సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 48 మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురువారం ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని 14 మండలాల్లో, విజయనగరం జిల్లాలో 9, గుంటూరు జిల్లాలో 7, కాకినాడ జిల్లాలో 7, కృష్ణాలో 4, ఎన్టీఆర్లో 4, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్క మండలం చొప్పున తీవ్ర వడగాడ్పులు వీస్తాయని పేర్కొన్నారు.
గురువారం అనకాపల్లి జిల్లాలో 8, విజయనగరంలో ఒక మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచాయని, మరో 51 మండలాల్లో వడగాడ్పులు నమోదైనట్లు చెప్పారు. గురువారం తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువులో 44.7 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని నందవరం 44.6, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 44.5, చిత్తూరు జిల్లాలోని నింద్రలో 44.3, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వేపినాపి, అక్కమాంబపురంలలో 44.3 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చదవండి: ఇటు పునాది రాళ్లు-అటు సమాధి రాళ్లు