అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈవీఎంలో ఓటరు తాను వేసిన గుర్తుకే ఓటు పడిందా లేదా అని నిర్ధారించుకునేందుకు వీవీప్యాట్లో పేపర్ ప్రింట్ ద్వారా పరిశీలించుకోచ్చు. తాను ఓటు వేసిన గుర్తు ఒకటైతే వీవీప్యాట్లో మరో గుర్తుకు పడినట్లు తప్పు ప్రింట్ చూపిస్తే దానిని ‘రాంగ్ ప్రింట్ ఆఫ్ వీవీప్యాట్ పేపర్ స్లిప్’ అంటారు. ఇలాంటి సందర్భంలో ప్రిసైడింగ్ అధికారి రూల్ 49ఎంఏ ప్రకారం చర్యలు తీసుకోవాలి. అలాగే...
● తన వద్ద ఉన్న హ్యాండ్ బుక్లోని ఆనెక్జర్–15 ప్రకారం ఫిర్యాదు చేసిన ఓటరు వద్ద డిక్లరేషన్ను ప్రిసైడింగ్ అధికారి తీసుకోవాలి.
● పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో 17ఎ లో ఓటరు వివరాలు మరోసారి ఎంటర్ చేయాలి.
● కంట్రోల్ యూనిట్ నుంచి ఓటును విడుదల చేయాలి. ఏజెంట్ల సమక్షంలో ప్రిసైడింగ్ అధికారి వీవీప్యాట్లో వచ్చిన స్లిప్ను పరిశీలించాలి.
● ఓటరు ఫిర్యాదు నిజమని తేలితే... ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ను ఆపేసి రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి.
● ఓటరు ఫిర్యాదు తప్పని తేలితే 17ఎ లో ఆ ఓటరు రెండోసారి రాసిన వివరాలు రిమార్క్ కాలమ్లో ఓటరు చేసిన ఫిర్యాదు తప్పని రాయాలి.
● 17 సి అనగా పోలైన ఓట్ల వివరాలు తెలిపే ఫారంలోని మొదటి భాగంలో (పార్ట్–1) ఆ వివరాలు నమోదు చేయాలి.
ఈవీఎంలు, వీవీప్యాట్లు పనిచేయకపోతే
● పోలింగ్ సమయంలో ఈవీఎంలు, వీవీప్యాట్లు పనిచేయకపోతే.. వాటి స్థానంలో రిజర్వ్లోని వాటిని ఏర్పాటు చేయాలి.
● కొత్త ఈవీఎం, వీవీప్యాట్లో మళ్లీ మాక్పోల్ నిర్వహించి, డిక్లరేషన్ రాయాలి (సింగిల్ ఓటు).
మార్క్డ్ ఓటరు వస్తే...
● ప్రిసైడింగ్ అధికారి వద్ద ఓటరు జాబితాకు సంబంధించి వర్కింగ్ కాపీలు, మార్క్డ్ కాపీలు ఉంటాయి. అందులో ఆబ్సెంట్, షిప్టెడ్, డెత్ (ఏఎస్డీ)జాబితాలో ఉన్న ఓటర్లను మార్క్ చేసి ఉంటారు.
● మార్క్డ్ ఓటరు ఓటు వేయడానికి వస్తే ప్రిసైడింగ్ అధికారి ఆ ఓటరు తెచ్చిన గుర్తింపుతో జాబితాలోని వివరాలను సరిచూడాలి.
● నిజమైతే 17ఎ లో ఆ ఓటరు సంతకంతో పాటు వేలిముద్ర తీసుకుని ఓటు వేసేందుకు అనుమతించాలి.
● ఏఎస్డీ జాబితా నుంచి ఓటు వేసిన వారి వివరాలతో ఓ రికార్డు సిద్ధం చేయాలి.