ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ దగ్గర హాయిగా పింఛన్ డబ్బులు తీసుకునే వాళ్లం. వలంటీరే వచ్చి మా పింఛన్ నగదును ఇచ్చే వారు. అవ్వా పింఛన్ డబ్బులు తీసుకో అంటూ పైసా కూడా తీసుకోకుండానే మా పింఛన్ రూ.3 వేలు ఇచ్చి వెళ్లేవారు. పింఛన్ డబ్బులు తీసుకోవాలంటే ఎలాంటి బాధలు పడేవాళ్లం కాదు. ఎలక్షన్ రాగానే చంద్రబాబుకు కడుపుబ్బి పోయింది. వలంటీర్లు పింఛన్ ఇవ్వకూడదని అడ్డు తగిలారు. వలంటీర్లు ఎక్కడ తిరగకుండా చేశాడు. ఇప్పుడు పింఛన్ నగదు తీసుకోవాలంటే దేవుడు కనపడుతున్నాడు. బ్యాంకు వద్దకు వెళ్లిన తర్వాత రెండు గంటల పాటు క్యూలో ఉండి పింఛన్ నగదును తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మా ఉసురు తప్పక తగులుతుంది.
– కే.సుబ్బమ్మ,
గుండవోలు గ్రామం, రాపూరు మండలం
ఈ తిప్పలు మాకొద్దు
ఒకటో తేదీ వచ్చిదంటే తెల్లవారు జామునే ఇంటి తలుపు తట్టి పెన్షన్ సొమ్ము ఇచ్చే వలంటీర్లను తీసేశారు. ఇప్పుడు బ్యాంకు వద్దకు వెళ్లితే ఆ జనాన్ని చూస్తే భయమేస్తోంది. ఆ క్యూలో నిలుచుకునే ఓపిక కూడా లేదు. మాలాంటి నిరుపేదలను కష్టపెట్టేవారికి మా గోడు తప్పక తగలుతుంది బాబు. చంద్రబాబూ.. మాపై ఎందుకు ఇంత కోపం?. – ఎం.రమణమ్మ, రాపూరు
కాళ్లీడ్చుకుంటూ వచ్చా
గత రెండు నెలలుగా కాళ్లు, చేతులు నొప్పులతో బాధపడుతున్నా. మనిషి లేందే బయటకు రాలేను. గతంలో వలంటీరు పింఛన్ డబ్బులు ఇంటికి తెచ్చిచ్చేవాడు. నేను డబ్బులిచ్చి మాత్రలు కావాలన్నా తెచ్చిచ్చేవాడు. ఫోన్ చేసి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించి వెళ్లేవాడు. ఇప్పుడు వాళ్లను తీసేసేకాడికి నా పరిస్థితి దారుణంగా మారింది. ఆటోకు రూ.100 పెట్టుకుని బ్యాంక్ వద్దకు వచ్చాను. మరో రూ.100 ఉంటే కానీ ఇంటికి వెళ్లలేను. బ్యాంకులో వారిని వీరిని అడుక్కుని మెట్లెక్కి లోపలకు వచ్చాను. వృద్ధాప్యంతో మేము ఈ బాధలు పడుతుంటే ఎన్నికల ముందు చంద్రబాబు మమ్మల్ని ఈ విధంగా కష్టాలపాలు చేశాడు. – తిరుమలమ్మ, తెట్టు, శ్రీకాళహస్తి
ఈ పాపం ఊరికే పోదు
వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందించే పింఛన్ పంపిణీని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి వార్డు వలంటీర్లను అడ్డుకున్న చంద్రబాబు, పవన్కళ్యాణ్కు పుట్టగతులు ఉండవు. ఎండల్లో వ్యయప్రయాసలకోర్చి పింఛన్ల కోసం పరుగులు పెట్టే పరిస్థితులను తెచ్చిన వారు ఈ పాపాలను అనుభవించక తప్పదు. బ్యాంకులో పింఛన్ పడి రెండు రోజులు అవుతున్నా ఇప్పటివరకు తెచ్చుకోలేకపోయాను. ఎండలు ఓ కారణం అయితే దూరంగా ఉన్న బ్యాంకుకు వెళ్లడానికి నాకు అవకాశం లేకుండా పోయింది. ఆటోలో వెళ్లి రావడానికి రూ.300 వరకు ఖర్చు పెట్టాలి. గడిచిన ఐదేళ్లు గౌరవంగా వలంటీర్లు ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చి ఆదరించేవారు. ఆ పరిస్థితులను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు.
– రమణమ్మ, తిరుపతి
●