పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటే కాల్చి చంపాలి | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటే కాల్చి చంపాలి

Published Sat, May 4 2024 8:50 AM

పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటే కాల్చి చంపాలి

హొసపేటె/రాయచూరు రూరల్‌: పాకిస్తాన్‌ జిందాబాద్‌ అని నినదిస్తే నేరుగా కాల్చిచంపేలా చట్టం తేవాలని గృహ నిర్మాణ, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ అన్నారు. కొప్పళ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సింధనూరులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. మనమంతా ఈ నేలపై పుట్టిన భారతీయులం. మనలో దేశభక్తి కూడా ఉంది. ఇక్కడ పాకిస్తాన్‌ జిందాబాద్‌ అనే వారిని కాల్చిచంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. అవసరమైతే కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఇటీవల బీజేపీ కిరాయి హంతకులను పంపి పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. అయితే పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు చేసే వారికి ఇక్కడ ఉండే అర్హత లేదు. వారిని బహిరంగంగా కాల్చి చంపాలని అన్నారు. దేశ రక్షణ, రాజ్యాంగం పరిరక్షణ కోసం ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలన్నారు. దేశం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయి. మతతత్వ భాజపాను ఓడించి కాంగ్రెస్‌ కూటమిని బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు హామీలు అమలు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి రూ.లక్ష, యువతకు రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు. హిందూ, ముస్లింల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. వారికి అభివృద్ధి అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌ సాధించిన విజయాలను చూపి ఓట్లు అడుగుతున్నామన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజశేఖర్‌ హిట్నాల్‌కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే హంపనగౌడ బాదర్లి, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అన్వర్‌ బాషా, నాయకులు అమ్జద్‌ పటేల్‌, ఇమాం నియాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement