అమలాపురం రూరల్: ఎన్నికల సీజర్ మేనేజ్మెంట్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసేందుకు సమాచార, నిఘా ఆధారిత ఎన్ఫోర్స్మెంట్ కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేశ్వర్ గోయల్ పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోనసీమ జిల్లాలో అమలాపురం లోక్సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సాధారణ పరిశీలకులు, రాజేశ్వర్ గోయల్, పరదీప్ కుమార్ శుక్రవారం కలెక్టరేట్లో ఇంటెగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు. సీ–విజిల్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఐటీ, బ్యాంకింగ్, కమర్షియల్ ట్యాక్స్, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్, కస్టమ్స్ తదితర విభాగాల కార్యకలాపాలను పరిశీలించారు. ఓటరు హెల్ప్ లైన్ 1950, నేషనల్ గ్రీవెనన్స్ సర్వీస్ పోర్టల్, వాట్సప్, కాల్ సెంటర్, కంప్లయింట్ మేనేజ్మెంట్ సిస్టమ్, సీఈవో మెయిల్స్, సీ విజిల్స్ తదితరాల ద్వారా అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను రికార్డుల ఆధారంగా పరిశీలించారు. చెక్ పోస్టుల వద్ద నిఘా అమలు తీరుపై ఆరా తీశారు. స్టాటిక్ సర్వైలెన్న్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ క్షేత్ర స్థాయిలో పరిశీలనకు సంబంధించి ఆయా వాహనాలకు అమర్చిన జీపీఎస్ పరికరాల ద్వారా ఆయా వాహనాలు ఎక్కడ ఉన్నాయి. ఆయా నిఘాబృందాల కదలికలను పరిశీలించే కంట్రోల్ రూమ్ నిర్వహణ తీరును పరిశీలించారు. పోటీలోని అభ్యర్థుల రాజకీయ ప్రకటనలు, చెల్లింపు వార్తల రికార్డింగ్ విధానాలను పరిశీలించారు. రోజువారీ నివేదికల నిర్వహణ తీరును తనిఖీ చేశారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, ఐటీ బ్యాంకింగ్ కమర్షియల్ టాక్స్, సీజర్ మేనేజ్మెంట్ తదితర విభాగాల కార్యకలాపాలను రికార్డుల ద్వారా పరిశీలించి సిబ్బందికి ఉన్న అవగాహనపై సంతప్తిని వ్యక్తం చేశారు. వ్యయ పరిశీలకులు ఉమేష్ కుమార్, సుమిత్దాస్ గుప్తా, సీ విజిల్ యాప్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
6న ప్రధాని మోదీ సభ
రాజమహేంద్రవరం సిటీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వేమగిరి వద్ద జాతీయ రహదారిని ఆనుకుని జరిగే విజయ శంఖారావం బహిరంగ సభలో పాల్గొంటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు సభలో ప్రసంగిస్తారన్నారు.