తిరువూరు: కుక్కలకు ఉన్న విశ్వాసం కూడా రైతులకు లేదని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దారుణ వ్యాఖ్యలు చేశారు. తాను వారి కోసం ఎంతో కష్టపడి పనిచేస్తుంటే వారు తనకు మద్దతుగా నిలవట్లేదన్నారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాత్రి దీక్ష చేపట్టిన ఆయన మంగళవారం తిరువూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
తన సొంత డబ్బు కోట్లాది రూపాయలను పలువురి వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేశానన్నారు. సాగునీటి కాలువల్లో పూడికతీతకు లక్షలాది రూపాయలు వెచ్చించానని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనకు రైతు సంఘాలు సన్నద్ధమవుతున్నాయి.
దూషణలు, బెదిరింపులు
ఎమ్మెల్యేగా గెలిచిననాటి నుంచి టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి పలు వివాదాల్లో కూరుకున్నారు. కొద్ది రోజుల క్రితం తన ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై వార్తలు రాసినందుకు మీడియా ప్రతినిధులను బెదిరించారు. దీంతో స్వయంగా సీఎం చంద్రబాబుకు వారు మొరపెట్టుకున్నారు. అలాగే టీడీపీ సర్పంచ్ను దూషించడంతో ఆయన భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
తాజాగా నియోజకవర్గంలో మహిళా ఉద్యోగుల వాట్సాప్ నంబర్లకు అసభ్యకరంగా సందేశాలు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళలు మొర పెట్టుకున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిట్టేల గ్రామంలో మహిళలు ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. కొలికపూడి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఇవి చాలవన్నట్టు ఆయన ఇప్పుడు రైతులను కుక్కలతో పోల్చారు.
అన్నదాతలపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు
ADVERTISEMENT
ADVERTISEMENT