లోక్సభ పోరు కోసం రెండు జాబితాల్ని విడుదల చేసిన బీజేపీ.. పాతవాళ్లలో కొందర్ని తప్పించి, కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తున్నది చూస్తున్నాం. తొలి జాబితాలో సీటు దక్కినప్పటికీ తాను పోటీ చేయలేనంటూ మరుసటిరోజే ప్రకటించి ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారారు భోజ్పుర్ నటుడు కమ్ సింగర్ పవన్ సింగ్. అయితే..ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నారు.
ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధమేనంటూ ప్రకటించారు. ‘‘నా తల్లికి ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నా. ఇది నా సమాజం కోసం.. నా ప్రజల కోసం. ఇందుకు అందరి సహకారం, ఆశీస్సులు నాకు కావాలి’’ అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన.
मैंअपने समाज जनता जनार्दन और माँ से किया हुआ वादा पूरा करने के लिए चुनाव लडूँगा
आप सभी का आशीर्वाद एवं सहयोग अपेक्षित है
जय माता दी— Pawan Singh (@PawanSingh909) March 13, 2024
బీజేపీ ఫస్ట్లిస్ట్లో పశ్చిమ బెంగాల్లోని ఆసన్సోల్ టికెట్ను పవన్కు కేటాయించింది కమల అధిష్టానం. ఆ సమయంలో.. ‘బీజేపీ అగ్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాపై విశ్వాసం ఉంచి ఆసన్సోల్ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి పోటీ చేయలేను’ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పవన్ సింగ్ తెలియజేశాడు. అయితే ఏం జరిగిందో ఏమోగానీ.. ఇప్పుడు పోటీ చేస్తానంటూ ప్రకటించాడు. మరి ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారా?.. వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఆసన్సోల్ టికెట్ను బీజేపీ పవన్కు ప్రకటించగానే.. తృణమూల్ కాంగ్రెస్ విమర్శలతో విరుచుకుపడింది. మహిళలను కించపరుస్తూ.. అసహ్యమైన రీతిలో పాటలు పాడి, నటించే వ్యక్తిని బీజేపీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెడుతోందంటూ మండిపడింది. ఇక.. ఆసన్సోల్ నుంచి టీఎంసీ బాలీవుడ్ సీనియర్ నటుడు, పొలిటీషియన్ శతృఘ్నసిన్హాను బరిలో దించింది.