కురవి: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో కేటాయించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీఈఓ రామారావు హెచ్ఎంలను ఆదేశించారు. శుక్రవారం సీరోలు మండల కేంద్రం శివారు రేకులతండాలోని డీఎన్టీపీఎస్ పాఠశాలను పరిశీలించారు. ఆదర్శ పాఠశాలలుగా ఎంపికై న స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు వెంటనే పనులు పూర్తి చేయాలన్నారు. ఈనెల 10వ తేదీలోగా పనులు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఎంఈఓ పూల్చంద్, ఏఏపీసీ స్పెషల్ ఆఫీసర్ శ్రీనాథ్ పాల్గొన్నారు.
పీహెచ్సీ సందర్శన
కేసముద్రం: మండల కేంద్రంలోని పీహెచ్సీ, పెనుగొండ, ఉప్పరపల్లి సబ్సెంటర్లను డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీష శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. గిరిజన ప్రాంతాల్లో ఎనిమియా(రక్తహీనత)పై చేపట్టిన సర్వే వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలను పెంచాలని, సమయపాలన పాటించాలని ఆయన వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సీహెచ్ఓ కృష్ణార్జున, మెడికల్ ఆఫీసర్ నందికిషోర్, సూపర్వైజర్ జనార్దనాచారి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రపతిని కలిసిన హుస్సేన్ నాయక్
మహబూబాబాద్ అర్బన్: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ రాష్ట్రపతి ద్రౌపదిముర్మును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం గిరిజనాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందన్నారు. బీజేపీ గిరిజనులు, ఆదివాసీలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని, దీనికి నిదర్శనమే ఎస్టీ సామాజిక వ ర్గానికి చెందిన ద్రౌపదిముర్ము రాష్ట్రపతి కావడమని కొనియాడారు. ఎస్టీ కమిషన్ నిధులతోనే గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు.
జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు వాయిదా
మహబూబాబాద్ అర్బన్: జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు వాయిదా పడినట్లు జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ నర్మద శుక్రవారం తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు వాయిదా వేశామని, జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు, ప్రజాప్రతినిధులు గమనించాలన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయాలి
మహబూబాబాద్ రూరల్: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల అధికారి జినుగు మరియన్న అన్నారు. జిల్లాలోని పలు ఆయిల్పామ్ తోటలను శుక్రవారం ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయి ల్ పామ్ రైతులకు వేసవి యాజమాన్యం, కలు పు యాజమాన్యం, పచ్చిరొట్ట ఎరువులు, అంతర పంటలు, ఎరువుల వాడకం, పలు సాంకేతిక సలహాలు, సూచనలు చేశారు. ఆయిల్ పామ్ తోటలను కాపాడుకోవాలని, నూతన రైతులు పంట మార్పిడి చేసి డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ అధికారి నాగరాజు, రైతులు పుల్లయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.