ఢిల్లీ: ఇవాళో.. రేపో.. ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ఈసీకి నిన్న ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వాళ్లు తమ బాధ్యతలు స్వీకరించి.. కాసేపట్లో కీలక భేటీలో పాల్గొననున్నారు.
ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్ బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా.. సీఈసీ రాజీవ్ కుమార్ వాళ్లకు అభినందనలు తెలియజేశారు. మరికాసేపట్లో సీఈసీ అధ్యక్షతన ఈ ముగ్గురు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపైనా స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. ఆ వెంటనే.. ఏ క్షణమైనా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
CEC Shri Rajiv Kumar welcomed the two newly-appointed Election Commissioners, Shri Gyanesh Kumar & Dr Sukhbir Singh Sandhu who joined the Commission today
#ECI #ChunavKaParv pic.twitter.com/9cHMWF0UOo— Spokesperson ECI (@SpokespersonECI) March 15, 2024
అంతా సిద్ధం..
లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే రాష్ట్రాల వారీగా సమీక్షలు నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. దఫాలవారీగా అక్కడి అధికార యంత్రాగంతో సమన్వయం జరిపింది కూడా. దీంతో ఈసీ ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లైంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సైతం షెడ్యూల్ ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. లోక్సభతోపాటే జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఉంటుందా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇక.. ప్రధాని మోదీ నేతృత్వంలోని హైపవర్డ్ కమిటీ నిన్న భేటీ అయ్యి.. ఆరుగురి పేర్ల పరిశీలన తదనంతరం చివరకు రిటైర్డ్ ఐఏఎస్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సంధులను నూతన ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేసింది తెలిసిందే. ఆ వెంటనే వీళ్లిద్దరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.
