టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ పాతుమ్ నిసాంక ఈ సిరీస్కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కాగా టీమిండియా ఆగష్టు నెలలో
శ్రీలంకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో భారత్ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా... 23 నుంచి కొలంబోలో రెండో మ్యాచ్ జరుగుతుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీలంక వెస్టిండీస్ పర్యటనలో ఉంది. తొలి టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో 217 పరుగులతో ఓటమిపాలైన లంక.. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా ఉంది. రెండో టెస్టులో గెలిచి సిరీస్ 1-1తో సమం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
అయితే, ఓపెనర్ పాతుమ్ నిసాంక మణికట్టు గాయంతో ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స కోసం అతడు యూకేకు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూలై 17 నుంచి మొదలుకానున్న లంక ప్రీమియర్ లీగ్-2026 నుంచి నిసాంక వైదొలిగాడు. ఈ లీగ్ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే భారత్- శ్రీలంక టెస్టు సిరీస్ మొదలుకానుంది.
కాబట్టి పాతుమ్ నిసాంక టీమిండియాతో సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గతేడాది కాలంగా నిసాంక టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 2025లో అతడు సగటు 56తో 393 పరుగులు రాబట్టాడు. ఇప్పటికి మొత్తంగా 33 ఇన్నింగ్స్లో కలిపి 1310 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ శతకాలు ఉన్నాయి.
సొంతగడ్డపై ఆడిన 18 ఇన్నింగ్స్లో అతడు రెండు శతకాల సాయంతో 725 పరుగులు చేయడం విశేషం. ఇలా నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న నిసాంక.. టీమిండియాతో సిరీస్కు దూరం కావడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బలాంటిదే. కాగా విండీస్తో తొలి టెస్టులో గాయం కారణంగా ఇబ్బంది పడిన నిసాంక రెండు ఇన్నింగ్స్లో కలిపి కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు.
ఇదిలా ఉంటే..టీమిండియా చివరిసారి 2017లో శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడింది. అప్పుడు మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 3–0తో వైట్వాష్ చేసింది. ఇక 2008 నుంచి లంక గడ్డపై టెస్టు సిరీస్ ఓడని టీమిండియా... అదే ఆధిపత్యం కొనసాగిస్తుందా చూడాలి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27లో భాగంగా ఇప్పటి వరకు 9 టెస్టులు ఆడిన టీమిండియా... 4 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘డ్రా’తో ప్రస్తుతం పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.