ఓర్వకల్లు: మద్యం మత్తులో ఓ వ్యక్తి కింద పడి మృతి చెందిన సంఘటన గుట్టపాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డే గుంజల దర్గయ్య(47), శేషమ్మ దంపతులు స్థానిక స్టీల్ ప్లాంట్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి నాగశేషులు అనే ఒక్కగానొక్క కొడుకు సంతానం. అయితే తాగుడు బానిసైన దర్గయ్య గత నెల రోజుల నుంచి పనులకు వెళ్లకుండా నిత్యం మద్యసేవించి కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. రాత్రి 10 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఇంటిముందు భోజనం చేస్తుండగా భార్య శేషమ్మతో గొడవకు దిగాడు. అక్కడే ఉన్న కొడుకు నాగశేషులు తండ్రిని వారించాడు. అయినా వినిపించుకోలేని దర్గయ్య తాగిన మైకంలో ఇంటి మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్ర రక్తగాయం కావడంతో కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య శేషమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్ల్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు.
నిలకడగా ఎండుమిర్చి ధరలు
నంద్యాల(సెంట్రల్): పట్టణంలోని మిర్చి యారు ్డలో శుక్రవారం సూపర్–10 సరకు రకం జనరల్ క్వింటాలు గరిష్ట ధర రూ.13,000, మధ్యస్థ ధర రూ.10,000, కనిష్ట ధర రూ.8,000గా నమోదైంది. ఇదే రకం తాలుకాయ జనరల్ గరిష్ట ధర క్వింటాలు రూ.6,000, మధ్యస్థ ధర రూ.5,000, కనిష్ట ధర రూ.4,500గా పలికినట్లు యార్డు ఎంపిక శ్రేణి కార్యదర్శి కల్పన తెలిపారు.
తెలంగాణ మద్యం స్వాధీనం
పగిడ్యాల: పగిడ్యాల గ్రామానికి చెందిన సాయి అలియాస్ చాకలి సాయి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం నుంచి బైక్లో 192 మద్య సీసాలను తరలిస్తుండగా నెహ్రూనగర్ క్రాస్ రోడ్డు వద్ద రైడ్ చేసి పట్టుకున్నామని ఎస్ఐ జయశేఖర్ శుక్రవారం తెలిపారు. నిందితుడిపై ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.