-
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకోవచ్చంటే సామాన్యుల కాలు కదలకుండా ఉంటుందా..? మధ్యప్రదేశ్లోని భోపాల్ లోక్సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఇలాంటి ఆఫరే ఇస్తున్నారు. మూడో దశలో భాగంగా ఈ నెల 7న భోపాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆ రోజున ఓటేసే వారి పేర్లనుంచి ప్రతి మూడు గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీయనున్నారు. విజేతలకు వజ్రపు ఉంగరాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర కానుకలిస్తారట! ‘‘నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 10, మధ్యాహ్నం 3, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులిస్తం. పోలింగ్ మర్నాడు మెగా డ్రా తీసి విజేతలకు మరింత పెద్ద బహమతులిస్తాం’’అని జిల్లా ఎన్నికల అధికారి కౌసలేంద్ర విక్రమ్ సింగ్ ప్రకటించారు. ఓటింగ్ పెంచేందుకే.. మధ్యప్రదేశ్లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల్లో పోలింగ్ 2019తో పోలిస్తే సగటున 8.5 శాతం తగ్గింది. 2019లో భోపాల్లో 65.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నందున ఓటర్లు పెద్దగా ఇల్లు కదలకపోవచ్చన్న ఆందోళనలున్నాయి. దీంతో ఎలాగైనా ఓటింగ్ను పెంచాలని ఈసీ కృత నిశ్చయంతో ఉంది. భోపాల్ నియోజకవర్గంలో 3,097 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి బూత్ వద్ద ఒక బీఎల్వో, వలంటీర్ను లక్కీ డ్రా కోసం నియమించారు. ఓటేశాక అక్కడి కూపన్ బుక్లెట్లో పేరు, మొబైల్ నంబర్ రాసి రసీదు తీసుకోవాలి. బహమతుల ఖర్చును కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీలు భరిస్తున్నాయి. మెగా డ్రా కోసం డైమండ్ ఉంగరాలు, ల్యాప్టాప్లు, ఫ్రిజ్లు ఎనిమిది డిన్నర్ సెట్లు, రెండు మొబైల్ ఫోన్లు రెడీగా ఉన్నాయి. దీంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో తొలి ఓటర్ను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
బర్రెలక్క పెళ్లి సందడి : ప్రీ-వెడ్డింగ్ వీడియో హల్చల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సంచలనం రేపిన యూట్యూబర్ బర్రెలక్క పెళ్లి కబురు ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తనకు కాబోయే భర్తను ఇన్స్టగ్రామ్ వేదికగా పరిచయం చేసింది బర్రెలక్క. దీంతో ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. బర్రెలక్క అలియాస్ శిరీష షేర్ చేసిన వీడియో ప్రకారం ఈ వేసవిలోనే బర్రెలక్క మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. వరుడు పేరు వెంకట్. అయితే అతడి వృత్తి ఎక్కడి వాడు అనే వివరాలు మాత్రం ఇంకా సస్పెన్సే. కాగా తెలంగాణంలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష(బర్రెలక్క) నిరుద్యోగ సమస్యలపై ఇన్స్టగ్రామ్లో వీడియోలు చేస్తూ బర్రెలక్కగా పాపులర్ అయింది. భారీగా (781 వేలు) ఫాలోయర్లను సంపాదించుకుంది.ఆదాయాన్ని కూడా బాగానే ఆర్జించింది. గత ఏడాది డిసెంబరులో జరిగిన కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేయడంతో సోషల్ మీడియా స్టార్ కాస్తా పొలిటికల్ స్టార్ అతరించింది. నిరుద్యోగ యువత, పలు నిరుద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలునుంచి భారీ స్పందనతోపాటు, కొంతమంది రాజకీయ నాయకులు ఆమెకు మద్దతినిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, రానున్న లోక్సభ ఎన్నికల్లోనూ పోటీచేస్తానని ప్రకటించిన శిరీష ఇలా అనూహ్యంగా పెళ్లి పీటలెక్కుతుండటం ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేసింది. View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) -
నిజాలతో నిమిత్తం లేని.. 'అదొక అబద్ధాల అట్టహాసం'!
నిజాలతో నిమిత్తం లేకుండా అబద్ధాలను అడ్డగోలుగా వండి వడ్డించడానికి వార్తాపత్రికలు, టీవీ చానళ్లు అలవాటుపడిపోయాయి. వీటికి తోడుగా సోషల్ మీడియా కూడా తయారైంది. సంచలనం రేకెత్తించే అంశం ఏదైనా ఉంటే చాలు, అబద్ధాలు వేడి వేడి పకోడీల కన్నా వేగంగా అమ్ముడుపోతాయి. వస్తువులైనా, సేవలైనా విపణిలో అమ్ముడుపోతేనే విక్రేతలకు సొమ్ములొస్తాయి. వార్తలు కూడా విపణి వస్తువులే! పోటీదారుల కన్నా త్వరగా, ఎక్కువగా వార్తలను అమ్ముకోవడానికి మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు నిస్సిగ్గుగా విలువలను విడిచిపెట్టి, అబద్ధాలను అట్టహాసంగా ప్రచారంలో పెడుతున్నాయి. అలాగని తప్పుడు వార్తల తాషా మార్పా ఇప్పటి పరిణామమేమీ కాదు. వార్తాపత్రికలు ప్రాచుర్యాన్ని సంతరించుకోవడం మొదలుపెట్టిన తొలిరోజుల నుంచే తప్పుడు వార్తల ప్రచారం కూడా మొదలైంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తప్పుడు కథనాల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. పత్రికలు సర్క్యులేషన్ పెంచుకోవడానికి, టీవీ చానళ్లు టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి, సోషల్ మీడియా వేదికలు వీక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి ఎంతటి అబద్ధాలనైనా అలవోకగా ప్రచారం చేస్తున్నాయి. వదంతులను సృష్టించడం, ప్రత్యర్థులపై బురద చల్లడం నిత్యకృత్యంగా సాగిస్తున్నాయి. మూకుమ్మడిగా ఇవి సాగిస్తున్న అబద్ధాల అట్టహాసానికి వాస్తవాలు అట్టడుగున మరుగునపడిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ‘సత్యమేవ జయతే’ అనే మాటను జాతీయ ఆదర్శంగా చెప్పుకున్న మన దేశం అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల ప్రచారంలో ప్రపంచ దేశాలన్నింటినీ తలదన్ని అగ్రస్థానంలో నిలవడమే వర్తమాన విషాదం. అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల సృష్టిని, వ్యాప్తిని అరికట్టడం ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక తప్పుడు వార్తల ప్రచారం మరింత ఉద్ధృతంగా మారింది. అనామకమైన వెబ్సైట్లు తప్పుడు వార్తలను పుంఖాను పుంఖాలుగా గుప్పిస్తున్నాయి. వీటి మూలాలను గుర్తించడం కూడా ప్రభుత్వ, చట్టపరిరక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతోంది. అబద్ధాల అట్టహాసాన్ని అరికట్టడానికి పలు దేశాలు చట్టాలను రూపొందించినా, అనామకమైన వెబ్సైట్లలో తప్పుడు కథనాల సృష్టికర్తలు ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో నిందితులపై చర్యలు తీసుకునే అవకాశాలు దాదాపు గగనంగా ఉంటున్నాయి. అబద్ధాలు నిండిన తప్పుడు కథనాల వల్ల జనాల్లో గందరగోళం, విద్వేషపూరిత వాతావరణం ఏర్పడటమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ కూడా కుదుపులకు లోనవుతోంది. కొన్ని తప్పుడు కథనాల కథా కమామిషు.. ► గత ఏడాది రంజాన్ మాసానికి కొద్దిరోజుల ముందు మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు, వార్తా సంస్థలు ఒక వార్తను ప్రచారంలోకి తెచ్చాయి. రంజాన్ మాసంలో సౌదీ అరేబియా ప్రభుత్వం మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించిందంటూ ఊదరగొట్టాయి. నిజానికి జరిగిందేమిటంటే, సౌదీ ప్రభుత్వం మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై పరిమితి విధించింది. ప్రతి మసీదులోనూ లౌడ్స్పీకర్ల సంఖ్య నాలుగుకు మించరాదని ఆదేశాలు జారీచేసింది. దీనిని వక్రీకరించిన మన జాతీయ మీడియా సంస్థలు సౌదీని చూసి భారత్లోని ముస్లింలు నేర్చుకోవాలంటూ నీతిచంద్రికలు కూడా బోధించాయి. ► ఇటీవలి కాలంలో పలు తప్పుడు కథనాలు దేశవ్యాప్తంగా జనాల్లో గందరగోళం సృష్టించాయి. వాటికి ఉదాహరణగా కొన్నింటిని చెప్పుకుందాం. ‘కోవిడ్–19’ మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపించిన రోజుల్లో పలు పత్రికలు, టీవీ చానళ్లు తప్పుడు కథనాలతో హోరెత్తించాయి. ‘కోవిడ్–19’కు కారణమైన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై అనేక కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. పలు వార్తాపత్రికలు, టీవీ చానళ్లు ఈ కుట్ర సిద్ధాంతాలనే నిజమనిపించేలా పుంఖాను పుంఖాలుగా కథనాలను వండి వార్చాయి. ‘కోవిడ్’ రోజుల్లో ఒక మరాఠీ పత్రిక ఈ అంశంపై ప్రచారంలో ఉన్న కుట్రసిద్ధాంతాన్నే వార్తాకథనంగా ప్రచురించింది. చైనా రూపొందించిన జైవ ఆయుధమే కరోనా వైరస్ అని, చైనా ఇంటెలిజెన్స్ అధికారి దీనిని లీక్ చేశాడనేది ఆ కథనం సారాంశం. కరోనా వైరస్పై మన పత్రికలు ఇంతకంటే దారుణమైన కథనాలను కూడా ప్రచురించాయి. విశ్వసనీయతకు మారుపేరుగా పేరుగాంచిన ఒక ఇంగ్లిష్ పత్రిక 2019లో ఫిలోవైరస్పై జరిగిన అధ్యయనాన్ని కరోనా వైరస్కు ముడిపెడుతూ కథనాన్ని ప్రచురించింది. ఒక టీవీ చానల్ అయితే, టమాటాల్లో తెగులుకు కారణమైన ఒక గుర్తుతెలియని వైరస్ను కరోనా వైరస్కు ముడిపెడుతూ కథనాన్ని ప్రసారం చేసింది. కరోనా రోగులను తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంచే రోజుల్లో దేశవ్యాప్తంగా అత్యంత జనాదరణ గల ఇంగ్లిష్ దినపత్రిక బెంగళూరుకు చెందిన గూగుల్ ఉద్యోగి భార్యకు ‘కోవిడ్’ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని, ఆమె చికిత్సకు నిరాకరించడమే కాకుండా, క్వారంటైన్ నుంచి తప్పించుకుని ఆగ్రాకు పారిపోయిందని ఒక నిరాధారమైన కథనాన్ని ప్రచురించింది. ‘కోవిడ్’ రోజుల్లో ఇలాంటి కథనాలు జనాల్లో భయభ్రాంతులను సృష్టించాయి. ► కేరళలోని మలప్పురం జిల్లా అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల కిందట ఒక ఏనుగు టపాసులు నింపిన అనాసపండు తినడం వల్ల మరణించింది. మరణించిన నాటికి ఆ ఏనుగు గర్భం దాల్చి ఉంది. ఈ సంఘటన జరిగిన వెంటనే పలు జాతీయ చానళ్లు, పత్రికలు సైతం నిజా నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇష్టానుసారం కథనాలను ప్రచారంలోకి తెచ్చాయి. కొందరు స్థానికులు ఉద్దేశపూర్వకంగా టపాసులు నింపిన అనాసపండును తినిపించడం వల్లనే ఆ ఏనుగు మరణించిందంటూ చిలవలు పలవలుగా అల్లిన కథనాలతో ఊదరగొట్టాయి. ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే మలప్పురం జిల్లాలో ఈ కథనాల కారణంగా ముస్లింలపై విద్వేషపూరిత దాడులు జరిగాయి. నిజానికి ఈ ప్రాంతంలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల వాటికి ఎరగా అటవీశాఖ అధికారులు అనాసపండులో టపాసులు నింపి ఉంచారు. ఆకలితో ఉన్న ఏనుగు దానిని తినడం వల్ల మృత్యువాత పడింది. ఈ సంగతిని అటవీశాఖ అధికారులు స్వయంగా వెల్లడించారు. అయితే, ఈ సంఘటనపై కథనాలను ప్రచురించే ముందు లేదా ప్రసారం చేసే ముందు వాటిని ప్రచారంలోకి తెచ్చిన వార్తాసంస్థల ప్రతినిధులెవరూ అటవీశాఖ అధికారులను సంప్రదించిన పాపాన పోలేదు. ► ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారని, ‘నోబెల్’ పరిశీలనలో ఉన్న అభ్యర్థుల్లో మోదీనే అత్యంత బలమైన అభ్యర్థి అని గత ఏడాది నోబెల్ బహుమతుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు మన దేశంలోని పలు జాతీయ టీవీ చానళ్లు, వార్తా పత్రికలు తప్పుడు కథనాలను ప్రచారం చేశాయి. నోబెల్ శాంతి బహుమతి కోసం మోదీ పేరు పరిశీలనలో ఉందని నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ ఆస్లే తోజే చెప్పినట్లు అవి తమ కథనాల్లో నమ్మబలికాయి. నిజానికి ఆస్లే తోజే ఒక సందర్భంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ నాలుగు మాటలు చెప్పారు. అంతే! దీన్నే మన మీడియా సంస్థలు చిలవలు పలవలుగా కథనాలను అల్లి ప్రచారం చేశాయి. చివరకు నోబెల్ కమిటీ డైరెక్టర్ ఓలావ్ ఎన్జోస్తాద్ ఈ కథనాలను ఖండించారు. ► పాకిస్తాన్లో కొందరు దుండగులు మహిళల శవాలను కూడా వదలకుండా వాటిపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారని, అందుకే అక్కడి తల్లిదండ్రులు తమ కుమార్తెల సమాధులకు ఇనుప తలుపులు ఏర్పాటు చేసుకుని, తాళాలు బిగిస్తున్నారని గత ఏడాది మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు ఒక దారుణమైన తప్పుడు కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ కథనాన్ని నమ్మించేందుకు తాళాలు బిగించి ఉన్న ఒక సమాధి ఫొటోను కూడా వాడుకున్నాయి. ఫొటోతో పాటు ఈ కథనాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజానికి ఈ తాళాలు బిగించిన సమాధి ఫొటోకు గాని, పాకిస్తాన్కు గాని ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫొటో మన హైదరాబాద్లోని సంతోష్ నగర్ దరాబ్జంగ్ కాలనీ మస్జిద్ ఏ సలార్ ముల్క్కు అనుబంధంగా ఉన్న శ్మశాన వాటికలోనిది. ఒకరు సమాధి నిర్మించిన చోట శవాన్ని పూడ్చిపెట్టడానికి మరొకరు తవ్వకుండా ఉండేందుకు ఇలా సమాధులకు తాళాలు వేసుకోవడం ఇక్కడ మామూలే! శవాలపై అఘాయిత్యాలకు, సమాధుల తాళాలకు ఎలాంటి సంబంధం లేదు. ► నాలుగేళ్ల కిందట చైనా సరిహద్దుల్లో భారత్ బలగాలకు, చైనా బలగాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఉభయ పక్షాల్లోనూ కొందరు సైనికులు మరణించారు. ఉభయ పక్షాలూ పరస్పరం ప్రత్యర్థి సైనికులను బందీలుగా పట్టుకుని, కొద్ది రోజుల తర్వాత విడిచిపెట్టినట్లు కథనాలు వచ్చాయి. ఇటు భారత్, అటు చైనా ఈ కథనాలను కొట్టిపారేశాయి. ఈ సంఘటన సందర్భంగా మన దేశంలోని కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. ఒక హిందీ చానల్, ఒక ఇంగ్లిష్ చానల్ 1962 నాటి భారత్–చైనా యుద్ధంలో మరణించిన సైనికుల సమాధులు ఉన్న వీడియోను ప్రసారం చేసి, అవి ‘గాల్వన్’ ఘర్షణలో మన సైనికుల చేతిలో మరణించిన చైనా సైనికులవేనంటూ కథనాన్ని వడ్డించాయి. ఈ కథనాలను నిజమేనని నమ్మిన కొందరు ఇదంతా ప్రధాని మోదీ హయాంలో మన సైనికులు సాధించిన ఘనత అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఇది జరిగిన మూడు నెలల్లోనే ఒక హిందీ చానల్, రెండు ఇంగ్లిష్ చానళ్లు తైవాన్ సైన్యం చైనా విమానాన్ని కూల్చేసినట్లు మరో నిరాధాక కథనాన్ని ప్రసారం చేశాయి. తైవాన్ ప్రభుత్వం ఈ కథనాన్ని వెంటనే ఖండించింది. ఇలాంటి కథనాలు మన మీడియా పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చినా, పలు మీడియా సంస్థలు తమ ధోరణిని ఏమాత్రం మార్చుకోకుండా ఎప్పటికప్పుడు తప్పుడు కథనాలను తాజాగా వండి వడ్డిస్తూనే ఉన్నాయి. ► పాకిస్తాన్ పార్లమెంటు 2020 అక్టోబర్ 26న సమావేశమైంది. విపక్ష నేత ఖ్వాజా ఆసిఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఓటింగు జరిపించాలని కోరుతూ సభలోని విపక్ష సభ్యులందరూ ముక్తకంఠంతో ‘ఓటింగ్.. ఓటింగ్’ అని నినాదాలు చేశారు. దేశభక్తి కిక్కిరిసిన మన టీవీ చానెళ్లు కొన్ని ఆ దృశ్యాలను ప్రసారం చేస్తూ, పాక్ విపక్ష సభ్యులు ‘మోడీ.. మోడీ’ అంటూ నినాదాలు చేసినట్లు వార్తల్లో హోరెత్తించాయి. అంతేకాదు, అధికారపక్ష సభ్యులు ‘ఓటింగ్ సబ్ కుఛ్ హోగా, సబ్ కుఛ్ హోగా, సబర్ రఖియే ఆప్’ (ఓటింగ్ అంతా జరుగుతుంది. అంతా జరుగుతుంది. మీరు ఓపిక పట్టండి) అంటూ విపక్షాన్ని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీనికి మన చానళ్లు చెప్పిన డబ్బింగ్ ఏమిటంటే ‘మోదీ కా జో యార్ హై, గద్దార్ హై, గద్దార్ హై’ (మోదీకి మిత్రులైన వారెవరైనా వారు ద్రోహులు). పాక్ సభలో ఆనాడు నిజానికి మోదీకి అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని ఎవరూ ఎలాంటి నినాదాలు చేయలేదు. కనీసం ఆయన పేరును ప్రస్తావించలేదు. అయినా మన అత్యుత్సాహ దేశభక్త చానళ్లు ఈ వార్తను వండి వార్చాయి. పత్రికల ‘పచ్చ’కామెర్లు ► నిజా నిజాలతో నిమిత్తంలేని విషయాలను సంచలనాత్మకంగా మలచి కథనాలను వండి వడ్డించే ప్రక్రియ పంతొమ్మిదో శతాబ్ది ద్వితీయార్ధంలోనే మొదలైంది. అప్పటి నుంచే ‘ఫేక్ న్యూస్’, ‘యెల్లో జర్నలిజం’ అనే మాటలు వాడుకలోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో కొందరు మర్యాదస్తులు ‘ఫేక్ న్యూస్’– తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనే మాటను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అబద్ధాలతో నిండిన కథనాలను తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనకుండా ‘ఇన్ఫర్మేషన్ డిజార్డర్’– సమాచార జాడ్యం, ‘మాల్ ఇన్ఫర్మేషన్’– లోపభూయిష్ట సమాచారం అనడం కొంతవరకు తటస్థంగా ఉంటుందని వారి సూచన. సంచలనం రేకెత్తించే శీర్షికలతో నిజమని నమ్మించేలాంటి అభూత కల్పనలతో కూడిన కథనాలను ప్రచురించే ధోరణి అమెరికా, యూరోప్ దేశాలలో పంతొమ్మిదో శతాబ్ది చివరినాటికి విపరీతంగా ఉండేది. ఈ ధోరణినే ‘యెల్లో జర్నలిజం’ అనేవారు. అప్పట్లో అమెరికాలో విలియమ్ రాండాల్ఫ్ హర్ట్స్ నడిపే ‘న్యూయార్క్ జర్నల్’లో రిచర్డ్ ఔట్కాల్ట్ ‘యెల్లో కిడ్’ కార్టూన్ స్ట్రిప్ వేసేవాడు. ‘న్యూయార్క్ జర్నల్’లో వచ్చేవన్నీ దాదాపుగా సత్యంతో సంబంధంలేని సంచలనాత్మక కథనాలే! ఈ కథనాలపై వ్యాఖ్యలతో మొదటి పేజీలో ‘యెల్లో కిడ్’ కార్టూన్ స్ట్రిప్ ప్రచురించడంతో అవాస్తవాలతో కూడిన సంచలన కథనాలను రాసే ధోరణికి ‘యెల్లో జర్నలిజం’ అనే పేరు వచ్చింది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా విజృంభించిన ఈ రోజుల్లో అసత్య కథనాలకు ఆకాశమే హద్దుగా ఉంటోంది. సత్యం వెలుగులోకి వచ్చేలోగానే అసత్య కథనాలు సమస్త ప్రపంచాన్నీ చుట్టుముట్టి కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సమయంలో మరింత ఉద్ధృతి ► గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి మన దేశంలో ఇదివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో తప్పుడు వార్తలు, అబద్ధపు కథనాల ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. ఈ కథనాలను నిశితంగా పరిశీలిస్తే, ఏ ప్రయోజనాలను ఆశించి వీటిని ప్రచారంలోకి తెస్తున్నారో, వీటి వెనుక ఉన్న శక్తులేమిటో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే! ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయక ముందే కొన్ని పత్రికలు, చానళ్లు ఎన్నికల షెడ్యూల్ ఇదేనంటూ కొన్ని తేదీలను వెల్లడిస్తూ ఒక కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు సాగించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నుంచి పత్రికలు, చానళ్లలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తప్పుడు కథనాలు విపరీతంగా ప్రచారమయ్యాయి. గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ‘వాట్సాప్’ను ప్రధాన ప్రచార ఆయుధంగా యథాశక్తి ఉపయోగించుకున్నాయి. ఈ పరిస్థితి వల్లనే గత ఎన్నికలు భారత్లోని ‘తొలి వాట్సాప్ ఎన్నికలు’గా పేరుమోశాయి. ‘వాట్సాప్’ మాత్రమే కాకుండా ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సాధనాలను కూడా రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా తప్పుడు కథనాలను గుప్పిస్తున్నాయి. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో తప్పుడు కథనాలను తొలగించడానికి సోషల్ మీడియా సంస్థలు నానా తంటాలు పడుతున్నాయి. ఎన్నికలకు ముందు తప్పుడు కథనాలను ప్రచారం చేసే యూజర్లను గుర్తించి, వారి అకౌంట్లను ఫేస్బుక్ తొలగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రోజుకు దాదాపు పదిలక్షల వరకు అకౌంట్లను తొలగించింది. ఎన్నికల సమయంలో తప్పుడు కథనాల ప్రచారానికి సోషల్ మీడియాను సాధనంగా చేసుకోవడం అమెరికాలో మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2016లో జరిగినప్పుడు ‘ఫేస్బుక్’లో విపరీతంగా తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. వీటిని పెద్దసంఖ్యలో జనాలు చూశారు. ‘ప్యూ ఇంటర్నేషనల్’ సర్వే ప్రకారం అమెరికాలో 60 శాతం మంది ప్రధాన స్రవంతి మీడియా కంటే సోషల్ మీడియా కథనాలనే ఎక్కువగా అనుసరిస్తున్నట్లు తేలింది. ఇవి చదవండి: ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!! -
అతిగా ఆలోచిస్తున్నారా?
మిత్ర ఒక ప్రముఖ ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. తన పనితీరుతో రెండేళ్లలోనే టీమ్ లీడర్గా, నాలుగేళ్లలో ప్రాజెక్ట్ మేనేజర్గా ఎదిగాడు. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. ప్రతి ప్రాజెక్ట్ గురించీ ఒకటికి పదిసార్లు ఆలోచించేవాడు. పదే పదే మీటింగ్లు పెట్టేవాడు. కానీ ఏ నిర్ణయమూ తీసుకునేవాడు కాదు. దాంతో ప్రాజెక్టులు ఆలస్యమయ్యేవి. దీంతో మేనేజ్మెంట్ అతని పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయసాగింది. ఆలోచనల నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా మిత్రకు సాద్యం కావడంలేదు. ఆఖరుకు కాఫీ తాగాలా, టీ తాగాలా అనే విషయం మీద కూడా అతిగా ఆలోచించడం అతనికే చిరాకు కలిగిస్తోంది. మిత్రలా అతిగా ఆలోచించడం ఎవరినైనా ఇబ్బంది పెడుతుంది ఎప్పుడో ఒకసారి! ఆ సమయంలో ఎంత ప్రయత్నించినా మనసు చేసే ఆ అతి వాగుడును ఆపలేం. అది అప్పుడప్పుడయితే ఫర్వాలేదు. కానీ అది అలవాటుగా మారితేనే సమస్య. ఆ అతి ఆలోచన.. పనులకు అడ్డుపడుతుంది, మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఇంకా చాలారకాలుగా చికాకు పెడుతుంది. ఎందుకలా ఆలోచిస్తారు? అతిగా ఆలోచించడానికి అనేక కారణాలున్నాయి. అందులో ప్రధానమైనవి.. తప్పులు చేయకూడదనే భయం, అన్నీ పర్ఫెక్ట్గా చేయాలనే తపన, ఆత్మవిశ్వాసం లోపించడం. ఇంకా ఆందోళన (యాంగ్జయిటీ), ఆత్మగౌరవలోపం (లో సెల్ఫ్ ఎస్టీమ్), గతకాలపు గాయాలు కూడా.ప్రాక్టికాలిటీకి అతీతంగా ఉన్నత ప్రమాణాలను సెట్ చేసుకున్నప్పుడు ప్రతి నిర్ణయం ఒత్తిడికి కారణమవుతుంది. అది ఎప్పటికీ అంతంకాని ఆలోచనలతో అనాలసిస్ పెరాలసిస్కు కారణమవుతుంది. మిత్ర చేస్తున్న తప్పు ఇదే. తప్పులు చేయకూడదనే, ఫెయిల్యూర్ కాకూడదనే భయమే మిత్ర ఎక్కువగా ఆలోచించడానికి కారణం. అలాగే ప్రతికూల ఫలితాలు వస్తాయేమోననే ఆందోళనా అతను అతిగా ఆలోచించేలా చేస్తోంది. ఆత్మవిశ్వాసం లోపించించడం, ఆత్మగౌరవం తగ్గడం అతిగా ఆలోచించడానికి ఆజ్యం పోస్తుంది. తన సామర్థ్యం, నిర్ణయాలను సందేహిస్తూ అతిగా ఆలోచించేలా చేస్తాయి. ఆందోళన చెందేటప్పుడు మన చింతలను నియంత్రించుకునేందుకు కొంచెం అతిగా ఆలోచించడం సహజం. కానీ అది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. గతంలో తీవ్రమైన.. బాధాకరమైన అనుభవాలకు లోనైనవారు దానికి సంబంధించిన మానసిక వ్యథను ఎదుర్కోవడానికి అతిగా ఆలోచిస్తుంటారు. నష్టాలు.. కష్టాలు.. ఎవరైనా చెవి పక్కన చేరి నసపెడుతుంటే మీరు భోజనాన్ని ఎంజాయ్ చేయగలరా? అతిగా ఆలోచించడం కూడా అలాంటిదే. అది మనసుకు మాత్రమే పరిమితం కాదు. జీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తుంది. నిరంతరం నెగెటివ్గా ఆలోచించడం మన ఎమోషనల్ వెల్–బీయింగ్ను దెబ్బతీస్తుంది. మన శక్తిని హరించివేస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్కు కారణమవుతుంది. గత సంఘటనలకు సంబంధించిన ఆలోచనలు, విశ్లేషణలు పదే పదే మనసులో పరుగెడుతున్నప్పుడు, భవిష్యత్తు గురించి పదే పదే భయపడుతున్నప్పుడు చేతిలో ఉన్న పనిపై లేదా చదువుపై దృష్టిపెట్టడం కష్టం. దాంతో వాయిదా వేస్తారు. అలా అలా చదువులు రోడ్డున పడతాయి. ఉద్యోగం అటకెక్కుతుంది. వ్యాపారం నష్టాల పాలవుతుంది. మానవ సంబంధాలూ దెబ్బతింటాయి. విముక్తి పొందడం ఇలా.. మిత్రలా అతిగా ఆలోచించేవారు అతనిలాగే బాధపడాల్సిన అవసరం లేదు. ఆలోచనలపై నియంత్రణ సాధించేందుకు చేయగలిగేవి చాలా ఉన్నాయి. అంకితభావంతో ప్రయత్నిస్తే మనసులోని చాటర్ బాక్స్ నోరు మూయించవచ్చు. మితిమీరిన ఆలోచనలు మనసును కమ్మేసినప్పుడు మీరు నెగెటివ్ ట్రాప్లో పడ్డారని గుర్తించండి. ఇదే మీరు వేయాల్సిన తొలి అడుగు. ఆ తర్వాత నెగెటివ్ ఆలోచనలను సవాలు చేయండి. వాటిలో వాస్తవావాస్తవాలను విశ్లేషించండి. ఆలోచిస్తూ ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని గుర్తించి, వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకుని అడుగు వేయండి. మనసును ఇబ్బంది పెడుతున్న పని లేదా చదువులకు దూరంగా ఉండండి. మనసుకు ఆహ్లాదం లేదా విశ్రాంతి కలిగించే కార్యకలాపాలలో పాల్గొనండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ప్రతి రాత్రి 7–8 గంటలనిద్రను లక్ష్యంగా పెట్టుకోండి. మీ ఆందోళనల గురించి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడండి. శ్వాసను లేదా ఆలోచనలను గమనించడం, ధ్యానం ద్వారా మనసును మళ్లించవచ్చు. ఇవన్నీ చేసినా ఆలోచనలు తగ్గకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్టును కలవండి.కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలోని కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ ద్వారా సైకాలజిస్ట్ మీకు సహాయపడగలరు. దీని ద్వారా అతిగా ఆలోచించడానికి ఆజ్యం పోసే కాగ్నిటివ్ డిస్టార్షన్స్ను గుర్తించవచ్చు, వాటిని సవాలు చేసి మరింత వాస్తవిక, సానుకూల ఆలోచనలతో భర్తీ చేయవచ్చు. దీనివల్ల చీకటి నుంచి కాంతికి మారినట్లు మనం విషయాలను మరింత స్పష్టంగా చూడగలం. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
జిమ్ చేస్తున్నా గుండెజబ్బులు.. సిద్దార్థ్ నుంచి స్పందన వరకు.. కారణమేంటి?
సాధారణంగానే సెలబ్రిటీలు స్ట్రిక్ట్ డైట్ను ఫాలో అవుతుంటారు. వయసు పైబడుతున్నా ఇంకా అదే గ్లామర్ను మెయింటైన్ చేస్తున్న వాళ్లు ఎందరో ఉన్నారు. అదే సమయంలో 40ఏళ్లు కూడా నిండకుండానే గుండెపోటుతో ఇటీవల తరచూ సెలబ్రిటీలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. సరైన జీవనశైలి, పౌష్టికాహారం, శారీరక శ్రమ ఉంటే గుండెపోటు నుంచి కశ్చితంగా తప్పించుకోవచ్చు అనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని సెలబ్రిటీల మరణాలను చూస్తే అర్థమవుతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నవయసులోనే ఎంతోమంది సెలబ్రిటీలు గుండెపోటుతో మరణించిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిద్దార్థ్ శుక్లా నుంచి స్పందన వరకు.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలు వీళ్లే.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలు గతంలో హిందీ ‘బిగ్ బాస్’ సీజన్ 13 విజేత, ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ నటుడు సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చనిపోయేనాటికి ఆయన వయస్సు కేవలం 40 ఏళ్లు మాత్రమే. ఆయన నిత్యం వ్యాయాయం చేస్తూ ఆరోగ్యకరమైన డైట్ను ఫాలో అయ్యేవాడు. చనిపోయే ముందురోజు కూడా వర్కవుట్స్ చేశాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్ధార్థ్ దురదృష్టం కొద్దీ ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశాడు. ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ కూడా 2021లో గుండెపోటుతోనే హఠార్మణం చెందిన విషయం తెలిసిందే. జిమ్లో వర్కవుట్స్ చేస్తూ 46 ఏళ్ల వయసులోనే హార్ట్ఎటాక్కు గురయ్యారు. యన సినిమాలకంటే కూడా పునీత్ ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు అలాంటి అభిమానులను సంపాదించుకునేలా చేసింది. పునీత్ మరణ వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నవయసులోనే హార్ట్ఎటాక్ మరో కన్నడ నటుడు చిరంజీవి సర్జా కూడా గుండెపోటుతోనే మరణించారు. ఈయన ప్రముఖ నటుడు అర్జున్కు స్వయానా మేనల్లుడు. 35ఏళ్ల వయస్సులోనే హార్ట్ ఎటాక్తో చిరంజీవి సర్జా కన్నుమూశారు. చిరంజీవి సర్జా 2009లో వాయుపుత్ర చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సుమారు 19 సినిమాల్లో నటించాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందాడు. చదవండి: హీరో భార్య మృతి, చిన్నవయసులోనే గుండెజబ్బులు..ఎందుకిలా? టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న కూడా గుండెపోటుతోనే కన్నుమూశారు. 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అర్థంతరంగా తారకరత్న తనువు చాలించాడు. సుమారు 23రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. పునీత్ కుటుంబంలో మరో విషాదం తాజాగా కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించింది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి గుండెపోటుతో కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే ఆమె స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు. 2021లో పునీత్ కూడా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు వారి కుటుంబం నుంచే స్పందన కూడా మరణించడం శాండల్వుడ్ ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఈనెలలో ఈ జంట తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. కానీ ఆ వేడకకు కొన్నిరోజులు ముందే స్పందన ఇలా హఠాన్మరణం చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. వ్యాయామం చేస్తున్నా ఎందుకీ గుండెజబ్బులు? స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నా చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకొస్తుందనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వేధిస్తుంది. గతంలో 25-30-40 ఏళ్ల వయస్సులో గుండెపోటు అనేది చాలా అరుదుగా ఉండేది. కానీ ఇటీవలికాలంలో ఈ సంఖ్య పెరుగుతోంది. వర్కవుట్స్ చేస్తే మంచిదే కదా అని అతిగా వ్యాయామాలు చేయకూడదు. దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతంది. యువత చాలా ఎక్కువ జిమ్ చేస్తుంటారు. కానీ జిమ్లో చేసే కొన్ని పొరపాట్లు కూడా గుండెపోటుకు కారణమౌతుంటుంది. వ్యాయామం ఎప్పుడూ సాధారణ స్థాయిలో, మితంగా ఉండాలి. పరిమితి దాటితే అనర్థాలు తప్పవు. హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంపై, గుండెపై దుష్ప్రభావం పడుతుంది. గంటల తరబడి వ్యాయామం చేయడం కూడా మంచిది కాదని, వయసు పెరుగుతున్న కొద్దీ డాక్టర్ల సూచనతో వ్యాయామం, డైట్ను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
తప్పక చదవండి
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement