ను పోలీసులు పంపించి వేశారు. అయితే ఆకతాయి సిగరెట్ వెలిగించేందుకు వేసిన అగ్గిపుల్లతో మురుగుకాల్వలో మంటలు ఏర్పడగా, రూరల్ సీఐ రామకృష్ణ, రూరల్ ఎస్సై మల్లికార్జునరెడ్డి అప్రమత్తమై వాహనాల రాకపోకలను నిలిపివేసి అగ్నిమాపక కేంద్రాలకు సమాచారాన్ని అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గ్రామస్తులు కూడా స్పందించి ఇసుకను మంటలపై పోస్తూ వ్యాపించకుండా శ్రమించారు. పక్కనే పెట్రోలు బంకు ఉండటంతో పెనుప్రమాదం సంభవిస్తుందేమోనని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మంటలు అదుపులోకి రావడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. -
బ్రహ్మోత్సవాల్లో నేడు
● ఉదయం 7 గంటల నుంచి – సూర్యప్రభ వాహనంపై శ్రీవారి తిరువీధి సేవ ● ఉదయం 7 గంటల నుంచి – భజన కార్యక్రమాలు ● ఉదయం 8 గంటల నుంచి – బుర్రకథ ● ఉదయం 9 గంటల నుంచి – భక్తిరంజని ● ఉదయం 11 గంటల నుంచి – కూచిపూడి భరతనాట్యం ● సాయంత్రం 4 గంటల నుంచి – నాదస్వర కచేరి ● సాయంత్రం 5 గంటల నుంచి – కూచిపూడి భరతనాట్యం ● రాత్రి 7 గంటల నుంచి – చంద్రప్రభ వాహనంపై శ్రీవారి తిరువీది సేవ ● రాత్రి 8 గంటల నుంచి – నాటకం ● శ్రీవారి ప్రత్యేక అలంకారం : యోగ శ్రీనివాసుడు -
నేటి నుంచి కర్రసాముపై ఉచిత శిక్షణ
ఏలూరు (టూటౌన్): ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవం, హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నుంచి కర్రసాము ఉచిత వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రతి రోజూ సాయంత్రం ఐదు గంటల నుంచి ఏఆర్డీజీకే హైస్కూల్లో ఈ శిక్షణ ఉంటుందని తెలియజేశారు. స్థానిక ఇండోర్ స్టేడియం ఎదురుగా గల లేడీస్ క్లబ్లో ఆదివారం నిర్వహించిన మానవత వార్షిక సమావేశంలో కర్రసాము శిక్షణ శిబిరం ఫ్లెక్సీలను, ప్రచార కరపత్రాలను హేలాపురి బాలోత్సవం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్రసాము మాస్టర్స్ జోగా చంద్రశేఖర్, జోగా మోహన్రావు శిక్షణ ఇస్తారన్నారు. 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏఆర్డీజీకే హైస్కూలులో వివిధ సంఘాల పెద్దలు పాల్గొని కర్రసాము శిక్షణా శిబిరాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఆసక్తి గలవారు ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం కె.శ్రీనివాసరావు 93469 36521 నంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, కమిటీల సభ్యులు అడుసుమిల్లి నిర్మల, పీడీ రత్నాకర్రావు, దేనినేని భాస్కరరావు, ఎస్.కస్తూరిరావు, శ్రీహరి కోటి, మేతర అజయ్ బాబు, కె.కనకదుర్గ, ఎ.మోహిని, సోమ్లా నాయక్, నాగేశ్వరరావు, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
కోటిజన్మల ఫలం అతిరాత్ర మహాయాగం
భీమవరం (ప్రకాశం చౌక్): కోటి జన్మల ఫలం అతిరాత్ర మహాయాగమని, యజ్ఞ యాగాలతో లోకశాంతి అని యజ్ఞకర్తలు జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ, ధూళిపాల లలితశాస్త్రి, కర్ణాటక ఋత్వికులు సాకేత్ శర్మ, కేశవ్ శర్మ, తూర్పుగోదావరి జిల్లా ముక్కామల పీఠాధిపతి శ్రీ శ్రీధరస్వామి, పశ్చిమ గోదావరి జిల్లా చిక్కాల గ్రామంలోని లలితా పీఠం పీఠాధిపతి ర్యాలీ కృష్ణప్రసాద్ అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాలలో జరుగుతున్న అతిరాత్ర మహాయాగాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. యాగంలో భాగంగా 108 మంది రుత్వికులచే కోటి గాయత్రీ జపాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి మహాయజ్ఞాలను పూర్వం వైభవంగా నిర్వహించేవారని, లోకశాంతి కోసమే యజ్ఞయాగాలన్నారు. గాయత్రీ ఉపాసకులు బ్రహ్మశ్రీ మిర్తిపాటి వెంకటరామయ్య మాట్లాడుతూ కోటి గాయత్రీ యజ్ఞంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సస్యశ్యామలంగా ఉంటాయన్నారు. లలితా పీఠం పీఠాధిపతి ర్యాలీ కృష్ణప్రసాద్ ఈ యజ్ఞాన్ని సందర్శించి కోటి జన్మల ఫలం ఈ యాజ్మంతో కలుగుతుందన్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల దంపతులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి వడుపు గోపి, యజ్ఞ పర్యవేక్షకులు చెరుకువాడ రంగసాయి, కంతేటీ వెంకటరాజు, నడింపల్లి బంగార్రాజు, నరహరిశెట్టి కృష్ణ, న్యాయవాది తాడిమళ్ళ గిరి పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
ఘనంగా రచయితల సంఘం వార్షికోత్సవం
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా రచయితల సంఘం నాలుగో వార్షికోత్సవ కార్యక్రమం స్థానిక వైఎంహెచ్ఏ హాలులో ఆదివారం రాత్రి నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు లంక వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన నలుగురికి ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు. పురస్కారాలు అందుకున్న వారిలో ఏలూరులో పురావస్తు ప్రదర్శనశాల ఏర్పాటుకు కృషి చేసిన బీకేఎస్ఆర్ అయ్యంగార్కు ప్రసిద్ధ చరిత్రకారుడు కావలి బొర్రయ్య ప్రతిభా పురస్కారం, నండూరి సుబ్బారావు స్మారక సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి రసరాజుకు, నటనలో జాతీయస్థాయి గుర్తింపు పొందిన బందా కనక లింగేశ్వరరావు స్మారక పురస్కారం ప్రముఖ నటుడు విజయ్ కుమార్కు, సంగీత రంగంలో ప్రఖ్యాతిగాంచిన చల్లపల్లి సీతాదేవి స్మారక పురస్కారం రేవతి రామకుమార్కు ప్రదానం చేశారు. ప్రముఖ చరిత్రకారుడు కొప్పర్తి వెంకటరమణమూర్తి, భాషా ఉద్యమ నాయకుడు జీవీ పూర్ణచందు, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కే అబ్రహం, సాహితీవేత్త గుమ్మా సాంబశివరావులు ముఖ్య వక్తలుగా ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పీ మంగరాజు, గాయకులు అర్జున్ రావు ఆలపించిన చైతన్య గీతాలు అలరించాయి. నాట్య గురువు మేదరమెట్ల శిరీష శిష్య బృందం తెలుగు భాష గొప్పతనం, నండూరి సుబ్బారావు ఎంకి పాటలతో ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. పార్వతీ రామచంద్రన్ శిష్య బృందం ప్రదర్శించిన జానపద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రచయితల సంఘం కోశాధికారి లేళ్ల వెంకటేశ్వరరావు ప్రసంగించారు. కార్యక్రమం నిర్వాహకులుగా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి బీ నాగస్త్ర, సమన్వయకర్తగా ఖాజావలి పాల్గొన్నారు. -
కాలువలోకి దూసుకెళ్లిన కారు
చాట్రాయి: ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పిన ఓ కారు పంటకాలువలోకి దూసుకెళ్లింది. వివరాలిలా ఉన్నాయి. విస్సన్నపేట నుంచి వస్తున్న ఓ కారు చనుబండ గ్రామంలోకి వచ్చేసరికి ఇద్దరు మైనర్లతో ముందు వెళుతున్న ద్విచక్రవాహనం అకస్మాత్తుగా మలుపు తిప్పడంతో ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి కారు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో కారు కాలువపై ఉన్న కల్వర్టును ఢీకొనడంతో ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి గాయాలు కాలేదు. అయితే ఇద్దరు బాలురకు స్వల్ప గాయాలు కావడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. గురజలో గ్యాస్ పైప్లైన్ లీకేజీ ముదినేపల్లి రూరల్: మండలంలోని గురజ రహదారి సమీపంలో శనివారం రాత్రి గ్యాస్ పైప్లైన్ లీకేజీతో స్థానికులు, వాహనచోదకులు భయబ్రాంతులకు గురయ్యారు. మండవల్లి మండలం పెరికేగూడెం నుంచి గుడ్లవల్లేరు మండలం డోకిపర్రుకు ఒక ప్రముఖ సంస్ధ గ్యాస్ పైప్లైన్ ఏర్పాటు చేసింది. ఈ పైప్లైన్ గురజ సమీపంలోని పెట్రోల్ బంకుకు ఎదురుగా పెద్ద శబ్ధంతో లీకేజీ కావడంతో స్థానికులు ఆందోళనకు గురై ఇళ్లల్లోని విద్యుత్ లైట్లను ఆర్పివేశారు. అదృష్టవశాత్తు మంటలు రాకపోవడంతో పెద్దప్రమాదం తప్పినట్లు స్థానికులు చెప్పారు. పైప్లైన్ లీకేజీ జరిగిన ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న టెలిఫోన్ స్తంభాన్ని దొంగిలించేందుకు గుర్తు తెలియని వ్యక్తి జేసీబీతో తవ్వడం వల్లే ఈ లీకేజీకి కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై వెంకట్కుమార్ సిబ్బందితో ఘటనా స్ధలానికి చేరుకుని వాహనాల రాకపోకలను నిలిపివేసి గుడివాడ అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. పైప్లైన్ ఏర్పాటు చేసిన సంస్థ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. గతంలో సైతం ఇదే పైప్లైన్ పెనుమల్లి శివారు సింగారం వద్ద లీక్ అయి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పైప్లైన్ రహదారి వెంబడి ఉన్నందువల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేశారు. పాము కాటుకు మహిళ మృతి టి.నరసాపురం: పాము కాటుకు గురై ఓ మహిళ మృతి చెందింది. ఎస్సై దుర్గామహేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మక్కినవారిగూడెం గ్రామానికి చెందిన రాజుబోయిన రామలక్ష్మి (26) శనివారం ఆయిల్పామ్ తోటలో గెలల కోసే పనికి వెళ్లింది. అక్కడ పాము కాటు వేయడంతో గమనించిన తోటి కూలీలు టి.నరసాపురం పీహెచ్సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జనసేన నాయకుడి దౌర్జన్యం
నరసాపురం: ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే నరసాపురంలో జనసేన నాయకులు రెచ్చిపోతున్నారు. మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్ సమీపంలో ఆటోలో వెళుతున్న ఓ కుటుంబంపై జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అనుచరుడు బళ్ల బాబి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో దాడి చేశాడు. ఓ మహిళను, మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచాడు. వివరాలిలా ఉన్నాయి.. లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన కడలి శ్రీనివాస్ ఇంటికి ఆచంట వేమవరానికి చెందిన బొక్కా శ్రీనివాస్ అతని భార్య లక్ష్మి మరికొందరు బంధువులు వచ్చారు. వీరంతా కలిసి ఆటోలో పేరుపాలెం బీచ్కు వెళ్లారు. అదే ఆటోలో తిరిగి వస్తుండగా తూర్పుతాళ్లు గ్రామానికి చెందిన జనసేన చోటా నాయకుడు బళ్ల బాబి, అతడి స్నేహితులు మరో ముగ్గురు కారులో వస్తున్నారు. కారుకు ఆటో సైడ్ ఇవ్వలేదనే కోపంతో ఆటోను వెంబడించి కేపీపాలెం గ్రామం వద్ద ఆపారు. అసలు విషయం పక్కన పెట్టిన అసలు మీరు ఎవరు? మొన్న ఎన్నికల్లో జనసేనకు ఓటు వేశారా? వైఎస్సార్సీపీకి ఓటు వేశారా అంటూ బాబి వారిని నిలదీశాడు. మీరు బీసీల్లా ఉన్నారు.. మీరు వైఎస్సార్సీపీకి ఓటు వేసి ఉంటారంటూ వారిపై బాబి, అతడి స్నేహితులు దాడి చేసి అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో లక్ష్మితో పాటు బొక్కా శ్రీనివాస్, కడలి శ్రీనుకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నరసాపురం డీఎస్పీ జి.శ్రీనివాస్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అయితే కేసులో పోలీసులు జనసేన నేత బళ్ల బాబీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితుల బంధువులు ఆందోళన చేశారు. బాబీని కొంతసేపు ఆస్పత్రిలోని ప్రత్యేక గదిలో ఉంచిన పోలీసులు అతడిని రూరల్ స్టేషన్కు తరలించారని, కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. మహిళ, మరో ఇద్దరిపై దాడి నరసాపురం ఆస్పత్రిలో బాధితులకు చికిత్స -
రోడ్డు ప్రమాదంలో మొబైల్ టెక్నీషియన్ మృతి
జంగారెడ్డిగూడెం: పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన కోన సాయి (23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. పట్టణానికి చెందిన గుర్రం రాజ్కుమార్ పదో తరగతి పాసై ఇంటర్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. అయితే రాజ్కుమార్ తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురంలోని తన నాయనమ్మ ఇంటికి వెళ్లేందుకు కోన సాయిని సహాయం కోరగా, ఇద్దరూ మోటార్సైకిల్పై ఆదివారం బయలుదేరారు. స్థానిక జాతీయ రహదారిపైకి వచ్చేసరికి వీరిని కొయ్యలగూడెం నుంచి జీలుగుమిల్లి వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కోనసాయి ఘటనా స్థలంలోనే మృతి చెందగా, రాజ్కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాజ్కుమార్ను స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కళ తప్పిన కొల్లేరు
● మైదాన ప్రాంతాన్ని తలపిస్తున్న మంచినీటి సరస్సు ● బీటలు వారిన చిత్తడి నేల.. మాయమైన పచ్చదనం ● ఆహారం, నీరు లేక అల్లాడుతున్న వలస పక్షులు ● ఆటపాక పక్షుల కేంద్రంపై ప్రభావం ● వర్షాభావ పరిస్థితుల వల్ల కొల్లేరులో తగ్గిన డ్రెయిన్ల నీరుకై కలూరు: కోటి అందాల కొల్లేరు కళ తప్పింది. నీరు లేక ఎడారిని తలపిస్తోంది. పచ్చదనం మాయమైంది. విడిది కోసం వలస వచ్చే అతిథి పక్షులు నీటి కోసం, ఆహారం కోసం అల్లాడుతున్నాయి. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు వరదల సమయంలో కొల్లేరుకు చేరుతోంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు డ్రెయిన్ల నుంచి నీరు వస్తుంది. ఒక్క కృష్ణా జిల్లా నుంచే వివిధ డ్రెయిన్ల ద్వారా 35 వేల 590 క్యూసెక్కుల నీరు కొల్లేరులో కలుస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది కొల్లేరులోకి నీటి ప్రవాహం తగ్గింది. దీంతో నీరు లేక లక్షలాది ఎకరాల కొల్లేరు భూములు బీటలు వారుతున్నాయి. 189 రకాల పక్షులకు కొల్లేరే ఆధారం ఏటా సైబీరియా, అస్ట్రేలియా, నైజిరియా వంటి పలు దేశాల నుంచి వలస పక్షులు విడిది కోసం కొల్లేరు సరస్సుకు వస్తాయి. మొత్తం 189 రకాల పక్షులు కొల్లేరుపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు పక్షుల సంతానోత్పత్తికి అనుకూలం. కొల్లేరులో నీరు లేకపోవడంతో పక్షులకు వేట కరువైంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు పెరిగాయి. రాష్ట్రంలోనే పక్షుల విహార కేంద్రంగా పేరు గడించిన ఆటపాక పక్షుల కేంద్రంలో 289 ఎకరాల విహార చెరువులో నీటి కొరత ఏర్పడింది. చెరువులో కనీసం 6 అడుగుల నీటిమట్టానికి గాను కేవలం ఒక అడుగు మాత్రమే నీరు ఉంది. దీంతో బోటు షికారును నిలిపివేశారు. ప్రస్తుతం కేంద్రం వద్ద పెలికాన్ పక్షుల 619, పెయింటెడ్ స్టార్క్ పక్షులు 320, ఓపెన్ బిల్డ్ స్టార్క్ పక్షులు 165 ఉన్నాయి. కొల్లేరులో పూర్తిగా నీరు ఉన్నప్పుడు పక్షులు ఇతర ప్రాంతాల్లో వేట సాగించేవి. ఇప్పుడు కేవలం పక్షుల కేంద్రం చెరువులో ఆహారంపైనే అధారపడ్డాయి. సముద్రపు నీరు కొల్లేరులోకి.. కొల్లేరులో నీరు లేకపోవడంతో సముద్రపు ఉప్పునీరు పైకి ఎగదన్నుతోంది. దీంతో పంటపొలాలు చౌడబారుతున్నాయి. ఇప్పటికే ఏలూరు జిల్లా కలిదిండి మండలం ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల భూములు చౌడుబారాయి. ఎగువ నుంచి కొల్లేరుకు చేరే నీరు పెద ఎడ్లగాడి, చిన ఎడ్లగాడి డ్రెయిన్లకు చేరుతోంది. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని కృత్తివెన్ను వద్ద సముద్రంలో కలుస్తుంది. ఉప్పునీరు చేరడంతో కొల్లేరులో సహజజాతి చేపలు అంతరించిపోతున్నాయి. డ్రెయిన్ల నుంచి నీటి రాక తగ్గింది కొల్లేరులోకి 67 డ్రెయిన్ల నుంచి నీరు చేరుతోంది. పెద ఎడ్లగాడి నుంచి సర్కారు కాల్వ మీదుగా సముద్రానికి ఈ నీరు పారుతుంది. ఎండల కారణంగా డ్రెయిన్ల నీరు కొల్లేరుకు చేరలేదు. పెద ఎడ్లగాడి వద్ద గతంలో నీటి ప్రవాహానికి అడ్డుగా మారిన గుర్రపుడెక్కన తొలగించాం. రుతుపవనాల కారణంగా వర్షాలు కురిస్తే పరిస్థితి చక్కబడుతోందని భావిస్తున్నాం. – బి.ఇందిరా, డ్రెయినేజీ శాఖ ఏఈఈ, కై కలూరు రెగ్యులేటర్ నిర్మించాలి కొల్లేరులో నీరు ఎల్లప్పుడు నిల్వ ఉండాలంటే కచ్చితంగా రెగ్యులేటర్ నిర్మించాలి. రెగ్యులేటర్ వల్ల సముద్రపు నీరు ఎగబాకకుండా నిరోధించవచ్చు. ఉప్పునీరు రావడం వల్ల కొల్లేరు నల్లజాతి చేపలు అంతరిస్తున్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంత ప్రజలు చేపల వేట సాగించాలంటే రెగ్యులేటర్ ఒక్కటే మార్గం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెగ్యులేటర్ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. – ముంగర గోపాలకృష్ణ, మాజీ ఎంపీపీ, చింతపాడు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
టీడీపీ మరో కుట్ర మాచర్లలో హైటెన్షన్
బంగారుకొండను పేరుస్తున్న ఆర్బీఐ..!
రేవ్ పార్టీలో పట్టుబడ్డ టీడీపీ నేతలు
’ఆప్‘ రాకతో నెలకు రూ. 18 వేలు ఆదా: రాఘవ్ చద్దా
ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
16ఏళ్లకు స్టార్ ఆపై 22ఏళ్లకే విషాదం.. రజనీకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు?
రిమాండ్ రిపోర్టులోవిస్తుపోయే నిజాలు
బెంగళూరు: రేవ్పార్టీ ముసుగులో వ్యభిచార దందా?
షోకాజ్ నోటీసులపై స్పందించిన బీజేపీ ఎంపీ
అసలు ఈ గొడవ కి ముందు వీడియో.. లైవ్ లో చూపించిన అంబటి
తప్పక చదవండి
- నిందితుని కోసం ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన పోలీస్ వ్యాన్
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి!
- ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
- అందుకే నా పేరుకి బ్లూ చేర్చా: ‘పుష్ప పుష్ప..’ సింగర్
- ‘బీజేపీ చేయలేని పని రాహుల్ చేస్తున్నారు’
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
- కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?
- తెలుగు రాష్ట్రాల్లో డెత్ ట్రావెల్స్
- ‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్
- అదే మా ఓటమిని శాసించింది.. లేదంటే విజయం మాదే: డుప్లెసిస్
Advertisement