సాక్షి, లక్నో: ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ మేనేజర్ అభినవ్ సింఘాల్ను కిడ్నాప్ చేసి, దోపిడీ, దుర్వినియోగం, బెదిరింపులకు పాల్పడిన కేసులో మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్, అతని అనుచరుడు సంతోష్ విక్రమ్లను స్థానిక కోర్టు దోషులుగా నిర్ధారించింది. అడిషనల్ సెషన్స్ జడ్జి శరద్ కుమార్ త్రిపాఠి ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఈ కేసులో ధనంజయ్ సింగ్, అతని సహచరుడిని జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించారు.
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. జౌన్పూర్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది (క్రిమినల్) సతీష్ పాండే మాట్లాడుతూ, ముజఫర్నగర్ నివాసి అభినవ్ సింఘాల్ ధనంజయ్ సింగ్, అతని సహచరుడు విక్రమ్పై 2020 మే 10న లైన్బజార్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలిపారు.
గన్తో బెదిరిస్తూ
విక్రమ్, సహచరులతో కలిసి సింఘాల్ను కిడ్నాప్ చేసి, తన నివాసానికి తీసుకెళ్లారని,అక్కడ ధనంజయ్ సింగ్ గన్తో బెదిరిస్తూ దుర్భాషలాడారని వెల్లడించారు. అంతేకాదు నాణ్యత లేని మెటీరియల్ను సరఫరా చేయాలని ఒత్తిడి చేశారని, నిరాకరించడంతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ అరెస్ట్ అయ్యారని, తర్వాత అలహాబాద్ హైకోర్టు నుంచి బెయిల్ పొందారని పాండే అన్నారు.
Bahubali Leader Dhananjay Singh was detained by the UP police in an old case.
Few days ago he announced that he will contest Loksabha Elections as an independent candidate From Jaunpur #DhananjaySingh#LokSabhaElection2024 pic.twitter.com/fYoIAZMOtQ— Desh Ka Verdict (@DeshKaVerdict) March 5, 2024
పూర్వాంచల్ బాహుబలి
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సభ్యుడిగా 2009 నుండి 2014 వరకు 15వ లోక్సభలో పార్లమెంటు సభ్యునిగా ధనంజయ్ సింగ్కు ‘పూర్వాంచల్ బాహుబలి’గా పేరుంది. అయితే 2011లో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.
ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)లో ఉన్న ధనంజయ్ సింగ్ ఇటీవల ఎక్స్.కామ్లో తాను వచ్చే లోక్సభ ఎన్నికలలో జౌన్పూర్ స్థానం నుండి పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. 2002లో తొలిసారిగా రారీ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.