సూపర్బజార్(కొత్తగూడెం): ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులంతా ఈనెల 6వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 4,696 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారి కోసం జిల్లాలో ఐదు ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. పినపాక నియోజకవర్గంలో మణుగూరు ఐకేపీ కార్యాలయం, ఇల్లెందుకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయం, కొత్తగూడెంలో ఆర్డీఓ కార్యాలయం, అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాల, భద్రాచలంలో ఆర్డీఓ కార్యాలయంలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటుహక్కును వినియోగించుకోవచ్చని వివరించారు.
ర్యాండమైజేషన్ పూర్తి..
జిల్లాకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తి చేశామని ప్రియాంక ఆల తెలిపారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాకు కేటాయించిన 1,931 బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ను రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో పూర్తి చేశామని చెప్పారు. పినపాక నియోజకవర్గానికి 312, ఇల్లెందుకు 302, కొత్తగూడేనికి 632, అశ్వారావుపేటకు 460, భద్రాచలానికి 225 బ్యాలెట్ యూనిట్లు కేటాయించామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీఓ మధు, తహసీల్దార్ పుల్లయ్య, ఎన్నికల డీటీ రంగాప్రసాద్, నవీన్, కాంగ్రెస్, బీజేపీ, ఆప్ నాయకులు లక్ష్మణ్ అగర్వాల్, నోముల రమేష్, భాస్కర్ పాల్గొన్నారు.
అత్యవసరమైతేనే బయటకు రండి
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని కలెక్టర్ ప్రియాంక ఆల కోరారు. దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని అన్నారు. పార్క్ చేసిన వాహనాల వద్ద పిల్లలను, పెంపుడు జంతువులను వదలి వెళ్లొద్దని హెచ్చరించారు.
ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ సూచన