జిల్లాలో జగనన్న
ఆరోగ్య సురక్ష వివరాలు
● జగనన్న ఆరోగ్య సురక్ష
వైద్య శిబిరాలు – 480
● పరీక్షలు చేయించుకున్న
రోగులు – 1.15,122
● వివిధ శస్త్ర చికిత్సలకు
రిఫర్ చేసిన రోగుల సంఖ్య – 563
● కంటి వెలుగు ప్రోగ్రామ్లో
కళ్లజోళ్ల పంపిణీ – 41,411
● క్యాటరాక్ట్ శస్త్ర చికిత్సలు – 2,017
● సురక్ష వైద్య శిబిరాల్లో స్క్రీనింగ్
చేసిన కంటి రోగులు – 9,380
● ఎన్సీడీ సర్వే ద్వారా
హైపర్ టెన్షన్ రోగులు – 1,63,889
● డయాబిటిస్ (సుగర్)
రోగులు – 1,07,053
● డయాబిటిస్, హైపర్
టెన్షన్ రోగులు – 70,491
ఫ్యామిలీ డాక్టర్ ద్వారా...
వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ – 452
వైద్యం పొందిన గర్భిణులు – 11,738
బాలింతలు – 2,061
రక్తహీనత ఉన్న గర్భిణులు – 263
●
● పేదల వైద్యానికి పెద్ద పీట
● ఆరోగ్యశ్రీకి తోడు మరెన్నో పథకాల అమలు
● సుస్తీ చేస్తే అందుబాటులో
ఫ్యామిలీ డాక్టర్
● రోగమొస్తే చేతిలో రూ.25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు
● జగనన్న ఆరోగ్య సురక్షతో
అందరికీ వైద్య పరీక్షలు
● నిర్మాణంలో ప్రభుత్వ వైద్య కళాశాల
● బోధనా ఆస్పత్రిగా మారనున్న అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి
అమలాపురం టౌన్: పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పథకాలు ప్రవేశ పెట్టి, చిత్తశుద్ధితో అమలు చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో మరిన్ని రోగాలను చేర్చి, చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని పెంచి రోగమొస్తే ప్రభుత్వం అంగా ఉందనే ధైర్యం కల్పించారని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ఇలా పలు పథకాలు ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నాయి. దీనికితోడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దీర్ఘకాల రోగులకు సాయం అందిస్తున్నారు. వైద్య ఖర్చులు ఎంతైనా చెల్లిస్తున్నారు. ఇది జిల్లాలోని ఎందరికో ఆరోగ్య అభయాన్ని ఇచ్చింది.
ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే రూ.25 లక్షలు
చేతిలో ఉన్నట్టే..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పేదల ఆరోగ్య పెన్నిధి ఆరోగ్యశ్రీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మరింతగా మెరుగులు దిద్దింది. ఈ పథకంలో ఇప్పటికే ఉన్న 1,059 వైద్య సేవలను (రోగాలను) 3,257కి ఒకేసారి పెంచింది. ముఖ్యంగా ఎవరైనా రోగి ఆరోగ్యశ్రీ ద్వారా నెట్వర్క్ ఆస్పత్రికి వెళితే రూ.5 లక్షల వరకూ వైద్య ఖర్చుల పరిమితి ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.25 లక్షలకు పెంచింది. అంటే ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో ఉంటే రూ.25 లక్షలతో చేతిలో ఉన్న ఏటీఎం కార్డుతో సమానం. ఆరోగ్యశ్రీ పథకం కొత్త ఫీచర్లతో జిల్లాలో 5,32,517 అర్హులకు స్మార్ట్కార్డుల పంపిణీ జరిగింది. జిల్లాలో ఉన్న 18 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల ద్వారా గడచిన అయిదేళ్లలో 2.40 లక్షల మంది రోగులకు రూ.623 కోట్లకు పైగా ఈ పథకం కింద ప్రభుత్వం ఖర్చు చేసింది.
త్వరలో అందుబాటులోకి ప్రభుత్వ వైద్య కళాశాల
ఇంతకాలం ప్రైవేటు వైద్య కళాశాల, బోధనా ఆస్పత్రిపై ఆధారపడ్డ జిల్లా పేద ప్రజానీకానికి త్వరలోనే అమలాపురం సమీపంలో ప్రభుత్వం నిర్మిస్తున్న వైద్య కళాశాల అందుబాటులోకి రానుంది. 54 ఎకరాల విస్తీర్ణంలో రూ.450 కోట్లతో అమలాపురం రూరల్ మండలం కామనగరువు, సమనస గ్రామాల సరిహద్దుల్లో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులు దాదాపు 60 శాతం పూర్తయ్యాయి.
బోధనా ఆస్పత్రిగా రూపాంతరం
చెందుతున్న ఏరియా ఆస్పత్రి
అమలాపురంలో కోనసీమ పేద ప్రజల పెద్దాసుపత్రిగా సేవలు అందిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి... ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా బోధనా ఆస్పత్రి కానుంది. 650 పడకల ఆస్పత్రిగా మారబోతోంది. ఇప్పటికే నాడు–నేడు పథకం కింద రూ.5.70 కోట్లతో ఏరియా ఆస్పత్రి భవనాన్ని, అన్ని వైద్య విభాగాలను ఆధునీకరించారు. ఈ సంవత్సరాంతానికి వైద్య కళాశాల, బోధనా ఆస్పత్రి జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
ప్రాణభిక్ష పెట్టిన వైనం
దీర్ఘకాలిక రోగులు, వారి కుటుంబీకులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందుతున్న సాయం బాధితులకు ప్రాణభిక్ష పెడుతోంది. బాధితుల ఆరోగ్య సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే వెంటనే స్పందించి వారి వైద్యానికయ్యే ఖర్చు ఎంతో మొత్తమైనా సరే చెల్లిస్తూ వారిలో ధైర్యం నింపుతోంది. సీఎం సహాయ నిధి ఎందరో రోగులకు ఆరోగ్య ఆభయాన్ని ఇచ్చింది. అల్లవరం మండలం నక్కా రామేశ్వరానికి చెందిన చిన్నారి హనీ అరుదైన గాకర్స్ వ్యాధి బారిన పడినప్పుడు ఆ చిన్నారి వైద్యానికి ప్రభుత్వం రూ.కోటి కేటాయించింది. అతి ఖరీదైన ఇంజెక్షన్లు చేయించి హనీకి ప్రాణ భిక్ష పెట్టింది. తమ బిడ్డకు ప్రాణం పోసింది ప్రభుత్వమేనని తల్లిదండ్రులు కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మి కృతజ్ఞతాపూర్వకంగా అందరికీ చెబుతున్నారు.
నా బిడ్డను బతికించింది ప్రభుత్వమే
అరుదైన వ్యాధితో బాధ పడుతున్న నా బిడ్డ హనీ నేడు బతికి ఉందంటే అది రాష్ట్ర ప్రభుత్వంపుణ్యమే. నా భర్త, కుమార్తె హనీ ప్రభుత్వం దృష్టికి మా బిడ్డ బాధ తెలియజేయడం వల్లే వైద్యానికి రూ.కోటి మంజూరైంది. ఈ రోజు మా పాప.. ప్రభుత్వం అందిస్తున్న వైద్యంతోనే ఆరోగ్యంగా, చలాకీగా తిరుగుతోంది. రూ.లక్షల్లో అయ్యే వైద్య ఖర్చులు భరించడం మా పేద కుటుంబం తరం కాదు. అందుకే మా కుటుంబ పాలిట ఈ ప్రభుత్వం ఆపద్బాంధవి అయింది. అంతేకాదు మా బిడ్డలకు కార్పొరేట్ స్థాయి విద్యను, నెలకు రూ.10 వేలు పింఛన్ ప్రభుత్వం అందిస్తోంది.
– కొప్పాడి నాగలక్ష్మి, హనీ తల్లి,
నక్కా రామేశ్వరం, అల్లవరం మండలం
ఆ పేద గుండె బతికిందంటే ఆరోగ్యశ్రీ వల్లే
నాకు గుండె వ్యాధి రాగానే వైద్యుణ్ణి సంప్రదించాను. గుండెకు ఆపరేషన్ అత్యవసరంగా చేయాలి అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ చేయించుకున్నాను. దాదాపు రూ.లక్ష వ్యయంతో కూడిన ఆ ఆపరేషన్ను నేను ఉచితంగా పొందానంటే ఆరోగ్యశ్రీ వల్లే. రెండు నెలల కిందట ఆపరేషన్ చేయించుకున్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. నేను బతికి ఉన్నానంటే ఆరోగ్యశ్రీయే కారణం.
– నేతల సత్యనారాయణ,
చిరుతపూడి, అంబాజీపేట మండలం