ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ సీట్లు గెలుస్తాం
స్టేషన్ మహబూబ్నగర్: పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఓటింగ్ అనంతరం మూడు రోజులపాటు సుదీర్ఘంగా చర్చించామని, మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పారు. దేశంలో బీజేపీ తుడుచుపెట్టుకుపోతుందని, ఇండియా కూటమీ 300 సీట్లతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రజలు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని, జూన్ 9న రాహుల్గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. పదేళ్లపాటు అధికారంలోకి ఉన్న బీజేపీ తప్పుడు ప్రచారాలతో రెచ్చగొట్టిందని, ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13 సీట్లు విజయం సాధిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లు ఏకమై రేవంత్రెడ్డిని దెబ్బతీయడానికి చూశాయని, కానీ ప్రజలు కాంగ్రెస్కు అనుకూలంగా ఓట్లు వేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ముందు రాత్రి వరకు తమ పార్టీకి ప్రచారం చేసుకొని ఓటింగ్ రోజు బీజేపీకి ఓట్లు వేయాలని కోరారని ఆరోపించారు. పాలమూరులో అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ వ్యవహరించిన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని, బీఆర్ఎస్కు ఇక మనుగడ లేదన్నారు. ఓటింగ్లో పాల్గొన్న ప్రజలందరికీ, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జిల్లా మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రీ, నాయకులు లక్ష్మణ్యాదవ్, అజ్మత్అలీ, రాములుయాదవ్, కొండా జగదీశ్వర్రెడ్డి, చంద్రశేఖర్, రాఘవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.