-
మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
కొవ్వూరు: వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (71) మంగళవారం ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో ఎన్టీ రామారావుపై అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు. వరుసగా 1983, 1985 (మధ్యంతర ఎన్నికలు), 1989, 1994, 2004లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలు వేరైనప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కృష్ణబాబుకు అత్యంత సాన్నిహిత్యం ఉండేది. దీంతో ఆయన మరణానంతరం 2012లో వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరారు. జిల్లా రాజకీయాల్లోనూ, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లో పునర్విభజన అనంతరం కొవ్వూరులోనూ కృష్ణబాబు రాజకీయంగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన భార్య నాగమణి గతంలోనే మరణించారు. కృష్ణబాబుకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ సలహాదారు, పార్టీ కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఎస్.రాజీవ్కృష్ణ ఆయన అల్లుడు. కృష్ణబాబు మృతి పట్ల రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, కొవ్వూరు మునిసిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారితోపాటు పలువురు రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామమైన దొమ్మేరులో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
వైవిధ్యమే జీవన సౌందర్యం
● జీవ జాతుల నిలయం.. కోరంగి అభయారణ్యం ● నేడు ప్రపంచ బయోడైవర్సిటీ డే యానాం/తాళ్లరేవు: ఉమ్మడి తూర్పుగోదావరి, యానాం ప్రాంతాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో 235.70 చదరపు కిలోమీటర్ల మేర కోరంగి అభయారణ్యం విస్తరించి ఉంది. ఇది జీవ వైవిధ్యానికి, వందలాది జీవజాతుల ఆవాసానికి నిలయంగా పేరొందింది. ఉప్పునీటిని తట్టుకునే వృక్ష సమూహాలైన మడఅడవులు ఇక్కడి ప్రత్యేకత. ముఖ్యంగా సముద్రం, గోదావరి కలిసే ముఖద్వారాల వద్ద మడ అడవులు తీరానికి రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు తోడు వనరులను మితిమీరి ఉపయోగించడం జీవవైవిధ్యానికి తీరని నష్టం చేకూరుతుంది. ఇది మానవ మనుగడకే ప్రమాదం. అందుకే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని అటవీ శాఖాధికారులు, పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. బుధవారం ప్రపంచ బయో డైవర్సిటీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోరంగి అభయారణ్యం విశేషాలపై శ్రీసాక్షిశ్రీ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.. ప్రత్యేకతలివీ.. ● కోరంగి అభయారణ్యానికి సుమారు 120 జాతుల పక్షులు విడిది చేయడానికి ఏటా వలస వస్తుంటాయి. వీటిలో వివిధ రకాలైన కొంగలు, కిక్కిరాయలు, చెకుముకి పిట్టలు, కింగ్ ఫిషర్, నారాయణ పక్షి, నత్తకొట్టు కొంగ, బ్రాహ్మణ గెద్ధ, గుడ్డు కొంగ, నీటికాకి, గునపం కోడి, గువ్వలు మొదలైనవి ఉన్నాయి. ఈ పక్షిజాతులు సందర్శకులను ఆకర్షిస్తాయి. అయితే వాతావరణ మార్పులతో ఇతర దేశాల నుంచి పక్షుల వలసలు తగ్గాయని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. ● మాంగ్రూవ్ ఫారెస్ట్లో వివిధ రకాలైన పక్షులతో పాటు ఆటర్స్ నీటి పిల్లులు, నీటికుక్కలు, నక్కలు, మడపాములు, పీతలు, నత్తలు తదితరమైనవి ఉన్నాయి. ● కోరంగి అభయారణ్యానికి ఈశాన్య ప్రాంతంలో సుమారు 18.3 కిలోమీటర్ల పొడవు గల సేండ్స్పిట్(హోప్ ఐలాండ్) ఉంది. ఇక్కడకు ఏటా డిసెంబర్ నుంచి మే వరకూ ఆలివ్రిడ్లీ తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. పర్యావరణ మార్పులతో అంతరించిపోతున్న అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల పరిరక్షణకు అటవీశాఖ నడుం బిగించింది. ● అభయారణ్యంలో 24 కుటుంబాలకు చెందిన మడ మొక్కలను గతంలో ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ తదితర సంస్థలు గుర్తించాయి. ఇందులో అవసీనియా అఫిసీనాలిస్, మెరీనా, ఆల్చా తదితర శాసీ్త్రయ నామాలతో నల్లమడ, తెల్లమడ, విల్వమడ, తిల్లా, ఉప్పు పొన్న, తొగర, ఊరుడు, తండుగ, కలింగ, పొన్న, గుగ్గిలం, గంగరావి, అటకరాయి తదితరమైనవి ఉన్నాయి. నల్లమడ ఆకులు చర్మవ్యాధుల రక్షణకు, దాని బెరడు పాముకాటుకు నివారణగాను ఉపయోగిస్తారు. జీవజాతుల్ని రక్షించుకోవాలి గోదావరి తీరప్రాంతం ముఖ్యంగా కోరంగి అభయారణ్యం అనేక జీవజాతులకు నిలయం. అనేక రకాల పక్షులు, జంతువులు ఇక్కడ నివసిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో మడ అటవీ ప్రాంతం కీలకపాత్ర వహిస్తుంది. మానవ మనుగడకు ప్రకృతితో ముడిపడి ఉన్న జీవజాతులను పరిరక్షించుకోవాల్సి వుంది. – ఎం నాగార్జున, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కోరంగి -
ట్రాన్స్ఫార్మర్లలో రాగితీగ చోరీ ముఠా అరెస్ట్
దేవరపల్లి: మూడు జిల్లాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగితీగ చోరీకి పాల్పడుతున్న ముఠాను కొవ్వూరు డీఎస్పీ కేసీహెచ్ రామారావు సారథ్యంలో దేవరపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి 225 రాగి దిమ్మెలు, 100 కిలోల రాగితీగ (మొత్తం 600 కిలోలు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.6 లక్షలని కొవ్వూరు డీఎస్పీ రామారావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఏలూరు రేంజ్ పరిధిలోని తూర్పు, పశ్చిమ, కాకినాడ జిల్లాల పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను నలుగురు సభ్యులు గల ముఠా బద్దలు కొట్టి దానిలోని రాగి దిమ్మలు, రాగివైరును దొంగిలించి పాత ఇనుము కొనుగోలుదారులకు విక్రయిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలం, గంటి పెదపూడిలోని రాజీవ్ కాలనీకి చెందిన సుంకర సతీష్ (శివ), కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరంలోని రంగవల్లి నగర్కు చెందిన కొమ్మిరెడ్డి దుర్గ, రంగవల్లి నగర్కే చెందిన నెల్లూరి లోవరాజు, అదే మండలంలోని ఉప్పర రామవరానికి చెందిన నక్కా నాగేంద్ర కుమార్ (పొట్టి) ఓ ముఠాగా ఏర్పడి ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నారు. చోరీలు చేశారిలా.. కాకినాడ జిల్లా పెద్దాపురంలో 17, సామర్లకోటలో 5, ఏలేశ్వరంలో 2, అన్నవరంలో 3, మొత్తం 17 ట్రాన్స్ఫార్మర్ల చోరీకి పాల్పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్లో 42 ట్రాన్స్ఫార్మర్లు, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో 7, గోపాలపురంలో 2, నల్లజర్లలో 10, కొవ్వూరు టౌన్లో 2, చాగల్లులో 2, సమిశ్రగూడెంలో 2, రంగంపేటలో 16, బిక్కవోలులో 10, మొత్తం 51 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేశారు. స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు 226 కాపర్ దిమ్మెలు (ఒక్కొక్క దిమ్మె 1.5 నుంచి 2 కిలోలు), కాపర్ వైరు 100 కిలోలు మొత్తం 600 కిలోలు. చోరీ సొత్తు విలువ సుమారు రూ.6 లక్షలని డీఎస్పీ రామారావు తెలిపారు. నిందితులు సుంకర సతీష్ తన గ్రామం గంటి పెదపూడిలో పాత ఇనుము వ్యాపారం చేస్తుండగా, కొమ్మిరెడ్డి దుర్గ, నెల్లూరి లోవరాజు ఒకే గ్రామానికి చెందిన వారు. వారిద్దరూ ఇంటింటికీ తిరిగి ఉల్లిపాయలను పాత ఇనుముకు, సొమ్ముకు విక్రయిస్తుంటారు. పాత ఇనుము కూడా కొనుగోలు చేసి సుంకర సతీష్కు అమ్మేవారు. ఈ నేపథ్యంలో నలుగురూ ముఠాగా ఏర్పడి సతీష్కు చెందిన మినీ వ్యాన్ను, నక్కా నాగేంద్రకు చెందిన గ్లామర్ బైక్పై సుమారు ఏడాదిన్నరగా రాత్రి వేళ పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను బద్దలు కొట్టి, రాగివైరును వేరు చేసి గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముతున్నారు. ఈ క్రమంలో సుంకర సతీష్ తన వ్యాపాన్ని విస్తరించి కొంతకాలం క్రితం తాడేపల్లిగూడెం డంపింగ్ యార్డు వద్ద దుకాణం ఏర్పాటు చేశారు. ఆ ముఠా సభ్యులు దొంగిలించిన రాగి వైరును కరిగించి దిమ్మెలుగా తయారు చేశాడు. అలాంటి 225 దిమ్మలను ఆరు మూటల్లో ఉంచి వ్యాన్లో అమ్మడానికి విజయవాడ తీసుకు వెళుతుండగా దేవరపల్లి ఎస్సై కె. శ్రీహరిరావు, సిబ్బంది వి.చంద్రశేఖర్, వి.చక్రవర్తి, ఎస్కే సలీం, వి.రాంగోపాల్, రామారావు రాజమహేంద్రవరం సీసీఎస్ ఎస్సై కె.రజని, సిబ్బంది కలిసి దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద పట్టుకున్నట్టు డీఎస్పీ రామారావు వివరించారు. దేవరపల్లి సీఐ పి. బాలసురేష్ బాబు, రాజమహేంద్రవరం సీసీఎస్ ఎస్సై కె.రజనీ కుమార్, ఆధ్వర్యంలో దేవరపల్లి ఎస్సై శ్రీహరిరావు కేసు నమోదు చేసి, నింధితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ. 6 లక్షల విలువైన 600 కిలోల రాగి వైరు స్వాధీనం నలుగురు నిందితుల అరెస్ట్ మూడు జిల్లాల్లో చోరీలు కొవ్వూరు డీఎస్పీ రామారావు వెల్లడి -
మృతదేహానికి సైలెన్ పెట్టి వైద్యం
ఫ కాకినాడ జీజీహెచ్ వైద్యుల నిర్వాకం ఫ మృతుని కుటుంబ సభ్యుల ఆందోళన కాకినాడ క్రైం: కొందరు వైద్యుల నిర్లక్ష్యం ప్రతిష్టాత్మక కాకినాడ జీజీహెచ్ వైద్య సేవలనే అప్రతిష్ట పాలు చేస్తోంది. అచ్చం ఠాగూర్ సినిమాను తలపించే సన్నివేశం జీజీహెచ్లో మంగళవారం ఆవిష్కృతమైంది. మృతుడి కుటుంబీకులు, అక్కడి రోగుల కథనం ప్రకారం.. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పరిధిలోని యానాం గిరియాంపేటకు చెందిన మత్స్యకారుడు మేడా లోకేష్కు భార్య రామాయమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత లోకేష్కు దగ్గు వచ్చింది. తిన్న ఆహారం గొంతులోకి రావడంతో యానాంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లామని లోకేష్ కుమారుడు రాజు తెలిపాడు. అక్కడి వైద్యుల సిఫారసు మేరకు మెరుగైన వైద్య సేవల కోసం రాత్రి రెండు గంటలకు కాకినాడ జీజీహెచ్కు తీసుకుని వచ్చారు. అక్కడ ఆక్సిజన్ పెట్టిన కాసేపటికే తన తండ్రి కోలుకున్నాడని రాజు చెప్పారు. వయసు రీత్యా ఇంకేవైనా సమస్యలు ఉండవచ్చనే అనుమానంతో లోకేష్ను వార్డుకు పంపించి, పూర్తిగా కోలుకునేందుకు తాను సూచించిన చికిత్స అందించాలని జూనియర్లకు సీనియర్ వైద్యుడు చెప్పారు. అప్పటికి సరేనన్న జూనియర్ వైద్యులు అప్పటి నుంచీ లోకేష్ను పట్టించుకోలేదని రాజు తెలిపాడు. కొంతసేపటికి శ్వాస ఆడటం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఇంజక్షన్లు చేశారు. అవి ఇచ్చిన కాసేపటికి లోకేష్ కడుపు పూర్తిగా ఉబ్బిపోయింది. ఆ బాధ తట్టుకోలేకపోతున్నానంటూ లోకేష్, అతడి కుటుంబ సభ్యులు పలుమార్లు పిలిచినా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఏ ఒక్కరూ రాలేదు. పైగా లోకేష్ కుటుంబీకులపై విసుక్కున్నారని అదే వార్డులో చికిత్స పొందుతున్న ఇతర రోగులు, వారి బంధువులు తెలిపారు. పిలిచి పిలిచి లోకేష్ ఒక్కసారిగా మంచం మీదే కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరు జూనియర్ డాక్టర్లు కంగారుగా లోకేష్ వద్దకు వచ్చారు. గుండె, పొట్ట నొక్కడంతో పాటు ఆక్సిజన్ పెట్టారు. ఎటువంటి చలనం లేకపోవడంతో చేసేది లేక, రోగి స్పందించడం లేదని కుటుంబీకులకు నెమ్మదిగా చెప్పారు. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు లోకేష్ మృతదేహాన్ని సీఐసీయూకు తరలించి, ఈసీజీ తీసి, సైలెన్ పెట్టారు. దీనిని కొంతమంది వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. వైద్యులు, సిబ్బంది నిర్వాకాన్ని తీవ్రంగా నిరసించిన బాధిత కుటుంబీకులు లోకేష్ మృతదేహాన్ని తరలించేది లేదని జీజీహెచ్లో ఆందోళనకు సిద్దమయ్యారు. ఆసుపత్రి అధికారులు, పోలీసులు జోక్యం చేసుకొని ఇదే తీరు కొనసాగితే కేసు నమోదు చేస్తామని, తర్వాత లోకేష్ మృతదేహానికి పోస్ట్మార్టం చేయాల్సి వస్తుందని, ఆలోచించుకోండని హెచ్చరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో లోకేష్ కుటుంబీకులు నిరసన విరమించి, మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు అంగీకరించారు. వార్డులోని వైద్యులు, సిబ్బంది నిర్వాకంపై మృతుడు లోకేష్ కుమార్తె నూకాంబిక జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారికి, డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణకు ఆదేశించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు. సరిగ్గా అదే సమయంలో అత్యవసర విభాగంలోని వార్డుల నుంచి కొంత మంది రోగులు, వారి సహాయకులు వచ్చి జూనియర్ వైద్యుల్లో కొందరు రోగుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. విసుక్కోవడం, కసురుకోవడం వారికి పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోగికి వార్డులో ఎటువంటి వ్యక్తిగత ఆరోగ్య భద్రత కల్పించడం లేదని ఆందోళన చెందారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ఉప్పలగుప్తం: మండలంలోని మునిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మునిపల్లి కోటిగట్టు ప్రాంతానికి చెందిన నాగారాపు లలిత (29) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఎస్ఐ కె.మనోహర జోషి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన నాగారపు భీమేంద్ర.. గొల్లవిల్లి పంచాయతీ పరిధి ఇందిరానగర్కు చెందిన లలితను ఐదు సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు. అయితే భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. భర్త వేధింపులు తాళ లేక సోమవారం సాయంత్రం లలిత ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని మరణించినట్టు భీమేంద్ర కుటుంబీకులు పోలీసులకు, లలిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి తహసీల్దార్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శవ పరీక్షలు నిర్వహించారు. తన అల్లుడు భీమేంద్ర తన కూతురు లలితను హతమార్చి ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించాడని మృతురాలి తల్లి పరమట పుష్పలత ఆరోపిస్తున్నారు. మృతురాలి సోదరుడు పరమట ప్రసాద్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వివరించారు. కొత్తపేట డీఎస్పీ కె.వి.రమణ, అమలాపురం రూరల్ సీఐ పి.వీరబాబు సమక్షంలో కేసు విచారణ జరుపుతున్నామని, భీమేంద్రను అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ జోషి తెలిపారు. -
జీడిమామిడీలా..
గింజల ఉత్పత్తి తగ్గింది సాధారణంగా ఎకరాకు 8 నుంచి 10 బస్తాల దిగుబడి రావాలి. ఈ ఏడాది తోటలకు తెగుళ్లు వ్యాపించడంతో 5 నుంచి 6 బస్తాల దిగుబడి మాత్రమే వస్తోంది. పూత దశలో కురిసిన అధిక వర్షాలకు పూతలు రాలిపోయాయి. పిందె శాతం తక్కువగా ఉంది. దీనికితోడు పిందె దశలో చలిగాలులు వీయడంతో గింజ పట్టలేదు. ఫిబ్రవరి నుంచి అధిక ఉష్ణోగ్రతల వల్ల పిందె మాడిపోయింది. దీంతో జీడిమామిడి సాగు నష్టాల్లో ఉంది. లేత కాపులు కూడా నిలబడలేదు. శాస్త్రవేత్తలు తోటలను పరిశీలించి, రైతులకు సస్యరక్షణ చర్యలను వివరించారు. – జె.రమణారెడ్డి, ఆదర్శ రైతు, గోపాలపురం యాజమాన్య పద్ధతులనుబట్టి.. జీడిమామిడి తోటల్లో ఉత్తమ యాజమాన్య పద్ధతులు, శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటించి జాగ్రత్తలు తీసుకుంటే దిగుబడులు బాగున్నాయి. ఎక్కువగా అధిక దిగుబడులు వస్తున్న వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. మామూలుగా ఎకరాకు 10 నుంచి 12 బస్తాల దిగుబడి వస్తోంది. ఈ ఏడాది కొంత వరకు తగ్గింది. జీడిమామిడిలో సస్యరక్షణ చర్యలు అవసరం. 10 ఎకరాల్లో జీడిమామిడి సాగు చేస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఆదర్శ రైతు అవార్డు అందుకున్నాను. – లకంసాని శ్రీనివాస్, ఆదర్శ రైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం దేవరపల్లి: మెట్ట ప్రాంతంలోని ప్రధాన వాణిజ్య పంటల్లో ఒకటి జీడిమామిడి. మెట్ట భూములు, ఇసుక నేలలు, ఎర్ర నేలలు ఈ తోటల సాగుకు అనుకూలం. జిల్లాలోని వర్షాధార భూముల్లో ఎక్కువగా రైతులు ఈ పంట సాగు చేస్తున్నారు. ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం రాయితీలు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను అందజేస్తోంది. ధర గిట్టుబాటు కావడంతో గడచిన ఐదేళ్లుగా రైతులు ఎక్కువగా జీడిమామిడి సాగుతో ఆర్థికంగా అభివృద్ధి చెందారు. అంటు వేసిన మూడో ఏడాది నుంచే పంట దిగుబడి రావడంతో పాటు ఒకసారి అంటు వేస్తే దాదాపు 30 సంవత్సరాలు ఆదాయం వస్తోందని వారు చెబుతున్నారు. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉండటంతో జీడిమామిడి సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. సగానికి సగం తగ్గిన దిగుబడి జిల్లావ్యాప్తంగా 18 మండలాల్లోని 8,875 హెక్టార్లలో జీడిమామిడి సాగు జరుగుతోంది. ఏటా దాదాపు 7 వేల మెట్రిక్ టన్నుల జీడిగింజల ఉత్పత్తి జరుగుతోంది. అయితే, ఈ ఏడాది ప్రతికూల వాతావరణం, క్రిమికీటకాల వ్యాప్తి వంటి కారణాలతో దిగుబడి తగ్గి, రైతులు డీలా పడుతున్నారు. సాధారణ స్థాయి కంటే దిగుబడి హెక్టారుకు 5 నుంచి 6 బస్తాలు తగ్గిందని చెబుతున్నారు. జీడిమామిడి పూతలు నవంబర్, డిసెంబరు నెలల్లో ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి నుంచి మే నెల వరకూ పంట దిగుబడి వస్తుంది. అయితే, గత ఏడాది డిసెంబర్ నెలలో మిచాంగ్ తుపాను ప్రభావంతో పూత దశలో అధికంగా వర్షాలు కురిశాయి. సరిగ్గా ఇదే దశలో టీ–దోమ వ్యాపించడం, పిందె దశలో చలి గాలులు వీచడం వంటి ప్రతికూల పరిస్థితులు జీడిమామిడి దిగుబడిపై ప్రభావం చూపాయి. పిందె (గొన్నెం) పట్టే సమయంలో ఉక్కపోత వాతావరణం ఉండాలి. కానీ, శీతగాలి కారణంగా కొన్నిచోట్ల పూత మాడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏడాది 3,986 మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే గత ఏడాది కంటే దాదాపు 3 వేల మెట్రిక్ టన్నుల వరకూ దిగుబడి పడిపోయింది. హెక్టారుకు నాటు వంగడం 10 నుంచి 12 బస్తాలు, కొత్త వంగడం 20 నుంచి 24 బస్తాల మేర దిగుబడులు ఇస్తున్నాయని చెబుతున్నారు. సమగ్ర సస్యరక్ష చర్యలు పాటించి, ఉత్తమ యాజమాన్య పద్ధతుల్లో సాగు చేసిన రైతులు మాత్రం అధిక దిగుబడులు సాధిస్తున్నారని అంటున్నారు. ధర ఉన్నా.. దిగుబడి లేక.. జిల్లాలో పండిన గింజలకు మంచి డిమాండ్ ఉంటుంది. జీడిపప్పు తయారీకి ఎక్కువగా ఈ గింజలను వ్యాపారులు కొనుగోలు చేస్తారు. దీంతో ప్రస్తుతం జీడిగింజల ధర ఆశాజనకంగా ఉంది. గత ఏడాది బస్తా (80 కిలోలు) గింజల ధర రూ.7,300 ఉండగా, ఈ ఏడాది ఏకంగా రూ.2 వేలు పెరిగి, రూ.9,300 పలుకుతోంది. ముందు ముందు ఈ ధర మరింత పెరుగుతుందనే ఆశతో రైతులు ఉన్న గింజలను విక్రయించకుండా నిల్వ చేస్తున్నారు. ధర బాగున్నప్పటికీ దిగుబడులు పడిపోవడంతో నష్టపోతున్నామని వారు వాపోతున్నారు. మండలాల వారీగా జీడిమామిడి సాగు విస్తీర్ణం, దిగుబడి వివరాలు మండలం విస్తీర్ణం దిగుబడి (హెక్టార్లు) (మెట్రిక్ టన్నులు) నల్లజర్ల 707 5.65 గోపాలపురం 1,198 9.58 దేవరపల్లి 1,352 10.52 నిడదవోలు 26 00.24 గోకవరం 598 388 కోరుకొండ 324 210 రంగంపేట 1,164 873 రాజానగరం 2,088 1,566 కొవ్వూరు 179 116 చాగల్లు 904 588 తాళ్లపూడి 333 216 ఫ జిల్లాలో 8,875 హెక్టార్లలో సాగు ఫ ప్రతికూల పరిస్థితులతో గణనీయంగా తగ్గిన దిగుబడి ఫ గత ఏడాది 7 వేల మెట్రిక్ టన్నులు ఫ ఈసారి ఉత్పత్తి 3,986 మెట్రిక్ టన్నులేనని అంచనా పూత దశలో టీ–దోమ వ్యాప్తి పూత దశలో జీడిమామిడి తోటలకు టీ–దోమ వ్యాప్తి చెంది, పూత దెబ్బతింది. డిసెంబర్లో కురిసిన అధిక వర్షాల వల్ల పూతలు ఆలస్యంగా వచ్చాయి. పూత వచ్చే సమయంలో చలిగాలులు వీయడంతో గింజ పట్టలేదు. పిందె దశలో అఽధిక ఉష్ణోగ్రతల వల్ల పూత, పిందె దెబ్బ తిన్నాయి. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా 3,986 మెట్రిక్ టన్నుల జీడిగింజల దిగుబడి మాత్రమే వస్తుందని అంచనా. – సుజాత, జిల్లా ఉద్యానవన అధికారి, రాజమహేంద్రవరం -
కృష్ణబాబు ఇకలేరు
కొవ్వూరు: వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) (71) ఇక లేరనే వార్త జిల్లావాసులను తీవ్రంగా కలచివేసింది. ఆయన హైదరాబాద్లో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో కన్ను మూశారనే సమాచారం తెలియడంతో కొవ్వూరు నియోజకవర్గంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతిపై అభిమానులు, బంధుమిత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం కృష్ణబాబు భౌతికకాయాన్ని మంగళవారం రాత్రి స్వగ్రామం దొమ్మేరులోని ఆయన నివాసానికి తీసుకుని వచ్చారు. ఆయన అంతిమ యాత్ర బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామ శివారున ఆయన కుటుంబీకుల సమాధులుండే వ్యవసాయ క్షేత్రంలో కృష్ణబాబు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలకు చుట్టుపక్కల నియోజకవర్గాలతో పాటు జిల్లావ్యాప్తంగా పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. కుటుంబ నేపథ్యం ఆంధ్రా షుగర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్యాల శ్రీరామచంద్ర వెంకటకృష్ణ రంగారావు – అచ్చాయమ్మ దంపతులకు కృష్ణబాబు మూడో సంతానం. ఆయన సతీమణి నాగమణి 2010లో మృతి చెందారు. కుమారులు వెంకట్రాయుడు, రవిలు పరిశ్రమలు నడుపుతున్నారు. కుమార్తె అర్చన గృహిణి. కృష్ణబాబు అల్లుడు ఎస్.రాజీవ్కృష్ణ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకుడిగా ఉన్నారు. కృష్ణబాబు ఆంధ్రా షుగర్స్ పూర్వ చైర్మన్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్కు స్వయనా సోదరి కుమారుడు (మేనల్లుడు). మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లిరామయ్యకు స్వయానా బావమరిది. కృష్ణబాబుకు ఆంధ్రా షుగర్స్ సీఎండీ పెండ్యాల నరేంద్రనాథ్ చౌదరి పెద్ద సోదరుడు. టీడీపీ నేత, ఆంధ్ర షుగర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల అచ్చుత రామయ్య (అచ్చిబాబు) చిన్న సోదరుడు. పలువురి దిగ్భ్రాంతి మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి వైఎస్సార్ సీపీకి తీరని లోటు అని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మునిసిపల్ చైర్పర్సన్ బావన రత్నకుమారి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ బండి పట్టాభి రామారావు తదితరులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకుని, ప్రజల కోసం పని చేసిన గొప్ప నాయకుడని అన్నారు. కృష్ణబాబు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏఎంసీ చైర్మన్ ఉప్పులూరి విజయలక్ష్మి, ఎంపీపీ కాకర్ల నారాయుడు, జెడ్పీటీసీ సభ్యురాలు బొంత వెంకటలక్ష్మి, వైఎస్సార్ సీపీ నాయకులు గారపాటి వెంకటకృష్ణ, బొల్లిన సతీష్, ముదునూరి నాగరాజు, పేరిచెర్ల బోసురాజు, ముదునూరి సూర్యనారాయణరాజు, మూడు నియోజక వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు కృష్ణబాబు మృతికి సంతాపం తెలిపారు. పార్టీ పట్టణ కార్యాలయంలో టీడీపీ నాయకులు సంతాప సభ నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, మాజీ మునిసిపల్ చైర్మన్ సూరపనేని చిన్ని, మద్దిపట్ల శివరాామకృష్ణ తదితరులు సంతాపం తెలిపారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో కృష్ణబాబు నాలుగు దశాబ్దాల పాటు చక్రం తిప్పారు. ముఖ్యంగా గోపాలపురం, కొవ్వూరు, పోలవరం నియోజకవర్గాలకు ఆయనే పెద్ద దిక్కుగా ఉండేవారు. అటు తణుకులో సైతం ఆయన కుటుంబీకులదే హవా నడిచేది. తాను ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గెలిపించడంలో కృష్ణబాబు క్రియాశీలక పాత్ర పోషించేవారు. ఆయన కొవ్వూరులో వరుసగా 1983, 1985 (మధ్యంతర ఎన్నికలు), 1989, 1994 సంవత్సరాల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనం కొనసాగిన సమయంలో కూడా కృష్ణబాబు గెలుపొందారు. ఆయనకు వైఎస్సార్తో ప్రత్యేక అనుబంధం ఉండేది. ఇద్దరి పార్టీలూ వేరే అయినప్పటికీ స్నేహభావంతో ఉండేవారు. కృష్ణబాబు హయాంలోనే పైడిమెట్ట, తాడిపూడి ఎత్తిపోతల పథకాలను వైఎస్సార్ ప్రారంభించారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణబాబును వైఎస్సార్ స్వయంగా పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. నియోజకవర్గంలో కృష్ణబాబు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. వైఎస్సార్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన 2012లో వైఎస్సార్ సీపీలో చేరారు. అప్పటి నుంచీ వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఫ కొవ్వూరు ఎమ్మెల్యేగా ఐదుసార్లు విజయం ఫ ఉమ్మడి ‘పశ్చిమ’ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత ఫ వైఎస్సార్తో ప్రత్యేక అనుబంధం ఫ నేడు దొమ్మేరులో అంత్యక్రియలు 0000604619-000001-Executive Offic 8.00x8.00 Executive Officer - Dwaraka Tirumal -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
● జిల్లాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ● కౌంటింగ్ పూర్తయ్యే వరకూ నిర్వహణ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో అసాంఘిక శక్తులను అణచివేసే దిశగా పోలీసు యంత్రాంగం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్కు శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి ఈ ఆపరేషన్ ప్రారంభించారు. వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో జోనల్ డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల ఆధ్వర్యాన పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్త బృందాలుగా ఏర్పడ్డారు. అసాంఘిక కార్యకలాపాలకు అవకాశమున్న ప్రాంతాలను ముందుగా ఎంచుకుని, ఒకేసారి అధిక సంఖ్యలో దాడులు చేస్తున్నారు. అణువణువూ సోదా చేసి మద్యం, మందుగుండు సామగ్రి, ఆయుధాల అక్రమ నిల్వలతో పాటు అనుమానితులను ఆరా తీస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ప్రతి రోజూ ఈ ఆపరేషన్ నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. కాగా, కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ విడిగా బాటిల్స్లో పోసి, అమ్మడాన్ని నిషేధించారు. దీనిపై బంకు యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. 66 వాహనాలు స్వాధీనం జిల్లా అంతటా కార్డన్ అండ్ సెర్చ్ ప్రారంభించాం. ఆదివారం నిర్వహించిన ఈ ఆపరేషన్లో రూ.10,950 విలువైన మందుగుండు సామగ్రి, రికార్డులు లేని 66 వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. బాణసంచా తయారీ, నిల్వ ఉంచే గోడౌన్లలో సంబంధిత పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ పాటించాల్సిన నిబంధనలను బాణసంచా తయారీ, నిల్వ ఉంచే గోడౌన్ల యజమానులకు వివరించారు. – పి.జగదీష్, జిల్లా ఎస్పీ, రాజమహేంద్రవరం -
ఆలయాల్లో కట్టు, బొట్టు కట్
పిఠాపురం: సనాతన ధర్మం నుంచి వచ్చిన ఆచారాలకు ప్రాణం పోయడానికి అధికారులు గతంలో చర్యలు తీసుకున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలైన హిందూ దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఆలయాల్లో కట్టు, బొట్టు తప్పనిసరి చేశారు. ఇప్పటికే అన్నవరం, చిన తిరుపతి వంటి ఆలయాల్లో వస్త్రధారణతో పాటు బొట్టు విషయంలోనూ కఠిన నియమాలు అమలు చేస్తుండడంతో దానిని అన్ని దేవాలయాల్లో అమలు చేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో పలు ఆలయాల్లో వస్త్ర ధారణ, బొట్టు విషయంలో నిర్ధిష్ట నియామాలు అమలు చేయడం ప్రారంభించారు. పిఠాపురంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించే భక్తులు ఇక నుంచి తిరు నామాలు ధరించాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. అభిషేకాలు, అర్చనల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ వస్త్రధారణను తప్పనిసరి చేస్తూ ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. కొన్నిరోజుల పాటు నియమాలు పాటించిన అధికారులు తరువాత వాటిని గంగలో కలిపేశారు. కట్టు, బొట్టు నిబంధనలు పట్టించుకోడం మానేశారు. గతంలో శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో ఈఓ సౌజన్య భక్తులకు తిరు నామాలు ధరింపచేసే కార్యక్రమాన్ని ప్రారంభించగా ఈ సాంప్రదాయాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని అప్పట్లో తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు నామాలు పెట్టుకునే విధంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. పాదగయ క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు అప్పట్లో ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కాని ఆరంభ సూరత్వంగా కొన్నిరోజులు అమలు చేసిన అధికారులు కట్టు బొట్టు విషయాన్ని పక్కన పెట్టేశారు. ప్రస్తుతం పిఠాపురంలోని ఏ ఆలయంలోనూ ఈ నియమాన్ని పాటించిన అనవాళ్లు కనిపించడం లేదు. దీనిపై శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో ఈఓ సౌజన్యను వివరణ కోరగా గతంలో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించామని, కాగా మధ్యలో కరోనా వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో ఆలయానికి ఎక్కువగా మహారాష్ట్ర భక్తులు వస్తారు కాబట్టి బొట్టు పెట్టే విధానాన్ని తాత్కాలికంగా ఆపేశామన్నారు. ప్రస్తుతం మళ్లీ దీనిని ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రముఖ ఆలయాల్లో సంప్రదాయాలు పాటించాలంటూ దేవదాయ శాఖ ఆదేశాలు గతంలో ఆరంభ శూరత్వంగా అమలు ప్రస్తుతం అమలు కాని నిబంధనలు -
ఓట్ల లెక్కింపులో టేక్ కేర్
● కౌంటింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్లకు ‘నో’ ● సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ● నన్నయ వర్సిటీ ఆవరణలోకి వాహనాలకూ అనుమతి లేదు ● తక్షణ సమాచారం ఇచ్చేలా ముందస్తు ఏర్పాట్లు ● ఆర్ఓల శిక్షణలో కలెక్టర్ మాధవీలత సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వచ్చే నెల 4న జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు(ఆర్ఓ), ఇతర సిబ్బందికి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. కౌంటింగ్కు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని, చట్టపరమైన నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. ● ఉదయం 5 గంటల నుంచే ఓట్ల లెక్కింపునకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ● కౌంటింగ్ సిబ్బందిని తప్ప ఇతరులెవ్వరినీ ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతంలోకి అనుమతించరాదు. ● ఓట్ల లెక్కింపు జరిగే రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఆవరణలోకి ఎటువంటి వాహనాలకూ అనుమతి లేదు. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నాలుగు ఏసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ● కౌంటింగ్ కేంద్రాల్లోనికి ఆర్ఓలు తప్ప ఇతరుల మొబైల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు. దీనిపై సంబంధిత ఆర్ఓలు కచ్చితంగా తనిఖీలు నిర్వహించాలి. మొబైల్ ఫోన్ల డిపాజిట్కు కౌంటర్ ఏర్పాటు చేయాలి. ● మీడియా సెంటర్ వరకూ మొబైల్ ఫోన్లను అనుమతించవచ్చు. ● ఆర్ఓలు తమ మొబైల్ ఫోన్ ద్వారా రౌండ్ల వారీ సమాచారం ఇవ్వాలి. ఆర్ఓలు డెజిగ్నేటెడ్ అధికారిని నియమించుకుని, వారి ద్వారా మీడియా విభాగానికి కూడా సమాచారం అందజేయాలి. ● కమ్యూనికేషన్ విభాగంలోని అధికారులకు, సిబ్బందికి సిట్టింగ్ ఏర్పాట్లు ఉండాలి. ఎస్టీడీ, ఫ్యాక్స్, ప్రింటర్, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంచుకోవాలి. ప్రధాన ఎన్నికల అధికారికి తక్షణ సమాచారం అందించేందుకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కలిగిన కంప్యూటర్తో పాటు ఒక హాట్లైన్ ఏర్పాటు చేసుకోవాలి. వీటి పర్యవేక్షణకు సీనియర్ అధికారిని నియమించాలి. ● పరిశీలకుల గదిలో కూడా ఫోన్, ఫ్యాక్స్, ఇంటర్నెట్, టీవీ, ప్రొటోకాల్ బృందం, సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ● ప్రతి టేబుల్ వద్ద స్టేషనరీ, ఇన్ఫర్మేషన్ షీట్లు, అదనపు సిబ్బందికి ఏర్పాట్లు ఉండాలి. 14 మంది ఏజెంట్లకు మాత్రమే అనుమతి ● కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి, టేబుల్ కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి. ● ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో గరిష్టంగా 14 మంది ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. ● ఫామ్–17సిలో నమోదు చేసిన ఓట్లను ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యతో సరిచూస్తారు. ఆ సంఖ్యను కౌంటింగ్ సిబ్బంది ఫామ్–17సి పార్ట్–2లో నోట్ చేసుకుని, ఏజెంట్ల సంతకం తీసుకుంటారు. ● అనంతరం ఈవీఎంల సీల్ తొలగించి రిజల్ట్ బటన్ నొక్కుతారు. ఆ ఈవీఎంలో పోలైన ఓట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయం తెలుస్తుంది. ● ఆ వివరాలను కౌంటింగ్ సిబ్బంది నోట్ చేసి, ఆ సంఖ్యను ఏజెంట్లందరికీ చూపించి, వారు సంతృప్తి వ్యక్తం చేశాకే రౌండ్ ఫలితాలను వెల్లడించాలి. ● ఒక్కో రౌండులో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాలను కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బోర్డుపై సిబ్బంది రాస్తారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీసి భద్రపరుస్తారు. భద్రత కట్టుదిట్టం ● ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలి. ● ఈవీఎంల రవాణాకు బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ● పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లను లెక్కింపు కేంద్రంలోనికి అనుమతిస్తారు. ● మూడంచెల భద్రతలో భాగంగా మొదటిగా 100 మీటర్ల పాదచారుల జోన్ ఏర్పాటు చేయాలి. ఇందులో సంబంధిత వ్యక్తి గుర్తింపు కార్డును సీనియర్ మెజిస్ట్రేట్ పరిశీలించి అనుమతిస్తారు. ● రెండో అంచెలో ఆయా వ్యక్తులను రాష్ట్ర సాయుధ పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులూ లేవని నిర్ధారించుకున్న తరువాత విడిచిపెడతారు. ఇక్కడ మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. మొబైల్ ఫోన్లు లేవని నిర్ధారించుకోవాలి. ● మూడో అంచెలో కేంద్ర సాయుధ బలగాలు తనిఖీ చేస్తాయి. ● కౌంటింగ్ హాలు లోపలకు కెమెరా స్టాండ్ను అనుమతించరు. చేతి కెమెరాకు మాత్రమే అనుమతి ఉంటుంది. ● శాంతిభద్రతల విషయంలో కచ్చితత్వం పాటించాలి. ● ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకూ మొత్తం బాధ్యత రిటర్నింగ్ అధికారి పైనే ఉంటుంది. ● ఈ శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, రాజమండ్రి రూరల్ ఆర్ఓ ఎన్.తేజ్భరత్, నగరపాలక సంస్థ కమిషనర్, రాజమండ్రి సిటీ ఆర్ఓ కె.దినేష్ కుమార్తో పాటు ఆయా నియోజకవర్గాల ఆర్ఓలు కూడా పాల్గొన్నారు. -
అన్నదాత కన్నీరు తుడిచేలా..
● మిచాంగ్ తుపాను బాధిత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు ● ఇన్నాళ్లూ రైతులకు అందకుండా చంద్రబాబు అండ్ కో కుట్రలు ● ఎన్నికల పేరుతో అన్నదాతకు సాయం చేయకుండా మోకాలడ్డు ● పోలింగ్ అనంతరం నిధులు జమ చేస్తున్న ప్రభుత్వం ● జిల్లాలో పంట నష్టపోయిన 15,615 మంది ● రూ.14.80 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల సాక్షి, రాజమహేంద్రవరం: గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో మిచాంగ్ తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన అన్నదాతల కన్నీరు తుడిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. నెలల వ్యవధిలోనే పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందించింది. ప్రకృతి వైపరీత్యాలతో ఒక సీజన్లో పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ ముగియకుండానే ఇన్పుట్ సబ్సిడీ అందించే నూతన విధానాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే మిచాంగ్ తుపాను నష్టపరిహారాన్ని కూడా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. సరిగ్గా అదే తరుణంలో చంద్రబాబు అండ్ కో సైంధవ పాత్ర పోషించారు. ఎన్నికల కోడ్ పేరుతో రైతులకు పరిహారం నిధులు విడుదల చేయకుండా ఎన్నికల కమిషన్కు లేఖ రాసి, అడ్డం పడ్డారు. ఈ నెల 13న పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఆ పరిహారాన్ని ప్రభుత్వం ఇప్పుడు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అప్పట్లోనే వేగంగా నష్టాల అంచనా నాటి మిచాంగ్ తుపాను ప్రభావంతో జిల్లాలో వరి, పత్తి, వేరుశనగ, చెరకు, మొక్కజొన్న, మినుములు, పెసలు, సన్ఫ్లవర్, జొన్న, పొగాకు వంటి పంటలకు నష్టం వాటిల్లింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, వలంటీర్లు ఆగమేఘాల మీద క్షేత్ర స్థాయికి వెళ్లారు. అప్పట్లో ఖరీఫ్ కోతలు జరుగుతున్నందున రైతులు గింజ కూడా నష్టపోకుండా అండగా నిలిచారు. ఆన్లైన్లో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆఫ్లైన్లో ఈ ప్రక్రియ చేపట్టింది. ధాన్యంలో తేమ ఉన్నప్పటికీ మిల్లులకు తరలించింది. రైతులకు అన్ని సదుపాయాలూ కల్పించింది. రాత్రి వరకూ ఉండి మరీ ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియ చేపట్టింది. జిల్లాలో 8,799 మెట్రిక్ టన్నులు కొన్నారు. ముందస్తుగానే అప్రమత్తమై కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించారు. అదే సమయంలో ఏ ఒక్క రైతూ నష్టపోకూడదనే ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికార యంత్రాంగం పంట నష్టాల జాబితాను పక్కాగా రూపొందించింది. నిర్దేశిత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి, ఆ జాబితాలను సంబంధిత గ్రామ/వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచింది. అభ్యంతరాలు స్వీకరించి అర్హుల తుది జాబితా రూపొందించి, ప్రభుత్వానికి నివేదించింది. దీని ప్రకారం మిచాంగ్ తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా 15,615 మంది రైతులకు సంబంధించి 10,487.02 హెక్టార్లలో ఉద్యాన, వ్యవసాయ పంటలు దెబ్బ తిన్నాయని నిర్ధారించారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఇంకో ఆలోచన చేయకుండా రైతులకు అండగా నిలిచింది. నష్టపోయిన రైతులకు నెలల వ్యవధిలోనే రూ.14.80 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు చేసింది. నిబంధనల మేరకు ఒక్కో పంటకు ఒక్కోవిధంగా ఇన్పుట్ సబ్సిడీ నిర్ధారించారు. రైతులపై చంద్రబాబు కుట్రలు తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కనీస కనికరం చూపకపోగా.. మేలు చేయడానికి సిద్ధమైన ప్రభుత్వాన్ని సైతం అడ్డుకున్నారు. రైతులకు పెట్టుబడి రాయితీ అందకుండా కుట్రలు పన్నారు. ఎన్నికలను అడ్డం పెట్టుకుని పెట్టుబడి డబ్బులు మంజూరు చేయకూడదంటూ ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. దీంతో నిధుల విడుదలకు ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసింది. ఈ నెల 13న పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పంటల వారీగా హెక్టారుకు మంజూరు చేసిన ఇన్పుట్ సబ్సిడీ (రూ.లు) పంట ఇన్పుట్ సబ్సిడీ వరి, వేరుశనగ, పత్తి, చెరకు 17,000 మొక్కజొన్న 12,500 మినుము, పెసలు, శనగలు, పొద్దుతిరుగుడు, పొగాకు 10,000 జొన్న 8,500 నియోజకవర్గాల వారీగా ఇన్పుట్ సబ్సిడీ మంజూరు ఇలా.. నియోజకవర్గం రైతులు పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ (హెక్టార్లు) (రూ.లక్షలు) అనపర్తి 682 344.28 52.43235 రాజమండ్రి రూరల్ 214 112.55 18.8077 రాజానగరం 8,554 6032.16 838.6905 జగ్గంపేట 1,484 832.05 141.4485 గోపాలపురం 2,970 2195.81 279.91535 కొవ్వూరు 819 534.9 77.28165 నిడదవోలు 892 435.27 71.9426 రూ.8 వేల పెట్టుబడి రాయితీ చాగల్లు గ్రామంలో 1.97 ఎకరాల్లో మినుములు సాగు చేశాను. మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బ తింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే పంట నష్టం అంచనా వేశారు. డబ్బులు కూడా పడతాయని చెప్పారు. కానీ ఎన్నికలున్నాయని డబ్బులు పడలేదు. ఇప్పుడు పోలింగ్ పూర్తవడంతో రూ.8 వేల పెట్టుబడి రాయితీ అందుకునే అవకాశం దక్కింది. పంట నష్టపోయిన వెంటనే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్న సీఎం జగన్కు రుణపడి ఉంటాం. ఈ డబ్బులు కుటుంబ అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయి. – మారిన చాముండేశ్వరి, చాగల్లు పెట్టుబడి రాయితీ అడ్డుకోవడం దారుణం తుపానుతో నష్టపోయిన రైతులకు సీఎం వైఎస్ జగన్ సాయం చేస్తూంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారు. చివరకు రైతులు నష్టపోయిన పంటలకు పెట్టుబడి రాయితీ డబ్బులు కూడా ఎన్నికల పేరుతో ఇవ్వనీయకుండా అడ్డుకోవడం దారుణం. బాబుకు రైతులే తగిన బుద్ధి చెబుతారు. – గారపాటి శ్రీనివాసరావు, చాగల్లు అర్హుల ఖాతాల్లో... మిచాంగ్ తుపానుతో పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ఇన్పుట్ సబ్సిడీ అందుతుంది. ఇప్పటికే జమ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. సింహభాగం రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. 33 శాతం కంటే ఎక్కువగా పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాం. ఎలాంటి అభ్యంతరాలున్నా స్వీకరించాం. అర్హుల జాబితా రూపొందించి ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, పంట నష్టపోయిన ప్రతి రైతుకూ ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తోంది. – ఎస్.మాధవరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
గంటపాటు లిఫ్ట్లో ఇరుక్కుపోయిన భక్తులు
అన్నవరం: విజయవాడకు చెందిన భక్తులు స్థానిక రైల్వేస్టేషన్లో లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. సుమారు గంట తరువాత వారిని రైల్వే సిబ్బంది లిఫ్ట్ అత్యవసర ద్వారం నుంచి కిందకు దించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన ఏడుగురు భక్తులు సోమవారం రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి వచ్చారు. వారు స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో విజయవాడ వెళ్లేందుకు సోమవారం మధ్యాహ్నం రైల్వేస్టేషన్కు వచ్చారు. వీరు ఒకటో నెంబర్ ప్లాట్ఫాం మీద రైలు ఎక్కి విజయవాడ వెళ్లాల్సి ఉంది. ఒకటో నెంబర్ ప్లాట్ఫాంకు వచ్చేందుకు గాను వీరు మూడో నెంబర్ ప్లాట్ఫాం మీద గల లిఫ్ట్ ఎక్కారు. ఆ లిఫ్ట్ కొంత ఎత్తుకు వెళ్లి ఆగిపోవడంతో వారు కేకలేశారు. కొంత సేపటి తరువాత రైల్వే సిబ్బంది వచ్చి లిఫ్ట్ అత్యవసర ద్వారం తెరిచి అక్కడ నుంచి నిచ్చెన ద్వారా కిందకు దించారు. సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ ఆగిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. -
కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
రాజానగరం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆదికవి నన్నయ యూనివర్సిటీలో వచ్చే నెల 4న చేపట్టబోయే ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత సోమవారం పరిశీలించారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించేలా సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన ఈవీఎంల భద్రతను, రక్షణ చర్యలను నిశితంగా పరిశీలించారు. రాజమండ్రి లోక్సభ, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్లు పోలైన ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల నుంచి పటిష్టమైన భద్రతతో ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తీసుకుని వచ్చేందుకు రూపొందించిన రూట్ మ్యాప్ను పరిశీలించారు. దీనిపై ఎస్పీ పి.జగదీష్తో కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో అసెంబ్లీ నియోజవర్గాల రిటర్నింగ్ అధికారులు ఎన్.తేజ్భరత్, కె.దినేష్కుమార్, అశుతోష్ శ్రీవాత్సవ్, ఎ.చైత్రవర్షిణి, అదనపు ఎస్పీ ఎల్.చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్కు ఎరువులు సిద్ధం ఏపీ మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ప్రతాప్ రాజమహేంద్రవరం రూరల్: ఖరీఫ్లో రైతులకు కావలసిన ఎరువులను అందుబాటులో ఉంచామని ఏపీ మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ దేవారపు ప్రతాప్ తెలిపారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువులను సొసైటీలు, రైతుభరోసా కేంద్రాలకు (ఆర్బీకే) మార్క్ఫెడ్ ద్వారా పంపించామని చెప్పారు. సొసైటీలకు 624.600 మెట్రిక్ టన్నుల యూరియా, 12 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 21.5 మెట్రిక్ టన్నుల డీఏపీ ఎరువులను పంపించామని వివరించారు. ఆర్బీకేల్లో 32.4 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. అలాగే, మార్క్ఫెడ్ గోడౌన్లలో 3,213.090 మెట్రిక్ టన్నుల యూరియా, 188 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 111.30 మెట్రిక్ టన్నుల డీఏపీ ఎరువులు నిల్వ ఉంచామని తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారుల సూచనల మేరకు రైతులకు అవసరమైన ఎరువులను ఎప్పటికప్పుడు కొరత లేకుండా పూర్తి స్థాయిలో సరఫరా చేస్తామని ప్రతాప్ తెలిపారు. -
వ్యవసాయంగా..
నల్లజర్ల: సాగు లేకుంటే గడ్డు పరిస్థితే. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ అన్నదాత ముందుకు సాగుతున్నాడు. రైతన్న అనుభవానికి యువత ఆలోచన తోడైతే.. సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానిస్తే మరింత మేలు జరుగుతుంది. ఆ కోవలోనే వ్యవసాయం (ఉద్యాన సాగు)లో యువతను భాగస్వాములను చేసే బాధ్యతను పార్వతీపురం ఉద్యాన కళాశాల స్వీకరించి శిక్షణ ఇస్తోంది. నాలుగో సంవత్సరం ఉద్యాన కోర్సు చదువుతున్న విద్యార్థులు తమ శిక్షణలో భాగంగా వివిధ ప్రాంతాలకు వచ్చారు. నాలుగు నెలల పాటు నిర్వహించే కార్యక్రమాన్ని గ్రామీణ వ్యవసాయ (ఉద్యాన) పని అనుభవంగా పిలుస్తారు. దీనికి సంబంధించిన విశేషాలను ఆ విద్యార్థులు వివరించారు. పార్వతీపురం ఉద్యాన కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఎనిమిది మందిని క్షేత్ర పర్యటన కోసం వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం వారు కేటాయించారు. ఈ నాలుగు మాసాల్లో ఉద్యాన రైతులు చేపట్టే అన్ని ఉద్యాన సాగు కార్యక్రమాలను దగ్గర నుంచి పర్యవేక్షిస్తారు. ఇందుకు నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామాన్ని వీరు ఎంచుకున్నారు. ఆ గ్రామంలో ఉద్యాన సాగులో తెగుళ్లు, కలుపు నివారణ, పురుగు మందు వినియోగం తదితర అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని, చివరకు పంట చేతికొచ్చే వరకు ఆ రైతుకు ఎంత ఖర్చయింది, ఎంత మిగిలింది పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా రైతు కుటుంబంపైన రైతుకు ఉన్న అనుబంధ పరిశ్రమలు పశు పోషణ, కోళ్ల పెంపకం తదితర అంశాలపైనా ప్రాజెక్ట్ వర్క్ చేసి, అన్ని కోణాల్లో ఆయా అంశాలపై విశ్లేషణలతో పాటు పని అనుభవాన్ని నేర్చుకుంటారు. ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కరుణశ్రీ, వి.దీప్తి వీరి పనితీరును పర్యవేక్షిస్తారు. మొదటి నెలలో.. విద్యార్థులకు కేటాయించిన గ్రామాల్లో సర్వే చేయాలి. దీనిని ఆగ్రో ఎకనమిక్ సర్వే అంటారు. శాస్త్రవేత్తలు సూచించిన విధంగా సాగు మెళకువలు రైతులు అమలు చేస్తున్నారా? లేదా? అన్న విషయాలు పరిశీలిస్తారు. రైతులు చేపట్టబోయే వ్యవసాయానికి సంబంధించిన వివరాలు సేకరించి, సాగుకు సమాయత్తం అవుతున్న తీరుపై విశ్లేషణ చేయాలి. సాగులో నూతన ఆధునిక విధానాలు పాటిస్తున్న రైతులు, వారు సాధిస్తున్న దిగుబడులపై నివేదిక తయారు చేయాలి. రైతు కుటుంబాల ఆదాయ, వ్యయాలతో పాటు, జీవన ప్రమాణాల వివరాలు సేకరిస్తారు. రెండో నెలలో.. సాగులో తాము గ్రహించిన విషయాలతో బోర్డులు, చార్టులు తయారు చేయాలి. వీటిపై బోధనా విధానాన్ని వారే రూపొందిస్తారు. దీనిని రైతులకు అర్థమయ్యే రీతిలో నైపుణ్యతతో వివరిస్తారు. మూడో నెలలో.. గ్రామంలో బ్యాంకులు, సహకార సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి. బ్యాంకులు ఖాతాదారులకు అందిస్తున్న నూతన పథకాలు, సేవలు లావాదేవీలపై అధ్యయనం చేసి, పూర్తి సమాచారాన్ని సేకరించాలి. పంటలకు ఆశించే చీడపీడలతో పాటు, ఆశించిన పురుగుల నమూనాలు పరిశీలించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నూతన పథకాల అమలు, ప్రజలకు అందుతున్న తీరు క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి, నివేదిక తయారు చేయాలి. మొదటి నెలలో రైతు కుటంబాల బడ్జెట్పై అధ్యయనం చేస్తే, వాటికి భిన్నంగా వ్యవసాయ కూలీల కుటుంబాల ఆదాయ, వ్యయాలపై విశ్లేషణ చేయాలి. నాలుగో నెలలో.. మూడు నెలల కార్యక్రమాలపై సమగ్ర సమాచారం రూపొందించడం. మహిళలు స్వయం ఉపాధిపై అవగాహన, ఉద్యాన రైతులతో చర్చ, ఉద్యాన పంటల ప్రదర్శన కార్యక్రమాలుంటాయి. సాగులో యువత భాగస్వామానికి శిక్షణ పని అనుభవంతో క్షేత్ర స్థాయి పర్యటన పార్వతీపురం ఉద్యాన కళాశాల చేయూత అనేక అంశాలు తెలిశాయి రైతులు టి.సత్యనారాయణ, దేవిన నరేష్ నిమ్మ, కొబ్బరి, మామిడితోటల్లో చేస్తున్న సేంద్రియ సాగు, నిమ్మలో వచ్చే తెగుళ్లు, వాటి నివారణను తెలుసుకున్నాం, జీడితోటల్లో పరపరాగ సంపర్కం కాకుండా ఎరలను ఏర్పాటు చేయడం వంటి అంశాలు తెలుసుకున్నాం. – ఎం.నవ్యలక్ష్మి, పి.మౌనిక ఎంతో ఉపయోగపడ్డాయి ప్రకాశరావుపాలెంలో ఉద్యాన రైతులు అల్లూరి సత్యనారాయణ, దేవిన మధుబాబు అరటితోటల్లో అంతర పంట కోకో సాగుపై తెలుసుకున్నాం. అరటిలో చీడపీడలు–తెగుళ్లు, వాటి లక్షణాలు తెలుసుకున్నాం. వారి అనుభవాలు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. – టి.రేవతి, ఎం.ప్రియాంక తెగుళ్లపై అవగాహన రైతు దావులూరి శ్రీనివాసరావు ఆయిల్పామ్తోట, మద్దిపాటి వెంకటేశ్వరావు కోకో, అరటిల్లో ఆశించే తెగుళ్లు, వాటి నివారణ తెలుసుకున్నాం. – ఏ.పూర్ణసాయిశ్రీ, వి.నాగవైష్ణవి -
వైభవంగా గరుడేశ్వరస్వామి రథోత్సవం
పి.గన్నవరం: గ్రామంలో వేంచేసిన బాలత్రిపుర సుందరీ సమేత గరుడేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాల సందర్భంగా సోమవారం స్వామివారి ఉత్సవ విగ్రహాలను రఽథంలో పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ అర్చక స్వామి భైరవభొట్ల సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. పురవీధుల్లో ఊరేగిన స్వామి వారికి భక్తులు పూజలు చేశారు. కార్యక్రమంలో శివాలయం యూత్ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గ ఎంపిక నిడదవోలు: కామాక్షి విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నూతన కమిటీని స్థానిక విశ్వబ్రాహ్మణ కల్యాణ మండపంలో సోమవారం ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా గొల్తి రామబ్రహ్మం, గౌరవ అధ్యక్షుడిగా పొడుగు శ్రీరామమూర్తి, ప్రధాన కార్యదర్శిగా నాగోజు వీర సత్యనారాయణ, కోశాధికారిగా లావేటి జేజి శివన్నారాయణ, ఉపాధ్యక్షుడిగా కొమ్మోజు చంద్రశేఖర్, సహాయ కార్యదర్శిగా పొడుగు నరేష్తో పాటు, కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. -
కళాకారుడికి రూ.50 వేల ఆర్థిక సాయం
అంబాజీపేట: ఇటీవల ప్రమాదవశాత్తూ చేయి కోల్పోయి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న గంగలకుర్రుకు చెందిన గుత్తుల విజయరాజుకు వెంకటేశ్వర దుర్గాదేవి కోల సంబరం కళాకారులు జిల్లా సంఘం ఆధ్వర్యంలో రూ.50 వేల ఆర్ధిక సాయాన్ని అందజేశారు. విజయరాజును కళాకారుల సంఘ నాయకులు సోమవారం కలసి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని విజయరాజుకు అండగా ఉంటామని తోటి కళాకారులు మనోధైర్యం కల్పించారు. కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షుడు కోట శ్రీను, అధ్యక్షుడు ఈతా దుర్గారావు, ఉపాధ్యక్షులు వాసంశెట్టి లక్ష్మణరావు, చిక్కాల స్వామికాపు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి దాతల విరాళం
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్యాన్నదాన ట్రస్టుకు ఆదివారం పలువురు దాతలు విరాళాలు అందించారు. కర్ణాటకకు చెందిన రాచపల్లి మంజునాథ్, పద్మావతి దంపతులు రూ.11,116 విరాళంగా అందించారు. కర్ణాటకకు చెందిన మరో దాత పెనుకుదురు లక్ష్మణరావు, లక్ష్మీగీత దంపతులు రూ.10,001 విరాళంగా అందించారని ఆలయ ఈఓ గ్రంధి మాధవి తెలిపారు. విరాళం అందించిన దాతలకు స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. బాల బాలాజీ స్వామికి ఆదివారం లడ్డూ ప్రసాదం, దర్శనం టికెట్ల విక్రయం ద్వారా రూ.1.28 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ తెలిపారు. నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.1.08 లక్షలు విరాళాలుగా అందించారని చెప్పారు. వివిధ సేవల ద్వారా స్వామికి రూ.2.37 లక్షల ఆదాయం లభించిందన్నారు. 2,681 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని, 1,974 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు. -
ఫేస్బుక్ ఫేక్ ఐడీతో అర్ధ నగ్న చిత్రాల పోస్ట్
● పట్టణ పోలీసులను ఆశ్రయించిన మహిళ ● యువకుడితో పాటు మరో యువతిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు నిడదవోలు : ఓ మహిళతోపాటు ఆమె భర్త ఫొటోతో ఫేస్బుక్ ఫేక్ ఐడీ క్రియేట్ చేసి దానిలో నుంచి ఇతరులకు అర్ధ నగ్న చిత్రాలను పోస్ట్ చేస్తున్న ఓ యువకుడు, యువతిపై నిడదవోలు పోలీసులు ఆదివారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిడదవోలు పట్టణ ఎస్సై పి.అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు పట్టణంలోని అన్నపూర్ణనగర్కు చెందిన ఓ మహిళ, ఆమె భర్త ఫొటోతో నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన పోలవరపు దుర్గాప్రసాద్ ఫేస్బుక్ ఫేక్ ఐడీ క్రియేట్ చేశాడు. దాని నుంచి బాధిత మహిళ ముఖాన్ని అర్ధ నగ్న మహిళల చిత్రాలతో మార్ఫింగ్ చేసి ఇతర ఫేస్ బుక్ అకౌంట్లకు పంపాడు. ఇదే క్రమంలో అన్నపూర్ణనగర్కు చెందిన ఓ యువతి బాధిత మహిళ ముఖంతో కూడిన అర్ధనగ్న చిత్రాలను పోస్ట్ చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత మహిళ నిడదవోలు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిడదవోలు సీఐ జె. జానకిరామ్ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై పి.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పోలవరపు దుర్గాప్రసాద్తో పాటు మరో యువతిపై సెక్షన్ 417 మోసం, సెక్షన్ 506 బెదిరింపులు, సెక్షన్ 354–డి అర్ధనగ్న చిత్రాల పోస్టులు, 2000– 2009 ఐటీ యాక్ట్ ప్రకారం కేసులను నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
జీవవైవిధ్యం పరిరక్షణతో మానవ మనుగడ
బాలాజీచెరువు: జీవవైవిధ్యం పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని జేఎన్టీయూకే ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ పేర్కొన్నారు. పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం రాష్ట్ర జీవవైవిధ్య మండలి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పర్యావరణ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మురళీకృష్ణ మాట్లాడుతూ భారతదేశం జీవవైవిధ్యపరంగా అతిబలమైన దేశమని, ప్రపంచదేశాలతో పోలిస్తే 17వ స్థానంలో ఉందన్నారు. ఇక్కడ సుమారు 1,200 పక్షిజాతులు, వివిధ జంతువులు ఉన్నాయని తెలిపారు. నాల్గవ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులు 273 మంది పాల్గొనగా వీరికి వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో రిటైర్డ్ శాస్త్రవేత్త వై.శివప్రసాద్, నేషనల్ గ్రీన్ కోర్ కో–ఆర్డినేటర్ కేసరి శ్రీనివాసరావు, రిసోర్స్ పర్సన్స్ వీరభద్రరావు, రమణామూర్తి, పిల్లి గోవిందరాజు పాల్గొన్నారు. -
ఆరుగురిపై వరకట్న వేధింపుల కేసు
కొత్తపల్లి: ఆరుగురిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్టు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. మండలంలోని నాగులాపల్లికి చెందిన సంధ్యకు గొల్లప్రోలు మండలం మల్లవరానికి చెందిన పెనుమల్లు భాస్కర్రెడ్డికి ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె ఉంది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య అదనపు కట్నంకోసం వివాదం చోటు చేసుకోవడంతో విడివిడిగా ఉంటున్నారు. సంధ్య కాపురం విషయంపై మాట్లాడేందుకు మల్లవరం వెళ్లగా అత్తమామలు సుబ్బలక్ష్మి, రామకృష్ణారెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు తగాదాకు దిగారు. దీనిపై సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భాస్కర్రెడ్డి, సుబ్బలక్ష్మి, రామకృష్ణారెడ్డిలతో పాటు మరో ముగ్గురిపై వరకట్న వేధింపుల కేసును ఎస్సై స్వామి నాయుడు నమోదు చేశారు. -
మెరుగైన వసతులు కల్పిస్తున్నాం
అమ్మవారి సన్నిధికి వచ్చే భక్తులకు పూర్తి స్థాయిలో అన్ని వసతులూ కల్పిస్తున్నాం. ప్రతి రోజూ 150 నుంచి 200 మందికి అన్నప్రసాదం అందిస్తున్నాం. అమ్మవారి మొక్కుబడులు తీర్చుకోవడానికి వచ్చే భక్తులకు షెడ్లు, గదుల సదుపాయం కల్పిస్తున్నాం. రక్షిత తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి రూ.40 లక్షల అంచనాలతో ప్రతిపాదనలు పంపించాం. తొమ్మిది అంతస్తుల రాజగోపురానికి, ఆలయం చుట్టూ ప్రహరీకి, భక్తుల పాత వసతి భవనాలకు రంగులు వేయడానికి రూ.20 లక్షల అంచనాతో టెండర్లు పూర్తయ్యాయి. పనులు ప్రారంభిస్తాం. – వి.హరిసూర్య ప్రకాష్, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ, శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానం శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయం -
వైద్యులపై దాడులు ఆగాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ): ఇటీవల కాలంలో వైద్యులు, ఆసుపత్రులపై దాడులు అధికమయ్యాయని, వాటి వల్ల తాము భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తోందని పలువురు వైద్యులు పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్లో రాజమహేంద్రవరం ఒబెస్టేస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో వైద్యులపై జరుగుతున్న దాడులపై ప్రజా అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. అధ్యక్షుడు డాక్టర్ కె.అరుణకుమారి, కార్యదర్శి డాక్టర్ ఎం.దేవిశ్రీ సమన్వయకర్తలుగా, మానస ఆసుపత్రి అధినేత డాక్టర్ కర్రి రామారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు ప్రసంగించారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైద్యులపై జరుగుతున్న దాడులను, చట్టపరంగా నియంత్రించాల్సిన విధానాలను సెక్షన్లతో సహా మెడికో లీగల్ కన్సెల్టెంట్ డాక్టర్ హితేష్ భట్ వివరించారు. ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, డాక్టర్ కందుల సాయి, ఎన్ఎస్ రామరాజు, డాక్టర్ వై.గురుప్రసాద్, డాక్టర్ అనసూరి పద్మలత, డాక్టర్ కోమలి ప్రసంగించారు. -
జేఈఈ (మెయిన్) బి–ఆర్క్, బి–ప్లాన్ ఫలితాలలో తిరుమల సంచలనం
రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక జేఈఈ(మెయిన్) బి–ఆర్క్ అండ్ బి–ప్లాన్ ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్టు తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. బి ప్లానింగ్ విభాగంలో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 1వ ర్యాంకు సాధించి మరోసారి శ్రీతిరుమలశ్రీ విద్యార్థులు తమ సత్తా చాటారని ఆయన అన్నారు. కె.సాకేత్ ప్రణవ్ ఓపెన్ కేటగిరిలో ఆల్ ఇండియా 1వ ర్యాంకు, వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో తమ విద్యార్థులు కేజే వెంకటసాయి 2వర్యాంకు, పప్పుల దినేష్ 8వ ర్యాంకు, కేవీ సత్యనీలచలం 8వ ర్యాంకు, ఎంఎన్.మణికంఠ 15వ ర్యాంకు, ఎంజీ వెంకటమహేష్ 15వర్యాంకు, జీఎన్.వెంకటసాయికృష్ణ 18వ ర్యాంకు, ఎన్.రాజీవ్ 20వ ర్యాంకు సాధించడంతో పాటు, 23, 24, 25, 26, 31, 32, 36, 40, 44, 50 ర్యాంకులు సాధించారని ఆయన తెలిపారు. బి–ఆర్క్ విభాగంలో వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో తాటిపాక ఆదిత్య 4వ ర్యాంకు, కె.సాకేత్ ప్రణవ్ 5వ ర్యాంకు, కేజే వెంకటసాయి 5వర్యాంకు, పప్పుల దినేష్ 14వర్యాంకు, జీఎన్.వెంకటదుర్గాసాయి 17వర్యాంకు సాధించడంతో పాటుగా 21, 27, 35, 36, 40, 43 ర్యాంకులు సాధించారని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను నున్న తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ హత్య
తుని రూరల్: తుని మండలం తేటగుంట శివారు రాజులకొత్తూరు నుంచి టి.వెంకటాపురం వెళ్లే మట్టి రోడ్డులో ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆదివారం తేటగుంట వీఆర్ఓ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో రూరల్ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి, ఎస్సై డి.రమేష్బాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి శరీరంపై ఎరుపు రంగు జాకెట్ ఉంది. ఇతర వస్త్రాలు ఏమీ లేవు. చేతులు, కాళ్లూ కట్టివేసి ఉన్నాయి. మహిళ హత్యకు గురైనట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో తుని పట్టణం దిబ్బలపాలెం (తారక రామకాలనీ)కి చెందిన కుమారి అనే సంధ్య (30)గా గుర్తించినట్టు సీఐ తెలిపారు. హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ వదిలేశారా, మృతదేహం ఉన్న ప్రాంతంలోనే హత్యకు గురయ్యిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో తరచూ సంచరిస్తున్నట్టు సమాచారం లభించిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం రావులపాలెం: గౌతమి గోదావరిలోకి స్థానానికి వెళ్లి ముగ్గురు యువకులు శనివారం గల్లంతు కాగా వారిలో ఇద్దరి మృతదేహాలు దొరికిన విషయం తెలిసిందే. మూడో వ్యక్తి సత్తి సంపత్ రెడ్డి (15) మృతదేహం ఆదివారం కనుగొన్నట్టు సీఐ ఎం.ఆంజనేయులు తెలిపారు. రావులపాలెం గౌతమి పాత బ్రిడ్జి సమీపంలో గల్లంతైన సంపత్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో రెండు పడవలపై గాలింపు చర్యలు చేపట్టడంతో కపిలేశ్వరం మండలం తాతపూడి ఇసుక ర్యాంపు సమీపంలో గోదావరిలో లభించినట్టు తెలిపారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. మహిళకు పాము కాటు ముమ్మిడివరం: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి నక్కావారిపేటకు చెందిన నక్కా లక్ష్మి(40) ఆదివారం మధ్యాహ్నం పాముకాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. లక్ష్మి ఇంటి ఆవరణలో సంచరిస్తుండగా తాచుపాము కాటు వేసింది. ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. -
స్నానాల సరదా ప్రాణాల మీదికి
చర్యలు తీసుకోవాలి ● గోదావరి నదీ తీరాల్లో ప్రమాదాల నివారణకు పంచాయతీరాజ్, హెడ్వర్క్స్శాఖ పోలీసుశాఖ ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలి. ● గోదావరి పరీవాహక ప్రాంతంలో పోలీసు గస్తీ ముమ్మరం చేసి వేగం పెంచాలి. అవగాహన సదస్సులు నిర్వహించాలి. ● ప్రమాదకరమైన అన్ని రేవుల వద్ద లోతు వివరాలు తెలియజేసే హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలి. ● నదీ పరివాహక గ్రామాల్లో స్నానాలకు అనుమతి లేని ప్రదేశాల వివరాలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. ● స్నానాలు చేసేటప్పుడు, ఈత కొడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ స్వీయరక్షణ చర్యలు పాటించాలి. ● విషాదాన్ని మిగులుస్తున్న గోదావరిలో ఈత సరదా ● ఈ నెలలోనే ఏడుగురు మృత్యువాత ● ప్రభుత్వ గణాంకాల మేరకు గత పదేళ్లలో 29 మంది మృతి ● రికార్డులకెక్కని మృతులెందరో ఉన్నారంటున్న జనం ● స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలంటున్న నిపుణులు ఆలమూరు: వేసవికాలం వచ్చేసింది. విద్యార్థుల్లో ఆటవిడుపు మొదలైంది. నదీ పరివాహక ప్రాంతాల్లో అనువుగా ఉండే ప్రదేశాల్లో స్నానాలు చేసేందుకు యువకులు ఉవ్విళ్లూరుతున్నారు. గోదావరిలో ఒక్కసారైనా స్నానమాచరించాలనే కోరికను తీర్చుకునేందుకు పర్యాటకులు ఉబలాటపడుతున్నారు. గోదావరిలో స్నానం చేసే సమయంలో కాని, ఈత కొట్టే సమయంలో కాని ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శించినా మృత్యువాత పడతామని, తల్లిదండ్రులను ఒంటరివాళ్లను చేస్తామని మాత్రం ఊహించడం లేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, రామచంద్రపురం, మండపేట, ముమ్మిడివరం, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాల వెంబడి గౌతమీ, వశిష్ట, వైనతేయ గోదావరి నదులు ప్రవహిస్తుంటాయి. ఈ ప్రాంతాల్లోని పలు ప్రదేశాలు బీచ్లను తలపిస్తూ ఆహ్లాదం పంచుతుంటాయి. గోదావరి పరిసర ప్రాంత వాసులే కాకుండా స్థానికులు, బంధువులు, స్నేహితులు, పర్యాటకులు నదీ తీరానికి వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో ఉల్లాసంగా గడిపేందుకు ఇష్టపడతారు. ఇదే క్రమంలో గోదావరిలో స్నానాలు చేస్తూ ఈత సరదాను తీర్చుకునే క్రమంలో అనేక మంది ప్రమాదవశాత్తూ మునిగి ప్రాణాలను కోల్పోతున్నారు. నదుల పరివాహక ప్రాంతంలో ఊబిలు ఉన్న సంగతి తెలియని పర్యాటకులు స్నానాలకు దిగి మృత్యువాత పడుతున్నారు. కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. గోదావరిలో స్నానం.. తీవ్ర విషాదం ఆలమూరు మండలంలోని బడుగువానిలంక పుష్కరఘాట్ సమీపంలోనున్న గోదావరి తీర ప్రాంతంలో గడచిన ఐదేళ్ల కాలంలో ఎనిమిది ప్రమాదాలు సంభవించగా 12 మంది మృతి చెందారు. ఆత్రేయపురం మండలం సరిహద్దు ప్రాంతమైన మద్దూరులంకలో స్నానాలు చేస్తూ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బడుగువానిలంక రేవులో 2019 ఏప్రిల్ 19న మడికి శివారు నాగులపేటకు చెందిన ఇద్దరు యువకులు, 2020 మే 13న కడియపులంకకు చెందిన తీగిరెడ్డి రాంబాబు (22) మృతి చెందాడు. అదే ఏడాది అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కుటుంబ సభ్యుల కళ్లు ఎదురుగానే గోదావరిలో జూన్ రెండున మునిగి మృతి చెందారు. 2022 మార్చి 20న చెముడులంకకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో విద్యార్థి సురక్షితంగా బయటపడ్డాడు. 2023 ఏప్రిల్ 14న కె.గంగవరం మండలంలోని కూళ్లలో ముగ్గురు యువకులు స్నానం చేస్తూ మునిగిపోయి మృతి చెందారు. మద్దూరులంకలో 2022 జనవరి 30న నిడదవోలుకు చెందిన గొడవర్తి రవితేజ, 2023 మే 24న చిన తాడేపల్లికి చెందిన ప్రేమ్కుమార్, 25న అక్కాచెల్లెళ్లు, జూన్ నాలుగున మద్దూరులంకలో రాజమహేంద్రవరానికి చెందిన ఎన్.సాంబశివరావు స్నానాలు చేస్తూ ప్రమాదవశాత్తూ మృతి చెందారు. మూలస్థాన అగ్రహారంలో 2015 మే 01న జరిగిన ప్రమాదంలో నలుగురు, జొన్నాడలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు, 2023 అక్టోబర్ ఏడున జొన్నాడలో జరిగిన ప్రమాదంలో కపిలేశ్వరపురం మండలంలోని కోరుమిల్లికి చెందిన ఇద్దరు యువకులు స్నానం చేస్తూ మృత్యువాత పడ్డారు. ఈ నెల 11న ఆత్రేయపురం మండలంలోని పిచ్చుకలంక వద్ద గోదావరి తీరంలో ఈతకొడుతూ ప్రమాదవశాత్తు మునిగి తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడికి చెందిన జీవీవీ శశికుమార్ మృతి చెందగా ముగ్గురు స్నేహితులు సురక్షితంగా బయట పడ్డారు. 12న బడుగువానిలంక నుంచి గోదావరి మీదుగా వాడపల్లి నడచి వెళుతూ ప్రమాదవశాత్తూ మునిగిపోయి ముగ్గురు మహిళలు మృతి చెందారు. రావులపాలెంలో ఈనెల 18న స్నానాలకు దిగి ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఇంకా అనేక మంది గల్లంతయ్యారు. రికార్డులకు ఎక్కని మృతులు సంఖ్య, గల్లంతై ఆచూకీ లభ్యం కాని ఘటనలు ఉన్నాయని పోలీసు రికార్డులను బట్టి తెలుస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇలా.. ప్రమాదం ప్రదేశం మృతుల జరిగిన తేదీ సంఖ్య 2015 మార్చి 03 మూలస్థాన అగ్రహారం 3 2019 ఏప్రిల్ 19 బడుగువానిలంక 2 2020 మే 20 బడుగువానిలంక 1 2020 జూన్ 2 బడుగువానిలంక 2 2022 జనవరి 30 మద్దూరులంక 1 2022 మార్చి 20 బడుగువానిలంక 2 2023 ఏప్రిల్ 14 కూళ్ల 3 2023 మే 24 మద్దూరులంక 1 2023 మే 25 మద్దూరులంక 2 2023 జూన్ 02 మద్దూరులంక 1 2023 జూన్ 27 వద్దిపర్రులంక 2 2024 ఏప్రిల్ 23 కపిలేశ్వరపురం 1 2024 మే 11 పిచ్చుకలంక 1 2024 మే 12 వాడపల్లి లంక 3 2024 మే 18 రావులపాలెం 3 2024 మే 19 బొబ్బర్లంక 1 29 ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం గ్రామంలో జరిగిన గత అనుభవాలను దష్టిలో ఉంచుకుని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశాం. ఇప్పటికే హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని అప్రమత్తం చేస్తున్నాం. గ్రామస్తులు కూడా ప్రమాదాల నివారణకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. – దూలం వెంకటలక్ష్మి, సర్పంచ్, బడుగువానిలంక గస్తీ ముమ్మరం చేస్తాం గోదావరి తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరి సహకారంతో ప్రమాదకరమైన ప్రదేశాలను గుర్తిస్తున్నాం. ఈ ప్రమాదాలపై వివిధ శాఖాధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చర్యలు చేపట్టాం. నదీ తీరంలో ప్రమాదాల నివారణే ధ్యేయంగా పోలీసుశాఖ గస్తీలను ముమ్మరం చేస్తుంది. – కేవీ రమణ, డీఎస్పీ, కొత్తపేట ప్రమాదాల నివారణకు చర్యలు నదీతీర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాం. అనుమతి లేని ప్రదేశాల్లో స్నానాల కోసం దిగవద్దు. ధవళేశ్వరం దిగువ ప్రాంతాల్లో ఊబిలు ఎక్కువగా ఉన్నందున తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. – ఆర్,విశ్వనాథరాజు, హెడ్వర్క్స్ జేఈ, ధవళేశ్వరం
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే
అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు..
ఎలిమినేటర్ మ్యాచ్
పోలింగ్ శాతాల డేటా వివాదం..జవాబుల్లేని ప్రశ్నలనేకం..!
టాలీవుడ్ స్నిప్పెట్లు: జూనియర్ ఎన్టీఆర్ దేవర తాజా అప్డేట్
RR vs RCB: ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
టీమిండియా హెడ్కోచ్గా అతడే సరైనోడు!
Qualifier 1: సన్రైజర్స్ విఫలం.. ఫైనల్ చేరిన కేకేఆర్
అదరగొట్టిన అయ్యర్ బ్రదర్స్.. ఫైనల్లో KKR
ఎలిమినేట్ అయ్యేదెవరో?
తప్పక చదవండి
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు
- నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత
- వరంగల్లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
- నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
- స్టార్లైనర్ క్యాప్సుల్ ప్రయోగం మళ్లీ వాయిదా..కారణం..
- RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
- Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
Advertisement