●
టీడీపీ నాయకుల వల్లే ఈ దుస్థితి
టీడీపీ నాయకుల నీచమైన చర్యతో పింఛను తీసుకోవడానికి, తీవ్రమైన ఎండలో బ్యాంకులు చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్యాంకులు రద్దీగా ఉండటంతో ఇక్కడ నిలబడలేక ఇంటికి తిరిగి వెళుతున్నా. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి టీడీపీ నాయకులే కారణం.
– వై.ఏసుబాబు, కామవరపుకోట, వై. కాలనీ
మా ఉసురు తగులుతుంది
ప్రతినెలా వలంటీర్లు ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవారు. పింఛను సొమ్ముతో మందులు, నిత్యావసరాలు కొనుక్కునే దాన్ని. మూడో తేదీ వచ్చినా ఇంకా పింఛను అందలేదు. నా పింఛన్ సొమ్ము ఏ బ్యాంకులో వేశారో తెలియక, కాగితాలు పట్టుకుని మూడు రోజుల నుంచి మండుటెండలో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా. మాకు వలంటీర్ ద్వారా పింఛను ఇప్పించాలి. వృద్ధులను ఇబ్బంది పెట్టిన టీడీపీ నాయకులకు మా ఉసురు కచ్చితంగా తగులుతుంది.
– దారిమిల్లి కన్నమ్మ, వృద్ధురాలు, కామవరపుకోట
ఎండలో నడుచుకుంటూ వచ్చా
పింఛన్ సొమ్ము తీసుకునేందుకు ఎండలో నడుచుకుంటూ బ్యాంకుకు వచ్చాను. ఇక్కడ చాలా క్యూలైన్ ఉంది. తీరా కౌంటర్ వద్దకు వెళ్లేటప్పటికి నా ఖాతా మనుగడలో లేదని, దానిని పునరుద్ధరించాల్సి ఉందని, సోమవారం మళ్లీ రావాలని బ్యాంకు అధికారులు చెప్పారు. బ్యాంకులో పింఛన్ సొమ్ము ఉన్నా, తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు పుణ్యమా అంటూ రెండు నెలలుగా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నా.
– ఎం.మాణిక్యం, పింఛన్ లబ్ధిదారు, ఉప్పలమెట్ట, జంగారెడ్డిగూడెం
‘ముసలోళ్లను ముప్పతిప్పలు పెడుతున్నావు.. మా ఉసురు నీకు తగులుతుంది.. మామీద ఎందుకు నీకు ఇంత పగ.. ఆ దేవుడే నీకు శిక్ష వేస్తాడు’ అంటూ అవ్వాతాతలు చంద్రబాబును శాపనార్థాలు పెడుతున్నారు. జగన్ బాబు ఇంటి గుమ్మంలోకే పింఛను ఇచ్చారని, చంద్రబాబు ముసలోళ్లను ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేసి తమను రోడ్డుపాలు చేశాడంటూ అవ్వాతాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడో తేదీ వచ్చినా ఇంకా పింఛను చేతికి అందక బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి రావడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. శుక్రవారం జిల్లాలోని పలు బ్యాంకుల వద్ద అవ్వాతాతలు పింఛను సొమ్ము కోసం మండుటెండలో నిరీక్షిస్తూ అష్టకష్టాలు పడుతూ ఇలా విలవిల్లాడుతూ కనిపించారు.
విలపింఛెన్
● చంద్రబాబు పగబట్టాడంటున్న అవ్వాతాతలు
● తమ ఉసురు తగులుతుందంటూ శాపనార్థాలు
● వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు తప్పని అవస్థలు
● మండుటెండలో బ్యాంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు
● కేవైసీ, ఆధార్ అప్డేట్ లేక ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు
ఏలూరు (మెట్రో)/నూజివీడు/కామవరపుకోట/జంగారెడ్డిగూడెం : ప్రతి నెలా ఒకటో తేదీనే తెలవారకముందే ఇంటి వద్దే ఠంచన్గా వలంటీర్ల ద్వారా పింఛను సొమ్ము అందుకునే అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు ఇప్పుడు తమను రోడ్డు పాలు చేశారంటూ ప్రతిపక్ష పార్టీలను దుమ్మెత్తిపోస్తున్నారు. శుక్రవారం జిల్లాలోని పలు బ్యాంకుల వద్ద పింఛను సొమ్ము కోసం గంటల తరబడి పడిగాపులు పడుతూ పింఛను లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు బ్యాంకులో వేసిన సొమ్ములను ఎలా తీసుకోవాలో తెలియక బ్యాంకులో కనిపించిన వారిని డబ్బుతీసిపెట్డండంటూ ప్రాధేయపడ్డారు. వలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి టీడీపీ, జనసేన అధినాయకులు చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్ చులకన భావంతో వలంటీర్ల వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి తరుణంలోనే దేశవ్యాప్తంగా వలంటీర్ల వ్యవస్ధకు ప్రశంసలు లభించడంతోపాటు ప్రభుత్వానికి మంచిపేరు వచ్చింది. ఎన్నికల సమయంలో కోర్టుల్లో కేసులు వేయించడం ద్వారా చంద్రబాబునాయుడు వలంటీర్ల సేవలను అడ్డుకున్నారు. దీంతో ఇంటి వద్దే పింఛను పొందే లబ్ధిదారులకు అవస్ధలు ప్రారంభమయ్యాయి. గత నెలలో సచివాలయాల వద్ద పంపిణీ చేయగా, ఈ నెల బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ చేశారు.
మండుటెండలో..
పింఛను సొమ్ము బ్యాంకు ఖాతాలకు జమ చేయడంతో ఈ నెల 1వ తేదీ నుంచి వృద్ధులు, విలాంగులు, ఒంటరి మహిళలు బ్యాంకుల చుట్టూ తిరగక తప్పలేదు. ఎండతీవ్రత, వడగాల్పులు అధికంగా ఉన్నా పింఛను సొమ్ము చేతికి అందకపోతే పూట గడిచేదెలా, మందులు కొనుక్కునేది ఎలా అంటూ ఉదయాన్నే బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. ప్రధానంగా బ్యాంకు సౌకర్యం లేని గ్రామాల ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లడం మరింత ఇబ్బందికర పరిస్థితిలో వ్యయప్రయాసలకు గురవుతున్నారు. చాలా చోట్ల బ్యాంకుల్లో నిరీక్షించేందుకు కూడా జాగా లేక బ్యాంక్ కార్యాలయాల బయటే అవ్వాతాతలు నిలబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది
బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా లేక..
జిల్లాలో బ్యాంకులకు 2,54,029 మందికి చెందిన పెన్షన్ల సొమ్మును డిపాజిట్ చేయగా, వాటిలో కనీసం 50 శాతం మంది ఇప్పటికి పెన్షన్లు తీసుకోలేకపోయారు. జిల్లాలో 35 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించిన 301 శాఖలు ఉన్నాయి. పింఛనుదారుల్లో చాలా మంది బ్యాంక్ ఖాతాలు యాక్టివ్లో లేక, ఆధార్ కార్డు అప్డేట్ కాలేదనో, పింఛను పడిందో లేదో తెలియక లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. పింఛన్ సొమ్ము బ్యాంకులో జమ అయినా అవి తీసుకునేందుకు ఖాతాలు యాక్టివ్లో లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. గత ప్రభుత్వ కాలంలో పడిన కష్టాలు ఐదేళ్ల తరువాత మళ్లీ మొదలయ్యాయి అంటూ అవ్వా తాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తే, ఈ సారి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోయారు.