అమిత్‌షా సభ విజయవంతం చేయాలి | Sakshi
Sakshi News home page

అమిత్‌షా సభ విజయవంతం చేయాలి

Published Sat, May 4 2024 9:05 AM

అమిత్‌షా సభ విజయవంతం చేయాలి

ఆసిఫాబాద్‌: కాగజ్‌నగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బహిరంగ సభకు నాయకులు, ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ పార్టీ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి అలిజాపూర్‌ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర నాయకుడు బోనగిరి సతీశ్‌బాబు, జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, బీజేపీ జిల్లా కోకన్వీనర్‌ మయూర్‌ చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినాథ్‌, రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సిద్దంశెట్టి సుహాసినితో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. పదేళ్ల నరేంద్ర మోదీ పరిపాలనపై దేశ ప్రజలు అమితమైన విశ్వాసంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ 6 గ్యారంటీలు బూటకమని, ప్రజలను నయవంచన చేశారని ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో కేవలం నాలుగు నెలల్లో ఏ పార్టీ ప్రజాగ్రహానికి గురికాలేదన్నారు. బీఆర్‌ఎస్‌ మునిగిపోయే నావ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ నియంత పాలనను భరించలేక ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. నిరాష్ట్రంలో బీజేపీ 12 స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు సత్యనారాయణ, ప్రసాద్‌గౌడ్‌, బొమ్మెన శ్రావణ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement