-
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు
హైదరాబాద్, సాక్షి: రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రభాకర్ రావు ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే ఆ నోటీసులకు ప్రభాకర్ నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఫ్యామిలీ ట్రిప్ పేరుతో రాష్ట్రం దాటారు. ఆపై ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ఆయన ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఆరు నెలల విజిటింగ్ వీసా మీద ఆయన అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఇప్పటికే రెండు నెలలు ముగియడంతో.. మరో నాలుగు నెలల తర్వాతే ఆయన ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో సాక్ష్యాలను బట్టి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అంతేకాదు.. ఐటీ చట్టాల ప్రకారం నిందితులపై కేసులకు అనుమతించాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ సైతం వేశారు. మరోవైపు ఇదే న్యాయస్థానంలో నలుగురు నిందితుల (ప్రణీత్రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్రావు) బెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు వెలవడనుంది. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని సీపీ, ఇప్పటికే నిందితుల నుంచి సమాచారం పూర్తిగా దర్యాప్తు అధికారులు సేకరించారని నిందితుల తరఫు న్యాయవాది వాదనలు ఇప్పటికే వినిపించారు. -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన నలుగురు పోలీస్ అధికారులు బెయిల్ పిటిషన్ను విత్ డ్రా చేసుకున్నారు.నలుగురు నిందితులపై పోలీసులు సెక్షన్ 70 ఐటీ యాక్ఠ్ కింద కేసు నమోదు చేయగా.. 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్షపడే సెక్షన్ కావడంతో సెషన్ కోర్టుకు వెళ్లాలన్న నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో నాంపల్లి ఏసీఎంఎం కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. మంగళవారం నాంపల్లి సెషన్ కోర్టులో కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు నిందితులు. కాగా గత ఎన్నికల సందర్భంగా పోలీసు వాహనాల్లో నగదును అక్రమంగా తరలించిన విషయం ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సందర్భంగా వెలుగుచూడటంతో హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. దీనికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కొందరు ప్రజాప్రతినిధులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే సిట్ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువగా జరిగినట్లు తేల్చారు. ఇక ట్యాపింగ్ కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశం పైనా త్వరలో వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్కు ఊరట
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. హిట్ అండ్ రన్ కేసులో అరెస్టై ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న రాహిల్కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు 20 వేల షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే హైకోర్టు ఆదేశాలను పాటించాలని రాహిల్కు సూచించింది. ఈ మేరకు పోలీస్ కస్టడీ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. కాగా ప్రగతి భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో రాహిల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత రాహిల్ దుబాయ్కు పారిపోయాడు. అతడి కోసం గత కొంత కాలం గాలించిన పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో రహేల్ దుబాయ్ నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా(ఏప్రిల్ 8న) పంజాగుట్ట పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం జడ్జీ ముందు హాజరు పరచగా.. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు. -
Phone Tapping: రాధాకిషన్ రావు రిమాండ్ పొడిగింపు
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్రావు రిమాండ్ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. తాజాగా ఈ కేసు వ్యవహారంలో టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు రిమాండ్ను కోర్టు పొడిగించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 12 వరకు రిమాండ్ విధించిన అనంతరం ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్రావుకు సంబంధించి వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇక, విచారణ సందర్భంగా తనను జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని రాధాకిషన్రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైలు సూపరింటెండెంట్ను సైతం కలవనీయడం లేదని తెలిపారు. దీంతో, పోలీసులను న్యాయమూర్తి పిలిపించి ప్రశ్నించారు. లైబ్రరీలోకి అనుమతించడంతో పాటు సూపరింటెండెంట్ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం, న్యాయస్థానం ఈ నెల 12 వరకు రిమాండ్ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈ కేసుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం స్పెషల్ పీపీను ప్రభుత్వం నియమించనుంది. పోలీసులు నెల రోజులుగా ఫోన్ టాపింగ్ కేసు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అధికారులను అరెస్టు చేశారు. మాజీ డీసీపీ రాధా కిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్రావులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. హై ప్రొఫైల్ కేసు కావడంతో ప్రత్యేక పీపీని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు ఏడు రోజుల కస్టడీ
సాక్షి, హైదరాబాద్: ఫోన్ టాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధా కిషన్ రావును తమ కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై బుధవారం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఈమేరకు రాధాకిషన్రావును పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే రాధా కిషన్రావును ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు పోలీసులు ప్రశ్నించానున్నారు. దీంతో గురువారం చంచలగూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు A4గా ఉన్నారు. చదవండి: రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు -
ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలకు రిమాండ్
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్టైన అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వాళ్లిద్దరినీ చెంచల్గూడ జైలుకు తరలించారు. అంతకు ముందు.. వాళ్లిద్దరి కస్టడీ ముగియడంతో తొలుత వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా.. ఈ నెల 6వ తేదీ దాకా రిమాండ్ విధించింది కోర్టు. ఇక ఈ ఇద్దరు నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టిన అధికారులు.. మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోపక్క.. మాజీ డీసీపీ రాధా కిషన్రావు రిమాండ్ రిపోర్టులో మరో అధికారి వేణుగోపాలరావును ప్రస్తావించారు పోలీసులు. దీంతో.. ఆయన్ని సైతం అరెస్ట్ చేస్తారా? లేదంటే నోటీసులిచ్చి కేవలం ప్రశ్నిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. రాధాకిషన్రావును పదిరోజుల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు.. ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు వేసిన బెయిల్ పిటిషన్పైనా ఇదే కోర్టులో విచారణకు రానుంది. ఇంకోపక్క.. తీగ లాగితే డొంక కదిలినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందుతుండడం గమనార్హం. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేర్లు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేరు వచ్చింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB)లో పని చేసిన మరో సీనియర్ అధికారిని విచారణ జరిపేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఎస్ఐబీలో సుదీర్ఘకాలం పని చేసిన ఆ అధికారికి... ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ1 అయిన ప్రభాకర్రావుకు అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది. సీనియర్ అధికారితో పాటు ఓ ఇన్స్పెక్టర్కు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని ఈ కేసు దర్యాప్తు చేపట్టిన స్పెషల్ టీం భావిస్తోంది. ఇప్పటికే కస్టడీలో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఇవాళ నాలుగో రోజు విచారణ చేపట్టారు. అదే సమయంలో.. ప్రభాకర్ రావు పోలీసులు ఎదుట విచారణ హాజరయ్యే అవకాశాలున్నాయనే చర్చా నడుస్తోంది. ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న టి.ప్రభాకర్రావు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారా? ఇప్పటి వరకు అరెస్టయిన పోలీసు అధికారులు.. దర్యాప్తులో ‘‘ప్రభాకర్రావు చెప్పినట్లు చేశాం’’ అంటూ వాంగ్మూలం ఇవ్వడంతో అన్ని వేళ్లు ఎస్ఐబీ మాజీ చీఫ్ వైపే చూపుతున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఇంటర్పోల్ దాకా వెళ్లకముందే.. ప్రభాకర్రావు లొంగిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి ఆయన తిరుగు ప్రయాణమయారని.. విచారణ బృందం ఎదుట హాజరు కావొచ్చని సమాచారం. ఒకవేళ ప్రభాకర్రావు అప్రూవర్గా మారితే గనుక ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశాలు లేకపోలేదు. రాధాకిషన్ను 10 రోజుల కస్టడీ కోరుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టును అశ్రయించారు. మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావును పదిరోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు రాధాకిషన్ను నోటీసులు జారీ చేసింది. అయితే కౌంటర్ దాఖలు చేస్తామని రాధాకిషన్ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో మధ్యాహ్నాం ఈ పిటిషన్పై వాదనలు జరిగే అవకాశం ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్పై ఉత్కంఠ అదే సమయంలో ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదుపై వాదనలు జరగాల్సి ఉంది. మరోపక్క ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు కోసం పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఇవాళ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బెయిల్ కోసం ప్రణీత్రావు ఫోన ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్రావు బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టనుంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏసీబీ లిస్టులో అధికారుల చిట్టా
సాక్షి, హైదరాబాద్: ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగా అక్రమ ఆస్తులు కూడా బెట్టుకున్నట్లు సమాచారం. పలువురు అధికారులపై ఏసీబీ దృష్టి సారించింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు, హవాలా ముఠాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. వారి నుంచి వచ్చిన డబ్బుతో అధికారులు భారీగా సంపాదించారు. విలాసవంతమైన విల్లాలో అధికారులు నివాసం ఉంటున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ లిస్టులో ఫోన్ ట్యాపింగ్ పోలీసు అధికారులు చిట్టా, వారి ఆర్థిక పరిస్థితిని ఏసీబీ విశ్లేషిస్తోంది. ఆదాయానికికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకకు చెందిన రాజకీయ నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు సమాచారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ను పోలీసులు దాఖలు చేశారు. భుజంగరావు, తిరుపతన్న ప్రణీత్ రావు ముగ్గురిని కస్టడీ కొడుతూ పిటిషన్ వేశారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో నిందితులు ఉన్నారు. ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. బడా వ్యాపారవేత్తలను, హవాలా దందా చేసే వారిని బెదిరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రణీత్ రావు టీంలో పనిచేసిన అధికారులను నేడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిచి దర్యాప్తు బృందం విచారించనుంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించించారు. ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, ఈరోజు ఉదయమే వారిద్దరికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో, పంజాగుట్ట పోలీసులు వీరిని చంచల్గూడా జైలుకు తరలిస్తున్నారు. ఇక, విచ్చలవిడిగా ఫోన్ట్యాపింగ్లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్తోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు వారిని అరెస్ట్ చేశారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుకు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ లండన్, శ్రవణ్రావు నైజిరియాలో ఉన్నట్టు సమాచారం. వీరితో పాటే విచారణకు రావాలని గతంలో ఎస్ఐబీలో పనిచేసిన తొమ్మిది మందికి నోటీసులిచ్చారు. ప్రణీత్రావు ఫోన్ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సిట్ బృందం భావిస్తోంది. -
Phone Tapping Case: కీలక విషయాలు వెల్లడించిన ప్రణీత్రావు
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) ప్రణీత్ రావు అరెస్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్లు చేశానని, ఆ సమాచారాన్ని ధ్వంసం కూడా చేశానని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని మరోసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని స్పెషల్ టీం భావిస్తోంది. ‘‘అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను ట్యాప్ చేశా. పూర్తి సమాచారాన్ని అప్పటి ఎస్పీ స్థాయి అధికారుల నుంచి ఎస్ఐబీ చీఫ్ దాకా ఆ సమాచారం అందజేశాను. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశా. చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధుల వాట్సాప్ ఛాటింగ్లపై నిఘా పెట్టాను.. .. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అధికారులకు ఇచ్చాను. అప్పటి ఎస్ఐబీ మాజీ చీఫ్ ఆదేశాల మేరకు ఆ సమాచారం మొత్తం ధ్వంసం చేశా. సెల్ఫోన్లు, హార్డ్ డిస్కులతో పాటు వేల సంఖ్యలో పత్రాలు ధ్వంసం చేశాను’’ అని ప్రణీత్రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ మీద చంచల్గూడ జైల్లో ఉన్న ప్రణీత్రావును మరోసారి విచారించేందుకు ప్రత్యేక టీం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ఆయన్ని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో కోరినట్లు తెలుస్తోంది. ఇక ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో.. ఎస్ఐబీ మాజీ చీఫ్ తో పాటు పలువురు ఎస్పీ, డీఎస్పీలను విచారించేందుకు సిద్ధమవుతోంది. -
శివ బాలకృష్ణ సోదరుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్కు ఏసీబీ కోర్టులో చుక్కెదురు అయ్యింది. నవీన్ కుమార్ బెయిల్ పిటిషన్ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. శివ బాలకృష్ణ కేసులో ఆయన సోదరుడు నవీన్ కుమార్ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో మూడు రోజుల క్రితం శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ను కూడా నాంపల్లి ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రూ.250 కోట్ల విలువైన అక్రమాస్తులను ఏబీసీ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఆయన బినామీలను కూడా ఏసీబీ అదికారులు విచారించారు. మరోవైపు శివ బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి లోతుగా ఆరాతీస్తున్నారు. ఆస్తులు, భూములు ఇంకా ఏమైనా ఉన్నాయా? అని సమాచారం సేకరిస్తున్నారు. చదవండి: అసెంబ్లీలో కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్ -
శివబాలకృష్ణకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు చుక్కెదురైంది. శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. శివబాలకృష్ణ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రూ.250 కోట్ల విలువైన అక్రమాస్తులను ఏబీసీ గుర్తించింది. మరోవైపు శివబాలకృష్ణ వెనుక ఉన్న అధికారుల పాత్ర పై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించామని, ఆయన సమీప బంధువులు, స్నేహితులు, సహ ఉద్యోగుల ఇళ్లలో మొత్తంగా 17 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారని ఏసీబీ అధికారులు చెప్పారు. ఇవీ ఆస్తులు... శివబాలకృష్ణ ఇంట్లో రూ. 84.60 లక్షల నగదు, 2 కేజీలు బంగారం, 5.5 కేజీల వెండి, 32 లక్షలు విలువ చేసే వాచ్లు, 3 విల్లాలు, 7 ఫ్లాట్స్తోపాటు కొడ కండ్ల, జనగామ, నాగర్కర్నూలు, సిద్ధిపేట, యా దాద్రి, పాలకుర్తి, జఫర్గఢ్ ప్రాంతాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించామని సుదీంద్ర చెప్పారు. భూమి ఆయన పేరుతోపాటు కొందరు బినామీల పేరుపై ఉందని, 29 ఓపెన్ప్లాట్లు ఉన్నాయని, రంగారెడ్డిజిల్లాలోనే 12, వైజాగ్, విజయవా డ, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా ఖాళీ స్థలాలు రిజి స్టర్ అయ్యాయన్నారు. అన్నింటి విలువ రూ.250 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సోదాలు ఇంకో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయని, శివబాలకృష్ణ పై కేసు నమోదు చేసి, గురువారం న్యాయస్థా నం ముందు హాజరుపరుస్తామన్నారు. ‘ఇంకా కొన్ని విషయాలు ఆయన చెప్పలేదు.. మా విచారణకు సహకరించలేదు. కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.’అని సుదీంద్ర తెలిపారు. ఇది చదవండి: HMDA Siva Balakrishna Case: శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్.. ఐఏఎస్ అరవింద్.. -
శివబాలకృష్ణ అక్రమాస్తులు వెయ్యి కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ బుధవారం ముగిసింది. దీంతో ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. మరో 14 రోజులు రిమాండ్ను పొడగించింది. అయితే ఎనిమిది రోజుల విచారణలో శివబాలకృష్ణ చెప్పిన విషయాలు.. బయటపడుతున్న ఆస్తులు.. వాటిని కూడబెట్టేందుకు ఆయన అనుసరించిన విధానాల్ని చూసి ఏసీబీ అధికారులే నిర్ఘాంతపోతున్నారు. శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైనే ఉండొచ్చని ఏసీబీ భావిస్తోంది. దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడి అవుతుండడంతో.. మరిన్ని వివరాలు రాబట్టేందుకు శివబాలకృష్ణ రిమాండ్కు పొడగించాలని కోర్టును కోరింది. దీంతో శివబాలకృష్ణ రిమాండ్ను 14 రోజుల పాటు కోర్టు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పటివరకు రూ.250 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ పేరుతో 214 ఎకరాలు భూమి ఉన్నట్లు ఏసీబీ జాయింగ్ డైరెక్టర్ వెల్లడించారు. తెలంగాణతోపాటు విశాఖపట్నంలో కూడా శివబాలకృష్ణకు 29 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా శివబాలకృష్ణకు ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు సంబంధించి హెచ్ఎండీఏలో పలువురు అధికారులు పాత్రపై కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చప్పారు. పలు ఫైల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. లాకర్స్లో ఉన్న బంగారం, ఆస్తులకు సంబంధించి పలు కీలక పత్రాలను సీజ్ చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
HMDA: ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టు మంగళవారం విచారణ జరిపింది. 10 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా, 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. బినామీల విచారణ, ఆస్తులపై దర్యాప్తు చేయాలన్న ఏసీబీ.. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది. అధికారులను సైతం ఏసీబీ విచారించనుంది. హెచ్ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఆరా తీయనుంది. హైరేస్ బిల్డింగ్ అనుమతుల్లో అక్రమాలపై విచారణ చేపట్టనుంది. కోర్టులను సైతం తప్పుదోవ పట్టించి వివాదస్పద భూముల్లో అనుమతులు ఇచ్చినట్లు ఏసీబీకి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పుప్పాలగూడ 447సర్వే నంబర్లో అనుమతులపై సూర్య ప్రకాష్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రూ.100 కోట్ల విలువైన బాలకృష్ణ అక్రమ ఆస్తులను గుర్తించారు. బాలకృష్ణను కస్టడీకి తీసుకుని విచారిస్తే అక్రమ ఆస్తులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: హెచ్ఎండీఏలో ‘ఏసీబీ’ ప్రకంపనలు -
వెంకటేష్ కుటుంబంపై కేసు నమోదు...నాంపల్లి కోర్టు ఆదేశం
-
హీరో వెంకటేష్, రానాలపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, రానాలకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దగ్గుబాటి వెంకటేష్, సురేష్, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని పోలీసులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కూల్చివేతకు పాల్పడ్డారని నంద కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని పేర్కొన్నారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్ను ధ్వంసం చేశారని అన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో వెంకటేష్, ఇతర కుటుంబ సభ్యులపై IPC 448, 452,380, 506,120b కింద కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: 24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై పిటిషన్లు.. కేటీఆర్, హరీశ్ విజయంపై కూడా -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు: నిందితులకు షాక్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ కేసులో 7 మంది నిందితులకు ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. నాంపల్లి కోర్టు శుక్రవారం ముద్దాయిందరినీ ఎగ్జామినేషన్ కొరకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను నిందితులు A17, 18, 23, 25, 27, 28, A37 బేఖాతరు చేస్తూ కోర్టుకు హాజరుకాలేదు. విచారణకు గైర్హాజరైన నిందితులు.. గైర్హాజరు పిటిషన్ను దాఖలు చేశారు. అయితే నిందితులుకు అనుమతి నిరాకరిస్తూ వారిపై నాంపల్లి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: మాది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం: సీఎం రేవంత్ -
బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్కు బెయిల్
బిగ్బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్కు ఊరట లభించింది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రశాంత్తోపాటు అతని సోదరుడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా రూ. 15 వేల చొప్పున రెండు షూరిటీలు కాగా బిగ్ బాస్ టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షో విన్నర్గా నిలిచిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఆయన అభిమానులు అత్యుత్సాహంతో కార్లు, బస్సుల అద్దాలు పగులగొట్టారు. దీంతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్ను చేర్చారు. డిసెంబర్ 20న పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రశాంత్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. నేడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. బిగ్బాస్ విన్నర్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చదవండి: అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక -
ప్రవల్లిక కేసు: సరైన ఆధారాలు లేవు.. శివరామ్కు బెయిల్
సాక్షి, హైదరాబాద్: ప్రవల్లిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్ రాథోడ్కు నాంపల్లి కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ ఇస్తూ ఆదేశాలిచ్చింది. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు.. ప్రవల్లిక ఆత్మహత్య కేసులో శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్ మంజూరు చేసింది. మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరామ్ రాథోడ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా చిక్కడపల్లి పోలీసులు ఇతడి కోసం ముమ్మరంగా గాలించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక టీఎస్పీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం కావడానికి నగరానికి వచ్చి అశోక్నగర్లోని బృందావన్ హాస్టల్లో ఉంటోంది. గతవారం ఆమె హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ప్రవల్లిక రూమ్లో సోదా చేసిన అధికారులకు సూసైడ్ నోట్ లభించింది. ఆమె సెల్ఫోన్ను సీజ్ చేసి అందులోని అంశాలను విశ్లేషించగా ఆత్మహత్యకు గల కారణాలు బయటపడ్డాయి. మహబూబ్నగర్ జిల్లా కోస్గి ప్రాంతానికి చెందిన శివరామ్ రాథోడ్ అనే యువకుడితో వాట్సాప్లో చాటింగ్ చేసినట్లు గుర్తించారు. అతడికి ఆమె రాసిన ఉత్తరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించిన పోలీసులు శివరామ్ రాథోడ్కు మరో యువతితో వివాహం నిశ్చయం కావడంతో ప్రవల్లిక తాను మోసపోయానని కుంగిపోయినట్లు తేల్చారు. ఈ మేరకు ప్రవల్లిక తన సోదరుడు ప్రణయ్కి వాట్సాప్ సందేశాల ద్వారా తెలిపింది. సోమవారం నగరానికి వచ్చిన ప్రణయ్ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడమేకాకుండా సందేశాల ప్రింటవుట్స్ సైతం అందించారు. వీటి ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును మార్చారు. ఐసీపీలోని 417, 420, 306 సెక్షన్లు జోడిస్తూ శివరామ్ను నిందితుడిగా చేర్చారు. అప్పటి నుంచి గాలిస్తున్న ప్రత్యేక బృందాలకు గురువారం మహారాష్ట్రలో అతడు చిక్కి నట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే శివరామ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. కోర్టు అనుమతించడంతో లొంగిపోయాడు. అయితే, ఈ కేసుపై శనివారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్ మంజూరు చేసింది. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య -
ప్రవల్లిక ఆత్మహత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నాంపల్లి కోర్టులో లొంగిపోయిన శివరాం రాథోడ్.. సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు. శివరాం పిటిషన్కు నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈనెల 13న రాత్రి హైదరాబాద్లోని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ప్రియుడు మోసం చేసిన కారణంగానే మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడ్డట్టు నిర్థారించిన హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహబూబ్నగర్ జిల్లా వాసి శివరామ్ చేతిలో మోసపోయా నన్న విషయాన్ని ప్రవళిక తన సోదరుడు ప్రణయ్కి వాట్సాప్ సందేశాల ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రణయ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు, శివరాం ఆచూకీ తెలపాలని అతడి కుటుంబ సభ్యులు తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. తమను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. శివరాం ఆచూకీ గురించి వివరాలు తెలపాలని పోలీసు స్టేషన్కు పిలిపించి మానసికంగా మనోవేదనకు గురిచేస్తున్నారని అతడి కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శివరాం ఆచూకీ తెలపకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించినట్టు తెలిపారు. శివరాం ఆచూకీ తెలుసుకోవాల్సిన పోలీసులు.. తమను ఇబ్బందులకు గురిచేసి ఎక్కడున్నాడని అడగడం దారుణమన్నారు. అతడి గురించి ఏ విషయం తెలిసినా పోలీసులు వెంటనే చెబుతామన్ని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చిక్కడపల్లి పోలీసుల నుంచి ప్రాణభయం ఉందని, వారికి రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని శివరాం బంధువు సంతోష్ రాథోడ్ వేడుకున్నారు. చదవండి: మెట్రోలో కోతి చేష్టలు -
నాంపల్లి కోర్టు బిల్డింగ్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి మహ్మద్ సలీముద్దీన్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశా. మెహదీపట్నం ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన డుసలీముద్దీన్ గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. నేడు(బుధవారం) కోర్టులో పేషీ ఉండటంతో నాంపల్లి కోర్టులో హాజరయ్యాడు. ఈ క్రమంలో కోర్టు భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన సలీముద్దీన్ను ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు పోలీసులు. ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. విచారణకు హాజరైన 37 మంది నిందితులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసుపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. కోర్టులో విచారణకు 37 మంది నిందితులు హాజరయ్యారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, రేణుక, డాఖ్యానాయక్, రాజేశ్వర్ తో పాటు మిగతా నిందితుల హాజరయ్యారు. గత నెలలో ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేసిన సిట్ అధికారులు.. ప్రాథమిక అభియోగ పత్రంలో 37 మందినీ నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటివరకు 105 మందిని సిట్ అరెస్ట్ చేసింది. త్వరలో సిట్ అధికారులు త్వరలో మిగతా నిందితులతో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. కాగా పేపర్ లీక్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ మినహా ఇప్పటికే మిగతా నిందితులందరికీ నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా ఇక పేపర్ లీకేజ్ కేసులో అసలు సూత్రధారులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిగా సిట్ తేల్చింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మి కంప్యూటర్ నుంచి ప్రవీణ్ పేపర్ను తీసుకొని ఆమె డైరీలో ఉన్న సాస్వర్డ్, యూజర్నేమ్ ద్వారా పేపర్ లీక్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. చదవండి: పాఠశాల విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్న్యూస్ -
మాదాపూర్ డ్రగ్స్ కేసు: నిందితుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితులను నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిన్వివగా, బాలాజీ, వెంకట రత్నారెడ్డి, మురళిలను గుడిమల్కాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 18 మందికి మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లు ఇప్పటికే గుర్తించిన పోలీసులు.. సినీ రంగానికి చెందిన పలువురికి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించనున్నారు. చదవండి: పెరుగు అడిగితే చంపేశారు! కాగా, టీఎస్–నాబ్ అధికారులకు గుడిమల్కాపూర్లో దొరికిన డ్రగ్స్ తీగ లాగితే... మాదాపూర్ విఠల్నగర్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో జరుగుతున్న రేవ్ పార్టీ డొంక కదిలింది. ఈ వ్యవహారంలో ఓ ఫిల్మ్ ఫైనాన్షియర్ సహా ముగ్గురిని పట్టుకున్న సంగతి తెలిసిందే. నెల్లూరుకు చెందిన బి.బాలాజీ ఇండియన్ నేవీలో పనిచేస్తుండగా, కంటికి తీవ్రమైన గాయమైంది. మెడికల్లీ అన్ఫిట్ కావడంతో నేవీ నుంచి బయటకు వచ్చి వ్యాపారిగా మారాడు. తరచూ హైదరాబాద్కు వచ్చి వెళ్లే బాలాజీ తన స్నేహితులతో కలిసి మాదాపూర్ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్లో జరిగే రేవ్ పార్టీలకు హాజరయ్యేవాడు. ఇలా హైదరాబాద్తోపాటు బెంగుళూరులో ఉన్న డ్రగ్ పెడ్లర్స్తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆపై రేవ్ పార్టీలు ఏర్పాటు చేయడం బాలాజీకి వ్యాపకంగా మారింది. స్నేహితులతో పాటు పరిచయస్తుల కోసం నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని ఫామ్హౌస్లు, గెస్ట్ హౌస్ల్లో వీటిని నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న నైజీరియన్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని, వారి నుంచి మాదకద్రవ్యాలు ఖరీదు చేసేవాడు. ఆపై పార్టీలు నిర్వహిస్తూ, విక్రయాలు ప్రారంభించాడు. బాలాజీ ఖాతాదారుల్లో సినీరంగానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. గుంటూరులోని నెహ్రూనగర్కు చెందిన వెంకట రత్నారెడ్డి గతంలో జూబ్లీహిల్స్ పరిధిలో ఓ గెస్ట్హౌస్ లీజుకు తీసుకున్నాడు. ఇందులో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో అప్పట్లో పోలీసులు దాడి చేయగా, నిర్వాహకులు పరారయ్యారు. ఈ కేసులో చిక్కిన వెంకట రత్నారెడ్డి ఆపై అమెరికా వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగిన వచ్చిన తర్వాత తన సన్నిహితులకు సంబంధించిన ప్రొడక్షన్ సంస్థ నిర్వహిస్తూ ఫిల్మ్ ఫైనాన్షియర్గా మారాడు. డమరుకం, కిక్, బిజినెస్మ్యాన్, లవ్లీ, ఆటోనగర్ సూర్య వంటి చిత్రాలకు ఫైనాన్స్ చేశాడు. ఈ క్రమంలోనే రేవ్ పార్టీలకు వెళ్లడం అలవాటైంది. రేవ్ పార్టీలు నిర్వహించే వారికి ఫైనాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా బాలాజీతో కూడా పరిచయం ఏర్పడింది. బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్లతో పాటు విశాఖపట్నానికి చెందిన మరో వ్యక్తి నుంచి డ్రగ్స్ ఖరీదు చేసిన బాలాజీ వీటిలో కొన్నింటిని వెంకట రత్నారెడ్డికి అందించాడు. ఈ మాదకద్రవ్యాలతో మాదాపూర్లోని అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. రేవ్ పార్టీకి హాజరుకావడానికి మరికొన్ని మాదకద్రవ్యాలను తీసుకొని వస్తున్న బాలాజీ కదలికలపై టీఎస్–నాబ్కు సమాచారం అందింది. ఏసీపీ కె.నర్సింగ్రావు, ఇన్స్పెక్టర్ పి.రాజేష్లతో కూడిన బృందం వలపన్ని పట్టుకుంది. బాలాజీ వద్ద నుంచి కొన్ని డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ప్రశ్నించగా, సర్వీస్ ఫ్లాట్ విషయం చెప్పా డు. దీంతో పోలీసులు ఆ ఫ్లాట్ పై దాడి చేశారు. అక్కడ వెంకట రత్నారెడ్డితో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగా పనిచేస్తున్న డి.మురళి పట్టుబడ్డాడు. మద్యంమత్తులో మ్యూజిక్ పెట్టుకుని చిందులు వేస్తున్న వీరు డైనింగ్ టేబుల్పై ప్లేట్లో ఉంచిన కొకైన్ను కరెన్సీ నోటు సాయంతో ముక్కులోకి పీలుస్తున్నారు. వీరి వద్ద టీఎస్–నాబ్ బృందం 2.8 గ్రాముల కొకైన్, ఆరు ఎల్ఎస్డీ బోల్ట్స్, 25ఎక్స్టసీ పిల్స్, రెండు ప్యాకెట్ల గాంజా, రూ.72,500 నగదు, రెండు కార్లు, ఐదుసెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.32.89 లక్షలుగా నిర్థారించారు. డ్రగ్ పెడ్లర్గా మారిన బాలాజీ కస్టమర్లలో సినీరంగానికి చెందిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు కొందరు నటీనటులు ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీళ్లందరితో బాలాజీ సోషల్మీడియా యాప్ స్నాప్చాట్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. సందేశాలు, కాల్స్ అన్నీ దీని ద్వారానే చేసేవాడు. ఇందులో వారివారి కాంటాక్ట్స్ ర్యాంబో, కిమ్స్, కింగ్, క్యాచీ, సూపర్ వంటి కోడ్ నేమ్స్తో ఉన్నాయి. ఆ కాంటాక్ట్స్లో ఫోన్నంబర్లు సహా ఇతర వివరాలు కనిపించకపోవడంతో వారిని గుర్తించడానికి లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రాథమిక వివరాలను బట్టి 18 మందిని కస్టమర్లుగా గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. వెంకట రత్నారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకొచ్చాడు. వీళ్లిద్దరూ సైతం ఆ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్లో పోలీసులకు చిక్కారు. -
మంత్రి శ్రీనివాస్గౌడ్పై కేసు.. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు చర్యలు
సాక్షి, మహబూబ్నగర్/హైదరాబాద్: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు మరో పదిమందిపై కేసులు నమోదయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఫిడవిట్ ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలలోగా కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మహబూబ్నగర్ టూటౌన్ పోలీస్స్టేషన్లో పోలీసులు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. నేడు రెండవ శనివారం, 13న ఆదివారం సెలవు ఉండటంతో 14న కోర్టుకు కేసుకు సంబంధించిన నివేదిక ఇవ్వడానికి పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం. చదవండి: కారిడార్ వార్!... ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో జాప్యం ఇదీ కేసు.. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్పై దాఖలైన కేసులో మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు రాష్ట్ర, కేంద్ర రిటర్నింగ్ అధికారులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 2018, డిసెంబర్లో ఎన్నికలు జరిగిన సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ను శ్రీనివాస్గౌడ్ ట్యాంపరింగ్ చేశారని, అయినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొంటూ మహబూబ్నగర్కు చెందిన రాఘవేంద్రరాజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో దావా వేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి, మంత్రి సహా సదరు అధికారులపై కేసు నమోదు చేయాలని తీర్పునిచ్చారు. కేసు నమోదైంది వీరిపైనే.. మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు అప్పటి అధికారులు, ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండర్ సెక్రటేరియల్ రాజీవ్కుమార్, సంజయ్కుమార్, రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్గోయల్, సెక్రెటరీ, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, కలెక్టర్ వెంకట్రావు, డిప్యూటీ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీఓ శ్రీనివాసులు, టెక్నికల్ అధికారి వెంకటే‹Ùగౌడ్, విశ్రాంత ఉద్యోగి సుధాకర్, న్యాయవాది రాజేంద్ర ప్రసాద్పై కేసు నమోదైనట్టు సమాచారం.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
Advertisement