వనపర్తి: నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచినందున ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం మరో 380 బ్యాలెట్ యూనిట్లు వినియోగించేందుకు శుక్రవారం ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తేజస్ పవార్ తెలిపారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని ఈవీఎం గోదాం నుంచి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అదనపు బ్యాలెట్ యూనిట్లను పోలీసు భద్రత నడుమ చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డులోని ఈవీఎం రిసెప్షన్ కేంద్రానికి తీసుకొచ్చారు. అనంతరం వారి సమక్షంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి ఎం.నగేష్, సి–సెక్షన్ సూపరింటెండెంట్ రమేష్రెడ్డి, బీజేపీ నాయకుడు ప్రవీణ్, సీపీఎం నాయకుడు పరమేశ్వరాచారి, టీడీపీ నాయకుడు శంకర్, బీఆర్ఎస్ నాయకుడు జమీల్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి తేజస్ పవార్