శ్రీనగర్‌: రెండు దశాబ్ధాల ఓటింగ్‌ రికార్డు బద్దలు! | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌: రెండు దశాబ్ధాల ఓటింగ్‌ రికార్డు బద్దలు!

Published Tue, May 14 2024 7:50 AM

Record Breaking 38% Voting In Srinagar Constituency

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ లోక్‌సభ స్థానంలో సోమవారం ఓటింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 38 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 1996 తర్వాత నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం. నాడు జమ్మూకశ్మీర్‌లోని ఈ స్థానంలో దాదాపు 41 శాతం ఓటింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికలు శ్రీనగర్ నియోజకవర్గంలో జరిగాయి.

సోమవారం రాత్రి 11 గంటల వరకు శ్రీనగర్‌లో 38 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. శ్రీనగర్ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ వారిని ప్రశంసించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం వలన జమ్మూ కశ్మీర్ ప్రజలకు, ముఖ్యంగా అక్కడి యువతకు ప్రయోజనం చేకూరుతున్నదన్నారు.

ఓటింగ్‌లో పాల్గొన్న శ్రీనగర్ నియోజకవర్గ ప్రజలకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పలు రాజకీయ పార్టీలు అభినందనలు తెలిపాయి. శ్రీనగర్ నియోజకవర్గం పరిధిలోని శ్రీనగర్, గండేర్బల్, పుల్వామా జిల్లాలు, బుద్గామ్, షోపియాన్ జిల్లాల్లోని 2,135 పోలింగ్ స్టేషన్లలో సోమవారం ఓటింగ్ జరిగింది.

ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం గత 34 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 1996లో పోలింగ్ నమోదైంది. నాడు దాదాపు 41 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019లో 14.43 శాతం ఓట్లు పోలయ్యాయని, అంతకుముందు పార్లమెంటు ఎన్నికల్లో అంటే 2014లో 25.86 శాతం 2009లో 25.55 శాతం, 2004లో 18.57 శాతం, 1999లో 11.93 శాతం, 1986లో 30.086 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement