ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మూడో రోజైనా బుధవారం ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, హోమం చేశారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అన్ని వసతులూ కల్పించారు. ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులున్నారు.
డెంగీ నివారణపై అవగాహన కల్పించాలి
సారంగాపూర్: డెంగీపై ప్రజల్లో అవగాహన కల్పించాలని డెప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. డెంగీ ఏడిస్ ఈజిప్ట్ దోమ మధ్యాహ్న సమయంలో కుట్టడం ద్వారా వ్యాపిస్తుందని, తీవ్రమైన తలనొప్పి, జ్వరం ఉంటుందని, శరీరంపై దద్దుర్లు వస్తారని పేర్కొన్నారు. కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు వచ్చి ఆకలి తగ్గుతుందన్నారు. అలాంటి వారిని గుర్తించి వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఇళ్ల పరిసరాల చుట్టూ అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూడాలన్నారు.
మల్యాలలో..
మల్యాల: పరిసరాల పరిశుభ్రత పాటించాలని, దోమల నివారణతోనే డెంగీ నియంత్రణ సాధ్యమని శ్రీనివాస్ అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.
దరఖాస్తులు ఆహ్వానం
జగిత్యాలటౌన్: కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్–1, సివిల్ సర్వీసెస్కు సంబంధించి ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తున్నట్టు బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రూప్–1కు సంబంధించి ఈ నెల 18, 20, 22, 24, 25, 27, 29, 31, జూన్1,3 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష కరీంనగర్ బీసీ స్టడీసర్కిల్లో నిర్వహిస్తామని, యూపీఎస్సీకి సంబంధించి ఈ నెల 23, 26, 28, 30, జూన్ 2, 4, 6, 8, 10, 12 తేదీల్లో పరీక్షలు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో జరుగుతాయని వివరించారు. www.tsbcstudycircle.cgg.gov.inవెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం 040–24071178, 040–27077929 నంబర్లను సంప్రదించాలని కోరారు.
కోడ్ ఉల్లంఘించిన ప్యాక్స్ సిబ్బంది సస్పెన్షన్
మెట్పల్లి: లోక్సభ ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన మెట్పల్లి, బండలింగాపూర్ విశాల సహకార పరపతి సంఘాలకు చెందిన ఇద్దరు ఉద్యోగులు చెదలు రాజేశ్, అంకం శంకర్ను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. రాజేశ్, శంకర్ ఓ రాజకీయ పార్టీకి సంబంధించి తమ వాట్సప్ స్టేటస్లో పెట్టుకున్నారు. అలాగే మరో పార్టీని విమర్శిస్తూ వాయిస్ మెసేజ్లు పోస్ట్ చేశారు. విచారణ చేపట్టగా నిజమేని తేలడంతో కోడ్ నిబంధనల మేరకు ఇద్దరిని సస్పెండ్ చేశామని డీసీఓ తెలిపారు.
ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు
జగిత్యాల: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంచినట్లు నోడల్ అధికారి నారాయణ తెలిపారు. ఈనెలలో జరిగే ఇంటర్ పరీక్షలకు రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఈనెల16వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఇది చివరి అవకాశమని పేర్కొన్నారు.