25 కిలోమీటర్లు బస్సులో వచ్చాను. వెంకటగిరి నుంచి వచ్చే బస్సులో సీటు దొరకలేదు. ముచ్చేలి వరకు నిలబడి వచ్చి అక్కడి నుంచి కూర్చున్నాను. కాళ్లు పడిపోతున్నాయి. తర్వాత ఆటో ఎక్కి బ్యాంకు వద్దకు చేరుకున్నాను. ఆయాసం, ఎండ నీరసం కలిగింది. రూ.20 పెట్టి నీళ్లు సీసా కొనుక్కుని బ్యాంకులో ఉన్న లైన్లో కూర్చున్నాను. ఎపుడు ఇస్తారో తెలియదు. గతంలో వలంటీర్లు మా ఇంటికి వచ్చి తలుపుతట్టి 4గంటలకే పింఛన్ ఇచ్చేవారు. మందులు కొనుక్కునే దాన్ని. కొడుకులు, కోడళ్లు పెట్టకపోయినా జగన్ పుణ్యమా అని పింఛన్ సొమ్ముతో సంతోషంగా జీవించేదాన్ని. ఇప్పుడు చంద్రబాబు కారణంగా ఈ కష్టాలు పడాల్సి వస్తోంది. బాబూ..నువ్వు మట్టికొట్టుకుపోతావు. – కుప్పమ్మ,
ఇలగనూరు, శ్రీకాళహస్తి మండలం
పింఛన్ కోసం ఆపసోపాలు
కనపర్తి గ్రామం నుంచి ఆటో ఎక్కి పాతబస్టాండు వద్ద దిగి అక్కడి నుంచి బ్యాంక్కు వెళ్లేందుకు ఆటోను అడిగితే రూ.20 ఇవ్వమన్నారు. కిలోమీటరు మేర నడుచుకుంటూ బ్యాంకు వద్దకు చేరుకున్నా. పింఛన్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. క్యూ పెద్దదిగా ఉంది. నాలుగేళ్లు వలంటీర్లు తలుపుతట్టి మరీ పింఛన్ డబ్బులు చేతిలో పెట్టి వెళ్లారు. చంద్రబాబు దుష్టబుద్ధితో మాకు ఈ ప్రయాస మిగిల్చారు.
– రామమ్మ, కనపర్తి గ్రామం, తొట్టంబేడు