-
శ్రీలంకకు ఇండియన్ ఆయిల్ ప్రీమియం ఇంధనం
బీచ్రోడ్డు: శ్రీలంకకు ప్రీమియం ఇంధనం ఎక్స్పీ100ని ఎగుమతి చేయనున్నట్టు ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ వి.సతీష్ కుమార్ తెలిపారు. ఎగుమతి వివరాలను మీడియాకు బుధవారం వివరించారు. మొదటిసారి 100 ఆక్టేన్ పెట్రోల్ ఎక్స్పీ100 దేశీయంగా అభివృద్ధి చేసినట్టు చెప్పారు. నవీ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి సుపీరియర్ 100 ఆక్టేన్ ప్రీమియం ఇంధనం ఎక్స్పీ 100ని మొట్టమొదటిసారిగా ఎగుమతి చేసినట్టు తెలిపారు. ఈ ఉత్పత్తిని శ్రీలంకకు ఎగుమతి చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మకమైన రోజన్నారు. ఈ ఇంధనాన్ని హై ఎండ్ వాహనాల కోసం రూపొందించినట్టు తెలిపారు. ఎక్స్పీ100 శ్రీలంకలోని తమ కస్టమర్లకు అత్యుత్తమ పనితీరును అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. దేశం నుంచి ప్రపంచానికి నాణ్యమైన ఉత్పత్తులను పంపగల సామర్థ్యాన్ని ఇది ప్రదర్శిస్తుందని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో తాపీ మేస్త్రి మృతి
యలమంచిలి రూరల్ : యలమంచిలి మండలం లక్కవరం గ్రామానికి సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కపల్లి మండలం దోసలపాడు గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి పల్లా లక్ష్మణరావు(42) దుర్మరణం చెందాడు. నక్కపల్లి మండలం దోసలపాడు, ముకుందరాజుపేటకు చెందిన పల్లా లక్ష్మణరావు, కోర్ని రమణలు, డెంకాడ గ్రామానికి చెందిన ఉద్దండం గిరీష్,కాపారపు నాగేంద్రలు రెండు ద్విచక్ర వాహనాలపై గాజువాకలో తాపీ పని కోసం బయలుదేరారు. మార్గమధ్యంలో యలమంచిలి మండలం లక్కవరం వద్దకు చేరుకోగానే ఓ లారీని తప్పించబోయి రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో దోసలపాడుకు చెందిన పల్లా లక్ష్మణరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ద్విచక్రవాహనం నడుపుతున్న ఉద్దండం గిరీష్ ఎడమ చేయి విరిగిపోయింది. అతడిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. మృతుడి బంధువు పక్కుర్తి నాగేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ పైలా సింహాచలం తెలిపారు. -
క్రీడా కోటాలో దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు
అనకాపల్లి : జాతీయస్థాయి క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన క్రీడాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడా కోటాలో ఉద్యోగాలు పొందే అవకాశాలు కల్పిస్తున్నాయని ఎంపీ బీవీ సత్యవతి అన్నారు. స్థానిక వివేకానందనగర్ తమ కార్యాలయంలో బుధవారం ఎస్.రాయవరం మండలం సోమిదేవిపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగ క్రీడాకారుడు అన్నం గణేష్ చైనాలో త్వరలో జరిగే వరల్డ్ బీచ్పారా ఒలింపిక్స్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనందుకు ఆమె శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చైనాలో జరిగే పోటీల్లో విజయం సాధించి, దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కోరారు. ఇటీవల కాలంలో దివ్యాంగులకు ప్రభుత్వం వివిధ రకాలైన క్రీడాపోటీలను నిర్వహించి వారిలో ప్రతిభను వెలికితీస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాండ్రేగుల యశ్వంత్, ఎస్.రాయవరం మండలం వైఎస్సార్సీపీ నాయకుడు కొణతాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పీహెచ్సీలు పరిపుష్టం
నాతవరం: గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలందించడం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిపుష్టం చేస్తోంది. దశాబ్దాలుగా శిథిల భవనాల్లోనూ అద్దె కొంపల్లోనూ అరకొర వైద్య సేవలతో నడిచే వీటికి జీవం పోసింది. ఇప్పటికే జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల నిర్వహణతో రోగుల తాకిడి పెరగడంతోపాటు మందులు నిల్వలకు వసతి సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో రూ.10 కోట్లతో జిల్లాలో పలు పీహెచ్సీలకు అదనపు భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించింది. మరో రూ.5.25 కోట్లతో ప్రహరీలు, భవనాలకు మరమ్మతులు పూర్తి చేసింది. జిల్లాలో 50 పీహెచ్సీలు, 9 యూపీహెచ్సీలు ఉన్నాయి. ప్రస్తుతం ఏడు పీహెచ్సీలో అదనపు భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.50 లక్షల వంతున రూ.3.50 కోట్లు మంజూరు చేసింది. ఆయా భవనాలు నిర్మించే బాధ్యత ఆర్అండ్బీ శాఖ అధికారులకు అప్పగించారు. అదనపు భవనాలు సకాలంలో పూర్తి చేస్తే పీహెచ్సీల్లో శాశ్వతంగా వసతి సమస్య తీరుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పీహెచ్సీల్లో వైద్యం చేయించుకునే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనివల్ల పీహెచ్సీలకు అధికంగా మందులు స్టాకు చేయడం పూర్తిస్థాయిలో సిబ్బంది నియమించడం వల్ల వసతి సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటువంటి పీహెచ్సీలను ఏడు గుర్తించి అదనపు భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.10 కోట్లతో పలు పీహెచ్సీల్లో అదనపు భవనాలు పూర్తి ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల ఏర్పాటుతోపాటు ప్రతి రోగికి వైద్యం సకాలంలో సక్రమంగా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి పీహెచ్సీకి ఇద్దరు వైద్యులను నియమించింది. వైద్యులకు సిబ్బందికి రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వసతి సమస్య ఉన్న పీహెచ్సీల్లో రూ.10 కోట్లతో అదనపు భవనాలు నిర్మించి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. నాతవరంలో 1962 నిర్మించిన పీహెచ్సీలోనూ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ వైద్య సిబ్బంది, రోగుల వసతి సమస్యపై ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రూ.1.65 కోట్లతో అదనపు భవనం నిర్మించి ప్రారంభోత్సవం చేశారు. రూ.5.25 కోట్లతో పీహెచ్సీలకు ప్రహరీలు, మరమ్మతులు గతంలో చాలా పీహెచ్సీలకు ప్రహరీలు లేక రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడేవారు. పశువుల సంచారంతోపాటు రాత్రిళ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారేవి. కొన్ని పీహెచ్సీలు వర్షాకాలంలో కారిపోతుండేవి. ముందులు భద్రపరచడానికి ఆపసోపాలు పడేవారు. ఈ నేపథ్యంలో పీహెచ్సీలకు రూ.5.25 కోట్లు మంజూరు చేశారు. వీటితో ప్రహరీల నిర్మాణాలు, పలు భవనాలకు మరమ్మతులు చేపట్టారు. చీడిగుమ్మలకు పీహెచ్సీ మంజూరు గొలుగొండ మండలం చీడిగుమ్మలలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పీహెచ్సీ మంజూరు చేసింది. దీన్ని నిర్మించేందుకు అవసరమైన భూమిని రెవెన్యూ అధికారులు సమకూర్చారు. నూతన పీహెచ్సీ పనులు సకాలంలో పూర్తి చేసే దిశగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేష్, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. టెండర్లు పూర్తయిన వెంటనే పనులు జిల్లాలో ఏడు పీహెచ్సీలకు అదనపు భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.3.50 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. – నారాయణరెడ్డి, జేఈ, ఆర్అండ్బీ శాఖ, నర్సీపట్నం వసతి సమస్య తీరుతుంది ప్రతి పీహెచ్సీకి రోగుల సంఖ్య పెరిగింది. జగనన్న ఆరోగ్య సురక్ష సేవల కోసం వినియోగించే మందులు అధికంగా రావడంతో స్టాకు చేసేందుకు కొన్ని పీహెచ్సీల్లో వసతి చాలటం లేదు. కొత్తగా మంజూరైన నిధులతో అదనపు భవనాలు నిర్మిస్తే వసతి సమస్య తీరుతుంది. – మీరా జ్యోతి, అదనపు డీఎంహెచ్వో 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకురూ.3.5 కోట్ల మంజూరు రూ.50 లక్షల చొప్పున అదనపు భవనాల నిర్మాణం తీరనున్న వసతి సమస్య మందుల నిల్వలకు తొలగనున్న ఇబ్బందులు పీహెచ్సీల అదనపు భవనాల నిర్మాణానికి రూ.50 లక్షల వంతున మంజూరు మండలం పేరు పీహెచ్సీ పేరు నాతవరం గునుపూడి దేవరాపల్లి దేవరాపల్లి అనకాపల్లి తగరంపూడి మునగపాక మునగపాక బుచ్చెయ్యపేట బుచ్చెయ్యపేట పరవాడ వాడచీపురుపల్లి ఎస్.రాయవరం పెనుగొల్లు -
ట్రాక్టర్ విడిభాగాల చోరీ
రోలుగుంట : రోలుగుంట మండల కేంద్రం పరిసరాల్లో గల సహస్ర స్టోన్ క్రషర్ వద్ద గల టాక్టర్ల విడిభాగాలు గత కొన్ని నెలలుగా వరుస చోరీలు జరుగుతున్నాయి. రోలుగుంట గ్రామానికి చెందిన బణికల దేముడు ఈ స్టోన్ క్రషర్ నుంచి మెటీరియల్ తరలించే పని ఉండడంతో క్రషర్ వద్ద ట్రాక్టర్ వదిలి ఊళ్లోకి వచ్చేశాడు. ఉదయం వెళ్లి చూడగా ట్రాక్టర్కు ఉన్న హెడ్ లైట్, ఫ్యాన్, బ్యాటరీ చోరీకి గురైనట్టు గర్తించాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్ఐ ఎల్.సురేష్ సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి ట్రాక్టర్ను, పరిసరాలను పరిశీలించారు. చోరీపై పూర్తిస్థాయిలో విచారణ చేసి దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
తాండవలో ఇసుక తవ్వితే కేసులు
● నది ప్రాంతాలను పరిశీలించిన అధికారులునాతవరం: తాండవ నదిలో ఇసుక తవ్వకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని ఎస్ఈబీ ఎస్ఐ ఎస్.కె.రహీమ్ హెచ్చరించారు. బుధవారం ఆయన గనుల శాఖ, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి చిక్కుడుపాలెం వద్ద తాండవ నదిలో నిర్మించిన తాగునీటి పైలెట్ ప్రాజెక్టును సందర్శించారు. ఇటీవల కొంతమంది అక్రమార్కులు ఇక్కడ పైలెట్ ప్రాజెక్టు ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లుగా సమాచారం అందింది. ఈ మేరకు అన్ని శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. నది సమీపంలో రైతులను, ప్రజలను ఇసుక తవ్వకాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు వెళ్లే మార్గంలో ఇసుక తరలించకుండా అడ్డుగా ఏర్పాటు చేసిన కర్రను పరిశీలించారు. ఇటీవల నదిలో ఇసుక తవ్వకాలు జరగలేదని ఈ సందర్భంగా ఎస్ఈబీ ఎస్ఐ తెలిపారు. ఇసుక తవ్వకాలు చేస్తే తాగునీటి పైలెట్ ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందన్నారు. అందువల్ల ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేయకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా తాండవ నది పొడవునా ఎలాంటి ఇసుక తవ్వకాలు చేయకుండా అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. గనుల శాఖ జేఈ హరకుమార్నాయుడు, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
సరైన పత్రాలు లేని 75 వాహనాలు సీజ్
రావికమతం : నేర నియంత్రణలో భాగంగా కొత్తకోట సీఐ ఎల్.అప్పలనాయుడు ఆధ్వర్యంలో కొత్తకోట గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఇర్వహించారు. బుధవారం ఉదయాన్నే పలు వీధుల్లో గుంపులుగా పోలీసులు తిరుగుతూ రోడ్డుపై వచ్చే వాహనాలతో పాటు ఇళ్ల వద్ద గల వాహనాలను కూడా పరిశీలించారు. ఆయా వాహనాల లైసెన్సులు, ఇతర పత్రాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాటిని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా , బయటి వ్యక్తులు నివారించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని దీని వల్ల నేర నియంత్రణ జరుగుతుందని సీఐ అప్పలనాయుడు ఈ సందర్భంగా తెలిపారు. 75 బైక్లు,10 వరకూ ఆటోలు, ఇతర వాహనాలను ఈ విధంగా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట ఎస్ఐ లక్ష్మణరావు ఉన్నారు. -
పలు రైళ్ల రీ షెడ్యూల్
తాటిచెట్లపాలెం: పలు పెయిరింగ్ రైళ్లు ఆలస్యంగా చేరిన కారణంగా.. ఆయా స్టేషన్ల నుంచి రైళ్లు ఆలస్యంగా బయలుదేరినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 10.35 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరులో బయలుదేరాల్సిన ఎస్ఎంవీ బెంగళూరు–హౌరా(12864) ఎక్స్ప్రెస్ సుమారు గంటన్నర ఆలస్యంగా మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరింది. రాత్రి 8గంటలకు విశాఖపట్నంలో బయలుదేరాల్సిన విశాఖపట్నం–నాందేడ్ (20811) ఎక్స్ప్రెస్ సుమారు గంటన్నర ఆలస్యంగా రాత్రి 9.30 గంటలకు బయల్దేరింది. రాత్రి 11.20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరాల్సిన విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్(18519) ఎల్టీటీ ఎక్స్ప్రెస్ సుమారు గంట ఆలస్యంగా మధ్యరాత్రి 12.20 గంటలకు బయల్దేరింది. దారి మళ్లింపు తిరుపతి–కాట్పడి సెక్షన్ పరిధి బొమ్మ సముద్రం స్టేషన్ వద్ద జరుగుతున్న లూప్లైన్ పనుల కారణంగా ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ తెలిపారు. ఈ నెల 27న ఎస్ఎంవీ బెంగళూరు–టాటానగర్(12890) ఎక్స్ప్రెస్, 28, 30వ తేదీల్లో ఎస్ఎంవీ బెంగళూరు–హతియా(12836) ఎక్స్ప్రెస్ వయా కాట్పడి–మెల్పక్కం, రేణిగుంట మీదుగా నడుస్తాయి. ●ఖరగ్పూర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న భద్రతా పనుల కారణంగా జూన్ 6న చైన్నె సెంట్రల్–న్యూ జల్పయ్గురి(22611) ఎక్స్ప్రెస్ వయా టాటానగర్–పురూలియా–కోట్శిలా స్టేషన్ల మీదుగా నడుస్తుంది. -
పట్టుకుంటే బంగారం
● తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ● పట్టు పరిశ్రమకు పెరుగుతున్న ఆదరణ ● రాయితీలతో ప్రభుత్వ ప్రోత్సాహం ● వేసవిలో దిగుబడి మందగించినా.. వర్షాకాలంలో లాభాల బాటేసాక్షి, అనకాపల్లి: పట్టు రైతుల ఆశలు పండుతున్నాయి. మార్కెట్లో మంచి ధరలుండటంతో సాగు లాభదాయకమవుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని రైతులు ఆర్జిస్తున్నారు. వేసవిలో ఉష్ణతాపంతో దిగుబడి మందగించినా.. వర్షాకాలంలో అధిక లాభాలార్జించే అవకాశాలున్నాయి. పట్టు పురుగులు ఆరోగ్యంగా, బలంగా ఉంటేనే ఈ గూళ్ల నుంచి సిల్క్ ఎక్కువగా వస్తుంది. ఆదాయం బావుంటుంది. ఈ పురుగులు మల్బరీ ఆకులను తిని గూళ్లను అల్లుతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మెటీరియల్ కాంపోనెంటు కింద ప్రభుత్వం షెడ్ల నిర్మాణాలకు సబ్సిడీలు ఇస్తోంది. మల్బరీ సాగుకు, పట్టు పురుగుల పెంపకానికి కూడా రాయితీలు అందిస్తోంది. జిల్లాలో పట్టు పరిశ్రమకు ఆదరణ పెరుగుతోంది. తక్కువ పెట్టుబడితో రైతులు అధిక లాభార్జించేలా పట్టు పెంపకం జరుగుతోంది. కరోనా తరువాత నుంచి ప్రతి ఏడాది సాగు పెరుగుతూనే ఉంది. ఏడాదిలో 6 పంటలు.. రూ.1.2 లక్షల ఆదాయం రెండు ఎకరాల మల్బరీ తోటలో ప్రతి పంటకు 200 పట్టుగుడ్ల వరకు పెంచుతారు. ప్రతీ ఏటా దాదాపు 5 లేదా 6 పంటలు పండిస్తారు. ఏడాదికి ఆదాయం రూ. 1,20,000 వరకు వస్తుంది. రెండు ఎకరాలను రెండు భాగాలుగా విభజించి పండిస్తే ఆదాయం రెట్టింపు అవుతుంది. జిల్లాలోని 15 మండలాల్లో 126 మంది రైతులు 284 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం పట్టు పరిశ్రమను చేపట్టారు. చిన్నకారు, సన్నకారు రైతులకు ఈ పట్టు పరిశ్రమ అనుకూలంగా వుంటుంది. ఇది కుటీర పరిశ్రమ కనుక మహిళలను ఎక్కువగా భాగస్వాములను చేయవచ్చు. ఒకసారి మల్బరీ తోట నాటితే 15 ఏళ్ల వరకు ప్రతీ ఏటా సగటున 5 పంటలు పండించొచ్చు. ఉష్ణోగ్రతల నియంత్రణ పట్టు పురుగులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. వీటికి గరిష్టంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే ఉండాలి. ఈ ఉష్ణ తాపం నుంచి పట్టు పరుగును సంరక్షించుకోగల్గితే అధిక ఆదాయాలు ఆర్జించవచ్చు. వచ్చే నెల జూన్ 15 వరకు ఎండల తీవ్రత కారణంగా అధిక ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే పురుగులు ఉన్న షెడ్లో ఉష్ణోగ్రతలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. ఎండు గడ్డి, చొప్పగడ్డి లేదా వెదురుతో తయారు చేసిన తడికెలను షెడ్లపై వేసుకుని తేమ ఆరకుండా ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండాలి. కిటికీలకు గోనెసంచులు కట్టి వాటిని కూడా ఎప్పటికప్పుడు నీటితో తడుపుతూ ఉండాలి. దీనికోసం జిల్లాలో సెరికల్చర్ అధికారులు వేసవి సీజన్కు ముందు నుంచే పట్టు రైతులకు అవగాహన కల్పించి, శిక్షణ అందిస్తారు. పురుగు పెరిగే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు ఇస్తారు. మల్బరీ సాగుపై పెరుగుతున్న ఆసక్తి మార్కెట్లో పట్టు గూళ్ల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో బైవోల్టన్ పట్టు గూళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. గతేడాది కంటే ఈ ఏడాది మల్బరీ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ పెంచింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం రాయితీ ఉంటుంది. ఈ ఏడాది కొత్తగా 75 ఎకరాల్లో పట్టు పురుగుల సాగు చేపట్టేలా లక్ష్యం పెట్టుకున్నాం. లక్ష మల్బరీ మొక్కలు 20 ఎకరాలకు సరిపోతాయి. జిల్లాలో 75 ఎకరాలకు గాను నాలుగు లక్షల మొక్కలు కావాల్సి ఉంటుంది. మూడు లక్షల మల్బరీ మొక్కలు సిద్దంగా ఉన్నాయి. మిగతా లక్ష మొక్కలను తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేట్ వారి నుంచి ఇండెంట్ కూడా తీసుకోవడం జరిగింది. పట్టు దిగుబడి ఎక్కువగా సెప్టెంబర్– ఫిబ్రవరి మధ్య ఉంటుంది. జిల్లాలో పట్టుగూళ్ల ఉత్పత్తి పెరిగింది. కొత్త రైతులు కూడా మల్బరీ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. – రాజేంద్రప్రసాద్బాబు, సెరీకల్చర్ జిల్లా అధికారి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం... ఒక ఎకరా మల్బరీ సాగుకు – రూ.25 వేలు (రూ.18,750 సబ్సిడీ) రెండు రకాలుగా పట్టుపరుగుల పెంపకం జరుగుతోంది. టైపు–1లో షెడ్డు కోసం రూ.4 లక్షలు (రూ.3.16 లక్షల సబ్సిడీ). పట్టు పురుగుల పెంపకానికి రూ.75 వేలు (రూ.56,250 సబ్సిడీ) టైపు–2లో షెడ్డు కోసం రూ.3 లక్షలు (రూ.2.25 లక్షల సబ్సిడీ). పట్టు పురుగుల పెంపకానికి రూ.50 వేలు (రూ.37,500 సబ్సిడీ) వీటితోపాటు చాకి పురుగుల కొనుగోలుకు 100 గుడ్లకు రూ.1,000 సబ్సిడీ వ్యాధి నిరోధక మందులకు రూ.5,000 (రూ.3,750 సబ్సిడీ) -
పట్టుబడ్డ వాహనాల వేలం
చోడవరం రూరల్: గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను ఈ నెల 28న వేలం వేయనున్నట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ బిహెచ్.కిరణ్మనేశ్వరి తెలిపారు. చోడవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో జరిపిన గంజాయి అక్రమ రవాణాదారులపై జరిపిన దాడుల్లో బజాజ్ డిస్కవర్ బైకు, టాటా వింగర్ వేన్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు వీటి వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల వారు 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు వెయ్యి రూపాయల ధరావత్తు సొమ్మును చెల్లించి పేరును నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. వేలం పాటలో అధిక మొత్తానికి పాడిన వారికి వాహనాలను కేటాయిస్తామని, 28న జరిగే పాట అనంతరం తాము పాడిన మొత్తాన్ని అదే రోజు చెల్లించి వాహనాలను పొందాల్సి ఉంటుందని, వేలం మొత్తానికి అదనంగా జీఎస్టీని పాటదారే చెల్లించాలని తెలిపారు. వేలం నిర్వహణ తదితర అంశాలలో ఉన్నతాధికారుల ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. -
ఏలేరు కాలువలో మృతదేహం లభ్యం
కశింకోట : మండలంలోని తీడ గ్రామం వద్ద ఏలేరు కాలువలో కొట్టుకు వచ్చిన మృతదేహాన్ని బుధవారం వెలికి తీసినట్టు సీఐ ఎం. వినోద్బాబు విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివి. మాకవరపాలెం మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన రాజాన మల్లేశ్వరరావు (44) మంగళవారం సాయంత్రం తన గ్రామం వద్ద ఏలేరు కాలువ గట్టుకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ కాలు జారి కాలువలో పడిపోయాడు. దీంతో అక్కడి నుంచి ప్రవాహంలో కొట్టుకొని వచ్చి మండలంలోని తీడ గ్రామం వద్ద శవమై తేలాడు. అతని బంధువులు అతని కోసం వెతుక్కుంటూ ఇక్కడకు వచ్చి మల్లేశ్వరరావు మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడికి భార్య రాజ్యలక్ష్మి, ఇద్దరు పిల్లలున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
నాడు– నేడు నిధుల దుర్వినియోగంలో హెచ్ఎం సస్పెన్షన్
● విశాఖ ఆర్జేడీ నుంచి ఉత్తర్వులు రోలుగుంట: మండలంలో బీబీపట్నం ప్రభుత్వ పాఠశాలకు మంజూరైన నాడు–నేడు నిధులు దుర్వినియోగానికి పాల్పడిన హెచ్ఎం బాబ్జీరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు విశాఖ ఆర్జేడీ భాస్కరరావు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక్కడ పాఠశాలకు నాడు–నేడు పథకం కింద రెండో విడతలో రూ.61 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో పాఠశాల యాజమాన్య కమిటీ ఆమోదంతో భవన నిర్మాణ పనులు చేయాలి. ఇందుకు విరుద్ధంగా ఇక్కడ హెచ్ఎం బాబ్జీరావు కమిటీ చైర్మన్ కిశోర్తో ముందుగానే చెక్కులపై సంతకం చేయించుకుని నిధులు డ్రా చేసి తూతూమంత్రంగా పనులు చేశారు. గతేడాది జూన్లో సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడ నుంచి వేరొక మండలానికి హెచ్ఎం వెళ్లిపోయారు. ఈ స్థానంలో నక్కపల్లి మండలం నుంచి బదిలీపై వచ్చిన మరొక హెచ్ఎం ఎన్. అప్పారావును త్వరితగతిన నాడు నేడు పనులు పూర్తి చేయాలని విద్యా శాఖ, ఇంజనీరింగ్ అధికారులు ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో నిధులు విడుదల, చేసిన పనులకు వ్యత్యాసం ఉండడం, అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించి పూర్వ హెచ్ఎంపై ప్రస్తుత హెచ్ఎం ఎంఈవోకు, డీఈవోకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి నివేదికలు అందజేయాలని కలెక్టర్ రవిపట్టన్ శెట్టి ఆదేశించారు. ఈ మేరకు గతేడాది నవంబర్లో ఎస్.ఎస్.ఎ డీఈ జగదీష్, ఎంఈవో జానుప్రసాద్ ఇక్కడ నుంచి బదిలీ అయిన హెచ్ఎం బాబ్జీరావును, కమిటీ చైర్మన్ కిశోర్ని, విద్యార్థుల తల్లిదండ్రులను హాజరుపరచి విచారించి నివేదిక సంబంధిత శాఖ అధికారులకు అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా నిధులు దుర్వినియోగానికి పాల్పడిన హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఎంఈవో బుధవారం తెలిపారు. -
● కౌంటింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో నియంత్రణ చర్యలు ● సరైన పత్రాలు లేని వందకుపైగా వాహనాలు సీజ్
నర్సీపట్నం/ అనకాపల్లి/మునగపాక: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం సమీపిస్తున్నందున శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి బీసీ కాలనీ, పెదబొడ్డేపల్లిలో డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్ ఆధ్వర్యంలో ముఖ్యమైన కూడళ్లు, గ్రామ శివార్లు, అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తుల ఇళ్లు, పలు షాపులను విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మోహన్ మాట్లాడుతూ కౌంటింగ్ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ఈ దాడుల్లో దొరికిన నిందితుడు బొంతు అప్పారావును పాయకరావుపేట పోలీసులకు అప్పగించామన్నారు. సరైన పత్రాలు లేని 68 బైక్లు, కారు, ఆటో, బొలెరో వాహనం సీజ్ చేశామన్నారు. ఈ దాడుల్లో టౌన్, రూరల్ సీఐలు కాంతికుమార్, హరి, ఎస్సైలు సుధాకర్, ఉమామహేశ్వరరావు, భీమరాజు, డివిజన్లోని సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. నాగులాపల్లిలో.. మునగపాక మండలం నాగులాపల్లిలో పరవాడ డీఎస్పీ సత్యనారాయణ నేతృత్వంలో యలమంచిలి సీఐ గఫూర్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి రికార్డులు లేని 41 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎస్ఐ పి. ప్రసాదరావు పాల్గొన్నారు. అనకాపల్లిలో.. అనకాపల్లి మండలం సుబ్రమణ్యకాలనీ, డీబీ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీలు చేశారు. 10 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు సీజ్ చేశారు. పట్టణ సీఐ జి.శంకరరావు, ఎస్ఐ సత్యనారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీపై సమీక్ష
అనకాపల్లి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ రవి పట్టన్శెట్టి మంగళవారం వెబ్ ఎక్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ప్రశ్నాపత్రాలు, సామగ్రిని భద్రపరిచిన స్టోరేజ్ పాయింట్ల నుంచి పరీక్ష కేంద్రాలకు తరలించేటప్పుడు, పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లు పర్యవేక్షించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు సకాలంలో చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జెరాక్స్ కేంద్రాలు మూసివేసేలా గట్టిగా చర్యలు చేపట్టాలన్నారు. డీఈవో ఎం.వెంకటలక్ష్మమ్మ, ఇంటర్మీడియట్ అధికారి బి.సుజాత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎక్కడ చూసినా ధనస్వామ్యమే..
● ఆదికవి నన్నయ్య వర్సిటీ మాజీ వీసీ ముత్యాలనాయుడుప్రధానికి పంపిన లేఖ చూపిస్తున్న ప్రొఫెసర్ ముత్యాలనాయుడు డాబాగార్డెన్స్: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఎక్కడా కనిపించలేదని, ఎక్కడ చూసినా ధనస్వామ్యమేనని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ముర్రు ముత్యాలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కట్టడి చేయాల్సిన వారే డబ్బులు పంపిణీ చేసి ఓటర్లకు గాలం వేయడం దారుణమన్నారు. దేశంలో ఎంతో సాధించామనే చెప్పే ప్రధాని మోదీ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత జరుగుతున్న చర్యలు చేపట్టకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ విషయానికి సంబంధించి మోదీకి పంపిన లేఖను మంగళవారం వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో మీడియాకు విడుదల చేశారు. ఇటీవల కాలంలో ఓటర్లకు ప్రత్యక్ష డబ్బు బదిలీలు బాగా పెరగడంతో ప్రజాస్వామ్యం తుప్పు పట్టిందన్నారు. ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు ప్రతి అసెంబ్లీ సెగ్మంట్కు సగటున రూ.50 కోట్లు ఖర్చు చేశారని, ప్రతి ఓటరుకు సగటున రూ.1, 500 నగదు ఇచ్చారని ఆరోపించారు. ఒక్క రాష్ట్రంలోనే సుమారు 3 కోట్ల మంది ఓటర్లకు ఇలా నగదు అందజేశారని, దీన్ని బట్టి దేశంలో ఏ మేరకు నగదు పంపిణీ చేశారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్నికల్లో సంస్కరణలు తీసుకురావాలని మోదీకి పంపిన లేఖలో విజ్ఞప్తి చేశారు. -
రోగి మృతిపై విచారణ
గొలుగొండ: మండలంలోని లింగంపేట గ్రామానికి చెందిన నెల్లూరి సత్యనారాయణ మృతిపై నర్సీపట్నం డివిజన్ సీనియర్ వైద్యాధికారి ప్రశాంతి, కృష్ణదేవిపేట, గొలుగొండ వైద్యాధికారులు హరిప్రవీణ్, శ్యామ్కుమార్ మంగళవారం విచారణ చేపట్టారు. వారం రోజుల క్రితం కృష్ణదేవిపేట(ఏఎల్పురం)లో ఆర్ఎంపీ వైద్యుడు రామ్దాస్ వద్ద సత్యనారాయణ వైద్య సేవలు పొందాడు. ఇంతలో పచ్చకామెర్లు ముదిరి కోమాలోకి వెళ్లిపోవడంతో ఆర్ఎంపీ వైద్యుడు సలహా మేరకు కుటుంబ సభ్యులు విశాఖ కిమ్స్లో చేర్పించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉందని కిమ్స్ వైద్య సిబ్బంది సూచన మేరకు కేజీహెచ్కు తీసుకెళ్లారు. కేజీహెచ్లో వైద్య సేవలు పొందుతూ సోమవారం తెల్లవారు మృతి చెందాడు. దీనిపై ఆర్ఎంపీ వైద్యుడు సరైన వైద్యం చేయకపోవడం వల్లే సత్యనారాయణ మృతి చెందాడని వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో లింగంపేటలో మృతుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తీసుకున్న వైద్య సిబ్బంది అనంతరం ఆర్ఎంపీ వైద్యుడిని కృష్ణదేవిపేటలో విచారణ నిర్వహించారు. పూర్తి స్థాయి నివేదిక ఉన్నతాధికారులకు అందిస్తున్నట్లు సీనియర్ వైద్యాధికారి తెలిపారు. -
పెద్ద వాహనాలు ఇలా..
● కార్లు, లారీలు ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్లలో నీళ్లను తరచూ తనిఖీ చేసుకోవాలి. ● నీళ్ల కంటే కూలెంట్ ఆయిల్ వాడటం మంచిది. ● వేడికి ఇంజిన్ ఆయిల్ తగ్గే అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. ● కార్లలో పెట్రోల్, డీజిల్తో పాటు ఎల్పీజీ గ్యాస్ ద్వారా వాహనాలు నడిపేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అటువంటి వాహనదారులు వేసవిలో గ్యాస్ కిట్ను ఉపయోగించకుండా ఉంటే ఉత్తమం. ● ఏసీ నిలబడాలంటే కారు అద్దాలకు క్లాత్ మ్యాట్స్ ఏర్పాటు చేసుకోవాలి. ● ఎండాకాలం వెళ్లే వరకూ భారీ వాహనాలకు నూతన టైర్లు వాడితే మేలు. లేదంటే దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో పాత టైర్లలో గాలి తగ్గి.. పేలిపోయే ప్రమాదం ఉంది. -
ఆలస్యంగా రైళ్ల రాకపోకలు
తాటిచెట్లపాలెం: పెయిరింగ్ రైళ్లు ఆలస్యం కారణంగా ఆయా స్టేషన్ల నుంచి బయలుదేరాల్సిన పలు రైళ్లను రీ షెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లు అంతే ఆలస్యంగా రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. ●షాలిమర్లో మంగళవారం ఉదయం 10 గంటలకు బయలుదేరాల్సిన షాలిమర్–సికింద్రాబాద్ (07226) స్పెషల్ సుమారు 12 గంటలు ఆలస్యంగా రాత్రి 10.05 గంటలకు బయలుదేరింది. ●ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరులో మంగళవారం ఉదయం 10.15 గంటలకు బయలుదేరాల్సిన ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు–అగర్తలా (12503) హమ్సఫర్ ఎక్స్ప్రెస్ సుమారు 24 గంటలు ఆలస్యంగా బుధవారం ఉదయం 10.15 గంటలకు బయలుదేరుతుంది. ●తాంబరంలో మంగళవారం సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరాల్సిన తాంబరం– సంత్రగచ్చి (22842) అంత్యోదయ ఎక్స్ప్రెస్ సుమారు 11 గంటలు ఆలస్యంగా బుధవారం ఉదయం 7.15గంటలకు బయలుదేరింది. ●విశాఖలో మంగళవారం రాత్రి 8 గంటలకు బయలుదేరాల్సిన విశాఖపట్నం–నాందేడ్ (20811) ఎక్స్ప్రెస్ సుమారు ఐదున్నర గంటలు ఆలస్యంగా మధ్య రాత్రి 1.30 గంటలకు బయలుదేరింది. -
దువ్వాడ పూర్వ సీఐపై ఫోర్జరీ కేసు
అగనంపూడి: దువ్వాడ పూర్వ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరావుపై ఫోర్జరీ కేసు నమోదైంది. దువ్వాడ సీఐ ఎర్రంనాయుడు తెలిపిన వివరాలివీ.. దువ్వాడ సీఐగా గతంలో పనిచేసిన బి.శ్రీనివాసరావు, స్టీల్ప్లాంట్ సీఐ వి.శ్రీనివాసరావు, గాజువాక ఎస్ఐ సతీష్ ఈ ఏడాది జనవరిలో టి.దేవాడలో పేకాడ స్థావరంపై దాడి చేశారు. తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అప్పటి దువ్వాడ సీఐ బి.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఈ సమయంలో దాడిలో పాల్గొన్న అధికారుల సంతకాలు తీసుకోవాల్సి ఉండగా.. వారి సంతకాలు ఎఫ్ఐఆర్పై లేకుండానే వేరే సంతకాలతో కేసు నమోదు చేశారు. దీంతో స్టీల్ప్లాంట్ సీఐ వి.శ్రీనివాసరావు, గాజువాక ఎస్ఐ సతీష్ ఫిర్యాదు మేరకు సీఐ ఎర్రంనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తొలకరిలో భూసార పంటలు మేలు
అనకాపల్లి: తొలకరి వర్షాల్లో నేల దుక్కు దున్నుకుని భూసారాన్ని పెంచే పంటలు వేసుకోవాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ పీవీకే జగన్నాథరావు తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయంలో శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్కు ముందు జనుము (12–15 కిలోలు, ఎకరానికి), జీలుగ (ఎకరానికి 10–12 కిలోలు), పిల్లి పెసర(ఎకరానికి 10–12 కిలోలు), పెసర (ఎకరానికి 8–10 కిలోలు), పచ్చిరొట్ట పైరులను వేసుకోవాలన్నారు. వీటి సాగుకు ఇది అనువైన సమయం అన్నారు. పచ్చిరొట్ట పంటగా వేసుకోవడానికి అనువైన జనుము జేఆర్జే 610 పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉందన్నారు. 120 రోజుల వయసు గల చెరకు మొక్కతోటలో తేమను ఉపయోగించుకుని మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలని సూచించారు. వర్షాధార చెరకు పంటకు నేల తయారీ చేసుకోవాలన్నారు. రాగల వర్షాన్ని వినియోగించుకుని నువ్వు సాగుకు రైతులు నేలను దున్ని, అధిక దిగుబడినిచ్చే వైఎల్ఎం 17, 66 రకాలను ఈ నెలాఖరులోపు విత్తుకోవాలని కోరారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డి.ఆదిలక్ష్మి, వి.గౌరి, డి.అనిల్కుమార్, ఎ.అలివేణి, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
బస్సును ఢీకొట్టిన బైక్
● ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు నక్కపల్లి: మండలంలోని ఉద్దండపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం బస్సును బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం... రేబాక నుంచి అచ్యుతాపురంలో బ్రాండిక్స్ కంపెనీకి వెళ్తున్న బస్సు ఉద్దండపురంలో జాతీయ రహదారిపై మలుపు తిరుగుతుండగా.. తుని నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న వినయ్(33) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనుక కూర్చున్న దుర్గేష్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరు విశాఖ నగరానికి చెందిన వారని తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ద్విచక్ర వాహనాల రక్షణ ఇలా..
● వాహనాలను ఎక్కువ సేపు పార్కింగ్ చేయాల్సి వస్తే చెట్టు నీడన గానీ, షెడ్లలో గానీ పెట్టుకోవాలి. లేదా కవర్లు కప్పి ఉంచాలి. ● ఎండ వేడికి రంగు వెలిసిపోయి కొత్త వాహనాలు సైతం పాతవిగా కనిపిస్తాయి. ● అధిక ఉష్ణోగ్రతల వల్ల టైర్లలో గాలి తగ్గిపోతుంది. వారానికి ఒకసారి గాలి తనిఖీ చేయించుకోవడం మంచిది. ● గాలి ఎక్కువ కొట్టించడం వల్ల వేడికి టైర్లు కరిగి పేలిపోతాయి. తగిన మోతాదులో మాత్రమే గాలి నింపుకోవాలి. ● ద్విచక్ర వాహనాలు ఎక్కువ సమయం ఎండలో ఉంచితే పెట్రోల్ ఆవిరి అయిపోయే అవకాశం ఉంటుంది. ● వేసవిలో పగలు కన్నా సాయంత్రం వేళల్లో పెట్రోలు కొట్టించడం మంచిది. ● గాలి పట్టే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే టైర్ల మన్నిక తగ్గిపోతుంది. తద్వారా పెట్రోల్ ఎక్కువ ఖర్చయ్యే ప్రమాదం ఉంది. ● వేసవిలో ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణం చేయడం తగ్గించుకుంటే మేలు. ● దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వాహనాల వేగానికి, ఉష్ణోగ్రతల వేడికి ఇంజిన్ రెండింతలు వేడెక్కే అవకాశం ఉంటుంది. అందుకోసం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంజిన్ కాసేపు ఆపుకుంటే వాహనం మన్నిక కాలం పెరుగుతుంది. నిర్ణీత గడువులోపు ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి. -
నాణ్యమైన విత్తనాలతో ఆశించిన దిగుబడులు
ఏడీఆర్ డా.పీవీకే జగన్నాథరావు అనకాపల్లి: నాణ్యమైన విత్తనాలతో రాబోవు ఖరీఫ్ సీజన్లో ఆశాజనకమైన దిగుబడులు సాధించవచ్చని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ పీవీకే జగన్నాథరావు అన్నారు. స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో సోమవారం టీ అండ్ వీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మే నెలలో ఇప్పటి వరకు జిల్లాలో 60 శాతం వర్షపాతం నమోదయిందన్నారు. ఈ వర్షాన్ని ఉపయోగించుకుని రైతులు జనుము, జీలుగ, పిల్లి పెసర, పచ్చిరొట్ట పంటలను పెంచి ఖరీప్ సాగుకు నేలలో కలియదున్నుట ద్వారా నేల ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చన్నారు. దీంతోపాటు ఖరీఫ్లో ఆశించిన దిగుబడులను పొందవచ్చన్నారు. జిల్లాలో రైతులకు కావలసిన విత్తనాలు ఆర్ఏఆర్ఎస్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. చెరకు విత్తనాలు(2012ఎ 319, 2010 ఎ 226, 2006ఎ), వరిలో ఆర్జేఎల్ 2537, ఎంటీయూ 1318 రకాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహనరావు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలు సాగుకు ఎంతో మేలు చేశాయన్నారు. ఈ నెల 26 నాటికి పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఖరీఫ్ సీజన్కు ముందుగానే ఆర్బీకే సిబ్బంది, వీఏఏలకు వివిధ పంటలు, బయో ఫెర్టిలైజర్స్, విత్తనాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కేవీకే కొందెంపూడి ప్రొగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ రాజకుమార్ మాట్లాడుతూ ఆర్జేఎల్ 2537, ఎంటీయూ 1121 రకాలు, నువ్వులలో వైఎల్ఎం 66, సజ్జలో ఏబీవీ–04, కొర్లలో సూర్యనంద రకాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
టీచర్ల కృషితోనే పకడ్బందీగా సీబీఎస్ఈ బోధన
పాఠశాల విద్య ఆర్జేడీ విజయభాస్కర్ కశింకోట: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టి, నిర్వహిస్తున్న సీబీఎస్ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు(ఆర్జేడీ) బి.విజయభాస్కర్ కోరారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పాఠశాలల్లో సీబీఎస్ఈ కరిక్యులం బోధిస్తున్న ఇంగ్లిష్, బయాలజీ, సోషల్ ఉపాధ్యాయులకు నిర్మాణాత్మక బోధన, పాఠ్య ప్రణాళికపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం మండలంలోని తేగాడ వద్దనున్న ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో సోమవారం ప్రారంభించారు. పాఠ్యాంశాల వారీగా ఉపాధ్యాయులకు చేపట్టిన రెండో విడత శిక్షణ సందర్భంగా పలు సలహాలు, సూచనలిచ్చారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలలో విద్యార్థులకు ప్రణాళికాయుతంగా బోధించి, ఉత్తమ ఫలితాలకు దోహదపడాలని సూచించారు. 294 మంది ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీ ఏపీ లీడ్ సభ్యురాలు ఉషాకుమారి, జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ, స్టేట్ అబ్జర్వర్ చిరకాల శ్రీలత, కోర్సు డైరెక్టర్ వి.అప్పారావు, ప్రిన్సిపాల్ మార్తా తిలకం తదితరులు పాల్గొన్నారు. -
ఇరువర్గాలపై కేసులు నమోదు
అనకాపల్లి: ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్టు అనకాపల్లి డీఎస్పీ అప్పలరాజు సోమవారం చెప్పారు. డీఎస్పీ కథనం మేరకు వివరాలివి. స్థానిక నర్సింగరావుపేటకు చెందిన ఇంజరపు జయ, పక్కనే ఇంటిలో నివసిస్తున్న ఉరుకుల జ్యోతికి ఆరు సంవత్సరాలు క్రితం రూ. 2లక్షల నగదు అప్పుగా ఇచ్చింది. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చేది. అయితే ఆరునెలల నుంచి అసలు, వడ్డీ ఇవ్వకపోవడంతో ఈనెల 16 జయ, జ్యోతికి చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఈనెల 18 ఇంజరపు జయ, జ్యోతి, జ్యోతి కుమార్తె వీనస్లపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేరోజు వీనస్ కులం పేరుతో దూషించినట్టు జ్యోతి కుమార్తె వీనస్ ఇంజరపు జయ, జయ భర్త ప్రసాద్, ఇద్దరు కుమార్తెలు గాయత్రి, పూర్ణశ్రీలపై ఫిర్యాదు ఇవ్వడంతో, అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్కే రక్షణ లేదు..
- Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- ‘ఈజీ’ ఐపాస్.. టీజీ ఐపాస్కు భారీగా మార్పులు!
- తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement