ముంచంగిపుట్టు: మండలంలోని కుమడ పంచాయతీ పూలబంద గ్రామానికి చెందిన కొర్రా వెంకటరావు(21) అనే గిరిజన యువకుడు తూర్పుగోదావరి జిల్లా భీమవరంలో రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఈ నెల 2 న విద్యుత్ షాక్తో మృతిచెందాడు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్య ప్రతినిధులు మృతదేహాన్ని అంబులెన్స్లో గురువారం రాత్రి పూలబంద గ్రామానికి తీసుకువచ్చారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి, వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. జరిగిన ఘోరంపై పూలబంద గ్రామస్తులు,మృతుని తల్లిదండ్రులు కామేశ్వరరావు,జులాయిలు వారిని నిలదీశారు.తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి దింపవద్దని అడ్డుకున్నారు. పరిస్థితి చేయి దాటుతోందని భావించిన ఫ్యాక్టరీ యాజమాన్య ప్రతినిధులు ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు కొంత సాయం చేయడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మృతుడు వెంకటరావు చింతపల్లి ప్రభుత్వ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చదువుకుంటూ, కూలి పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉండే కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ సత్యనారాయణ, సీపీఎం మండల నేత ఎంఎం శ్రీను తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
భీమవరం రొయ్యల ఫ్యాక్టరీలో ఘటన
మృతుడు ముంచంగిపుట్టు
మండలం పూలబంద గ్రామ వాసి..
గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం అప్పగించేందుకు యత్నించిన ఫ్యాక్టరీ
యాజమాన్య ప్రతినిధులు
మృతిపై నిలదీసిన పూలబంద గ్రామ గిరిజనులు
కుటుంబానికి న్యాయం చేస్తామన్న హామీతో ఆందోళన విరమణ