నల్లగొండ టౌన్: ఎండలు మండుతున్నాయి. జిల్లాలో నాలుగు రోజులుగా అత్యధికంగా 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7గంటల నుంచే ఎండ దంచికొడుతోంది. ఉదయం 9గంటల దాటిందంటే ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడం లేదు. 11 గంటల దాటితే వీధులు, రోడ్లు జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వేడిగాలులు వీస్తుండడంతో ఉక్కపోతతో తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. శుక్రవారం అత్యధికంగా త్రిపురారం మండలం కామారెడ్డిగూడెంలో 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనుముల హాలియా మండలం ఇబ్రహీంపేట, కట్టంగూర్ మండల కేంద్రంలో 46.5 డిగ్రీలు నమోదుకావడం విశేషం. 21 ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా, 24 ప్రాంతాల్లో 44 డిగ్రీలకు మించి నమోదైంది. ఇంకా ఐదు చోట్ల 43 డిగ్రీలు నమోదు కాగా జిల్లాలో మిగతా చోట్ల 42 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండో వారంలో ఎండలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఫ అత్యధికంగా కామారెడ్డిగూడెంలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత