నూజివీడు: పట్టణంలోని జంక్షన్ రోడ్డులో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని అమరావతి ఫర్నిచర్స్ యజమాని అయిన కొవ్వూరు రామారెడ్డికి ఇద్దరు కుమారులు. వీరిద్దరూ గురువారం రాత్రి ఇంట్లో ఒకే బెడ్రూమ్లో నిద్రించారు. అయితే తెల్లారేసరికి చిన్న కుమారుడు కొవ్వూరు యశ్వంత్ నవీన్రెడ్డి (15) మృతదేహం ఇంటి పక్కన పడి ఉండటాన్ని శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో గుర్తించారు. మృతుడు యశ్వంత్ నవీన్రెడ్డి ఇటీవలే 542 మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు సీఐ వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అలాగే ఏలూరు నుంచి వచ్చిన క్లూస్ టీం సాక్షాధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
యానాం మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్టు
నూజివీడు : యానాం మద్యంను ద్విచక్రవాహనంపై తరలిస్తున్న వ్యక్తిని ఎస్ఈబీ నూజివీడు స్టేషన్ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ వెంకటరమణ మీర్జాపురంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా బాపులపాడు మండలం పాత మల్లవల్లికి చెందిన బొల్లిగర్ల కొటేశ్వరరావు ద్విచక్ర వాహనంపై యానాంకు చెందిన 36 మద్యం ఫుల్బాటిళ్లను తీసుకెళుతుండగా అతనిని అదుపులోకి తీసుకుని మద్యం బాటిళ్లను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాఽధీనం చేసుకున్న వాటిలో మాన్షన్హౌస్ బ్రాందీ సీసాలు 24, రాయల్స్టాగ్ సీసాలు 12 ఉన్నాయి. వీటి విలువ మొత్తం రూ.19 వేలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు తరలించినట్లు పేర్కొన్నారు.
యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు విజయవంతం చేయాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): యూటీఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలను విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు కోరారు. ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం జిల్లా అధ్యక్షులు షేక్ ముస్తాఫా అలీ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రాక్షి రవికుమార్ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వీరికి ఏ విధమైన సహాయం అవసరమైనా అండగా ఉంటామని భరోసానిచ్చారు. రాష్ట్ర కార్యదర్శులు బీ.సుభాషిణి, ఎస్. కిషోర్ కుమార్ జిల్లా కార్యదర్శులు పీవీ సాగర్ బాబు ఎస్. సుధారాణి పాల్గొన్నారు.
ఎర్రకాలువలో పడి వ్యక్తి మృతి
కొయ్యలగూడెం: ఎర్రకాలువలో పడి ఒక యువకుడు మృతి చెందాడు. రాజవరం సర్పంచ్ ఏలేటి చిన్న తుక్కయ్య తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పోతిన సత్యనారాయణ (44) అనే వ్యక్తి పొలం పనులు నిమిత్తం ఉదయం వెళ్ళాడు. రాజవరం వద్ద ఎర్రకాలువ దాటే సమయంలో గుండంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. నీటి గుండంలో తేలియాడుతున్న శవాన్ని స్థానిక రైతుల మధ్యాహ్నం గుర్తించి బయటికి తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రెవెన్యూ అధికారులు విచారణ నిర్వహించినట్లు సర్పంచ్ పేర్కొన్నారు.