కరీంనగర్టౌన్: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు శుక్రవారం బీజేపీలో చేరారు. జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి గుర్రం ఆనందరెడ్డి, యాదవ సంఘం పట్టణ అధ్యక్షుడు గాలి రవి యాదవ్, పలువురు మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, కుల సంఘాల అధ్యక్షులు, వార్డు మెంబర్లకు ఎంపీ బండి సంజయ్ కరీంనగర్లోని తన కార్యాలయంలో కండువాలు కప్పి, ఆహ్వానించారు.
నేటి ‘ఎమర్జింగ్ భారత్’కు తరలిరండి
కరీంనగర్టౌన్: ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు కరీంనగర్లో నిర్వహిస్తున్న ఎమర్జింగ్ భారత్ కార్యక్రమానికి మేధావులు తరలివచ్చి, విజయవంతం చేయాలని సంస్థ చైర్మన్ డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్లోని ప్రజ్ఞాభారతి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో మన దేశం ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తూ విశ్వ గురువుగా ఎదిగిందని పేర్కొన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతోందని, దీనికి కారణం బలమైన నాయకత్వమేనని తెలిపారు. ఎమర్జింగ్ భారత్ కార్యక్రమంలో సమగ్ర సమాచారం తెలియజేయడానికి ప్రముఖ కాలమిస్ట్, పొలిటికల్ అనలిస్టు, రచయిత శంతను గుప్త వస్తున్నారని అన్నారు. ప్రజ్ఞాభారతి ప్రధాన కార్యదర్శి మందల నగేశ్రెడ్డి, జె.సత్యనారాయణ రెడ్డి, దేశిని శ్రీనివాస్, వెచ్చ మురళి, తుమ్మల రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు
ఈడీ పరామర్శ
విద్యానగర్: ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ చాలెంజ్లో భాగంగా కాల్ హెల్త్ సంస్థచే తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించిన, కరీంనగర్ ప్రతిమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగులను కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.వినోద్కుమార్, రీజినల్ మేనేజర్ ఎన్.సుచరిత శుక్రవారం పరామర్శించారు. ఆర్టీసీ అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితుల కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. వైద్యులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కరీంనగర్–1 డిపోకు చెందిన హెల్పర్ శ్రీనివాస్కు బైపాస్ సర్జరీ కాగా, 2 డిపో డ్రైవర్ యూసుఫ్కు స్టంట్లు వేశారు. వీరితోపాటు మరో నలుగురు ఉద్యోగులు ఇన్పేషెంట్స్గా చికిత్స పొందుతుండగా అందరి ఆరోగ్యం మెరుగ్గా ఉందని డాక్టర్లు తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సెక్రటరీ కె.యుగంధర్ రెడ్డి, కరీంనగర్–1 డిపో హెల్త్ వలంటీర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.