నల్లగొండ: నల్లగొండ – వరంగల్– ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థులుగా మాధవపెద్ది వెంకట్రెడ్డి ఒక సెట్, చంద్రశేఖర్ రెండు సెట్లు నామినేషన్ పత్రాలను నల్లగొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందజేశారు. అదేవిధంగా అలియన్స్ డెమొక్రటిక్ రీఫామ్స్ పార్టీ అభ్యర్థి ఈడ శేషగిరిరావు ఒక సెట్, తెలంగాణ సకల జనుల పార్టీ అభ్యర్థి నందిపాటి జానయ్య ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
8న లక్ష్మీపురంలో ప్రధాని మోదీ బహిరంగ సభ
● లక్ష మందితో బీజేపీ ఆశీర్వాద సభ
● సభా స్థలం పరిశీలన..ఏర్పాట్లు ప్రారంభం
మామునూరు: ఈ నెల 8న దేశ ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్కు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖిలా వరంగల్ మండలం తిమ్మాపురం రోడ్డు లక్ష్మీపురం మైదానంలో జరిగే బీజేపీ ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సభాస్థలాన్ని ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, నాయకులు రావు పద్మ, రాజేశ్వర్రావు, వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, ఎర్రబెల్లి ప్రదీప్రావు కీర్తిరెడ్డి, దశమంతరెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా రమేశ్ కొబ్బరికాయ కొట్టి సభప్రాంగణ పనులను ప్రారంభించారు. అంతకుముందు స్థానిక కార్పొరేటర్ జలగం అనిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీతోనే వరంగల్ అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఆశీర్వాద సభకు దేశ ప్రధాని మోదీ రానున్నారని, లక్ష మందికిపైగా జనం స్వచ్ఛందగా తరలివచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 8న ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోదీ మామునూరు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారని తెలిపారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో 11.50గంటలకు లక్ష్మీపురం సభాస్థలికి చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 12.45 నిమిషాలకు తిరిగి మామునూరు ఎయిర్ పోర్ట్నుంచి కరీంనగర్ బహిరంగ సభకు తరలివెళ్లనున్నారని తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నేతలు మల్లాడి తిరుపతిరెడ్డి, దేవేందర్రెడ్డి, గజ్జెల శ్రీరాములు, బన్న ప్రభాకర్, సంపత్రెడ్డి, సాంబయ్యయాదవ్, అర్చన, గందె నవీన్ పాల్గొన్నారు.
డిగ్రీ పరీక్షలు యథాతథం
● వాయిదా పుకార్లు నమ్మవద్దు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల 2, 4, 6 సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 6వ తేదీ నుంచి యథావిధిగా కొనసాగుతాయని వాయిదా వేసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మొద్దని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచా ర్య ఎస్.నర్సింహాచారి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.