● త్వరలో 500 ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి చైన్నె: ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ 7,030 కొత్త బస్సులను ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మున్సిపల్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ రవాణా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఎనిమిది ప్రభుత్వ రవాణా సంస్థలకు చెందిన 20,260 బస్సులు ద్వారా 10,128 మార్గాల్లో పబ్లిక్ బస్సులు నడుపుతోంది. రోజుకు 18,728 బస్సులు, అలాగే సాధారణ ప్రజల అవసరాల మేరకు వారాంతాల్లో మరిన్ని ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రోజుకు 1.78 కోట్ల మంది ప్రయాణికులకు లబ్ధి పొందుతున్నారు. ఇందులో మహిళల ప్రయోజనం కోసం ఉచితంగా నడపే 7,179 బస్సుల్లో రోజుకు 51.47 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు.
2014 ఏప్రిల్ 24 నాటి ఆదేశాల మేరకు అన్ని బస్సులను తనిఖీ చేసి, మరమ్మతులు చేయించాలని, ప్రస్తుతం అన్ని బస్సులను యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు చేసి, మరమ్మతులు చేస్తున్నారు. కోవిడ్ –19 మహమ్మారి 2020 –21, 22 మధ్యకాలంలో రవాణా సంస్థల్లో ఎలాంటి ఆదాయం లేకపోవడం, తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా కొత్త బస్సులను కొనుగోలు చేయలేపోయింది.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 2022– 23లో వెయ్యి కొత్త బస్సులు, 2023–24లో వెయ్యి కొత్త బస్సులు, 2004లో 3 వేల బస్సులు, ఎస్ఏటీపీ పథకం కింద 16 బస్సులను అందజేయనుందని వెల్లడించింది. అలాగే చైన్నె టోటల్ కాస్ట్ కాంట్రాక్ట్ కింద వెయ్యి విద్యుత్ బస్సులను నడపాలని ప్రణాళికను సిద్ధం చేసింది. మొదటి దశలో 500 విద్యుత్ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 7,030 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు.