● కొత్తగూడెం, పాల్వంచలో రెండు కేంద్రాలు ● హాజరు కానున్న 1,174 మంది ● సిటీ కో ఆర్డినేటర్ ఎం.వీ.ఎస్ రెడ్డి వెల్లడి
పాల్వంచ : దేశ వ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈనెల 5న నిర్వహించే ‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షల సిటీ కో ఆర్డినేటర్ ఎం.వి.ఎస్.రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా జిల్లా నుంచి 1,174 మంది హాజరు కానున్నారని వెల్లడించారు. కొత్తగూడెంలోని సింగరేణి డిగ్రీ, పీజీ కళాశాల కేంద్రంలో 478 మంది, పాల్వంచ నవభారత్ పబ్లిక్ స్కూల్లో 696 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. ఉదయం పరీక్ష 11.30 గంటల నుంచి మద్యాహ్నం 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నీట్ అడ్మిట్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తీసుకుని రావాలని, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగ్లు లోనికి అనుమతించబోమని తెలిపారు. నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఎండ తీవ్రత ఉన్నందున విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.