ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం టీడీపీ కుయుక్తులు
దుష్ప్రచారానికి తెరతీసిన వైనం
అగ్రిమెంట్ పేపర్లపై సీఎం ఫొటో కనిపించేలా చేసి అసత్య ప్రచారం
సాక్షి రాయచోటి: సార్వత్రిక ఎన్నికల తరుణంలో టీడీపీ నేతలు ప్రజాభిమానం లేక ఓట్ల కోసం జిమ్మిక్కులకు తెరలేపుతున్నారు. ఏదో ఒక రకంగా ప్రజలను బురిడీ కొట్టించాలన్న ఆలోచనతో కొత్త రకం వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎలాగోలా తిమ్మిని బమ్మిని చేసి నమ్మిస్తే ఓట్ల కాలం కాస్త గడిచిపోతుందని భావిస్తున్నారు. ఆది నుంచి కూడా తెలుగుదేశానికి ప్రజాక్షేత్రంలో అంతంత మాత్రమే బలమున్న తరుణంలో కుట్రలు, కుయుక్తులకు పదును పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో నిబద్ధతతో గెలవాలన్న సంకల్పానికి పాతర వేసి పైశాచిక వ్యవహారాలకు తెర తీస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది.
సోషల్ మీడియాలో దుష్ప్రచారం
అన్నమయ్య జిల్లాలో తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వైఎస్సార్సీపీపై దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ప్రధానంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం సాకుగా చూపుతూ సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. అగ్రిమెంటు పేపర్పై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటో వేసుకున్నట్లు చూపుతూ షేర్ చేస్తున్నారు. ఏదో ఒక రకంగా ఓటర్లను భయపెట్టో...ఏమార్చో ఓటును టీడీపీకి వేసేలా కుట్రలు చేయడంపై ప్రజాస్వామ్య వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రాజంపేటతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాట్సాప్ గ్రూపులతోపాటు ఇతర సోషల్ మీడియాలోనూ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. అగ్రిమెంటు పేపర్తోపాటు మ్యాటర్ను జత చేసి దుష్ప్రచారం చేస్తుండటంపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అంతేకాకుండా వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ వ్యవహారం తీసుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఆది నుంచి అంతే
అన్నమయ్య జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నిచోట్ల బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక రకంగా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలన్న ఆలోచనతో టీడీపీ ఆది నుంచి ఏదో ఒక వ్యూహానికి తెర తీస్తోంది. ఒక్క ల్యాండ్ టైట్లింగ్ యాక్టే కాకుండా ఎన్నికల సమయం కావడంతో రకరకాల ప్రచారాలను తెరపైకి తెస్తూ ప్రజలను మభ్యపెట్టే చర్యలకు ఉపక్రమిస్తున్నారు. గతంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మారుస్తున్నారని కూడా ఇదే తరహాలో గోబెల్స్ ప్రచారం నిర్వహించారు.
దుష్ప్రరాన్ని నమ్మరాదు: తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మరాదని వైఎస్సార్సీపీ నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ప్రచారాలు మరిన్ని జరిగే అవకాశం ఉందని, వాటిని ప్రజలు విశ్వసించరాదని కోరుతున్నారు.