కాకినాడ సిటీ: గతంలో వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు ఏళ్ల తరబడి భర్తీ చేసేవారు కాదు. రెండు మూడు పీహెచ్సీలకు ఒక వైద్యుడు సేవలు అందించే పరిస్థితి. మూడు పీహెచ్సీలకు ఒక ల్యాబ్ టెక్నీషియన్ సేవలు అందించే వారు. ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ ప్రభుత్వం ప్రతి పీహెచ్సీకి ఇద్దరు వైద్యులను, ముగ్గురు స్టాఫ్ నర్సులను నియమించింది. ప్రతీ పీహెచ్సీకి ఒక ల్యాబ్ టెక్నీషియన్ను నియమించారు. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి పోస్టుల కొరత లేకుండా పోస్టులను భర్తీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వేలాది పోస్టులను భర్తీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖలో 2019 నుంచి ఇప్పటి వరకూ 3,156 మంది ఉద్యోగుల నియామకాలు జరిపారు. వార్డు బాయ్ దగ్గర నుంచి స్పెషలిస్టు డాక్టర్ వరకూ అన్ని కేడర్ల పోస్టులూ భర్తీ చేశారు. విలేజ్ క్లినిక్లలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల(సీహెచ్ఓ)ను నియమించారు. వీరు గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారు.